తాగుబోతు సీఎంను తరిమికొడదాం.. పార్టీ నేతలకు రేవంత్ సందేశం
posted on Nov 9, 2021 @ 1:36PM
రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, టిఆరేస్ రెండు పార్టీలు తోడు దొంగలే అన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయిందన్నారు రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు.
ఎంత మంది నాయకులు పోయిన కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు రేవంత్ రెడ్డి. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. క్రమశిక్షణ కాంగ్రెస్ లో ముఖ్యమన్న రేవంత్ రెడ్డి.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దన్నారు. నేతలు పదవులు అనుభవిస్తున్నారంటే అందుకు కార్యకర్తలే కారణమన్నారు. రేవంత్ రెడ్డి. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమన్నారు.
కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను ప్రారంభించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.
బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని చెప్పారు. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత తానే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.