కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే కేసీఆర్ కి లెక్కలేకుండా పోయిందా?
తెలంగాణ కోసం సర్వస్వాన్నీ ధారపోసిన సాటిలేని మేటి పోరాటయోధుడు, కొండా లక్ష్మన్ బాపూజీ. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ప్రాంతీయ తత్వాలకతీతంగా ఈ తెలగాణ సాయుధపోరాట యోధుడికి అంతా ఘన నివాళి అర్పించారు. కానీ.. తెలంగాణకోసం తెగ పాటుపడుతున్నానంటూ ఢంకా బజాయించుకుంటూ తిరిగే బొబ్బిలి వలసదొరమాత్రం కొండా బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేదు. కొండా బాపూజీ కేవలం స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఓ పార్టీ ఆవిర్భావానికి నాందీ పలికిన వ్యక్తి. ప్రత్యేక రాష్ట్రంకోసం ఆఖరు శ్వాసవరకూ తపించిన శక్తి. ఆఖరికి టిఆర్ ఎస్ కోసం తన ఇంటిని కూడా ధారాదత్తం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. అలాంటి మహా మనీషికి నివాళి అర్పించడానిక్కూడా కేసీఆర్ కి గానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు గానీ తీరికా, ఓపికా లేకుండా పోయాయ్.
టిఆర్ ఎస్ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు జలదృశ్యంలోనే పురుడు పోసుకుంది. ఆ పార్టీకోసం బాపూజీ తను ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేసి మరో చోటికెళ్లారు. తర్వాత ఆ స్థలంలో టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంది. అది ఆక్రమిత స్థలమంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ నిజంగా కేసీఆర్ కి గానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ గుర్తులేవా..? లేక కావాలనే కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేదా అన్న సందేహం ఇప్పుడు తెలంగాణవాదులందరి మదిలోనూ కలుగుతోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియల్లో ఎక్కడ చూసినా, ఏ పక్కన విన్నా ఒకటే మాట.. “కేసీఆర్ రాలేదా...?” అని పక్కవాళ్లని అడగనివాళ్లూ, కనీసం మనసులోనైనా అనుకోనివాళ్లూ లేరు.
కొద్ది రోజులుగా బొబ్బిలి వలసదొర, ఢిల్లీ పెద్దల చేతుల్లో బందీ అయినట్టుగా చాలామంది చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఇస్తామని ఒక్క మాట చెప్పండి చాలు, ఒక్క ప్రకటన చేయండి చాలు.. నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తా అంటూ వలసదొర ఢిల్లీలో సోనియా మేడం కాళ్లావేళ్లా పడుతున్నారని అభిజ్ఞానవర్గాల భోగట్టా. మేడం సోనియా.. కేసీఆర్ కి అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా, తిరిగి రాష్ట్రానికి వెళ్లకుండా ఆయన్ని అడకత్తెరలో పెట్టి నొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలుకూడా చెప్పుకుంటున్నట్టు సమాచారం. మేడం కరుణాకటాక్షవీక్షణాలకోసం గుమ్మంముందు పడిగాపులు పడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరుకావాలన్న ఆలోచనకూడా దొరవారు చేయలేకపోయారని టిఆర్ ఎస్ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నట్టు వినికిడి.
పైకి మాత్రం వాళ్లు చెప్పుకుంటున్న కారణం వేరేగా ఉంది. ఢిల్లీలో బసచేసిన కేసీఆర్ కి బాగా జలుబు పట్టుకుందట. ఎన్ని మందులు వేసుకున్నా పడిశెం తగ్గక చేసేదేం లేక రెస్ట్ తీసుకుంటున్నారని, ఆదివారంకూడా సారు రెస్ట్ లోనే ఉంటారని, అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారనీ ప్రచారం సాగుతోంది. లోగుట్టు మాత్రం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ మార్చ్ జరిగితే ఇప్పటికే తనచేతుల్లోంచి జారిపోయే స్థితిలో ఉన్న ఉద్యమం పూర్తిగా కోదండరామ్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్న విషయం కేసీఆర్ కి స్పష్టంగా తెలుసుగనక, ఈ లోపుగానే మేడంని బతిమిలాడో బామాలో ఓ ప్రకటన చేయించుకుని ఈ గండంనుంచి గట్టెక్కుదామన్న ఆలోచనలో దొరగారు ఉన్నారని వాళ్లు చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహోన్నత వ్యక్తి చనిపోతే కనీసం శ్రద్ధాంజలి ఘటించకుండా కేసీఆర్ కుటుంబం తన నైజాన్ని చాటుకుందని చాలామంది తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతగా పనుల ఒత్తిడిలో ఉన్నా జైపాల్ రెడ్డి హైదరాబాద్ కొచ్చి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించడం చాలా మంది తెలంగాణ వాదులకు సంతోషాన్ని కలిగించింది.