తెలంగాణా లేఖ ఇవ్వరా?

తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాస్తానన్న లేఖ ఇక బయటకు రాదని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. ఆయన లేఖ రాసి తీరుతారని తెలంగాణాలోని తెలుగుతమ్ముళ్లు నమ్మబలుకుతుంటే వారితో ఇతర తెలంగాణావాదులు వాదనకు దిగుతున్నారు. అసలు లేఖ ఇచ్చే ఉద్దేశం ఉంటే చంద్రబాబు ముందుగా అనుకున్నట్లు తెలంగాణా నుంచి పాదయాత్ర ప్రారంభించాలి కదా! మరెందుకు అనంతపురం జిల్లా హిందుపురం నుంచి జనచైతన్యపాదయాత్రలు ప్రారంభిస్తున్నారు? అని తెలంగాణావాదులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు వరంగల్‌ జిల్లా పరకాల, అదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి బాబు పాదయాత్రలు ఎందుకు ప్రారంభించటం లేదని తెలుగుతమ్ముళ్లను నిలదీస్తున్నారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో తెలుగుతమ్ముళ్లు ఇరకాటంలో పడ్డారు. వారి వాదన కొంత వరకూ కరెక్టే అని పరిశీలకులు అంటున్నారు.

 

 కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం తెలంగాణా ఇచ్చేయటానికి, టిఆర్‌ఎస్‌ విలీనానికి తెర లేపటంతో బాబు ఊహించని పరిణామం ఇది. అనుకోకుండా ఏలూరులో రైతుసభ పేరిట సమైక్యాంధ్రాసభ జరిగింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో బాబు పడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతును వదులుకోవటానికి బాబు సిద్ధంగా లేరు. అందుకే లేఖ ఇవ్వాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం గురించి బాబు మద్దతు కోరుతున్నారు. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇస్తే ప్రత్యేకసీమ కోసం ఎందుకు ఇవ్వరని రాజశేఖరరెడ్డి డిమాండు చేస్తున్నారు. సీమకు కూడా లేఖ ఇచ్చేస్తే ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రతిపాదనలకు కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని బాబు భావిస్తున్నారు.



అందుకనే కొంచెం వెనక్కి తగ్గితే కేంద్రం బయటపడిరది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా నిలబడొచ్చని చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ కనుక తెలంగాణాకు వ్యతిరేకంగా నిలబడితే తాను అనుకూలం అనిపించుకునేందుకే లేఖ ఇస్తానని బాబు అన్నారని తెలంగాణాలో ప్రచారమైంది. కాంగ్రెస్‌ అనుకూలమైతే ప్రతిపక్షంగా వ్యతిరేకించాల్సిందేనని బాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఏదేమైనా లేఖ రాస్తానని ప్రకటించటం చంద్రబాబు మెడకు గుదిబండగా చుట్టుకున్నట్లే. ఇప్పటిదాకా అడపాదడపా కొన్ని సీట్లయినా తెలంగాణాలో వచ్చేది. ఈసారి లేఖ ఇవ్వకపోతే బాబుకు వ్యతిరేక ప్రచారం తప్పదు. 2014లో దీని ప్రభావం కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.