కాటికి చేరిన భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇక లేరు. తిరుపతి శ్మశానంలో పడుకోబెట్టిన ఆయన పార్థివ దేహాన్ని చూడండి. పక్కనే కాలుతున్న మరో చితి. చుట్టూ కరుణాకర్ రెడ్డి అభిమానులు విషణ్ణ వదనాలతో శవ జాగారం. అభిమాన నేత ఇకలేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక, బాధని దిగమింగుకుంటూ, గుడ్లనీరు కుక్కుకుంటూ చాలామంది అలా భూమన శవాన్ని చూస్తూ రాత్రంతా గడిపేశారు. “అరే.. సాయంత్రం దాకా ఆయన బానే ఉన్నారే. సాయంత్రమే మాకు కనిపించారే.. ఇంతలో ఏంటిలా?“ అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎవరేమనుకుంటే ఏం లాభం జరగాల్సింది జరిగిపోయింది. బతికినన్నాళ్లూ.. శ్మశానంలో తనని పూడ్చిపెట్టడానికి ఆరడుగుల జాగా దొరుకుతుందో లేదో అన్న బాధ ఒక్క కరుణాకర్ రెడ్డినేకాదు, తిరుపతిలో చాలామందిని రాత్రనకా పగలనకా వేధిస్తోంది. చాలా రోజులుగా శ్మశానంకోసం స్థలాన్ని కేటాయించాలని ఎన్ని అర్జీలు పెట్టుకున్నా లాభం లేకపోయింది. చివరికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శవాన్నికూడా ఇరుకుగా.. కాలుతున్న మరో చితిపక్కనే ఉంచి, రాత్రంగా వేచిచూడాల్సొచ్చింది. కంగారు పడకండి.. నిజానికి మీరు చూస్తున్న ఈ సీన్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కరుణాకర్ రెడ్డిదే. తిరుపతి వాసులకు వెంటనే శ్మశానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ చాలాసార్లు చేసిన ఆందోళనలు ఫలితాన్నివ్వకపోవడంతో చివరికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా అర్థరాత్రి శ్మశానానికెళ్లి కాలుతున్న ఓ చితిపక్కన శవాసనమేసి తీవ్రస్థాయిలో నిరసన తెలియజేశారు. చుట్టూ అభిమానులుకూడా గుమికూడడంతో.. ఈ చిత్రాన్ని చూసినవాళ్లకు.. భూమన నిజంగా పోయారేమోనని కంగారుపుట్టింది. మామూలుగా బతికుండగానే చనిపోయిన సీన్లలో నటించి లైఫ్ ఆప్టర్ డెత్ ఎలా ఉంటుందో చూసుకునే అవకాశం సినిమా వాళ్లకు మాత్రమే ఉంటుందని ఇన్నాళ్లూ జనం అనుకునేవాళ్లు. ఆ అభిప్రాయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా మార్చి పారేశారు. జనం కోసమే చేసినా.. సినిమా వాళ్లకు మాత్రమే దక్కే అరుదైన అనుభూతిని ఆయన సొంతం చేసుకున్నారు. మెచ్చుకుని తీరాల్సిందే.. ఏమంటారు..?