రీతీ స్పోర్ట్స్‌తో సైనా నెహ్వాల్‌ 40 కోట్ల డీల్

సైనా నెహ్వాల్‌ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని టైటిల్స్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. దక్కన్ క్రానికల్‌తో తమ ఒప్పందం జూలై 31ముగియటంతో సైనాకు రీతీ స్పోర్ట్స్‌తో డీల్‌ను కుదుర్చుకుంది. భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూసుకోవడానికి యాడ్ షూట్స్ అన్నీ హైదరాబాదులోనే జరగాలని సైనా టీమ్ ఒప్పందంలో రాసుకుంది.

మహా గణపతి వైభవం

                                                                                    గణపతి వైభవం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే || అందమైన ముఖము కలిగినవాడు గణపతి. అతి వైభవోపేతమైన వర్చస్సు కలిగిన ముఖం కలిగినవాడు గణపతి. గణపతిని ఉదయం లేవగానే దర్శించుకుంటే అఖండమైన లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమౌతుంది. గణపయ్య గొప్పదనం గురించి తెలుసుకుని ఆయన నడిచే దారిలో మనమూ నడవగలిగితే సర్వేసర్వత్రా దిగ్విజయ ప్రాప్తితో పాటు సకల శుభాలూ కోరి దరిచేరతాయి. అఖండ దివ్యతేజంతోపాటు అనంతమైన కీర్తి కూడా సంప్రాప్తమౌతుంది. విఘ్నేశ్వరుడి రూపంనుంచే మనం నేర్చుకోగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. గణపయ్య గజముఖవదనుడు కనుక నోరు బైటికి కనిపించదు. వీలైనంత తక్కువగా మాట్లాడం చాలా మంచిదన్న సత్యాన్ని దీనిద్వారా మనం గ్రహించాలి. మట్లాడకూడనిచోట బడబడా మాట్లాడడం ఎంత అనర్ధదాయకమో, సభలు, సమావేశాల్లో.. గొంతెత్తి గట్టిగా మాట్లాడాల్సిన చోట్లలో అస్సలు మాట్లాడకుండా ఉండడంకూడా అంతే అనర్ధదాయకం అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గ్రహించాలి. అవసరం లేనిచోట మాత్రం మాటల్ని చాలా పొదుపుగా వాడాలి. ఈ చిన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది. ఏనుగుకి అందం దంతాలు. గజముఖ వదనుడైన విఘ్నేశ్వరుడికి మాత్రం ఒక్క దంతమే ఉంటుంది. కుడివైపునున్న దంతం సగానికి విరిగి ఉంటుంది. వ్యాసుడు మహాభారతం అనర్గళంగా చెప్పుకుపోతుంటే ఆపకుండా రాయగలిగేందుకు పనికొచ్చే కలం కావాల్సొచ్చి, దానికోసం విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాశాడు. లోకకల్యాణంకోసం తనకు అంత్యంత శోభని కలిగించే దంతాన్ని కూడా త్యాగం చేశాడు గజముఖవదనుడు. అంటే లోకకల్యాణంకోసం మనకు అతి ఇష్టమైన వాటినికూడా త్యాగం చేయాలని చెప్పడానికే ఆయన ఈ లీలను ప్రదర్శించాడు. ఎర్రటివర్ణము కలిగినవాడు విఘ్నేశ్వరుడు. నలుపు జీరతో కూడిన ఎరుపు గోవుల వర్ణం. కపిల వర్ణం సర్వశ్రేష్టమైనది. మల్లెపూవులా తెల్లగా ఉండే వినాయకుడు కపిల వర్ణంలో ఎందుకు కనిపిస్తాడు అని చాలామందికి సందేహం. గజాసురుణ్ణి సంహరించినప్పుడా వాడి రక్తం చింది తెల్లటి విఘ్నేశ్వరుడి శరీరంమీదపడి అద్భుతంగా ప్రకాశించి విఘ్నేశ్వరుడు కపిల వర్ణంలో కనిపించాడు. ఉత్తప్పుడు శాంత స్వభావంతో ఉండడం ఎంత అవసరమో.. అవసరమైనప్పుడు, దుష్టశిక్షణ చేయాల్సొచ్చినప్పుడు వీరత్వాన్ని ప్రదర్శించడంకూడా అంతే అవసరమని చెప్పడానికి విఘ్నేశ్వరుడు కపిల వర్ణంలో కనిపిస్తాడు. వినాయకుడికి పెద్ద పెద్ద చెవులుంటాయ్. తక్కువ మాట్లాడడం ఎంత ముఖ్యమో.. ఎక్కువగా వినడం అంత ముఖ్యం.. ఆ విషయాన్ని  తెలియజెప్పడానికే గణపతి పెద్దపెద్ద చెవులతో ఉంటాడు. ఆయనకు పిల్లలంటే మహా ప్రేమ. పిల్లల్ని నవ్వించడానికి ఆయన ఎప్పుటూ నాట్యం చేస్తూ ఉంటాడు. నవ్వుపుట్టించే రూపంలో నాట్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు వికటో అనే సుందరమైన నామం ఉంది. అవును.. పిల్లలు సంతోషంగా ఉండడమే ఆయనక్కావాలి కాబట్టి అలా ఉంటాడు. విఘ్నరాజు, వినాయకుడు అనే రెండు రూపాల్లో విఘ్నేశ్వరుడు లోకాలను పాలిస్తున్నాడు. పూర్వజన్మలో చేసిన పాపం అనంతమై వెంటపడుతోంటే విఘ్నారాజు చాలా చిన్న ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వినాయకుడి రూపంలో దాన్ని తొలగించేసి కర్మానుభవాన్ని పరిపూర్ణంచేసి అనుగ్రహించేవాడు వినాయకుడు. నలుగు పిండిని ముద్దగా చేసి పార్వతీ దేవి వినాయకుడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసింది. సర్వమంగళ నిత్యం పసుపుతో నలుగుపెట్టుకుంటుంది. ఆ పసుపు ముద్దనే బొమ్మగా చేసింది కాబట్టి ఇప్పటికీ పూజని ప్రారంభించడానికి ముందుగా పసుపు వినాయకుడిని చేసి బొట్టు పెట్టి ఆరాధించడం ఆనవాయితీ. విఘ్నేశ్వరుడు ముందు నరరూపంలోనే పుట్టాడు. తర్వాత లోక కల్యాణం కోసం ఆయన గజముఖాన్ని ధరించాల్సొచ్చింది. గజాసురుడికి గజముఖుడైన నరుడి చేతుల్లోనే మరణం రాసిపెట్టుంది కనుక అతి సుందరమైన తన ముఖాన్ని లోకంకోసం త్యాగంచేసిన విఘ్నేశ్వరుడు గజముఖాన్ని ధరించాడు. సకల లోకాలూ చల్లగా ఉండడంకోసం గజముఖాన్ని ధరించగలిగిన ఔదార్యం ఒక్క విఘ్నేశ్వరుడికి మాత్రమే ఉంది. భాద్రపద శుద్ధ చవితినాడు భక్తితో విఘ్నేశ్వరుడి పూజను చేసుకున్న వాళ్లకు కష్టాలు తేలిగ్గా పరిష్కారమైపోతాయ్. కష్టాన్ని ఎంతటివారైనా అనుభవించే తీరాలి. వినాయకుడిని ప్రార్థిస్తే కష్టాన్నంతటినీ ఒకేసారి త్వరత్వరగా అనుభంలోకి తీసుకొచ్చేసి, దాన్ని విసిరి అవతలపారేసి అనంతమైన సుఖాల్ని ప్రసాదిస్తాడు. బాధని త్వరత్వరగా అనుభవింపజేసి పాతాళంలో కూరుకుపోయినవాళ్లని అలవోకగా పైకి తీసుకురావడం గణపతి ప్రత్యేకత. విఘ్నేశ్వరుడి అనుగ్రహ కటాక్షాలు మంచివాళ్లందరిమీదా ఉండాలని కోరుకుంటూ తెలుగువన్ డాట్ కామ్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.                                                                                                                                       -          మల్లాది వేంకటగోపాలకృష్ణ    

ఎక్కడినుంచైనా అసెంబ్లీకి పోటిచేస్తా: బాలకృష్ణ

వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా అసెంబ్లీకి పోటిచేస్తానని సినీ హీరో. తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. వినాయకచవితి సందర్భంగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని గణనాథుడికి బాలకృష్ణ ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ పటిష్టత కోసం త్వరలో తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, తన బావ నారా చంద్రబాబు నాయుడు తనను కోరితే ఆయన చేయనున్న పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తామన్నారు. పార్టీలోకి ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు కుటుంబం రావడం టిడిపికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

మమతా షాక్, కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి

కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో భేటి అయింది. మమతా యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ బుధవారం అత్యవసరంగా భేటి అయింది. ఈ కీలక భేటీలోసోనియా గాంధీతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. మంగళవారం మమతా బెనర్జీ యూపీఏకు పెద్ద షాకిచ్చారు, యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై నియంత్రణ, అసోంలో అల్లర్లు, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు, ఈ నిర్ణయాలు తమకు ఏమాత్రం నచ్చలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాని మన్మోహన్‌కు సమర్పిస్తారని చెప్పారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే నాలుగు రోజులుగా కాంగ్రెస్‌కు హెచ్చరికలు పంపిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే సోనియాకు సందేశం పంపాను. సర్కారు నిర్ణయాలు ఆమోద యోగ్యం కాదని చెప్పాను. కానీ  పరిస్థితిని ఆమె మార్చలేకపోయారని తెలిపారు. అలాగే మమతకు మూడు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ స్వయంగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఆయన బుజ్జగింపులను మమత పట్టించుకోలేదని తెలిసింది. 

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు

  దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం నుంచే అన్ని గణేష్ ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ముంబై నగరంలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాల్లో వినాయకునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రీన్ గణేష అంటూ పర్యావరణాన్ని కాపాడవలసిందిగా రసాయనాలతో చేసిన గణనాదులకి బదులు మట్టి వినాయకుడి ప్రతిమతో వినాయక చవితిని జరుపుకోవలసిందిగా ఎన్నో స్వచ్చంద సంస్థలు చేసిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నగరాలలో, గ్రామాలలో కూడా మట్టి వినాయకుడు విగ్రాహాలకి డిమాండ్ బాగా పెరిగింది.

మెండిస్ దాటికి కుప్పకూలిన జింబాబ్వే

టి-20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. జింబాబ్వే పై 82 పరుగులతో శ్రీలంక ఘన విజయం సాధించింది. అజంతా మెండిస్ (6/8) టి-20 క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. లంక నిర్దేశించిన 183 పరుగు ల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 17.3 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. మసకద్జ (20), చిగుంబుర (19) ఆ జట్టులో టాప్‌స్కోరర్లు. అంతకుముందు దిల్షాన్ (39), సంగక్కర (44), జీవన్ మెండిస్ (43 నాటౌట్) రాణించడంతో లంక నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఆరు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించిన అజంతా మెండిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

యుపిఎకు మమతా షాక్

మంగళవారం మమతా బెనర్జీ యూపీఏకు పెద్ద షాకిచ్చారు, యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై నియంత్రణ, అసోంలో అల్లర్లు, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు, ఈ నిర్ణయాలు తమకు ఏమాత్రం నచ్చలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాని మన్మోహన్‌కు సమర్పిస్తారని చెప్పారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే నాలుగు రోజులుగా కాంగ్రెస్‌కు హెచ్చరికలు పంపిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే సోనియాకు సందేశం పంపాను. సర్కారు నిర్ణయాలు ఆమోద యోగ్యం కాదని చెప్పాను. కానీ పరిస్థితిని ఆమె మార్చలేకపోయారని తెలిపారు. అలాగే మమతకు మూడు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ స్వయంగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఆయన బుజ్జగింపులను మమత పట్టించుకోలేదని తెలిసింది.   542 మంది సభ్యులున్న లోక్‌సభలో మేజిక్ మార్కు 272. యూపీఏ బలం 273. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 19. వీరిని తీసేస్తే యూపీఏ బలం 254కు పడిపోయింది. అంటే సర్కారు మైనారిటీలో పడింది. అయినప్పటికీ యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ (21) లేదా సమాజ్‌వాదీ (22) ముందుకు వస్తే మన్మోహన్ సర్కారుకు ముప్పేమీ ఉండదు. అయితే తృణమూల్‌తోపాటు 18 మంది సభ్యులున్న డీఎంకే కూడా సర్కారు నుంచి తప్పుకొంటే మాత్రం బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీలు రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఆదుకోవాల్సి వస్తుంది.  

కసబ్ క్షమాభిక్ష పిటిషన్

ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు సుప్రీంకోర్ట్ ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై అజ్మల్ కసబ్‌ క్షమాభిక్షా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కాగా కసబ్ ఒకవేళ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థిస్తే, అతని అభ్యర్థనను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేలా చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గతంలో చెప్పారు. నవంబర్ 26, 2008లో ముంబై నగరంలో జరిగిన ఉగ్రవాదుల అమానుష హింసాకాండకు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే.

చంద్రబాబు, విజయమ్మ ఒకే చెప్పారు

తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం సానుకూలంగా ఉందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణపై చిదంబరం గతంలో హామీ ఇచ్చారని,దానిని నేలబెట్టుకోవాలన్నారు. తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని గతంలో చెప్పారని, ఇప్పుడేమో దానిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వైయస్ విజయమ్మ కూడా ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికల సమయంలో తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరమిస్తామన్నారని చెప్పారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడితే ఐదు నిమిషాలలో పూర్తవుతుందన్నారు. తెలంగాణపై జాప్యం సరికాదని, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టకుండా, కేంద్రంపై భారం వేయడం సరికాదన్నారు.

రాహుల్ గాంధీపై నరేంద్ర మోడీ సెటైర్లు

“రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయి నేత. ఆయన ఇటలీలో ఎన్నికల్లో నిలబడితే భారీ విజయం సాధిస్తారు. భారత్ కంటే, ఇటలీకే ఆయన అవసరం ఎక్కువగా ఉంది. అవసరమనుకుంటే రాహుల్ ఇటలీలోకూడా పోటీ చేయగలరు. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత నేను స్థానిక నాయకుణ్ణని, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడని ప్రకటించాడు. నిజమే.. ఆయన చెప్పింది నిజమే.. రాహుల్ గాంధీ నిజంగా అంతర్జాతీయ స్థాయి నేతే. ఆయన అర్హతల్ని మనదేశం అందిపుచ్చుకోలేదు. నన్ను లోకల్ లీడర్ అని కాంగ్రెస్ నేతలు సంభోదించడం చాలా గర్వకారణంగా ఫీలవుతున్నా. గుజరాత్ లో పుట్టి పెరిగినందుకు నేను చాలా గర్వపడుతున్నా.” ఇవి.. రాహుల్ గాంధీపై బిజెపి సీనియర్ నేత నరేంద్రమోడీ.. రాహుల్ గాంధీపై సంధించిన వ్యంగ్యాస్త్రాలు. స్వామి వివేకానంద యువజన సదస్సులో రాహుల్ గాంధీ తల్లి విదేశీయతపై నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రథాని పదవికి పోటీ రాహుల్, మోడీ మధ్యే ఉంటుందన్న ఊహాగానాలపై స్పందించిన కాంగ్రెస్ నేతలకు ఇలా.. మోడీ దీటైన జవాబు చెప్పారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రథాని మన్మోహన్ కి ధన్యవాదాలు చెప్పిన అరక్షణంలోపే మోడీ ఆయనపై కూడా విరుచుకు పడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని తుంగలో తొక్కిందని, 2004 ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి మంది యువతకు ఉద్యోగావకాశలు కల్పిస్తామన్న మాటను పూర్తిగా మర్చిపోయిందని ధ్వజమెత్తారు. గుజరాత్‌ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పనలో ముందుందని మోడీ చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్ల పాలనలో అమెరికాతో పౌర అణు ఒప్పందం, విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం, విదేశాలకు ప్రయోజనం కలిగించే విధానాల్ని అమలు చేయడమే ప్రథాని సాధించిన ఘనతలని మోడీ విమర్శించారు. తన 63వ జన్మదినోత్సం సందర్భంగా మోడీ గుజరాత్ వాసులకు చాలా వరాలిచ్చారు. జామ్‌నగర్ జిల్లాలోని వించియ పట్టణానికి తాలూకా హోదా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి వయోపరిమితిని 25 నుంచి 28కి 28 నుంచి 30 సంవత్సరాలకు పొడిగించారు. సదస్సులో బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ లతోపాటు ఒలింపియన్ గగన్ నారంగ్, క్రికెటర్లు పుజారా, రవీద్ర జడెజా, జయదేవ్ షా, బిసిసిఐ ఉపాధ్యక్షుడు నిరంజన్ షా పాల్గొన్నారు. 

అసెంబ్లీలో మైక్ విరగ్గోట్టిన హరీష్

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్ పోడియాన్ని చట్టుముట్టి తెలంగాణా నినాదాలు చేశారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జయప్రకాశ్ నారాయణ రాష్ట్రంలో భద్రత లేకపోవటం వల్లే ఐటీ ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారన్నారు. దీంతో సభలో రగడ మొదలైంది. కొంత మంది ఉద్యోగులు వెళ్ళిపోతేనె భాధ పడుతున్నారని, తెలంగాణాకోసం వందలమంది మంది బలయ్యారని టీఆర్‌ఎస్‌ నాయకులులన్నారు. అయిన జెపి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడంతో, కోపంతో హరీష్ రావు మైక్ విరగ్గొట్టారు. కావాలనే సభను జేపీ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ సభను వాయిదా వేశారు.

తెలంగాణకు అడ్డు కేసిఆరే

తెలంగాణా రాకపోవడానికి అసలు కారణం కేసిఆర్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ అన్నారు. తెలంగాణ అప్పుడు, ఇప్పుడు అని ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణా విమోచన దినం బదులు, కేసిఆర్ విమోచన దినంగా జరపాలని ఆమె చెప్పారు. ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ రాష్ట్రంతో వస్తే తెలంగాణ గాంధీగా ఆదరిస్తామని, లేకపోతె గాడిదల అభివర్ణించాల్సి ఉంటుందని మండిపడ్డారు. సిబిఐ నుంచి తనను కాపాడుకోవడానికే కేసిఆర్ సోనియాగాంధీని కలవడానికి వెళ్ళారని అన్నారు. సకల జనుల సమ్మెను కేసిఆర్ తాకట్టు పెట్టాడని, టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంతో పరకాల ఉపఎన్నికల్లో అర్థమైందని అన్నారు. కేసిఆర్ తెలంగాణా తీసుకొని రాకపోతే నవంబర్ 2 తర్వాత తెలంగాణ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేసిఆర్ తన దొంగ నాటకాలు కట్టిపెట్టి తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

కోదండరామ్ పై కేసు పెట్టిన టి కాంగ్రెస్ నేతలు

మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయ్. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కోదండరామ్ ఇంటిని ముట్టడించారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కోదండరాం పై కేసు నమోదు చేశారు. ఐపీసీ153, 53ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కోదండరాంపై కేసు బుక్ చేశారు. కోదండరాం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే కోదండరాందే బాధ్యతని జగ్గారెడ్డి హెచ్చరించారు. కోదండరామ్ వెంటనే శ్రీథర్ బాబుకి క్షమాపణ చెప్పాలని మంత్రి సారయ్య వ్యాఖ్యానించారు. తక్షణం కోదండరామ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మార్చ్ పూర్తిగా విఫలమౌతుందని మాజీ మంత్రి జానారెడ్డి హెచ్చరించారు. మంత్రి శ్రీథర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ నేతల్లో కదలికను తెప్పించాయి.

సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణా తీర్మానం పై చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డాడు. సీఎం అయినా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా తీర్మానం సాధ్యం కాదనటం సరికాదన్నారు. తెలంగాణా తీర్మానం కోసం సభలో పట్టుబడతామని, పార్టీలు మేనిఫెస్టోకు కట్టుబడి ఉంటే తీర్మానం ఎందుకు కుదరదని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం చేయకపోతే ప్రజలే పార్టీలకు గుణపాఠం చెబుతారని అన్నారు. మొదటిరోజులాగే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా సభలోగందరగోళ౦ సృష్టించారు. తెలంగాణా తీర్మానం చేయాలనీ స్పీకర్ పోడియాన్ని చట్టుముట్టి, తెలంగాణా నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత చెప్పిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపడం లేదు.

కోదండరామ్ వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ నేతల ఆగ్రహం

మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయ్. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కోదండరామ్ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు ఉస్మానియాలో కోదండరామ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఆయనపై వెంటనే పోలీస్ కేసు పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కోదండరాం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే కోదండరాందే బాధ్యతని జగ్గారెడ్డి హెచ్చరించారు. కోదండరామ్ వెంటనే శ్రీథర్ బాబుకి క్షమాపణ చెప్పాలని మంత్రి సారయ్య వ్యాఖ్యానించారు. తక్షణం కోదండరామ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మార్చ్ పూర్తిగా విఫలమౌతుందని మాజీ మంత్రి జానారెడ్డి హెచ్చరించారు. మంత్రి శ్రీథర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ నేతల్లో కదలికను తెప్పించాయి.   

తెలంగాణా తీర్మానం సాధ్యం కాదు: సీఎం

తెలంగాణాపై అసెంబ్లీలో తీర్మానం చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రాంతాలవారీగా విడిపోయారని, ఈ పరిస్థితులలో శాసనసభ తీర్మానం చేయడం సాథ్యం కాదని చెప్పారు. తెలంగాణాపై తీర్మానం చేస్తే తెలంగాణ ఆకాంక్షకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర విభజన అంశం చాలా సున్నితమైనదని తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. పునరుద్ఘాటిస్తూ త్వరలో హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జీవ వైవిధ్య సదస్సు జరగనున్న దృష్ట్యా సెప్టెంబర్ 30 వ తేదీన నిర్వహించద లపెట్టిన తెలంగాణా మార్చ్‌ను ఉపసంహరించుకోవాలని అన్నారు.

ఉస్మానియాలో రాళ్ళ వర్షం, ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లేందుకు బయలు దేరగా ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. విద్యార్థులు రాళ్ళ దాడికి దిగడంతో పోలీసులు వారిపై భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుందో అదే మాదిరిగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.

కోదండరామ్ తీరుపై కాంగ్రెస్ గరం గరం!

మెదక్ జిల్లా పర్యటనలో తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ మంత్రి శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్. శ్రీథర్ బాబుని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కోదండరామ్.. “ మీ నాన్నకి పట్టిన గతి గుర్తుందా? ” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్న వార్త ఏపీ మొత్తం క్షణాల్లో పాకిపోయింది. కోదండరామ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి శ్రీథర్ బాబు తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావుని నక్సలైట్లు చంపేసిన విషయం అందరికీ మరోసారి గుర్తొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. కోదండరామ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలకోసం ఇంటెలిజెన్స్ వర్గాల్ని రంగంలోకి దింపింది. కెమెరాల్లో రికార్డై, ఛానెళ్లలో ప్రసారమైన కోదండరామ్ వ్యాఖ్యల్ని సేకరించి తెలంగాణ ఉద్యమంలోకి నక్సల్స్ ప్రవేశించారన్న అనుమానాన్ని రూఢి చేసుకోవడంద్వారా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకునే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆధారాలు చేతికి చిక్కిన వెంటనే కోదండరామ్ ని అరెస్ట్ చేయడానికి పోలీస్ వర్గాలు ఆగమేఘాలమీద ఏర్పాట్లు చేస్తున్నాయని భోగట్టా. సెప్టెంబర్ 30న గాంధేయవాద పద్ధతిలో తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని చెబుతున్న మాటల్లో ఎంత నిజముందో ఇప్పుడు కోదండరామ్ చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమౌతోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.