జగనన్న వదిలిన బాణానన్న షర్మిల

    చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకి పోటీగా వై.ఎస్ జగన్ పార్టీ తరఫున షర్మిల ఈ రోజు పాదయాత్రని మొదలుపెట్టారు. ఇడుపులపాయనుంచి ఇచ్చాపురంవరకూ ఈ యాత్ర సాగుతుంది. వై.ఎస్ సమాధికి నివాళులర్పించిన తర్వాత పాదయాత్రకోసం తరలివచ్చిన అభిమానుల్ని ఉద్దేశించి విజయలక్ష్మి ప్రసంగించారు. ఉన్న ఇద్దరు బిడ్డలో ఓ బిడ్డ జైల్లో ఉంటే మరో బిడ్డ ప్రజాభిమానాన్ని కూడగట్టేందుకు రోడ్డెక్కిందంటూ ఉద్వేగ భరితంగా ప్రసంగించిన ఆమె తన బిడ్డలిద్దరినీ జనం చేతుల్లో పెడుతున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసి పోయి ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్ని జగన్ ని జైల్లో పెట్టారంటూ షర్మిల ఆవేశంగా మాట్లాడారు. ప్రజాభిమానంముందు కుతంత్రాలేవీ నిలవలేవంటూ అభిమానుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. మరోపక్క.. వస్తున్నా మీకోసం పాదయాత్రకు లభిస్తున్న స్పందనని చూసి కంగారుపడ్డ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నేతలు షర్మిలను రంగంలోకి దించి యాత్రని మొదలుపెట్టించాయంటూ టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

రాహుల్ గాంధీ పై రేప్ కేసును కొట్టేసిన సుప్రీం

  రాహుల్ గాంధీపై ఉన్న కిడ్నాప్, రేప్ కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టీసింది. పిటిషన్ వేసిన కిషోర్ పై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ఓ బాలికను అక్రమంగా నిర్భంధించారంటూ కిషోర్ కేసు పెట్టారు. విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు పిటిషనర్ కి రూ.50 లక్షల రూపాయల జరిమానాను విధించడంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశించింది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న మరో పిటిషన్ పై విచారణ జరిపిన దేశా అత్యున్నత న్యాయ స్థాన౦ రాహుల్ గాంధీపై కేసుల్ని కొట్టివేసింది. యుపి అఖిలేష్ యాదవ్ ప్రోద్బలంతోనే ఈ కేసును ఫైల్ చేసానని పిటిషనర్ అంగీకరించడం, ప్రాధమిక ఆధారాలు లభించకపోవడం లాంటి కారణాలను పరిగణంలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై ఉన్న కేసుల్ని కొట్టివేసింది. తప్పుడు కేసులో నోటీసులందుకున్న రాహుల్.. అడ్డంగా అబద్ధాలాడుతున్న కిషోర్ పై కఠిన చర్య తీసుకోవాలని అలహాబాద్ హైకోర్ట్ ని కోరారు. అసలీ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని అఖిలేష్ యాదవ్ కూడా స్పష్టం చేశారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

  కాంగ్రెస్ లో పదవుల పందేరానికి రంగం సిద్ధమయ్యింది. చాలాకాలంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు భారీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. కేబినెట్ విస్తరణకు నో చెప్పిన హై కమాండ్ నామినేటెడ్ పోస్ట్ ల భర్తీకి సరే అనడంతో చాలామంది గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రథానితో ఈ విషయంలో గట్టిగానే మాట్లాడి మాట తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వై.ఎస్ తొలిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు కొంతమందికి కొన్ని పదవులు ఇచ్చారు. తర్వాతికాలంలో నామినేటెడ్ పోస్ట్ ల ఊసే లేదు. రెండోసారి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాకకూడా ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని పరిశీలించనేలేదు. రోశయ్య సీఎం అయ్యాక కొంతమందికి ఛాన్స్ దక్కింది. కిరణ్ సీఎం కుర్చీలో కూర్చున్నతర్వాత ఇంతవరకూ నామినేటెడ్ పోస్ట్ ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇన్నాళ్లుగా నానుతూ వచ్చిన వ్యవహారంమీద ఓ క్లారిటీ కనిపిస్తోందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.

క్యాబినేట్ మార్చక్కర్లేదు నామినేటెడ్ పోస్టులిస్తేచాలు

ముఖ్యమంత్రి డిల్లీలో జరిపిన సుడిగాలి పర్యటనలో ఖరారయిన విషయం ఏమంటే ఇప్పుడున్న క్యాబినేట్ ను  మార్చనక్కర్లేదని, నామినేటెడ్ పోస్టులిస్తేచాలంటూ 45 పేర్లను  తమ వెంట తీసుకెళ్లారు. మొదట గులాంనబీ ఆజాద్ ను కలుసుకున్నారు. రాష్ట్రరాజకీయాలను ఏకరువు పెట్టారు. సోనియా గాంధీతో గంటకు పైగా చర్చలు జరిగాయి.  ముఖ్యమంత్రివద్ద ఉన్న 45 పేర్లజాబితాలో కొన్నింటిని మాత్రమే అధినేత్రి ఆమోదించారని తెలుస్తుంది. మరికొన్ని సమన్యయ కమిటీలోనిని, మరికొన్ని పార్టీ వర్గాల ద్వారా తెప్పించుకున్న పేర్లు ఇచ్చారు. దీంతో సరికొత్త జాబితా తయారు చేయవలసిందని సోనియా ముఖ్యమంత్రిని కోరారు. జాబాతా విషయమై బొత్సతో చర్చించాల్సిందిగా అహ్మద్ పటేల్ సూచించారు. ధర్మాన రాజీనామా వ్యవహారంతోపాటు మరికొందరి మంత్రుల సుప్రీంకోర్టు నోటీసుల గురించి ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వీటితో పాటు తెలంగాణ అంశం కూడా  సోనియా ముందుంచారు. తగిన సమయంలో దానిపై నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పారు. రాహుల్  ఆంద్ర ప్రదేశ్ పై  ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రరాజకీయాలను పూర్తిగా వివరించారు. రాహుల్ కోరిక మేరకు యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. షిండే తోనూ వాయిలార్ రవితోనూ తెలంగాణ పోరు, ప్రస్తుతం తెలంగాణ ఎంపీల తీరు తెన్నులు, ప్రధాని జీవవైవిద్య సదస్సుకు హాజరైన సందర్బంలో తెలంగాణ మీడియా కు అనుమతి నివారణ దానిపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడం మొదలైన వివ రాలను వారిరువురీ మద్యవుంచారు. రాష్ట్రానికి పనికి వచ్చే విద్యుత్ విషయం మాత్రం మొయిలీతో సుదీర్ఘంగా వివరించారు. రైతులకు కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించ లేక పోతున్నామని దీనివల్ల  ప్రజల్లో చులకనయిపోతున్నామని, ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని వెంటనే విద్యుత్ కెటాయించి ఆదుకోవాలని మొయిలీని కోరారు

నితిన్ గడ్కరీ.. కేజ్రీవాల్ కొత్త టార్గెట్..!

  జన్ లోక్ పాల్ కోసం తీవ్రంగా పోరాడుతున్న అరవింద్ కేజ్రీవాల్ తనామనా అన్న తేడాలేకుండా రాజకీయ నేతల్ని వరసపెట్టి ఏకిపారేస్తున్నారు. వాద్రా డిఎల్ ఎఫ్ లావాదేల్ని బజారున పెట్టారని సంతోషపడిపోయి కేజ్రీవాల్ ని శెభాష్ అంటూ మెచ్చుకున్న బిజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీకి ఇప్పుడు పచ్చివెలక్కాయ్ నోట్లో పడింది. సొంత పరిశ్రమకోసం మహారాష్ట్ర సర్కారుతో కుమ్మక్కై.. గడ్కరీ.. వందెకరాలు గుటకాయస్వాహా చేశారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. రైతుల పేరుతో ప్రాజెక్ట్ లనుంచి నీటిని పరిశ్రమలకు మళ్లిస్తున్నారని, పైపైకి పార్టీలపరమైన భేదాలు కనిపిస్తున్నా.. మహారాష్ట్ర నేతలంతా ఒక్కటేనని కేజ్రీవాల్ ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన 70 వేలకోట్ల ఎకరాల సాగునీటి కుంభకోణంలో అన్నిపార్టీలకూ భాగస్వామ్యం ఉందని, రైతుల పేరు చెప్పి జలాశయాల్ని నిర్మించి, వాటినుంచి నీళ్లని విద్యుత్తు, చక్కెర కర్మాగారాలకు మళ్లిస్తున్నారని, నితిన్ గడ్కరీకి చెందిన ఐదు విద్యుత్తు ప్లాంట్లు, మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, జలాశయాల నిర్మాణంకోసం రైతుల పొట్టగొట్టి సేకరించిన భూమిలో మిగిలిన భూమిని గడ్కరీకి ధారాదత్తం చేశారని, మహారాష్ట్రలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 71 ధర్మల్ విద్యుత్తు కేంద్రాలు మొదలైతే ఏటా 2049 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరమౌతుందని, ఆ నీటిని అందజేస్తే.. రైతులకు చుక్కనీళ్లుకూడా అందవని, రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపించారు.

పాదయాత్రలో చంద్రబాబు వరాల జల్లు

  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్తుని అందజేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రైతుల రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని, బెల్ట్ షాపుల రద్దుపై రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదోనిలో తెదేపా అధినేత చంద్రబాబుని చూసేందుకు ఆయన ప్రసంగాన్ని వినేందుకు అశేష జనవాహిన పోటెత్తింది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబుకి జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయనకు ఇబ్బందులు ఏకరువు పెడుతున్నారు. కష్టాలనుంచి గట్టెక్కించమని వినతులు అందజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చంద్రబాబు ఆదోని ప్రసంగంలో విమర్శించారు. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం కూడా ఓ ప్రభుత్వమేనా అంటూ సర్కారుపై నిప్పులు చెరిగారు. అవినీతిపైకి శూలాన్ని ఎక్కుపెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, తమ పార్టీ ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్దేశపూర్వకంగానే అలాంటి అభిప్రాయాన్ని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 50 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి, 50 శాతం రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రలో ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ఇప్పట్నుంచే ఎన్నికల హామీలను గుప్పిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేనున్నా మీకోసం అనే భరోసాను కల్పించే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్నారు. 2014 ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బాబు తన ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా పాదయాత్రని దీక్షతో కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇకపై అంతులేని కోతలు

  ముఖ్యమంత్రి, అమాత్యుల నిర్లక్ష్యంవల్ల రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ కొరత సంక్షోభం మరింతగా ముదిరింది. ఇప్పటివరకూ ఏడెనిమిది గంటలపాటు విధిస్తున్న విధిస్తున్న అనధికారిక కోతలు ఇకపై అధికారికంగా అనంతమైన స్థాయికి ఎదిగే దశకూడా వచ్చేసింది. ఇకపై రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా కరెంట్ ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం రోజుకి విద్యుత్ డిమాండ్ 295 మిలియన్ యూనిట్లు. సరఫరా మాత్రం 230నుంచి 233 మిలియన్ యూనిట్లు. అరవైనుంచి అరవై ఐదు మిలియన్ యూనిట్ల కొరతను భర్తీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని డిస్కామ్ సంస్థలు చేతులెత్తేశాయ్. రోజురోజుకీ డిమాండ్ బాగా పెరిగిపోవడం, లోటు మరింత ఎక్కువైపోవడంవల్ల ఇకపై ఎప్పుడు ఎన్నిగంటలపాటు విద్యుత్ కోత ఉంటుందోకూడా చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏపీ ట్రాన్స్ కో పూర్తిగా తన చేతికి మట్టంటకుండా చూసుకునే విధానాల్ని అవలంబిస్తోంది. అందుబాటులో ఉన్న విద్యుత్ ని డిస్కమ్ లకు కేటాయించి చేతులు దులుపుకోవాలని నిర్ణయించింది. అంటే.. కోతల తలనొప్పంతా పూర్తిగా డిస్కమ్ ల బాధ్యతేనన్న మాట.. లోటు ఎంత ఎక్కువగా ఉంటే కోతలు కూడా అంత ఎక్కువగా ఉంటాయ్.. గ్రామాల్లో అయితే రాత్రివేళల్లోకూడా నాలుగునుంచి ఆరు గంటలపాటు కరెంట్ ని కట్ చేస్తున్నారు.

కేజ్రీవాల్ కి వార్నింగిచ్చిన సల్మాన్ ఖుర్షీద్

  అరవింద్ కేజ్రీవాల్ ని చంపుతానని అర్థం వచ్చే వాడి వేడిమాటలతూటాలను ప్రయోగించి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తనకు తానుగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. దమ్ముంటే యూపీలోని తన సొంత నియోజకవర్గం ఫరీదాబాద్ కొచ్చి నిరసన తెలపాలంటూ కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన ఖుర్షీద్ అలా జరిగితే కేజ్రీవాల్ తిరిగి వెనక్కెళ్లే అవకాశమే లేదంటూ సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఫరీదాబాద్ నుంచి ఎలా తిరిగి వెళ్తాడో చూస్తాననడం తనని చంపుతానంటూ బాహాటంగానే బెదిరించడమేనని కేజ్రీవాల్ అంటున్నారు. ఖుర్షీద్ మంత్రిలా కాక మాఫియా డాన్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను న్యాయశాఖమంత్రిని కాబట్టి కలంతో పనిచేయాల్సొస్తోందని, లేకుంటే కత్తితో పనిచేసే తరీఖాకూడా తెలుసని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ టీవీ ఛానెళ్లు విస్తృతంగా ప్రసారం చేశాయ్. ఖుర్షీద్ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే తనకు ప్రాణహాని తలపెట్టాలన్న ఉద్దేశం ఆయనకు ఉందన్న విషయం స్పష్టమౌతుందని కేజ్రీవాల్ అంటున్నారు. తన మరణం దేశాన్ని జాగృతం చేయగలిగితే వందలాదిమంది కేజ్రీవాల్ లు దేశంకోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడతారని ఆయన అన్నారు.

శ్రుతి హాసన్ కి అనారోగ్యం

  టైట్ షెడ్యూల్.. పంక్చువాలిటీకి, పర్ ఫెక్షన్ కి పెద్ద పీట వేసే మనస్తత్వం.. షూటింగ్ మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్.. ఓవర్ లోడ్.. అన్నీ కలిపి శ్రుతి హాసన్ ని ఆసుపత్రి పాలు చేశాయ్. పూనేలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయ్యా వస్తావయ్యా సినిమా షూటింగ్ లో విపరీతంగా అలిసిపోయిన శ్రుతి హాసన్ అనారోగ్యం పాలైంది. షూటింగ్ గ్యాప్ లో సొంతపనిమీద చెన్నె వెళ్లిన బ్యూటీ క్వీన్ కళ్లు తిరిగి పడిపోవడంతో ఆగమేఘాలమీద ఆసుపత్రిలో చేర్చారు. ఎక్కువగా పనిచేయడంవల్ల శక్తి లేక విపరీతంగా అలసిపోవడం, డీ హైడ్రైషన్ కారణాలవల్ల శ్రుతి హటాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. నాలుగ్గంటలతర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే శ్రుతి నేరుగా మళ్లీ పూనే షూటింగ్ స్పాట్ కెళ్లిపోయి సాంగ్ ని పూర్తి చేసిందట. తన వల్ల మిగతా వాళ్లకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో శ్రుతి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినిమా నిర్మాత తెగ మెచ్చుకుంటున్నాడు. కమల్ తనయగనకే అంతగా డిసిప్లిన్ కి ప్రాధాన్యం ఇస్తోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకుంటున్నాయ్.

ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు

  విశాఖజిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి కనక విచారణ జరపాలని ఏసీబీ న్యాయస్థానం డిఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. కోర్ట్ ఆదేశాలను అందుకున్న వెంటనే స్పందించాల్సిన అధికారులు కాస్త ఆలస్యంగా కదిలారు. ఈ లోపుగానే కన్నబాబు తనపేరిటఉన్న ఆస్తుల్ని బినామీ పేర్లమీదికి బదలాయించారన్న వార్తలుకూడా బైటికొచ్చాయి. అక్టోబర్ 19వ తేదీలోపున కేసు వివరాల్ని కోర్టుకి సమర్పించాల్సి  ఉన్నందున ఏసీబీ అధికారులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపి వీలైనంతమేరకు ఆధారాలు సంపాదించేందుకు ఏసీబీ అధికారులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎస్ ఈ జెడ్ ల పేరుతో అక్రమంగా రైతుల దగ్గర్నుంచి భూముల్ని చవగ్గా కొట్టేసి డీ నోటిఫై చేసి అధిక ధరలకు అమ్ముకుని లాభపడ్డారని కన్నబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. కన్నబాబు స్వగ్రామం రాంబిల్లిలోకూడా సోదాలు జరిపిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది.

హేమశ్రీ తల్లిని ప్రశ్నిస్తున్న బెంగళూరు పోలీసులు

కన్నడ నటి హేమశ్రీ హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుని అనంతపురం పోలీసులకు బదిలీ చేసే ప్రశ్నేలేదని అదనపు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. క్లోరో ఫామ్ ఎక్కువగా ఇచ్చినందువల్లే హేమశ్రీ మృతి చెందిందన్న నిజాన్ని ఆమె భర్త సురేంద్ర పోలీస్ ఇంటరాగేషన్ లో ఇప్పటికే బైటపెట్టేశాడు. సురేంద్ర ఇచ్చిన సమాచారంతో తీగలాగిన బెంగళూరు పోలీసులకు హత్య వెనక మాజీ కార్పొరేటర్ మురళి హస్తం కూడా ఉందన్న విషయం తెలిసిపోవడంతో కేసులో చిక్కుముడి వీడిపోయింది. కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల్ని సేకరించేందుకు పోలీసులు హేమశ్రీ తల్లిని ప్రశ్నిస్తున్నారు. విలువైన సమాచారాన్ని సేకరించి పక్కా ఆధారాల్ని కనిపెట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

“ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా“కి టెండూల్కర్ అర్హుడేనా?

  ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్ టెండూల్కర్ కివ్వడం సమంజసం కాదంటూ అక్కడి క్రికెట్ అభిమానులు, అభిమాన సంఘాలు మండిపడుతున్నాయ్. ఈ విషయంమీద ఆందోళన జరిపేందుకుకూడా అక్కడివాళ్లు సిద్ధమౌతున్నారు. గతంలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా తలెత్తిన జాతి వివక్ష వ్యాఖ్యల వివాదంలో ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడ్డమేకాక, తోటి క్రీడాకారుడు హర్భజన్ సింగ్ ని వెనకేసుకొచ్చిన సచిన్ కి అంతటి ఉన్నత పురస్కారమివ్వడం అస్ట్రేలియాలో చాలామంది క్రికెట్ అభిమానులకు రుచించడంలేదు. ఆసీస్ ప్రథాని గిలార్డ్ నుంచి ప్రకటన వెలువడిన మరు క్షణమే ఆస్ట్రేలియా పత్రిక హెరాల్డ్ సన్ తన వెబ్ సైట్ లో ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. సచిన్ కి మద్దతుగా దాదాపు 45 శాతం ఓట్లు పోలైతే, వ్యతిరేకంగా 56 శాతం ఓట్లు పోలయ్యాయి.

కరీనా సైఫ్ జంటకి పెటా వెజ్ చాక్లెట్

  బాలీవుడ్ కొత్త జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లకు ముంబైలోని జంతుహక్కుల పరిరక్షణ సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఏనిమల్స్ ప్రత్యేకంగా ఓ కానుకను సిద్ధం చేసింది. శాఖాహార పదార్ధాలతో మాత్రమే తయారుచేసే వెగన్ ఛాక్లెట్ చికెన్స్ ని కొత్త దంపతులకు పెటా సంస్థ.. కానుకగా పంపిస్తోంది. కరీనా పూర్తిగా శాఖాహారి కనుక ఈ కానుకనివ్వడం చాలా బాగుంటుందని పెటా సభ్యులు భావిస్తున్నారు. బాంద్రా ఏరియాలో ఉన్న సైఫ్ ఇంట్లోనే కరీనా, సయీఫ్ ల వివహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ముందుగానే దరఖాస్తు చేసుకోవడంవల్ల రిజిస్ట్రార్ కూడా ఇంటికే వచ్చి పెళ్లిని నమోదుచేసుకున్నారు. లాంఛనాలు పూర్తి కాగానే నూతన దంపతులు ఇంటి బాల్కనీలోకొచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ రిజిస్టర్డ్‌ మ్యారేజీకి కరీనా తల్లిదండ్రులు బబిత, రణ్‌ధీర్‌ కపూర్‌, సైఫ్‌ తల్లి షర్మిలా ఠాగూర్‌ సాక్షులుగా సంతకం చేశారు. షారుఖ్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, తుషార్‌ కపూర్‌, అమృతా అరోరా లాంటి నటీనటులు వివాహ వేడుకకు హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ లో అత్యంత ధనికుడు ఆఖరి నిజాం

  ప్రపంచం మొత్తంమీద అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే ఠక్కున ఏ బిల్ గేట్సో అని చెప్పేయడం మామూలైపోయింది. కానీ.. ఇలాంటి అంచనాలు తప్పని రుజువుచేసే పక్కా వివరాల్ని సెలబ్రిటీ నెట్ వర్త్ అనే వెబ్ సైట్ సేకరించింది. లండన్ పత్రిక ద ఇండిపెండెంట్ ఈ వివరాల్ని ప్రచురించింది. జాబితాలో మొత్తం 24మంది ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే బతికున్నారు. భారత్ లో ఇప్పటివరకూ అత్యంత ధనికుడైన వ్యక్తి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయ్. అంతేకాదు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. 1967లో 80 సంవత్సరాల వయసులో చనిపోయిన ఉస్మాన్ అలీ ఖాన్ భారతీయులందరిలోకీ ఆల్ టైం సంపన్నుడని సెలబ్రిటీ నెట్ వర్త్ చెబుతోంది. ఆయన ఆస్తుల విలువ 11.80,000 కోట్ల రూపాయలు. 14వ శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా అనే రాజు ప్రపంచంలోకెల్లా ఆల్ టైం సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 20,00,000 కోట్ల రూపాయలు.  ఉప్పు , బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవడంవల్లే ఇంత సంపదను పొందగలిగాడట. నెట్ వర్త్ వెబ్ సైట్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో 14మంది అమెరికన్లే ఉన్నారు. జాన్ డి రాక్ ఫెల్లర్ అమెరికాలో ఆల్ టైం సంపన్నుడిగా అవతరిస్తే, వారెన్ బఫెట్ కి మాత్రం ఈ జాబితాలో అతి బీదవాడి స్థానం దక్కింది. అదికూడా ఆయన దాన ధర్మాలు చేయడానికి ముందున్న లెక్కల్ని తీసుకుంటేనే.. 1)     

ప్రభుత్వంపై కేసేయండి : ప్రజలకి చంద్రబాబు సలహా

  చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర  పదిహేను రోజులు పూర్తిచేసుకుంది. వెళ్లినచోటల్లా జనం చంద్రబాబుకి నీరాజనాలు పడుతున్నారు. కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కరెంట్ కష్టాలు, ఉపాధి లేని స్పష్టంగా కనిపిస్తున్నాయ్. జనం బాబుకి ఫిర్యాదులు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకొస్తే రైతులకు, సామాన్యులకు ఏ కష్టమూ లేకుండా చూస్తానని చంద్రబాబు హామీఇస్తూ ముందుకు కదులుతున్నారు. ఒక్కో చోట ఆగినప్పుడు జనం కష్టాలు, బాధలు చంద్రబాబుని కదిలించేస్తున్నాయ్. అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేరోజు త్వరలోనే వస్తుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు. విద్యుత్ కోతలపై, నాణ్యమైన విద్యుత్ ని అందించడంలో వైఫల్యంపై సర్కారుపై కేసేయాలంటూ జనానికి హితబోధ చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్న సర్కారుని నిలదీయాలంటూ మండిపడుతున్నారు. బుధవారం చంద్రబాబు యాత్ర ఆదోని నియోజకవర్గంలో.. దసపురం గ్రామంనుంచి మొదలై ఆరేకల్లువరకూ యాత్ర చేశాక రాత్రికి బాబు బస అక్కడే.. ఫిజియో థెరపిస్ట్ ఎంతగా ట్రీట్మెంట్ ఇస్తున్నా కాలు నొప్పి చంద్రబాబుని వేధిస్తూనే ఉంది. మోకాలినొప్పి కారణంగా సాయంత్రమయ్యేసరికి చంద్రబాబు కాస్త నిదానంగా నడవాల్సొస్తోంది. ఒకవేళ బాబు యాత్రని పూర్తి చేయలేకపోతే లోకేష్ ని రంగంలోకి దించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

బీపీ ఆచార్యకి షరతులతోకూడిన బెయిల్

ఎమార్ కేసులో ప్రథాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బీపీ ఆచార్యకి సీబీఐ న్యాయస్థానం షరతులతోకూడిన బెయిల్ ని మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరి పూజీకత్తులు సమర్పించాలని కోర్ట్ ఆదేశించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో మాత్రమే ఉండాలని, తర్వాతి ఉత్తర్వు వచ్చేదాకా ప్రతి శుక్రవారం కోఠీలోని సిబిఐ ప్రథాన కార్యాలయంలో ప్రతి శుక్రవారం రిపోర్ట్ చేయాలని, పాస్ పోర్ట్ ని స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయ్తత్నం, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని కోర్ట్ బీపీ ఆచార్యకి స్పష్టం చేసింది. బి.పి. ఆచార్యని జనవరి 30న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రాసిక్యూషన్ కి అనుమతిలేదన్న కారణంగా సీబీఐ కారణంగా సీబీఐ కోర్టు మార్చ్ 16న షరతులతో బెయిలు మంజూరుచేసింది. దీనిపై సీబీఐ హైకోర్టుని ఆశ్రయించింది. ఆచార్యకి బెయిల్ రద్దయ్యింది. మార్చ్ 29న ఆచార్య తిరిగి సిబిఐ కోర్టుముందు లొంగిపోయారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చివరిసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ని సెప్టెంబర్ 12 న కోర్ట్ కొట్టేసింది. సెప్టెంబర్ 15న సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ప్రస్తుతం బీపీ ఆచార్యకి బెయిల్ మంజూరు కావడంతో ఎమ్మార్ కేసులో నిందితుల్లో జగన్ కి బాగా సన్నిహితుడైన సునీల్ రెడ్డి తప్ప మిగిలినవాళ్లందరికీ బెయిల్ మంజూరైంది.  

కేంద్ర క్యాబినెట్ విస్తరణ?

  కేంద్ర క్యాబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రథాని మన్మోహన్, యూపీయే అధ్యక్షురాలు సోనియా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వేరువేరుగా సమావేశం కావడంతో విస్తరణ ఊహాగానాలు ఊపందుకున్నాయ్. మహాలయ పక్షాలు పూర్తై దసరా శుభ ఘడియలు వచ్చేశాయ్ కనుక మంత్రివర్గ విస్తరణకు అనుకూలం సమయం వచ్చినట్టేనని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రణబ్ ఈ నెల 20న దుర్గాపూజకోసం తన స్వగ్రామానికి వెళ్తుండడంతో ఆలోపుగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు ఖాళీ చేసిన సీట్లతోపాటు డిఎంకె మంత్రులు రాజా, దయానిధి మారన్ ల సీట్లుకూడా ఖాళీగానే ఉన్నాయ్. తాము కోల్పోయిన మంత్రి పదవుల్ని తిరిగి చేపట్టే ఆలోచనేదీ లేదని కరుణానిధి తేల్చిచెప్పడంతో ఆ ఖాళీల్నికూడా పూరించడం అనివార్యమయ్యింది. రాహుల్ గాంధీకి సన్నిహితులుగా భావిస్తున్న యువనేతలకు విస్తరణలో పెద్దపీట వేయాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకూ రెండు మంత్రి పదవుల్ని చూస్తున్న వాళ్లకి ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏఐసీసీలోకూడా పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సోనియా భావిస్తున్నారట. రాహుల్ గాంధీకి సంస్థాగతమైన కీలకపదవిని కట్టబెట్టేందుకు మేడం పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

ఎనీటైం సెక్స్‌ కేంద్రాలు

ఎనీటైంమనీ(ఏటీఎం) పేరు మార్చుకుంటోంది. ఈ ఏటిఎం కేంద్రాలు శృంగారానికి వేదికలవుతున్నాయి. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఒకేసారి కార్డులు తీసుకుని లోనికి ఎంటరై 40నిమషాల పాటు పని చూసుకుని కార్డులు, బ్యాలెన్స్‌లు చూసుకుంటూ వెళ్లిపోతున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతాల్లోని ఏటిఎంలు ఇలా శృంగారకేంద్రాలుగా మారటానికి గార్డులు కూడా పరోక్షంగా కారణమవుతున్నారు. గార్డుల చేతిలో డబ్బు పెట్టి పోలీసులకు దొరక్కుండా శృంగారం చేయటంలో కృష్ణాజిల్లా కుర్రకారు రికార్డు సృష్టిస్తున్నారు. వీరి రాసలీలలు బ్యాంకు సిసి కెమేరాల్లో నమోదవుతోంది. విజయవాడ శివారు ప్రాంతంలో జరుగుతున్న ఈ తంతును బ్యాంకు సిబ్బంది చూసి తలలు పట్టుకుంటున్నారు. పోలీసుల ఆదేశాల మేరకు ఏటిఎంల్లో సిసికెమేరాలు అమర్చిన బ్యాంకులు ఈ క్లిప్పింగులను పైకి పంపించనూలేక, డిలీట్‌ చేయనూలేక ఇబ్బంది పడుతున్నారు.