ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు

 

విశాఖజిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి కనక విచారణ జరపాలని ఏసీబీ న్యాయస్థానం డిఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. కోర్ట్ ఆదేశాలను అందుకున్న వెంటనే స్పందించాల్సిన అధికారులు కాస్త ఆలస్యంగా కదిలారు. ఈ లోపుగానే కన్నబాబు తనపేరిటఉన్న ఆస్తుల్ని బినామీ పేర్లమీదికి బదలాయించారన్న వార్తలుకూడా బైటికొచ్చాయి. అక్టోబర్ 19వ తేదీలోపున కేసు వివరాల్ని కోర్టుకి సమర్పించాల్సి  ఉన్నందున ఏసీబీ అధికారులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపి వీలైనంతమేరకు ఆధారాలు సంపాదించేందుకు ఏసీబీ అధికారులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎస్ ఈ జెడ్ ల పేరుతో అక్రమంగా రైతుల దగ్గర్నుంచి భూముల్ని చవగ్గా కొట్టేసి డీ నోటిఫై చేసి అధిక ధరలకు అమ్ముకుని లాభపడ్డారని కన్నబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. కన్నబాబు స్వగ్రామం రాంబిల్లిలోకూడా సోదాలు జరిపిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.