అది పవన్ చివరి మీటింగా?

  గురువారం నాడు వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీటింగ్ ‘జనసేన’ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్‌ నిర్వహించే చివరి మీటింగ్‌గా భావించవచ్చని, భవిష్యత్తు ‘జనసేన’ పేరుతో పవన్ కళ్యాణ్‌ మరో మీటింగ్ పెట్టే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిపిన సభ ‘జనసేన’ తొలిసభ అయితే, వైజాగ్‌లో జరిగింది చివరి సభగా భావించవచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అచ్చ తెలుగు ఆంధ్రుడు కాబట్టి ‘జనసేన’ విషయంలో ఆయనది ఆరంభ శూరత్వంగా భావించడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ‘జనసేన’ పార్టీ ని ప్రకటించాక, నరేంద్రమోడీని కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని రాజకీయ ఉద్ధండులందరూ తన వెంట పడతారని పవన్ కళ్యాణ్ ఊహించాడు. అయితే అలాంటిదేదీ జరగలేదు. ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితులకు పవన్ కళ్యాణ్ వంటి అనవసర ఆవేశపరుడు సెట్ కాడన్న సత్యాన్ని గ్రహించడం వల్లే ఆయన వెనుక రాజకీయ నాయకులు క్యూ కట్టలేదు. ఇదే కాక పార్టీని ప్రకటించిన తర్వాత అనేక విషయాలలో పవన్ కళ్యాణ్ ఆశించిన డెవలప్‌మెంట్స్ కనిపించలేదు.   మనసులో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనే కోరిక వున్నా, తనంతట తాను తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ఇగో అడ్డు రావడంతో తెలుగుదేశానికి కూడా చేరువ కాలేకపోయాడు. ఫలితం.. ఈసారి ఎన్నికలలో పోటీచేసే అవకాశాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. మిగతా పార్టీలలో పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవాలని అనుకునే పార్టీలే తప్ప పవన్ కళ్యాణ్‌కి ఉపయోగపడే పార్టీలేవీ లేవు.   ఇంకా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ నిర్వహణకు అయ్యే వ్యయం... ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి జ్ఞానోదయం కలిగించాయి. ఒక రాజకీయ పార్టీని కొనసాగించడం అనేది ఆషామాషీ విషయం కాదన్న సంగతిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ మెల్లగా పార్టీ, ఎన్నికలు, పోటీ చేయడం వంటి అంశాల నుంచి తప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాడని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైజాగ్‌లో పవన్ చేసిన ప్రసంగం ఈ ధోరణిలోనే సాగిందని ఆ వర్గాలు అంటున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫ్లాప్ షో

  పవన్ కళ్యాణ్ పదిరోజుల క్రితం తన జనసేన పార్టీ స్థాపిస్తున్నపుడు చేసిన ఉపన్యాసం రాజకీయ మూస ఫార్ములాకి కట్టుబడకుండా సాగినప్పటికీ, అది ఆయన ఆలోచనలకి అద్దం పడుతూ అభిమానులకి, ప్రజలకీ, మీడియాకీ, చివరికి రాజకీయ పార్టీలకీ కూడా చాలా ఆసక్తి రేకెత్తించి, మళ్ళీ ఆయన రెండో ప్రసంగం కోసం వారిని ఎదురు చూసేలా చేసింది. కానీ, ఆయన నిన్న వైజాగ్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం అభిమానులను కూడా చాలా నిరుత్సాహపరిచింది. ఆయన సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయాలలోకి ప్రవేశించినందున, జనసేన పార్టీ తప్పకుండా ఎన్నికలలో పోటీ చేస్తుందని అందరూ ఆశించారు.   కానీ ఆయన అందరినీ నిరాశపరుస్తూ “ఎన్నికలలో పోటీ చేయను. ఎవరికీ మద్దతు ఈయను. ఎవరికీ వ్యతిరేఖంగా ప్రచారం చేయను. ఎవరి అవకాశాలు పాడుచేయడం నాకిష్టం లేదు. మీకిష్టం వచ్చిన వారికే ఓట్లువేసుకోండి. ఎన్నికలయిపోయిన తరువాత గెలిచిన వారిని నేను నిలదీస్తాను” అని చెప్పారు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడిగా పార్టీ పెట్టి ఇంత హడావుడి చేయడం అవసరమా? అనేదే ప్రశ్న.   ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్పగల యువత కోసం తను వెతుకుతున్నానని, అటువంటివారు దొరికినప్పుడే జనసేన ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పారు. అయితే ఇన్నికోట్ల మంది తెలుగు ప్రజలలో, అభిమానులలో ఆయనకు అటువంటి వ్యక్తి ఒక్కరూ కనబడకపోవడం విచిత్రమే. ఆయన ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొంటే అందుకు ఇటువంటి కుంటిసాకులు చెప్పనవసరం లేదు. నిజానికి ఆయన పార్టీ ఎన్నికలలో పోటీ చేసేమాటయితే ఆయన వెంట నడిచేందుకు, ఆయన ‘ఊ’ అంటే ఆయన కోసం నిప్పుల్లో కూడా దూకేందుకు వేలాది అభిమానులు సిద్దంగా ఉన్నారు. కానీ ఆయన ఎందుకో వెనుకంజవేసారు.   కనీసం ఆయన తను ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా విస్పష్టంగా ప్రకటించకుండా ప్రజలను వారికిష్టమయిన అభ్యర్ధులకే ఓట్లు వేసుకోమని ఒక ఉచిత సలహా ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన ‘మోడీకి నా సెల్యూట్’ అన్నారు తప్ప, తమ పార్టీ రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా చెప్పకుండా అభిమానులను అయోమయ స్థితిలో వదిలివేసారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స, కావూరి, రాయపాటి వంటి నేతల పేరు పెట్టి మరీ నిర్భయంగా విమర్శించిన ఆయన జగన్ పేరు ఎత్తేందుకు కూడా సాహసించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా తేదేపాకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ నేరుగా ఆ పార్టీ పేరు చెప్పి దానికే తను మద్దతు ఇస్తున్నానని చెప్పలేకపోవడం కూడా ఎందుకో అర్ధం కాదు.   ఇక కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన ఆయన ఆ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయిన వారిని మాత్రం క్షమిస్తున్నట్లు మాట్లాడటం మరో విశేషం. “మీరు పార్టీలు కండువాలు మార్చడం నేను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను. మారండి. నేనేమి అభ్యంతరం చెప్పబోను. కానీ ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను” అని చెప్పడం చాలా అసంబద్దంగా ఉంది.   కేవలం వారం పది రోజులలో కొమరం పులి వంటి పవన్ కళ్యాణ్ ఇంత పిరికిగా ఎందుకు మారిపోయారు? అని ప్రశ్నించుకొంటే ఆయనపై ఏవో కొన్ని అదృశ్య శక్తుల ఒత్తిళ్ళు చాలానే ఉన్నట్లు అనిపిస్తోంది. అందువల్లే క్రిందటిసారి ఆయన ప్రసంగంలో కనిపించిన వాడి వేడి, ఈసారి కనిపించలేదు. ఈ సభలో తనను, తన పార్టీని ప్రజల ముందు పూర్తిగా అవిష్కరించుకొని, తన అభిమానులకు దిశానిర్దేశం చేస్తారని అందరూ ఆశించారు. ఆయన రాజకీయ వైఖరి ఏమిటో విస్పష్టంగా ప్రకటిస్తారని అన్ని పార్టీలు ఎదురుచూసాయి. కానీ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను తుఫానులా.. సునామీలా...ప్రవేశిస్తారనుకొంటే, చప్పగా చల్లారిపోయి ప్రజలను తమకు నచ్చిన వారికే ఓటేసుకోమని ఒక ఉచిత సలహా ఇచ్చి ‘జై హింద్’ చెప్పేశారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ కి అభిమానులే శ్రీరామ రక్ష

  జనసేన పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఈరోజు ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్, వైజాగ్ లో తన మొట్ట మొదటి రాజకీయ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి పదిరోజులయినా ఇంకా దాని నిర్మాణం జరుగనందున ఆయన అభిమానులే స్వచ్చందంగా ముందుకు వచ్చి సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలలాగ పనిచేసుకొనిపోవడం విశేషం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తున్నపుడు, ఆయన తన అభిమానులను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి మొదటి అడుగే తప్పటడుగు వేయగా, ఆయనకు పూర్తి విరుద్దంగా పవన్ కేవలం తన అభిమానులనే నమ్ముకొని మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానానికి వారి అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి.   అభిమానులే స్వయంగా చొరవ తీసుకొని సభకు అవసరమయిన ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేస్తూ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. వారు ఈమెయిల్స్, ఫేస్ బుక్, ట్వీటర్, యస్.యం.యస్. వంటి అన్నిమార్గాల ద్వారా వారు చుట్టూ పక్కల జిల్లాలలో అభిమానులను ముఖ్యంగా యువతను కూడా తమ కార్యక్రామాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఇది తమ ఇంట్లో శుభ కార్యక్రమన్నంతగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఈసభ ప్రచారం కోసం బైక్ ర్యాలీలు నిర్వహిస్తూన్నారు.   అభిమానులు చూపిస్తున్న అపారమయిన ఈ ప్రేమాభిమానాలను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకొంటూ, వారి యువశక్తిని, తెలివి తేటలను, జనసేన ద్వారా సమాజానికి సేవ చేయాలనే వారి తపనను గుర్తించి వారితో కలిసి అడుగు ముందుకు వేస్తే ఆయన చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగం సఫలం అవుతుంది. కానీ, కేవలం అభిమానులతోనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నెగ్గుకు రావడం చాలా కష్టం గనుక, మంచి అనుభవం, నిజాయితీ గల కొందరు రాజకీయ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించడం తప్పనిసరి అవుతుంది. కానీ వారి రాకతో అభిమానుల ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకుంటే జనసేన కూడా మరో ప్రజారాజ్యం ప్రయోగంలా విఫలమయితే, అప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అభిమానులు దూరం అయ్యే ప్రమాదం ఉంది.   ఇక అన్నిటికంటే ముందుగా జనసేన పార్టీ అసలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా? అనే విషయం కూడా తేల్చుకొన్నట్లయితే, తదనుగుణంగా తదుపరి కార్యక్రమాలను, పార్టీ నిర్మాణం గురించి ఆలోచించవచ్చును. పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నించడానికే పార్టీని పెడుతున్నాని చెప్పుకొంటున్నారు గనుక, జనసేన పార్టీ పరిమిత సీట్లకు పోటీ చేయబోతోందని భావించవచ్చును. అటువంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నిర్మించే ప్రయత్నం చేసే బదులు, కేవలం తమ అభ్యర్ధులను నిలబెడుతున్న చోటే ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేసినట్లయితే తద్వారా అనవసర శ్రమ, వృధా ఖర్చు తప్పడమే కాక విలువయిన సమయం కూడా సద్వినియోగం చేసుకోవచ్చును.   ఏది ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇకముందు తను వేసే ప్రతీ అడుగులో తన అభిమానులను తోడుగా చేసుకొని ముందుకు సాగినట్లయితే, అదే ఆయన పార్టీకి విజయాన్ని చేకూర్చి, ఇతర పార్టీల నుండి శ్రీరామ రక్షగా నిలిచి కాపాడుతుందని చెప్పవచ్చును.

వాపును చూసి బలుపని బ్రమిస్తున్న బీజేపీ

  రాష్ట్ర విభజన బిల్లుకి బీజేపీ మద్దతు ప్రకటించిన తరువాత సీమాంద్రాలో ఆ పార్టీ పట్ల కూడా తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే అది తమను మోసం చేసిందని, మోడీని చూసి బీజేపీని ఆదరిస్తే చివరికి అది కూడా మోసం చేసిందని సీమాంధ్ర ప్రజలు చాలా బాధ పడ్డారు. రాజ్యసభలో సీమాంద్రాకు అనుకూలంగా వాదించిన వెంకయ్య నాయుడు విభజన బిల్లు ఆమోదం పొందగానే సీమాంద్రాలో పర్యటించి, ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసారు. దానికి మోడీ ప్రభావం కూడా తోడవడంతో సీమాంద్రాలో ప్రజలు క్రమంగా మళ్ళీ బీజేపీ వైపే ఆకర్షితులవుతున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో ప్రవీణులైన పురందేశ్వరి వంటి రాజకీయ నాయకులు అందుకే బీజేపీలోకి జంపైపోతున్నారు. అనేకమంది తెలుగు సినిమా హీరోలు ‘నమో నమో’ అంటూ మోడీ జపం చేస్తూ, ఎవరూ అడగకుండానే బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇక రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా గట్టిగా పోరాడిన ఆంధ్రా యూనివర్సిటి విద్యార్ధి జేఏసీ నేతలు సైతం ఇటీవల బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి, ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం గమనిస్తే సీమాంద్రాలో క్రమంగా బీజేపీకి కొంతమేర సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్ధం అవుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సీమాంద్రాలో ఎక్కడా పెద్దగా కనబడని బీజేపీ ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంతగా బలం పుంజుకోవడం విశేషమే.   సీమాంద్రాలో క్రమంగా తనకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను చూసి సీమాంధ్ర బీజేపీ నేతలు కూడా తెలంగాణా బీజేపీ నేతల్లాగే తమకు ఇక తెదేపాతో ఎన్నికల పొత్తులు అవసరంలేదన్నట్లు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంకయ్యనాయుడు కూడా ఇంచుమించు అదేవిధంగా స్పందిస్తూ తమతో తెదేపా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదని అన్నారు. మమ్మల్ని మేం ఎక్కువ లేదా తక్కువగా అంచనా వేసుకోవడంలేదు. అదేవిధంగా ఇతరులను కూడా మేము తక్కువగా అంచనా వేయడం లేదు. అందువల్ల మాలాగే ఇతర పార్టీలు (తెదేపా) కూడా తమని తాము ఎక్కువగా అంచనా వేసుకొంటూ బీజేపీని తక్కువగా అంచనా వేయడం మంచిది కాదని ఆయన అన్నారు. బీజేపీ శ్రేణులు ఎటువంటి పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు కూడా. బీజేపీ నేతల ఈ మాటలు గమనిస్తే సీమాంద్రాలో తమకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను చూసి వారి ఆత్మవిశ్వాసం ఇప్పుడు అతివిశ్వాసంగా, అతిశయంగా మారుతున్నట్లుంది.     తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన కారణంగా తెలంగాణాలో తమకే ఓట్లు రాలుతాయని బీజేపీ ఆశలు పెట్టుకోవడం సహజమే. కానీ, సీమాంద్రాలో కూడా తమకు పరిస్థితి అనుకూలంగా మారిపోయిందని బీజేపీ నేతలు అనుకోవడం వారు వాపును చూసి బలుపు అని భ్రమిస్తున్నట్లుంది. బహుశః ఆ భ్రమ వల్లనే వారు తెదేపాతో ఏదోవిధంగా సీట్ల సర్దుబాటు చేసుకొని ఎన్నికల పొత్తులకు ప్రయత్నించకుండా బిగుసుకొని కూర్చొన్నట్లున్నారు. త్వరలోనే నరేంద్ర మోడీ సీమాంద్రాలో పర్యటిస్తే తాము మరింత బలపడటం ఖాయమని అప్పుడు ఇక తెదేపాతోనే కాదు ఇక ఏ పార్టీతోను పొత్తులు అవసరం లేదని వారు అనుకొంటున్న మాట నిజమయితే, ఈసారి ఎన్నికలలో కూడా బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకొనవసరం లేదు.   నేటికీ సీమాంద్రా-బీజేపీలో పురందేశ్వరి, సినీనటుడు కృష్ణంరాజు వంటి ఒకరిద్దరు తెలిసిన మొహాలు తప్ప ఆ పార్టీకి చెప్పుకోదగ్గ గొప్ప నాయకులెవరూ లేరు. అయినప్పటికీ వాపును చూసి బలుపని భ్రమలో బలమయిన, విస్తృతమయిన క్యాడర్, నాయకులు గల తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలను డ్డీకొని నిలవగలమని బీజేపీ నేతలు భావిస్తే అందుకు వారే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. తెదేపా లేదా వైకాపాలతో అంటుకట్టకపోతే బీజేపీ సీమాంద్రాలో బ్రతికి బట్ట కట్టడం అసంభవం.

ఆంధ్రాలో చిరంజీవి, తెలంగాణాలో కేసీఆర్...

  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుతో అక్కడ పరిస్థితులు పూర్తిగా తనకు అనుకూలంగా మారిపోతాయని భావిస్తే, కేసీఆర్ హ్యాండివడంతో ఇప్పుడు అక్కడ కూడా ఎదురీదక తప్పడం లేదు. తెలంగాణా కోసం సీమాంద్రాను బలిచేసుకొన్నందుకు బాగానే శాస్తి జరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు లోలోన కుమిలిపోతోంది. ఇక చేసేదేమీ లేక అంతోఇంతో తనకు అనుకూలంగా ఉన్న తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి పెట్టి మొదట అక్కడ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో పడింది. అధిష్టానం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టడంతో, టీ-కాంగ్రెస్ నేతలందరూ పార్టీని గాలికొదిలేసి, తమకి, తమ కుటుంబ సభ్యులకి టికెట్స్ ఖరారు చేసుకొనేందుకు పైరవీలు చేసుకోవడంలో తలమునకలయ్యున్నారు.   ఇదే అదునుగా, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మరియు అతని పార్టీ నేతలు ప్రజలను ఆకట్టుకొనేందుకు తెలంగాణా సెంటిమెంట్ రెచ్చగొడుతూ దూసుకుపోతున్నారు. ‘బంగారి తెలంగాణా’ను నిర్మించుకోవాలంటే మొత్తం శాసనసభ, లోక్ సభ స్థానాలలో తెరాసకే ఇవ్వాలని ప్రచారం మొదలుపెట్టేసారు. ‘మన రాష్ట్రం, మన పార్టీ’ అంటూ ఒక సరి కొత్త నినాదం అందుకొని ఒక్క తెరాస తప్ప మిగిలిన అన్ని పార్టీలు పరాయి పార్టీలేననే భావన ప్రజలలో వ్యాపింపజేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా టికెట్స్ కోసం పైరవీలతో తీరిక లేకుండా ఉన్నారు. బహుశః వారు టికెట్స్ ఖరారు చేసుకొని యుద్దరంగంలో అడుగు పెట్టే సమయానికి కేసీఆర్ సగం విజయం సాధించేసినా ఆశ్చర్యం లేదు.   కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినా కూడా ఆ విషయాన్ని బలంగా ప్రచారం చేసుకొని లబ్ది పొందవలసిన టీ-కాంగ్రెస్ నేతల అలసత్వం వలన, వారికీ, పార్టీకి కూడా తీరని నష్టం కలిగేలా ఉంది. అందువలన కాంగ్రెస్ అధిష్టానం తెరాసను నిందించడం కంటే తమ పార్టీ నేతలనే ముందు నిందించుకోవలసి ఉంటుంది.   ఇక సీమాంధ్రలో మిగిలిన గుప్పెడు మంది కాంగ్రెస్ నేతలు చిరంజీవి (శల్య)సారద్యంలో చేస్తున్న ప్రచారం ఒక డ్రామా కంపెనీ ఫ్లాప్ షోలాగ ఎవరినీ ఆకట్టుకోలేక భారంగా ముందుకు సాగుతోంది. గమ్మతయిన విషయం ఏమిటంటే దానికి నేతృత్వం వహిస్తున చిరంజీవి అసందర్భ ప్రసంగం వలననే కాంగ్రెస్ పార్టీ ఉన్న పరువు కూడా పోగొట్టుకొంటోంది. పార్టీని ఎలాగయినా బ్రతికించమని ఆయనకి బాధ్యత అప్పజేపితే “మా పార్టీ అవసాన దశలో ఉందని, ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఒక గ్రద్ద వంటిదని, చాలా నిరాశతో ప్రచారం చేస్తున్నానంటూ ” ఏవేవో అసందర్భ ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆయనే స్వయంగా ఓడించేలా ఉన్నారు.   రాష్ట్ర విభజన వల్ల పార్టీకి జరిగిన నష్టం కంటే ఆయన చేస్తున్న ప్రచారం వలననే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం కలిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బొంద పెడుతుంటే, సీమాంద్రాలో ఆపని చిరంజీవి చేస్తున్నట్లుంది. అయినప్పటికీ అతను తప్ప ప్రజలను ఆ మాత్రం ఆకట్టుకోగల నేత పార్టీలో ఒక్కరూ లేనందున చిరంజీవే ఈ ఎన్నికల వైతరిణిని దాటిస్తాడని కాంగ్రెస్ అధిష్టానం ఆశపెట్టుకొంది పాపం! అయితే ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. ఆయనకి ఒక మంచి సినిమా డైలాగ్ రైటర్ తో స్క్రిప్ట్ తయారు చేయించి అందివ్వగలిగితే, అందులో అక్షరం పొల్లుపోకుండా ఆయన చాలా చక్కగా ప్రజలను ఆకట్టుకొనేలా పలుకుతూ పార్టీని ఒడ్డున పడేయగలరు. లేకుంటే బస్సు యాత్ర పూర్తయ్యే సరికి ఆయన దెబ్బకి పార్టీలో మిగిలినవారు కూడా పారిపొయినా ఆశ్చర్యం లేదు.

తెదేపా-బీజేపీల పొత్తుల కధ కూడా ముగిసినట్లేనా?

  కాంగ్రెస్-తెరాసల ఎన్నికల పొత్తులు అధ్యాయం అర్ధంతరంగా ముగిసినట్లే తెదేపా-బీజేపీల పొత్తుల కధ కూడా ముగిసేట్లుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణాలో తెదేపాతో ఎన్నికల పొత్తులు వద్దని అక్కడి బీజేపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కానీ రెండు రాష్ట్రాలలో పొత్తులకు అంగీకరించేట్లయితేనే తాము పొత్తుల గురించి ఆలోచిస్తామని లేకుంటే అసలు పొత్తులే వద్దని తెదేపా ఖరాఖండిగా చెపుతోంది. ఒకవేళ తెలంగాణాలో కూడా పొత్తులు కుదుర్చుకోవాలంటే తప్పనిసరిగా బీజేపీకే ఎక్కువ సీట్లు కేటాయించాలని అక్కడి నేతలు గట్టిగా పట్టుబట్టడం కూడా అవరోధంగా మారుతోంది. అదేవిధంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఒంగోలు మల్కాజ్ గిరీ వంటి కొన్ని ముఖ్యమయిన నియోజక వర్గాలు తమకే కావాలని రెండు పార్టీలు గట్టిగా పట్టుబట్టడం పొత్తులకు మారో ప్రధాన అవరోధంగా మారింది. అయినప్పటికీ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీ అధిష్టానంతో డిల్లీలో చర్చిస్తున్నారు.   రెండు పార్టీల మధ్య పొత్తులు కుదుర్చుకోకపోయినట్లయితే తామే ఎక్కువగా నష్టపోతామని ఇరువురికీ తెలుసు. కానీ, సీట్ల విషయంలో, తెలంగాణాలో పొత్తుల విషయంలో రెండు పార్టీలు పంతాలకు పోతుండటంతో ఇక రెండు పార్టీల మధ్య పొత్తులు అనుమానంగానే ఉంది. బీజేపీ నేత మురళీధర రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఇరువురూ కూడా పొత్తుల విషయంలో పెదవి విరుస్తున్నారు. బహుశః ఒకటి రెండు రోజుల్లోగానే పొత్తుల సంగతి తేలిపోవచ్చును.   ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరకపోతే, అది కాంగ్రెస్, వైకాపా, జైసాపలకు వరంగా మారవచ్చును. తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు పొత్తులు పెట్టుకోకపోవడం వలన అవి ఏవిధంగా బలహీనపడి, తెదేపా, బీజేపీలకు అవకాశం కల్పిస్తున్నాయో, అదేవిదంగా సీమాంధ్రలో తెదేపా-బీజేపీలు కూడా బలహీనపడి మిగిలిన అన్ని పార్టీలకు అవకాశం కలిగించడం తధ్యం.   కానీ, ఒకవేళ తెదేపా-బీజేపీలు పొత్తులు విఫలమయినట్లయితే వెంటనే వైకాపా చొరవ తీసుకొని బీజేపీతో పొత్తులకి ప్రయత్నించవచ్చును. బీజేపీకి సీమాంధ్రపై పెద్దగా ఆసక్తి లేదు. అదేవిధంగా వైకాపాకు తెలంగాణపై ఆసక్తి లేదు. ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్లయితే, సీమాంద్రా కాంగ్రెస్ నేతల చేరికతో బలం పుంజుకొన్న తెదేపా ముందు డీలాపడిపోయిన వైకాపా కూడా మళ్ళీ బలం పుంజుకోవచ్చును. అదేవిదంగా ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి వైకాపా మద్దతు కూడా దొరుకుతుంది. గనుక ఆ రెండు పార్టీల మధ్య చాలా తేలికగా పొత్తులు కుదిరే అవకాశం ఉంది.    ఇక, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ, తెదేపాలకు తన జనసేన మద్దతు లేదా ఆ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకొంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదని బీజేపీ నేత సోము వీర్ర్రాజుకి నిన్ననే ఒక లేఖ వ్రాసినట్లు సమాచారం. అదే నిజమయితే ఈ పొత్తుపొడుపులలో అన్నిటికంటే ఎక్కువ లాభపడేది వైకాపాయే అవుతుంది. ఇక వైకాపా, తెరాసలను నమ్ముకొని రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల చేతుల్లో ఘోరంగా మోసపోయి దక్షిణాదిన తనకున్న బలమయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నికూడా పోగొట్టుకోవడమే కాకుండా, ఆ పార్టీకి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేఅవకాశాలు కూడా మరింత కుచించుకుపోవచ్చును.

చిరంజీవి శల్యసారధ్యంతో కాంగ్రెస్ ఖతం?

  కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారధిగా కీలక భాద్యతలు భుజానికెత్తుకొన్న చిరంజీవి గురించి మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి ఒక చక్కటి మాట అన్నారు. చిరంజీవి మంచి నటుడే కానీ, ఇప్పుడు ప్రచారంలో ఒక హాస్యనటుడిగా మారిపోయాడని, సరయిన రాజకీయ అవగాహనా లేకుండా అసందర్భంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రాలో బస్సు యాత్ర చేస్తున్న చిరంజీవి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ఆయన గురించి కిరణ్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమేనని ఎవరయినా అంగీకరిస్తారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్ పార్టీయే...అని కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ ఒక్కటే ఈ తప్పు చేయలేదు. అన్ని పార్టీలు తప్పు చేసాయి,” అని అన్నారు.   స్క్రిప్ట్ ప్రకారం చిలకలా డైలాగ్స్ చెప్పడం అలవాటయిన చిరంజీవికి, ఇప్పుడు చేతిలో సరయిన స్క్రిప్ట్ లేకపోవడంతో ఆ తడబాటులో ఆయనే స్వయంగా తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని విభజించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందని చెప్పుకొన్నారు. ఆ తరువాత నాలుక కరుచుకొని అలాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని సర్ది చెప్పుకోవడం చూస్తే జాలేస్తుంది.   తమ సోనియమ్మే తెలంగాణా ‘వరం’ ప్రసాదించిన దేవత అని అక్కడ టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొని ప్రజలను తమ వైపు త్రిప్పుకోనేందుకు ముప్పు తిప్పలు పడుతుంటే, ఇక్కడ చిరంజీవి బండి మీదకి ఎక్కి మైకు పట్టుకొని మరీ ‘తెలంగాణా ఏర్పాటు చేయడం ఒక పెద్ద తప్పు’ అని గొంతు చించుకొంటున్నారు. టీ-కాంగ్రెస్ నేతలతో కత్తులు దూస్తున్న తెరాస నేతలు రేపు ఇవే మాటలు పట్టుకొని వారిపై ఎదురు దాడి చేస్తే ఎలా ఉంటుందో పాపం చిరంజీవికి తెలియదు.   “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు. కానీ అది నిజం కాదు. కిరణ్ కుమార్ రెడ్డే దానిని హత్య చేసారు. (అంటే కాంగ్రెస్ చచ్చిపోయిందని ఆయనే అంగీకరిస్తున్నారాన్నమాట!) ఆయనే విభజనకు అన్నివిధాల మా అధిష్టానానికి సహకరించారు. కానీ ఆయన మా అందరినీ ఈ వ్యవహారంలో చివరివరకు మోసపుచ్చుతూనే ఉన్నారు. (అంతకు ముందు ‘విభజన పాపం అందరిదీ’ అని బల్ల గుద్ది మరీ చెప్పిన చిరంజీవి, ఆ మరుక్షణమే తమ అధిష్టానమే విభజన చేసిందని దానికి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించారని చెప్పడం చూస్తే ఆయనకు ఇంకా సరయిన రాజకీయ అవగాహన, పరిణతి లేదని స్పష్టమవుతోంది.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీని చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిపుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం పార్టీలో పదవులు, గౌరవం పొందిన కొందరు నేతలు ఇతర పార్టీల నేతల మోచేతి నీళ్ళు త్రాగేందుకు సిద్దపడి వెళ్ళిపోతున్నారు. వారందరూ ద్రోహులు. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి” అని అన్నారు.   నిజానికి కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది గనుకనే దానిని రక్షించమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఆ బాధ్యత కట్టబెట్టి పంపింది. కానీ, ఆయన ఊరూరు తిరుగుతూ పదేపదే తమ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పనిగట్టుకొని టాంటాం చేయడం చూస్తే ఆయన పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నారా? అనే అనుమానం కలుగక మానదు. రాజకీయ పరిణతి కలిగిన ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఈవిధంగా మాట్లాడడు.   కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో రాహుల్ గాంధీ శల్యసారధ్యం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి శల్యసారధ్యం చేస్తున్నారు. మరిక కాంగ్రెస్ పార్టీకి వెనక్కి తిరిగి చూసుకొనే పనే ఉండదు.

పవన్, నరేంద్ర మోడీకి మద్దతు పలకడం సమర్ధనీయమేనా?

  వామపక్ష భావాలున్న పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ప్రకటించడం, పనిగట్టుకొని అహ్మదాబాద్ వెళ్లి గోద్రా అల్లర్లలో పేరేక్కిన నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు తెలపడం చాలా మంది హర్షించలేకపోతున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులలో ముస్లిం యువకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మూస రాజకీయ ధోరణికి అలవాటు పడిపోయిన కొందరు రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ కి సరయిన రాజకీయ అవగాహన కానీ, పార్టీ కి అజెండా గానీ సరయిన దృక్పధం గానీ ఏవీ లేవని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టినపుడు స్వాగతించినవారే నేడు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవిక దృక్పధం కనబరుస్తూ సరయిన నిర్ణయం తీసుకొన్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.   పవన్ తన జనసేన పార్టీని ప్రకటిస్తున్న రోజునే తన ప్రధానోదేశ్యం అధికారం చెప్పటడం కాదని, కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా తాను ఎన్నికలలో ఓట్లు చీల్చి రాష్ట్ర రాజకీయాలలో మరింత సంక్లిష్ట పరిస్థితి ఏర్పరిచేందుకు రావడం లేదని కూడా అప్పుడే ప్రకటించారు. ఆయన మొదటి నుండి పదేపదే చెపుతున్న ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూసిన్నట్లయితే, ఆయన సరయిన దిశలోనే అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది.   ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే ఆయన కూడా ఓట్లను చీల్చి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చి ఉండేవారు. కానీ ఆయన ఆవిధంగా చేయకుండా, రాష్ట్రంలో తేదేపాకు, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్దపడ్డారు.   అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని పారద్రోలేందుకే దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతు పలికారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని అర్ధమవుతోంది. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు అధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ బలమయిన ప్రత్యామ్నాయంగా నిలిచి ఉంటే, బహుశః బీజేపీకి బదులు ఆయన థర్డ్ ఫ్రంట్ కే మద్దతు తెలిపేవారేమో! ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తున్న సంగతినీ ఆయన పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ఆయనకు మద్దతు ప్రకటించారని భావించవచ్చును.   అంతేగాక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే, అసమర్ధుడు, ఎటువంటి పాలనానుభావం లేనివాడు, అవినీతి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి అయిన రాహుల్ గాంధీ చేతిలోకి దేశం వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదాన్ని నివారించి సమర్ధుడు, మంచి పరిపాలనా దక్షుడు అని నిరూపించుకొన్న నరేంద్ర మోడీకే రాజ్యాధికారం కట్టబెట్టడం సముచితమని పవన్ కళ్యాణ్ భావించినందునే ఆయన తన (వామపక్ష) ఇజాన్ని, స్టార్ ఇమేజ్ ని అన్నిటినీ పక్కన పెట్టి బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజవకాశాలను దెబ్బతీయడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేజిక్కించుకోకుండా అడ్డుపడేందుకు నడుం బిగించారు.   పవన్ తెదేపాకు అనుకూలంగా మాట్లాడటానికి కూడా దాదాపు ఇవే కారణాలు వర్తింపజేసుకోవచ్చును. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే సరయిన నాయకత్వం, సరయిన పార్టీల కాంబినేషన్, వాటి మధ్య పూర్తి అవగాహన అత్యంత అవసరమని ఎవరికయినా తెలుసు. ఆంధ్రలో ఒక పార్టీ, తెలంగాణాలో మరొక పార్టీ, కేంద్రంలో ఈ రెంటికీ పూర్తి విభిన్నమయిన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అదే విషయాన్ని పవన్ నిన్న తన మాటలలో వ్యక్తం చేసారు. బహుశః ఈ ఉద్దేశ్యంతోనే పవన్ రాష్ట్రంలో ఉన్నపార్టీలలో సమర్ధమయినదని భావిస్తున్న తెదేపావైపు మొగ్గు చూపుతున్నారు.   తనకి రాష్ట్రంలో ఎంతమంది వీరాభిమానులు ఉన్నపటికీ కేవలం వారి అండతోనే తన పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం అసాధ్యమనే సంగతి పవన్ గ్రహించినందునే ఆయన చాలా వివేకం ప్రదర్శిస్తూ, తాను తెదేపాకు అనుకూలమని తెలిపారు. అందువల్ల పవన్ మరియు అతని పార్టీ సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి పెద్దగా ప్రాధాన్యతనీయకుండా, రాష్ట్రంలో నిలకడ తేగల పార్టీకే పూర్తి మెజార్టీ దక్కేలా చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఈయవచ్చును.   దీనిని బట్టి పవన్ కళ్యాణ్ చాలా లోతుగా ఆలోచించిన తరువాతనే, పూర్తి విజ్ఞతతో కూడిన నిర్ణయాలు తీసుకొంటున్నారని అర్ధమవుతోంది. ఒక రాజకీయ మూస ధోరణిలో ఆలోచనలు చేసేవారికి ఇటువంటివి జీర్ణించుకోవడం కష్టమే.

రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య చిచ్చు

  తెలంగాణా సెంటిమెంటుని ఎప్పుడు ఏవిధంగా వాడుకోవాలో కేసీఆర్ కి తెలిసినంత బాగా బహుశః మరెవరికీ కూడా తెలియదేమో. కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు ప్రక్రియ కూడా పూర్తయిపోయి ఎన్నికలలో ఒంటరిపోరుకి సిద్దమవుతున్నందున, కేసీఆర్ మళ్ళీ బ్రహ్మాస్త్రం వంటి తెలంగాణా సెంటిమెంటుని బయటకు తీసి ప్రయోగించారు. తెలంగాణా ప్రజల భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టేందుకు ఉద్యోగులు, నదీ జలాల పంపకాలు వంటి సున్నితమయిన అంశాలను కెలికి వదిలిపెట్టారు. ఊహించినట్లుగానే దానికి ఆంధ్ర ప్రాంత నేతల నుండి ధీటుగా స్పందన వచ్చింది. ఎన్నికల గంట మ్రోగక ముందు కేవలం తెలంగాణా పునర్నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు ఆంధ్ర-తెలంగాణాలకు సంబందించిన సున్నితమయిన అంశాల గురించి మాట్లాడటం ఎందుకంటే ప్రజలలో నిద్రాణమయున్న తెలంగాణా సెంటిమెంటుని తట్టిలేపి, తన తెరాసకు అనుకూలంగా మలుచుకోవడానికే. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలనే తాపత్రయంలో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్నఇటువంటి సున్నితమయిన అంశాలను లేవనెత్తుతూ, ప్రజల మధ్య విషబీజాలు నాటుతూ వారి మధ్య మరింత దూరం పెరిగేలా చేస్తున్నారు.   అదేవిధంగా సమైక్యవాదం సెంటిమెంటుతో రాజకీయ లబ్దిపొందాలని జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, అటు నేతలను కానీ, ఇటు ప్రజలను గానీ తన పార్టీ వైపు ఆకర్షించలేక తిప్పలు పడుతున్న ఈ సమయంలో కేసీఆర్ అందించిన ఈ అద్భుతావవకాశాన్నిఅందిపుచ్చుకొంటూ అతనిపై ఎదురుదాడి చేసి సీమాంధ్ర ప్రజల, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నమే చేసారని చెప్పవచ్చును.   తెరాస, జైసమైక్యంధ్ర రెండు పార్టీలకు కూడా ప్రత్యేకంగా ఒక సిద్దాంతం,అజెండా, పార్టీ నిర్మాణం గానీ లేనందున ఎన్నికల వైతరిణిని దాటేందుకు ఈ ఆంధ్ర, తెలంగాణా సెంటిమెంటులనే నావగా చేసుకొంటున్నాయి. కేసీఆర్, కిరణ్ ఇరువురూ కూడా కేవలం తాము మాత్రమే ప్రజాభిప్రాయానికి అద్దం పడుతూ తమ తమ ప్రాంతాల ప్రజల హక్కులకోసం పోరాడుతున్నట్లు, అవతలి వైపు ప్రజలు, మిగిలిన పార్టీల నేతలు అందరూ కూడా దొంగలు, దోపిడీ దారులన్నట్లుగా మాట్లాడుతూ ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు.   తప్పని పరిస్థితిలో అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలు, నేతలూ కూడా ఈ విద్వేష ప్రచార యుద్దంలో పాలు పంచుకోక పరిస్థితి ఏర్పడితే, ఇప్పుడిపుడే ఇరు ప్రాంతాల ప్రజలలో కుదుటపడుతున్న ఉద్వేగాలు, ఉద్రిక్తతలు మళ్ళీ తలెత్తే ప్రమాదం ఉంది. రాజకీయ నేతలు ప్రజల కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటూనే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా దారుణం. ప్రజల మధ్య సఖ్యత పెంచి వారికి సరయిన మార్గదర్శనం చేస్తూ దేశ సౌభ్యాగం కోసం పాటు పడవలసిన నేతలు, పార్టీలు ఆ పని చేయలేకపోయినా, ప్రజల మధ్య చిచ్చు పెట్టగలరని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకొన్నారు.   ఇటువంటి దుష్ట రాజకీయ వ్యవస్థను డ్డీకొని ప్రాంతాలుగా విడిపోతున్న తెలుగు ప్రజలందరి మధ్య సఖ్యత పెంచి ఇరు ప్రాంతాలు పోటాపోటీగా అభివృద్ధి సాధించాలనే ఒక సత్సంకల్పంతో, తపనతో పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయాలలోకి వస్తుంటారు. అయితే ఆశయాలను ఆచరణలో పెట్టలేక అటువంటి వారు విఫలమయిన ప్రతీసారి సదరు రాజకీయ పార్టీలు మరింత బలపడుతుంటాయి. అందువలన ప్రజలే తమ మధ్య చిచ్చుపెడుతున్న నేతలకు, పార్టీలకు ఎన్నికలలో తగిన గుణపాటం చెప్పవలసి ఉంటుంది.

చిరంజీవి, కిరణ్ ల రాజకీయాలు

      ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్ సేల్ గా అమ్మేసుకొని కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని పార్టీని కాపాడేసిన ఆయన విధేయతకు మెచ్చిన సోనియాగాంధీ ఇప్పుడు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించేసి మళ్ళీ పార్టీని కాపాడే బాధ్యతలు అప్పగించేసేసరికి ఆయన హనుమంతుడిలా పొంగిపోతూ కాంగ్రెస్ పార్టీని భుజాన్నేసుకొని ఎన్నికల సంద్రాన్ని లంఘించేందుకు సిద్దమయిపోయారు.   తొండ ముదిరితే ఊసరవెల్లి యినట్లు చిరంజీవి వంటి రాజకీయ అమాయక చక్రవర్తి కూడా రెండుమూడేళ్ళు కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకుపూసుకు తిరగేసరికి అచ్చమయిన దేశముదురు కాంగ్రెస్ నేతలాగే మాట్లాడుతున్నారిప్పుడు. మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వ్యవహారంలో తమ అధిష్టానానికి పూర్తిగా సహకరించారని, అయినప్పటికీ విభజనను ఆపుతానని చెపుతూ తమని కూడా మభ్యపెడుతూనే వచ్చారని ఆరోపించారు. ఆయనకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన చేయాలని నిర్ణయం ప్రకటించగానే రాజీనామా చేసి ఉండాల్సిందని వాదిస్తున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ది గురించి ప్రశ్నిస్తున్న చిరంజీవి కూడా ఆయనకు ఎంత మాత్రం తీసిపోకుండా ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ స్వయంగా చూసారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతుంటే, చిరంజీవి నేటికీ తన పదవిని పదిలంగా కాపాడుకొంటూ పార్టీలోనే ఉంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను తప్పుపడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు. కాకపోతే ఇటువంటి రాజకీయ నేతలందరూ ప్రజలు చాల తెలివయినవారని, విజ్ఞులని పొగుడుతూ వారిని బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేయడం గమనిస్తే వారికి ప్రజల విజ్ఞాత పట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతుంది. 

కిరణ్ మాటల అంతర్యమిదేనా..,

  ఇటీవల జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తరువాత తన పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని తన ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారాన్నిఖండిస్తూ, తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ లో కలిసే అవకాశమే లేదని, తమ పార్టీ అధికారం కోసం కాక కేవలం ప్రజల తరపున పోరాడేందుకే ఏర్పాటయిన పార్టీ అని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే ఆయన తమ పార్టీ కాంగ్రెస్ లో కలవదని చెప్పారు కానీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వదని చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి వ్యవహారాల గురించి ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే ఆయన నోట కాంగ్రెస్ పార్టీ పేరు వినబడిన ప్రతీసారి ప్రజలలో ఆయన నిబద్దత పట్ల, పార్టీ స్థాపించడం వెనుక ఆయన ఉద్దేశ్యాల పట్ల ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరగవచ్చును. కానీ, ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనని చెప్పుకోవవడం చూస్తే, ఆయనకీ తన పార్టీ పట్ల ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో గ్రహించినట్లే ఉంది. ప్రస్తుతం సీమాంధ్రలో రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే, కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి అంత ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది.   ఆయన ముఖ్యంగా ఏపీయన్జీవోల మద్దతు, సమైక్యాంధ్ర సెంటిమెంటుపై ఆశలుపెట్టుకొని పార్టీని స్థాపించారు. కానీ, నేడు ఎన్నికలు, పొత్తులు, రాజకీయ సమీకరణాల హడావుడి మొదలవడంతో, సమైక్యాంధ్ర వేడి క్రమంగా తగ్గిపోయింది. ఇది కిరణ్ పార్టీకి ప్రాధాన్యతని తగ్గించిన మొదటి కారణం అయితే, ప్రజలలో ఆ వేడి తగ్గిపోయినందున, ఆయన నమ్ముకొన్న ఏపీ ఎన్జీవోలు కూడా ఆయన పార్టీకి దూరం అవుతున్నారు. ప్రజలలో, ఉద్యోగులలో ఆదరణ లేని పార్టీకి ఉద్యోగ సంఘనేతలు, రాజకీయ నేతలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది.   ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన కనుసన్నలలో నడిచిన ఏపీ యన్జీవో సంఘాల నేత అశోక్ బాబు కొద్ది రోజుల క్రితమే, ఏదో మిషతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుని కలిసి వస్తే, కిరణ్ కుమార్ రెడ్డిని చివరివరకు వెన్నంటి నడిచిన మాజీ మంత్రి శైలజానాథ్ ని తన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పటికీ, ఆయన కూడా తను తెదేపాలో చేరబోతున్నట్లు చూచాయగా ప్రకటించడం గమనిస్తే, కిరణ్ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో అర్ధమవుతుంది. అందుకే ఆయన తను అధికారం దక్కించుకోవడం కోసం పార్టీని పెట్టలేదని పదేపదే చెపుతున్నారు. అధికారం కోసం కాకపోతే మరి దేనికోసం? అనే ప్రశ్నకు ఆయన చెపుతున్న సమాధానం చాలా పేలవంగా అర్ధ రహితంగా ఉంది.   కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా సోనియా గాంధీకి విధేయుడనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు. ఆయన పార్టీ పెట్టి ఇప్పటికి పదిరోజులవుతున్నా ఆయన మాటలలో నేటికీ అదే విధేయత ఉట్టిపడుతుండటం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. అందువలన, ఆయన కాంగ్రెస్ అధిష్టాన దేవత ఆదేశాల మేరకే ఎన్నికల ముందు హడావుడిగా పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి దిగిన ఆయన ప్రజల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ ప్రత్యర్ధులను అధికారంలోకి రానీయకుండా అడ్డుకొనేందుకు సైంధవుడి పాత్ర పోషిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన తను అధికారం దక్కించుకోవడం కోసం పార్టీని పెట్టలేదని పదేపదే చెపుతున్నారు.   అశ్వత్థామ హతః...కుంజరః అంటే కురుక్షేత్రంలో కౌరవసేనకు నాయకత్వం వహిస్తున్న ద్రోణుడుని మానసికంగా దెబ్బ తీసేందుకు ఎన్నడూ అబద్దం చెప్పడనే గొప్ప పేరుగల ధర్మరాజు, ‘అశ్వత్థామ చనిపోయాడు...’అని ద్రోణుడికి వినపడేలా బిగ్గరగా అరిచి, తరువాత మెల్లగా కుంజరః అంటే (ఆ పేరుగల) ఏనుగు చనిపోయిందని ముగిస్తాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే విధంగా తను పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశ్యం గురించి, దాని లక్ష్యం గురించి పదేపదే చెపుతున్నారు. కానయితే ప్రజలే దానిని గమనించాల్సి ఉంటుంది.

రెండువైపులా జంపింగ్.. జపాంగ్

      కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించడంతో పాటు ఇకపై ఎవరు ఏ పార్టీలో చేరతారో చూద్దామంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విసిరిన సవాలు.. ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ పార్టీ నుంచి ఎదుటి పార్టీకి వెళతారనుకున్న వారిని బుజ్జగిస్తూనే.. తెలంగాణ జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నేతల మద్దతు కూడగట్టేందుకూ టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. ఈ ప్రాంతంలోని ఇతర పార్టీలతో పొత్తులపైనా దృష్టిపెట్టారు. దీంతో పార్టీ నుంచి ఇక ఎవరూ టీఆర్‌ఎస్‌లో చేరకుండా కాపాడుకోవడమే కాకుండా.. తెలంగాణ వాదులను పార్టీలో చేర్పించుకోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తలకుమించిన భారంగా మారింది. మరోవైపు సవాలు విసిరిన కేసీఆర్ సైతం తమ పార్టీలో చేరికలు ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళతారనుకునే నేతల జాబితాను రూపొందించి మరీ వారితో సంప్రదింపులు, బుజ్జగింపులు ప్రారంభించారు. మెదక్ జిల్లా పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రంగంలోకి దిగారు. సోమవారం నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి పార్టీని వీడొద్దని, కాంగ్రెస్‌లో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు.నందీశ్వర్‌ గౌడ్ రెండు రోజుల కిందట కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించారు. ఈ విషయం తెలిసి పొన్నాల, డీఎస్ తదితరులు నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి బుజ్జగించడమే కాకుండా దామోదరతో పాటు నేరుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేయించారు. దాంతో నందీశ్వర్‌ మెత్తబడ్డారు. మరోవైపు.. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన టీఆర్‌ఎస్ నేత ఇబ్రహీంతో కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేర్పించుకోవడానికి సంప్రదింపులు ప్రారంభించారు. ఇబ్రహీం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. టీఆర్‌ఎస్‌తో విభేదిస్తున్న తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాల నేతలను కూడా కాంగ్రెస్‌లోకి రప్పించే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతంను, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను తాజాగా పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడంతో టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌లో పేరున్న నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ పోటీచేయబోతున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ముందుగా దృష్టి సారించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో గట్టి ప్రాబల్యమున్న మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

పాపం కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని, పార్టీ నేతల భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు కూడా అంగీకారించకపోవడంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది. సీమాంద్రాలో ఇప్పటికే దాదాపు తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర ప్రజల ఉసురే తగిలిందో లేక తన నేతల ఉసురు తగిలిందో గానీ ఇప్పుడు తెలంగాణాలో సైతం తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా పరవాలేదు కానీ ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తులకి సిద్దపడుతున్నరనే వార్తలు కాంగ్రెస్ అధిష్టానాన్ని చాలా కలవరపరుస్తోంది. తెలంగాణా ఏర్పాటు తరువాత తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కనీసం పొత్తులకు కూడా అంగీకరించకుండా, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దానికే మద్దతు ఇస్తానని మరో కొత్త హామీ ఇస్తూనే, బీజేపీవైపు చూడటం గమనిస్తే ఆయన హామీ కేవలం కాంగ్రెస్ ని మభ్యపెట్టడానికేనని అర్ధం అవుతోంది. అంటే, కాంగ్రెస్ తెరాస మద్దతు పొందాలనుకొంటే, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తగినన్ని యంపీ సీట్లు మిగిలిన రాష్ట్రాల నుండి గెలుచుకోవలసి ఉంటుందన్నమాట! అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇకపై ఆంధ్ర, తెలంగాణాలలో యంపీ సీట్లు, తెరాస మద్దతు సంగతి పూర్తిగా పక్కనుబెట్టి తనకు ఇంకా పట్టు, బలం ఉన్నమిగిలిన రాష్ట్రాలోనయినా పరిస్థితులు చేయిదాటిపోకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందన్న మాట.   ఒకవేళ బీజేపీ లోపాయికారిగా తెలంగాణాలో తెరాసతో, ఆంధ్రప్రదేశ్ లో తెదేపాతో ఎన్నికల పొత్తుల ఒప్పందాలు గానీ చేసుకొన్నట్లయితే ఇక కాంగ్రెస్ ఖాతా నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 52 యంపీ సీట్లు కూడా జారిపోయినట్లే భావించవచ్చును. అదే జరిగితే, కేంద్రంలో యూపీయే కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే కలలు పగటికలలుగానే మిగిలిపోవడం తధ్యం. ఒకవేళ బీజేపీ తెరాసతో కాక, తెలంగాణాలో కూడా తెదేపాతోనే పొత్తులు పెట్టుకొన్నా, అసలు ఎవరితో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా బీజేపీ, తెదేపా, తెలంగాణా సెంటిమెంటుతో విజయోత్సాహంతో దూసుకుపోతున్న తెరాసను ఎదుర్కొని నిలవడం కష్టం.   నిజానికి సాధారణ పరిస్థితుల్లో అయితే సిటింగ్ టీ-కాంగ్రెస్ యంపీలను ఇతర పార్టీలు ఓడించడం చాలా కష్టం, కానీ ఇప్పుడు కాదు. అయితే వారు నేటికీ తమ పార్టీయే తెలంగాణా ఇచ్చింది గనుక ప్రజలు తమకే ఓటేస్తారని అధిష్టానానికి నమ్మబలుకుతూ, ఆత్మవంచన కూడా చేసుకొంటున్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది గనుక, గత పదేళ్ళలో అది తెలంగాణా ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుని, బయటపడిన కుంభకోణాలను, దాని అసమర్ధ పాలన, అవినీతిని తెలంగాణా ప్రజలు పట్టించుకోరని, మోడీ ప్రభావానికిలోనుకారని కాంగ్రెస్ అధిష్టానం, టీ-కాంగ్రెస్ నేతలు భావించడం తెలివితక్కువతనమే. అయితే ఇక ఇప్పుడు ‘కాంగ్రెస్ చేతులు’ కాలాక ఆకులు పట్టుకొన్నా ప్రయోజనమేమీ లేదు. గనుక, మొండిగా ఎన్నికల యుద్దరంగంలో దిగి తలపడాల్సిందే. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలనే తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం తన ఆంధ్ర, తెలంగాణా నేతల భవిష్యత్తును బుగ్గిపాలు చేసి తద్వారా చివరికి తనను బలిచేసుకోవడం చూస్తే పాపం జాలేస్తుంది.

తెరాస ఒంటరి పోరాటానికి కేసీఆర్ లైన్ క్లియర్

  ఊహించినట్లే కాంగ్రెస్-తెరాసలు పొత్తుల బాధ నుండి కూడా విముక్తి చెందాయి. నిన్నటి ఆ ప్రేమలు, కౌగిలింతలను అప్పుడే మరిచిపోయి, ఆగర్భ శత్రువుల్లా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటున్నారు. కానీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే దానికే మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం విచిత్రం. అయితే, ఒకవేళ కేంద్రంలో బీజేపీ రాలేకపోతే కాంగ్రేసే అధికారంలోకి రావడం సహజం. గనుకనే కేసీఆర్ ఆవిధంగా హామీ ఇచ్చారుతప్ప కాంగ్రెస్ పై ప్రేమతో కాదు.   ఇక, కాంగ్రెస్ పార్టీతో అన్నిబంధాలు తెంచేసుకోవడం కూడా పూర్తయిపోయింది గనుక, ఇక తెలంగాణాలో తమ పార్టీయే అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ మూడు వేర్వేరు వ్యూహాలు అప్పుడే ప్రకటించేశారు కూడా. 1. తెలంగాణా సెంటిమెంటుని మళ్ళీ పతాక స్థాయికి తీసుకువెళ్ళడం. 2. కాంగ్రెస్, తెదేపాలను బలహీనపరచడానికి వలసలు ప్రోత్సహించడం. 3. ఎన్నికల పొత్తులు.   తనను ఇంతవాడిని చేసిన తెలంగాణా సెంటిమెంటుని ఆయన తన రాజకీయ ప్రత్యర్ధులపై మళ్ళీ బ్రహ్మాస్త్రంలా ప్రయోగించారు. తమ ఉద్యమాలు, బలిదానాల వలననే తెలంగాణాను సాధించుకొన్నపటికీ, పూర్తి స్థాయిలో, హోదాలో తెలంగాణా రాష్ట్రం ఏర్పరచకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను దగా, మోసం చేసిందని ఆరోపించారు. అందువల్ల తెలంగాణాకు పూర్తి న్యాయం జరగాలంటే దాని కోసం పోరాడి సాధించిన తెరాసకే ఆ బాధ్యత (?) కూడా అప్పగించాలని హితవు పలికారు. అదేవిధంగా ‘ఆంధ్రోళ్ళతో’ చాలా పేచీలున్నాయన్నారు. తెలంగాణా ప్రజల పక్షపాతి అయిన ఒక్క తెరాస మాత్రమే ఆ పనిని చక్కబెట్టగలదని ప్రజలకు సంజాయించారు. ఇక ఆంద్రోళ్ళ పార్టీ తెదేపాను నమ్మరాదని చెపుతూ తేదేపాకు ఒక ‘ఆంధ్ర ట్యాగ్’ తగిలించేసారు.   తెలంగాణాలోఉన్న సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణావారే అవుతారనే మొన్నటి తన స్టేట్ మెంటులో కూడా మళ్ళీ కొన్నిసవరణలు చేసారు. ‘అక్రమంగా తెలంగాణాలో ఉద్యోగాలు సంపాదించిన ఆంధ్రోళ్ళకు ఇక పెన్షన్లు కూడా ఇస్తూ మేనల్లుడిని మేపినట్లు మేపాలా?’ అని ప్రశ్నించారు. ఇటువంటివే మరికొన్ని ‘పాయింట్లు’ లేవనెత్తారు. ఆ మాత్రం క్లూ ఇస్తే అల్లుకుపోగల మంచి తెలివితేటలు, సత్తా ఉన్న తన పార్టీ నేతలకి తెలంగాణా సెంటిమెంటు రాజేసే బాధ్యతని అప్పగించేశారు. బహుశః ఇక నేటినుండి తెరాస నేతలు ఆ పని మీదనే ఉంటారు.   ఇక ఒకవైపు పొత్తులు పెట్టుకొందామని చెపుతూనే మరోపక్క తమ పార్టీ నేతలని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, జలగం వెంక్రటావు, టీడీపీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తదితరులు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా త్వరలోనే తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పడం ద్వారా, ‘ఆలసిస్తే ఆశాభంగం’ అనే స్ట్రాంగ్ మెసేజ్ కాంగ్రెస్, తెదేపా నేతలకు పంపేరు కూడా. గనుక, ఆ రెండు పార్టీలలో నేతలు నేటి నుండి తెరాసలోకి క్యూ కట్టవచ్చును. వారికి టికెట్స్ ఎరగా వేసి ముందు బయటకి రప్పించగలిగితే ఆ తరువాత వారికి టికెట్స్ ఇవ్వడమా లేదా? అనే సంగతి కమిటీ మీదకు నెట్టేసి చేతులు దులుపుకొనే సౌలభ్యం కేసీఆర్ కిఉంది.   ఇక మజ్లిస్ ‘తెలంగానోళ్ళ’ పార్టీయే నని సర్టిఫికేట్ జారీ చేసి, ఆపార్టీతో ఎన్నికల పొత్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఎందుకంటే తెలంగాణాలో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ కి తెరాస బాష అర్ధం కాదు. కనుక ఆ ఖాతాలను సమర్ధంగా నిర్వహిస్తున్న మజ్లిస్ తో దోస్తీ చేసుకొంటే, రేపు ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటుకి కావలసిన మద్దతు దొరుకుతుంది. పైగా మజిల్స్ మళ్ళీ కాంగ్రెస్ వైపు దిక్కులు చూడకుండా కట్టడి చేయవచ్చును కూడా. ఇక సీపీఐకి ‘ఫ్రెండ్లీ పార్టీ’ అని ఒక సర్టిఫికేట్ జారీ చేసేసినందున, ఆ పార్టీ కూడా ఎక్కడికీ పోకుండా తెరాస గుమ్మంలోనే పడిఉంటుంది.   ఈవిధంగా కేసీఆర్ ఎన్నికలకి అవసరమయిన ప్రాధమిక అవసరాలన్నీ ఏర్పాటు చేసుకొన్నారు. ఇక మిగిలిన పనిని ఆయన అనుచరులు దివ్యంగా చక్కబెట్టేయగలరని అందరికీ తెలుసు.

ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన పవన్ ప్రసంగం

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన ప్రసంగంలో కొంచెం నాటకీయత ఉన్నపటికీ, రాజకీయ మూస ప్రసంగాలకు పూర్తి భిన్నంగా, సగటు భారతీయ పౌరుడి ఆలోచనలకీ,ఆవేశానికీ,ఆవేదనకీ, ఆక్రోశానికి అద్దం పడుతున్నట్లు సాగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల ముందు తను తాను పూర్తిగా ఆవిష్కరించుకొన్నారని చెప్పవచ్చును. ఆయన మాటలు హృదయంలో నుండి వచ్చినవి. మనస్పూర్తిగా మాట్లాడినవి. కనుక అవి అభిమానులకు, ప్రజలకు సరిగ్గానే చేరాయని భావించవచ్చును. ఆంధ్ర, తెలంగాణా, రాష్ట్ర విభజన, హిందూ ముస్లిం, కులాలతో సహా ఏ రాజకీయ నాయకుడు దైర్యం చేసి మాట్లాడలేని అనేక సున్నితమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడి నిజంగానే మంచి దమ్మున్న రాజకీయ పవర్ స్టార్ అనిపించుకొన్నారు.   తను రాజకీయ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసి కొందరు కాపు కుల సంఘ నేతలు తనకు మద్దతు ఈయమని చెప్పడాన్ని ఆయన చాలా గాటుగా ఎవరూ ఊహించని రీతిలో ప్రశ్నించారు. “నన్ను నేను ఏ కులానికో, మతానికో చెందిన వాడినని ఎన్నడూ భావించలేదు. అయినా నేను వారిని మద్దతు ఈయమని అడిగానా? కులాల పేరు చెప్పుకొని ఓట్లు అడుకోవలసి వస్తే నేను అసలు రాజకీయాలలోకి వచ్చే వాడినే కాను,” అని అన్నారు.   రాష్ట్ర విభజన చేయడంలో కాంగ్రెస్ కబరచిన నిర్లక్ష్య ధోరణిని, తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన చులకన భావాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎండగట్టారు. గత పదేళ్ళుసాగుతున్నతెలంగాణా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసినందున అనేక వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. అటు తెలంగాణా ప్రజలకీ ఆనందం కలిగించక, ఇటు సీమాంధ్ర ప్రజలకు ఆనందం కలిగించని విధంగా విభజన చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకొందని విమర్శించారు.   కాంగ్రెస్ అధిష్టానంలో చిదంబరం, జైరామ్, షిండే, అహ్మద్ పటేల్, మోయిలీ తదితరులు తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరిని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో మన రాష్ట్ర నాయకులందరూ వ్యవహరించిన తీరు చూసి తనకు చాలా అసహ్యం కలిగిందని, వారి మీద కోపంతోనే రాజకీయ ప్రవేశం చేయవలసి వచ్చిందని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలుగా విడిపోతున్న తెలుగు ప్రజలను ఈ కపట రాజకీయ నాయకుల బారి నుండి కాపాడేందుకే పార్టీ పెట్టానని ఆయన అన్నారు.   తన పార్టీలో రాజకీయ బఫూన్లకు, జంప్ జిలానీలకు చోటు కల్పించనని స్పష్టం చేసారు. దేశ సమగ్రత, రాజకీయాలలో మంచి మార్పు తేవాలనే తపన ఉన్నవారేవరయినా జనసేనలోకి ఆహ్వానితులేనని తెలిపారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనుకొంటున్న రాహుల్ గాంధీ ముందుగా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో తన నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి నేర్చుకోమని సలహా ఇచ్చారు. ప్రజల మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ చిచ్చుపెడుతూ అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.   ఒక్క కాంగ్రెస్ పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో అయినా తాను చేతులు కలిపేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ నిర్మాణం మొదలు పెడతానని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆయన ప్రజలు ఆశిస్తున్న మహిళకు భద్రత, మెరుగయిన వైద్య సేవలు, జవాబుదారీ గల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, స్వచ్చమయిన పాలన అందించడం తన పార్టీ లక్ష్యాలుగా చెప్పుకొన్నారు.

పొత్తులపై పెదవి విప్పలేని కిరణ్, చంద్రబాబు

  మొన్న చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలలో ఇద్దరూ కూడా జాతీయ స్థాయిలో తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటారో లేదా ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ కూటమికి మద్దతు ఇస్తారనే విషయం చెప్పకుండా దాటవేశారు.   బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీ సీమాంధ్రకు ప్యాకేజీ సాధించడం గురించి రెండు పదాలు మాట్లాడి ముగించేసారు. తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడితే సభలో ఉద్రిక్తతలు ఏర్పడి సభ రసాభాసగా మారే ప్రమాదం ఉంది. అందుకే బీజేపీతో పొత్తుల ప్రసక్తి తేకుండా దాటవేశారు. బీజేపీపై ఆగ్రహంగా ఉన్నసీమంద్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే బాధ్యత బీజేపీది, నరేంద్ర మోడీదే తప్ప చంద్రబాబుది కాదు. నరేంద్ర మోడీ తన తొలి పర్యటనలో సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకొని వారిని ప్రసన్నం చేసుకోగలిగితే, ఆ పార్టీతో పొత్తులకు చంద్రబాబు సిద్దపడతారు. అప్పుడే ఆయన ఆ పార్టీ గురించి ఇటువంటి బహిరంగ సభలలో మాట్లాడే అవకాశం ఉంటుంది. మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ తప్పకుండా సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకొంటారు గనుక, తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కూడా దాదాపు ఖాయమనే భావించవచ్చును. అందువల్ల తదుపరి సభలలో చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసి గర్జించినా ఆశ్చర్యం లేదు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే యూపీఏ కూటమితో చేతులు కలుపుతానని చెప్పే దుస్సాహసం చేయలేదు. చేస్తే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకొన్నట్లే అవుతుంది. ఇక కిరణ్ సమైక్యవాదమనే పునాది మీద తన పార్టీని నిర్మించుకొన్నారు గనుక రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో కూడా ఆయన పొత్తులు పెట్టుకోలేరు, కనీసం మద్దతు ఇస్తానని కూడా హామీ ఇవ్వలేరు. వామపక్షాలు ఎంతో కష్టపడి థర్డ్ ఫ్రంట్ నిర్మిస్తే, అందులో అరడజనుకు పైగా ఉన్న ప్రధాని అభ్యర్ధులందరూ కలిసి దానినొక కప్పల తక్కెడగా మార్చేయడంతో, అది ఉన్నా లేనట్టే తయారయింది. అందువల్ల జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీయే కూటములకు సరయిన ప్రత్యామ్నాయం లేదు గనుక కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడలేని అసక్తతలో ఉన్నారు.   ప్రస్తుతానికి ఆయన స్వంత కుంపటి పెట్టుకొని వేరుగా వండుకొంటున్నపటికీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీతోనే పంక్తి భోజనానికి సిద్దమయిపోతారనే విషయంలో అనుమానం లేదు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన తన సమైక్య పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఐక్యం చేయడంలో ఆలస్యమయినట్లయితే, దాని నేతృత్వంలో నడుస్తున్న యూపీఏ కూటమికే ఆయన మద్దతు పలుకుతారు తప్ప బీజేపీ కాదు. అందుకు సోనియా గాంధీ అనుమతించదు కూడా! అందువల్ల ఈ పరిస్థితుల్లో ఆయన యూపీఏ, ఎన్డీయే కూటములతో పొత్తులు, మద్దతు గురించి పెదవి విప్పితే అది ఆయన పార్టీకే చేటు కనుక మాట్లాడలేరు. అయితే అంతవరకు కూడా ప్రజలను ఆకట్టుకొని ఓట్లు దండుకోనేందుకు జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన కూడా కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శిస్తూనే ఉంటారు.

సమైక్యవాదమే కిరణ్ పార్టీకి ప్రతిబందకం కానుందా?

  కిరణ్ కుమార్ రెడ్డి తన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ని నిన్నరాజమండ్రీలో అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆయన తన పార్టీని సమైక్యవాదం పునాది మీద నిర్మించుకోవడంతో ఆయన ప్రసంగమంతా ఆ ప్రకారమే సాగవలసి వచ్చింది. సాధారణంగా ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్నసమయంలో ఆ పార్టీ అధినేత తన పార్టీ లక్ష్యాలను, అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏమి చేయాలనుకొంటున్నదీ వివరిస్తారు. కానీ, కిరణ్ సమైక్య సెంటిమెంటును ఉపయోగించుకోవాలనే తపనలో అవేవీ తన ప్రసంగంలో వివరించలేకపోయారు. పైగా ఆంధ్ర, తెలంగాణాలుగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయన తనకు 25మంది యంపీలను ఇస్తే, ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పడం హాస్యస్పదం, ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.   పదవులు, అధికారం కోసం పార్టీ పెట్టలేదని చెపుతూనే పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన 25మంది యంపీలను ఇవ్వమని కోరడం, తన పార్టీనే ఎన్నికలలో గెలిపించమని కోరడం హాస్యాస్పదం. ఆయన తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతోందో వివరించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా, ఎవరి సహకారంతో అభివృద్ధి చేస్తారో తెలిపి ఉంటే బాగుండేది. కానీ, ఆయన అధికారంలోకి రావడానికి సమైక్యవాదాన్ని పెట్టుబడిగా పెడుతున్నందున, ఇటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తే కధలో రసాభంగం అవుతుంది.   ఆయన ఈ సమయంలో సమైక్యవాదంతో పార్టీని పెట్టినందున, రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా విభజనను అంగీకరించలేని పరిస్థితిని, విభజన తరువాత ఏర్పడుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితిని ఆయనే చేజేతులా సృష్టించుకొన్నారని చెప్పవచ్చును. సరిగ్గా ఎన్నికల సమయంలో బరిలోకి దిగుతున్న ఆయనకు ఇదే అంశం పెద్ద అడ్డంకిగా మారవచ్చును. ఎందుకంటే ఆయన ప్రత్యర్ధులు అందరూ రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణం గురించి కధలు కధలుగా వర్ణిస్తూ ప్రజలను ఆకట్టుకొంటుంటే, కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రతీ సభలో తన సమైక్యవాదం, తను చేసిన త్యాగాలు, సాధించిన ఘనకార్యాల గణాంకాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఆ విషయాలను ప్రస్తావించలేకపోతే, ఆయన ఎంత గొంతు చించుకొన్న ప్రజలను ఆకట్టుకోలేరు. ఒకవేళ తన ఘన కార్యాల గురించి నోరారా చెప్పుకొందామని ఆశపడినా  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా తన ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లు తగిలించేసినందున, అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతాయి, తప్ప ఆయన వాటి గురించి గట్టిగా చెప్పుకోలేరు.    ఇక తన ప్రసంగంలో రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని నిశితంగా విమర్శించిన ఆయన సోనియా, రాహుల్ గాంధీల గురించి పల్లెత్తు మాటనలేదు. పైగా తెదేపా,వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించడం వలన ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వచ్చినట్లే అనిపించింది. రాష్ట్ర విభజన చేసిన సోనియా గాంధీని పెద్దమ్మ అని ఆయన అనడం ఆమెను విమర్శిస్తున్నట్లు కాక గౌరవిస్తున్నట్లే ఉంది.   రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్విఘ్నంగా జరిగేందుకు తనవంతు సహాకారం అందించిన తరువాతనే ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటవచ్చారనే ఆరోపణలకు ఆయన తన ప్రసంగంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి పుట్టుకొచ్చిన ఆయన, ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోదని గట్టిగా చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన పట్ల ప్రజలలో ఉన్న అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. అదేవిధంగా ఎన్నికల ముందు, తరువాత తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీతో చేతులు కలుపుతుందనే విషయాన్ని కూడా ప్రస్తావించకుండా దాటవేశారు.   కిరణ్ కుమార్ రెడ్డి తన సమైక్యవాదంతో ప్రజల మనసులు, తద్వారా వారి ఓట్లు కొల్లగొట్టుకొందామని ప్రయత్నించి చివరికి దానికే బందీ అయిపోయి దానివాలనే నష్టపోయేలా ఉన్నారు.

బాలకృష్ణ ఎక్కడి నుండి దేనికి పోటీ చేస్తే మంచిది?

  ఇటీవల బాలకృష్ణ అభిమానులు ఆయనకి పార్టీలో తగిన హోదా కల్పించి ఆయనకు వెంటనే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అదునుగా మీడియాలో ఒక వర్గం బాలకృష్ణకు చంద్రబాబుకి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, అందుకే ఆయనని లిజండ్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించలేదని ప్రచారం చేయడంతో బాలకృష్ణ స్వయంగా కలుగజేసుకొని తమ మధ్య ఎటువంటి అభిప్రాయ బేధాలులేవని ప్రకటించవలసి వచ్చింది.   అయితే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళడంతో ఆయన కూడా స్పందిస్తూ “ఆయన (బాలకృష్ణ) కి టికెట్ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆయన యంపీ లేదా యం.యల్యే. స్థానాలలో దేనికి పోటీ చేస్తానన్నా టికెట్స్ ఇస్తాను. దేనికి పోటీ చేయాలో ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయన సేవలు పార్టీకి అత్యవసరం. ఆయనకు పార్టీలో ఎప్పుడు కూడా సముచిత స్థానం గౌరవం ఉంటుంది,” అని అన్నారు.   ఇదివరకొకసారి బాలకృష్ణ తాను కృష్ణా జిల్లా నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. కానీ, ఆ తరువాత మళ్ళీ ఆ ప్రసక్తి తేకపోవడంతో, ఆయన అభిమానులు కలవరపడి ఉండవచ్చును. ఒకవైపు కాంగ్రెస్ నుండి గుంపులు గుంపులుగా పార్టీలోకి వచ్చిపడుతున్న నేతలు కొన్ని టికెట్స్ ఎగరేసుకొని పోతుంటే, ఒకవేళ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే ఆ పార్టీకి మరికొన్నిటికెట్స్ పంచి ఇవ్వవలసి ఉంటుంది. ఇక పార్టీలో ఉన్ననేతలకీ, వారు రికమండ్ చేసే వారి బంధు మిత్ర, పుత్ర కోటికీ కూడా టికెట్స్ పంచుకుపోతే చివరికి తమ అభిమాన నటుడు బాలయ్య బాబుకి టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనే ఆందోళన చేతనే వారు ఆవిధంగా డిమాండ్ చేసి ఉండవచ్చును.   అయితే బాలకృష్ణ స్వయంగా ఎన్నికలలో పోటీ చేస్తానని చెపితే అది తేదేపాకు లబ్ది చేకూరుస్తుందే తప్ప నష్టం కలిగించదు. ఆసంగతి చంద్రబాబుకే కాదు బాలయ్య అభిమానులకీ తెలుసు. అందువలన ఆయన వద్దనుకొంటే తప్ప ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అయితే, ఆయన శాసనసభకు పోటీ చేయడం మంచిదా లేక లోక్ సభకు చేయడం మంచిదా? అని ఆలోచిస్తే శాసనసభకు పోటీ చేయడమే ఆయనకు, పార్టీకి కూడా మంచిదని చెప్పవచ్చును. ఎందుకంటే, ఉత్తరాదివారితో నిండి ఉన్న లోక్ సభలో నెగ్గుకురావాలంటే అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు బాషలలో ప్రసంగించే నేర్పు, రాష్ట్ర, దేశ రాజకీయలపై మంచి పట్టు చాలా అవసరం. లేకుంటే చాలా ఇబ్బంది పడక తప్పదు. ఇటీవల ఆయన సోదరుడు హరికృష్ణ రాజ్యసభలో తన అభిప్రాయాలను చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అదే ఆయన శాసనసభకు పోటీ చేసినట్లయితే దానివల్ల ఆయనకు, పార్టీకి కూడా చాల ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించే అవకాశము కలుగుతుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితరులు ఈ సారి ఎన్నికలలో చక్రం తిప్పేందుకు సిద్దం అవుతున్నందున, బాలకృష్ణ కూడా తెదేపా తరపున శాసన సభకు పోటీ చేయడమే ఉత్తమం.   ఇక ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలని ఆలోచిస్తే ఎవరైనా కృష్ణా జిల్లా నుండో లేదా హిందూపూర్ నుండో చేయాలని చెప్తారు. కానీ ఆయన తెదేపా పటిష్టంగా ఆ రెండు ప్రాంతాల నుండి గాకుండా శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూల్ లేదా ప్రకాశం జిల్లాలో ఏదో ఒక చోట నుండి పోటీ చేయడం వలన అక్కడ పార్టీ బలపడటమే కాకుండా ఆయనకీ, పార్టీకి కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది.   ఇక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి గురించి అభిమానులు కోరేముందు పార్టీ పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది. త్వరలో తెదేపా ఆంధ్ర తెలంగాణా శాఖలను ఏర్పాటు చేసినప్పుడు, చంద్రబాబు రెంటికీ కలిపి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అప్పుడు ఆంద్ర, తెలంగాణా శాఖలకు తప్పనిసరిగా తన స్థానంలో కొత్త అధ్యక్షులను నియమించవలసి ఉంటుంది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలలో బాగా ఆరితేరిన వ్యక్తి మాత్రమే పార్టీని ఒక్క త్రాటిపై నడిపిస్తూ ప్రతిపక్షాలను ఎదుర్కొని నిలవగలరు. పైగా నేటికీ బాలకృష్ణ తన సినిమాలపైనే ఇంకా దృష్టి లగ్నం చేసి ఉన్నందున, ఆయన అభిమానులు ఆయనకి పార్టీలో కీలకమయిన బాధ్యతలు ఆశించడం వలన ఆయన రెంటికీ న్యాయం చేయడం కష్టమవుతుంది.   ఇటువంటి కీలకమైన, క్లిష్ట పరిస్థితుల్లో బాలకృష్ణ అభిమానులు ఆయనకు పార్టీ అధ్యక్షపదవి గురించి వివాదం రేపితే అది ఆయనకీ, పార్టీకి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అదును కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ఒక చక్కటి ఆయుధం అందించినట్లవుతుంది. అందువల్ల వారు ప్రస్తుతం తమ అభిమాన సింహాన్ని ఎక్కడి నుండి ఏ స్థానానికి పోటీ చేస్తే మంచిదో అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఆయనకీ, పార్టీకి కూడా మేలు చేకూర్చినవారవుతారు.

కాంగ్రెస్, తెదేపా, తెరాస మరియు ఓ దళిత ముఖ్యమంత్రి

  ఇంతవరకు తెలంగాణా అంశంతో దూసుకుపోతున్న కేసీఆర్, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి పదవీ రెండూ ఎగురేసుకుపోయెందుకు సిద్దం అవుతుండటంతో, ఇప్పుడు కాంగ్రెస్ అనధికార రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ లా వ్యవహరిస్తున్న జైరామ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే దళితుడుని తెలంగాణాకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా అంశంతో తీవ్రంగా నష్టపోయిన తెదేపాను బ్రతికించుకోవడానికి చంద్రబాబు కూడా తెదేపా గెలిస్తే బీసీకి చెందిన వ్యక్తిని తెలంగాణాకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణా ఏర్పడితే దళితుడని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు తానే ముఖ్యమంత్రి కావాలని తన అనుచరులచేత డిమాండ్ చేయిస్తుండటంతో, ఆయనను ఇరుకున బెట్టేందుకు వారిరువురూ ఆవిధంగా ప్రకటించారు.   ఒకవేళ కేసీఆర్ వీరి దెబ్బకు వెనక్కి తగ్గినట్లయితే, ఆయనకే కాదు ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా మొట్ట మొదట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా పోతుంది. అదే జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ఓ డజను మంది ఏవిధంగా కీచులాడుకొంటున్నారో, అదేవిధంగా తెరాసలో ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాటలు మొదలవవచ్చును. ఇక తెలంగాణాలో అధిక శాతం వెనుకబడిన ప్రజలే ఉన్నందున, వారిని కాదని ఉన్నత వర్గానికి చెందిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అధికారం చెప్పట్టనీయకుండా వారిపై ఆయా వర్గాల నుండి ఒత్తిడి తెచ్చేందుకు కూడా కాంగ్రెస్, తెదేపాల ఈ వ్యూహం పనిచేస్తుంది. ఒకవేళ కేసీఆర్ మొండిగా తాను, తన కుటుంబసభ్యులే అధికారం చేపడదామని ప్రయత్నిస్తే, కాంగ్రెస్, తెదేపాలు యస్సీ, బీస్సీలకు పెద్దపీట వేస్తామని చెపుతున్నందున ఆయ వర్గాలు తమవైపే ఆకర్షితులవుతారని భావిస్తున్నాయి.   అయితే, టీ-కాంగ్రెస్ లో అనేకమంది ఇతర వర్గాలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకొని ఉన్నదున, వారందరూ కలిసి జైరామ్ రమేష్ చేతనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం ప్రకటన వెనక్కి తీసుకొనేలా చేసారు గనుక, అది తేదేపాకు సానుకూలంగా మారింది. తెదేపాలో అగ్ర కులాలతో బాటు బీసీలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ కాంగ్రెస్, తెరాసలు ఈసారి పదవులు, టికెట్స్ పంపిణీలో అగ్రకులాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, తెలంగాణా జనాభాలో అధిక శాతం ఉన్నబీసీలకు తెదేపా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలంగాణాలో మళ్ళీ బలం పుంజుకోగలదని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ తెదేపా-బీజేపీల మధ్య పొత్తులు కూడా ఖరారయినట్లయితే, తెలంగాణాలో మంచి క్యాడర్ బలం ఉన్న ఆ రెండు పార్టీలు ఒక బలీయమయిన శక్తిగా అవతరించవచ్చును.   కానీ, అపర చాణుక్యుడుగా పేరొందిన కేసీఆర్, త్వరలోనే వీరి ఎత్తులకు పైఎత్తులు వేసి అవలీలగా ఈ సమస్య నుండి బయటపడటం తధ్యం. బహుశః ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకొని అటు కాంగ్రెస్, ఇటు తెదేపాలను ఒకేసారి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారేమో? కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు మొదటి నుండి తెదేపాతో పొత్తులను వ్యతిరేఖిస్తున్నారు గనుక ఒకవేళ తెరాస పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎగిరిగెంతేసి దాని ఒళ్ళో వాలిపోవచ్చును. బీజేపీ కూడా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత శక్తి, ఆసక్తి లేనందున, తెరాస-బీజేపీల మధ్య పొత్తులు కుదరడం కూడా తేలికే. అప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలు బలహీనపడవచ్చును. కానీ కేసీఆర్ ముందు తన దళిత ముఖ్యమంత్రి వాగ్దానాన్ని తెలివిగా ఏవిధంగా గట్టున పెడతారో చూడాలి. బహుశః ఆ వర్గానికి చెందిన వారికి వరాలు, హామీలు గుప్పించి వారి చేతనే తనే ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ చేయించుకొంటారేమో!