జగన్ కు వాసిరెడ్డి పద్మ షాక్

ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!

సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.

80 ఏళ్ల‌కు గమ్యం చేరిన పెయింటింగ్!

ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!

పవార్ సారథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్?

ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బడ్జెట్ రెడీ సంక్షేమానికి పెద్ద పీట?

తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.

 ప్రచారం ముగిసింది.. ఇక పోరాటం మిగిలింది..

అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  

నేనూ హిందువునే..! ఓట్ల కోసం నేతల నినాదం 

సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.

కేరళ సీఎంపై గోల్డ్ స్మగ్లింగ్ మచ్చ.. మరి బీజేపీ పాగా వేస్తుందా.. తాజా సర్వేలో ఏం తేలిందంటే ..?

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        

శశికళ సన్యాస వ్యూహం 

రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..

హస్తం పార్టీలో.. కుస్తీ  పోటీలు

కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.

కేరళలో మళ్లీ ఎర్ర జెండేనా!

పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    

బెంగాల్లో బీజేపీ గెలిస్తే  తెలంగాణలో ప్రకంపనలే!

కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..

 అధ్యక్ష తరహా పాలన! మోడీ మనసులో మాట..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.

విశాఖలో కేపిటల్ లేనట్టేనా? అమరావతి ఊపిరి పీల్చుకో..

అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 

పంచాయతీ ముగిసింది..ప్రజలు గెలిచారు!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  

కరోనా సెకండ్ వేవ్..! తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్..

రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు. శానిటైజర్లు రాసుకోవడం మానేశారు. మనకేం కాదులే అనే ధీమా. అందుకు తగ్గట్టే కొంతకాలం పాటు కొవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు అస్సలు లేదు. ఇదే అంతా చేస్తున్న తప్పు. కరోనా ఎక్కడికీ పోలేదు. మనతోనే ఉంది. మనమధ్యే మాటు వేసి ఉంది. వేటాడే పులి రెండు అడుగులు వెనకకు వేసినట్టు.. కాస్త సైలెంట్ అయింది అంతే. ఇప్పుడు అదును చూసి సెకండ్ వేవ్ తో మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది.  ఆ మేరకు రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. మార్చి మొదటి వారం నుంచి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య  హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలో నైతే మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. ముంబైలో మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొవిడ్ కేసులు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కరోనా ముంచెత్తుతోంది. కరీంనగర్‌ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మంది కొవిడ్‌ బారినపడటం షాక్ కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 10 మందికి కరోనా సోకడం కలకలంగా మారింది. ఇలా వేగంగా మహమ్మారి వ్యాపిస్తుండటం పొంచి ఉన్న సెకండ్ వేవ్ కు ముందస్తు సిగ్నల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే.. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? ఇది కొత్త స్ట్రెయినా? ముందుముందు మరింత ప్రమాదం తప్పదా? అనే భయాందోళనలు అందరిలోనూ. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. తెలంగాణలో సడెన్ గా కేసులు నమోదవడం కంగారు పెట్టిస్తోంది. తెలంగాణ, ఏపీలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్న కేసుల కంటే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు మరింత అధికం. నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి పెరిగి వైరస్ కు వాతావరణం అనుకూలంగా మారింది. అందుకే.. కేసులు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ లెక్కన మార్చి నెలలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వేత్తలకే కొత్త స్ట్రెయిన్ మీద సరైన అవగాహన లేని ప్రస్తుత తరుణంలో ఇక సామాన్య ప్రజలు ఛాన్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరమే. అందుకే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటే మంచిది. కరోనా లేదని బిందాస్ గా ఉండకుండా.. కొవిడ్ ఎలాగైనా రావొచ్చనే అనుమానంతో అప్రమత్తంగా ఉంటే బెటర్. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జాగ్రత్తే.. కొవిడ్ నుంచి రక్ష.   

పోలీసింగ్ లో కాదు.. పట్టపగలు హత్యల్లో ఫస్ట్! మరో బీహార్ లా తెలంగాణ?

నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం. పట్టపగలు దారుణ హత్యలు. తల్వార్లు, వేట కొడవళ్లతో మనుషులను నరకడమేంటి? ఈ తెలంగాణకు ఏమైంది? ఏమిటీ అరాచకాలు?  పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఖాకీలంటే భయం పోయిందా? కొందరు ఎందుకింతలా బరితెగిస్తున్నారు?. వరుసగా జరుగుతున్న ఘటనలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు  అదుపు తప్పుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాప్స్ కు.. పట్టపగలే జరుగుతున్నమర్డర్లు  మచ్చగా మారుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్లీ పోలీసింగ్  విఫల ప్రయోగమా? తెలంగాణ మరో బీహార్ లా మారుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసు సంచలనం. అంతకు మించి దారుణం. పట్టబగలు, నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగా నరికి నరికి చంపేశారు దుండగులు. హత్య చేసిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. విచక్షణారహితంగా కత్తి పోట్లతో విరుచుకుపడ్డారు. ఆ మనుషులు మృగాళ్లలా  ప్రవర్తించారు. మహిళను సైతం అత్యంత పైశాచికంగా చంపేశారు. ఆ మారణకాండను అక్కడున్న జనమంతా నోరెళ్లి బెట్టి చూశారే కానీ, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. నడిరోడ్డు మీదే మర్డర్ జరగడంతో.. అటుగా వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. రెండు ఆర్టీసీ బస్సులు ఆగి పోయాయి. వాటి నిండా జనం ఉన్నారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి.. ఆ మర్డర్ సీన్ ను తమ మొబైల్ లో వీడియో తీశారే కానీ, కనీసం అరవడమో, ఆపడమో, అడ్డుకోవడమో చేయలేదు. నడిరోడ్డుపై కత్తులతో మర్డర్ జరగడం తెలంగాణలో ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు. 2018 సెప్టెంబర్ 26న హైదరాబాద్ అత్తాపూర్ లోనూ అచ్చం ఇలాంటి దారుణమే జరిగింది. కిషన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ లు కలిసి రమేశ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. మెట్రో పిల్లర్ కు సమీపంలోనే, పట్టబగలే, వందలాది మంది జనం చూస్తుండగానే జరిగిన ఈ మర్డర్ అప్పట్లో సంచలనం స్పష్టించింది. ఆ సమయంలోనూ జనమంతా ఆ మర్డర్ ను కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ అడ్డుకోలేదు. కసిగా గొడ్డలితో నరికి చంపి.. ఆ తర్వాత తీరిగ్గా నిందితులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బీహార్ తరహా హత్య అంటూ అప్పట్లోనే ఆ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లాయర్ దంపతుల మర్డర్ తో మరోసారి తెలంగాణలో బీహార్ తరహా హత్యలంటూ చర్చ జరుగుతోంది. 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్ష్యతో ప్రణయ్ ను కిరాతకంగా మర్డర్ చేయించాడు అమృతరావు.  సుపారీ గ్యాంగ్ వేట కొడవలితో ప్రణయ్ ను ఆసుపత్రి ప్రాంగణంలో నరికి చంపేసింది. ఆ కేసు తెలంగాణను షేక్ చేసింది. 2021 జనవరి 28న జనగామ జిల్లా కేంద్రంలో  దారుణం చోటుచేసుకుంది.  జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అక్కడే మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నాలుగు ఘటనలే కాదు.. కెమెరాలకు చిక్కని కేసులు ఇంకా అనేకం. ఏ ఘటనకు అదే అత్యంత దారుణం. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ భేష్ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అలాంటిది ఆయన పార్టీ మండల స్థాయి నేత ఇలా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ.. ఏకంగా హైకోర్టు లాయర్లను హత్య చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపైనే పరోక్ష దాడి అని అంటున్నారు. అందుకే, హైకోర్టు సైతం ఘటనపై సీరియస్ గా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. న్యాయవాది దంపతుల కేసులో పోలీసుల ఉదాసీన వైఖరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీహారులోనే ఇలా జరుగుతుందని.. తమకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని బెదిరించడం, చంపడం అక్కడ కామనేనని.. ఇప్పుడు తెలంగాణలోనూ బీహార్ లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తామని.. ఆటవిక తెలంగాణ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. భూముల ఆక్రమణలు, నడిరోడ్డుపై మర్డర్లతో తెలంగాణ బీహార్ నే మించేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమని.. పాలకుల చేతగాని తనం వల్లే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలంగాణ మరో బీహార్ లా మారిపోతోంది.

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలుగు రాష్టాల నుంచి ఎవరికో బెర్త్ ?

మరో పక్షం రోజుల్లో ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఖరారు అయిందా అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. “మార్చి మొదటివారంలో మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా ఉంటుంది, ఇదులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని  పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ లేదా పునఃవ్యవస్తీకరణ ఉంటుందని వార్తలు వచ్చినా, ఓ వంక ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళన, రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న సంఘటనలు,  మరో వంక కొవిడ్ కారణంగా అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు ఇంకా పూర్తిగా సర్డుకోక పోవడం వంటి అనేక కారణాల చేత మంత్రి వర్గవిస్తరణ అప్పట్లో వాయిదా పడిందని అంటున్నారు. ఈ నెల 15తో బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసాయి. విశ్రాంతి అనంతరం మలివిడత సమావేశాలు మార్చి 8 తేదీన ప్రారభమవుతాయి. ఈనేపధ్యంలో మార్చి మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్టాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అయినా మంత్రి వర్గంలో స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సిఎం రమేష్, టీజీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే, తెలంగాణలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకశం ఉందని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకుని, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమల దళం, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాగానే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్’ కి, తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఎపీలోనూ కాపు వర్గానికి చెందిన సోము వీర్రజును పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో పాటుగా, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ (జన సేన)తో పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో ఏపీలో సీఎం రమేష్’కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీజీ వెంకటేష్ పేరుకూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎం రమేష్’ వైపుకే క్యాస్ట్ కాటా మొగ్గుచూపుతోందని, సో .. ఇతర పరిణామాలు ఏవీ ప్రతిబంధకం కానీ పక్షంలో ‘సీఎం బనేగా మినిస్టర్’ అనుకోవచ్చని అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికివస్తే, ధర్మపురి అరవింద్’ పేరుతొ పాటుగా బండి సంజయ్ పేరు వినిపిస్తున్నపప్పటికీ, అయన ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసులలో తప్పించి ఒకే వ్యక్తి రెండు పదవులు అనేది పార్టీ  విధానాలకు విరుద్ధం. కాబట్టి,ధర్మపురినే అదృష్టం వరిస్తుందని పార్టీ వర్గాల సమాచారం. కిషన్ రెడ్డి శాఖ మార్పు ? ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకైక మంత్రిగా ఉన్న హోం శాఖ సహాయ మంత్రి క్రిషన్ రెడ్డి, పని తీరు పట్ల హోం మంత్రి అమిత్ షా అంత సంతృప్తి కరంగా లేరని అంటున్నారు. అత్యంత కీలక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్’లో గడపడం కూడా ఆయనకు నచ్చడం లేదని, కాబట్టి కిషన్ రెడ్డి శాఖ మార్పు ఖాయమని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కిషన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించడం కారణంగా చూపింఛి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.  

రేవంత్ ఉప్పెన.. జస్ట్ టీజర్ మాత్రమే..

ఒక్కడు కదిలాడు. ఒక్కో అడుగు ముందుకేశాడు. ఉప్పెనలా ఉప్పొంగాడు. రైతు కోసం రావిరాలలో రణభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి ఎలుగెత్తి చాటాడు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించాడు. సునామీలా తిరిగి ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని, టీఆర్‌ఎస్ ను గద్దె దించుతానని.. సమరశంఖం పూరించాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భుజం మీదుగా మోదీపై గురి.. రావిరాల సభతో రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై ఓ అంచనాకు రావొచ్చు. కేసీఆర్ భుజాల మీదుగా కేంద్రంపై వ్యవసాయ చట్టాలపై ఫిరంగి పేల్చిన తీరుకు విమర్శకుల నుంచే ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని గుర్తుచేస్తూ.. కేంద్ర బంతిని రాష్ట్ర కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ మోదీ జట్టు వీడి.. సాగు చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ గులాబీ బాస్ ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు.  రావిరాల వేదికగా కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పంపిన మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది. ఢిల్లీ డైరెక్షన్ లోనే.. చెప్పేశారు. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పాదయాత్రతో తన రాజకీయ బాటను మరింత సుస్థిరం చేసుకోనున్నట్టు రావిరాల సభలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రకటించి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆదేశం మేరకే రూట్‌ మ్యాప్‌ ఉంటుందని స్పష్టం చేసి తన గాడ్ ఫాదర్ ఢిల్లీనే అంటూ సంకేతాలు పంపించేశారు. 10 జన్ పథ్ అనుమతితోనే కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. లోకల్ సీనియర్లకు చెప్పకనే చెప్పేశారు. నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు.. తేలిపోయింది. రావిరాల సభతో రేవంత్ రెడ్డితో కలిసి నడిచేదెవరో తేలిపోయింది. కాంగ్రెస్ లో  ఎవరు ఏ గ్రూపో పాలు, నీళ్లలా తేలిపోయింది. నో డౌట్. సీతక్కే ఆ లిస్ట్ లో అందరికన్నా ముందున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రావణ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సభకు హాజరు కావడంతో వీరంతా ఆయన బ్యాచ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక.. సభకు రాని వారిలో హేమాహేమీలే ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్యయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు మీటింగ్ కు అటెండ్ అవలేదు. అయితే.. రణభేరి సభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రొగ్రామ్ కాదని వారంతా బయటకు చెబుతున్నా.. ఆ సో కాల్డ్ సీనియర్లంతా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారేనంటున్నారు ఆయన అభిమానులు. ఆసక్తిరేపిన సురీడు.. రేవంత్ రెడ్డి నిర్వహించిన రణభేరి సభలో జరిగిన రెండు ఆసక్తికర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఆయన వెన్నంటే ఉండేవాడు వ్యక్తిగత అనుచరుడు సురీడు. వైఎస్ మరణం తర్వాత బహిరంగంగా సురీడు కనిపించింది లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సభలో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆ సురీడు. ఇప్పటి వరకూ ఏ జగన్ సభలోనూ, ఏ షర్మిల మీటింగ్ లోనూ జాడ లేని సూరీడు సడెన్ గా రేవంత్ రెడ్డి రణభేరిలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. నాడు వైఎస్.. నేడు రేవంత్ -కొండా సురేఖ కామెంట్స్ రణభేరి సభలో కీలక నేత కొండా సురేఖ చేసిన కామెంట్స్ భవిష్యత్ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రను.. గతంలో వైఎస్సార్ చేసిన యాత్రతో పోల్చారు కొండా సురేఖ. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం వ్యూహాత్మకమే అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వైఎస్ ఎలానో.. ఈనాడు హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి స్థాయి కూడా అలాంటిదేనంటూ పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న కొండా దంపతులు.. ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డికి సైతం స్ట్రాంగ్ సపోర్టర్స్ గా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. రావిరాల సభతో  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్ట్రామినా ఏంటో.. అది ఉప్పెనలా ఉప్పొంగి, తెలంగాణలో సృష్టించే పొలిటికల్ సునామీ ఎంతో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి బలం, బలగం, భవిష్యత్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సభ జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ మరింత అదిరిపోతుందని..  పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు ఫ్యాన్స్.