తెరాస ప్రభుత్వం తప్పటడుగు వేస్తోందా?

  గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చి వేసిన తెరాస ప్రభుత్వం దృష్టి ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోగల లగడపాటికి చెందిన ల్యాంకో భూములపై పడింది. వక్ఫ్ బోర్డు కు చెందిన ఆ భూములలో 108 ఎకరాలు ల్యాంకో కొనుగోలు చేసి అక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించింది. ల్యాంకోతో బాటు వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపు 1508 ఎకరాల భూములను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వమే అమ్మివేసింది. జలయజ్ఞం ప్రాజెక్టుల కొరకు నిధులు సమీకరించేందుకు ఈ భూములను అమ్మినట్లు సమాచారం. కానీ చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వం కూడా అమ్మడానికి వీలులేదు. అందుకే ఈ భూముల అమ్మకం వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఒక కేసు నడుస్తోంది. ప్రభుత్వం తన తప్పును సరిద్దిద్దు కొనకపోగా అవి వక్ఫ్ బోర్డుకి చెందిన భూములు కావని, కనుక వాటిని బోర్డుకు అప్పగించవలసిన అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఒకవేళ అవి వక్ఫ్ బోర్డుకు చెందిన భూములేనని తేలినట్లయితే, ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు ఆ భూమి ధర లేదా వక్ఫ్ బోర్డు కోరుకొన్న చోట అంతే విస్తీర్ణంగల భూమిని ఇవ్వవలసి ఉంటుందని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.   ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలతో బాటు వాటి ఆలోచనలు మారాయి. తెలంగాణాలో కొత్తగా అధికారం చేప్పట్టిన తెరాస ప్రభుత్వం కోర్టు నుండి కేసు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. టీ-మంత్రి హరీష్ రావు మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ” ఇంతకు ముందు ఉన్న ఆంధ్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూములను అమ్మడం చట్ట వ్యతిరేఖమని తెలిసి ఉన్నప్పటికీ అమ్మివేసింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఆ భూములను వక్ఫ్ బోర్డుకే తిరిగి అప్పజెప్పాలని నిశ్చయించుకొంది,” అని తెలిపారు.   అయితే ఇది కేవలం ల్యాంకో కంపెనీ ఒక్క దానికే చెందిన సమస్య కాదు. అక్కడ భూములు కొన్న మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలూ భూమిని కొన్నాయి. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఈ భూముల వ్యవహారం లో సుప్రీం కోర్టులో కేసు వాపసు తీసుకొన్నట్లయితే, కోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం తెలంగాణా ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు నగర శివార్లలో 1508 ఎకరాలు లేదా దాని విలువ చెల్లించవలసి ఉంటుంది. కానీ ల్యాంకో తదితర సంస్థలు ఒక్కో ఎకరానికి దాదాపు రూ. 4-5 కోట్లు చెల్లించి ఆ భూములను కొనుకోన్నాయి గనుక, వాటిని ఇప్పుడు కొత్తగా అధికారం చేప్పట్టిన తెలంగాణా ప్రభుత్వం కూడా తప్పుపట్టలేదు. తప్పుపట్టినట్లయితే ల్యాంకోతో బాటు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపైన కూడా ఇదేవిధమయిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.   ఒకవేళ ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వాం ముందుకు సాగదలిస్తే, సదరు వ్యక్తులు సంస్థల తరపున వక్ఫ్ బోర్డుకి తనే భూమి లేదా నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం అక్కడ ఎకరం రూ8 నుండి 10 కోట్ల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెరాస ప్రభుత్వం1508 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయం నగర శివార్లలో అంతే విస్తీర్ణం గల భూమి లేదా రూ. 15,080 కోట్లు నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశః ఈ రెండు కూడా సాధ్యం కాకపోవచ్చును. అటువంటప్పుడు ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వం కూడా చల్లబడిపోతుందా లేక ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరించుకొంటుంది? అనేది చూడాలి.

ప్రాణాలు పోతున్నా షరా మామూలే

  షరా మామూలుగా మళ్ళీ ఘోర ప్రమాదం జరగడం, అన్నెంపున్నెం ఎరుగని పసిపిల్లలతో సహా అనేకమంది ప్రజలు మృత్యువాత పడటం, నేతల దిగ్భ్రాంతి, సానుభూతులు, పరామర్శలు, తలకో ఇంత అని ఎక్స్ గ్రేషియా ప్రకటనలు అన్నీ చాలా పద్దతిగా జరిగిపోతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఇంత పద్దతిగా చేయగలుగుతున్నప్పుడు, పదేపదే పునరావృతమవుతున్న ఇటువంటి ప్రమాదాలను మాత్రం అరికట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నాము? అని ప్రశ్నించుకొంటే, మళ్ళీ షరా మామూలుగా అవే సమాధానాలు- నిర్లక్ష్యం, మానవ తప్పిదం అని నిర్లజ్జగా చెప్పుకోవలసి వస్తుంది. ఈ సంగతి మన ప్రభుత్వాలకి బాగానే తెలుసు. అందుకే అలవాటు ప్రకారం ముందుగా ఒక విచారణ కమిటీ వేసేస్తాయి. ఆ తరువాత ఈ ఘోర తప్పిదానికి కారకులయిన వారు ఎంత పెద్దవారయినా విడిచిపెట్టేదే లేదని గంభీరంగా ప్రకటిస్తారు. ఇది కూడా ఆ ఆనవాయితీలో భాగంగానే అనుకోవలసి ఉంటుంది. ఇంతవరకు వేసిన అనేక కమిటీలు ఏమి కనిపెట్టాయో, అటువంటి వాటికి ఎవరిని శిక్షించారో, వాటి నివేదికల ఆధారంగా ఇటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకొన్నారో ఎవరికీ తెలియదు. అందుకే ఇటువంటి ఘోర దుర్ఘటనలు పదేపదే పునరావృతం అవుతున్నాయి. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బహుశః ఈరోజు నగరం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు వేసిన కమిటీ కూడా శతకోటి కమిటీలలో మరొక కమిటీగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.   ప్రభుత్వం, అధికారులలో చిత్తశుద్ధి లేనప్పుడు, మీడియా నిలదీయాలి. కానీ సంచలన వార్తల వెంట పరుగులు తీస్తున్న మీడియా, రేపు ఇటువంటిదే మరో సంచలన సంఘటన జరగగానే, ఈ ఘోర దుర్ఘటనను తమ లైబ్రేరీ సెక్షన్ కి పంపించేసి, మిగిలిన చానల్స్ తో పోటాపోటీగా ఆ సరికొత్త దుర్ఘటన గురించి హృదయ విదారకంగా వర్ణిస్తూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంది. దురదృష్టవశాత్తు ఇది కూడా ఆ అనవాయితీలో భాగమయిపోయింది. ఈరోజు జరిగిన ఘోర దుర్ఘటనను సదరు గెయిల్ సంస్థ నివారించి ఉండవచ్చును. త్రుప్పు పడుతున్న పాత పైప్ లైన్ల నుండి గ్యాస్ లీకవుతోందని స్థానిక ప్రజలు ఎంత మోర పెట్టుకొన్నప్పటికీ అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయింది. వారి నిర్లక్ష్యానికి పదిహేను నిండు ప్రాణాలు గాలిలో కాలిపోయాయి. వారిలో ఇంకా ప్రపంచం గురించి తెలియని అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలు కూడా ఉన్నారు. ఎందరో తీవ్ర గాయాలపాలయ్యారు. సామన్య ప్రజల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి.   ఇటువంటి నేరాలు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్యలతో సమానంగా పరిగణించి, సంబంధిత సంస్థ అధికారులను కటినంగా శిక్షించాలి. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువని ఘోర దుర్ఘటన జరిగింది గనుక ప్రభుత్వం వారి నుండే ముక్కు పిండి నష్టపరిహారం కూడా వసూలు చేయాలి. అవసరమయితే అందుకోసం ప్రభుత్వం కొత్త చట్టాలు చేయాలి. న్యాయస్థానాలు , మానవ హక్కుల కమీషన్ వంటి సంస్థలు కూడా ఇటువంటి దుర్ఘటనలలో సంబంధిత వ్యక్తులు, సంస్తలపై సుమోటోగా కేసులు నమోదు చేసి దోషులను కటినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి. ఇటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు, అత్యాచారాలు, నేరాలు జరిగిన ప్రతీసారి ప్రభుత్వాలు కమిటీలు వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసినప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసి ఎప్పటికప్పుడు దారిలో పెడుతున్డాలి. అప్పుడే ఇటువంటి దుర్ఘటనలు నివారించబడతాయి. లేకుంటే షరా మామూలుగానే మళ్ళీ ప్రమాదాలు, నేతల దిగ్భ్రాంతి, సానుభూతులు, పరామర్శలు కొనసాగిపోతూనే ఉంటాయి.

రాష్ట్రాభివృద్ధిలో వైకాపా ప్రేక్షకపాత్రకే పరిమితమా?

  నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని పదేపదే చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆ మాటలని ఆచరణలో మాత్రం పెట్టడం కనబడదు. తనకు రాజకీయంగా బద్ద శత్రువయిన చంద్రబాబుని ఆయన చాలా ద్వేషిస్తూ ఉండవచ్చును. కానీ ఆ కారణంగా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని కూడా ద్వేషించడం అవివేకం.    సమైక్యాంధ్ర అని పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రావారిని అడుగడుగునా అవమానిస్తున్న టీ-ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటనరు. కానీ, ఏదో ఒక సాకుతో చంద్రబాబు ప్రభుత్వంపై మీద ఒంటికాలిపై లేస్తుంటారు. ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంటు చేయమని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పినా జగన్ పెదవి విప్పరు, పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణా ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్నా ఆ సమస్యతో తనకెటువంటి సంబందమూ లేదన్నట్లు వ్యవహరిస్తారు. కానీ ప్రజలెనుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ, దానిపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.   రాష్ట్రాభివృద్ధి కేవలం అధికార పార్టీ బాధ్యతే కాదు. ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కానీ రాష్ట్రాభివృద్ధిలో వైకాపా పాత్ర ఏమిటని ప్రశ్నించుకొంటే ఏమీ ఉండబోదనే జగన్ వైఖరి స్పష్టం చేస్తోంది. తీవ్ర ఆర్ధిక సమస్యల నడుమే రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకొని కొత్తగా రాజధానిని కూడా నిర్మించుకొని, రాష్ట్రానికి విద్యా, వైద్య, విద్యుత్, సాఫ్ట్ వేర్ సంస్థలు, పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేయవలసి ఉంది. అందుకు జగన్ కూడా తన పలుకుబడిని, పరిచయాలను ఉపయోగించి రాష్ట్రానికి లబ్ది చేకూర్చవచ్చును. కానీ ఆ విధంగా చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ప్రభుత్వానికే వెళ్ళిపోతుంది గనుక ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.   కానీ రాష్ట్రాభివృద్ధికి కంకణం కట్టుకొన్న అధికార తెదేపాకు సహకరించకపోగా, దానికి అడ్డంకులు సృష్టిస్తే దానివల్ల వైకాపా ప్రతిష్ట మరింత మసకబారడం తధ్యం. ఈ విషయంలో వైకాపా సృష్టించే అడ్డంకులను తెదేపా ప్రభుత్వం అధిగమించి, రాష్ట్రాభివృద్ధి చేయగలిగినట్లయితే దానివల్ల తెదేపాపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది.

అర్ధవంతమయిన చర్చలకు ప్రతిపక్షం అడ్డుకట్ట

  రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా సమావేశమయిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, చెప్పట్టవలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి, కొత్త రాజధాని నిర్మాణం వంటి అంశాలపై లోతయిన చర్చ జరుగుతుందని ప్రజలందరూ భావించారు. కానీ భాద్యతాయుతమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడంతో చర్చలు పక్కదారి పట్టి అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు నిందారోపణలతో విలువయిన సభాసమయం వృధా అయిపోతోంది.   తెలుగుదేశం పార్టీ చేసిన ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిగా ఆలశ్యమయినా తప్పకుండా అమలు చేస్తారని ప్రజలు అభిప్రాయపడుతుంటే, బాధ్యతాయుతమయిన ప్రతిపక్షంగా సభలో వ్యవహరిస్తామని చెపుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయకుండా కమిటీల పేరుతో తాత్సారం చేస్తూ రైతులను నిరాశ నిస్పృహలకు లోను చేస్తోందని ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. తెదేపా అధికారం చేప్పట్టి 15రోజులయినా కాక ముందే జగన్ ప్రభుత్వంపై ఈవిధంగా ఒత్తిడి చేయడం కేవలం రాజకీయమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.   అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలెన్నుకొన్న తెదేపా ప్రభుత్వం భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వనరులున్నప్పటికీ తెదేపా ప్రభుత్వం వాటిని సమర్ధంగా వినియోగించుకోకుండా, రాష్ట్ర పరిస్థితి ఏమీ బాగోలేదని తెదేపా ప్రభుత్వం పదేపదే చెపుతూ ప్రజలను మరింత భయపెట్టడం సరికాదని జగన్ విమర్శించారు. దానిని చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ఖండించారు.   జగన్ ఆవిధంగా మాట్లాడుతూ కేంద్రానికి ఏవిధమయిన సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర పరిస్థితి గురించి తాము కేంద్రానికి వివరించి నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తుంటే, నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తమకు సహకరించకపోగా, రాష్ట్రానికి వచ్చిన సమస్యేమీ లేదన్నట్లు మాట్లాడటాన్ని చంద్రబాబు కూడా తప్పుపట్టారు.   తన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ తప్పకుండా అమలు చేస్తుందని, ఆర్ధిక సమస్యలను సమర్ధంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పధంలో నడిపిస్తానని ప్రజలకు సభా ముఖంగా భరోసా ఇచ్చారు.

రైల్వే చార్జీలపై కాంగ్రెస్ డబుల్ గేమ్

రైల్వే చార్జీల పెంపుపై దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగిపోతోంది. ఇక వామపక్షాలు సరేసరి. ఇటువంటి పోరాటాలలో అవెప్పుడూ ముందే ఉంటాయి. కాంగ్రెస్ హాయంలో అన్నీ ధరలు పెరిగిపోయాయని, వాటి నియంత్రణకు యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చెప్పట్టలేదని, ఎన్నికల సమయంలో యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ అధికారం చేప్పట్టి నెలరోజులు కూడా కాక ముందే ఒకే సారి భారీగా రైల్వే చార్జీలను పెంచేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే మాట వాస్తవం. అయితే ప్రజలు మోడీ సమర్ధతపై, ప్రభుత్వంపై చాలా భారీగా ఆశలుపెట్టుకోనందునే మరింత నిరాశ, ఆందోళనలకు గురవుతున్నారని చెప్పవచ్చును.   గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా రైల్వే చార్జీలను చాలా సార్లు పెంచింది. కానీ అప్పుడు ప్రజలు, ప్రతిపక్షాల నుండి ఇంతగా వ్యతిరేఖత రాలేదు. కారణం అప్పుడు యూపీఏ ప్రభుత్వం రైల్వే చార్జీలను కొద్దిగా పెంచి, వేరే విధంగా ఆ డబ్బును ప్రజల ముక్కు పిండి వసూలు చేసేది. అదీగాక ప్రజలను చల్లబరిచేందుకు ముందు కొత్త ఎక్కువ మొత్తం వడ్డించి, వారు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసిన తరువాత కొంచెం తగ్గించడం ఒక ఆనవాయితీగా మార్చేసింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఒకేసారి రైల్వే చార్జీలను భారీగా పెంచేసి, కాంగ్రెస్ పాటించిన ఆ ఆనవాయితీని పాటించేందుకు సిద్దపడక పోవడంతో సహజంగానే ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరింత రెచ్చగోడుతోంది.   నిజానికి, రైల్వే బోర్డు ఫిబ్రవరి5,2014న సరుకు రవాణపై 5శాతం, ప్రయాణికుల చార్జీలను 10శాతం పెంచేందుకు యూపీయే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వాటిలో సరుకు రవాణా చార్జీల పెంపును ఏప్రిల్ 1 నుండి, ప్రయాణికుల చార్జీలను మే 1నుండి పెంచేందుకు నాటి రైల్వే మంత్రి మాల్లిఖార్జున్ ఖార్గే నాటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ను కలిసారు. ఈ పెంపు ద్వారా రైల్వేలకు రూ. 7900 ఆదాయం కలుగుతుందని రైల్వే మంత్రి లెక్కలు కట్టి చూపించడంతో వాటిని అమలుచేసేందుకు ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేసారు. అయితే ఆ రెండు రకాల చార్జీల పెంపును కూడా మే1 నుండి అమలుచేయమని ఆదేశించారు.   కానీ ఆ తరువాత ఎన్నికల కోలాహలం మొదలయిపోవడంతో ఎన్నికలకు ముందు రైల్వే చార్జీలను పెంచితే అది ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని, మోడీకి మరో బలమయిన ఆయుధం అందించినట్లవుతుందని భావించి యూపీయే ప్రభుత్వం అప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు, అమలు చేయలేదు. ఒకవేళ యూపీయే కూటమి ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటే ఈ పాటికి 15శాతం పెంపు నిర్ణయం అమలులోకి వచ్చి ఉండేదన్నమాట. మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే చార్జీల పెంపుని నిరసిస్తూ నిరసనలు, ఆందోళనలు చేయడాన్ని ఏవిధంగా చూడాలి?   కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయాన్నే మోడీ ప్రభుత్వం అమలు చేసిందని వితండవాదం చేసి మోడీని వెనకేసుకు రావడం కాదిది. కాంగ్రెస్ పార్టీ రైల్వే చార్జీలను పెంచాలని నిర్ణయించినపుడు దానిని అదే ఇప్పుడు ఎందుకు వ్యతిరేఖిస్తోంది అనేదే ప్రశ్న? నోరు విప్పితే రాజకీయాలలో నీతి నిజాయితీ, నైతిక విలువలు, పార్టీలో, పద్దతులలో సమూల ప్రక్షాళన అంటూ లెక్చర్లు దంచే రాహుల్ గాంధీ కూడా తమ పార్టీ ఈవిధంగా ద్వంద వైఖరి అవలంభిస్తుంటే ఎందుకు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం జవాబు చెప్పవలసి ఉంది.

ఆ హీరో ఎవరిని వరిస్తాడు?

  రెండు రోజుల క్రితం ప్రముఖ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరక్టర్ మరియు సి.ఈ.ఓ. పవన్ ముంజల్ బ్రెజిల్ దేశంలో జరిగిన కంపెనీ సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ దక్షిణ భారతదేశంలో కూడా ఉత్పత్తి సంస్థను స్థాపించేందుకు తగిన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రకటన గురించి తెలియగానే రాష్ట్రభివృద్ధిలో పోటీపడుతున్న ఆంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ సంస్థను తమ రాష్ట్రానికి రప్పించేందుకు వెంటనే రంగంలో దిగిపోయాయి.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరులో ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన శ్రీ సిటీ వద్ద లేదా చెన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరులో గానీ కంపనీ స్థాపనకు అవసరమయిన భూమిని, తగిన అన్ని సౌకర్యాలను అందజేస్తామని తెలుపుతూ కంపెనీ యాజమాన్యానికి ఈ మెయిల్ ద్వారా కబురు పంపింది. అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వం కూడా మెదక్ జిల్లాలో జహీరాబాద్ వద్ద కంపెనీకి స్థలం, ఇతర సౌకర్యాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని కబురు పంపారు. అయితే ఇంతవరకు కంపెనీ నుండి రెండు ప్రభుత్వాలకు ఎటువంటి జవాబు రాలేదు.   హీరో మోటోకార్ప్ కి ప్రస్తుతం హర్యానాలో గుర్ గావ్, దరుహీర వద్ద రెండు ఉత్పత్తి సంస్థలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ వద్ద ఒకటి ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో హలోల్ వద్ద రూ.1100 కోట్ల వ్యయంతో ఒకటి, రాజస్థాన్ లో నిమ్రాణ వద్ద రూ.400 కోట్ల వ్యయంతో మరొకటి నిర్మించబడిన రెండు సంస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు తమ ఆరవ ఉత్పత్తి కేంద్రం దక్షిణాదిన స్థాపించాలని హీరో మోటోకార్ప్ భావిస్తుండటంతో ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఆ సంస్థను ఎలాగయినా తమ రాష్ట్రానికి రప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.   హీరో మోటోకార్ప్ సంస్థ తన ఆరవ యూనిట్ ను స్థాపించి తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏడాదికి 12 మిలియన్లకు పెంచుకోవాలని భావిస్తోంది. అంటే ఒక్కో సంస్థ సగటున రెండు మిలియన్ మోటార్ సైకిళ్ళను ఉత్పత్తి చేస్తుందని భావిస్తే, అంత భారీ ఉత్పత్తి సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధిపొందే అవకాశం ఉందన్నమాట. ఇక అటువంటి పెద్ద సంస్థ కనుక రాష్ట్రానికి వచ్చినట్లయితే, దానికి అనుబంద పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ పరిశ్రమలతో బాటు స్టార్ హోటల్స్, సరికొత్త వ్యాపార సమస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి వలన విద్య, వైద్య, ఉపాధి, వ్యాపారాలు మరింత పెరిగే అవకాశం ఉంది.   అందువలన ఈ సంస్థను తమ రాష్ట్రానికే రప్పించేందుకు దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు పోటీ పడవచ్చును. తమిళనాడు, కర్నాటకలు ఇప్పటికే మంచి పారిశ్రామిక అభివృద్ధి సాధించాయి గనుక ఆ రెండు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణాలకు గట్టి పోటీ ఇవ్వవచ్చును. ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలయిననత త్వరగా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ సులువుగా గెలిచే అవకాశం ఉంటుంది. లేకుంటే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోటీ పడకతప్పదు.

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య సమన్వయం కలేనా?

  పీపీఏల రద్దుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అవాంఛనీయమయిన యుద్ధం కొనసాగుతోంది. రెండు ప్రభుత్వాలు ఈసమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, కవ్వింపు మాటలతో యుద్ద వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకు ప్రధానకారణం రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలు విషయంలో తీవ్ర ఇబ్బందులు, విమర్శలు, ఒత్తిళ్ళు ఎదుర్కోవడమే అయి ఉండవచ్చును. సాధారణంగా అధికార పార్టీలు ఇటువంటి సమస్యలు ఎదురయినప్పుడు ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని వేరే ఇతర అంశాల మీదకు మళ్ళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక బహుశః ఇది కూడా అటువంటి ప్రయత్నమే అనుకోవాల్సి ఉంటుంది.   రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని పదేపదే చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ నుండి పంపిణీ అయ్యే విద్యుత్ మీదే తెలంగాణా రైతన్నలు పూర్తిగా ఆధారపడి పంటలు సాగుచేసుకొంటున్నారని తెలిసిఉనప్పటికీ, తెలంగాణకు ఇచ్చే విద్యుత్ లో కోతపెట్టాలని ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం కాదు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించమని కూడా కాదు. విద్యుత్ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించుకోవచ్చునో కూడా బాగా తెలుసు. కనుక ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చేందుకే గట్టిగా ప్రయత్నించాలి. లేకుంటే వ్యవసాయ రుణాలమాఫీ వంటి ఇతర అంశాలపై నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఆయన కూడా కేసీఆర్ లాగ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించవచ్చును.   ఇక ఉద్యమపార్టీ అయిన తెరాస, ఇప్పుడు బాధ్యతాయుతమయిన అధికార పార్టీగా మెలిగేందుకు ప్రయత్నించాలి తప్ప, “మీరు ఒకటి చేస్తే మేము రెండు చేస్తాము, ఆంద్ర మంత్రుల ఇళ్ళకు విద్యుత్ నిలిపి వేస్తాము” వంటి బెదిరించడం మంచిపద్దతి కాదు. ఉద్యమకాలంలో తెరాస నేతలు తమ లక్ష్యం సాధించేందుకు ఏ విధంగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ప్రజలు అధికారం కట్టబెట్టారు గనుక చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, వ్యవహరించాలి.   తెదేపా, తెరాసలు రాజకీయంగా ఒకదానినొకటి ఎంత వ్యతిరేఖించుకొన్నా ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అధికారం చేపట్టిన తరువాత కూడా రెండు ప్రభుత్వాల వలే కాకుండా ఇంకా రాజకీయ పార్టీలలాగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షించారనే సంగతిని గ్రహిస్తే మంచిది. ఇంకా ఇటువంటి అనేకం సమస్యలను రెండు ప్రభుత్వాలు మున్ముందు ఎదుర్కోవలసి ఉంది. అటువంటప్పుడు ఈ సమస్యల శాశ్విత పరిష్కారానికి నిపుణులతో కూడిన కమిటీలు వేసుకోనో లేక ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చల ద్వారానో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి తప్ప చీటికి మాటికీ కేంద్రం వద్దకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టుకొంటే తెలుగు ప్రజల పట్ల అందరికీ మరింత చులకన భావం ఏర్పడుతుంది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు ప్రజలు ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నారు. కనుక ఇకనయినా రెండు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్యలన్నిటినీ రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.

రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి?

  ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కనుక పత్రికలలో ‘అస్త్రశ్రస్తాలు సిద్దం చేసుకొంటున్న ప్రతిపక్షాలు’, ‘ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల వ్యూహరచన’, ‘ప్రతిపక్షాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అధికారపార్టీ సమాలోచనలు’ వంటి హెడ్డింగులతో వార్తలు కనబడుతుంటాయి. ఇటువంటి వార్తలు చూసి అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికి నిర్వహిస్తారు? అనే ధర్మ సందేహం చాలా మందికి కలుగుతుంది.   చట్టసభలలో చట్టాలు చేస్తారని, ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొంటారని ప్రజలు అపోహ చెందుతుంటారు. కానీ వివిధ పార్టీలకి చెందిన ప్రజాప్రతినిధులు వారి అపోహలు దూరం చేస్తారు. లక్షలు ఖర్చు చేసి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలలో ఒక పార్టీపై మరొకటి పైచేయి సాధించడమే ప్రధానమని, అందుకోసం ఒకరినొకరు దూషించుకోవడం, నినాదాలు చేయడం, అలిసిపోతే వాకవుట్ చేయడం వంటివి తప్పనిసరి అని చాటిచెపుతారు. అధికార పార్టీ చేసిన నిర్ణయాలను విమర్శించడం, మీడియా ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే నిర్మాణాత్మకమయిన ప్రతిపక్ష పాత్ర పోషించడం అని ప్రతిపక్షాలు భావిస్తే, వారి విమర్శలను త్రిప్పికొడుతూ, వారిని సభ నుండి సస్పెండ్ చేసో లేక వారు వాకవుట్ చేసినపుడో కీలకమయిన నిర్ణయాలు, బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండా సభ చేత ‘మమ’ అనిపించేయడమే మంచి పద్ధతి అని అధికారపార్టీ భావిస్తుంది. ఈరోజు నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో ఈ అద్భుత సన్నివేశాలన్నీ మరొకమారు ప్రజలందరూ తమ కళ్ళారా తిలకించే అవకాశం దక్కబోతోంది.   వ్యవసాయ ఋణాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, శనివారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత నుండి తాము ఆ పని మీదనే ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసారు. తెదేపా చేసిన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేసేవరకు తమ పోరాటం సాగిస్తామని యుద్ద ప్రకటన చేసేసారు.కానీ ఇప్పుడు ప్రజలు కోరుకొంతున్నది యుద్ధం కాదు. సహకారం, తద్వారా సత్వర అభివృద్ధి అని గ్రహిస్తే మేలు.   రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని గాలికొదిలేసి చట్టసభలలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరనే సంగతి వారు గుర్తుంచుకొని మెలగాలి.   ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ, “గతం తాలూకు మన చేదు, తీపి జ్ఞాపకాలను ఇక వదిలి పెడదాము. మనందరం వివిధ పార్టీల ప్రతినిధులుగా కాక కేవలం ప్రజాప్రతినిధులుగా మాత్రమే ఇక్కడ కూర్చోన్నమనే విషయం సదా గుర్తుంచుకొని, మన పార్టీలను, భేషజాలను అన్నిటినీ పక్కన బెట్టి దేశాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలూ హర్షిస్తారు,” అని అన్నారు. ఇది అక్షరాల మన అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకి కూడా వర్తిస్తుంది.   ప్రస్తుతం మన రాష్ట్రం అత్యంత దయనీయ స్థితిలో చిక్కుకొని విలవిలలాడుతోంది. కనుక అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. ఆర్ధిక లోటును ఏవిధంగా అధిగమించవచ్చు? పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య సంస్థలు వంటివాటిని ఏ ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి? వాటిని రాష్ట్రానికి రప్పించడంలో తాము ఏవిధంగా కృషి చేయగలము? అని సానుకూల దృక్పధంతో ఆలోచనలు చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త రాజధాని ఏర్పాటుపై శాసనసభలో అర్ధవంతమయిన చర్చలు చేసి, తద్వారా ప్రజాప్రతినిధులు అందరూ తమతమ నియోజక వర్గాల అభివృద్ధికి గట్టిగా కృషిచేసినట్లయితే ప్రజలు హర్షిస్తారు.   ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర పునర్నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, కొత్త రాజధాని కోసం తపిస్తున్నారు. తమవంతు పాత్ర పోషించేదుకు సిద్దంగా ఉన్నారు. అటువంటప్పుడు ప్రజా ప్రతినిధులు కూడా అంతే బాధ్యతగా, నిబద్దతగా కృషిచేయాలి. ఎంతసేపు ప్రజలను త్యాగాలను చేయమని కోరే ప్రజాప్రతినిధులు తాము ఎటువంటి గొప్ప త్యాగాలు చేయకపోయినా కనీసం బాధ్యతగా వ్యవహరిస్తే చాలని ప్రజలు కోరుకొంటున్నారు. కానీ అలాకాక ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవిస్తూ షరా మామూలుగా నికృష్ట రాజకీయాలకే పరిమితమయినట్లయితే, చైతన్యవంతులయిన ఆంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్లే వారికి కూడా తప్పకుండా బుద్ధి చెపుతారు.

కాంగ్రెస్ ఓడిపోలేదు, అభ్యర్ధులే ఓడిపోయారుట

  ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పాల్గొన్న పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ ఓటమికి ఎవరూ ఊహించలేని విధంగా నిర్వచించారు. ఎన్నికలలో కేవలం అభ్యర్ధులే ఓడిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని ఒక సరికొత్త నిర్వచనం చెప్పారు. అంతేకాదు ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా పార్టీ పరువు నిలిపేందుకే ఎన్నికలలో పోటీ చేసామని అందుకు తాను చాలా గర్వపడుతున్నానని చెప్పారు. ఎన్నికలలో తామందరం ఓడిపోతామని రాహుల్ గాంధీకి ముందే చెప్పామని చెప్పిన సంగతిని కూడా ఆయన ఈరోజు పార్టీ సమావేశంలో బయటపెట్టారు.   రఘువీరా చెప్పినట్లు కాంగ్రెస్ ఓడిపోకపోతే ఆ పార్టీ మరెందుకు కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రాలేకపోయింది? రాష్ట్ర విభజన కారణంగా సీమాంద్రాలో పార్టీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసనే సంగతి ప్రజలకీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. కానీ అదే కాంగ్రెస్ కి చెందిన కొందరు నేతలు వేరే పార్టీలలోకి మారినప్పుడు వారిని మాత్రం ప్రజలు గెలిపించారు. అంటే ప్రజలు కాంగ్రెస్ నేతలను కాక కాంగ్రెస్ పార్టీనే ద్వేషిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్న వివేకానంద రెడ్డి సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కసితో ఓడించారని నిజం చెప్పారు.   పార్టీ తరపున ఒక్క యంపీ, యం.యల్యే కూడా గెలవకపోయినా, ప్రజలు తమ తరపున ప్రభుత్వంతో పోరాడే భాద్యత తమకు అప్పగించారని రఘువీరా చెప్పుకోవడం మరొక గొప్ప జోక్. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టే అర్హత లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. అందుకు అవమానంతో తలదించుకోవలసింది పోయి, తమ ఓటమికి అందమయిన నిర్వచనాలు, కుంటి సాకులు వెదుకుతున్నారు.   పాము తన పిల్లలను తానే మింగినట్లుగా సీమాంధ్రలో స్వంత పార్టీ నేతల రాజకీయ జీవితాలను, పార్టీని, చివరికి ప్రజల జీవితాలని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఇచ్చినా అక్కడ కూడా కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది? ఇంతకీ అక్కడ ఓడింది కాంగ్రెస్ పార్టీనా? అభ్యర్దులా? తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నేతలు అధికారం దక్కించుకోలేకపోయినా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ప్రతిపక్ష హోదా దక్కించుకొన్నందుకు చాలా సంతోషపడ్డారు. మళ్ళీ షరా మామూలుగానే ప్రతిపక్ష నేత పదవి కోసం కూడా నిసిగ్గుగా కీచులడుకొన్నారు.   ఇక కేంద్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అక్కడా ప్రతిపక్ష హోదాకు అవసరమయిన 54 యంపీలు లేకపోవడంతో, ప్రతిపక్ష హోదా కోసం బీజేపీని బ్రతిమాలుకోవలసిన దుస్థితి. ఆ పరిస్థితుల్లో సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చెప్పట్టడానికి వెనుకంజవేసారు.   ఇటువంటి దుస్థితిని చూసి కాంగ్రెస్ నేతలు గర్వపడవచ్చేమో కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద జాలి పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు తమ ఓటమికి నిజాయితీగా జవాబులు కనుగొనే ప్రయత్నం చేసి ఉంటే, ఇటువంటి సమీక్షా సమావేశాలకి ఒక అర్ధం ఉండేది. కానీ చక్కగా మాటల గారడీ చేసుకొని అభ్యర్ధులే ఓడిపోయారు, పార్టీ కాదని ఆత్మవంచన చేసుకొంటే దాని ప్రజలేవరూ అభ్యంతరం చెప్పరు. వారిని చూసి నవ్వుకొంటారు అంతే!

వైకాపా ఓటమికి జగన్ శల్యసారధ్యమే కారణమా?

    వైకాపా ఓటమికి జగనే ప్రధాన కారకుడని ఇటీవల ఆ పార్టీని వీడిన దాడి వీరభద్రరావు ఆరోపించారు. కానీ కర్ణుడు చావుకి వంద కారణాలున్నట్లే, వైకాపా ఓటమికి కూడా అన్ని కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒక కారణం మాత్రమే. చంద్రబాబు తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గెలుపై ధీమాతో తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వ్యవహరించారని దాడి విమర్శించారు. అనేక సర్వే నివేదికలు “వైకాపా విజయం తధ్యం, జగన్ ముఖ్యమంత్రి అవడం అంతకంటే తధ్యం” అని ముక్తకంటంతో ఘోషించడమే ఆయన ధీమాకు కారణమని చెప్పవచ్చును. కానీ అటువంటి పరిస్థితులలో కూడా చంద్రబాబు ఏ మాత్రం తొణకకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోగా, జగన్ శల్యసారధ్యంతో వైకాపా ఓటమి పాలయింది.   ఈ ఓటమి వల్ల తామేమీ కొత్తగా పోగొట్టుకోన్నది లేదని చెప్పేందుకు ‘తమ పార్టీ అధికారంలో ఉండి ఓడిపోలేదని’ అని జగన్ అన్నారు. అయితే అదే సూత్రం తేదేపాకు కూడా వర్తిస్తుందని ఆయన మరిచిపోయారు. తెదేపా గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొంది. చంద్రబాబు నాయుడు పార్టీలో అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి పూర్తి వ్యతిరేఖ పరిస్థితులలో కూడా పార్టీని విజయంవైపు నడిపించి తన నాయకత్వ లక్షణాలు మరొకమారు నిరూపించుకొంటే, అనుకూల పరిస్థితుల్లో కూడా జగన్ శల్యసారధ్యం చేసి పార్టీని ఓడించుకొన్నారు. అందువల్ల తెదేపా విజయానికి చంద్రబాబు ఏవిధంగా కారకుడో, వైకాపా ఓటమికి జగన్ కారకుడని చెప్పక తప్పదు.   ఇక చంద్రబాబు, జగన్ అనుసరించిన వ్యూహాలు కూడా ఆ పార్టీల గెలుపోటములకు మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చును. ఆంధ్రాకు సంబందించినంత వరకు చూసుకొన్నట్లయితే, చంద్రబాబు విమర్శలను లెక్కచేయకుండా విజయవకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోగా, జగన్ ప్రజలందరూ రాష్ట్రాని విడదీసిన కాంగ్రెస్ పార్టీని, కేసీఆర్ ను వ్యతిరేఖిస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ వారిరువురితో రహస్య సంబంధం కొనసాగించారు. అదొక తప్పయితే, దానిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల ముందు ఎండగడుతున్నప్పుడు కూడా జగన్ సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో వారి ఆరోపణలను అంగీకరించినట్లయింది. ఇది మరో పెద్ద పొరపాటు.   తన ప్రత్యర్ధి బీజేపీతో పొత్తులు పెట్టుకొంటుంటే అప్రమత్తవవలసిన జగన్, ఒకసారి తమ పార్టీ మతత్వత పార్టీలకు మద్దతు ఈయదని, మరొకసారి ఇస్తుందని, ఇంకోసారి థర్డ్ ఫ్రంటుకే మద్దతు ఇస్తుందని ప్రకటిస్తూ తన అయోమయ పరిస్థితిని స్వయంగా చాటుకోవడంతో, ఆ పార్టీపై ప్రజలలో ఒక అపనమ్మకం ఏర్పడింది. ఇక చంద్రబాబు బీసీలను, కాపులను దగ్గరకు తీసుకొని వారికే ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రకటించి, ఆ వర్గాల ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకోగలిగారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడే అప్రమత్తమయి ఉండాల్సి ఉంది. కానీ గెలుపై ధీమాతో అతను బీసీలు, కాపులనే కాదు చివరికి పార్టీలో నేతలను కూడా పట్టించుకోలేదు. ఈమాటన్నది పైవాళ్ళు కాదు, ఆ పార్టీకే చెందిన దాడి వీరభద్ర రావు.   ఈ కారణాలకు తోడు ప్రజలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల సామర్ద్యం, అనుభవం, ‘ట్రాక్ రికార్డ్’, కేంద్రంతో సంబందాలు వంటి అనేక అంశాలను కూడా ప్రజలు చక్కగా బేరీజు వేసుకొని వైకాపాను తిరస్కరించారు.   సాధారణంగా పార్టీ ఓటమి తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా దానిని హుందాగా స్వీకరించి, తమ ఓటమికి గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో ఆత్మవిమర్శ చేసుకొంటుంది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలలో వైకాపా తప్పకుండా 162 సీట్లు గెలుచుకొంటుందని నిర్దిష్ట సంఖ్యతో సహా ఇప్పుడే జోస్యం చెప్పడం మరో విశేషం. ఎన్నికలకు నెలరోజుల ముందు తన పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయిన జగన్మోహన్ రెడ్డి, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. ఆయన తన ఆ కల నెరవేర్చుకోవాలంటే, ఇప్పటి నుండి వచ్చే ఐదేళ్ళ వరకు ఏవిధంగా ముందుకుసాగాలో ఆలోచించుకొంటే మేలేమో!

పోలవరం అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ కు సహకరిస్తాయా?

    తెలంగాణా ముఖ్యమంత్రి ఈరోజు అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేఖిస్తున్న ఆయన అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొన్న తరువాత వారితో కలిసి డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పోలవరంపై పునరాలోచించుకోవలసిందిగా కోరనున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం పోలవరంపై వెనక్కు తగ్గకపోతే, కేసీఆర్ కూడా తన పోరాటం ఉదృతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.   పోలవరం ముంపు గ్రామాల సమస్యపై ఆయన గత యూపీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నపుడు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపనిచేయవలసి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అప్పుడు ఆయన గట్టిగా వ్యతిరేఖించలేదు. కానీ ఇప్పుడు దానిపై పోరాటానికి సిద్దం గమనిస్తే ముంపు గ్రామాల విషయంలో ఆయన ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని అర్ధమవుతోంది. అందుకు ఆయన ప్రతిపక్షాల సహకారం కూడా కోరుతున్నారు.   కానీ ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు-కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలు ఆయనకు ఈవిషయంలో ఆయనకు సహకరించే అవకాశం లేదు. కాంగ్రెస్ అధిష్టానమే ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకొంది గనుక టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు సహకరించలేరు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను తెలంగాణా బీజేపీ నేతలు వ్యతిరేఖిస్తారని భావించడం అవివేకమే. ఇక తెదేపా ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా సీమాంద్రాలో అధికారంలో ఉంది. అటువంటప్పుడు వారు కూడా పోలవరం విషయంలో కేసీఆర్ తో కలిసి ఉద్యమిస్తారని భావించలేము. పైగా ఈ అంశంలో వారి నుండి కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా ఆశ్చర్యం లేదు. అందువల్ల పోలవరం అంశంపై కేవలం మజ్లిస్, సీపీఐ వంటి పార్టీలు మాత్రమే కేసీఆర్ తో కలిసి రావచ్చును.   కనుక పోలవరం ముంపు గ్రామాల గురించి ఆయన కేంద్రంతో యుద్ధం చేయడం కంటే, నిర్వాసితులకు మంచి ప్యాకేజీ కోసం పోరాటం చేసేందుకు అంగీకరిస్తే, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆయనతో కలిసి రావచ్చును. మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తరువాత తీసుకొన్న మొట్ట మొదటి నిర్ణయాన్ని అమలుచేయడం మోడీకి కూడా ప్రతిష్టాత్మకమే విషయమే అవుతుంది గనుక ఈ విషయంలో కేసీఆర్ ఆయనను సవాలు చేస్తూ ఒంటరి పోరాటం చేసి చివరికి అభాసుపాలవడం కంటే, నిర్వాసితులకు మంచి ప్యాకీజీ కోసం పట్టుబడితే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అందరూ ఆయనకు సహకరిస్తారు కూడా.

మీన మేషాలు లెక్కిస్తున్న మంత్రులు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం చాలా నిజాయితీగా రేయింబవళ్ళు కష్టపడతామని మంత్రులందరూ మీడియాను పిలిచి మరీ చెపుతున్నారు. వారు అటువంటి ఆలోచన చేస్తున్నందుకు చాలా సంతోషమే. కానీ జూన్ 10న వారికి చంద్రబాబు మంత్రిత్వ శాఖలు కేటాయించినప్పటికీ,  వారిలో ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించలేదు. వారందరికీ హైదరాబాదు సచివాలయంలో ‘జే’ మరియు ‘యల్’ బ్లాకులలో మొత్తం 15 గదులు కేటాయించబడ్డాయి. కానీ ఎవరెవరికి ఏ గది అనేది ఇంకా నిర్ణయించబడనందున మంత్రులెవరూ నేటికీ బాధ్యతలు స్వీకరించలేదు. ఉన్నతాధికారులు, ఉద్యోగుల విభజనలో ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలనే అంశంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుండటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన ఫైళ్ళ వెతుకలాట మరికొంత అయోమయ పరిస్థితిని సృష్టిస్తోంది. కానీ, పనిచేయాలనే తపన ఉన్నవారికి ఇదొక అవరోధం కాదని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు తన ఇంటి వద్ద నుండే పని మొదలుపెట్టి నిరూపిస్తున్నారు.   ఆయనను చూసి స్ఫూర్తి పొంది వెంటనే రంగంలో దిగవలసిన మంత్రులు, కార్యాలయం కేటాయింపు కోసం ఎదురు చూస్తుంటే, మరి కొందరు మంచి ముహూర్తం కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. జూన్ 2న రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇది జరిగి ఇప్పటికి సరిగ్గా 12రోజులయింది. కానీ ఇంతవరకు మంత్రులెవరూ బాధ్యతలు తీసుకోలేదు, అధికారికంగా పనీ మొదలు పెట్టలేదు.   కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుండే అంటే జూన్ రెండునే తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ క్షణం కూడా వృధా చేయకుండా అదే రోజు తన కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రంగంలో దిగిపోయారు. అదేవిధంగా తెలంగాణా మంత్రులందరూ కూడా వెంటనే బాధ్యతలు స్వీకరించి సంబందిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనులు మొదలు పెట్టేసారు. తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయి నాలుగయిదు రోజులయిపోయింది. అన్నీ అమరిఉన్నతెలంగాణా ప్రభుత్వం ఉరుకుల పరుగుల మీద పనులు చేసుకుపోతుంటే, సవాలక్షా సమస్యలున్నఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు మీడియా ముందుకు వచ్చి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు తప్ప బాధ్యతలు చెప్పట్టడానికి మాత్రం ఇంకా మీనా మేషాలు లెక్కబెట్టడం చాలా హాస్యాస్పదం.   రాష్ట్ర మంత్రుల పరిస్థితి ఇలాగుంటే, శాసన సభ్యులయితే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కారణం శాసనసభ సమావేశాలు ఇంకా మొదలవక పోవడమే. ఈనెల 19న శాసనసభ సమావేశాలు మొదలవుతాయని సమాచారం. కానీ అవెక్కడ నిర్వహిస్తారో ఇంకా స్పష్టత లేదు. నిజానికి అవి హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపబడ్డ శాసనమండలి భవనంలో నిర్వహించవలసి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికయిన సభ్యులు తాము తమ స్వంత రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరుకొంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సమావేశాలు నిర్వహించుకొనేందుకు రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, రాజమండ్రీ, తిరుపతి, కర్నూలులో తగిన భవనాల కోసం వెతుకులాట మొదలయింది.   సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (మే 8న) వెలువడి ఇప్పటికి నెల దాటింది. రాష్ట్రం ఏర్పడి 12 రోజులయింది. రాష్ట్ర విభజన కారణంగా ప్రభుత్వ శాఖలలో అనేక పనులు నిలిచిపోయాయి. అందువలన ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అయినా ఇంతవరకు మంత్రులు పని మొదలు పెట్టలేదు. వారు ఇదేవిధంగా మరొక వారం పది రోజులు కాలక్షేపం చేసినట్లయితే అప్పుడు మీడియానే స్వయంగా ప్రజల తరపున వారిని నిలదీయడం తధ్యం. అటువంటి పరిస్థితి చేజేతులా తెచ్చుకోకుండా మంత్రులందరూ తక్షణమే బాధ్యతలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.  

కేసీఆర్ కి నిరసనలు, బాబుకి సహకారం

  ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులిరువురూ కూడా వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారంలో చిక్కుకొని పైకి చెప్పుకోలేని ఇబ్బంది అనుభవిస్తున్నారు. అయితే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది గనుక ఈవిషయంలో చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ పరిస్థితే కొంచెం మెరుగుగా ఉందని అర్ధమవుతోంది. అయితే అది వ్యవసాయ రుణాలన్నిటినీ తీర్చేసేంత లేదు గనుక ఆయన చిన్న మెలికపెట్టారు. దానితో తెరాస ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అప్పుడే తెలంగాణాలో నిరసనలు మొదలయ్యాయి.   చంద్రబాబు కూడా వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెట్టినప్పటికీ, ఆయన చాల తెలివిగా దానికి ఒక కమిటీని వేసి, దానికో 45 రోజులు గడువుపెట్టి తనకు సమయం ఏర్పాటు చేసుకొన్నారు. అంటే ఈవిషయంలో కేసీఆర్ కంటే చంద్రబాబే చాలా లౌక్యం ప్రదర్శించినట్లు అర్ధమవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి వ్యవసాయ రుణాలపై తన నిర్ణయం ప్రకటించి ప్రజల నుండి నిరసనలు ఎదుర్కొంటుంటే, చంద్రబాబు 45రోజుల గడువు తీసుకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎటువంటి నిరసన తెలుపకపోవడం విశేషం.   ఎందువలన అంటే, ఇంతవరకు ఆంద్ర పాలకులు, రాజకీయ నేతలు తెలంగాణా ప్రజలను దోచుకొన్నారని, తెలంగాణా ఏర్పడితే ఇక సమస్యలన్నీ మంత్రదండం వేసినట్లు మాయమయిపోతాయని కేసీఆర్ తెలంగాణా ప్రజలకు బాగా నచ్చ జెప్పగలిగారు. ఇప్పుడు కేసీఆరే స్వయంగా పాలిస్తున్నారు గనుక, ఇక ఆంద్ర వాళ్ళను నిందించదానికి అవకాశం లేదు. మంచయినా చెడయినా బాధ్యత కేసీఆర్ దే అవుతుంది. అందుకే ఆయన నిరసనలు ఎదుర్కోవలసి వస్తోంది.   ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఫైలుపై సంతకం కూడా చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు గనుక, ఆయనేదో మంత్రం దండం తిప్పేసి రాత్రికి రాత్రే వేల కోట్ల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేస్తారని ఎవరూ అత్యాశకు పోలేదు. అందువలన ఈ విషయంలో అయన కూడా తప్పకుండా ఏదో ఒక మెలిక పెట్టవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మాఫీ చేసి తమను రుణభారం నుండి విముక్తులను చేస్తారనే ఆశ రైతులలో ఇంకా మినుకు మినుకు మంటూనే ఉంది.   సంపద సృష్టించడంలో ఆయనకున్న అనుభవం, కార్యదక్షత, ప్రధాని మోడీ, మరియు కేంద్రమంత్రులందరితో ఆయనకున్న సత్సంబంధాలు, ఆకారణంగా మోడీతో సహా అందరూ కూడా రాష్ట్రాన్ని అదుకొంటామని ప్రజా సమక్షంగా పదేపదే భరోసా ఇవ్వడం వంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. అందుకే ఒక్క ప్రతిపక్ష పార్టీలు తప్ప మరెవరూ నిరసనలు తెలియజేయలేదు. అయితే ఆయన స్వయంగా 45రోజులు గడువు విధించుకొన్నారు గనుక అంతవరకు ఆయనకు తాత్కాలిక ఉపశమనంగానే భావించవచ్చును. అప్పటికి ఆయన ఏదో విధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొ౦నవలసి ఉంటుంది. లేకుంటే ఆయన కూడా కేసీఆర్ లాగే విమర్శలు ఎదుర్కోవడం తధ్యం.

ఇకనయినా జగన్ ఆత్మవిమర్శ చేసుకొంటారా?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమికి కారణాలు కనుగొనేందుకు, విశాఖపట్నంలో నిన్న ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే, అదే జిల్లాకు చెందిన వైకాపా నేత దాడి వీరభద్రరావు, పార్టీ ఓటమికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారకుడని, ఆయన నిరంకుశ ధోరణి వలననే పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆరోపించడం విశేషం.   జగన్ పార్టీలో ఎవరినీ ఖాతరు చేయడని, తనకు తోచినట్లే చేస్తాడు తప్ప పార్టీలో ఎవరి సలహాలు స్వీకరించేందుకు కూడా ఇష్టపడడని, ఆయనొక డిక్టేటర్ అని ఆరోపించారు. షర్మిలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు బదులు తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని ఆరోపించారు. జగన్ తన తండ్రి చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాక, కేవలం తనను చూసే ప్రజలు ఓటేయాలని కోడరడం అతని అహంకారానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు.   సాధారణంగా పార్టీని వీడేవారు ఇటువంటి ఆరోపణలు చేయడం మామూలే. కానీ, వైకాపాను వీడుతున్నవారిలో చాలా మంది జగన్ తమకు పార్టీ టికెట్ ఇవ్వలేదనో లేకపోతే పార్టీ పదవులు దక్కలేదనో వీడినవారు చాలా తక్కువ. పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి ఆరోపణలే చేయడం గమనిస్తే, నిన్న దాడి వీరభద్ర రావు చేసిన ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది. దాడి పచ్చి అవకాశవాదే కావచ్చును. కానీ ఆయన మంచి విద్యావేత్త కూడా. ఆయన గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గర నుండి చూసిన కారణంగా ఆయన ఆరోపణలలో 50 శాతం అయినా వాస్తవం ఉండకపోదు.   అయితే లోపం తనలో ఉంచుకొని జగన్ పార్టీ ఓటమికి సమీక్షా సమావేశాలు నిర్వహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా మనుషులకు పుట్టుకతో వచ్చిన అవలక్షణాలను వదిలించుకోవడం అంత తేలిక కాదు. వాటిని గుర్తించి, వదిలించుకోవడానికి నిరంతరంగా గట్టి ప్రయత్నం చేసినప్పుడే వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీ ఓటమికి కారణాలు కళ్ళెదుట సపష్టంగా కనబడుతున్నప్పటికీ, కారణాలు కనుగొనేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించడం చూస్తే, ఆయన మారలేదని, మారబోరని దాడి వీరభద్రరావు అన్నమాటలను నమ్మవలసి వస్తుంది.   గత ఐదేళ్ళుగా అధికారం కోసం అలమటించిపోయిన జగన్మోహన్ రెడ్డి, మరో ఐదేళ్ళ వరకు ప్రతిపక్ష బెంచీలకే పరిమితమవవలసి వచ్చినపుడు, ఆయన తీవ్ర అసహనానికి గురవడం ఖాయం. అది పార్టీ నేతలపైనే ప్రదర్శించడం కూడా ఖాయం. పార్టీ నేతలు అది భరించలేనప్పుడు దాడి వీరభద్రరావులాగే బయటపడే ప్రయత్నం చేయడం కూడా తధ్యం. అటువంటప్పుడు ఆయన చెప్పినట్లు వైకాపా ఎంతకాలం మనుగడ సాగించగలదో అనుమానమే.   అందువల్ల దాడి వీరభద్ర రావు తనపై చేసిన ఆరోపణలను వైకాపా నేతలందరూ ముక్తకంటంతో ఖండించినప్పటికీ, వాటిని జగన్ సానుకూల దృక్పధంతో స్వీకరించి, ఆయన ఎత్తి చూపిన లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకు కూడా చాల మేలు కలుగుతుంది.

జగన్ ఆరాటమంతా రైతన్నల కోసమేనా?

  జగన్మోహన్ రెడ్డి తనను తాను విశ్వసనీయతకు నిలువెత్తు సజీవ రూపంగా వర్ణించుకొంటారు. కానీ సరిగ్గా అదే ఆయనలో లోపించింది. ఆ కారణం చేతనే ఓటమి పాలయ్యారు. అయినా దానిని ఆయన అంగీకరించేందుకు సిద్దంగా లేరు. చంద్రబాబు భూటకపు హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మడం వలననే తాను ఓడిపోయానని సర్ది చెప్పుకొంటున్నారు. తనను తాను దీనజన బాంధవుడిగా, రైతన్నల నేస్తంగా వర్ణించుకొనే జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలని మనస్పూర్తిగా కోరుకొని ఉంటే అందరూ మెచ్చుకొని ఉండేవారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేయలేక చేతులెత్తేయాలని, అప్పుడు తను ఆయనను ప్రజల మధ్య నిలబెట్టి చీల్చి చెండాడేసి, తన ఓటమికి ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడిపోతున్నారు.   రైతులు సంక్షేమం కోసం రుణాలు మాఫీ అవ్వాలని ఆరాటపడవలసిన జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా చంద్రబాబు నాయుడు విఫలం అవ్వాలని కోరుకోవడం గమనిస్తే ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్ధం అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రుణాల మాఫీ అంతా ఒక డ్రామా అని తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నిన్న చంద్రబాబు మొట్ట మొదట రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయడం, వెంటనే ఒక కమిటీని వేసి 45రోజుల్లో మొత్తం అన్ని రుణాల గురించి పూర్తి వివరాలు, వాటి మాఫీకి విధివిధానాలు చెప్పమని ఆదేశించడంతో కంగు తిన్నారు.   ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రుణాలమాఫీ చేయడానికి కమిటీ ఎందుకని ప్రశ్నిస్తూ చంద్రబాబుకి ఒక బహిరంగలేఖ వ్రాసారు. వెంటనే రైతుల రుణాలన్నీ మాఫీ చేయకపోతే వారు కొత్త రుణాలు తీసుకోవడానికి వీలుపడదని ఆందోళన పడిపోతున్నారు. ఆయన ఈ తపనంతా రైతుల సంక్షేమం కోసమే అయితే నిజంగా అందరూ మెచ్చుకొనేవారు. కానీ అది కేవలం చంద్రబాబుని ప్రజలలో దోషిగా నిలబెట్టేందుకేనని అర్ధమవుతూనే ఉంది.   చంద్రబాబు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసారు. కానీ ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. మంత్రులకు శాఖలు కేటాయించలేదు. కనీసం ఆర్ధికమంత్రిని కూడా ఇంకా నియమించలేదు. అందువల్ల ఇంకా తొలి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా తెలిసి ఉనప్పటికీ, తెలియనట్లుగా నటిస్తూ, ఇప్పటికిప్పుడు వెంటనే ప్రభుత్వం రుణాలు మాఫీ చేసేయాలని లేకపోతే ప్రజలను మోసం చేస్తునట్లేనని తేల్చి చెప్పడం చూస్తే ఆయన చంద్రబాబుపై ఎంతగా రగిలిపోతున్నారో, ఆయనను అప్రదిష్టపాలు చేయడానికి ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధమవుతుంది.   రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది రైతులు, వివిధ బ్యాంకుల ద్వారా తీసుకొన్న వేలకోట్ల అప్పుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా వాటిని ప్రభుత్వం మాత్రం ఏవిధంగా మాఫీ చేయగలదు? ఏ ఏ బ్యాంకుకు ఎంత మొత్తం అప్పులు తిరిగి చెల్లించాలి? దాని అసలెంత? వడ్డీ ఎంత? ముందుగా బ్యాంకులు రైతుల రుణాలను మొత్తం మాఫీచేసి, ఆ తరువాత వాటిని ప్రభుత్వం తిరిగి వాయిదా పద్దతుల ద్వారానో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ ఇవ్వడం ద్వారానో లేదా ప్రభుత్వ బాండ్లు వంటివి సమర్పించడం ద్వారానో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయా? వంటి అనేక వివరాలు సేకరించవలసిన అవసరముంటుంది.    నిరక్షరాస్యులయిన రైతులకు ఇటువంటి సాంకేతిక అంశాలు గురించి తెలియదు గనుక చంద్రబాబు రుణమాఫీ చేయకుండా తప్పించుకోనేందుకే కమిటీ వేసారని టాంటాం చేస్తూ జగన్మోహన్ రెడ్డి రైతన్నలను కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి తన మాటలు, చేతల ద్వారా వారికి దైర్యం చెప్పకపోగా వారిలో నిరాశ, నిస్పృహలు కలిగిస్తున్నారు. రైతన్నల సంక్షేమం కంటే, తన రాజకీయ శత్రువు చంద్రబాబుపై పైచేయి సాధించడమే ముఖ్యమనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాలో రైతన్నల రుణాలమాఫీపై వెనకడుగు వేసినా ఆయనను పల్లెత్తు మాటనలేదు. పైగా ఆయన అడగకుండానే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ చంద్రబాబు రుణాల మాఫీ చేస్తూ ఫైలుపై సంతకం చేసినప్పటికీ, ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరి గమనిస్తే ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. బహుశః దీనినే ఆయన విశ్వసనీయత అనుకొంటున్నారేమో!

చంద్రునికి పట్టాభిషేకం

  దేశంలో, రాష్ట్రంలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అప్పుడు ఏ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారం చేపడుతుందా? అనే ఆసక్తి తప్ప ప్రజలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలపై ఎటువంటి గొప్ప ఆశలు ఉండేవి కావు. ఎందువలన అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులలో ఎటువంటి మార్పురాదనే ఒక రకమయిన నిరాశ ప్రజలలో నెలకొని ఉండటమే కారణం. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో మాత్రం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యావత్ దేశ ప్రజలందరూ కూడబలుకొన్నట్లు, చాలా కసితో, చాలా ఆశతో అవినీతికి అసమర్ధతకు మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీని దించి, కేంద్రంలో నరేంద్ర మోడీని, ఆంధ్రాలో చంద్రబాబును, తెలంగాణాలో కేసీఆర్ లకు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు.   గత అరవై ఏళ్లలో రాజకీయ పార్టీలపై, చివరికి ప్రభుత్వాలపై కూడా ఎటువంటి నమ్మకం పెట్టుకోకుండా, ఏమీ ఆశించకుండానే ఓటేస్తూ వచ్చిన భారతీయలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈసారి కోటి ఆశలతో బీజేపీ, తెరాస, తెదేపాలకు ఏరికోరి ఓటేసి గెలిపించుకొన్నారు. గత అరవై ఏళ్లుగా దేశప్రజలందరూ ఎటువంటి అభివృద్ధికోసం కళ్ళుకాయలు కాసేలా చూస్తున్నారో, దానిని వారు ముగ్గురు కూడా ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించి చూపడమే కాకుండా దానిని నిజం చేసి చూపుతామని వారు ఇచ్చిన భరోసాయే ప్రజలను వారికి ఓటేయించింది. అందుకే వారి ముగ్గురిపై ప్రజలలో చాలా భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి.   ఇక మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కొలువు తీరి అప్పుడే కార్య రంగంలో దిగాయి గనుక, ఇక అందరి దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రీకృతమయి ఉన్నాయి. ఆయన తమను రుణవిముక్తులను చేస్తారని అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పాలనను, గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను ఆయన తిరిగి గాడిలో పెడతారని త్రిశంకు స్వర్గంలో నలిగిపోతున్న మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.   రాజధాని కూడా లేని దుస్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మించి ఇస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతిలో చిల్లి గవ్వ లేదని తెలిసినప్పటికీ, అపార పరిపాలనానుభావం, కృషి, పట్టుదల, కేంద్రంతో సత్సంబందాలు అన్నీ ఉన్న చంద్రబాబు తప్పకుండా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, మళ్ళీ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతారని ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు.   కోటి ఆశల నడుమ, కోటి సమస్యల నడుమ, శత కోటి సవాళ్ళ నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపడుతున్న చంద్రబాబు నాయుడు సమర్ధతకు, సార్యదక్షతకు ఇదొక పెద్ద సవాలు. సమస్యలెదురయినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటిని తన సమర్ధతను నిరూపించుకొనేందుకు వచ్చిన అవకాశాలుగా స్వీకరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. ఆ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పదం, కార్యదక్షతలను చూసే ప్రజలు నేడు ఆయనకు పట్టం కడుతున్నారు.   ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకొందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడుగారికి, ఆయన మంత్రివర్గ సభ్యులందరికీ తెలుగువన్ శుభాభినందనలు తెలియజేస్తోంది.

మోడీఫయింగ్ ఇండియా

  భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ ఆ పదవి ఎంత శక్తివంతమయినదో తన చేతల ద్వారా నిరూపించి చూపుతున్నారు. అధికారం చేప్పట్టిన తొలి రోజు నుండే గత పదేళ్లుగా నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్నిలేపి పరుగులు పెట్టిస్తున్నారు.   పోలవరం ముంపు గ్రామాలు ఆంద్రప్రదేశ్ లో విలీనం, నల్లదనం వెలికితీతకు సిట్ కమిటీ ఏర్పాటు, కొన్ని మంత్రివర్గాలను విలీనం చేసి మంత్రుల సంఖ్యను కుదించడం, ప్రభుత్వానికి పెనుభారంగా మారిన అనేక జీ.ఓ.యం.లను రద్దుచేసి, అధికారాలను తిరిగి కేంద్రమంత్రి వర్గానికి దఖలుపరచడం, దేశంలో మౌలికవసతుల మెరుగుపరచడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల మంజూరులో జాప్యం నివారించేందుకు నిర్దిష్ట సమయం నిర్ణయించడం వంటివి కేవలం వారం రోజుల వ్యవధిలోనే మోడీ చక్కబెట్టడం చూస్తే, ఆయనకు, డా. మన్మోహన్ సింగు పనితీరులో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా కనబడుతోంది. ప్రధానమంత్రి సమర్దుడయితే పరిపాలన ఎంత గొప్పగా చేయవచ్చో నరేంద్ర మోడీ అప్పుడే ఆచరణలో చూపిస్తున్నారు.   అది చూసి కాంగ్రెస్ పార్టీ యంపీ శశీధరూర్ మోడీని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. కానీ మోడీ ఏమాత్రం అతిశయానికిపోకుండా, తమ యంపీలకు కూడా కర్తవ్యం బోధించారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాలులో తమ పార్టీ ఎంపీలతో సమావేశమయిన ప్రధాని మోడీ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, “ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేమనే సంగతి అందరూ గుర్తుంచుకొని మెలగాలి. ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకొన్నామని గాలిలో తేలిపోకుండా రెండు కాళ్ళు బలంగా భూమిమీద ఉండేలా చూసుకోండి. అనవసర ఆర్బాటాలకు పోకుండా, మీ నియోజక వర్గాల ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరించి, మీ ప్రాంతాలను అభివృద్ధికి ఏమేమి చేయాలో అవసరమయిన పూర్తి సమాచారంతో అధికారులతో, మంత్రులతో తరచూ సమావేశాలకు హాజరవ్వండి. ఆవిధంగా చేయడం వలన అనేక సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా మీకు కూడా వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, వారి సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధి అనే మూడు సూత్రాల ఆధారంగా మీరందరూ పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. అధికారంలో ఉన్నందున మీడియా ముందుకు వచ్చి పార్టీ గురించి, ప్రభుత్వం గురించి అనవసరమయిన విషయాలు మాట్లాడకుండా కేవలం మీమీ నియోజక వర్గాలలో ఉండే సమస్యల గురించి మాత్రమే మాట్లాడమని నేను అభ్యర్ధిస్తున్నాను. అందరూ కూడా కేవలం అభివృద్ధినే అజెండాగా తీసుకొని పనిచేస్తే అనతికాలంలోనే దేశంలో అద్భుతమయిన ప్రగతి సాధించగలము.”   బహుశః మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఏనాడు కూడా తన యంపీలకు ఈవిధంగా కర్తవ్య భోధన చేసి ఉండరు. ఆ అవకాశం ఉన్న సోనియాగాంధీ తిరిగి పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాలి? అధికారం ఎలా సంపాదించుకోవాలి? అనే హితబోధ చేసారు తప్ప, ఈవిధంగా యంపీలకు కర్తవ్యం భోదించలేదు. అవకాశం దొరికితే రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంటూ లెక్చర్లు దంచే రాహుల్ గాంధీ కూడా ఏనాడు తన పార్టీ నేతలకు ఈవిధంగా దిశానిర్దేశం చేయలేదు.   కానీ మోడీ తన పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని పాలించే ప్రధాని ఏవిధమయిన నాయకత్వలక్షణాలు, ఆత్మవిశ్వాసం, దృడసంకల్పం, సమున్నత లక్ష్యాలు కలిగి ఉండాలో చాటి చెపుతున్నారు. తద్వారా ప్రజలలో, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలలో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడేలా చేయగలుగుతున్నారు. అందుకే గత పదేళ్లుగా డీలాపడిన రూపాయి మళ్ళీ బలం పుంజుకొంది. గత పదేళ్లుగా నత్తనడకలు నడుస్తున్న షేర్ మార్కెట్ ఇప్పుడు గుర్రంలా పరుగులు తీస్తోంది. ఈ సానుకూల మార్పులు కేవలం మోడీ సమర్ధత కారణంగానే కలుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగకుండా అటువంటి సమర్ధుడు, నాయకత్వలక్షణాలు గల నాయకుడిని ఎన్నుకొన్న భారతీయుల విజ్ఞతకు ప్రపంచమంతా అభినందనలు తెలుపుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా భారత్ ను ‘మోడి’ఫయింగ్ ఇండియా’ అని వర్ణిస్తోంది.

రైతుల రుణమాఫీలపై కూడా రాజకీయాలేనా?

  రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచేందుకు అనేక వాగ్దానాలు చేయడం పరిపాటి. గతంలో అయితే వాటిని ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు గనుక రాజకీయ పార్టీలు అధికారంచెప్పట్టగానే తమ హామీలను చెత్తబుట్టలో పడేసేవి. కానీ, ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పైగా డజన్ల కొద్దీ న్యూస్ ఛానళ్ళు అధికార పార్టీ చేసిన వాగ్దానాల సాధ్యాసాధ్యాల గురించి చాలా లోతయిన విశ్లేషణలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను కూడా మరింత అప్రమత్తం చేస్తున్నాయి. అంతేగాక అవి ప్రభుత్వాలను నీడలా వెంటాడుతూ వాటిని అమలు చేయకపోయినా, వాటిపై వెనక్కి తగ్గినా ప్రజా సమక్షంలో తూర్పారబడుతున్నాయి.   ఇక ఎన్నికలలో ఓటమిపాలయిన పార్టీలు ఆ దుగ్ధతో అధికారం చేపట్టిన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. జవాబుదారీతనం అలవాటులేని మన రాజకీయ వ్యవస్థలో ఈ మార్పు ప్రజలకు మేలుచేసే ఒక శుభపరిణామంగా భావించవచ్చును. అందువల్ల ఇకముందు రాజకీయ పార్టీలు నోటికి వచ్చిన హామీలు గుప్పించే సాహసం చేయడానికి వెనుకంజవేయవచ్చును.   అధికారం దక్కించుకొనేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎంత కష్టమో మొట్టమొదటిసారిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇపుడిపుడే అర్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో రైతుల  రుణాలు మొత్తం మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14సం.లలో తీసుకొన్న లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, వ్యవసాయం కోసం రైతులు బంగారు వస్తువులు బ్యాంకులలో తాకట్టుపెట్టి తెచ్చిన రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేసారు. ఈ సరికొత్త షరతులతో కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల రుణభారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అప్పుడే ప్రతిపక్షాలు, మీడియా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం ఆరంభించాయి. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఈవిధంగా ప్రయత్నించడంతో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం తలుచుకొంటే మొత్తం రుణాలు మాఫీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అందుకు ఇష్టపడలేదు. అందుకే విమర్శలు ఎదుర్కొంటోంది.   మిగులు బడ్జెట్ తో ఉన్నతెలంగాణా ప్రభుత్వమే ఆవిధంగా వెనకాడుతునప్పుడు, ఇక ఉద్యోగులకు జీతాలు కూడా ఈయలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా రూ.54,000 కోట్ల రుణాలను మాఫీ చేయగలరు? అనే ప్రశ్న తలెత్తడం సహజం. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడెపుడు అధికారం చేపడుతుందా?రుణాల మాఫీపై చంద్రబాబుని ఏవిధంగా ఇరుకున పెడదామా? అని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, వైకాప నేతలు కూడా చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకి ఇక ‘కౌంట్ డౌన్’ మొదలయిందని జగన్ అనడం చూస్తే, ఈవిషయంలో ఆయన ఎంత ఆత్రంగా ఉన్నారో అర్ధమవుతోంది.   తెలంగాణాలో అయినా, ఆంధ్రప్రదేశ్ లో అయినా ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవాలని ప్రయత్నించాలి. అందుకు ప్రతిపక్షాలు కూడా అన్నివిధాల సహకరించాలి. ఎన్నికలలో ఓడిపోయిన రాజకీయ పార్టీలు, మీడియా ముందుకు వచ్చి ఇకపై నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయి, అధికారా పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయడం మొదలుపెడతాయి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నాకూడా ప్రజాసంక్షేమం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప, ఆపేరుతో రాజకీయాలు చేయడం సమర్ధనీయం కాదు. ప్రబుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నప్పుడు, బాధ్యతగల ప్రతిపక్షం పార్టీగా ముందుగా ప్రభుత్వానికి తగిన  సలహాలు సూచనలు ఇవ్వాలి. అప్పటికీ  ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తే, అప్పుడు తప్పకుండా నిలదీయవచ్చును. కానీ ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయితే చాలు, వాటిని ఇరుకున పెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి తామేదో ఘనకార్యం సాధించినట్లు సంతోషపడాలనుకోవడం వికృతానందమే తప్ప మరొకటి కాదు. అన్నదాతల సమస్యలను మానవతా దృక్పధంతో చూడకపోగా, వాటిని కూడా రాజకీయం చేసి లబ్దిపొందాలనుకోవడం పైశాచిక (సాడిస్ట్) ఆలోచనే.

ఆ నలుగురూ...

  రాజకీయనేతల అందరి రాజకీయ జీవితాలలో ఒడిడుకులు సహజమే. కానీ ఒకేసారి రివ్వున పైకెదిగి, అంతే వేగంగా పడిపోయిన వారి సంఖ్య వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చును. అటువంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పేర్లను ప్రముఖంగా చెప్పుకోవచ్చును.   ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, తన మూడేళ్ళ పాలనలో ఒక వెలుగు వెలిగారు. తన మంత్రి వర్గ సహచరులను కానీ, ప్రతిపక్ష నేతలను గానీ ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని అనుకరించబోయి వాతలు పెట్టుకొన్నారు. తన మూడేళ్ళ పాలనలో పార్టీలో వారిని, బయట వారినీ, చివరికి అధిష్టానాన్ని అందరినీ కూడా శత్రువులుగా మార్చుకొన్న ఘనత ఆయనకే స్వంతం. అయితే ఆయన రాష్ట్ర విభజన అంశం తలకెత్తుకొన్నాక ప్రజలలో కొంత మంచి పేరు సంపాదించిన మాట వాస్తవం. కానీ, ఆయనే అధిష్టానానికి సహకరిస్తూ దగ్గరుండి రాష్ట్ర విభజన చేస్తూ, ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించడం మొదలు పెట్టిన నాటి నుండి ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఆ సంగతి గమనించకుండా పార్టీ పెట్టి ఉన్న పరువు కూడా తీసుకొన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఏమి చేస్తున్నారో అంతకంటే తెలియదు.   ఇక జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులు, జైలు జీవితం అనుభవించినప్పటికీ ఆయనకు ప్రజాధారణ తరగలేదు. స్వర్గీయ వైయస్సార్ చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలే జగన్ కు శ్రీరామరక్షగా నిలిచాయి. ఆయన ఆకస్మిక మరణంతో ప్రజలలో జగన్ పట్ల సానుభూతి పొంగిపొరలింది. దానిని జగన్ బాగానే ఒడిసిపట్టి, చాలా భద్రంగా ఐదేళ్ళు కాపాడుకొచ్చినప్పటికీ, ఎన్నికలలో ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. పోలింగ్ జరిగేరోజు వరకు కూడా అన్ని సర్వేలు వైకాపాయే భారీ మెజార్టీతో గెలుస్తుందని బల్లగుద్ది చెప్పినప్పటికీ వైకాపా ఓడిపోయింది. అందుకు కారణాలు అనేకం. అవేమిటో ప్రజలకు బాగానే తెలుసు. భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మోడీ ప్రధాని బాధ్యతలు చెప్పట్టగానే ఆయనను మంచి చేసుకోవడానికి డిల్లీకి పరుగులు పెట్టడం చూస్తే జాలి కలుగుతుంది. ఇక మరో ఐదేళ్ళు తన పార్టీని, తనను తాను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సామువంటిదే.   ఇక ఆమాద్మీ పార్టీ పెట్టిన ఏడాదిలోనే డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన అరవింద్ కేజ్రీవాల్, కేవలం 49రోజులలోనే తనంతట తానే అధికారం వదులుకొన్నారు. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురతాననట్లు డిల్లీని పాలించలేని ఆయన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి దేశాన్ని ఏలేందుకు సిద్దమవడం ప్రజలు ఆమోదించలేకపోయారు. అందుకే ఆయన ప్రజల చేతిలో చెంపదెబ్బలు తిన్నారు, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నికలలో భంగపడ్డారు. ఆ తరువాత మళ్ళీ డిల్లీ పీఠం ఎక్కే ప్రయత్నం చేసారు. కానీ కాంగ్రెస్ మద్దతు నిరాకరించడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు.   అప్పుడే ఆయన తనకు జ్ఞానోదయం అయినట్లుగా “ప్రజలు అప్పగించిన అధికారం అర్దాంతరంగా వదిలిపెట్టినందుకు డిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకొని, మళ్ళీ అధికారం ఇస్తే ఈసారి ఐదేళ్ళు పాలిస్తానని” వేడుకొన్నారు. దానికి డిల్లీ ప్రజల నుండి కనీస స్పందన కూడా కరువయింది. ఈ అవమానాలు చాలవన్నట్లు బీజేపీ నేత నితిన్ గడ్కారీపై చేసిన అవినీతి ఆరోపణలు చేసినందుకు కోర్టు గడప ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన వివేకం ఏమయిపోయిందో తెలియదు. కోర్టు ఆయనకు రూ.10 వేలు పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసేందుకు సిద్దపడినా, ఆయన నిరాకరించి తీహార్ జైలు చిప్పకూడు రుచి చూసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు చెల్లించి బెయిలు తీసుకోవడం నవ్వు తెప్పిస్తుంది.   ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓటమి తరువాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో సీనియర్ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బహుశః మరి కొద్ది రోజులలలో ఆమాద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మిగిలినా ఆశ్చర్యం లేదు. వాపును చూసి బలుపు అనుకోవడం వలన తిప్పలే ఇవ్వనీ.   ఇక యువరాజవారు రాహుల్ గాంధీకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మాజీ ప్రధాని మాన్మోహన్ సింగుతో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఆయనకు దాసోహం అన్నప్పటికీ, కాంగ్రెస్ స్వీయ తప్పిదాల కారణంగా ఎన్నికలలో ఓడిపోయింది. దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలుగన్న ఆయన, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఏకంగా 10 ఏళ్ళు జాప్యం చేయడంతో ఘోర తప్పిదం చేసారు. దేశానికి ప్రధాని కావాలనుకొన్న ఆయన ఇప్పుడు కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించేందుకు కూడా వెనకాడటం చూస్తే ఆయన ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సమర్ధంగా అభివృద్ధిపధంలో నడిపించగలిగితే, ఇక రాహుల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడం తధ్యం.