సభలో చూడకూడనివి చూస్తున్నాం

హైదరాబాద్: శాసనసభలో దాడులు పునరావృతం అవుతుంటే మిగిలిన వారు సైలెంట్‌గా ఉంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. ఈ శాసనసభలో చూడకూడని సంఘటనలు చూస్తున్నామన్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి ప్రతిపక్ష సభ్యులపై దూషణలు చేయడం, దాడి చేయడం విచారకరమన్నారు. సభలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన మంత్రి బేషరతుగా సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అనుచిత చర్యలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరి తీసుకోవాలన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఈ సంఘటన పునరావృతం అయ్యేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలన్నారు. పత్రికల్లోగానీ, ప్రజల్లోగానీ సభపై గౌరవం పోయిందన్నారు. సభా గౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, స్పీకరు నాదెండ్ల మనోహర్ పాటుపడాలన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అందరూ మౌనంగా ఉండి కొంతమంది దుశ్చర్యలను చూస్తూ ఊరుకుంటే బలయ్యేది 294 మంది శాసనసభ్యులు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలన్నారు. నాయకత్వం అనేది దూరదృష్టి, విజ్ఞతతో, ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉండాలన్నారు. ఈ సంఘటనను తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయంగా పైచేయి సాధించుకోవడానికే పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. ఆయనకు ఇంత కోపం రావడానికి గల కారణాలు ఏమిటో అర్థం కావటం లేదని సిపిఎం శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దోషి కాకుంటే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చించి వేయడం, ప్రతిపక్ష సభ్యులను పట్టి నెట్టివేయడం, దుర్భాషలాడటం మంత్రి రౌడీయుజం చేసినట్టుగా వ్యవహరించారన్నారు.

వైఎస్ వివేకాను బుజ్జగించే పనిలో...

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, ప్రభాకర్‌లపై దాడి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందను రాజీనామా చేయవద్దని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రి వట్టి వసంత్ కుమార్ బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి సభ్యులపై వివేకా దాడిని పార్టీలకతీతంగా అందరూ ఖండించారు. వివేకా వెంటనే సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు వివేకాతో క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు వివేకా ససేమీరా అన్నట్టుగా తెలుస్తోంది. తాను మంత్రి పదవికి రాజీనామానైనా చేస్తాను కానీ క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన తన రాజీనామాను కూడా సమర్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడు అయిన ఉండవల్లి, వట్టి వసంత్ కుమార్‌లు వివేకాను రాజీనామా చేయవద్దని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, అసెంబ్లీలో జరిగిన సంఘటనపై తాను సభలోనే మాట్లాడతానని మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

ఇది సమర్థనీయమా?

హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తీరును బట్టి ఆ కుటుంబ సంస్కృతి ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి మండిపడ్డారు. వైయస్ కుటుంబం ఎలా దాడులు చేస్తుందో, ఎలా దౌర్జన్యాలు చేస్తుందో ఈ సంఘనట మంచి నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూపందేరాలపై జెఎల్పీ వేయాలని డిమాండ్ చేస్తున్న టిడిపి శాసనసభ్యులపై వివేకానంద తిడుతూ చొక్కా పట్టుకున్నారని చెప్పారు. ఇది సమర్థనీయమా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారన్నారు. మంత్రి వివేకానందరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలంగాణ టిడిపి ఫోరం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగుదేశం భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందిగా శాంతియుతంగా అసెంబ్లీలో పోరాడుతుందన్నారు. కానీ మంత్రి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరిస్తూ టిడిపి సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. మంత్రి వెంటనే రాష్ట్ర ప్రజలకు, సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నారు. తన భూకబ్జాలు బయటపడుతుందనే వివేకా దాడి చేశారని అన్నారు. రంగారెడ్డి జిల్లా భూములు అన్నింటిని వైయస్ హయాంలో దోచుకున్నారని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్ సెషన్స్‌ను నడిపించడంలో డిప్యూటీ స్పీకరు నాదెండ్ల విఫలమయ్యారన్నారు. భూకేటాయింపులపై చంద్రబాబు హయాంలో జరిగిన వాటికి కూడా జెఎల్పీ వేసుకోవచ్చునని డిమాండ్ చేశారు. కాంగ్రెసులో జగన్ వర్గం ఒకటి ఉందని వాళ్లు కూడా దాడి చేయడం శోచనీయమన్నారు.

వైఎస్ వివేకా తీరు.. ఆత్మరక్షణలో ప్రభుత్వం

హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ప్రవర్తించిన తీరు వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని వారంటున్నారు. మంత్రిగా ఉంటూ వివేకానంద రెడ్డి ఆ విధంగా వ్యవహరించడం సరి కాదని సహచర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేయనప్పటికీ మంత్రులు దాదాపు అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇలాంటి సభలో ఉన్నందుకు బాధపడుతున్నానని ఆయన అన్నారు. కాగా, మరో మంత్రి వట్టి వసంతకుమార్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులతో వాగ్వివాదానికి దిగారు. వైయస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమార్ మాటలను బట్టి చూస్తే మంత్రులు ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నప్పుడు మంత్రులు చాలా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని, వారు అలా వ్యవహరించకపోతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని వారంటున్నారు.

సమస్యను పక్కదారి పట్టించడానికే...

హైదరాబాద్: భూములకు సంబంధించిన సమస్యను పక్కదారి పట్టించడానికే మంత్రి రఘువీరారెడ్డి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు దాడి చేశారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. హౌస్ కమిటీగానీ, జెఎల్పీ వేయకుండా కొందరు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. మంత్రి హోదాలో ఉండి తోటి సభ్యులపై చేయి చేసుకోవడం విచారకరమన్నారు. సదరు మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా భూకేటాయింపులపై చర్చకు రాకుండా చేస్తున్నారన్నారు. జెఎల్పీ వేయకపోవడం అక్రమాలనుండి తప్పించుకోవడానికే అన్నారు. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. అసెంబ్లీ పట్ల ప్రజాప్రతినిధులకు గౌరవం తగ్గిపోయినట్లుగా కనిపిస్తోందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో దాడి చేసే శాసనసభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరాచకానికి పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలన్నారు.

'మంత్రి దాడి చేయడం అప్రజాస్వామికం'

హైదరాబాద్: మంత్రిగా ఉన్న వ్యక్తీ స్వయంగా దాడిచేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి అన్నారు. శాసనసభ గౌరవం, మర్యాదలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-టీడీపీలు పట్టించుకోవటం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఘర్షణ అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించారు. అధికార, విపక్షాలు సొంత ఎజెండాలతో సభా సమయాన్ని, విలువలను మంటగలుపుతున్నాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చి వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి గత ముప్పయి రోజులుగా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యయుతంగా సభకు పంపిస్తే ఇక్కడ వారు మాత్రం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ మీసాలు దువ్వుకుంటూ, జబ్బలు చరుచుకుంటున్నారన్నారు. ఇలా రౌడీల్లా ప్రవర్తించే వారని ప్రజలు సభకు పంపించవద్దని కోరారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభా మర్యాదలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని ఆయన కోరారు.

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై మండిపడ్డ వట్టి

హైదరాబాద్: శాసనసభలో జరిగిన ఘటనపై మంత్రి వట్టి వసంతకుమార్ వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన్నులాట తర్వాత సభ వాయిదా పడింది. సభ వాయిదా తర్వాత వసంతకుమార్‌కు, వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా వట్టి వసంతకుమార్ వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కాగా, శాసనసభ లోపల జరిగిన ఘటన తర్వాత లాబీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముష్టియుద్ధం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిపై, జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, మరికొందరు శాసనసభ్యులు బూతులు తిట్టారని తెలుగుదేశం శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.

వివేకాకు క్లాస్ పీకిన కిరణ్ కుమార్

హైదరాబాద్: శాసనసభలో సోమవారం జరిగిన తన్నులాటపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని చీవాట్లు పెట్టినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. వైయస్ వర్గం దొంగల ముఠా అనే ప్లకార్డులను ప్రదర్శించిన తెలుగుదేశం సభ్యులపై వైయస్ వివేకానంద రెడ్డితో పాటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. కాగా, తాజా సంఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు సభలో లేరు. సంఘటన గురించి తెలుసుకున్న ఆయన తన పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. గత వారం రోజులకు పైగా వైయస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సంయక్త సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సభ్యులు శాసనసభను స్తంభింపజేస్తున్నారు. శనివారం నుంచి వారికి ప్రతిగా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ నినాదాలు చేయడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆందోళనకు ప్రతిగా జగన్ వర్గం శాసనసభ్యులు ఆందోళనకు దిగిన సందర్భంలోనే తన్నులాట చోటు చేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి సహనం కోల్పోయి చింతమనేని ప్రభాకర్‌పై చేయి చేసుకున్నారు. తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడిపై కూడా దాడికి ప్రయత్నించారు.

జగన్ వర్గం వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో ఉన్న జగన్ వర్గానికి చెందిన సభ్యులు ప్రజాప్రతినిధులు కారని వీధి రౌడీలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఆరోపించారు. ఇలాంటి వారిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ అవినీతి అక్రమాలపై ఎల్జీపీ వేయాలని కోరుతూ తెదేపా సభ్యులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. వైఎస్ దొంగల ముఠా అంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఆగ్రహించిన మంత్రి వైఎస్.వివేకా తెదేపా సభ్యులను అడ్డుకునేందుకు వెళ్లారు. ఇదేసమయంలో వివేకాకు మద్దతుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు వచ్చి తెదేపా సభ్యులపై దాడులకు పాల్పడినట్టు సమాచారం. దీనిపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన తానెన్నడూ చూడలేదన్నారు. సాక్షాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, జగన్ వర్గానికి చెందిన సభ్యులు తెదేపా సభ్యులపై దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. అందువల్ల వీరిని వీధి రౌడీలతో పోల్చుతున్నట్టు చెప్పారు. సభలో దూకుడుగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తానే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే.. ఈ పాటికి సభా మర్యాదలను అప్రతిష్టపాలుజేసిన మంత్రిని బర్తరఫ్ చేసి ఉండేవాడినన్నారు. ముఖ్యమంత్రి వారిని సభ నుండి సస్పెండ్ చేయకుండే సరికాదన్నారు. అలా చేయకుంటే సభా హక్కుల ఉల్లంఘన పెడతామని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు కండబలం ఉపయోగించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. టిడిపి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వాటిపై జెఎల్పీ కోసం టిడిపి పట్టుబట్టిందన్నారు. వైయస్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు భారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నప్పుడు మాట్లాడని మంత్రి వివేకానందరెడ్డి వైయస్ పాలనలో జరిగిని అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పవలసిన మంత్రి దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో తన్నులాట

హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా టీడీపీ- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సభలో బాహాబాహీకి దిగారు. వైఎస్‌ఆర్ దొంగల ముఠా అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు, ఫ్లకార్డులు ప్రదర్శించటంతో మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులను లాక్కున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రత్యక్షంగా దాడులకు దిగారు. కుర్చీలు విసురుకుంటూ పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. సభ వాయిదా పడినా గలాటా కొనసాగింది. కాగా ప్లకార్డుల ప్రదర్శనే ఈ గొడవకు కారణం అయ్యింది. సభ్యుల పరస్పర దాడులతో అసెంబ్లీలో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.  

పుదుచ్చేరి, కేరళల్లోనూ చిరు ప్రచారం

హైదరాబాద్: తమిళనాటే కాదు.. పుదుచ్చేరి, కేరళల్లోనూ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. తమిళనాడుతో పాటుగా ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారు. తమిళనాడులో చిరంజీవి ప్రచారానికి సంబంధించి ఆ పార్టీ తమిళనాడు విభాగం టీఎన్‌సీసీ కసరత్తు తుది దశకు చేరుకుంది. సోమ, మంగళవారాల్లో దీనికి సంబంధించి షెడ్యూల్‌ను చిరంజీవికి పంపే అవకాశం ఉంది. వారంపాటు తమిళనాడులో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత పుదుచ్చేరి, కేరళల్లో ఈ ప్రచారం సాగుతుంది.

కామన్వెల్త్‌ క్రీడల దుర్వినియోగం 900 కోట్లు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణలో జరిగిన అవకతవకల వల్ల సుమారుగా రూ.900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఈ అవకతవకలపై దర్యాప్తు కోసం ప్రధాని నియమించిన షుంగ్లూ కమిటీ వెల్లడించింది. కామన్వెల్త్‌ క్రీడలకు సమయం సమీపిస్తున్నా సంబంధిత నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ఆలస్యం చేయడం, అనంతరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యల వల్ల ఈ మొత్తం నష్టం వచ్చిందని కమిటీ పేర్కొంది. కామన్వెల్త్‌ క్రీడా గ్రామం నిర్మాణంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డిడిఎ)కు రూ.300 కోట్ల నష్టమొచ్చిందని తెలిపింది. రూ.250 కోట్ల ప్రజాధనం నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిందని వివరించింది. క్రీడా గ్రామం నిర్మాణం, నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయాలపై కమిటీ సమర్పించిన నివేదికలు ఈ విషయాలను స్పష్టం చేశాయి. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తేజిందర్‌ ఖన్నా, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, ఇతర అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని కూడా కమిటీ పేర్కొంది. క్రీడా గ్రామంలో అనేక సమస్యలున్నాయని కమిటీ తన రెండో నివేదికలో పేర్కొంది. అప్పగించిన పనులను సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో చేయడంలో కన్సల్టెంట్‌ సంస్థ విఫలమైందని 16 మందిని ప్రశ్నించడం ద్వారా కమిటీ కనుగొంది. బిల్డర్‌గా ఉన్న ఎమ్మార్‌ ఎంజిఎఫ్‌కు ఉద్దీపనలు అందించడాన్ని కూడా కమిటీ ప్రశ్నించింది. ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.

మంత్రి పదవికి వైఎస్ వివేకా రాజీనామా?

హైదరాబాద్: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. శాసనసభ, శాసనమండలిలో సభ్యుడు కాకుండా మంత్రిగా ఉంటూ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికైన వివేకానందరెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఉప ఎన్నికల బరిలో దించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన్ని శాసనమండలికి ఎంపిక చేయలేదు. దాంతో రేపటినుంచి శాసనసభలోగాని, మండలిలోగాని సభ్యుడు కాకుండానే మంత్రిగా కొనసాగాల్సి వస్తుంది. మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లో ఆయన ఏదోక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వివేకానందరెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి తల్లి, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేయనున్నారు. వివేకాను పులివెందుల అసెంబ్లీనుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే, తన వదిన మీదే ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా ఉంటూ పోటీ చేసినట్లయితే పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని వివేకా నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మంత్రిగా ఉంటూ పోటీ చేసి ఒకవేళ గెలిచినట్లయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారన్న అపవాదు వస్తుందని, ఒకవేళ ఓటమి చెందితే మంత్రిగా ఉంటూ కూడా గెలవలేకపోయారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివేకా భావిస్తున్నట్టు సమాచారం. అందువల్ల మంత్రి పదవికి రాజీనామా చేసి, ఒక సాధారణ నాయకునిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకు మంచి సంకేతాలు పంపించినట్లు అవుతుందని, వివేకా మళ్ళీ మంత్రి కావాలంటే తప్పనిసరిగా గెలిపించాలని ప్రచారం చేసేందుకు కూడా వీలు పడుతుందని కడప జిల్లా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ఇంద్రకరణ్ జగన్‌ పార్టీలోకి జంపా

హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి  వైయస్ జగన్‌ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రకరణ్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ స్థితిలో ఆయన ఆదివారం హైదరాబాదులో వైయస్ జగన్‌ను కలిశారు. తాను మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, జగన్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఆయన కొనియాడారు. ఆయన మాటలు చూస్తుంటే జగన్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది.

జెసి మాటలు ఎవరూ నమ్మట్లే

హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి తాను కారణం కాదంటూ ఆ పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఎంతగా చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెసులో జెసి దివాకర్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవడం వల్లనే జెసి దివాకర్ రెడ్డి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని ఓడించి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డిని గెలిపించారనే అభిప్రాయాన్ని జెసి దివాకర్ రెడ్డి కాదని అనిపించలేకపోతున్నారు. మెట్టు గోవింద రెడ్డిని గెలిపించడంలో జెసి ప్రధాన పాత్ర పోషించారనే విషయం బహిరంగంగానే బయట పడిందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి పని చేశారని ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేందుకే జేసీ ఇలా వ్యవహరిస్తున్నారన్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కార్యకర్తల ముందు ఇప్పటికైనా జేసీ తప్పు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ను వీడి జేసీ దివాకర రెడ్డి పోటీ చేస్తే ఆయనపై తాము పోటీకి సిద్ధమని సవాలు విసిరారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో మంత్రి శైలజానాథ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి రఘువీరా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెసిని విషపు పురుగుగా అభివర్ణించారు. దానికి జెసి దీటైన సమాధానం ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో రఘువీరా రెడ్డిపై ఆగ్రహంతో కాంగ్రెసు అభ్యర్థిని జెసి ఓడించారని అంటున్నారు. రఘువీరా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి మధ్య పోరుతో అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. భవిష్యత్తులో కూడా అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. జెసి దివాకర్ రెడ్డి వైయస్ జగన్‌ను సాకుగా చూపి రఘువీరా రెడ్డిని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. రఘువీరా రెడ్డిని జగన్ మనిషిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

తెరాస కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం

కర్నూలు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖమంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణా ఇస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని వివరించారు. మొదట గులాబీలతో శ్రీకృష్ణ కమిటీని ఆహ్వానించిన టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం నివేదికపై పరుషంగా మాట్లాడుతున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శ్రీకృష్ణ కమిటీపై పరుష పదజాలంతో మాట్లాడిన వారి నాలుకలు కోసే చట్టాలు తీసుకురావాలని ఆయన అన్నారు. నివేదికలోని ఎనిమిదవ అంశంలో ఉద్రేకపూరిత సమాచారం ఉండడంతోనే కమిటీ బయటపెట్టలేదని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో పార్టీలో కేసీఆర్‌కు పట్టులేదని స్పష్టమైందన్నారు. తెలంగాణా ఉద్యమం కేసీఆర్ చేయి దాటి పోయిందన్నారు. మిలియన్ మార్చ్‌కు 10 లక్షల మంది లక్ష్యం కాగా కనీసం పదివేల మందిని కూడా సమీకరించలేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. రాయలసీమకు శ్రీకృష్ణ కమిటీ అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమ వెనుకబడిన ప్రాంతమని పేర్కొందే కానీ దానికి పరిష్కారం చూపలేదని ఆయన చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణా ఇస్తే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

రాజధానిలో క్రికెట్ బుకీ అరెస్టు

హైదరాబాద్: వరల్డ్ కప్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ ప్రధాన బూకీని పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని హైదరాబాదు కేంద్రంగా బెట్టింగులకు పాల్పడుతున్న విక్కీ అనే ముఖ్యమైన బూకీని పోలీసులు అరెస్టు చేశారు. విక్కీతో పాటు మరో నలుగురు ఫాంటర్లను, పదిమంది బెట్టింగుకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విక్కీతో పాటు బెట్టింగుకు పాల్పడుతున్న సుదేశ్, సురేశ్, ప్రమోద్, వినోద్‌తో పాటు ఓ మాజీ నిర్మాత కుటుంబాన్ని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. సదరు నిర్మాత కుటుంబం గత కొన్నాళ్లుగా బెట్టింగులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. అస్ట్రేలియాపై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్ సెమీ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో పోరుకు దిగుతున్నందున బెట్టింగుల జోరు అందుకుంది. భారత్-పాక్ జట్ల మధ్య పోరు కావడంతో బెట్టింగు చాలామంది పాల్పడే అవకాశముందని గుర్తించిన పోలీసులు ఓ కన్ను వేస్తున్నారు. దీనిలో భాగంగా విక్కీని అరెస్టు చేశారు. విక్కీ కింద నగరంలో సుమారు వందమంది ఫాంటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విక్కీకి నెట్ వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ సుమారు రూ.5 కోట్లనుండి 10 కోట్ల రూపాయల మేరకు బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో విక్కీ ఓ రూంలో ఉండి లాప్‌టాప్ ద్వారా బెట్టింగులు నిర్వహించే వాడని తెలుస్తోంది. ఇప్పుడు ఫాంటర్లను నియమించుకొని నేరుగా బెట్టింగు చేసే వ్యక్తుల ఇళ్లకు పంపిస్తున్నారని సమాచారం.

తెలుగుదేశం సిద్ధాంత పార్టీ: బాబు

హైదరాబాద్: తెలుగుదేశం సిద్ధాంత పార్టీనే తప్ప అధికారం కోసం ఏర్పడిన పార్టీ కాదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సిద్ధాంతాలలో ఎలాంటి మార్పు ఉండదని మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అయితే మార్పులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నముక అన్నారు. నగదు బదిలీ పథకం చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఇప్పటివరకు పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై ఈ నెల 29వ తేది నుంచి సమీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో పార్టీ వల్ల ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బందులేదురైన పరిస్థితులు ఏమైనా ఉంటె వాటిపై సమీక్ష జరిపి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టినా మనుగడ సాగించలేకపోయాయన్న చంద్రబాబు కాంగ్రెస్ లో పీఆర్పీవిలీనాన్ని ఉదాహరించారు. కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీగా మారే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం తీసుకున్న చొరవేనని అన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకత్రాటిపైకి తెచ్చిన ఘనత కేవలం టిడిపిదే అన్నారు. చదువుకునే వారు రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలని ఎన్టీఆర్ ఆశించారని అందుకు అనుగుణంగానే పార్టీ వెళుతుందన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్వనస్థను రద్దు చేసిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు.