అసెంబ్లీలో సీను మారలేదు

హైదరాబాద్:  ఆఖరి రోజు కూడా అసెంబ్లీలో సీను మారలేదు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేల ఘర్షణ మధ్య నాదెండ్ల సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు సభలో ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించవద్దని సభ్యులను కోరారు. సభ ప్రారంభమయ్యాక విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభ్యులు కోరారు. అయితే ఆయన తిరస్కరించారు. సభ్యులు అందరూ నిలబడి వివిధ అంశాలపై ఒకేసారి మాట్లాడటంతో వారి వారి స్థానాల్లో కూర్చోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు ముసుగులో తన ఓదార్పు యాత్రను చేపడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు  విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నందున సమావేశాలను  వారం పాటు పొడిగించాలని ఆయన డిప్యూటీ స్పీకరును కోరారు. జగన్ ఆస్తులపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

30వ వసంతంలోకి టీడీపీ

హైదరాబాద్: టీడీపీ పార్టీ 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశాం, ఇంకా ఏం చేయాలనే దానిపై పూర్తిగా సమీక్షిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు అన్నారు. ప్రజలకు పునరంకితం అయ్యేందుకు ఎలా ముందుకు వెళ్లాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాడు కేంద్ర స్థాయి పార్టీని ప్రతిపక్ష స్థాయిలో కూర్చుండబెట్టిన అరుదైన గౌరవం టిడిపిదే అన్నారు. టిడిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. వచ్చే మహానాడు వరకు పార్టీ విధివిధానాలు నిర్ణయించి ప్రజలలోకి తీసుకు వెళ్లే కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగువారి గురించి ప్రపంచానికి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపి జెండా బడుగు బలహీన వర్గాలకు అండ అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. నేటి నుండి వచ్చే సంవత్సరం మహానాడు వరకు 14 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో పార్టీ పెట్టారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి కార్యకర్తలు, నేతలు కలిసి పని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

స్పీకరు ప్రాంతీయ విభేదాలు

హైదరాబాద్: ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ఎదురుగానే ఓ మంత్రి శాసనసభలో శాసనసభ్యునిపై దాడి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఖండించారు. నాదెండ్ల తీరు ఓ ప్రాంతానికో ఓ న్యాయం, మరో ప్రాంతానికి మరో న్యాయం అన్నట్లుగానే ఉందన్నారు. శాసనసభలో స్వయంగా మంత్రులే దాడి చేయడం శోచనీయమన్నారు. తాము స్పీకరు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. అయితే మాకో న్యాయం వివేకానందరెడ్డికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. స్పీకరు ముందే వివేకా ఎమ్మెల్యేలపై దాడి చేస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంతీయ విభేదాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మాకు న్యాయం జరుగుతుందనేది స్పష్టం అవుతుందన్నారు. మరోవైపు సమైక్య రాష్ట్రంలో ప్రాంతాల వారిగా న్యాయం ఉంటుందా అని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించారు. సాక్షాత్తు శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై దాడి చేసిన మంత్రివర్యులపై స్పీకరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు అత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ సాధించుకునే వరకు అందరం కలిసి పోరాడుదామన్నారు. కాగా తన రాజీనామాను ఆమోదించాలని నాదెండ్ల మనోహర్‌ను కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిఆర్ఎస్‌తో కలిసి ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికే రాజీనామా చేసినట్టు చెప్పారు.

ఉప ఎన్నికల్లో గెలిచేందుకే ఈ డ్రామా

హైదరాబాద్: త్వరలో జరుగనున్న కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో గెలిచేందుకే రాష్ట్రమంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి దివంగత మహానేత వైఎస్ఆర్‌పై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీతో పాటు.. విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, జగన్ వర్గం ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి మంత్రిదే తప్పు అన్నట్టుగా అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీలో వైఎస్‌ వివేకానంద ఓవర్‌యాక్షన్‌ చేశారని, ఇదంతా కడప, పులివెందుల ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలవడానికి చేసే ఎత్తుగడల్లో భాగమేనని జగన్‌ వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. వైఎస్‌ఆర్‌పై కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేతలు వి.హనుమంతరావు, శంకర్రావు, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి అనేక మంది సీనియర్ నేతలు విమర్శల వర్షం గుప్పిస్తున్నా పట్టించుకోని వైఎస్ వివేకా.. సోమవారం ఉన్నట్టుండి ఫైర్ కావడానికి ఇదే కారణమని వారు అంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపునకు ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ వివేకాతో ఆడిస్తున్న డ్రామాగా వారు అబివర్ణించారు.

కిరణ్ డైరెక్షన్‌లోనే వివేకా నాటకం?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్షన్‌లోనే వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం అసెంబ్లీ నాటకాన్ని నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. శాసనసభలో వైయస్సార్‌పై తెలుగుదేశం ఆరోపణలను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ముందుకు వచ్చి ఎదురు దాడికి దిగారు. ఈ స్థితిలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను కాపాడడానికి జగన్ మాత్రమే ముందుకు వచ్చారనే అభిప్రాయం బలపడే స్థితి ఏర్పడింది. దీన్ని అడ్డుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని ముందుకు తోసినట్లు చెబుతున్నారు. శాసనసభలో తెలుగుదేశం సభ్యులపై దాడికి ప్రయత్నించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహారమంతా కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లే జరిగిందని అంటున్నారు. ఇందుకుగాను మంత్రి వట్టి వసంతకుమార్, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్పిప్టు తయారు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సభలో క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో వివేకానంద రెడ్డి వట్టి వసంతకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లోనే వైయస్ వివేకానంద రెడ్డి స్క్రిప్టు రెడీ అయినట్లు చెబుతున్నారు. సభలో క్షమాపణ చెప్పే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి రాసుకొచ్చిన ప్రకటన చదివారు. దాన్ని బట్టి ఓ పద్ధతి ప్రకారం ఆ ప్రకటనను తయారు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. వివేకానంద రెడ్డిని బర్తరఫ్ చేసి, భూ కేటాయింపులపై సంయుక్త సభా సంఘాన్ని వేసే వరకు సభకు రానని చెప్పిన చంద్రబాబు తన డిమాండ్లు నెరవేరకుండానే సభకు రావడం వెనక జగన్‌ను అడ్డుకునే వ్యూహం అంటున్నారు.

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన జగన్

విజయనగరం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ జిల్లాలోని శృంగవరపుకోటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ప్రజల ముఖాన చిరునవ్వును చూసేందుకు ఆనాడు దివంగత మహానేత ప్రియతమ నేత వైఎస్సార్ తపిస్తుండేవాడని చెప్పుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజలు బాగు పట్టని ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రావన్నారు. సిగ్గులేని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కయి అత్యంత గొప్పవాడైన వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి రాలేడని తెలిసి, చెప్పుకోలేడని తెలిసి, వైయస్ లేరనే విషయాన్ని మరిచిపోయినట్లు నటిస్తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి బురద చల్లే కుట్ర చేస్తున్నాయని, అది చూస్తుంటే గుండె బరువెక్కుతోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారని, మనం బతికి ఉండగా ఎంత మంది జైజైలు కొట్టారనేది ముఖ్యం కాదనీ మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచిపోయామనేది ముఖ్యమని చెబుతూ ఉండేవారని, ఆ మాటలే శ్రీరామరక్షగా తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కూడదని చెప్పేవారమని, ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. మహానేత వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని మండిపడ్డారు. ఆ తర్వాత జగన్ వర్గం నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బం హరి మాట్లాడుతూ.. జిల్లాలో వైఎస్ జగన్ అడుగు పెట్టనంత వరకూ కొంతమంది ఆటలు సాగాయనీ, ఇక నుంచి సాగవన్నారు. జగన్ రాకతో ఆ నాయకులు తమ అడ్రెస్‌లు ఎక్కడున్నాయో వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు.

వైఎస్ ని అంటే తట్టుకోలేకపోయా

హైదరాబాద్: తన అన్న, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని దొంగ అనడాన్ని తాను తట్టుకోలేకపోయానని మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శాసనసభలో వివరణ ఇచ్చారు. ఉదయం వాయిదాపడిన శాసనసభ ఏడు గంటల తరువాత మొదలైంది. ఉదయం జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని చెప్పారు. ''30 ఏళ్లు నా అన్నవెంట నడిచాను. రాముడి వెంట లక్ష్మణుడిలాగా ఉన్నాను. నా అన్న ప్రజల కోసమే బతికారు. ఏనాడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అటువంటి వ్యక్తిని బతికున్నప్పుడు కూడా మీరు వేధించారు. మీరు ఏ ఆరోపణ చేసినా ఆయన వెంటనే కమిటీని వేసేవారు. నా కుటుంబ సభ్యులకంటే నేను వైఎస్ఆర్ కే అధి ప్రాధాన్యత ఇస్తాను. ఆయనని దొంగ అంటే నేను భరించలేను.'' అని వివరణ ఇచ్చారు. కమిటీలు వేయండి, విచారణలు జరిపించండి తనకు అభ్యంతరంలేదన్నారు. అత్యున్నత సభ ఏమైనా చేయవచ్చునని మంత్రి అన్నారు. తన అన్న వైఎస్ఆర్ ని దొంగ అనడం కాని, కాంగ్రెస్ వారు దొంగల ముఠా అనడాన్ని తాను సమర్ధించనన్నారు. తన ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే తీవ్ర విచారాన్ని వక్తీకరిస్తున్నానన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వారిని హీనపరచాలన్న ఆలోచన తనకులేదని వారికి మనవి చేస్తున్నానన్నారు.అయినప్పటికీ మంత్రి వివేకానందరెడ్డి భర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.   జరిగిన దాడికి విచారం వ్యక్తం చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - వైయస్ వివేకానంద రెడ్డి తరఫును తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. అలాంటి సంఘటనలు సభకు మర్యాద కాదని ఆయన అన్నారు. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పిన తర్వాత దానిపై చర్చ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, విధానాలూ అంశాలపై చర్చ జరిగితే ఇలా ఉండదని ఆయన అన్నారు. చర్చ జరిగిన తర్వాత భూకేటాయింపులపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. చర్చ జరగకుండా విచారణకు ఆదేశించడం సరి కాదని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ - రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్సించే హక్కు తమకు ఉందని అన్నారు. రౌడీయిజం చేస్తే భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తమ కన్నా దారుణంగా మాట్లాడారని ఆయన అన్నారు. మరణించిన వ్యక్తి గురించి మాట్లాడడం సరి కాదని, అలా మాట్లాడితే సహించబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గురించి తాము మాట్లాడబోమని ఆయన అన్నారు. తాము చనిపోయిన వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ్యులకు సర్ది చెప్పారు. దాంతో సభ సద్దుమణిగింది.

ఆయన ఉంటే సభకు రానని తేల్చేసిన బాబు

హైదరాబాద్: మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని బర్తరఫ్ చేసి, భూ కేటాయంపులపై సంయుక్త సభా సంఘం (జెఎల్సీ) వేస్తేనే తాను శాసనసభకు వస్తానని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. శానససభలో తెలుగుదేశం పార్టీ సభ్యులపై దాడి జరిగిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును కలిసి సభకు రావాల్సిందిగా కోరారు. వారితో ఆయన పై విధంగా చెప్పారు. సభలో వివేకానంద రెడ్డి వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాగా, సభలో జరిగిన విషయాలపై మీడియాతో మాట్లడడానికి వైయస్ వివేకానంద రెడ్డి నిరాకరించారు. తాను సభలో మాట్లాడతానని ఆయన చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిపై ఏం చర్య తీసుకోవాలో చూస్తానని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

జగన్ పార్టీలో చేరేందుకు వివేకా?

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వైఎస్.వివేకానంద రెడ్డి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానాన్ని గెలుచుకునేందుకు వైఎస్ వివేకా కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గం అంతటా తిరిగినా, తెదేపా - కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనా జగన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన అభ్యర్థిని ఓడించలేకపోయారు. నలుగురు మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం గుండుసున్నా. దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నయ్య వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సోదరుని కుమారుడు వైఎస్ జగన్‌ను వ్యతిరేకించడాన్ని కడప నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే బెటర్ అనే నిర్ణయానికి వివేకానంద రెడ్డి వచ్చినట్లు వినికిడి. వైఎస్సార్ హయాంలో భారీ దోపిడి జరిగిందని కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుతున్నా పట్టించుకోని వైఎస్ వివేకా, తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆరోపణలపై అంత సీరియస్‌గా స్పందించడాన్ని చూస్తే ఆయన జగన్ పార్టీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్లకార్డుల ప్రదర్శనపై వివేకా తీవ్రంగా స్పందించడమూ... ఆయనకు వైఎస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు మద్దతుగా రావడాన్ని చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దూకడం ఎంతో దూరంలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు.. యువనేత కుటుంబంతో రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. కుటుంబ పరంగా వస్తే మాత్రం తామంతా ఒకటేనని, కడప రాజకీయాలను తమ కుటుంబమే శాసిస్తుందనే సంకేతాలను అసెంబ్లీ సంఘటన ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

తెగతెంపులు చేసుకోనున్న పవన్, రేణూ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతరం బాగా పెరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి విభేదాలు ముదిరి పాకాన పడి తెగతెంపుల చేసుకునే స్థాయికి చేరుకున్నట్టు సమాచారం. ఈ పుకార్లను ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా కొట్టివేయడం లేదు. దీంతో వారిద్దరు విడిపోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భరణం కింద ఆరు కోట్ల రూపాయలను రేణూ దేశాయ్‌కు పవన్ కళ్యాణ్ చెల్లించినట్టు తెలుస్తోంది. అలాగే, పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పుట్టినిల్లు పూణెలో ఉన్నట్టు తెలుస్తోంది.

హాసన్ అలీతో సోనియాకి ఉన్న లింకేంటి: బాబు

హైదరాబాద్: నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీకి ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీ, సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సంబంధాలు ఉన్నాయన్న విషయంలో వాస్తవాలు బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులతో హసన్ అలీకి సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో వారి పేర్లు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి పేర్లు ఉన్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అలీ ఏయే ప్రాంతీయ పార్టీలకు డబ్బు ఇచ్చారో కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో హసన్ అలీ ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. గుర్రాలు పెంచే అలీకి వేలాది కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. హసన్ అలీకి ప్రాణ హానీ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. యూపిఏ సర్కారు హయాంలో దేశంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

చేతులెత్తేసిన సిఎంను చూడలా

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అసెంబ్లీలో రౌడీయిజం చేయడానికి భయపడే వారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. టిడిపి పార్టీ శాసనసభ్యులపై వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానందరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తీరు గర్హనీయమన్నారు. ఎమ్మెల్యేలపై దాడిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే సభలో దాడి జరిగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారన్నారు. చేతులెత్తేసిన సిఎంను తాను ఎన్నడూ చూడేదన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకే భద్రత లేనప్పుడు ఇక రాష్ట్రంలో సామాన్యుని పరిస్థితి ఏమిటన్నారు. మండలిలో లీడర్ వైయస్ వివేకా ఇలా వ్యవహరిస్తారని తాను నుకోలేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై స్పందించడానికి టిడిపి ఎప్పుడూ ముందుంటుదన్నారు. ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందేనని ఆయన అన్నారు.

జపాన్‌లో మళ్లీ సునామీ హెచ్చరికలు

టోక్యో: తూర్పు జపాన్‌లో 6.5 తీవ్రతతో సోమవారం భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో జపాన్‌లో స్వల్పస్థాయిలో సునామీ హెచ్చరికలను ప్రకటించారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం, గాయపడిన వారి సమాచారం తెలియరాలేదు. కాగా మియాజి ప్రాంతంలో 1.6 అడుగుల మేర అలలతో కూడిన సునామీ వచ్చినప్పుట్లు జపాన్ మెటరలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో జపాన్ సునామీ హెచ్చరికలు ప్రకటించింది. అయితే హవాయి, అమెరికా పశ్చిమ తీరంలో సునామీకి సంబంధించిన ఎలాంటి జాడలు లేవని అమెరికా, ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. జపాన్‌లో స్థానికి కాలమానం ప్రకారం సోమవారం ఉదయం హోన్స్ తూర్పు తీర ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటుచేసుకున్నట్లు, 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9తీవ్రతతో సంభవించిన తీవ్రమైన ప్రకృతి విపత్తు సుమారు 18,000 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరోతో హాసన్ అలీకి లింకులు

ముంబై: ఇటీవలే రాజకీయ నేతగా మారిన ఓ తెలుగు సినిమా టాప్ హీరోకు నల్లధనం కేసులో విచారణ ఎదుర్కొంటున్న హసన్ అలీకి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు నల్లధనం కేసులో హసన్ అలీకి కేరళ, ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు రాజకీయ నాయకులకు, సినీ రంగం వారితో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్లుగా అలీ ఈడీకి చెప్పినట్లుగా మెయిల్ టుడేలో వచ్చింది. ఆంధ్ర, కేరళనుండి నల్లధనం కుబేరులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పలువురికి తమ తమ నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో వేసేందుకు తాను సహకరించినట్లుగా చెప్పారు. హసన్ అలీతో ఓ మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు సంబంధాలు ఉన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రముఖుల నల్లధనం మొత్తం 36వేల కోట్లు ఉన్నదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయా ధనాన్ని సినీరంగం కోసం, ఎన్నికలలో ప్రచారానికి ఉపయోగించినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు ప్రాంతీయ పార్టీలకు హసన్ అలీ నల్లధనం సమకూర్చినట్లుగా తెలుస్తోంది. అలీ అంటేనే ఐటికి హడల్ అని తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు నల్లధనాన్ని భారీగా తరలించినట్లుగా తెలుస్తోంది. విదేశీ బ్యాంకులలో తన నల్లధనంతో పాటు సినీతారల, రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో పెట్టినట్టు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. తన అకౌంట్‌లో ఓ మాజీ ముఖ్యమంత్రి నల్లధనం ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. నల్లధనం అకౌంట్లను తానే డీల్ చేసినట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల మంత్రులకు హసన్ అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. గత పదేళ్లలో ఎన్నికల కోసం రూ. 200 కోట్ల నల్లధానాన్ని అలీ సమకూర్చినట్లు మెయిల్ టుడే రాసింది. తమిళనాడు, కేరళ రాజకీయ నాయకులకు కూడా భారీగా అతను ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు రెంటికి ఎన్నికల కోసం నల్లధనాన్ని అలీ సమకూర్చి పెట్టినట్లు అలీ సమకూర్చినట్లు తెలుస్తోంది.

అయోమయమైన పురంధేశ్వరి

విశాఖపట్నం: కేంద్రమంత్రి పురంధేశ్వరి సోమవారం కొంత అయోమయానికి గురయ్యారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారును ఎక్కారు. ఆ తర్వాత తేరుకొన్న ఆమె మళ్లీ తిరిగి తన కారులోకి ఎక్కి కూర్చున్నారు. సోమవారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఈ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. విశాఖ ఎయిర్ పోర్టు నుండి బయటకు వచ్చిన అనంతరం పురంధేశ్వరి అక్కడే ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కారును తన కారుగా భావించి అందులోకి ఎక్కి కూర్చున్నారు. దీంతో కాంగ్రెసు కార్యకర్తలు మేడం ఇది మన కారు కాదు జగన్ కారు అని చెప్పడంతో ఆమె వెంటనే తేరుకొని కారు దిగి తన కారులోకి వెళ్లి కూర్చుంది. సోమవారం జగన్ విజయనగరం జిల్లా ఓదార్పు ప్రారంభమైంది.

అప్పుడు సస్పెండ్ చేశారు... మరిప్పుడు?

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనలకు తెలంగాణ ప్రాంత సభ్యులను సస్పెండ్ చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనకు బాధ్యులైనవారిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయాలని  తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఒక వేళ వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే కొంత మంది ఒత్తిడికి లోనై, సీమాంధ్ర సభ్యుల పట్ల వివక్ష చూపుతున్న సభాపతిగా మనోహర్ మిగిలిపోతారని ఆయన అన్నారు. సభ సీమాంధ్ర సభగా, సీమాంధ్రుల అక్రమాలను కాపాడే సభగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల వీడియోలను మీడియాకు విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని ఆయన అన్నారు. మీడియాకు నాటి సంఘటనల వీడియోలను విడుదల చేసి తమపై చర్యలు తీసుకున్నారని, నేటి సంఘటనలపై కూడా అదే వైఖరిని తీసుకోవాలని ఆయన అన్నారు. సభ్యులపై దాడికి దిగిన మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2014 వరకు ఉభయ సభల్లో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన నాదెండ్ల మనోహర్‌ను కోరారు. సభ్యుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత మనోహర్‌పై ఉందని ఆయన అన్నారు. వివేకానంద రెడ్డితో పాటు సభ్యులపై దాడికి ప్రయత్నించిన ఇతర శాసనసభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోకపోతే నాదెండ్ల మనోహర్‌పై ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.