మొహాలీ మొనగాళ్లెవరో?

మొహాలీ: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం దాయాదుల సంగ్రామం జరుగనుంది. ఇందుకోసం మొహాలీ స్టేడియం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. దీంతో ఇరు దేశాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, యావత్ భారత జాతి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆటతో పాటు దౌత్యానికీ ఈ పోరు తెరతీయనుంది. ఇలాంటి సెమీ ఫైనల్ సమరం మరికొన్ని గంటల్లో జరుగనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమరం దాయాదుల మధ్య హైప్రొఫైల్ సరిహద్దు యుద్ధాన్ని తలపిస్తోందన్నమాట. ఫైనల్‌కు ముందు ఫైనల్‌గా అభిమానులు అభివర్ణించుకుంటున్న ఈ మ్యాచ్ 120 కోట్ల భారతీయులు ఊపిరి సలపని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ధోనీ సేన విజయాన్ని కాంక్షిస్తూ దేవాలయాలు, మసీదులు, చర్చిలు కిక్కిరిసాయి. క్లబ్బులు, పబ్బులు, ఆఫీసులు, థియేటర్లు, ప్రధాన కూడళ్లలో అభిమానుల బిగ్‌స్క్రీన్లను వెతుక్కుంటున్నారు. కార్పొరేట్ సంస్థలు సెలవు ప్రకటిస్తే, సర్కారు ఉద్యోగులు డుమ్మా కొట్టేందుకు సిద్ధమయ్యారు. మొహాలీలో దాయాదుల సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు దిగారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ప్రత్యేక అతిథుల కోసం స్టేడియంలో 11 వేల సీట్లు సిద్ధం చేశారు. ఇక క్రికెట్ పోరు టెలివిజన్ చానళ్లు, బుకీలకు కాసుల పంట పండించింది. 10 సెకండ్ల టీవీ యాడ్ టారిఫ్ 18 లక్షల పలికితే, క్రికెట్ పేరు చెప్పి వ్యాపారం లక్ష కోట్లు దాటినట్టు అంచనా. మొహాలీ బ్యాటింగ్ పిచ్‌మీద ‘టాస్’ నుంచే ఉత్కంఠను ఎంజాయ్ చేయడమే తరువాయి. కాగా, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అతిథుల్లో భారత్, పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసుఫ్ రజా గిలానీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వ్యాపార దిగ్గజాలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఇలా అందరి అడుగులు మొహాలీవైపే సాగుతున్నాయి.

నిబంధనలు లేవు

హైదరాబాద్‌: నియమ నిబంధలను రూపొందించుకోకపోవడం వల్ల, శాస్త్రీయంగా చూడకపోవడం వల్ల భూకేటాయింపుల్లో హేతుబద్దత లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. భూకేటాయింపులపై దుమ్మెత్తిపోసుకోవడం, రాజకీయ లబ్ధి పోసుకోవడం కాకుండా భూకేటాయింపులకు అనుసరించాల్సిన నియమనిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భూ కేటాయింపులపై శాసనసభలో మంగళవారం చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఓ సాంఘిక వసతి గృహం నిర్మించడానికి హైదరాబాదులో భూమి దొరకలేదని, అప్పుడు చాలా బాధేసిందని ఆయన అన్నారు. భూముల కేటాయింపుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం గానీ తమ ప్రభుత్వం గానీ హేతబద్దతను పాటించలేదని, ఏ పరిశ్రమకు ఎంత భూమి కేటాయించాలనే నిబంధనలను రూపొందించుకోలేదని ఆయన అన్నారు. ఓ విండ్ పవర్ మిల్లుకు 13 ఎకరాలు కేటాయించిన సందర్భాలున్నాయని, తీరా చూస్తే విండ్ పవర్ మిల్లుకు మూడు నుంచి మూడున్నర ఎకరాలు సరిపోతుందని ఆయన అన్నారు. 

చిరు, బాబుల పలకరింపులు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మంగళవారం శాసనసభ ఇన్నర్ లాబీల్లో ఎదురు పడ్డారు. పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగానే వారిద్దరు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న విషయాలను పరస్పరం పంచుకున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌ మిత్రపక్షమైన డీఎంకే కూటమి పక్షాన ఏప్రిల్‌ అయిదు నుంచి అక్కడ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయనున్నారు. తాను కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న విషయాన్ని చంద్రబాబు చిరంజీవికి చెప్పారు. అక్కడే ఉన్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి స్పందిస్తూ - అలాగైతే మంచి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుని సీపీఎం కోసం ప్రచారం చేయండన్నారు. తాను తృణమూల్‌ కాంగ్రెస్‌ మంచి పార్టీగా భావిస్తున్నానని, ఆ పార్టీకి ప్రచారం చేస్తానని చిరు వ్యాఖ్యానించారు. ఈ విషయాల్ని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చిరంజీవే మీడియాకు వివరించారు.

భూములపై ఎలాంటి అనుమానాలు వద్దు

హైదరాబాద్: భూకేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారదర్శకంగా ఉంటున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మంచి పథకాలు తీసుకు వచ్చారని అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలనే ఉద్దేశ్యంలో భాగంగా వైయస్ మానుఫాక్చరింగ్ సెక్టర్‌కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైయస్ బాటలోనే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళుతున్నారన్నారు. కాగా ఐటి అభివృద్ధిలో, సెజ్‌ల గురించి చంద్రబాబు ప్రయత్నాలకు ఆమె కితాబు ఇచ్చారు. వారు చేసింది అభివృద్ధని, మేం చేసింది అభివృద్ధి కాదన్నట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు. ఎమ్మార్ విషయంలో గత ప్రభుత్వం కంటే కాంగ్రెసు ప్రభుత్వం మెరుగుగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రం ప్రయోజనాలకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైన చిత్తశుద్ధితో ఉందన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. సెజ్‌లకు కేటాయించిన భూములపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

సినీనటుడు నూతన్‌ప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. ఆయన 1950 అక్టోబర్ 10న జన్మించారు. అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. 1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., చలిచీమలు సినిమాలో‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఎట్టకేలకు భూపందేరాలపై సభాసంఘం

హైదరాబాద్: ఎట్టకేలకు భూ కేటాయింపులపై సభా సంఘానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కొన్ని షరతులనూ పెట్టింది. గత పది రోజులుగా ప్రతిపక్షాలు భూ కేటాయింపులపై సంయుక్త సభా సంఘం వేయాలని పట్టుపట్టాయి. చర్చలనంతరం సభా సంఘం వేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని భావిస్తే తప్పకుండా సంయుక్త సభా సంఘం వేస్తామని సభకు హామీ ఇచ్చారు. భూ అక్రమాలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌ బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సభలో లేని వాళ్లను విమర్శించడం తగదంటూ జగన్‌వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం చుట్టు ముట్టారు. భూ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, నిర్దిష్ట ఆధారాలున్న సంస్థలపై సభాసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకుగానీ, సెజ్‌ల కోసం గానీ భూములను కేటాయించడంలో ఇప్పటి వరకు ఎలాంటి విధానం లేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి కావాల్సిన వారికి భూములను కేటాయించడం జరిగిందని ఒప్పుకున్నారు. భూములు కేటాయించేటప్పుడు ఒకరికి ఒక రేటుకు మరొకరికి మరో రేటుకు ఇవ్వడం జరిగిందన్నారు. భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. భూమి ఎవరికి ఎందుకోసం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దానిపై నూతన విధానాన్ని తయారు చేస్తున్నామని, దానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అధికారులు ఇచ్చిన నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూమిని కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.వక్ఫ్‌ భూములను కాపాడటం కోసం త్వరలో మైనార్టీ ఎమ్మెల్యేలు, మంత్రితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వక్ఫ్‌ భూములను ఇతర అవసరాల కోసం ఇవ్వబోమని తెలిపారు. కొత్త పరిశ్రమలను రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాలసీ వచ్చిన తరువాత ఏ సంస్థకైనా అదనంగా భూములు కేటాయించారని తేలితే వాటిని తప్పకుండా వెనక్కి తీసుకుంటామని చెప్పారు. 'నాపై 22 విచారణ కమిటీలు వేశారు. ఆర్థిక మంత్రి రోశయ్య అధ్యక్షతన సబ్‌ కమిటీ వేశారు' అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. మరో వంద ఎంక్వయిరీ కమిటీలు వేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. భూఆక్రమాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి పాత్రధారులని విమర్శించారు.ఆ విషయాన్ని విస్మరించి దొంగే..దొంగ దొంగ అని అరిచినట్లు కొంత మంది సభ్యుల ప్రవర్తిస్తున్నారని జగన్‌ వర్గం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌పై చంద్రబాబు విమర్శల జడివాన

హైదరాబాద్‌: భూకేటాయింపులపై శాసనసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్‌పై విమర్శల జడివాన కురిపించారు. చంద్రబాబు తమ నాయకుడిని పేరును ప్రస్తావించినప్పుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రసంగానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం, వైయస్ వర్గం శాసనసభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హసన్ అలీ మీ డబ్బులను ప్రపంచమంతా ఎలా తిప్పుతున్నాడో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని మనుషులు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వారికి తాను బెదిరిపోనని ఆయన అన్నారు. వారికి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎంపిటిసిని 15 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోచుకునే హక్కు లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ - వైయస్ జగన్‌కు భయపడి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సరి కాదని ఆమె అన్నారు. పత్రిక ఉందని చెప్పి తనపై ఆరోపణలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.  జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన విరుచుకు పడ్డారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి వీరికి హక్కులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైనా అక్రమాలు జరిగినాయని అనుమానాలు ఉంటే విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. నాటి వైయస్ ప్రభుత్వం కర్ణాటకలో ఒకరికి రాష్ట్రంలో భూములు కట్టబెట్టి బెంగుళూరు కమర్షియల్ బిల్డింగ్ జగన్ సొంతం చేసిందని ఆరోపించారు. బ్రాహ్మిణీ స్టీల్స్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కేటాయించక పోవడమే కాకుండా అసలు ఒక్క పైసా పెట్టుబడి పెట్టలేదన్నారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మిణితో పాటు మరో రెండు కంపెనీలకు సుమారు 750 ఎకరాల భూములు కేటాయించారని అన్నారు. జగతి పబ్లికేషన్‌లో పది రూపాయల ముఖ విలువ గల షేరును ఎలా 350 రూపాయలకు కొన్నారని ప్రశ్నించారు. పేదల భూములను పెట్టుబడి దారులకు దోచిపెట్టి వారి సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్‌లో షేర్లన్నీ బూటకమని ఆదాయపన్ను శాఖ నిర్ధారించిందని చంద్రబాబు చెప్పారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఐటి నోటీసులు పంపించిందన్నారు. జగన్ కంపెనీల్లో నల్లధనం ఉందని చంద్రబాబు ఆరోపించారు. పేదల భూములు కొని సొంత లబ్ధి పొందారని ఆరోపించారు. టిడిపి పెట్టుబడులకు వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి జరగాలని అన్నారు. అయితే పేదలకు ఇచ్చిన అసైన్డ్‌భూములు, పట్టాభూములు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. డికెటి పట్టాలు రద్దు చేసి పేదల భూములకు పెద్దలకు కట్టబెట్టడాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. సెజ్‌ల పేరుతో రైతులనుండి వేల రూపాయలకు భూములను తీసుకొని వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సెజ్‌ల పేరుతో భూస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రైతుల పొట్టకొట్టే విధంగా సాగుభూములు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు.  సెజ్‌ల పేరుతో అవసరానికన్నా ఎక్కువ మేర భూములు తీసుకొని అధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చునని అనుమతి ఇచ్చారని అన్నారు. బడా సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం గుడ్డిగా కళ్లు మూసుకొని భూములు కేటాయించడానికి బ్రాహ్మిణి ఇన్‌పోటెక్ ఓ ఉదాహరణ అన్నారు. వైయస్ హయాంలోని అవినీతిపై చాలాసార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆయా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. తనపై వైయస్ రాజశేఖరరెడ్డి 22 కమిటీలు వేసి ఏమీ చేయలేక పోయారన్నారు. తనపై అవసరమైతే వంద కమిటీలు వేసుకొని విచారణ జరిపించుకోవచ్చునని అన్నారు. అవినీతిపై తాను యుద్ధం చేస్తున్నందుకే తనపై బురద జల్లుతున్నారని అన్నారు.

లొంగిపోయిన సాంబశివుని హత్య నిందితులు

నల్గొండ: మాజీ మావోయిస్టు నేత, టిఆర్ఎస్ పోలిట్'బ్యూరో సభ్యుడు సాంబశివుని హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం చౌటుప్పల పోలీస్ స్టేషన్'కు నలుగురు నిందితులు వచ్చి సాంబశివుని తామే హత్య చేశామని చెప్పి లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్  చేసి చౌటుప్పల్ నుండి నారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెపుతున్నారు. షకీల్, ఫిరోజ్, అబూ, ఇమ్రాన్ అనే ఈ నలుగురు నిందితులు హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు పది రోజుల క్రితమే చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. కాగా ఇటీవల నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాదు తిరిగి వస్తున్న సాంబశివుడును ఆ రోజు అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి కత్తులతో పొడిచిన విషయం తెలిసిందే.

మెరుగుపడుతున్న 'భారత్-పాక్'ల సంబంధాలు

న్యూఢిల్లీ: క్రికెట్ దౌత్యం పుణ్యమా అని భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. విభేదాలు సడలుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొహాలీలో రేపు ఇరుదేశాల జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ని తిలకించేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ అధ్యక్షుడు జర్ధారీలు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలకు సంబంధించి శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. 27 ఏళ్లుగా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుడైన గోపాల్ దాస్ కు భారత సుప్రీం కోర్టు కోరిక మేరకు మొన్న పాకిస్తాన్ అధ్యక్షుడు జర్ధారీ క్షమాబిక్ష పెట్టారు. ఈరోజు 26/11 ముంబై దాడుల నిందితులను తమదేశంలో విచారించేందుకు భారత అధికారులకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ కేసులో నిందితులను విచారించేందుకు భారత అధికారులు పాకిస్తాన్ వెళ్లనున్నారు.

ఇష్టారాజ్యంగా భూ పందేరం

హైదరాబాద్‌:  ప్రభుత్వ భూములను తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఇష్టం వచ్చినట్లు పందేరం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. భూకేటాయింపులపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని, వివిధ సంస్థలకు చెందిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికపై కోట్లాది రూపాయల విలువ చేసే గనులను అప్పన్నంగా కట్టబెట్టారని, అలా కట్టబెట్టినందుకు ఆయా సంస్థల్లో ప్రభుత్వాధినేత తనయుడికి యాభై శాతం వాటా దక్కిందని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఆయన మంగళవారం ప్రసంగిస్తూ భూముల కేటాయింపు వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి ఉందని ఆదాయం పన్ను శాఖ గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవడం జాప్యం వద్దని ఆయన అన్నారు. బహిరంగ వేలంలోనే భూములను వివిధ సంస్థలకు అప్పగించాలని ఆయన కోరారు. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అవినీతులతో పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన అన్నారు. భూ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని ఆయన అన్నారు. భూతద్దం పెట్టినా కనిపించని దేశానికి చెందిన రస్ ఆల్‌ఖైమా కంపెనీతో ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్‌కు అప్పన్నంగా పది కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 2010 వరకు 320 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీలో రస్ ఆల్‌ఖైమా సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు. కాకినాడ కంపెనీతో ఓఎన్‌జిసి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రంపై ప్రైవేట్ వ్యక్తి సంతకం చేశారని ఆయన చెప్పారు. ఒప్పందాలు ఎలా జరుగుతాయో, ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా ఒప్పందాలు జరిగాయని ఆయన అన్నారు. రైతులను బెదిరించి కాకినాడ సీపోర్టు రైతుల నుంచి భూములను సేకరించిందని ఆయన విమర్శించారు.

వక్ఫ్‌ భూములను సెజ్‌లకు కేటాయిస్తారా?

హైదరాబాద్‌: వక్ఫ్‌ భూములను సెజ్‌లకు ఎలా కేటాయిస్తారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. భూ కేటాయింపులపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏపీఐసీసీ 800 ఎకరాల వక్ఫ్‌ భూములను విక్రయించిందన్నారు. ఘటకేసర్‌, గోపన్నపల్లిలోని ఇన్ఫోసిస్‌ భూములు, సత్యం కంప్యూటర్స్‌, రహేజా, ల్యాంకో హిల్స్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, సరూర్‌నగర్‌లోని బ్రహ్మీ ఇన్ఫోటెక్‌, తూంకుంట అపారెల్‌ పార్క్‌ తదితర భూములన్నీ వక్ఫ్‌ బోర్డుకు చెందినవేనని సర్వే నంబర్లతో సహా ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాలో వక్ఫ్‌ భూమికి చెందిన 3300 ఎకరాలు, హిందుపూర్‌లో 3500 ఎకరాల వక్ఫ్‌భూమిని సెజ్‌ల కోసం కేటాయించారని ఆయన సభకు తెలిపారు. ప్రభుత్వభూమిని ఇష్టానుసారంగా పంచారని, అవి ఏ లక్ష్యంతో కేటాయించారో వాటి అడ్రస్‌ కూడా లేదని, వక్ఫ్‌భూములను ఎవరికిబడితే వారికి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.

గందరగోళాల మధ్య బిల్లు ఆమోదం

హైదరాబాద్ : విపక్షాల ఆందోళనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ఆమోదించారు. దీన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అనంతరం సభలో భూకేటాయింపులపై చర్చ ప్రారంభం అయ్యింది. అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే భూకేటాయింపులపై చర్చ జరిగిన తర్వాతే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తామని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత పూర్తి స్ధాయిలో భూకేటాయింపులపై చర్చిద్దామని తెలిపారు. భూకేటాయింపులు, హసన్ అలీ వ్యవహారంపై అవసరం అయితే సాయంత్రం వరకూ సభలో చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్షాలు భూకేటాయింపులపై పట్టుబట్టడంతో ప్రభుత్వం గందరగోళం మధ్య ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టింది. చివరకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం జరిగింది.

రాక్షసుల మధ్య లంకలో వివేకా

గుంటూరు : వైఎస్ వివేకానందరెడ్డి రాక్షసుల మధ్య లంకలో ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు.  అలాంటి వివేకా తాను లక్ష్మణుడు అంటే ఎవరూ నమ్మరన్నారు. రాక్షసులు వివేకాను బంగారు లేడిలా వాడుకుంటూ రామరాజ్యాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆయన లక్ష్మణుడో, విభీషణుడో త్వరలోనే తెలుస్తుందన్నారు. వివేకానందరెడ్డి లక్ష్మణుడే అయితే ఇప్పటికైనా వచ్చి రామదండులో కలవాలని అంబటి పిలుపునిచ్చారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాదారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పథకం ప్రకారమే ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా నడిచిందన్నారు. రోజు పక్కన ఉండి తిడుతున్న డీఎల్‌ను ఏమనకుండా గాలి ముద్దుకృష్ణమనాయుడుపై చేయి చేసుకోవటంలో అర్థమేమిటని ప్రశ్నించారు. తిడుతుంటే వెంటనే స్పందించిన ఆయన సాయంత్రానికి కాంగ్రెస్ ముఖ్యనేతల మాటలు విని ఎందుకు వెనక్కి తగ్గారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి త్యాగం చేసిన లక్ష్మణుడిలా ఫీలవుతున్నారన్నారు.

సామాన్యుని గుండెల్లో వైయస్

విజయనగరం: ప్రతి పేదవాడు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ప్రవేశ పెట్టారని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం లంకపట్నంలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. విజయనగరం జిల్లాలో జగన్ చేపట్టిన ఓదార్పులో భాగంగా రెండోరోజు ఆయన తన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయన యాత్ర లంకపట్నం చేరుకుంది. లంకపట్నంలో మొదట జగన్ దివంగత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుని గుండెల్లో వైయస్ ఉన్నారన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశ్యంతో పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కరన్నా చదువాలనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్సుమెంట్సు ప్రవేశ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీలను వైయస్ ప్రవేశ పెట్టి పేదవారికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

డాలర్ శేషాద్రి నియామకం సబబే: సుప్రీం

న్యూఢిల్లీ : డాలర్ శేషాద్రి నియామకం సబబేనని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. శేషాద్రి నియామకం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కిందకు సేవా వ్యవహారాలను తీసుకు రావటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా శేషాద్రి పదవీ కాలాన్ని పొడిగించడంపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 2006 నుంచి పొడగింపుపై శేషాద్రి పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. దీన్ని సవాల్ చేస్తూ మందాటి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.

నీరా రాడియా, రతన్ లకు నోటీసులు

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కేసులో వారి పాత్ర గురించి తెలుసుకునేందుకు కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, టాటా గ్రూప్ ఛైర్ పర్సన్ రతన్ టాటాలను పార్లమెంట్ ప్రజా పద్దుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఏప్రిల్ 4వ తేదీన తమ ముందు హాజరవ్వాల్సిందిగా పీఏసీ పేర్కొంది. దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కోసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న టెలికామ్ మంత్రి ఏ.రాజా తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత అరెస్ట్ అయిన రాజా ఇప్పటికీ పోలీసుల కస్టడిలో ఉన్నారు. ఏప్రిల్ 4న 2జీ కేటాయింపులలో వారి పాత్ర చర్చించటానికి నీరా రాడియా, రతన్ టాటాలను హాజరవ్వాల్సిందిగా కోరగా, ఏప్రిల్ 5న స్వాన్ టెలికామ్, రిలయన్స్, ఎయిర్ టెల్, యూనిటెక్ కంపెనీల ప్రతినిధులను హాజరవ్వాల్సిందిగా కోరినట్లు పీఏసీ వర్గాలు వెల్లడించాయి.