మూతపడనున్న ఫుకుషిమా రియాకర్లు
టోక్యో: జపాన్కు అణు విపత్తు తెచ్చిపెట్టిన ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలోని 1,2,3,4 నంబర్ రియాక్టర్లు మూతపడనున్నాయి. రేడియోధార్మికతకు కారణవుతున్న వీటిని మూసివేయాలని నిర్ణయించామని ప్లాంటును నిర్వహిస్తున్న టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ(టెప్కో) చైర్మన్ సునెహిస కట్సుమట తెలిపారు. ఇటీవలి భూకంపం, సునామీల కారణంగా ఈ రియాక్టర్లలో హెడ్రోజన్ పేలుళ్లు సంభవించడం, ఫలితంగా రేడియోధార్మిక పదార్థాలు వ్యాపిస్తుండడం తెలిసిందే. రేడియోధార్మికత విస్తరించకుండా రియాక్టర్ భవనాలపై ఫ్యాబ్రిక్ షీట్లను క ప్పాలని సిబ్బంది యోచిస్తున్నారు. పేలుళ్ల శకలాలనుంచి రేడియేషన్ వ్యాపించకుండా వాటిపై నీటిలో కరిగే రెజిన్ను స్ప్రే చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బుధవారం ప్లాంటు సమీపంలోని సముద్ర జలంలో రేడియోధార్మిక పదార్థమైన అయోడిన్-131 మోతాదు ప్రామాణిక స్థాయి కంటే 3,355 రెట్లు ఎక్కువగా నమోదైంది. ప్లాంటులోని మట్టిలో అత్యంత ప్రమాదకర రేడియోపదార్థం ప్లుటోనియాన్ని సోమవారం గుర్తించారు. రియాక్టర్లను చల్లబరిచేందుకు సిబ్బంది వాటిలో నీటిని నింపుతున్నారు. దెబ్బతినని 5,6 నంబర్ రియాక్టర్లను ఇప్పటికే పూర్తిగా శీతలీకరించారు. ప్లాంటులోని అన్ని రియాక్టర్లను మూసివేయాల్సిన అవసరముందని చీఫ్ కేబి నెట్ కార్యదర్శి యూకియో ఎడనో పేర్కొన్నారు. ఫుకుషిమా ఉదంతం నేపథ్యంలో దేశంలోని అన్ని అణు రియాక్టర్ల పనితీరును తనిఖీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్లాంటు నిర్వహణ కంపెనీ టెప్కో అధ్యక్షుడు షిమిజూ మంగళవారం బీపీ, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.