కాంగ్రెస్ జగన్ ను లక్ష్యం చేసుకోలేదు

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. జగన్‌ను కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా చేసుకుందనే వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొందరు కాంగ్రెసు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. పనిగట్టుగొని కాంగ్రెసుపై కొందరు బురద జల్లుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంలో ఎలాంటి ఇతర కారణాలు లేవన్నారు. తన శాసనమండలి పదవి కాలం అయిపోయినందునే ఆయన రాజీనామా చేశారన్నారు. ప్రభుత్వం భూకేటాయింపుల కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున సభాసంఘం ఏర్పాటు చేయడం సముచిత నిర్ణయమన్నారు.

సచిన్ అర్ధ సెంచరీ

మొహాలీ: పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమిఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ రూపంలో భారత్ రెండవ వికెట్ కోల్పోయింది. పాక్ బౌలర్ హఫీజ్ బౌలింగ్‌లో అక్మల్ స్టంప్ అవుట్ చేయడంతో గంభీర్ పెవిలియన్ దారి పట్టాడు. గంభీర్ 32 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేశాడు. అంతకుముందు రియాజ్ బౌలింగ్‌లో సెహ్వాగ్ వ్యక్తిగత స్కోరు 38 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.   కాగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 95 అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ 20.2 ఓవర్‌లో ఆఫ్రీది వేసిన రెండవ బంతికి బంతికి సచిన్ బౌండరీని సాధించగానే వన్డేలో 95 అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఈమ్యాచ్‌లో సచిన్ మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి భారత్ 126 పరుగులు చేసింది. సచిన్ 52 పరుగులు, కోహ్లీ 2 పరుగులతో క్రీజులో వున్నారు.

పాక్‌పై సెహ్వాగ్ వెయ్యి పరుగులు పూర్తి

మొహాలీ : మొహాలీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. బుధవారం పాక్‌తో జరుగుతున్న సెమీస్‌లో సెహ్వాగ్ మూడో బంతిని బౌండరీ కొట్టి తన పరుగుల ఖాతాను తెరిచారు.  ఆటను ఫోర్ కొట్టి ప్రారంభించాడు. కాగా సెహ్వాగ్ ఫోర్‌తో ఆటను ప్రారంభించడం ఇది వరుసగా ఆరోసారి. సెహ్వాగ్ పాక్ బౌలర్లపై ధాటిగా విరుచుకు పడుతున్నాడు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. మొహాలీ పిచ్ మొదట సీమర్లకు, ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలిస్తుంది. భారత్ ధాటిగా ఆడి 300 పై చిలుకు పరుగులు చేస్తే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా సచిన్ - సెహ్వాగ్ జోడీ కూడా ధాటిగా ఆడుతూ బౌలర్లపై విరుచుపడుతున్నారు. కాగా, పాకిస్థాన్ బౌలర్ గుల్ బౌలింగ్‌ను సెహ్వాగ్ రఫాడించాడు. మ్యాచ్ మూడవ ఓవర్‌లో గుల్ బౌలింగ్‌లో సెహ్వాగ్ ఐదు ఫోర్లను బాదాడు. ఉమర్ గుల్ మూడవ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్ని, మూడు, నాలుగు, ఐదవ బంతుల్ని బౌండరీకి తరలించారు. సెహ్వాగ్ వ్యక్తిగత స్కోరులో 29 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్ కొట్టిన సెహ్వాగ్ పాకిస్థాన్‌పై వెయ్యి  పరుగులు పూర్తి చేసుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మొహాలీ:  భారత, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సెమీస్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొహాలీ పిచ్‌పై టాస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ పిచ్ బ్యాటింగుకు అనుకూలిస్తుంది. బ్యాటింగ్ బలంతో పాకిస్తాన్‌పై ఆధిపత్యం సాధించాలని ఇండియా భావిస్తోంది. టీమిండియా జట్టులో అశ్విన్ స్థానంలో నెహ్రాకు చోటు దక్కింది.  గాలివాటం నెహ్రాకు అనుకూలిస్తుందని ధోనీ భావిస్తున్నాడు. సెమీ ఫైనల్ గెలిస్తే ఫైనల్ మ్యాచు గెలిచినట్లేనని భావిస్తున్నారు. అలాగే పాక్ జట్టులో షోయబ్ రెండో ఫిట్‌నెస్ పరీక్షలోనూ విఫలం కావటంతో అతని స్థానంలో వాహబ్‌కు అవకాశం లభించింది.  మ్యాచును తిలకించడానికి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో పాటు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మొహాలీ చేరుకున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ మొహాలీ చేరుకున్నారు. భారత ఉప ఖండానికే ప్రపంచ కప్ టైటిల్ దక్కుతుందనేది ఖాయమైనప్పటికీ ఫైనల్‌కు భారత్, పాకిస్తాన్‌ల్లో ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతిరథ మహారథుల సాక్షిగా దేశ ప్రధానుల సమక్షంలో ఇరుదేశాల్లోనూ కలిపి 150 కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుండగా వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న సమయాన చావోరేవో తేల్చుకునేందుకు దాయాది దేశాలు సిద్ధమయ్యాయి.  

మ్యాచ్‌ కు తెలుగు నటీనటులు

మొహాలీ: భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి పలువురు తెలుగు నటీనటులు మొహాలీ చేరుకుంటున్నారు. వెంకటేష్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా చూడటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. భారత్-పాక్ మ్యాచ్ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి వెంకటేష్ సిద్దమయ్యాడు. వెంకటేష్‌తో పాటు సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా వెళ్లనున్నారు. లీడర్ ఫేం రానా కూడా ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. దమ్ మారో దమ్ చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్న రానా అటునుండి అటే బిపాసాతో కలిసి మొహాలీ స్టేడియానికి బయలు దేరారు. మరో యువ నటుడు సిద్దార్థ కూడా మ్యాచ్ చూడటానికి మొహాలీ పయనమయ్యారు. ఇక మరికొందరు నటీనటులు కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడకున్నా పరోక్షంగానైనా చూడాలనే ఉద్దేశ్యంతో షూటింగును రద్దు చేసుకున్నారు. కొందరు తమ షెడ్యూల్‌లో ఈ రోజును కేటాయించలేదు. మరికొందరు షూటింగులో ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్ విషయాన్ని తెలుసుకుంటానని చెబుతున్నారు. కాగా మొహాలీలో మ్యాచ్ కారణంగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. పంజాబ్‌లో బస్సు, టాక్సీ ఛార్జీల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోను ముఖ్య హోటళ్లతో పాటు భారత ప్రధాన నగరాలలోని హోటళ్లలో కూడా బిగ్ స్ర్కీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ చూస్తున్నందువల్ల హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. ఇక మొహాలీ స్టేడియం శత్రు దుర్బేధ్యంగా మారింది. అక్కడ గగనతల నిషేధం విధించారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌లు అందుబాటులో ఉంచారు. ఇక మధ్యప్రదేశ్‌లో అయితే అసెంబ్లీని మధ్యాహ్నం వరకే కుదించారు.

కొల్లగొట్టిన డబ్బుతోనే ఓదార్పు

హైదరాబాద్: తండ్రి వైఎస్ఆర్ హయాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పైపెచ్చు.. ఆయన కాంగ్రెస్ ముసుగులోనే ఈ ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జగన్ ఆస్తులను నిగ్గు తేల్చాలన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌ కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ళ కాలంలో ప్రజా ఆస్తులు లూటీ జరిగాయని, వీటిన్నింటిపై నిగ్గు తేల్చాలని దేవినేని డిమాండ్ చేశారు.

దేశాన్ని కుదిపేస్తున్న 'క్రికెట్' ఫీవర్

మొహాలీ: చిరకాల ప్రత్యర్థుల మధ్య సూపర్ మ్యాచు కోసం సర్వం సిద్దమైంది. పాకిస్తాన్, భారత క్రికెట్ జట్లు మొహాలీ మైదానంలో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయాలు, క్రీడలు కలగలిసి ఇరు దేశాల్లో క్రికెట్ అభిమానులు మ్యాచు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల ప్రజలు ఇరు వైపులా యుద్ధ క్షేత్రంలో మోహరించినట్లుగా ఉంది. బడా పారిశ్రామికవేత్తల నుంచి నిరుపేదల వరకు అందరి దృష్టి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోయే పాకిస్తాన్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు మీదే ఉంది. లక్షలాది మంది మొహాలీలో మోహరించారు. నరాలు తెగిపోయే ఉత్కంఠతో అభిమానులు మ్యాచు చివరి వరకు ఎదురు చూస్తుంటారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ చేదు అనుభవాల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటీ ప్రభావం పతాక స్థాయికి చేరుకుంది. ఇరు జట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఓటమి చవి చూస్తే క్రికెట్ అభిమానుల నుంచి ఎదురయ్యే పరిణామాలు ఏమిటో ఇరు జట్లకూ తెలుసు. అందుకని, ఇరు జట్లు కూడా విజయానికి తీవ్రమైన పట్టుదలతో కృషి చేస్తాయని చెప్పవచ్చు. ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న తొలి మ్యాచు ఇదే. ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్, భారత్ జట్లు నాలుగు సార్లు పోటీ పడ్డాయి. ఈ నాలుగు విడతలు కూడా భారత్ విజయం సాధించింది. అయితే, మొత్తంగా తీసుకుంటే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచుల్లో పాకిస్తానే ఎక్కువ సార్లు గెలిచింది. అయితే, గత రికార్డులు ఏవీ ప్రస్తుత మ్యాచులో పని చేయవని చెప్పవచ్చు. కాగా, పాక్‌తో భారత్ గెలవాలని ఆశిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. అయితే సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా భారత్ గెలుపు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు బుధవారం సెలవును ప్రకటిస్తే, మరికొన్ని ఒక్క పూటకే కార్యాలయ పనులను పరిమితం చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలలోని పెద్ద స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగులు అక్కడే ఆటను చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు సన్నద్దమయ్యారు. ముఖేష్ అంబానీ ఆయన సతీమణి రీటా అంబానీతో, అనీల్ అంబానీ, కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా తదితరులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించనున్నారు. అంతేకాదు ఒబెరాయ్ హోటల్లో సిఐఐ పలు కంపెనీల సిఈవోలకు మ్యాచ్ సందర్భంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒబెరాయ్ హోటల్లో పెద్ద స్ర్కీన్ ఏర్పాటు చేసి వారు మ్యాచ్ చూడనున్నారు. ఇందులో రాకేష్ భారతీ మిట్టల్, బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్, ఆదేశ్ గుప్తా, అలోక్ సక్సేనా, మణీందర్ ఎస్.గ్రేవల్ తదితరులు ఉన్నారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలవాలని ఆశిద్దాం .

ఎన్నికలకు వెళ్ళే ముందు పదవి ఎందుకు?

హైదరాబాద్: ఎన్నికలకు వెళ్ళే ముందు మంత్రి పదవి ఎందుకని  వైయస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసినందునే రాజీనామా చేసానని ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాజీనామా ఆమోదం పై ముఖ్యమంత్రిదే నిర్ణయమని ఆయన చెప్పారు. అయితే పులివెందుల నుంచి పోటీ చేయాలా, కడప నుంచి పోటీచేయాలా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలు, ప్రతిపక్షాలు డిమాండ్ కారణంగా వైయస్‌ను అవమానించేలా ప్రభుత్వం సభా సంఘం వేయడం వంటి కారణాలు కూడా ఆయన రాజీనామా నిర్ణయానికి దారి తీసినట్టుగా తెలుస్తోంది.

వైయస్ వివేకా రాజీనామా

హైదరాబాద్ : మంత్రి పదవికి వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా చేశారు. ఆయన బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందచేశారు. అయితే రాజీనామాను కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించవలసి ఉంది. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుండటంతో వైఎస్ వివేకానందరెడ్డి మంత్రిపదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్నందునే ఆయన రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. రాజీనామా అస్త్రాన్ని ఎన్నికలలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాజీనామాపై విలేకరులు వివేకాను ప్రశ్నించగా సిఎంను అడగండి అని చెప్పారు.

జయకే తమిళుల పట్టం?

చెన్నై: త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తమిళ ఓటర్లు పురుచ్చి తలైవి జయలలితకే పట్టం గట్టనున్నారు. ఓ సంస్థ చేసిన సర్వేలో జయలలితకే తమిళులు పట్టం గట్టనున్నట్లుగా తేలినట్లు తెలుస్తోంది. జయలలిత సారథ్యంలోని ఏఐఏడిఎంకె కూటమి ఈ ఎన్నికలలో 114 నుండి 117 సీట్ల వరకు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడయింది. జయ సీట్లను పెంచుకున్నప్పటికీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేదని తెలుస్తోంది. 235 శాసనసభ స్థానాలు ఉన్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. కాగా జయకు ఒకటి నుండి నాలుగు సీట్ల వరకు తగ్గవచ్చని తెలుస్తోంది. ఒకటి, రెండు సీట్లు తగ్గినప్పటికీ ఇతరుల అండతో జయ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కరుణానిధి సారథ్యంలోని డిఎంకె ఈసారి అధికారాన్ని కోల్పోతుందని ఆ సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. డిఎంకెకు ఈ ఎన్నికల్లో 84 నుండి 88 సీట్ల వరకు దక్కవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఏ పార్టీ ఓటింగ్ శాతం ఆ పార్టీకి దాదాపుగా ఉంటుందని తెలుస్తోంది. జయకు 47 శాతం, కరుణానిధికి 46 శాతం ఓటింగ్ ఉంటుందని సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఒక్క శాతం కారణంగానే డిఎంకె అధికారానికి ఈసారి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పొత్తులో భాగంగా అన్నాడిఎంకే 160 సీట్లలోనే పోటీ చేస్తుంది. 2జి స్పెక్ట్రం కుంభకోణం బయటపడిన తర్వాత డిఎంకెపై అక్కడి విద్యావంతులకు నమ్మకం పోయినట్లుగా తెలుస్తోంది.

నూటొక్క జిల్లాల అందగాడు ఇకలేడు

హైదరాబాద్ : నూటొక్క జిల్లాల అందగాడు ఇకలేడని సినీనటుడు మురళీమోహన్ అన్నారు. ప్రముఖ సినీనటుడు నూతనప్రసాద్ మృతికి ఆయన బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. మురళీమోహన్ ఈ సందర్భంగా నూతనప్రసాద్‌తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా నూతనప్రసాద్ బాధను తనలోనే దాచుకుని ‘నూటొక్క జిల్లాల అందగాడు కుంటివాడయ్యాడని’ చలోక్తి విసిరారన్నారు. ప్రముఖ సినీ నటుడు, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ కళామతల్లి ఓ ముద్దు బిడ్డను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. నూతనప్రసాద్ మృతి పట్ల సినీనటులు కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవీఎస్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.