స్కాం ఇండియా నుంచి స్కిల్ ఇండియాకి: మోడీ

  ఇండియా మొన్నటి వరకూ స్కాముల మయమైపోయింది. స్కామ్ ఇండియాగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియాని స్కామ్ ఇండియా నుంచి స్కిల్ ఇండియాగా మార్చడమే తన స్వప్నమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం నాడు ఆయన లోక్‌సభలో స్ఫూర్తిదాయమైన ప్రసంగం చేశారు. యువతలో స్కిల్ పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పేదవారిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురాగలనన్న నమ్మకం తనకు వుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్‌ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

వైకాపాలో చేరినందుకు చింతిస్తున్నా: దాడి

  తెదేపాతో ముప్పై ఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచుకొని గతేడాది వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు, పట్టుమని ఏడాది తిరగకుండానే వైకాపా ను ఈరోజు వదిలించుకొని బయటపడ్డారు. వైకాపాలో చేరి ఘోర తప్పిదం చేసానని, ఇప్పుడు ఆ తప్పు సవరించుకొనేందుకే ఈరోజు పార్టీకి తను, తన కుటుంబ సభ్యులు రాజీనామా చేస్తున్నామని మీడియాకు తెలియజేసారు.   ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు. “జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు. ఆయనకి పార్టీ నేతలెవరినీ సంప్రదించే అలవాటు లేదు. ఎవరి సలహాలు వినే అలవాటు అసలే లేదు. తనకు తోచిన నిర్ణయాలు తీసుకొంటారు. నేను జైల్లో చూసిన జగన్ వేరు. ఇప్పుడు కనబడుతున్న జగన్ వేరు. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నారు గనుక ఆయనలో చాలా మార్పు వస్తుందని అందరం భావించాము. కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. జైలు నుండి వచ్చిన తరువాత కూడా ఆయన అదే అహంకారం ప్రదర్శించడం చూసి అందరం చాలా ఆశ్చర్యపోయాము."   "ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను నిర్ణయించే విషయంలో కూడా ఆయన ఎవరి మాట వినలేదు. తనకు నచ్చిన వారిని నిలబెట్టారు. జైలులో పరిచయమయిన వ్యక్తులకు టికెట్స్ ఇచ్చి తను ఎవరిని నిలబెట్టినా ప్రజలు గుడ్డిగా నమ్మి వారికే ఓటేస్తారనే అహం ప్రదర్శించారు. ఆయన తీరు చూసి పార్టీలో నేతలే కాదు ప్రజలు కూడా చాలా భయపడ్డారు. అందుకే ఎన్నికలలో వైకాపాను ఓడించారు. అటువంటి నిరంకుశుడు, అహంకారం కలవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తోంది. అందుకే ప్రజలు అయనకు ఓటేయకుండా చాలా విజ్ఞత ప్రదర్శించారు."   "నిజానికి ఆయన తన తల్లిని, చెల్లిని కూడా విశ్వసించరు. తన చెల్లి షర్మిలకు టికెట్ ఇస్తే ఆమె తనకు ఎక్కడ పోటీగా తయారవుతుందో అనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా తల్లికి ఇచ్చేరు. అయినప్పటికీ ఆయన తన తల్లి కూడా ఎన్నికలలో గెలవాలని మనస్పూర్తిగా కోరుకోలేదు, ప్రయత్నించాను లేదు. అందుకే ఆమె కూడా ఓడిపోయారు. స్వంత తల్లిని, చెల్లినే నమ్మని వ్యక్తి ఇక పార్టీలో నేతలను ఎందుకు నమ్ముతారు? అటువంటి వ్యక్తిని ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు?పార్టీలో ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయాలి తప్ప స్వంత ఆలోచనలు చేయడానికి వీలులేదు. మేము ఎన్నికల సమయంలో ఆయనకీ కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ ఆయన మా మాటలను ఎన్నడూ ఖాతరు చేయలేదు."   "అసలు పార్టీని ఎలా నడపాలో తెలియని ఆ వ్యక్తి, ఎంత కాలం పార్టీని నడుపుతారో, అసలు నడుపుతారో లేక మూసేసివెళ్లిపోతారో లేకపోతేవేరే ఏదయినా పార్టీలో కలిపేస్తారో ఎవరికీ తెలియదు. అందువల్ల పార్టీలో కార్యకర్తలు,నేతలూ అందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలని నా సలహా. నియంతృత్వ పోకడలు పోతున్న జగన్మోహన్ రెడ్డి క్రింద ఇక ఎంతమాత్రం పనిచేయడం అసంభవమని గ్రహించినందునే నేను, నా కుటుంబ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ప్రస్తుతం నేను ఏ పార్టీలోను చేరబోవడం లేదు. కొంతకాలం తరువాత తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.

కేసీఆర్ శ‌ృంగారపురుషుడు: వర్మ ట్విట్

  తన ‘ఐస్ క్రీం’ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది కదా.. అందుకే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రంగంలోకి దిగాడు. ఏదోరకంగా వార్తల్లోకి వచ్చే తన పథకంలో భాగంగా ట్విట్టర్‌లో ట్విట్లు చేయడం ప్రారంభించాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్లలో కేసీఆర్ని టార్గెట్ చేశాడు. ఆ ట్విట్లు ఎలా వున్నాయో చూడండి.   1. టీఆర్ఎస్ ఆఫీస్ అవతల కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకున్నామని చాలా మంది అమ్మాయిలు నాతో అన్నారు. రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారు.   2. అతిపెద్ద కేసీఆర్ విగ్రహాలు, హోర్డింగ్‌లతో హైదరాబాద్ పట్టణం సుందరంగా ఉంటుంది అని ఓ కాలేజీ అమ్మాయి నాతో అంది.   3. కేసీఆర్ ను మహిళలు ప్రేమించడం విషయం మీద నాకు ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. ఎక్కువ మంది మహిళలు అధికారాన్ని ప్రేమిస్తుంటారని.. అందుకే కేసీఆర్‌ని ప్రేమించి ఉంటారని అనుకుంటున్నా.   4. కేసీఆర్ అంటే తనకి చెప్పలేనంత ఇష్టమని.. హైదరాబాద్ సిటీలోనే అంత అందగాడు ఉండరని మరో అమ్మాయి నాతో అంది.   5. హైదరాబాద్‌లోని ఉద్యానవనం లాంటి అద్భుతమైన కేసీఆర్ ముఖాన్ని ఇప్పటివరకు నేను చూడలేదు. కేసీఆర్ ముఖాన్ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోరు. చివరికి గజనీ కూడా గుర్తుంచుకుంటాడు.

దేవాలయ పరిరక్షణపై లఘు చిత్రోత్సవం

  దేవాలయ పరిరక్షణ అంశంపై అంతర్జాయతీయ లఘు చలన చిత్రోత్సవం ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో జరగబోతోంది. ఈ విషయాన్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ (యుఎస్ఎ) సంస్థల ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రోత్సవం జరుగుతుందని సంస్థల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశరావు, సాంస్కృతిక ప్రచార సారథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిథిలావస్థలో వున్న దేవాలయాలను పరిరక్షించడం, సనాతన ధర్మ రక్షణ ఇలా ఎన్నో అంశాలపై ప్రజలకు అవగాహహన కల్పించే నిమిత్తం ఈ లఘు చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. చిత్రోత్సవంలో ప్రదర్శించే లఘు చిత్రం నిడివి 10 నుంచి 12 నిమిషాల మధ్య మాత్రమే వుండాలని, ఏ భాషలో నిర్మించినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరిగా వుండాలని తెలిపారు. తమకు ఎంట్రీగా వచ్చిన లఘు చిత్రాలలో 40 లఘు చిత్రాలను ఆగస్టు 22, 23, 24 తేదీలలో హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో ప్రదర్శిస్తామని చెప్పారు. ఉత్తమ లఘు చిత్రానికి లక్ష రూపాయల నగదు, బంగారు గోమాత, ద్వితీయ ఉత్తమ లఘు చిత్రానికి 75 వేల రూపాయలు వెండి గోమాత, తృతీయ ఉత్తమ లఘు చిత్రానికి 50 వేల నగదుతోపాటు కంచు గోమాతని ఇస్తామని, ఇంకా ప్రోత్సాహక బహుమతులు కూడా వుంటాయని నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం www.savetemples.orgని సంప్రదించవచ్చు.

డిప్యూటీ కూడా మాదే: కేసీఆర్ పట్టు!

  స్పీకర్ పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి ప్రతిపక్షాలు సహకరిస్తే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది సత్సంప్రదాయం. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో విపక్షాలు సహకరించాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రెండు పదవులూ తమవే అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలకు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ప్రతిపక్షాలు ముఖం పావలా అంత చేసుకున్నాయి. ఏం చేస్తారు.. టైమ్!

మహారాష్ట్ర హోం మంత్రి నోటిదురద!

  ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళని కొంతమంది దుండగులు మానభంగం చేసి చెట్టుకి ఉరివేసి చంపిన ఘటన జరిగినప్పటి నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మానభంగాల పరంపర జరుగుతూనే వుంది. మానభంగాల పరంపర సంగతి అలా వుంచితే, మానభంగాల మీద పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు కడుపు మండేలా చేస్తున్నాయి. మానభంగాలు జరగని రాష్ట్రం ఏదైనా వుందా అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా కాజువల్‌గా అనేశాడు. దాన్ని చూసి చాలామంది రాజకీయ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అధికార పార్టీ నాయకులు మానభంగాల అంశంలో మహిళలదే తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇది చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ఆయన నోటి దురద ప్రకారం మానభంగాలని ఆపడం ఎవరి తరం కాదు. ఇంటికో పోలీసుని కాపలాగా పెట్టినా అత్యాచారాలు ఆపలేమట. అంతే కాకుండా అత్యాచారాలు పెరగడానికి మహిళల అశ్లీల చిత్రాలే కారణమట. ఆర్.ఆర్. పాటిల్ చేసిన ఈ విచిత్రమైన కామెంట్ల మీద కూడా దుమారం రేగుతోంది.

సోనియాపై అమెరికా కేసు క్లోజ్!

  అధికారం పోయిన దిగులులో వున్న సోనియాగాంధీకి కొంచెం రిలీఫ్ వచ్చింది. సోనియాగాంధీ మీద అమెరికాలో నమోదైన కేసును అక్కడి కోర్టు కొట్టేసింది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించి సోనియా గాంధీకి కూడా భాగస్వామ్యం వుందని పలు ఆరోపణలు చేస్తూ సిక్కుల హక్కుల సంస్థ సోనియాగాంధీ మీద అమెరికా కోర్డులో కేసు దాఖలు చేసింది. సోనియాగాంధీ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత సోనియాగాంధీకి సంబంధించిన పాస్‌పోర్టు వివరాలు, ఆమె ఎక్కడెక్కడికి ప్రయాణించిందనే వివరాలు ఇవ్వాలంటూ ఆమధ్య అమెరికా కోర్డు సోనియాని ఆదేశించింది. దానికి సోనియా తన పాస్‌పోర్టు వివరాలు ఇవ్వలేనని, అది తన భద్రతకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం వుందని బదులు ఇచ్చారు. ఈ కేసు సోనియాని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే ఇప్పుడీ కేసును కొట్టివేస్తూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విషయంలో సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాఖలు

  నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయశాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక, ఇతరులకు కేటాయించని శాఖలు, కేఈ కృష్ణమూర్తి - ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్.చినరాజప్ప - ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ, యనమల - ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు, అయ్యన్నపాత్రుడు - పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఉపాధిహామీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - పర్యావరణ, అటవీశాఖ, సైన్స్, టెక్నాలజీ, దేవినేని ఉమామహేశ్వరరావు - భారీ నీటిపారుదల, డాక్టర్ నారాయణ - పురపాలకశాఖ, పరిటాల సునీత - పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖలు, ప్రత్తిపాటి పుల్లారావు - వ్యవసాయశాఖ, మార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, కామినేని శ్రీనివాస్ - వైద్య,ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ, గంటా శ్రీనివాసరావు - విద్యాశాఖ, పల్లెరఘునాథరెడ్డి - సమాచార, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ, పీతల సుజాత - స్త్రీ, శిశు సంక్షేమశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ, అచ్చెనాయుడు - కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ, సిద్ధా రాఘవరావు - రవాణా, ఆర్ అండ్ బీ, కిమిడి మృణాళిని - గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ పారిశుద్ధ్యశాఖలు, కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమ శాఖ, చేనేత, ఎక్సైజ్ శాఖలు, రావెల కిషోర్‌బాబు - సాంఘిక , గిరిజన సంక్షేమ శాఖలు, మాణిక్యాలరావు - దేవాదాయశాఖ.

మోడీకి నవాజ్ షరీఫ్ లవ్ లెటర్!

  మొన్నామధ్య నరేంద్రమోడీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కి తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచినప్పటి నుంచి నవాజ్ షరీఫ్‌కి ఇండియా మీద, మోడీ మీద లవ్వు పెరిగిపోయింది. ఇండియా నుంచి పాకిస్థాన్‌కి వెళ్ళీ వెళ్ళగానే మోడీ మదర్‌‌కి ఒక మంచి చీర గిఫ్ట్.గా పంపించాడు. పర్లేదే.. పాకిస్థాన్ వాడికి కూడా మర్యాద తెలుసు అనుకునేలా చేశాడు. ఇప్పుడు లేటెస్ట్.గా నవాజ్ షరీఫ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ఆ లేఖలో నవాజ్ షరీఫ్ ఇండియా మీద, మోడీ మీద బోలెడంత ప్రేమని కురిపించాడు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన తనకు ఎంతో సంతోషం కలిగిందట. మోడీతో తాను జరిపిన చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటిపై దృష్టిసారిస్తామని, మోడీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.

ఎమ్మెల్సీగా మందకృష్ణ మాదిగ?

  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళితుణ్ణే చేస్తానని, లేకపోతే తల కోసుకుంటానని ఆవేశంగా చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ తర్వాత ఎంచక్కా మాట తప్పి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద సెటిలైపోయాడు. ఈ విషయంలో ఆయన మీద దళితులు విరుచుకుపడుతున్నారు. దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ అయితే కేసీఆర్‌ మీద ఫైర్ అయినోడు ఫైర్ అయినట్టే వుంటాడు. అలాంటి మందకృష్ణ మాదిగకి ఎమ్మెల్సీ ఇస్తే దళితులకు దూరం కాకుండా వుండొచ్చని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మందకృష్ణకి ఎమ్మెల్సీ ఇస్తే ఆయన ప్రశాంతంగా వుండటంతోపాటు తెలంగాణలో దళితులు కూడా సంతోషించే అవకాశం వుంది. మాట తప్పినందుకు తగిన పరిహారం చేసిన క్రెడిట్ కూడా కేసీఆర్ అకౌంట్లో పడే అవకాశం వుంది. త్వరలో గవర్నర్ కోటాలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి వుంది. వాటిలో ఒక స్థానానికి తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఎంపిక చేస్తారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవిలో వున్నారు. మిగిలిన ఒక్క స్థానం కోసం టీఆర్ఎస్‌లో భారీ స్థాయిలో పోటీ వుంది. ఎవరికి వారు ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ముఖ్య నాయకులు చాలా మంది పోటీపడుతున్నారు. సామాజికవర్గాల సమతూకం కోసం ఒకటి.. ‘రెడ్డి’ సామాజికవర్గానికి ఇస్తుండటంతో రెండోదాన్ని ఎస్సీలకు ఇవ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడన్న కేసీఆర్ ప్రకటనను అనేకసార్లు ఉదహరిస్తూ మాటల దాడి చేస్తున్న మందకృష్ణ మాదిగను ఆ స్థానానికి ఎంపిక చేయడం ద్వారా దళితులను శాంతింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టీ ఉద్యోగులవి తప్పు లెక్కలు: అశోక్‌బాబు

  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే రిటైర్మెంట్ వయసును రెండేళ్ళపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల నెత్తిన పాలు పోశారు. ఈ ఒక్క హామీ నెరవేరిస్తే చాలదని, చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నిటీని నెరవేర్చాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మిగులు ఉద్యోగులు ఉన్నారని తేటతెల్లమైందన్నారు. ఉద్యోగుల సంఖ్యపై తెలంగాణ నేతలు తప్పు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు.

తమిళ సాంబారులో జయ ఉప్పు

  ఇక తమిళనాడు సాంబారులో ‘అమ్మ’ జయలలిత బ్రాండ్ ఉప్పు జతచేరబోతోంది. తమిళనాడు ప్రజలు ‘అమ్మ’ ఉప్పు, పులుసు తిని బతకబోతున్నారు. ఆమె ఉప్పు పులుసు తిన్న విశ్వాసాన్ని వచ్చే ఎన్నికలలో కూడా చూపించబోతున్నారు. బుధవారం నుంచి తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పు మార్కెట్లో అభించబోతోంది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో ఉప్పును తక్కువ ధరలో ప్రజలకు అందించబోతోంది. ఏ తరహా ఉప్పు అయినా కిలో ఐదు రూపాయలకే అందించనున్నారు. ఇప్పటికే జయలలిత తక్కువ ధరకే భోజనం పెట్టే ‘అమ్మ క్యాంటిన్’లను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యారు. అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది.పేద ప్రజలకు అడపాడదపా కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెలు, ఫ్యాన్ల లాంటి గిఫ్టులను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉప్పు కూడా తక్కువ ధరకి అందిస్తూ తమిళ ప్రజలు తనకు మరింత రుణపడేలా చేస్తున్నారు.

డిప్యూటీ సీటు వద్దు మొర్రో: పద్మా దేవేందర్

  పిలిచి పదవి ఇస్తానంటే వద్దనేవాళ్ళు వుంటారా? వుంటారు.. అలాంటి నాయకురాలే మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం తనకి ఎంతమాత్రం ఇష్టం లేదని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పడంతో టీఆర్ఎస్ నాయకత్వం తెల్లబోయింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవిలో వున్నవాళ్ళు ప్రజలకు దూరమైపోతారని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయని, వచ్చే ఎన్నికలలో ఓడిపోయే అవకాశం కూడా వుంటుందని అందువల్ల తనకు డిప్యూటీ స్పీకర్ పదవి వద్దంటే వద్దని పద్మా దేవేందర్‌రెడ్డి చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపడితే హోదా వస్తుందే తప్ప మరే ప్రయోజనమూ వుండదని ఆమె భావిస్తున్నారు. దాంతో టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘సిద్దిపేటను చూసుకున్నట్టుగానే మెదక్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటా. మీకు న్యాయశాస్త్రంలో పట్టా ఉన్నందున సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తుంది’’ అని హరీష్‌రావు సర్దిచెప్పడంతో పద్మా దేవేందర్ రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి అంగీకరించినట్టు తెలిసింది.

కరాచీ విమానాశ్రయంపై మరోసారి దాడి

  పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. ఆదివారం ఇదే విమానాశ్రయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పదిమంది ఉగ్రవాదులతోపాటు మొత్తం 29 మంది మరణించారు. అప్పటి నుంచి ఈ విమానాశ్రయం వైమానిక రక్షణ దళం అధీనంలో వుంది. అయితే భారీ రక్షణ వుందని తెలిసినప్పటికీ ఉగ్రవాదులు మంగళవారం మధ్యాహ్నం మరోసారి కరాచీ ఎయిర్‌పోర్ట్ మీద దాడి చేశారు. ఈసారి వైమానిక రక్షణ దళ వసతి గృహం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, రక్షణ సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిషేధించారు. ఇప్పుడు తాజా కాల్పుల నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టు ఒక యుద్ధ భూమిని తలపిస్తోందని తెలుస్తోంది. ఇదిలా వుంటే మంగళవారం పాకిస్థాన్‌లోని తీరాహ్ లోయ ప్రాంతంలో మిటలరీ అధికారులు ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మరణించారని సమాచారం.

ఐసీయూలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు

  తీవ్ర అస్వస్థతకి గురైన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌లోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. బీపీ, సుగర్ వున్న వెంకట్రావుకు ఛాతీనొప్పి రావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లాకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వెంకట్రావుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగిత వెంకట్రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.