వియత్నాం వ్యాపారి చెవిలో గుంటూరు మిర్చి

  వియత్నాం దేశానికి చెందిన ఒక వ్యాపారి గుంటూరుకు చెందిన మధు అనే ఒక మిర్చి వ్యాపారిని నమ్మాడు. మంచి మిరపకాయలు పంపించు బ్రదర్ అంటూ ఆన్‌లైన్‌లో 30 లక్షల డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. మన గుంటూరు మిర్చి వ్యాపారి అయిన మధు పేరులోనే మధు వున్నవాడు.. మనిషి మాత్రం మిర్చిలాగా మహా ఘాటు. మిర్చిలాంటి కుర్రాడైన మధు ఎంచక్కా వియత్నాం వ్యాపారి చెవిలో మంచి ఘాటైన మిరపకాయ పెట్టాడు. వియత్నాంకి మిర్చి రవాణా చేయకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. జరిగిన మోసం తెలుసుకున్న వియత్నాం వ్యాపారి మిర్చి నమిలినట్టుగా లబోదిబో అంటూ గుంటూరుకు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాడు. సదరు మధు అనే వ్యాపారి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ వ్యాపారి గతంలో చైనా వ్యాపారులకు చెవిలో కూడా మిరపకాయ పెట్టినట్టు సమాచారం.

షర్మిలపై దుష్ప్రచారం చేస్తే ఖబడ్డార్: కేటీఆర్

      వైసీపీ నాయకురాలు షర్మిలపై కొన్ని వెబ్ సైట్లు చెడు ప్రచారం చేసిన విషయం, ఆ ప్రచారాన్ని షర్మిలతోపాటు నటుడు ప్రభాస్ కూడా ఖండించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడీ అంశం మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని హెచ్చరించారు. షర్మిల గురించి అసత్య కథనాలు ప్రసారం చేసినా, దుష్ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. షర్మిల షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే సీపీతో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని శిక్షిస్తామని కేటీఆర్ తెలిపారు.

సుజలాం.. 2 రూపాయలకి 20 లీటర్లు

      తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేసిన ఐదు ఫైళ్ళలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కూడా ఒకటి. ప్రతి గ్రామానికీ చాలా తక్కువ ధరకి పరిశుభ్రమైన మంచినీటిని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి గ్రామంలో రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీటి పథకాన్ని చేపట్టిందని, ఈ పథకం ద్వారా ప్రతి పల్లెలో సమృద్ధిగా తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పీపీఏలు రద్దు: ఆంధ్రప్రదేశ్‌కి హరీష్ హెచ్చరిక

      తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే పీపీఏలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తలు రాగానే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక మొదలైంది. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ఒకటి రద్దు చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వస్తుందంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీపీఏలను రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 600 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. పీపీఏ రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం హాస్యాస్పదమని, తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసీ కూడా నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అమలు జరగనివ్వమని హెచ్చరించారు. ఒప్పందాలన్నీ కొనసాగించాలని పునర్విభజన చట్టంలో ఉందని హరీష్ చెప్పారు. చంద్రబాబు నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒక్క కరెంట్ బంద్ చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.

ఇరాక్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్

      ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధ ప్రభావం అందరూ భయపడుతున్నట్టుగానే ఇండియా మీద కూడాపడింది. ఇరాక్‌లో భారతదేశానికి చెందిన 40 మంది కిడ్నాప్ అయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం నాడు ప్రకటించింది. ఇరాక్‌లోని మెసూల్‌లో వున్న ఉర్ అల్ హూద్ కంపెనీలో పనిచేస్తున్న 40 మంది భవన నిర్మాణ కార్మికులు కిడ్నాప్ అయ్యారని, కిడ్నాప్ అయినవారు ఉత్తర భారతదేశానికి చెందినవారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికులను ఎవరు అపహరించారన్న విషయంలో ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే అపహరణకు గురైనవారిని కాపాడటానికి చర్యలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే ఇరాక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు ఇండియాకు వచ్చేయాలని కుంటున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

మసాజ్ కోసమెళ్తే ఎయిడ్స్ వచ్చింది!

  బెంగుళూరులో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువకుడు ఓరోజు ఇంటర్నెట్‌లో బెంగుళూరులోని ఓ మసాజ్ సెంటర్‌కి చెందిన ప్రకటన చూశాడు. అందమైన యువతులతో ‘సరసమైన’ ధరలకు మసాజ్ చేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. సదరు ప్రకటన చూడగానే ఆ కుర్రాడికి ఉత్సాహం వచ్చేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా రయ్యిమంటూ మసాజ్ సెంటర్‌కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు అతనికి మసాజ్ చేయడం ప్రారంభించారు. అసలే కుర్రాడు. మసాజ్ చేసేది అందమైన అమ్మాయిలు. దాంతో అతగాడు రెచ్చిపోయాడు. ఆ తర్వాత మసాజ్ సెంటర్ నుంచి సంతోషంగా బయటకి వచ్చాడు. రెండు మూడు నెలల తర్వాత పదేపదే జ్వరం వస్తూ వుండటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆ యువకుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్ ‘అన్నిరకాల’ పరీక్షలుచేసి, ఆ యువకుడికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేశాడు. దాంతో గుండె పగిలినంత పని అయిన ఆ యువకుడు తల బాదుకుని ఏడ్చాడు. ఆరోజు మసాజ్ సెంటర్‌లో తాను రెచ్చిపోయి అడ్వాన్స్ అవడం వల్లే తనకి ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని అర్థం చేసుకున్నాడు. తనకు పట్టిన గతి మరెవరికీ పట్టకూడదన్న ఉద్దేశంతో బెంగుళూరు పోలీసు కమిషనర్‌కి అసలు విషయమంతా మెయిల్ చేశాడు. మసాజ్ కేంద్రం వివరాలన్నీ ఇచ్చాడు. దాంతో పోలీసులు సదరు మసాజ్ సెంటర్‌ మీద ఆకస్మిక దాడులు చేసి అక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న యువతులని, ఆ సెంటర్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఇది బెంగుళూరు నగరంలో తాజాగా జరిగిన విషయం. ఇలాంటి మసాజ్ సెంటర్లు హైదరాబాద్‌లో కూడా బోలెడన్ని వున్నాయి. యువతరం జాగ్రత్తగా వుండాలిమరి..

బెయిల్‌పై బయటికొచ్చిన యశ్వంత్ సిన్హా

  విద్యుత్ అధికారులపై దౌర్జన్యం చేసి నిర్బంధించిన కేసులో ప్రస్తుతం జైలులో వున్న బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హాకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ రెండో తేదీ నుంచి జైలు జీవితం గడుపుతున్న ఆయన ఎట్టకేలకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటపడ్డారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం వున్న హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. యశ్వంత్ సిన్హా తదితరులు తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించింది. యశ్వంత్ సిన్హా జైలులో వున్నప్పటికీ బీజేపీ నాయకత్వం ఆయన మీద సంపూర్ణ నమ్మకాన్ని ప్రకటించింది. బీజేపీ నాయకులు జైలులో వున్న యశ్వంత్ సిన్హాని తరచూ పలకరిస్తూనే వున్నారు. తాజాగా ఆయన జైలు నుంచి బయటకి రాగానే భారతీయ జనతాపార్టీ జార్ఖండ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని కూడా ప్రకటించింది.

ఉన్మాది కాదు.. చైన్ స్నాచర్!

  తిరుమల నడకదారిలో తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తల మీద దాడి చేసి గొంతులు కోసిన వ్యక్తి ఉన్మాది కాదని.. చెయిన్ స్నాచర్ అని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసమే కోసమే ఆ దాడి జరిగి వుండవచ్చని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి ఎవరు చేసి వుంటారనే పరిశోధనలో భాగంగా తాము పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, దాడిలో గాయపడిన భార్యాభర్తలు ప్రస్తుతం తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 72 గంటల పాటు ఇద్దరినీ డాక్టర్లు పరిశీలనలో వుంచిన తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.

పంట రుణాల మాఫీకి రిజర్వ్ బ్యాంక్ సై?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణాల మాఫీపై విదించుకొన్న 45రోజుల గడువులో అప్పుడే 10రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఈ గడ్డు సమస్యను అధిగమించేందుకు దారి దొరకలేదు. వేల కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని, అయినప్పటికీ మాఫీ చేయదలచుకొంటే ప్రభుత్వాలే బ్యాంకులలో నగదు చెల్లించి రుణాలు మాఫీ చేసుకోమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులకు విడివిడిగా లేఖలు వ్రాసారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వగలదేమో కానీ ఈ వ్యవసాయ రుణాల మాఫీకి ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చును. కనుక చంద్రబాబే స్వయంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రాజన్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని వివరించి వారిని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి రిజర్వ్ బ్యాంకు కూడా సహకారం అందించాలని కోరినట్లు, అందుకు రాజన్ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొదటి నుండి కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని, ఈవిధంగా ఉదారంగా అప్పులు మాఫీలు చేసుకొంటూ పోతే ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలుతుందని హెచ్చరిస్తున్నపుడు, చంద్రబాబు అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తే నిజంగా అది విశేషమే.

కాంగ్రెస్ ద్రోహి కిరణ్‌కుమార్ ‌రెడ్డి

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆ నేరమంతా మోపడానికి ఒక బకరాని వెతికారు. ఆ బకరా పేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరికివారు కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చెబుతూ పార్టీ హైకమాండ్ దృష్టిలో తమను తాము ఉత్తములుగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో వున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా చేరారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలైన ద్రోహి మాజీ కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీలో ఉంటూ కీలక పదవులు అనుభవించిన తర్వాత ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు’’ అని రామచంద్రయ్య విరుచుకుపడుతున్నారు.

ఉన్మాది దాడిలో దంపతులకు గాయాలు

  తిరుమలలో శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్తున్న భక్తుల మీద అక్కగార్ల గుడి సమీపంలో ఓ ఉన్మాది దాడి చేశారు. భక్తులను గాయపరచడానికి ఉన్మాది ప్రయత్నించడంతో భక్తులందరూ చెల్లాచెదురైపోయారు. అయితే తమిళనాడులోని తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తలను పట్టుకున్న ఆ ఉన్మాది తన దగ్గర వున్న కత్తితో వారిద్దరి గొంతులు కోశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న అశ్విన్ ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఉన్మాది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి హఠాన్మరణం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్ (57) గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు. ఆయన ఒక వారం రోజుల క్రితమే కేసీఆర్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని నాగోలు ప్రాంతంలో గల అలకాపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటు కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఆయన మరణించారు. సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన ఆయన అనేక ప్రభుత్వ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా వుండే మంచి అవకాశాన్ని పొందిన ఆనందం వారం రోజులు కూడా మిగల్లేదు. సంతోష్ కుమార్ భౌతిక కాయాన్ని పలువురు టీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంతాపం, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

యువరాజుకి పెళ్ళే కాలేదు..కానీ ముసలోళ్ళు రెండేసి పెళ్ళిళ్ళా..అవ్వ!

  నిన్న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పార్టీ ఓటమికి కారణాలు కనుగొనడం సంగతి ఎలా ఉన్నప్పటికీ మంచి పసందయిన కబుర్లు సాగాయి. వాటిలో కొన్ని:   ఆనం వివేకానంద రెడ్డి: వయసులో ఉన్న కుర్రోడు (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోకుండా పార్టీ కష్టపడుతుంటే ముసలోళ్ళకి (దిగ్విజయ్ సింగ్) రెండేసి మూడేసి పెళ్ళిళ్ళా..అవ్వ!   రాష్ట్ర విభజన చేస్తే చేయనీయమని సీమాంధ్ర ప్రజలు అనుకొన్నారు. కానీ మన పార్టీ విభజన చేసిన తీరే చాలా అన్యాయంగా ఉంది. అందుకే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని చాలా కసితో పగబట్టినట్లుగా ఓడించారు.   డిల్లీ నుండి డక్కీ రాజాలు డక్కా రాజాలు ఇక్కడకు వచ్చి వాలిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వారికి మన బాష తెలియదు. మన సంస్క్ర్తుతి గురించి తెలియదు. మన భావోద్వేగాల గురించి తెలియదు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడేయడంతో ఇక్కడ ప్రజలలో టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారి కారణంగానే మనకి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది.

బ్లూమింగ్‌టన్‌లో తెలుగుదేశం-పసుపుదళం సంబరాలు

      నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సెంట్రల్ ఇల్లినాయిస్‌లోని బ్లూమింగ్‌టన్ పట్టణంలో బ్లూమింగ్‌టన్ తెలుగుదేశం శాఖ - పసుపుదళం ఆధ్వర్యంలో తెలుగుదేశం విజయోత్సవాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా సుమారు నలభై కార్లతో 15 మైళ్ళ దూరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ కుటుబం సభ్యులతో కలసి విజయోత్సవ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నారు. ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. మహిళలు పసుపు పచ్చని సంప్రదాయ వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది కళాహృదయులు ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెద్దలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎలా అభివృద్ధిలోకి తెచ్చారనే అంశం మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్ యార్లగడ్డ, శ్రీనివాస్ కొసరాజు, కన్నెగంటి కృష్ణ, వెంకట్ లెల్ల, చంద్ర చిట్టిబొమ్మ, వేణు దండ, రాజా వెలగపూడి, శ్రీ గోగినేని, క్రిష్ కిలారు, శివ బూసా, నరసింహారావు అబ్బిన, శ్రీనివాస్ మానం, వెంకట్ లెక్కల, వెంకట్ గోగినేని, సుధీర్ చౌదరి, వంశీకృష్ణ పేపల్ల, రాకేష్ కిలారు, కిరణ్ గుడిపూడి, చైతన్య సోమినేని, నాగరాజు కూరపాటి, శరత్‌బాబు గోడి, రవి వట్టికూటి, హేమంత్ మువ్వ, ఇమ్రాన్ ఖాన్, శ్వేత శింగరి, చక్రవర్తి కొటారు, రామ్ తాళ్ళూరి తదితరులు పాల్గొన్నారు.

హిమాచల్‌ నుంచి తిరిగొచ్చిన నాయిని

      హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతైన మర్నాటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే వుండి విద్యార్థుల గాలింపు కార్యక్రమాలను పర్యవేక్షించిన తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌‌కి తిరిగి వచ్చేశారు. తాము ఎంత ప్రయత్నించినా విద్యార్థుల జాడ కనుక్కోలేకపోయినందుకు ఆయన తన బాధను వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా విద్యార్థుల జాడ తెలియకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. దాదాపు వారం పాటు నాయిని అక్కడే వుండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నాయినితోపాటు గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు.

తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు

      త్వరలో తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు రాబోతున్నాయి. త్వరలో రాబోతున్న మహంకాళి అమ్మవారి బోనాలు, రంజాన్, బతుకమ్మ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నామని మంత్రి పద్మారావు తెలిపారు. ముందుగా రాబోతున్న రంజాన్, మహంకాళీ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ పండుగలను ఘనంగా జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ఈ మూడు పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ... రంజాన్ పండుగను ప్రభుత్వం తరఫున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పండుగల సందర్భంగా జంటనగరాల్లో సీఎం పర్యటిస్తారని ఆయన చెప్పారు.

ఇరాక్‌లో భారతీయ నర్సులు భద్రం

      ఇరాక్‌లోని టిక్రిట్ నగరంలోని ఓ ఆస్పత్రిలో 44 మంది భారతీయ నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ నగరాన్ని తీవ్రవాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నర్సులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఆ నర్సులందరూ అక్కడ క్షేమంగా వున్నారని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే టిక్రిట్‌లో నర్సులు చిక్కుకుపోయారని, వారిని కాపాడాలని తమకు సందేశం వచ్చిందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి విషయాలు చెప్పారు. నర్సులు కావాలంటే భారత్ వెళ్లిపోవచ్చు గానీ, వారి భద్రతకు మాత్రం తాము ఎలాంటి హామీ ఇవ్వబోమని ఆస్పత్రి వర్గాలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం టిక్రిట్‌లో వున్న నర్సులు భద్రంగా వున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఖాయమా?

      ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలన వైపు వెళ్తోందా అనే సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను ఆపకపోగా ఈ అంశం మీద కడుపు మండే కామెంట్లు చేస్తోంది. అత్యాచారాల పరిస్థితి ఇలా వుంటే, ఉత్తర ప్రదేశ్ అంతటా పెరిగిపోయిన దొంగతనాలు, అల్లర్లు అసలు యు.పి.లో ప్రభుత్వం అనేది వుందా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పరిస్థితులన్నీ చేయి దాటిపోతూ వుండటంతో యుపిలో రాష్ట్రపతి పాలన ఖాయమన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామాలు చేస్తే మంచిదన్న అనధికార ఆదేశాలు అందడంతో చాలామంది గవర్నర్లు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందరికంటే ముందుగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేయడం త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనేదానికి సంకేతమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత యుపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫిరోజాబాద్‌లో టెర్రర్ టెర్రర్!

      ఉత్తర ప్రదేశ్ చివరికి ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు నిరాఘాటంగా జరిగిపోతూ వున్నాయి. మరోవైపు దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ అన్యాయాలన్నిటినీ చూసి తట్టుకోలేని జనం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు హిసాత్మకంగా కూడా మారుతున్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలోని రామ్‌ఘర్‌లో గత రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక దొంగల ముఠా చేతిలో హతమయ్యారు. దీనికి నిరసనగా జిల్లా ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. జనం పోలీసు అధికారులపై రాళ్లదాడికి దిగడంతో డిజిఐ విజయ్ సింగ్ మీనాతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. రెచ్చిపోయిన జనం అక్కడి వాహనాలను, షాపులను ధ్వంసం చేశారు. ఒక పోలీసు వ్యానును తగులబెట్టారు. మొత్తమ్మీద ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి చెయ్యిదాటినట్టు కనిపిస్తోంది.