కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో చిరంజీవి కాలక్షేపం

  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నాయకుడిగా ఎన్నికయిన కే.జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణను ఏర్పాటుచేసిందని, అందుకు ధన్యవాదాలు తెలియజేసుకొంటునానని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీనే కాదు, తనను ఇంత కాలం నెత్తిన పెట్టిన మోసిన సీమాంధ్ర ప్రజలను, వారి భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేతిలో చిల్లి గవ్వ లేకుండా నడిరోడ్డు మీద వదిలిపెట్టింది.   నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుకొనేందుకు భవన సముదాయాల కోసం వెతుకోవడం చూస్తుంటే ఆంధ్ర ప్రజల కడుపు తరుక్కుపోతోంది. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు ఈ దుస్థితి ఏర్పడటానికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే. అందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఎన్నికలలో గట్టిగా బుద్ది చెప్పినప్పటికీ, వారిలో ఏ మాత్రం పశ్చాతాపం కనబడకపోవడం చాలా విచిత్రం. పైగా ముంజేతి కంకణంలా వారి ఓటమికి కారణం స్పష్టంగా కనబడుతుంటే, అది తెలియనట్లు వారందరూ తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే.   రాష్ట్ర విభజన దెబ్బకి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడంతో, తంతే బూర్లె గంపలో పడినట్లుగా రాత్రికి రాత్రి మెగా కాంగ్రెస్ నేతగా ఎదిగిపోయిన చిరంజీవి, తాము సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని కోరామని అందుకు ఆమె తక్షణం స్పందించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాసేసారని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం. వెనకటికి ఒక ముసలమ్మ నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదన్నట్లే ఉన్నాయి చిరంజీవి మాటలు. ఆయన, జేడీ శీలం వంటి మరికొందరిని వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని అర్దించడం, అందుకు ఆమె ఎంతో ఉదారంగా అంగీకరిస్తూ మోడీకి లేఖ వ్రాయడం, మళ్ళీ ఆవిషయం మీడియాను పిలిచి మరీ గొప్పగా చెప్పుకోవడం చాలా నవ్వు తెప్పిస్తోంది.   చిరంజీవి సోనియా గాంధీని అడగకపోతే మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయరా? లేక సోనియా గాంధీ మోడీకి లేఖ వ్రాయకపోతే, మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికొదిలేస్తుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తరువాత, చిరంజీవికి, కాంగ్రెస్ నేతలకు పనేమీ లేకుండా పోయింది. అప్పటికీ ఓటమికి కారణాలు కనిపెట్టుకొనే మిషతో ఇన్ని రోజులు కాలక్షేపం చేసినప్పటికీ, రాజకీయాలలో ఉన్నపుడు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిత్యం మీడియాలో కనబడాలి కనుకనే చిరంజీవి ఈ డ్రామా ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అయితే చిరంజీవితో సహా రాజకీయ నాయకులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎన్నికలు రానంత వరకు వారెన్ని డ్రామాలు ఆడినా ప్రజలు అమాయకంగా మొహాలు వేసుకొని చూస్తూనే ఉంటారు. చప్పట్లు కూడా కొడుతుంటారు. కానీ ఎన్నికలలో మాత్రం వారందరికీ తగిన గుణపాటం నేర్పిస్తారని గ్రహించాలి. జరిగిన దానికి చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా పరువలేదు. పశ్చాతాపపడకపోయినా పరువాలేదు. కానీ ఆత్మవంచన చేసుకొంటూ, ఈవిధంగా ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు’ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహిస్తే వారికే మంచిది.   ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం చాల పెరిగింది. ఇప్పుడు ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి, సమర్ధతకే ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు మొన్న జరిగిన ఎన్నికలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయినప్పటికీ చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే’ కంటిన్యూ చేద్దామనుకొంటే వారినెవరూ వద్దనరు.

ఆమెకి కోపం వచ్చింది.. మొగుణ్ణి ‘ఎక్కడో’ కొరికింది

      భోపాల్‌లో ఒక ఇల్లాలికి భర్తమీద కోపం వచ్చింది. భర్తకి కూడా ఆమె మీద కోపం వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తని కొరికేసింది. ఎక్కడ కొరికిందని మాత్రం అడక్కండి.. ‘ఎక్కడో’ కొరికేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే, భోపాల్‌లో కాపురం వుండే జితేంద్ర, ఉమా పాటిల్ అనే జంటకి నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది. వీళ్ళిద్దరూ చిలకాగోరింకల్లా కాపురం చేసుకునేవారు.     ఇప్పటికి కరెక్ట్‌గా నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య వంటకి సంబంధించిన పాయింట్ మీద చిన్న గొడవొచ్చింది. ఆ చిన్న గొడవ కాస్తా బాగా ముదిరి ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా తిట్టుకోవడం వరకు డెవలప్ అయి, చివరకి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ గొడవలో ఉమా పాటిల్‌కి బీపీ బాగా పెరిగిపోయింది. దాంతో భర్తని ‘ఎక్కడో’ కొరికేసింది. దాంతో ఆ భర్తగారు లబోదిబో అనుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య తన విషయంలో చేసిన సదరు ‘ఘనకార్యం’ గురించి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు మొగుడూ పెళ్ళాన్ని కూర్చోబెట్టి, కౌన్సిలింగ్ చేశారు. ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కుక్కకాటు ఎంత డేంజరో, మనిషి కాటు కూడా అంతే డేంజర్ కాబట్టి డాక్టర్ దగ్గరకి వెళ్ళి ట్రీట్‌మెంట్ చేయిచుకోమని సదరు భర్త జితేంద్రకి సూచించారు. అయితే జితేంద్ర ఆ సూచనని పెద్దగా పట్టించుకోలేదు. అయితే భార్యగారి ‘కాటు’ ప్రభావం నెలరోజుల తర్వాత బయటపడింది. ఉమా పాటిల్ కొరికిన సదరు స్థానం బాగా వాచిపోయింది. అప్పటికి జ్ఞానోదయమైన జితేంద్ర నెత్తీ నోరూ బాదుకుంటూ మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కి, అటు నుంచి అటే ఆస్పత్రికి చేరుకున్నాడు. భార్య కాటు విషపూరితమవ్వడం వల్ల బాగా వాచిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ వాపు తగ్గాలంటే భారీ స్థాయిలో ట్రీట్‌మెంట్ చేయాలని తేల్చారు. దాంతో జితేంద్ర బేర్‌మని ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. పోలీసులు మాత్రం భర్తని కొరికిన భార్య మీద ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేశారు.

జూన్ 3.. చాలా చెడ్డ రోజు!

        జూన్ మూడో తేదీ చాలా చెడ్డరోజులా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల వల్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి.    1. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హుజూరాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున బస్సు, లారీ, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో 25 మంది బస్సు ప్రయాణికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. 2. హైదరాబాద్‌లో ఒక లారీ రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఒక లారీ మొదట ఒక మోటర్ బైక్‌ని ఢీకొంది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలలో వున్న డ్రైవర్లు లారీల్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. 3. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పట్టణంలో రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి మరణించారు. 4. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో రోడ్డు పక్కన వున్న లారీని ఒక ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సులో వున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 5. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం దగ్గర బ్రాండిక్స్ సంస్థకు చెందిన బస్సును లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 6. నల్గొండ జిల్లా మునగాల దగ్గర ఓల్వో బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. మొత్తంమీద జూన్ 3 చాలా డేంజరస్ డే మాదిరిగా కనిపిస్తోంది. అందువల్ల ప్రయాణికులూ.. జాగ్రత్త..

ముండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడే!

      విధి చిన్నచూపు చూడటంతో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నప్పటికీ, ఆయన త్వరలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యేవారని, కానీ ఇంతలోనే విధి ఆయన్ని బలి తీసుకుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీ మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇవ్వడానికి శివసేన అంగీకరించిన పక్షంలో గోపీనాథ్ ముండేనే ముఖ్యమంత్రి పదవిని పొందేవారు. మహారాష్ట్ర రాజకీయాలలో ముండే చాలా చురుకైన నాయకుడు కావడం, బీసీ వర్గాల్లో గట్టి పట్టుండటం, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహారాష్ట్ర వ్యవహారాలపై తిరుగులేని సాధికారత సాధించడంతో ముండే పేరును బీజేపీ సీఎం అభ్యర్థిత్వానికి ముందుకు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తే ముండేనే ముఖ్యమంత్రి అయ్యేవారు. అయితే ఇంతలోనే విధి వక్రించడంతో గోపీనాథ్ ముండే అకాలమరణం పాలయ్యారు.

కేకేకి, కాకాకి ‘బాత్‌రూమ్’ గండం

      తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను ‘బాత్‌రూమ్’ గండం పట్టి వేధించింది. ఇద్దరు ప్రముఖ తెలంగాణ నాయకులు బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడం వల్ల ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ళలో ఒకరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కాగా, మరొకరు టీఆర్ఎస్‌లో కీలక వ్యక్తిగా మారిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు. ఈ ఇద్దరిలో వయోవృద్ధుడైన వెంకటస్వామి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఈ సంఘటనలో ఆయన కాలు విరిగింది. ఆయన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వెంకటస్వామికి కుడి మోకాలు పైన ఎముక విరిగింది. అలాగే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కె.కేశవరావు అక్కడ టాయిలెట్‌కి వెళ్ళి జారి పడిపోయారు. ఆయన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కేశవరావుకు గాయాలయ్యాయా, లేదా అనే విషయం ఇంతవరకు తెలియరాలేదు.

ఆంధ్రా మీద సోనియా ఆశ చావనట్టుంది..

      రాష్ట్రాన్ని విభజించొద్దు మొర్రో అని సీమాంధ్రులు ఎంతగా మొత్తుకున్నా వినకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియాగాంధీ ఎన్నికలలో సరైన ఫలితం అనుభవించారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ స్థానంలో కూడా సీమాంధ్రలో గెలవలేదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటే, సీమాంధ్ర ప్రజలు తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.   అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులురాలు సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీ మీద ఆశ చావనట్టు కనిపిస్తోంది. అందుకే సీమాంధ్ర ప్రజలను దువ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. ఎపి రాజధాని నిర్మాణం కోసం సహకరించాలని, ఆర్థిక లోటు రాకుండా చూడాలని ఆ లేఖలో కోరారు. ఇదిగో సోనియమ్మా.. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. ఇప్పుడు తమరెంత ట్రై చేసినా ఉపయోగం లేదు.

మావోయిస్టులకు టీఆర్ఎస్ సర్కార్ షాక్

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందని, తమమీద వున్న నిషేధం తెలంగాణ వరకు అయినా తొలగే అవకాశం వుందని కలలు కంటున్న మావోయిస్టులకు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మావోయిస్టులకు అనుకూలంగా వుండే ప్రకటన వచ్చే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన రావడం మావోయిస్టు వర్గాలను షాక్‌కి గురిచేసింది.   మావోయిస్టులపై కొనసాగుతున్న నిషేధం తెలంగాణ రాష్ట్రంలో యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆ రాష్ట్ర తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు ఎంత అదుపులో ఉంటే రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవని, అయితే సానుభూతి పరులు మాత్రం అక్కడకక్కడ ఉన్నారన్నారు. మావోయిస్టులు పౌర సమాజంలోకి రానప్పుడు వారిపై నిషేధం ఎత్తివేసే సమస్యే లేదన్నారు. ఎన్నికల ముందు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడ్డం పట్ల మావోయిస్టులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏడవలేక నవ్విన సోనియా!

        మొన్నటి ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోవడంతో ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీకి ఏడుపు ఒక్కటే మిగిలింది. మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఏడుపుకి ఒక కారణమైతే, ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ మట్టికరవడం ఏడుపుకి మరో కారణం. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి కేసీఆర్ భలే షాకిచ్చాడు. టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి ఇప్పుడు చక్కగా ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు.   తెలంగాణ విషయంలో షాకులు తిన్న సోనియా గత కొంతకాలంగా తెలంగాణ ఊసు లేకుండా వున్నారు. తాజాగా తెలంగాణ విషయంలో ఆమె ఏడవలేక నవ్వారు. అదెలాగంటే, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్‌కి శత్రువులు, మిత్రులు అభినందనలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ విషయంలో కడుపులో కత్తులు పెట్టుకున్నవాళ్ళు కూడా అభినందనలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం అభినందనలు తెలిపే విషయం ఎలా వున్నా, కేసీఆర్ తమని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని విమర్శలు చేశారు. ఇదిలా వుంటే, కేసీఆర్ తనను చేసిన మోసాన్ని తలుచుకుని ఇంతకాలం కుమిలిపోయిన సోనియా గాంధీ మాత్రం కేసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. సోనియా తెలిపిన శుభాకాంక్షలు చెప్పక తప్పక చెప్పినట్టే వున్నాయని, సోనియాగాంధీ కేసీఆర్‌కి, తెలంగాణకి శుభాకాంక్షలు తెలపడం ఏడవలేక నవ్విన చందంగా వుందని రాజకీయ పరిశీకులు భావిస్తు్న్నారు.

ప్రతిపక్ష నాయకుడు పదవి కోసం టీ-కాంగ్రెస్ నేతల సిగపట్లు

  కాంగ్రెస్ పార్టీని దేశంలో మరే ఇతర పార్టీ కూడా ఓడించలేదని, కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకొన్నపుడే, ఇతర పార్టీలు గెలుస్తుంటాయని కాంగ్రెస్ నేతలు అందరూ కించిత్ గర్వంగా చెప్పుకొంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమని సోనియా, రాహుల్ గాంధీలు మొన్న జరిగిన ఎన్నికలలో మరోమారు నిరూపించి చూపారు. కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదాల వల్లనే బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. దానికి మోడీ ప్రభంజనం తోడవడంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.   తమ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికీ, దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకుండా, ఎంతసేపూ పదవులు, టికెట్స్ కోసం కీచులాడుకొంటూ తెలంగాణాలో అధికారాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు. అయినా వారి ఆలోచనలలో కానీ, పద్దతులలో గానీ ఎటువంటి గొప్ప మార్పులురావు...రాబోవని ఇప్పుడు మరోమారు నిరూపిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ తదితరులందరూ ఇప్పుడు కనీసం పార్టీ శాసనసభా పక్ష నేతగానయినా ఎంపికయితే చాలని పోటీలు పడుతున్నారు. ఉన్నది 21మంది శాసనసభ్యులే అయినా వారిలో కనీసం ఒక డజను మందికి పైగా పోటీలో ఉన్నారు.   ఈరోజు జరుగబోయే శాసనసభ, శాసనమండలి ఫ్లోర్ లీడర్ల ఎన్నికకు కేంద్రం నుండి దిగ్వజయ్ సింగ్, వాయిలార్ రవి అధిష్టానం దూతలుగా వచ్చేరు. మామూలు పరిస్థితుల్లో వారు సూచించిన వారినే తమ నేతలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కాంగ్రెస్ లో పరిపాటి. కానీ, ఈసారి మాత్రం ఈ ఎన్నికలలో వారు జోక్యం చేసుకోవడాన్ని కొందరు టీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. సీయల్పీ నేతను ఎన్నుకొనే బాధ్యతను తమకే విడిచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల వారిరువురూ ఈ ఎన్నికలలో జోక్యం చేసుకోకపోవచ్చును.   అయితే ఇప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలలో ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు, పైగా టీ-కాంగ్రెస్ నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ ఒక ముటాగా, మిగిలిన వారందరూ మరో ముటాగా విడిపోయి ఎవరికివారు తమ ముటాకు చెందిన వారినే నాయకుడిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఆ రెండు ముటాలలో కూడా అనేకమంది పోటీ పడుతుండటంతో వారు కూడా కొత్తగా ఎన్నికయిన యం.యల్యే.లతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.   అందువల్ల కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా మొట్ట మొదటిసారిగా టీ-కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్దంగా రహస్య బ్యాలట్ ద్వారా ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరక మంచిదే అంటే ఇదేనేమో!

ఆందోళనతో గుండెపోటు కారణంగానే ముండే మరణం

  ఈరోజు తెల్లవారు జామున కారు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు ప్రమాదంలో ఎటువంటి తీవ్ర గాయాలు అవలేదని, ఆందోళన కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన సహచర కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీటులో కూర్చొన్న ముండే బయటపడిపోయారని, దానితో తీవ్ర ఆందోళన చెందిన ఆయనకు గుండె పోటు వచ్చిందని తెలిపారు. కారు ప్రమాదం తరువాత ముండే తనకు త్రాగేందుకు మంచినీళ్ళు కావాలని తన సహాయకుడిని అడిగినట్లు చెప్పారు. ఆ మరుక్షణమే ఆయన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆయన ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినప్పటికీ, అయన శ్వాస తీసుకోలేక చనిపోయారని వైద్యులు చెప్పారు.

గోపీనాధ్ ముండే మృతి: మోడీ దిగ్భ్రాంతి

      కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాధ్ ముండే కన్నుమూశారు. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి వెళ్లడం కోసం ఢిల్లీ విమనాశ్రయానికి బయలుదేరిన ముండే కాన్వాయ్ మోతీబాగ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముండేకు తీవ్రగాయాలు కావడంతోపాటు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈ ఉదయం 8 గంటలకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1949 ఫిబ్రవరి 14న గోపినాథ్‌ముండే జన్మించారు. ఈయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభకు ముండే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992-1995 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదేవిధంగా 1995 నుంచి 1999 వరకు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముండే దుర్మరణం గురించి తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముండే మృతి విషయం తెలియగానే మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. ముండే నిజమైన ప్రజా నాయకుడు అని, అతని మృతి దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు.ముండే కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తాము వారికి అండగా నిలబడతామని చెప్పారు.  

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం

  నరేంద్రమోడీకి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి పెద్ద షాకింగ్ న్యూస్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర ముండే కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముండే తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గోపీనాథ్ ముండే మరణించారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు. పరిపాలనాదక్షుడిగా పేరున్న ముండే ఇలా దుర్మరణం పాలు కావడం మోడీ కేబినెట్‌కి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక దుర్వార్త.

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకి తీవ్ర గాయాలు

  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర గోపినాథ్ ప్రయాణిస్తున్న వాహనం కాన్వాయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో గోపీనాథ్ ముండేకి చాలా బలమైన గాయాలు తగిలినట్టు ప్రాథమిక సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు.

రాష్ట్రంలో ప్రియాంకకి ఏం పని చిరూ?

      ఎన్నికలు ముగిశాయి. అటు కేంద్రంలో, ఇటు రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్లు ఫిక్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు సర్వనాశనమయ్యామా అన్న ఆలోచనలో, అంతర్మథనంలో వుంది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు సోనియమ్మని, రాహులయ్యని కలిసి తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాశనమైపోయిందీ వివరిస్తున్నారు.   కాంగ్రెస్ అధినేత్రి తిడితే బాధపడుతున్నారు. ఓదారిస్తే రిలీఫ్ అవుతున్నారు. మొన్నామధ్య తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళి సోనియా, రాహుల్ చేత తలంటు పోయించుకుని, ముఖాలని నయాపైస అంతగా మార్చుకుని తిరిగి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన ఇన్నాళ్ళ తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి తీరిగ్గా ఢిల్లీకి వెళ్ళి సోనియాని, రాహుల్‌కి కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకం పడిపోవడానికి గల కారణాలను పూస గుచ్చినట్టు వివరించారు. జరిగిందేదో జరిగిపోయింది సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కృషి చేయండని సోనియా వాళ్ళతో అన్నారు. ఇక్కడి వరకు బాగానే వుంది. ఇక్కడ చిరంజీవి ప్రదర్శించిన అతి వినయం అందరికీ నవ్వు తెప్పించేలా వుంది.   సోనియా మేడమ్ దగ్గరకి వెళ్లినప్పుడు చిరు గారికి ప్రియాంక గారు కనిపించారట. అంతే వెంటనే చిరంజీవికి ఒక వండర్‌ఫుల్ ఐడియా వచ్చింది. వెంటనే ఆయన ప్రియాంకని కలిసి మీరు మా రాష్ట్రంలో పర్యటించాలని ఆహ్వానించారు. దానికి ప్రియాంక స్పందించి సరే అన్నారు. ఈ అంశంలో చిరంజీవికి సూటి ప్రశ్నలు ఏమిటంటే, 1. అసలు ప్రియాంకని తమరు రాష్ట్రానికి ఎందుకు ఆహ్వానించారు? 2. ప్రియాంక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం ఒరుగుతుంది? 3. ఆంధ్రప్రదేశ్‌లో ప్రియాంక పర్యటించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒనగూడే లాభమేంటి? ఈ ప్రశ్నలకి చిరంజీవి గారు అర్జెంటుగా సమాధానాలు చెప్పాలి.

తెలంగాణలో స్వార్థం గెలిచింది: గద్దర్

      తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు ఆ ఆనందాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువకాలం ఉంచేట్టు లేరు. కేసీఆర్ని నీడలా వెంటాడి, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన వాగ్దానాలలో 25 శాతమైనా నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని, అలా జరగకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమబాటలో పయనిస్తారని చెప్పారు.   తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మీద గద్దర్ స్పందిస్తూ, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, అయితే ఈ ఎన్నికలలో త్యాగం గెలవలేదని, స్వార్థమే గెలిచిందని అన్నారు. ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికలలో ఓడిపోవడం, తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళు గెలవటం దీనికి ఉదాహరణ అని గద్దర్ అన్నారు. త్యాగానికి ప్రతీక అయిన శంకరమ్మ ఓడిపోవడానికి, ఎలాంటి త్యాగాలూ చేయనివాళ్ళు గెలవటానికి రాజకీయ గారడీలే కారణమని ఆయన చెప్పారు.

కొప్పుల ఈశ్వర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్?

  కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెరాస యం.యల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈరోజు తనకూ పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన చాలా ఆశపడ్డారు. కానీ, కేసీఆర్ మొదటి జాబితాలో ఆయన పేరు కనబడలేదు. కొప్పుల ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వంలో తనకు కీలక మంత్రి శాఖ దొరుకుతుందని ఆశించారు. కేసీఆర్ ఈ నెల 15 తర్వాత మళ్ళీ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. కనీసం అప్పుడయినా మంత్రి పదవి దక్కవచ్చని ఆశపడుతున్న ఈశ్వర్ కు కేసీఆర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పదవిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అందుకు ఆయన స్పీకర్ పదవి తీసుకొనేందుకు అంగీకరిస్తారా లేదా? చూడాలి.

సీఎం కేసీఆర్ మీద విమర్శలు షురూ!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా విమర్శల పర్వం మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కేబినెట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాదని, కేసీఆర్ కుటుంబ మంత్రివర్గం అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి సొంత ఆస్తిని పంచుకన్నట్టు మంత్రివర్గాన్ని పంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 12 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో కేసీఆర్‌తో కలిపి ముగ్గురు ఆయన కుటుంబానికే చెందినవారు వున్నారని విమర్శించారు. వెనుకబడిపోయిన మహబూబ్‌నగర్ జిల్లాకు కేసీఆర్ కేబినెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, టీఆర్ఎస్‌కి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లాకి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రిపదవులకు అర్హులు కాని సన్నాసులు.. దద్దమ్మలా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా మంత్రివర్గంలో కూడా దళితులకు స్థానం కల్పించలేదని విమర్శించారు.

కేసీఆర్ మంత్రివర్గం...శాఖల వివరాలు

      29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.   మంత్రులకు కేటాయించిన శాఖలు : 1.  మహమూద్ అలీ - రెవన్యూ శాఖ 2.  రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ 3.  నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి 4.  ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ 5.  పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పపంచాయతీ రాజ్ శాఖ 6.  హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ 7.  పద్మారావు - ఎక్సైజ్ శాఖ 8.  మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ 9.  కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ 10.  జోగురామన్న - సాంఘిక సంక్షేమ శాఖ 11. జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ