తమిళ సాంబారులో జయ ఉప్పు
posted on Jun 11, 2014 @ 6:18PM
ఇక తమిళనాడు సాంబారులో ‘అమ్మ’ జయలలిత బ్రాండ్ ఉప్పు జతచేరబోతోంది. తమిళనాడు ప్రజలు ‘అమ్మ’ ఉప్పు, పులుసు తిని బతకబోతున్నారు. ఆమె ఉప్పు పులుసు తిన్న విశ్వాసాన్ని వచ్చే ఎన్నికలలో కూడా చూపించబోతున్నారు. బుధవారం నుంచి తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పు మార్కెట్లో అభించబోతోంది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో ఉప్పును తక్కువ ధరలో ప్రజలకు అందించబోతోంది. ఏ తరహా ఉప్పు అయినా కిలో ఐదు రూపాయలకే అందించనున్నారు. ఇప్పటికే జయలలిత తక్కువ ధరకే భోజనం పెట్టే ‘అమ్మ క్యాంటిన్’లను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యారు. అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది.పేద ప్రజలకు అడపాడదపా కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెలు, ఫ్యాన్ల లాంటి గిఫ్టులను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉప్పు కూడా తక్కువ ధరకి అందిస్తూ తమిళ ప్రజలు తనకు మరింత రుణపడేలా చేస్తున్నారు.