ఒకపక్క లేఖలు.. మరోపక్క కాల్పులు: పాక్ తీరు

      మొదట్నించీ పాకిస్థాన్ తీరేవేరు. ఒకవైపు స్నేహం అంటుంది. మరోవైపు కాల్పులు జరుపుతుంది. మొన్నీమధ్యే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇండియాకి వచ్చి వెళ్ళాడు. మోడీ మదర్‌కి మంచి చీర పంపించాడు. ఆ తర్వాత భాయీ భాయీ అంటూ లేఖ రాశాడు. మోడీ కూడా షరీఫ్‌కి తిరుగు లేఖ రాశాడు. అయితే ఇంతలోనే వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లపై పాకిస్థాన్ జవాన్లు కాల్పులకు దిగారు. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తున్నారు. పాకిస్థాన్ చేస్తున్న ఇలాంటి చర్యలను ఉపేక్షించడానికి వీల్లేదని ఒమర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం జమ్ము కాశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన కాల్పులు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసి) వెంబడి భారత్ సైనిక శిబిరాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. మోర్టార్లు వాడింది. దీంతో భారత్ సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. జనావాసాల్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి.

ఎక్కువ చేస్తే మీడియాపై యాక్షన్: కేసీఆర్

      తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చారు. గతంలో మీడియాకి వార్నింగ్ ఇచ్చిన నాయకులు ఎలాంటి ఫలితాలను చవిచూశారో తెలిసినప్పటికీ కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో వెటకారంగా వార్తలు ప్రచారం చేస్తే మీడియాపై చర్చలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హెచ్చరించారు. టీవీ9, ఆంధ్రజ్యోతి మీద ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాదన్నట్టు కథనాలు ప్రసారం చేసినందుకు సదరు ఛానళ్ళ మీద కేసీఆర్ విరుచుకుపడ్డారు. కొన్ని ఛానళ్ళు, పత్రికల తీరు మీద శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిమీద కేసీఆర్ స్పందిస్తూ మీడియా మీద మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేకహోదా వీలుపడదు: ప్లానింగ్ కమీషన్

  రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు రాష్ట్రానికి ఐదేళ్ళ పాటు ప్రత్యేకహోదా ఇస్తున్నట్లు ఇంతకుముందు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వము కూడా ప్రకటించాయి. యూపీయే ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను మార్చి రెండున ప్రణాళికా సంఘానికి పంపింది. కానీ మధ్యలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రణాళికా సంఘం ప్రకటన చేయలేకపోయింది. ఇప్పుడు అటువంటి సమస్యలేదు గనుక త్వరలోనే ప్రకటన వెలువడుతుందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజునుండి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కలుగజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ప్రణాళికా సంఘం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.   ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా పొందేందుకు తగిన అర్హతలేదని అందువలన ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పినట్లు తాజా సమాచారం. ఈ ప్రత్యేకహోదా కోసం బీహార్, రాజస్థాన్, ఓడిశా, ఛత్తిస్ ఘర్, ఝార్ఖండ్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఆంధ్ర, తెలంగాణాలు కూడా ఆ జాబితాలో చేరాయి. జాతీయ అభివృద్ధి కౌన్సిల్ (యన్.డీ.సి.) నియమ నిబందనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కుదరకపోతే కేంద్రం నుండి భారీగా నిధులు, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వంటివి కేటాయించడం సాధ్యం కాదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే, ప్రధానమంత్రి నేతృత్వంలో మొత్తం అందరు కేంద్రమంత్రులు మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన యన్.డీ.సి. కమిటీ ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు దానికి ఆమోదం తెలుపవచ్చునేమో కానీ ప్రత్యేకహోదా కోరుతున్న మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారనే నమ్మకం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందలేక పోవచ్చును.   అందువల్ల ప్రధాని మోడీ వేరే ఇతర మార్గం ద్వారా రాష్ట్రానికి సహాయా సహకారాలు అందించ వలసి ఉంటుంది. లేదా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేసి కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. అయితే మరి ఈవిషయం ఇంకా చంద్రబాబు చెవిన పడిందో లేదో తెలియదు కానీ నిన్న మంత్రివర్గం సమావేశంలో రాష్ట్రానికి మరో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.

మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్‌కి

      హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్‌కి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ఉపేంద్ర, అరవింద్ అనే ఇద్దరు విద్యార్థులను తీసుకువచ్చిన విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్‌లోనిన వనస్థలిపురం నివాసి అయిన అరవింద్ మృతదేహాన్ని తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి తరలి వచ్చారు. వారి రోదనలతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొంది. అలాగే ఉపేంద్ర మృతదేహన్ని అతడి స్వస్థలం ఖమ్మం జిల్లా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, బియాస్ నదిలో గల్లంతైన మొత్తం 24 మందిలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి.

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

      సివిల్ సర్వీసెస్ -2013 ఫరీక్షల ఫలితాలను యుపిఎస్‌సి గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో పరీక్షల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి సత్తా నిరూపించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 40 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఐఏఎస్ కేడర్‌కి 20 మంది ఎంపికయ్యారు. సివిల్స్ పరీక్షల్లో 2013 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 1122 మంది విజయం సాధించారు. జైపూర్‌కు చెందిన గౌరవ్ అగర్వాల్ జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్ని ఢిల్లీకి చెందిన మునీష్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన రచిత్ రాజ్ సాధించారు. మహిళల విభాగం నుండి టాపర్‌గా ఐదో ర్యాంకర్ భారతి దీక్షిత్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌ విద్యావజ్రం క్రితిక జ్యోత్స్న జాతీయ స్థాయిలో 30వ ర్యాంకును సాధించారు. హైదరాబాదీ ముషారఫ్ అలీ ఫరూఖీ 80వ ర్యాంక్ సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణ ఆదిత్య 99వ ర్యాంక్ సాధించారు.

సోనియా వల్లే తెలంగాణ కల సాకార౦: కేసిఆర్

      కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సభ్యుల ధన్యవాదాలు ముగిసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ మొదటిస్థానంలో నిలిస్తే రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ రెండో స్థానంలో ఉంటుందన్నారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన దేశంలో 33 పార్టీలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు వమ్ముకావని, బంగారు తెలంగాణ తప్పకుండా సాకారమవుతుందని స్పష్టం చేశారు. సాగు నీటిని, ఉద్యోగులను పూర్తిస్థాయిలో దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వ పని విధానం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని, అందువల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కాలపరిమితి చెప్పలేమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునఃర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

జల 'జగడం' మొదలైంది..!

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే జల వివాదాలు మొదలయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి పది టీఎంసీల తాగునీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాలని అంతర్రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నీటి విడుదలను ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మొత్తం కృష్ణా నదీ జలాల లభ్యత, వినియోగ అవసరాలపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాతే కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు కమిటీ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో, కృష్ణా డెల్టాకు నీటి విడుదల సంక్షోభంలో పడింది. ఇరు రాష్ట్రాలకూ జల వివాదాలే తలనొప్పిగా మారనున్నాయని తొలినుంచీ విశేష్లకులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానె రెండు రాష్ట్రాలూ మధ్య జల జగడం మొదలైంది! అంతర్రాష్ట్ర కమిటీవి సిఫార్సులు మాత్రమేనని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుంటే.. కమిటీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. కమిటీ నిర్ణయాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎలాంటి జోక్యం లేదని జీవో 358లోనే పేర్కొన్నారని వివరిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు అవసరమైతే.. సమీప భవిష్యత్తులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అవసరమవుతాయని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించకపోతే ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాలపై ఏ రాష్ట్రానికి అధికారం లేదని, కేంద్రం నేతృత్వంలోని కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అప్పటిదాకా జీవో 358 ద్వారా ఏర్పాటైన కమిటీదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడం, నిర్ణయాల అమలుకు తొలి దశలోనే అభ్యంతరాలు చెప్పడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని స్పష్టం చేస్తున్నారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు గుండె కాయ

      పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు గుండె కాయ అని, రాజకీయ అవసరాల కోసమే పోలవరం ఆర్డినెన్స్‌పై మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పోలవరం, పులిచింతల పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యమని అన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పులిచింతల పనులు పూర్తికాకుండానే జాతికి అంకింతం చేశారని విమర్శించారు.ఈ నెల 15న పులిచింతల పనులను పర్యవేక్షిస్తామని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కామెంట్స్ చేస్తే జైలుకేనా!

  దాదాపు ఏడాదిన్నర క్రితం ముంబైలో ఒక యువతి ఫేస్ బుక్ లో ఒక రాజకీయ ప్రముఖుడి గురించి చిన్న విమర్శ చేస్తే దానిని మరొక అమ్మాయి లైక్ చేసినందుకు ఆ ఇద్దరినీ ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో, కోర్టు జోక్యం చేసుకొని పోలీసులకి చివాట్లు పెట్టిన తరువాత వారిరువురినీ విడిచి పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఫేస్ బుక్ లో రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం సబబా కాదా?అనే అంశంపై మీడియాలో చాలా చర్చ జరిగింది. కానీ మీడియాకు ఆ తరువాత మరో హాట్ టాపిక్ దొరకడంతో దానిని వదిలి కొత్త టాపిక్కి జంపైపోవడంతో ఆ ఫేస్ బుక్-కామెంట్స్, చర్చ కధ అలా ముగిసిపోయింది.   మళ్ళీ ఈ మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అటువంటి కేసు మరొకటి బయటపడింది. జిల్లాకు చెందిన తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పోలీసులకి పిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.   తను గల్ఫ్ దేశానికి చెందిన ఒక బ్యాంక్ నుండి అప్పు తీసుకొని ఎగవేశానని, ఆర్మూరులో దాదాగిరీ చెలాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నానని, రమేష్ రెడ్డి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.   సాదారణంగా సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకర, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలు పెడితేనే పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేస్తుంటారు. రాజకీయ నాయకులూ నిత్యం ఒకరిపై మరొకరు మీడియా ద్వారా దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే కనుక అటువంటి వాటిని వారు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకొంటే మరే ఇతర నేరాలను చూసేందుకు వారికి సమయం కూడా మిగలదు.   రమేష్ రెడ్డి ఆరోపణల వలన తన పరువుకు భంగం కలుగుతోందని ఎమ్మెల్యేగారు గనక భావిస్తే, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లుగా ఆయన కూడా కేసు వేసుకోవచ్చును. కానీ ఆయన పోలీసులకి పిర్యాదు చేయడం, దానిపై వారు స్పందిస్తూ అతనిపై కేసు నమోదు చేయడంతో కధ మళ్ళీ పునరావృతమయి, ఇదివరకు మధ్యలో నిలిపివేసిన ఫేస్ బుక్ చర్చ తిరిగి మొదలయ్యేలా ఉంది.

విజయమ్మని వైజాగ్ నుండి ఎందుకు నిలబెట్టానంటే..

  వైకాపా నేత దాడి వీరభద్రరావు మొన్న పార్టీని వీడుతూ “జగన్ తన తల్లిని, చెల్లిని కూడా నమ్మరని, చెల్లికి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా జగన్ తన తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని, కానీ ఆయన తన తల్లిని కూడా నమ్మరు గనుకనే ఆమె విజయానికి గట్టిగా కృషి చేయలేదని, అందుకే ఆమె ఓడిపోయారని” జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాడి జగన్ పై చేసిన మాటల దాడికి ఆ పార్టీ నేతలు కూడా దీటుగానే జవాబిచ్చారు. కానీ జగన్ కూడా ఆయనకు సంజాయిషీ ఇచ్చుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   దాడి విమర్శలపై జగన్ స్పందిస్తూ “నేను నా తల్లి విజయమ్మను వైజాగ్ నుండి నిలబెట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తే ఉత్తరాంద్రాలో మూడు జిల్లాలకు ఆమె అండగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఆమెను అక్కడి నుండి పోటీ చేయించాను. పైగా ఆమె అక్కడ ఉంటే నాకూ చాలా భరోసాగా ఉంటుందని భావించాను. విశాఖ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే ఆమెను అక్కడ నుండి పోటీకి దింపి నేను మిగిలిన ప్రాంతాలలో ప్రచారంపై దృష్టి పెట్టాను తప్ప వేరే కారణం చేత కాదు” అని చెప్పుకొచ్చారు.   జగన్ తన తల్లి విజయమ్మను వైజాగ్ నుండి ఎందుకు పోటీలో నిలబెట్టారో వివరించారు, కానీ వైజాగ్ నుండి పోటీ చేద్దామనుకొన్న షర్మిలకు వైజాగ్ లోనే కాక మరెక్కడి నుండీ కూడా పోటీ చేసేందుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో మాత్రం వివరించలేదు. జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే తను స్వయంగా తల్లి కోసం ప్రచారం చేయలేదని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, మిగిలిన జిల్లాలలో ప్రచారం చేసారంటే అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఆయనకు నమ్మకం లేదనుకోవాలా?   దాడి విమర్శలకు జగన్ స్వయంగా స్పందించనవసరం లేదు. కానీ స్పందించారు. అటువంటప్పుడు ఆయన లేవనెత్తిన ప్రతీ అంశం, చేసిన అన్ని ఆరోపణల పైనా స్పందించి ఉంటే బాగుండేది. కానీ ఎందువలనో స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ తో జగన్ కున్న రహస్య అవగాహన గురించ ప్రశ్నించినపుడు, దానికీ జగన్ నేరుగా జవాబు చెప్పలేకపోయారు. అతని సోదరి షర్మిల పవన్ కళ్యాణ్ పై ప్రతి విమర్శలు చేశారే తప్ప, పవన్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబీయలేదు. పవన్ చేసిన ఏ ఒక్క ఆరోపణను ఖండించలేదు.   ఇటువంటి వ్యవహారాల వలననే వైకాపా ఓటమి పాలయింది. వైకాపా ఓటమికి వేరెవరో కారణం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డే కారణమని దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు నమ్మవలసివస్తుంది.

చంద్రబాబు మంత్రివర్గ సమావేశ వివరాలు

  ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు సాగింది. ఉదయం 11 గంటలకు మొదలయిన సమావేశం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల వరకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో మొత్తం మంత్రులు అందరూ పాల్గొన్నారు. సమావేశం తరువాత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి సమావేశ వివరాలు వెల్లడించారు.   ఆయన చెప్పిన విషయాలలో ముఖ్యాంశాలు: 1. రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లోటు రూ.15,900 కోట్లు. 2. ఈనెల నుండే ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ 58 నుండి 60సం.లకు పెంపు అమలు. హైదరాబాదులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపు. 3. అక్టోబర్ 2నుండి పెంచిన పెన్షన్లు చెల్లింపు మొదలవుతుంది. వృద్ధులకు, వితంతువులకు రూ.1000 పెన్షన్, 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వికలాంగులకి రూ.1500, 80 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 పెన్షన్. 4. బెల్ట్ షాపులు రద్దు చేయబడ్డాయి. త్వరలో ఎక్సయిజ్ శాఖ నిభందనలు మరింత కటినతరం. 5. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం కమిటీకి ఆమోదం. వీలయినంత త్వరగా రుణాలు మాఫీకి అవసరమయిన చర్యలు చేపడతాము. 6. యన్టీఆర్ సుజల స్రవంతి పధకం క్రింద రాష్ట్రంలో అన్ని పట్టణాలు, గ్రామాలకు రక్షిత మంచి నీరు పధకం అమలుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడానికి పంచాయితీ రాజ్ శాఖ అధీనంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 7. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.5,00,00,000 కోట్లు అవసరం ఉంటుంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి రాబట్టేందుకు కృషి చేస్తాము. 8. అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము. 9. వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాము. 10. వైజాగ్ నగరానికి మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగు రోడ్డు, అవసరమయిన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం. 11. వ్యవసాయానికి 8గంటలు, గృహలకు, పరిశ్రమలకు 24గంటలు నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపడతాము. అవసరమయితే పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు. సోలార్ మరియు విండ్ ఎనర్జీ కొరకు అవసరమయిన చర్యలు చేపడతాము. 12. ఇంతవరకు నిర్లక్ష్యం చేయబడిన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు మళ్ళీ అభివృద్ధి చేసిభూగర్భ జలాలను పెంచుతాము.  

పందెం కాశాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

      ఒక పిచ్చి పందెం ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య గొప్పకోసం చేసిన పని ఒకరి ప్రాణం తీయగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది. ఆ పందెం మరేమిటో కాదు.. 15 నిమిషాల వ్యవధిలో ఫుల్ బాటిల్ మద్యాన్ని నీళ్ళు కలపకుండా తాగడం. ఈ పందెం ఫలితం.. ఒక నిండు ప్రాణం. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో కొంతమంది స్నేహితులు పావుగంటలో పుల్ బాటిల్ తాగినవాడే వెరీ స్ట్రాంగ్ అన్నారు. అది విని రవి అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఫుల్ బాటిల్ మద్యం తాగడానికి ముందుకొచ్చారు. రవి అనే వ్యక్తి బాటిల్ మొత్తం తాగేసి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు బాటిల్ మద్యం తాగి కోమాలోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు బతకడం కూడా సందేహాస్పదమే అని వైద్యులు అంటున్నారు. వీళ్ళు ఇలా పనికిమాలిన పందాలు కాసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

దడపుట్టిస్తున్న వడదెబ్బ: 14 మంది మృతి

      గురువారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ దడ పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా వడగాలులు వీస్తున్నాయి. వడగాలులకు భయపడిన జనం ఇళ్ళలోంచి బయటకి కూడా రావడం లేదు. స్కూళ్ళు కూడా మూసేశారు. వడదెబ్బ కారణంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో గురువారం నాడు మొత్తం 14 మంది మరణించారు. విశాఖ జిల్లా కశింకోటలో నలుగురు, విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ముగ్గురు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఒకరు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఒకరు, గొల్లప్రోలు మండలంలో ఒకరు వడదెబ్బ కారణంగా మరణించారు. ఈ వాతావరణ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలో ‘స్కిల్’ చూపించిన కవిత!

      రాజకీయ తెలివితేటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తెలివితేటల్లో తండ్రి పోలికలను పుణికి పుచ్చుకున్న నిజామాబాద్‌ ఎంపీ కవిత ఢిల్లీ లెవల్లో తన తెలివితేటలు, ‘స్కిల్’ చూపించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగిస్తూ ఇండియాని స్కామ్ ఇండియాగా కాకుండా ‘స్కిల్’ ఇండియాగా తీర్చిదిద్దాలనేది తన స్వప్నమని చెప్పారు. ఈ ప్రసంగాన్ని విన్న పార్లమెంటు సభ్యురాలు కవిత మైండ్‌లో ఫ్లాష్ వెలిగింది. తన స్కిల్ చూపించాలన్న ఉత్సాహం వచ్చేసింది. మోడీ ఉపయోగించిన ‘స్కిల్’ అనే మాటని పట్టుకుని కవిత ఉత్సాహంగా ముందడుగు వేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ‌న్‌ కలిసిన కవిత, ప్రధానమంత్రి దేశంలో స్కిల్ పెరగాలని ఆశిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అర్జెంటుగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తెలంగాణ‌ ప్రజల్లో స్కిల్ (వృత్తి నైపుణ్యం) పెరిగేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమెని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ లో పసుపు నిల్వ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుతో పాటు పలు విషయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కవిత ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

టీడీపీలోకి దాడి వీరభద్రరావు?

      టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన విశాఖకు చెందిన తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్రరావు ఇప్పుడు జగన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వైసీపీలోంచి బయటకి వచ్చేశారు. ఇప్పుడాయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడి వీరభద్రరావు అలా వైసీపీని వీడారో లేదో ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు దాడికి ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్‌కి పరమ భక్తుడైన దాడి తెలుగుదేశం పార్టీలోకి వస్తే సాదరంగా స్వాగతం పలుకుతామని అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం రావడం దాడికి సంతోషాన్ని కలిగించినట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.   ఇదిలా వుంటే వైసీపీని వీడిన తర్వాత దాడి వీరభద్రరావు జగన్ మీద మాటల దాడి చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్‌కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.

అఖిలేష్ సర్కార్‌కి రాష్ట్రపతి పాలన గండం?

      ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా వున్న ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం వుందని, త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా తీసుకుని కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   గత కొంతకాలంగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద  కొంతమంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. రెండు మూడు రోజులకోసారి మహిళల అత్యాచారం, హత్యలు మామూలైపోయాయి. వీటిని అరికట్టాల్సిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అత్యాచారానికి గురైన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు వున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన  విధించడంతోపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాలలో ఎన్డీయే కూటమి 78 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి యు.పి.లో ఎలాంటి చర్యలు చేపట్టినా మోడీ ప్రభుత్వానికి ఎదురు వుండే అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రంగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యం చాలా తక్కువగా వుందన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి అయితే ఉత్తర ప్రదేశ్‌ని ఏకంగా 5 రాష్ట్రాలుగా విభజించాలని గతంలో యు.పి. అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేయించారు. ఇప్పుడు యుపిని మూడు రాష్ట్రాలుగా విభజించడం పరిపాలన పరంగా మేలు జరగడమే కాకుండా, యు.పి.లో అరాచకాలను సమర్థంగా నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో వాహనాలకు ఇక ‘టిఎస్’ సిరీస్!

      తెలంగాణ రాష్ట్రంలో తిరిగే వాహనాల నంబర్లు మారనున్నాయి. ఇప్పుడున్న ‘ఎ.పి.’ పేరును తొలగించి ‘టి.ఎస్.’ అని మార్చుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు బుధవారం నుంచి ‘టి.ఎస్.’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇంకా విధి విధానాలను రూపొందించాల్సి వుందని, ‘ఎ.పి.’ నుంచి ‘టి.ఎస్.’కి మారడానికి వాహనానికి ఎంత ఖర్చు అయ్యేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త వాహనాలకు మాత్రం బుధవారం నుంచి టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యలు

      పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో పదిమంది తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. భారీ భద్రత వుంటుందని తెలిసి కూడా రెండుసార్లు కరాచీ విమానాశ్రయంపై దాడి చేసి మొత్తం 27 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటన భారత ప్రభుత్వంలో కదలిక తెచ్చింది.   కరాచీ ఎయిర్‌పోర్టు మీద జరిగిన తరహాలోనే ఢిల్లీలోని విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తదితర ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఒకవేళ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా సమర్థంగా తిప్పికొట్టాలన్న అంశం మీద వ్యూహరచన ఈ సందర్భంగా చేశారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.  

గంగలో ఉమ్మితే మూడు రోజుల జైలు!

      కేంద్ర ప్రభుత్వం కొత్తరకం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ చట్టానికి రూపకర్త అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చట్టం ఏంటంటే, భవిష్యత్తులో ఎవరైనా గంగానదిలో ఉమ్మినా, చెత్త వేసినా వారికి మూడు రోజుల జైలు శిక్ష పడుతుంది.   ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే గంగానదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఆయన ఆల్రెడీ వారణాశికి ఎంపీ కావడంతో ఈ విషయం మీద చాలా సీరియస్‌గా వున్నారు. గంగా ప్రక్షాళనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ని కూడా ఆయన సిద్ధం చేశారు. గంగానదిని శుభ్రం చేయడం, ముందుముందు కలుషితం కాకుండా చూడటం అంతవరకూ ఓకే. దానిని ఎవరూ కాదనరు. ఇంకా ఇంత మంచి పని చేస్తున్నందుకు హర్షిస్తారు. అయితే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరైనా గంగానదిలో చెత్త వేసినా, కనీసం ఉమ్ము ఊసినా వారికి మూడు రోజులు జైలు శిక్ష వేయాలన్న ప్రతిపాదనని ఆమె నరేంద్రమోడీ ముందు వుంచినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమాభారతి చేసిన ప్రతిపాదనను మోడీ ఆమోదించరాదని, ఇలాంటి చట్టం తేవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశం వుందని పలువురు అంటున్నారు. పొరపాటుగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఎవరైనా గంగాస్నానం చేస్తూ గంగా నది జలాన్ని నోట్లో పోసుకుని తుపుక్కున ఊయడానికి కూడా భయపడాల్సి వస్తుంది.  గంగానదిలో స్నానం చేస్తే పాపం పోవడానికి బదులు విచిత్రమైన అవమానాలు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది.