జంగిల్ రాజ్ పోయింది.. జంగిల్ క్లియరెన్స్ మొదలైంది!

జగన్ పాలనలో గత ఐదేళ్లుగా మూలన పడిన అమరావతి రాజధాని పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. రాజధాని ప్రాంతం మొత్తం అడవిని తలపించేలా మారడంతో ఏయే స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రాజధాని నిర్మాణ పనులు జోరందుకుంటాయని జనం భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   రాజధాని అమరావతి  నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి తీవ్రస్థా యిలో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో  బుధవారం (ఆగస్టు 7) నుంచీ జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధాని అమరావతి కేంద్రంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మాణాల పైన ఐఐటీ నిపుణులు అధ్యయనం చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనుంది. ఇదే సమయంలో రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి.  మంత్రి  నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా ప్రారంభించారు.  దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు  మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంది.  రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిపే చోట, ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు. అయిదేళ్ల కాలంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు.  ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది. వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది.  ఆ టెండర్లు ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. బుధవారం (ఆగస్టు 7)  ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. వెలగపూడి సచివాలయం వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులపై మంత్రి నారాయణ  సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాదారు. జంగిల్‌ క్లియరెన్స్ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు, రాజధాని క్యాపిటల్‌  రీజియన్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తయిన తరువాత ఐఐటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం నిలిచిన నిర్మాణాలు..కొత్త వాటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదంతా పూర్తయ్యాక వర్షాకాలం ముగిశాక రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

రైల్వే సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడ‌కంపై లోక్ సభలో కేశినేని చిన్ని ప్రశ్న

 భారతీయ రైల్వే సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉప‌యో గిస్తు న్న‌ట్లు కేంద్ర  రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్  తెలిపారు. పార్లమెంట్ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో బుధ‌వారం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ రైల్వే సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ‌లుపై  అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రైల్వే సేవల  సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వాడుతున్నారా అని అడ‌గ‌టంతో పాటు...ఉప‌యోగిస్తున్న సాంకేతిక‌త రైల్వే సేవల సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరిచిందో ఆ వివ‌రాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర  రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్   మిషన్ లెర్నింగ్ , ఆల్గోరితమ్, నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్ లేష‌న్స్ , నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, టిక్కెట్లు బుక్ చేయడం, పి.ఎన్. ఆర్.  తనిఖీ, రైలు షెడ్యూల్ లను తెలుసుకోవడం,  'రైల్ మదద్' లో ఫిర్యాదుల నిర్వహణ వంటి రొటీన్ పనులను ఆటోమేటెడ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను  ఉపయోగిస్తున్న‌ట్లు తెలిపారు.   సాఫ్ట్‌వేర్ కోడింగ్ కోసం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు రైల్వే ఐ.టి అప్లికేషన్ల అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్న‌ట్లు చెప్పారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావ‌టంతో కొన్ని ప‌నులు వేగవంతం చేయడం ,  ప్ర‌యాణీకులకు చాలా తక్కువ స‌మ‌యంలో  సమాచారం అందించడం జరుగు తోందన్నారు.

వినేష్ ఫోగట్ కు పెరుగుతున్న మద్దతు!

అనర్హత వేటు పడిన వినేష్ ఫొగట్ కు ప్రధాని మోదీ  సహా పలువురు అండగా నిలిచారు.   ఆమె ఛాంపియన్లకు ఛాంపియన్ అంటూ కొనియాడారు. 'వినేశ్. మీరు భారత్ కు గర్వకారణం. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఈరోజు జరిగింది బాధిస్తోంది. నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను. అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు. సవాళ్లను ఎదుర్కోవడమే మీ సహజతత్వం. మళ్లీ బలంగా పుంజుకోండి. మీ గెలుపుకోసం చూస్తున్నాం' అని మోడీ ట్వీట్ చేశారు. వంద గ్రాముల బరువు  ఎక్కువగా ఉందన్న కారణంగా ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేశ్ పొగట్ కు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సమంత, సోనాక్షి సిన్హా, విక్కీ కౌశల్, తాప్సీ, హేమమాలిని ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా నటుడు మహేశ్ బాబుకూడా ఎక్స్ వేదికగా స్పందించారు.  నేటి ఫలితాన్ని పట్టించుకోవద్దు ఫొగట్. మీరు నిజమైన ఛాంపియన్ అని నిరూపించారు. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయి అని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ సుసాకిని ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకు వచ్చిన భారత్‌ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ఒలింపిక్స్‌ కమిటీ అనర్హత వేటు వేయడంతో    ఫైనల్స్‌లో ఆమె అమెరికా రెజ్లర్‌తో పోటీ పడేందుకు సిద్దమవుతుండగా, ఆమె 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నారనే కారణంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.   ఆమె ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంతో భారత్‌ ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆమె తప్పక భారత్‌కు స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటే, ఈ కారణంతో ఒలింపిక్స్‌లో కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడం చూసి అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు. సెమీస్ కు ముందు కూడా ఆమె బరువు పరీక్షించి 50 కేజీలున్నట్లు నిర్ధారించుకున్నాకనే పోటీకి అనుమతించారు. కానీ ఒక్కపూటలో ఆమె వందగ్రాముల బరువు పెరిగిందంటూ అనర్హత వేటు వేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆమె  రాత్రి లేదా ఉదయం తీసుకున్న ఆహారం, నీళ్ళు, ఇతర పానీయాల కారణంగా కూడా ఆమాత్రం బరువు పెరిగి ఉండవచ్చు. ఆమె నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్‌ రెజ్లర్ యూయి సుసాకిని ఓడించింది కనుక వినేష్ ఫోగట్‌ ఫైనల్స్‌లో పాల్గొంటే తప్పకుండా గెలిచి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉంది. బహుశ అందుకే ఈ వంకతో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే తెర వెనుక కుట్ర జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   కాగా ఇండియన్ ఒలింపిక్ కమిటీ దీనిపై అభ్యంతరం తెలుపుతూ, ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఒలింపిక్స్‌ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ పునః సమీక్షించేందుకు అంగీకరిస్తేనే వినేష్ ఫోగట్‌ గురువారం రాత్రి ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆమె రిక్తహస్తాలతో స్వదేశానికి తిరిగి రాక తప్పదు.   బ్రిజ్ భూష‌ణ్ కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో వినేష్ ఫోగ‌ట్ క్రియాశీలంగా పోరాడింది, పోలీసు లాఠీ దెబ్బలను భరించింది. అవమానాలను ఎదుర్కొంది. ఈ కారణంగా దాదాపు ఏడాి పాలు రెజ్లింగ్ కు దూరమైనా.. ఆ తరువాత పట్టుదలతో సాధన చేసి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. తన అసమాన ఆటతీరుతో రెజ్లింగ్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఒలింపిక్స్ సెమీస్ లో ప్రపంచ ఛాంపియన్ ను మట్టికరిపించింది. ఫైనల్ లో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణ పతకం సాధించడం ఖాయమనుకుంటున్న దశలో వంద గ్రాముల ఎక్కువ బరువు అంటూ ఆమెపై అనర్హత వేటు పడటం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటమే ఇందుకు కారణమంటూ రాజకీయవర్గాలలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వినేశ్ ఫోగట్ అసమాన పోరాట పటిమను యావద్దేశం గర్వంగా చెప్పు కుంటోంది. 

ఉల్లి ధర తగ్గబోతోంది... ఎందుకంటే...!

సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లిపాయల రేటు వింటేనే కన్నీరు వస్తోంది కదూ.. ఇక అతి త్వరలో ఆ కన్నీళ్ళు ఆనందబాష్పాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు నమ్మబుద్ధి కాదుగానీ, ఇది నిజం అయ్యే అవకాశాలు వున్నాయి.. త్వరలో ఉల్లిపాయల రేట్లు తగ్గబోతున్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సంక్షోభం నడుస్తోంది కదా. అక్కడ పరిస్థితి అంతా ఉద్రిక్తంగా వుంది. దాంతో ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కి వెళ్ళాల్సిన ఉల్లిపాయల ట్రక్కులన్నీ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. ఈ ట్రక్కులు ఇప్పుడప్పుడే బంగ్లాదేశ్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. అప్పటి వరకూ లారీల్లో వున్న ఉల్లిపాయలు ఊరుకోవు కదా.. కుళ్ళిపోతాయి కదా.. అందుకని, ఆ ఉల్లిపాయలన్నీ మన దేశ మార్కెట్లోకి రిటర్న్ అయ్యే అవకాశం వుంది. సప్లయ్ పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్న ఎకనామిక్స్ సూత్రాన్ని అనుసరించి త్వరలో దేశంలో ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం వుంది. అదన్నమాట!

కృష్ణమ్మకు చంద్రబాబు పలకరింత.. పులకరింత!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణానదిని పలకరించారు.. ఆ నదీమతల్లిని చూసి ఆయన పులకరించారు. విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి చంద్రబాబు కిందకు దిగారు. బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారున. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను చంద్రబాబు దగ్గరకు పిలిచి మాట్లాడారు. కృష్ణమ్మ జలకళ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో  సంతృప్తిగా ఉందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్!

వెనుకబడిన కులాల వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ తీర్మానం పార్లమెంట్‌లో చట్టంలా మారే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ బీసీలకే అగ్రస్థానం కల్పించాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు మొదటి నుంచీ అండగా వున్నారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు తేవడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుంది’’ అన్నారు. చేనేత కార్మికుల గురించి మాట్లాడుతూ, ‘‘చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకురానున్నాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి, ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. ఆరోగ్య బీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ కేంద్రం జీఎస్టీ తొలగించడం సాధ్యం కాకపోతే, రీఎంబర్స్.మెంట్ చేస్తాం. చేనేత కార్మికులకు 67 కోట్లు ఇస్తాం. నేత పని సామూహికంగా చేసే విధానాన్ని ప్రారంభిస్తాం. చేనేత మగ్గాల కోసం 50 వేల రూపాయలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత బట్టలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడ్డం మన బాధ్యత. నెలకు ఒక్క రోజైనా చేనేత బట్టలు ధరించాలి. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ని ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు సౌర విద్యుత్ ప్యానెళ్ళ ద్వారా ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కుటుంబాలకు 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేనేతలో సహజరంగుల వాడకాన్ని ప్రోత్సహిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా... ఓకే!

ఇద్దరు పిల్లలకంటే ఎక్కువమంది పిల్లలున్నా నో ప్రాబ్లం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. ఎంతమంది పిల్లలుంటే అంత మంచిదని కూడా అంటోంది. గతంలో ప్రభుత్వాలు పాటించిన ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు’ అనే రూల్‌ని సడలిస్తోంది. గతంలో కుటుంబ నియంత్రణని కఠినంగా అమలు చేయడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు వుండకూడదన్న నిబంధన ఏర్పాటు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతమంది పిల్లలు వున్నా, అది స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అడ్డంకి కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో పునరుత్పత్తి శాతం తగ్గిపోతోందని, ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రంలో యువతరం సంఖ్య తగ్గిపోయే ప్రమాదం కూడా వుందని రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

భువనేశ్వరి కోసం చీర కొన్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తన భార్య భువనేశ్వరికి చీరలు కొనేది తక్కువ. గతంలో ఒకసారి ఆయన భార్య కోసం చీర కొన్నారు. అయితే ఆ చీర భువనేశ్వరికి నచ్చకపోయినా, తన భర్త కొన్న చీరను ఆమె చాలా ఇష్టంగా దాచుకున్నారు. ఈ విషయాన్ని భువనేశ్వరే స్వయంగా ఒకసారి చెప్పారు. చంద్రబాబు నుంచి మంచి చీర సెలక్షన్ ఆశించడం న్యాయం కాదు కదా.. అయినప్పటికీ, చంద్రబాబు తన భార్య కోసం మరోసారి చీర కొన్నారు. చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద చీరలు చూసి, ఒక చీర కొనుగోలు చేశారు. వివిధ రకాల చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకున్నారు. మరి చంద్రబాబు కొన్న చీర ఇప్పుడైనా భువనేశ్వరికి నచ్చుతుందో... లేదో!

ఇవే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన  జరిగింది. మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను  మంత్రి పార్థసారథి మీడియాకి వెల్లడించారు.  * రెవెన్యూ శాఖలో మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. * రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తారు. * జగన్ బొమ్మ వున్న సర్వే రాళ్ళను  ఏం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది. జగన్ పేరు, బొమ్మ తొలగించాలని నిర్ణయించారు. * భూముల రీ సర్వేని పక్కన పెట్టాలని నిర్ణయించారు. * ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వుంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనున్నారు. * మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించారు. * వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై  చర్చ జరిగింది. * ఎక్సయిజ్ శాఖలో అక్రమాలు జరగకుండా ఏం చేయాలన్న అంశం మీద చర్చ జరిగింది. * మత్స్యకారులకు ఇబ్బందికరంగా వున్న జీవో నంబర్ 217ని రద్దు చేయాలని కేబినెట్ తీర్మానించింది. * నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగఉంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ  చేయాలని నిర్ణయం. * పాడేరు, మార్కాపురం పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభానికి ఆమోదం. * సున్నిపెంట గ్రామ పంచాయితీకి 280 ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 40ని రద్దు చేస్తూ, ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించాలని నిర్ణయించారు.  * రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా వుందన్న విషయం మీద చర్చ జరిగింది. రాష్ట్రంలో భవిష్యత్తులో యువతరం తగ్గిపోతుందన్నఆందోళన వ్యక్తమైంది. * ఎక్సయిజ్ శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

మన రెజ్లర్లపై కుట్ర జరిగింది.. విజేందర్ సింగ్

ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్స్ ముంగిట వినేష్ ఫోగట్ నిర్ణీత బరువు కంటే అధికంగా ఉందంటూ అనర్హత వేటు వేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వినేశ్ ఫోగట్ అనర్హత వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఒలింపిక్ మెడల్ గ్రహీత విజేందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇండియన్ రెజ్లర్లపై కుట్ర జరుగుతోందన్న విజేందర్ సింగ్.. బీజేపీ ఎంపీ బ్రజేష్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనకు ఈ కుట్రకూ సంబంధం ఉందన్న సందేహం వ్యక్తం చేశారు. ఒక్క రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం.. అలాంటిది 100 గ్రాములు పెద్ద సమస్య ఎందుకైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద కుట్రపూరితంగానే వినేశ్ ఫోగట్ ను ఒలింపిక్స్ మెడల్ కు దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో కూడా విపక్షాలు వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో వినేష్ ఫోగట్ అనర్హతపై క్రీడా శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అంతకు ముందు కాంగ్రెస్ వినేశ్ ఫోగట్ పై ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో అప్పుడు  ఢిల్లీ వీధుల్లో పోరాడింది.. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాట్స్ పై పోరాడుతోందంటూ ప్రశంసలు  గుప్పించింది. మొత్తం మీద వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం, అసంతృప్తి, నిరసన వ్యక్తం అవుతోంది.   

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఆర్వో సమీక్ష

స్థానిక సంస్థ‌ల కోటాలో ఈ నెల 30వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య రాకుండా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉమ్మ‌డి  విశాఖ జిల్లా ఏఆర్వోల‌ను, పోలీసు అధికారుల‌ను ఉమ్మ‌డి జిల్లాల‌ రిట‌ర్నింగ్ అధికారి, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికారుల‌తో బుధ‌వారం (ఆగస్టు 7) ఉద‌యం త‌న ఛాంబ‌ర్లో జేసీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ఎన్నిక‌ను ప్ర‌శాంతంగా జ‌రిగేలా చూడాల‌ని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూప‌క‌ల్ప‌న‌, బ్యాలెట్ పేప‌రు త‌యారీ, గుర్తుల కేటాయింపు త‌దిత‌ర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై   సూచ‌న‌లు చేశారు. సాంకేతికప‌ర‌మైన విషయాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అనుమ‌తుల జారీకి సంబంధించి సింగిల్ విండో విధానం అమ‌లు చేయాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని దృష్టిలో ఉంచుకొని అన్ని కార్య‌క‌లాపాలు నిర్వహించాల‌ని హిత‌వు ప‌లికారు. ఉమ్మ‌డి జిల్లాల నుంచి స‌మావేశానికి హాజ‌రైన ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను రిట‌ర్నింగ్ అధికారికి వివ‌రించారు. వారు చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి తెలిపారు.  

ఏపీ సీఎం చంద్రబాబుతో డాక్టర్ సునీత భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత భేటీ అయ్యారు. బుధవారం (ఆగస్టు 7)న జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు అంటే చంద్రబాబుతో భేటీకి ముందు డాక్టర్ సునీత ఏపీ హోంమంత్రి వంగల పూడి అనితతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసుపై చర్చించారు. కేసు వివరాలను హోంమంత్రికి వవరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత సునీతకు భరోసా ఇచ్చారు. సీబీఐ విచారణలో ఉన్న కేసు సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీతకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా చెప్పారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. దీనిపై అనిత  దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న హామీ ఇచ్చారు.  

మరో వికెట్ డౌన్.. వైసీపీ మరింత వీక్!

వైసీపీకి మరో నేత రాజీనామా చేశారు. పరాజయం తరువాత కూడా మారని జగన్ తీరుకు నిరసనగా వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా నేతలు రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీసీకి గుడ్ బై చెప్పేశారు. నియోజకవర్గ అభివృద్థి కోసం కూటమితో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తాను ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.   కాగా దొరబాబు పిఠాపురం నియోజకవర్గం నుంచి 2004, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. మధ్యలో 2014లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే  సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన  జగన్ తనను కాదని 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను పిఠాపురం నుంచి పోటీకి  నిలబెట్టడంతో ఆయన ఒకింత కినుక వహించినా తమాయించుకుని వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికలలో వంగా గీతకు మద్దతుగా పని చేశారు. ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఓటమి తరువాత కూడా వైసీపీ అధినేత తీరు మారకపోవడం, పని చేసిన వారికి తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి రాష్ట్ర ప్రగతికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండటం, అలాగే అమరావతి, పోలవరం నిర్మాణాలను వేగవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన దొరబాబు.. రాష్ట్ర ప్రగతికి తన వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే కూటమితో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  మొత్తం మీద వైసీపీకి దొరబాబు రాజీనామా చేయడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు బిగ్ షాక్ అనే చెప్పాలి. రోజురోజుకూ వైసీపీ బలహీనపడుతున్నదనడానికి మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల వరుస రాజీనామాలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏమిటీ కాలయాపన.. జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం (ఆగస్టు 7) విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు.  ట్రయల్‌ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారంటూ సీబీఐని న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. కేసులు నమోదు అయిన నాటి నుంచి ఆరుగురు జడ్జిలు మారిపోయారని, రిటైర్‌ అయ్యారని, గత పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనికి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ మరో  కోర్టుకు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పంటూ మరో కోర్టుకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అని చేస్తున్న వాదనకు, కేసు ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్‌ ఖన్నా అన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఎ.ఎస్‌.జి.రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఎ.ఎస్‌.జి. రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను  మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 

పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ ఔట్.. కుట్ర కోణంపై అనుమానాలు

 పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడి   ఫైనల్స్ కు చేరింది. స్వర్ణం లేదా రజత పతకం ఖాయం చేసుకుంది. ఇంతలోనే ఆమెపై ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఆమె రిక్త హస్తంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకే ఒలింపిక్స్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేయడానికి కారణమేంటంటే ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటమే.  వినేశ్ పోగట్  అసలీ ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుందా? అన్న అనుమానాల నుంచి అతి గొప్ప పోరాట పటిమ చూపి ముందుకు సాగింది. తన క్యాటగరీని మార్చుకుని మరీ కఠోర శ్రమకు ఓర్చి అర్హత సాధించింది. అమోఘ ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. చివరికి కేవలం 100 గ్రామలు బరువు ఎక్కువ ఉందంటూ ఒలింపిక్స్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేసింది.  గ‌త ఏడాది బ్రిజ్ భూష‌ణ్ కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో వినేష్ ఫోగ‌ట్ పోరాడారు. పోలీసు దెబ్బ‌ల‌తో పాటు అవ‌మానాలు ఓర్చుకొని, దాదాపు ఏడాదిన్న‌ర ఆట‌కు దూర‌మైనా… ఎంతో క‌ష్ట‌ప‌డి ఒలంపిక్స్ కు అర్హత సాధించి, పట్టుదలగా ఆడి ఫలితం దక్కుతుందనుకుంటున్న దశలో ఒలింపిక్స్ అంతే ప‌ట్టుద‌ల‌గా ఆడి… త‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కుతుంద‌నుకుంటున్న దశలో ఒలింపిక్స్ బరి నుంచి బయటకు రావాల్సి రావడం విషాదం.   కాగా వినేష్ పోగట్ పై అనర్హత వేటు వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు కూడా క్రీడా వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది భారత రెజ్లర్స్ అసోసియేషన్  అప్పటి అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వినేష్ ఫొగాట్ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. రోజుల తరబడి రోడ్లపై ఉద్యమించి చివరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగడానికి కారణమయ్యారు. అప్పట్లో రెజ్లర్ల ఆందోళనను భారత ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి శతథా ప్రయత్నించింది. కానీ రెజ్లర్ల పట్టుదలకు తలవొంచక తప్పలేదు. ఇప్పుడు అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.

తాడేపల్లి.. బెంగళూరు ప్యాలెస్ ల మధ్య జగన్ షటిల్ సర్వీస్.. ప్రయోజనమేంటి?

వైసీపీ ఘోర ఓటమి తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక్క రోజు స్థిమితంగా గడపలేకపోతున్నారు. ఓటమి తరువాత ఆయన తాడేపల్లి టూ బెంగళూర్ డైలీ సర్వీస్ చేస్తున్నట్లుగా ఆయన పర్యటనలు ఉన్నాయి.తెలుగుదేశం వాళ్లు వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడు తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. కూటమి సర్కార్ ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ గగ్గోలు పెట్టడం. అలా పెడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు షటిల్ సర్వీస్ చేయడం వినా జగన్ మోహన్ రెడ్డి  అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండు నెలలలో చేసిందేమీ లేదు. మధ్యలో ఒక సారి హస్తిన వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ఖితిపై ధర్నా చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి కారణమేమిటన్నది చెప్పకపోయినా, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేందుకు మాత్రం కారణం చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా చిన్న పాటి హింసాఘటన జరిగితే.. ఆ ఘటన వెనుక ఉన్న కారణంతో సంబంధం లేకుండా దానికి రాజకీయం ఆపాదించి, వైసీపీ శ్రేణులపై తెలుగుదేశం దాడులు అంటూ హడావుడి చేయడానికే ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి యబటకు వస్తున్నారు.  ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత  ఈ రెండు నెలలో జగన్ నాలుగుసార్లు బెంగళూర్  తాడేపల్లి ప్యాలస్ ల మధ్య  షటిల్ సర్వీస్ చేశారు.  రాష్ట్రంలో ఎదో జరిగిపోతుంది, తనకు తన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయడమే లక్ష్యం అని చాటుకుంటున్నారు.  బాబాయ్ గొడ్డలి పోటును గుండె పాటుగా చిత్రీకరించి  గత ఎన్నికలలో సానుభూతిని సంపాదించుకుని గద్దెనెక్కిన జగన్.. ఇప్పుడు కూడా అదే సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగిన దౌర్జన్య, హింసాకాండలను ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన జనం ఆయన ఓదార్పు, పరామర్శ యాత్రలను లైట్ తీసుకుంటున్నారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటూ గుండెలు బాదుకుంటున్న జగన్, ఆ హతుల వివరాలు బయటపెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు.  వ్యక్తిగత కక్ష్యలను రాజకీయ హత్యలుగా, కుటుంబ గొడవలను పార్టీ గొడవలుగా చిత్రీకరించి  రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారు.   జగన్ ఈ వైఖరి వైసీపీ నేతలలో అసంతృప్తికి కారణం అవుతోంది. కేతిరెడ్డి వంటి వారు బాహాటంగానే కూటమి ప్రభుత్వానికి నిలదొక్కుకోవడానిక సమయం ఇవ్వాలి, ఆ తరువాతే విమర్శలు అంటూ జగన్ కు బాహాటంగానే సూచిస్తున్నారు. పార్టీ సీనియర్లంతా సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు.  ఈ పరిస్థితుల్లో జగన్ బెంగళూరు, తాడేపల్లి మధ్య షటిల్ సర్వీసులను,  శాంతి భద్రతల పరిస్థితిపై చేపడుతున్న ఆందోళన, పరామర్శ, సంతాప యాత్రలను ఆ పార్టీలోనే ఎవరూ పట్టించుకోవడం లేదు. నెటిజనులు జగన్ హడావుడిపై ఓ లెవల్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే తాను చెప్పడమే తప్ప వినే  అలవాటు లేని జగన్ వాస్తవాలను గుర్తించకుండా చేస్తున్న హడావుడి వల్ల ఆయనకు కానీ, ఆయన పార్టీకి కానీ ఇసుమంతైనా ప్రయోజనం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్.. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్!

ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు   బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావులకు  నోటీసులు జారీ చేసి,  విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఇక ఇప్పుడు తాజాగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్, మరికొందరు బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 26న అంబట్ పల్లి గ్రామంలో మేడిగడ్డ బ్యారేజి వద్ద కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వలి షేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   ఆ ఫిర్యాదులో  కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరామణారెడ్డి, బాల్కసుమన్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్ కెమేరాను ఉపయోగించి ఫొటోలు తీశారని వలి షేక్ పేర్కొన్నారు. అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్ల వినియోగంపై నిషేధం ఉందని పేర్కొన్న ఆయన కేటీఆర్ తదితరులు డ్రోన్ కెమేరాలతో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీసులు కేటీఆర్, గండ్ర, బాల్క తదితరులపై కేసు నమోదు చేశారు.  2020లో ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై దాదాపు ఇలాంటి కేసునే బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసింది. అప్పట్లో మంత్రి కేటీఆర్ నివాసంపై డ్రోన్ కెమేరాతో ఫొటోలు తీశారంటూ రేవంత్ పై కేసు నమోదైంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించి ఫొటోలు తీశారంటూ కేటీర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.  దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా అప్పుడు  కేటీఆర్ తనపై కేసు నమోదు చేసినందున రేంవత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.