ఎల్.కె.అద్వానీకి అస్వస్థత

కాకలు తిరిగిన రాజకీయవేత్త, బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్.కె.అద్వానీ అస్వస్థతకి గురయ్యారు. 96 సంవత్సరాల వయసు వున్న అద్వానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు తీవ్రం కావడంతో మంగళవారం ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు బంధువర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. జూన్ నెలాఖరులో కూడా అద్వానీ అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్.లో చేర్చారు. ఆయనకు యూరాలజీ చికిత్స అందించారు. అనంతరం జులై మొదటివారంలో ఆయన మరోసారి అనారోగ్యానికి గురవడంతో అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బొత్సకు రాజకీయ సమాధా?

సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోనుందా? వైసీపీ అధినేత జగన్ నిర్ణయమే బొత్స రాజకీయ జీవితానికి సమాధి కట్టేయనుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బొత్త సత్యనారాయణ ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు, తనకే కాకుండా తన కుటుంబ సభ్యులను  కూడా ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఆయనది. అయితే 2014 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత బొత్స సత్యనారాయ సైలెంటైపోయారు. పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఓ విధంగా అజ్ణాత వాసం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ చేయందుకోనున్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది.  ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ హస్తినలో ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా బొత్స కూడా జగన్ వెంట హస్తిన వెళ్లారు. అయితే జగన్ బొత్సను వెంట తీసుకురావడానికి కారణం ధర్నా కాదని పరిశీలకులు విశ్లేషిస్తారు. జగన్ కు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు ఆ పార్టీతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకోవడం కోసమేనని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పారు. సరే అసలు విషయానికి వస్త... జగన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఓ పెద్ద టాస్క్ ఇచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు.   అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ బొత్సకు సుతరామూ ఇష్టం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీకి ఈ ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు అంతంత మాత్రమే. ఉప ఎన్నికలో ఫలితం తేడాగా వస్తే అక్కడితో బొత్స పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అంటారు. ఇప్పటికే బొత్స తనతో సహా తన కుటుంబ సభ్యులు ఐదుగురికి ఫ్యామిలీ ప్యాకేజీ చందంగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఎన్నికలలో ఆయన సహా ఆయన కుటుంబ సభ్యులందరూ పరాజయం పాలయ్యారు. ఇటీవలి ఎన్నికలలో బొత్స కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేశారు. బొత్స స్వయంగా చీపురుపల్లి నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బొత్స సతీమణి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఇక బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతి నగరం నుంచి, ఆయన తోడల్లుడు బి.అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి,  బొత్స సత్యనారాయణ సమీప బంధువు బెల్లెన చంద్రశేఖర్ విజయనగరం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ తరుణంలో ఆయనను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో దింపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడి ఆ స్థానం ఖాళీ అవ్వడమే కారణం. అదలా ఉంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో మొత్తం841 మంది ఓటర్లు ఉంటే వారిలో 615 మంది వైసీపీకి చెందిన వారే. తెలుగుదేశం పార్టీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికను అప్పట్లో తెలుగుదేశం బహిష్కరించింది.  అయితే పార్టీ నేతలు, అభిమానులు పోటీలో నిలిచి పలు స్థానాలలో విజయం సాధించారు. కాగా గణాంకాలను బట్టి చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఏ విధంగా చూసినా బొత్స విజయం తథ్యం అని జగన్ చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవలి  ఎన్నికలలో వైసీపీ ఘోరంగా  ఓడిపోయింది. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఆ స్థాయి పరాజయం తరువాత వైసీపీ స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. అంతే కాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించింది. ఎలక్షన్ మేనేజ్ మెంట్ స్కిల్స్ అపారంగా ఉన్న సీఎం రమేష్ వెంటనే రంగంలోకి దిగారు. దీంతో పోటీ బొత్స వర్సెస్ సీఎం రమేష్ గా మారిపోయింది. వైసీపీకి చెందిన పలువురు స్థానిక సంస్ఖల ప్రతినిథులు తెలుగుదేశం గూటికి చేరారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో బొత్స పరాజయం పాలైతే  ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్, హరీష్ రావులకు కోర్టు నోటీసులు

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కాలం ఏ మాత్రం సానుకూలంగా లేదు. పార్టీ కష్టాలు, మరీ ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కష్టాలూ రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరారు. మరి కొందరు కూడా అదే దారిలో ఉన్నారని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ఈ కష్టాలు చాలవన్నట్లు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జరీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసి,  విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై  కేసీఆర్ , హరీష్ రావుతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘాకృష్ణారెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ , సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ,   ఇరిగేషన్ ఇంజినీర్ – ఇన్ – చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ కేసులో కోర్టు కేసీఆర్ , హరీష్ రావుతోపాటు మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.  కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎస్పీ, డీజీపీతో సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో  జిల్లా కోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్ట్ ఈ పిటిషన్ ను కొట్టివేయగా.. తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనల మేరకు మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. దీంతో జిల్లా కోర్టు సెప్టెంబర్ 5న ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కేసీఆర్, హరీష్ తదితరులను  వచ్చే నెల 5న కోర్టుకు హాజరు కాలాల్సిందిగా ఆదేశించింది. అసెంబ్లీకే  డుమ్మా కొడుతున్న కేసీఆర్  విచారణకు హాజరౌతారా? లేదా అన్న చర్చ తెలుగ రాష్ట్రాలలో విస్తృతంగాజరుగుతోంది,  

మేడిగడ్డ కుంగుబాటుపై  కెసీఆర్ విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు

లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే విధంగా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు మేడిగడ్డ బ్యారేజి కుంగడంతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో  వచ్చేలా చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌పై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని స్పష్టం చేసింది.కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న కోర్టు కొట్టివేయగా.. ఆయన ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌‌ను కోర్టు పరిశీలించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో వాస్తవాలు ప్రజల ముందు పెడతామని అధికార కాంగ్రెస్ నాయకులు కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు.  గత సంవత్సరం డిసెంబర్ 29న మేడిగడ్డ బరాజ్ దగ్గర అధికారులతో ఈ ప్రాజెక్ట్ పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తమ ఇంజనీరింగ్ బాధ్యతలు విస్మరించి గత ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా వ్యవహరించారని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా మాట్లాడలేదని ఈ సందర్భంగా మంత్రుల బృందం తీవ్ర ఆరోపణలు చేసింది.ప్రాజెక్ట్ పనికిరాని స్థితిలో తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని, ప్రాజెక్ట్ డిజైన్లు, మన్నిక, నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలపై మంత్రుల బృందం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

రెడ్ బుక్ కు కాదు జగన్ బుక్ కే కూటమి సర్కార్ ప్రాధాన్యం!

జగన్ ఐదేళ్ల హయాంలో చేసిన తప్పిదాలే ఆయనను అధికారానికి దూరం చేశాయి.  అరాచక పాలన, అస్తవ్యస్థ విధానాలకు తోడు తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలకు దూరం చేయడం. పార్టీ కార్యకర్తలను సైతం పక్కన పెట్టేసి జగన్ తాడెపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయారు. బటన్ లు నొక్కడానికి పరదాల మాటున బయటకు రావడం తప్ప అసలు ప్రజలకు ముఖమే చూపించలేదు.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేసిన తప్పు చేయడం లేదు. అదే విధంగా జగన్ హయాంలో అధికారుల తప్పులను రెడ్ బుక్ లో నోట్ చేసి చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం కూటమి సర్కార్ రెడ్ బుక్ కంటే జగన్ బుక్ కే ప్రాధాన్యత ఇస్తోంది. ఆ బుక్ ప్రకారం నడుచుకోకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది.  జగన్ బుక్ అంటే ప్రజలతో సంబంధాలు లేకపోవడం, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం, తన విధానాలను వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం, అవినీతి, అక్రమాలతో ప్రజా ధనాన్ని దోచుకోవడం. తెలుగుదేశం కూటమి ఆ జగన్ బుక్ ప్రకారం వ్యవహరించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. రాజకీయ కక్ష సాధింపులకు తెలుగు దేశం కూటమి అస్సలు పాల్పడదని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. జగన్ హయాంలో నిబంధలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపైనా చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పిన చంద్రబాబు. అదే సమయంలో ప్రజలతో మమేకమై పని చేస్తామని చాటారు. అదే  చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పడమే కాకుండా చేసి చూపుతున్నారు.   చంద్రబాబు వారానికి ఒకసారి కార్యకర్తలను కలిసే కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యకర్తలు కూడా పార్టీ అధినేత తమకు అందుబాటులో ఉంటున్నారన్న ఆనందం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంత్రులు  నెలకు ఒకసారన్నా తమ జిల్లా కు వెళ్లి కార్యకర్తలతో గడపాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తలను మంత్రులు,ఎమ్మెల్యేలు కలసి వారి సమస్యలను తెలుసుకోవాలని,   పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో,కార్యకర్తలలోపట్టు సడలకూడదని సీఎం చెప్పారు.   అయితే జగన్ మాత్రం అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తన బుక్ నే తు.చ. తప్పకుండా ఫాలో అవుతున్నారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు ఆయన సెక్యూరిటీ నుంచి అవమానాలే ఎదురౌతున్నాయి. దీంతో జగన్ కు, వైసీపీకీ క్యాడర్ దూరం జరుగుతోంది. పులివెందులలో, తాడేపల్లి ప్యాలెస్ వద్దా కార్యకర్తల నిరసనలే ఇందుకు నిదర్శనం.  అంతే కాకుండా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు వచ్చే వారే కరవయ్యారు. ఆ కారణంగానే పలు చోట్ల ఇప్పటికే వైసీపీ కార్యాలయాలు మూతపడ్డాయి.  కుప్పం మైలవరం లలో  పార్టీ కార్యాలయాలను ఎత్తి వేయడం ఇందుకు నిదర్శనం.  జగన్ ఐదేళ్ల హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అయినా అధినేతపై విశ్వాసం మాత్రం కోల్పోలేదు. అదే జగన్ అధికారానికి దూరమై నిండా రెండు నెలలు పూర్తయ్యిందో లేదో అప్పడే వైసీపీ కార్యకర్తలు జగన్ పై విశ్వాసం క కోల్పోయారు. పార్టీకి, అధినేతకు దూరం జరుగుతున్నారు. పార్టీ నిలదొక్కుకుంటుందన్న నమ్మకం లేక తమదారి తాము చూసుకుం టున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరదనీరు...10 గేట్లుఎత్తివేత 

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల డ్యామ్ ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  స్పిల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు 64,338 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

బెయిల్ వద్దు.. జైల్లోనే ఉంటా!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో తనకు బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్   సోమవారం (ఆగస్టు 5) విచారణకు వచ్చింది. అయితే కవిత తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు కవిత బెయిలు పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా  వేసింది.   అయితే ఈ లోగా తన బెయిలు పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. కవిత బెయిలు పిటిషన్ ఉపసంహరణ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు కారణాలు చూపుతూ కవిత పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. ఒక దశలో పదే పదే బెయిలు పిటిషన్లు దాఖలు చేస్తున్నందున న్యాయమూర్తి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ చార్జిషీట్ దాఖలు చేశాయి. దీంతో కవిత డిఫాల్ట్ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం (ఆగస్టు 7) విచారణకు రానుండగా కవిత మంగళవారం (ఆగస్టు 6) తన బెయిలు పిటిషన్ ను ఉపసం హరించుకున్నారు. కవిత తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ న ఉపసంహరించుకోవడం సంచల నంగా మారింది. బెయిలు పిటిషన్ ఉపసంహరణ వెనుక ఉద్దేశమేమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  

పుంగనూరు పుడింగి ఆటకట్టు.. పెద్దిరెడ్డి భూదందాలపై ప్రజాదర్బార్

అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా   తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి  పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.  పెద్దిరెడ్డి పాపాల  పుట్టలు అన్నీ పగులుతున్నాయి.   వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డి దోపిడీలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  పుంగనూరు పుడింగి అక్రమాల నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ  మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి భూదందాల నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెడుతోంది. జగన్ సర్కార్ అధికారంలో  ఉన్న ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, దాడులే కాకుండా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో  పెద్ది రెడ్డి భూదందాలపై జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.  వాస్తవానికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు వీలులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనం ఆయనను ఛీ కొడుతున్నారు. పెద్ది రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల అరాచకాలపై ప్రజాగ్రహం ప్రజ్వరిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో భూముల రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే మదనపల్లి సబ్  కలెక్టరేట్ లో జరిగింది అగ్ని ప్రమాదం కాదనీ, ఉద్దేశ పూర్వ కంగా రికార్డులను దగ్ధం చేశారన్న ఆరోపణలతో తెలుగుదేశం కూటమి సర్కార్ విచారణకు ఆదేశిం చింది. ఆ విచారణలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని తేలింది. ఇలా ఉండగా  పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల భూ దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఫిర్యాదులపై విచారణకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమౌతోంది.   పెద్ది రెడ్డి భూదందాల అంశంపై పుంగనూరులో ప్రజాదర్బార్  నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది.  మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రజాదర్బార్రా ద్వారా పెద్దిరెడ్డి అక్రమాలను వెలుగులోనికి తీసుకువస్తున్నారు. ఈ ప్రజాదర్బార్ లో పెద్దిరెడ్డి అక్రమాలు, భూ కబ్జాలు, దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.    ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పుంగనూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు. మరో వైపు  మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా సాగుతోంది. తన భూదందాలు, కబ్జాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పెద్దిరెడ్డే  ఈ అగ్ని ప్రమాదం నాటకానికి తెరలేపారనీ, ఫైళ్ల దగ్ధంలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.  స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా  దీనిపై విచారణాధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే మదనపల్లె డివిజన్ లోని 11 మండలాల తహశీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ విచారణకు అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాదర్భార్  ద్వారా పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది.  దీంతో పుంగనూరు పుడింగి అటకట్టైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఎందుకంటే రికార్డుల ద‌గ్దం కేసులో అన్నివేళ్లూ పెద్దిరెడ్డి వైపే చూపుతుండ‌టంతో పెద్దిరెడ్డికి ఉచ్చుబిగుసుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మరో వైపు  హైకోర్టులో ఎన్నిక‌ల అఫిడ‌విట్ పై విచార‌ణ‌ సాగుతోంది. ఇంకో వైపు ప్రజాదర్బార్ లలో పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ. మొత్తం మీద పెద్దిరెడ్డి ఆటకట్టినట్లేననీ ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప్ర‌మాదంలో పడిందని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

బొత్స‌ను జ‌గ‌న్ నిండా ముంచేశారు!

ఏపీ రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలం అనుభ‌వం ఉన్న నేత‌ల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌లో బొత్సకు కూడా భాగ‌స్వామ్యం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా ఆయ‌న్ను ఎవ‌రూ ఊహించ‌ని విధంగా గ‌ట్టి దెబ్బ‌కొట్టారు. ఓడించి ఇంటికి పంపారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని  శ్మ‌శాన వాటిక అంటూ అవ‌హేళ‌న చేసిన బొత్స‌కు మ‌ళ్లీ అమ‌రావ‌తి గురించి నోరెత్త‌కుండా చేశారు. ఓట‌మి త‌రువాత బొత్స పెద్ద‌గా మీడియా ముందుకు కూడా రావ‌టం లేదు. వ‌చ్చినా నామ‌ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నాడు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాభ‌వంతో ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న్ను వ‌దిలిపెట్టేలా లేరు.   ఉమ్మ‌డి విశాఖప‌ట్ట‌ణం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బొత్స పేరును ప్ర‌క‌టించారు. పోటీచేసేందుకు ఆయ‌న‌ సిద్ధంగా లేక‌పోయినా జ‌గ‌న్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి  ఒప్పించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వాస్త‌వానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు, అధికార కూటమికి 215 ఓట్లు  ఉన్నాయి. ఎన్నిక‌ల‌ ముందు, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఉమ్మ‌డి జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బొత్సను పోటీలోకి దింపితే పెద్ద సంఖ్య‌లో వైసీపీని వీడుతున్న ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను క‌ట్ట‌డి చేయొచ్చ‌న్నది జ‌గ‌న్ ఉద్దేశం. కానీ, ఉమ్మ‌డి జిల్లాలోని చాలా మంది వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు బొత్స అభ్య‌ర్థిత్వం ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ బొత్స‌, ఆయ‌న కుటుంబం అనేక ప‌ద‌వులు అనుభ‌వించారనీ, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పినా మ‌ళ్లీ బొత్స‌కు ఎమ్మెల్సీ అవ‌కాశం ఇవ్వ‌డం ఏమిటని అధిక‌శాతం వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తురు‌. దీంతో ఇప్ప‌టికే వంద‌మందికిపైగా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోయారు. మ‌రో 200 మంది తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.    స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచేందుకు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా తొలుత అంగీక‌రించ‌లేదు‌. అయితే, బొత్స‌ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఎలాగైనా బొత్స‌ను ఎమ్మెల్సీ బ‌రిలో నిలిపి పార్టీ మార‌కుండా క‌ళ్లెం వేయాల‌న్నది జ‌గ‌న్ ప్లాన్ గా వైసీపీ నేత‌లు చెబుతున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్ప‌టికే  కేంద్రంలోని కాంగ్రెస్ పెద్ద‌లతో ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాహుల్ గాంధీకి ద‌గ్గ‌ర వ్య‌క్తులుగా ఉన్న కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చి ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ప‌ని చేయాల‌ని బొత్స‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ కోలుకునే ప‌రిస్థితి లేద‌ని భావించిన బొత్స స‌త్య‌నారాయ‌ణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సాను కూలంగా ఉన్నారని అంటున్నారు‌. ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, బొత్స‌ను బ‌ల‌వంతంగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు ఒప్పించారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థే గెలుస్తాడ‌ని తెలుసు. అయినా అన్నీ నేను చూసుకుంటాన‌ని బొత్స‌ను జ‌గ‌న్ బ‌రిలోకి దింపారు‌. జ‌గ‌న్ మాట తీసేయ‌లేక అయిష్టంగానే బొత్స పోటీకి  స‌రే అన్నార‌ని విశాఖ ఉమ్మ‌డి జిల్లా రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది.   విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ను తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీంతో బొత్సను ఒడించేందుకు తెలుగుదేశం వ్యూహాలు రచిస్తోంది.   సోమ‌వారం సాయంత్రం పల్లా శ్రీనివాస్ నివాసంలో అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరకు, పాడేరుకు చెందిన వైసీపీ  ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లపై వారు ఫోక‌స్ పెట్టారు.   ఈ స‌మావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజ‌ర‌య్యారు. వారిని నేరుగా అమరావతిలో క్యాంపుకు త‌ర‌లించిన‌ట్లు తెలిసింది. కూట‌మి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరును సీఎం చంద్ర‌బాబు నాయుడు దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. బొత్స అభ్య‌ర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న కొంద‌రు వైసీపీ ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ఇప్ప‌టికే కూట‌మి పార్టీలో చేరిపోయారు. దీంతో.. ప్ర‌స్తుతం కూట‌మి అభ్య‌ర్థికి అనుకూలంగా ఉన్న‌స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య  500కు చేరిన‌ట్లు తెలుస్తోంది. తాజా ప‌రిణామాల‌తో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఓట‌మి దాదాపు ఖాయ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

తాటికొండ భైరవగుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు పరిరక్షించుకోవాలి

 ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి భూత్ పూర్ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనున్న తాటికొండ భైరవ గుట్ట పై కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా  సీఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.  భూత్ పూర్ కు చెందిన రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త, సత్తూర్ అశోక్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సోమవారం నాడు భైరవగుట్టపై విస్తృతంగా జరిపిన పురావస్తు అన్వేషణలో దాదాపు పదికి పైగా కొత్తరాది యుగపు రాతి గొడ్డలు, సానపెట్టిన రాతి సానెలు ఉన్నాయని, గుట్టపై శిలాయుగపు కొండ చరియ ఆవాసాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. 7 నుంచి 15 అంగుళాల పొడవైన, రెండు నుంచి నాలుగు అంగుళాల వెడల్పు, అంగుళం లోతు గాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, నిర్మాణ సామాగ్రి కోసం రాతిని తీసే క్రమంలో ఇవి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని శివనాగిరెడ్డి సూచించారు. క్రీ.పూ. 4000 సంవత్సరాలకు చెందిన ఈ ఆదిమానవుని ఆనవాళ్లను కాపాడుకొని, భావితరాలకు అందించాలని తాటికొండ గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, బంగారు బాలకృష్ణ పాల్గొన్నారని ఆయన చెప్పారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహేంద్ర 

సోషల్ మీడియాలో తరచూ వైరల్ అయ్యే కార్పోరేట్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర. తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు. ఇది పీపీపీ మోడల్‌లో ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని తాను ఆనంద్ మహేంద్రకు విజ్ఞప్తి చేశానన్నారు. ఆయన రెండు రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల సమీకరణ కోసమే ఈ రోజు న్యూయార్క్ పర్యటనకు వచ్చానన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు వచ్చాయన్నారు. అధికారంలో టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మరో పార్టీ ఉన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించి ముందుకు సాగుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే... ఈరోజు 250 కిలో మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే, రీజినల్ రింగ్ రోడ్డు వడ్డాణం అవుతుందని వ్యాఖ్యానించారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్‌గా మూడు లేయర్ల కింద అభివృద్ధి చేసేలా, మెగా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచంలో చాలామంది వైద్యం కోసం మన దేశానికి, మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు.

వర్గీకరణతో అందరికీ మేలు జరగాలి!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ గతంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీనికి మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దానిలో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన దాదాపు 500 పేజీల తీర్పులో బాలగోపాల్ వ్యాఖ్యల సారం ఉందనే చెప్పాలి.  ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాలకు సమ న్యాయం జరగడం లేదంటూ దాదాపు దశాబ్దాల క్రితం వారిలో అంతరాలకు బీజం పడింది. అన్నదమ్ముల్లా మెలిగే వారిలో అంతరాలు తొలగించి జనాభా ప్రాతిపదికన  రిజర్వేషన్ల అమలును సరిచేసి, వాటి ఫలాలు అందుకోవాలని ఐదు దశాబ్దాల క్రితం విజ్ఞాపనలతో మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనంటూ దశాబ్దాల క్రితం ఉద్యమం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు, ఇటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అసలీ వర్గీకరణ ఏమిటి? ఎక్కడ తేడా వస్తోంది? భావోద్వేగాలను పురిగొల్పేలా ఉద్యమం ఎందుకు జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు బదులు దొరకాలంటే దశాబ్దాల పరిణామాలను ఒకసారి పరికించాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కడం లేదని, రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో ఎస్సీ కులాల్లో అసమానతలు పొడచూపడంతోనే వర్గీకరణ అంశం ఉద్యమానికి  దారి తీసిందని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు పలుమార్లు స్పష్టం చేశారు. ఎస్సీల్లోని 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం అందడం లేదని ఎస్సీ రిజర్వేషన్లపై 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ నివేదించింది. ఇదే అంశంపై 1972 నుంచి మొదలుకుని ఉమ్మడి ఏపీలో మారిన ప్రతి సీఎంకు విజ్ఞప్తుల వెల్లువ మొదలైంది. ఎస్సీని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్‌తో 1994లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించింది.  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న వర్గీకరణ ప్రధాన డిమాండ్‌గా  సభ  జరిపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1996లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తూ నాటి చంద్రబాబు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ 1997 జూన్ 6న తెలుగుదేశం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలతో సహా మొత్తం 12 కులాలను అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించి ఒక శాతం కోటాను కేటాయించారు. ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉప కులాలతో సహా మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటాను కేటాయించారు. 'సీ'లో మాల, దాని ఉప కులాలతో సహా మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా ఇచ్చా రు. 'డీ'లో ఆదివాసి ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1 శాతం కోటా నిర్ణయిస్తూ నాడు చంద్రబాబు  ప్రభుత్వం జీవో జారీ చేసింది.  ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్ర అధికారం లేదని మాల మహానాడు కోర్టును ఆశ్రయించింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దాంతో  వర్గీకరణ రద్దయ్యింది.  పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై  మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్-కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుంది. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదనే వాదనను పీవీ రావు తెరమీదకు తెచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్రతో సృష్టించిందే వర్గీకరణ ఉద్యమం అని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తన వైపు తిప్పుకొనే వ్యూహంతోనే చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారనే విమర్శలు చేశారు. ఎస్సీలను వర్గీకరిస్తూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి చంద్రబాబు ప్రభుత్వం  రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ.. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టి వేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించారు. దీంతో వర్గీకరణ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2000 నుండి 2004 మధ్య దాదాపు ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో   రిజర్వేషన్ల అమలు కారణంగా మాదిగలకు దాదాపు 22 వేల వరకు ఉద్యోగాలు వచ్చాయి అని  నాడు మందకృష్ణ ప్రకటించారు.  సమాజంలో అసమానతలు, అంతరాలు, కుల, వర్గ, ప్రాంత, మత వైషమ్యాలు లేని ఆరోగ్యకరమైన  భారతదేశ  సమాజాన్ని కాంక్షించే  స్వాప్నికుడిగా అందరూ బాగుండాలి అని  కోరుకుందాం..!

బంగ్లాదేశ్ లో సైనిక పాలన!?

బంగ్లాదేశ్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఆమె ప్రత్యేక విమానంలో భారత్ కు చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు దేశాన్ని దగ్ధం చేస్తోంది. ఆ దేశ పౌర సమాజం రెండుగా చీలిపోయి వీధుల్లోకి వచ్చి ఘర్షణలకు దిగుతోంది. ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. సైన్యం వారిని అడ్డుకునే ప్రయత్నంలో టియర్ గ్యాస్ ప్రయోగించింది. కాగా తాజాగా బంగ్లాదేశ్ లో ప్రజ్వరిల్లిన హింసాకాండలో వంద మందికి పైగా మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇలా ఉండగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రత్యేక హెలికాప్టర్ లో భారత్ కు చేరుకున్నట్లు విశ్వసనీ సమాచారం. షేక్ హసీనా రాజీనామాతో సైన్యం పరిస్థితులను తన అధీనంలోకి తీసుకుంది.  

మీడియా ముఖ విషకుంభం ‘సాక్షి’!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను ఇటీవల బదిలీ చేసింది. బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది’’ ఇదీ భర్తకి తగ్గ భార్య వైయస్ భారతి సొంత పత్రిక  చిమ్మిన విషం. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన సమయంలో ఇదే భారతి  సాక్షి  పత్రిక, సాక్షి  టి.వి.లో  నాడు చంద్రబాబు  పాలనలో  36 మంది  డియస్పీలకు అక్రమంగా అన్యాయంగా  ప్రమోషన్ కల్పించారు అని  పెద్ద ఎత్తున  ప్రచార దాడి చేశారు.  చంద్రబాబుకు కులపిచ్చితో  తన సామాజిక వర్గం వారికి  మేలు చేయడానికి  నిబంధనలకు  విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారు అని  నానా యాగీ చేసారు.  అసలు  విషయం  ఏంటంటే,  కేవలం ముగ్గురు డియస్పీలకు 36 మంది అని  తప్పుడు ప్రచారం చేశారు.  ఈ ప్రచారాన్ని తెలుగుదేశం అధినేత  చంద్రబాబు, లోకేష్, ఇతర కమ్మ రాజకీయ నాయకులు ఎవరూ కూడా  ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు.  ఫలితంగా  నాడు  ప్రజలను నమ్మించగలిగారు.  అనేక  అబద్ధాల  పునాదులపై  ఒక్క చాన్స్ పేరుతో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది.   ఈ ఐదేళ్ళ  జగన్ రెడ్డి  విధ్వంసకర  పాలనలో  అనేక  అమానవీయ  అకృత్యాలకు  స్వయంగా  జగన్ రెడ్డి  పాల్పడ్డారు.  చంద్రబాబు  సామాజిక వర్గం అంటే  దేశద్రోహులు అన్నట్టు  సాక్షాత్తూ  ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి  స్వయంగా  కులం పేరు పెట్టి నాటి  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుండి  డిజిపి హోదా కలిగిన ఎబి  వెంకటేశ్వరావు పదవీ విరమణ చేసే  చివరి రోజు  వరకు  ఎలా వేధించారో  అందరూ చూశారు. ఏపీఎస్ అధికారి గీతా దేవి దగ్గర నుండి  సిఐ, యస్ఐ  స్థాయి అధికారుల వరకు  వేధింపులకు  గురిఅయ్యారు. చివరకు  కమ్మ కుల వ్యాపారస్తులకు  వేధింపులు తప్పలేదు.  ఇక్కడ మీకు  ఒక  ఆస్తక్తికరమైన  కొన్ని  సంఘటనలు  మీకు చెబుతాను.  చార్టెడ్ అకౌంటింగ్‌లో  దేశంలోనే  అగ్రస్థానం సాధించిన ఒక  సిఎ  ఒక శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీని  కలుసుకుని ప్రభుత్వ శాఖల  ఆడిట్ చేస్తాను  అవకాశం కల్పించండి అంటే,  ఆ అధికారి  ఆడిట్ చేయటానికి  మీకు అన్ని అర్హతలు వున్నాయి. కానీ  మీ ఇంటి పేరు  ముఖ్యమంత్రి జగన్ గారికి  ఇష్టం వుండదు అని బదులు ఇచ్చారంట!  గత టిడిపి ప్రభుత్వంలో  చెల్లించాల్సిన  బిల్లులు సైతం  కులం చూసి చెల్లించిన  ప్రభుత్వం  నాటి  జగన్  ప్రభుత్వం.  వికృత  కాలకూట  కుల  ద్వేషం, వ్యక్తిత్వ హననానికి అంతే లేకుండా పోయింది. దమన నీతి పాలన సాగింది.  నిలువెల్లా విషం నింపుకుని  రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.  నిజం కాదా?   వేల మందికి  ఉపాధి కల్పించే  అమర్ రాజా కంపెనీని మేమే పొమ్మని  పంపించేశాం అని  ముఖ్యమంత్రి  సలహాదారు సజ్జల  నిర్లజ్జగా  బరితెగించి  ప్రకటన  చేయటాన్ని  ఎలా  చూడాలి? దాన్ని ప్రజా పాలన  అందామా?    యాబై ఏళ్ళ పాటు   రాజకీయ  రెడ్ల చేతుల్లో  అధికారం  వుంది  రాయలసీమకు  వీళ్ళు  వరగబెట్టింది ఏంటి? కోస్తా  ఆంధ్ర  ఉత్తరాంద్ర  ప్రజలకు  తవ్వి తలకెత్తింది  ఏమైనా ఉందా? కులాన్ని  అడ్డం పెట్టుకుని  రెడ్డి  కులానికి  వీళ్ళు  చేసిన  మేలు ఏంటి!   జగన్  ఏలుబడిలో  జగన్  చుట్టూ  వున్న   ఆ వెయ్యి మంది  రెడ్లకు  తప్ప   రెడ్డి కులానికి  ఈయన గారు  చేసిన  మేలు  చెప్పగలరా?   రెడ్డి  కులానికి మేలు  చేయకపోగా  అంతులేని  కీడు  జగన్ ప్రభుత్వం చేసింది. కమ్మ కులాన్ని ద్వేషించటం వేధించడం రెడ్లను  సంతృప్తిపరచడం కోసమే  అనే  వికృత  మనస్థత్వంతో   పాలన  సాగింది.  ఈ మోడల్‌లో ఒక్క రెడ్డి కుటుంబం  బాగుపడిన  పరిస్థితి వుందా?  ఈయనగారి  ప్రభుత్వంలో   పనులు చేసిన  రెడ్లకు  బిల్లులు  చెల్లించకపోతే  ఆ  కుటుంబాలు  రోడ్డున పడ్డాయి. రెడ్లు  ఆస్తులు   అమ్ముకున్నారు.  మాచర్ల పిన్నెల్లి  రామకృష్ణా రెడ్డిని   ఉత్తముడు అని నిసిగ్గుగా, వెరపు లేకుండా అలవోకగా ఆశుద్దం మాట్లాడటం  జగన్  నైజం. మాచర్ల   ఒక చంబల్ లోయ. పిన్నెల్లి  అరాచకాలకు  భయపడి  ఊళ్ళకు ఊళ్ళు జనం ఇళ్ళకు  తాళాలు వేసుకుని   పరాయి పంచన  బిక్కుబిక్కుమంటూ  ప్రాణాలు  అరచేతిలో పెట్టుకుని  ఐదేళ్ళపాటు  భయం  నీడలో  గడిపారు. ఆఖరికి మొన్న  ఎన్నికల్లో  ఎన్నికల కమీషన్ బిందుమాధవ్ అనే   ఒక  నిప్పుకణికను  పల్నాడు యస్‌పిగా  నియమించింది.   ఎన్నికల్లో  పిన్నెల్లి హింస ఏస్థాయిలో  జరిగిందో  చూశాం. బిందుమాధవ్‌కు  క్రింది స్థాయి  సిబ్బంది  సహాయ నిరాకరణ చేశారు.  కారణం  వారంతా  పిన్నెల్లి నియమించుకున్న దళం. నాటి  డీజీపీ కసిరెడ్డి  రాజేంద్రనాథ్‌కి ఎస్పీ బిందుమాధవ్  ఎంత చెప్పినా  పట్టించుకోలేదు.  పైపెచ్చు  అల్లర్లు  జరిగే గ్రామాల్లో  మాధవ్ బైండోవర్  చేస్తుంటే వారిని  వదిలిపెట్టు అని  పోలీస్  సెట్లో చెప్పారంటే  ఎంత బరితెగింపు. బిందుమాధవ్  చురుకైన  అధికారి  అతని  ట్రాక్ రికార్డు  మచ్చలేనిది.  అనేక  రివార్డులు  ఆయన సొంతం. కానీ నాటి చీఫ్ సెక్రటరీ  జవహర్ రెడ్డి  మాధవ్‌ను  సస్పెండ్ చేయించారు.  జగన్  ఏలుబడిలో మాధవ్ కంటే  జూనియర్స్‌కు  లా అండ్  ఆర్డర్  పోస్టింగ్‌లు  ఇచ్చి  మాధవ్‌ని అప్రధాన్య పోస్టులకే పరిమితం చేసారు.  కారణం  ఏంటి అనుకుంటున్నారు?  మీరు  అనుకునేది  మాత్రం కాదు!  బిందు మాధవ్ కమ్మ కులం కాదు  బ్రాహ్మణ సామాజికవర్గం  మరి అయితే  వేధింపులకు  కారణం  ఏంటి? బిందు మాధవ్ ప్రేమ వివాహం  చేసుకున్నారు.  మాధవ్  శ్రీమతి  కమ్మ సామాజిక వర్గం.  ఆమె  ఒక ప్రముఖ  సైంటిస్ట్. మన రాష్ట్రంలో కూడా  వుండరు  కేంద్ర ప్రభుత్వ శాఖలో  పని చేస్తారు.  ఇప్పుడు చెప్పండి  ఈ వికృత  ఆటవిక పాలనకు  ఏ పేరు  పెడదాం?   పవన్ కళ్యాణ్‌ను ఆయన  సామాజిక వర్గం  వారితో  బండ బూతులు  తిట్టించడం, వ్యక్తిగత  దాడి చేయటం  మనం  చూశాం. మాజీ  మంత్రి పేర్ని  నాని  నాలుగు  అడుగులు  ముందుకేసి,  మా  కాపు నాకొడుకులు అనడం! అవును  నేను  జగన్  గారికి  పాలేరునే  అనడం మనం  చూశాం. మొత్తానికి ఐదేళ్ళ  జగన్ పాలనలో  వ్యవస్థల విధ్వంసం కళ్ళారా చూశాం!  ఆ పైన  ఘనమైన ప్రజా తీర్పు చూశాం. మళ్లీ  మళ్లీ  జగన్ రాకాసి మూక  వారి కరపత్రం  జగన్  శ్రీమతి  భారతి  నడిపే  పత్రికలో  అవే రోతరాతలు  అవే  కుల వైషమ్యాలు.  ఇటీవల మొత్తం  96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.  అందులో  54 మందికి  పోస్టింగ్ ఇవ్వలేదు.  ఎందుకు ఇవ్వలేదు  అంటే,  ఈ  ఐదేళ్ళ సీమ పాలెగాడి  వికృత పాలనలో  వీళ్ళు అనేక  అకృత్యాలకు  పాల్పడ్డారు.  54 మందిలో  15 మంది  రెడ్డి కులస్తులు వున్నారంట!  వారిని  చంద్రబాబు  పక్కన పెట్టారంట!  రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు వేధించడానికి  సిద్దమయ్యారంట... ఇది  సాక్షి కథనం.   దీంట్లో  మొదటి  విషయం...  అధికారుల్లో  కూలాలను  చూడటం ఏంటి?  54 మందికి  పోస్టింగ్ ఇవ్వకపోతే  ఆ 15 మంది  ప్రస్థావన ఎందుకు?  ఆ 54లో  15 మంది  కాకుండా  మిగతా 39 మంది ఎవరు?  ఆలస్యం ఎందుకు  మరి  వాళ్ళ కులపోళ్లను  కూడా రెచ్చగొట్టండి!  మీరు పాలించేటప్పుడు మీకు  పాలేర్లు కావాలి!  అధికారం పోగొట్టుకున్నా కూడా  ఆ పాలేర్లే  అధికారులుగా  కొనసాగాలని  జగన్ పత్రిక  కోరుకుంటుంది. నేటికి  అనేక మంది  నిజాయితీ పరులైన  రెడ్డి  సామాజిక వర్గం  అధికారులు అనేక మంది  కూటమి  ప్రభుత్వంలో  కీలక పదవులు నిర్వరిస్తున్నారు. గతంలో  కులాన్ని ‘చూషి’, ‘షేషిన’ పాలన చూశాం.  నేడు  అదే కులం  ముసుగులో  రెడ్లకు  న్యాయం చేయడానికి బయలుదేరారు. నమ్మండి ప్లీజ్  చివరగా  ఒక్క  విషయం గుర్తుంచుకోండి  రాజకీయ  రెడ్లు వేరు!  రెడ్డి కులం వేరు! రాజకీయ  కమ్మలు వేరు  కమ్మ కులం వేరు.  రాజకీయ నాయకులను మా కులం అని  చంకలు గుద్దుకోకండి.  వారందరిది  రాజకీయకులం.  యాబై ఏళ్ళ రెడ్ల  పాలనలో  రెడ్డి కులం  ఏం బాగు పడింది? టీడీపీ పాలనలో  నాశనమైన  కమ్మవాళ్ళతో  పోలిస్తే  బాగుపడిన వారు  అరడజను  మించి వుండక పోవచ్చు.  ప్రజలు  ఆలోచించాల్సింది  కులాలు కాదు  వారి  పిల్లల  బంగారు  భవిష్యత్తుకు  బాటలు  వేసే పాలకుల కోసం ఆలోచన చేయాలి.

జగన్.. పదవి పోయింది.. పార్టీ పొమ్మంటోంది!

కేవలం ముఖ్యమంత్రి కావాలన్న  లక్ష్యంతోనే జగన్ రాజకీయ ప్రవేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జగన్ ను ఆయన తండ్రి స్థానంలో సీఎం పదవిలో కూర్చోపెట్టేందుకు అంగీకరించని ఒకే ఒక కారణంతో ఆయన సొంత కుంపటి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన అనుక్షణం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో పని చేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా, మలి ప్రయత్నంలో అంటే 2019 ఎన్నికలలో ఆయన ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇక ఆ క్షణం నుంచి ఆ పదవిలో తాను శాశ్వతంగా ఉంటానన్న భ్రమలలోనే గడిపారు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి ఒక రాజు, ఏం అనుకుంటే అది చేసేయచ్చు. నచ్చిన వాళ్లు తప్ప మరెవరూ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. అంతే కాదు.. పార్టీలో కూడా తానే సర్వాధికారి అని భావించారు. ఎవరైనా తన అధికారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా పార్టీతో ఆమోదింపచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ ఆయన పంపిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లు బాటు కాదని విస్పష్టంగా తేల్చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత పదవులు అనేవి ఉండవని పేర్కొంది.  దీంతో  అప్పట్లో ప్లీనరీ వేదికగా వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించి మరీ  చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పార్టీ ఆరంభించిన క్షణం నుంచీ కూడా జగన్ కు తన అధ్యక్ష పదవిని ఎవరైనా తన్నుకుపోతారేమోనన్న భయమే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలన్న నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్ల కోసారి పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కేసి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నింబంధనను వైసీపీ ఎన్నడూ పాటించకపోయినా, పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ విస్పష్టంగా  తేల్చేసింది. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? తన పార్టీ చెప్పుచేతల్లో ఉంటుందో ఉండదో, సీఎం పదవి ఎల్లకాలమూ తానే పట్టుకు వేళాడగలుగుతానో లేదో అన్న భయం జగన్ కు తొలి నుంచీ ఉందని చెప్పడానికే..   పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తన ఎన్నిక అనే లాంఛనాన్ని పూర్తి చేసుకుని, ఆ తరువాత అధికార బలంతో తిమ్మిని బెమ్మిని చేసైనా ఎన్నికల గండాన్ని దాటేసి సీఎంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను 2024 ఎన్నికలలో జనం తిప్పి కొట్టారు. ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం విపక్ష నేతగా కూడా తగవు అంటూ వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. సరే సీఎం పదవి ఎలాగూ లేదు.. కనీసం వైసీపీ అధినేతగానైనా ఉంటారా అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ సీనియర్ నేతలంతా దాదాపుగా సైలెంట్ అయి పోయారు. చాలా మంది తన ఆనుపానులు కూడా అధినేతకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇక యువనేతలైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ తీరుపై, వ్యవహార శైలిపై, అహంకార పూరిత వైఖరిపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఓటమి తరువాత తొట్టతొలిగా జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై  విమర్శలు గుప్పించారు. ఆయన తీరు కారణంగా తాను నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తరువాత రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు మార్గాని భరత్ జగన్ వ్యవహారశైలిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. మద్యం విధానం లోపభూయిష్టంగా తయారవ్వడానికి, తప్పులు జరగడానికి జగన్ అజ్ణానమే కారణమన్న అర్ధం వచ్చేలా మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే కోవలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి,  ధర్మవరం   మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు జగన్ కారణంగా తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిందని బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పై పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తిరుగుబాటు రానున్న రోజులలో మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు జగన్ తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కే పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ నుంచి జగన్ ను బహిష్కరించి కొత్త నేతను ఎన్నుకుంటారా? లేక వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలలోకి చేరుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకూ వైసీపీ నేతలకు జగన్ తీరు, ఆ తీరును సమర్ధించిన కారణంగా ఇతర పార్టీలలోకి ఎంట్రీ లేకుండా పోవడంతో వైసీపీనే జగన్ కు దూరం చేయాలన్న దిశగా ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 కెటీఆర్ ఓ అపరిచితుడు 

పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు దుర్మార్గునికి అందరూ తనలాగే చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వంకుంట్ల తారకరామారావు వ్యవహారశైలి అదే అనిపిస్తోంది. గత అసెంబ్లీలో ఘోర పరాజయం తర్వాత ఈ బిఆర్ఎస్ నేత మాటలకు చేతలకు పొంతన లేకుండా మాట్లాడేస్తున్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకున్న బిఆర్ఎస్ స్వంత రాష్ట్రంలో జీరోకి పడిపోయింది. ఆతర్వాతే బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ ప్రయత్నాలను మమ్మురం చేశారు.  ఈ చర్చను కాసేపు పక్కన పెడితే తాజాగా కెటీఆర్ ఇచ్చే స్టేట్ మెంట్ చూస్తే ఆత్మాభిమానం అనుకోవాలో అహంకారం అనుకోవాలో చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపులపై తమ పార్టీ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైనట్లు తెలిపారు. త్వరలో సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ వేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో తన ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపిందన్నారు. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైందని వెల్లడించారు.ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం తమ పార్టీ బృందానికి తెలిపారని వెల్లడించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైనా స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు.గతంలో బిఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదన్న దుగ్దతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు.తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే ... అన్నట్టు తయారైంది తెలంగాణ రాజకీయాలు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఒకవైపు జాతీయస్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు పట్టించుకోని కెటీఆర్ ఇపుడు చట్టాలే పరిష్కారమంటున్నారు. రెండు నాల్కల ధోరణితో కెటీఆర్ మాట్లాడుతున్నారు

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిలు పిటిషన్ వై విచారణ వాయిదా పడింది. ఇప్పటికే  కవిత దాఖలు చేసుకున్న పలు బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో పిటిషన్ విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను బుధవారం (ఆగస్టు 7)కు వాయిదా వేసింది. ఇలా ఉండగా కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లారు. మరో రెండు రోజుల పాటు వారు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ములాఖత్ ద్వారా వారు కవితతో భేటీ అవుతారు.