నేను మోడీకి లెటర్ రాస్తే మధ్యలో ఈయన హడావిడి ఏంటంట.. ఏపీ డీజీపీ పై బాబు ఫైర్

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని అయన విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ను కూడా వైసీపీ ట్యాప్ చేసిందని అయన ఆరోపించారు.   అంతేకాకుండా ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే, దాని పై ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని బాబు అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కావాలంటూ డీజీపీ తనకు లేఖ రాయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో తాను రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. తాజాగా ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, రోగులతో ఫోన్ లో మాట్లాడాలన్నా డాక్టర్లు హడలిపోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు వివరించారు.

ఫేస్‌బుక్ చీఫ్‌ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ

భారత్ లో బీజేపీకి ఫేస్‌బుక్ మ‌ద్ద‌తుగా ప‌నిచేస్తోందంటూ అమెరికా వార్తా సంస్థ ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం నేపథ్యంలో ఫేస్‌బుక్ చీఫ్‌ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రాసిన క‌థ‌నంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది. త‌మ డిమాండ్‌కు ఇత‌ర రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని తెలిపింది.    ఈ మేర‌కు కాంగ్రెస్‌ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్ ఓన‌ర్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు లేఖ రాశారు. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను అనుమతించేందుకు ఫేస్‌బుక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి పావులా మారారని లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత్ లో 40 కోట్ల మంది ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగాదారులు ఉన్నార‌ని, వారంద‌ని న‌మ్మ‌కాన్ని తిరిగి పొందాంటే నిష్పాక్షిక విచార‌ణ జ‌ర‌పాల‌ని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.  కేసీ వేణుగోపాల్ రాసిన లేఖ‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమ‌తించ‌బోమ‌ని, దీనిపై భార‌తీయులంద‌రూ ప్రశ్నించాలని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల పై జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్

ఎపి సీఎం జగన్ ప్రభుత్వానికి కోర్టులలో ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. నిన్న రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంలో ఎపి హైకోర్టు జగన్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ పాఠశాల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు పై తదుపరి విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.   ఎపి ‌లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అమరావతి భూములతో సహా రాష్ట్రంలోని పలు వివాదాలలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు హైకోర్టుకు ఎక్కడంతో అక్కడ బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా సర్కారుకు చుక్కెదురైంది. ఇలా వరుస సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేసి ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ, కోర్టు కేసుల కారణంగా మళ్లీ వాయిదా పడి అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు 

ఏపీలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి  చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి.  

ఐపీఎల్ కొత్త స్పాన్సర్ ఖ‌రారు

ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ షిప్ హ‌క్కుల‌ను 'డ్రీమ్ 11' ద‌క్కించుకుంది. రూ.222 కోట్ల భారీ మొత్తం బిడ్ దాఖలు చేసి హ‌క్కుల‌ను పొందినట్లు ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ తెలిపారు. బిడ్ లో టాటా అన్ అకాడ‌మీ, ప‌తంజ‌లి, రిల‌య‌న్స్ , బైజూస్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఫైన‌ల్ గా డ్రీమ్ 11 స్పాన్స‌ర్ షిప్ ద‌క్కించుకుంది.   కాగా, ఇటీవల ఐపీఎల్ స్పాన్స‌ర్ షిప్ నుంచి చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, భారత్- చైనా మధ్య సరిహద్దు లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాము ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు వివో ప్రకటించింది.   దాంతో కొత్త స్పాన్సర్స్ వేటలో పడిన బీసీసీఐ ఈ నెల 10 న స్పాన్సర్‌షిప్ కోసం టెండర్స్ ను ఆహ్వానించింది. అప్పటినుండి ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు అవుతారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ ఆసక్తికి తెరపడింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను డ్రీమ్ 11 ద‌క్కించుకుంది.   కాగా, ఈ ఏడాది మార్చి లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నాలుగో బిగ్ బాస్ ఎవరు?.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనా?

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తుల ఫోన్‌లు ట్యాపింగ్‌ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పిన పాయింట్.. ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరుస్తోంది.   దాదాపు రెండు నెలల క్రితం హైద‌రాబాద్ పార్క్ హయత్‌ హోట‌ల్‌ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ సమయంలో పార్క్ హయత్‌ హోటల్లో ఏదో జరిగిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. "పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..." అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఫేస్ టైంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే ట్యాపింగ్ కు పాల్పడిన వ్యక్తులు ఎవరో తేల్చాలని కోరారు.  అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశాన్ని తాను కచ్చితంగా పార్లమెంట్‌లో లేవనెత్తుతాని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.   రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. పార్క్ హయత్‌ హోట‌ల్‌ లో ముగ్గురు భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ, నాలుగో వ్యక్తి ఫేస్ టైం లో మాట్లాడినట్టు విజయసాయికి ఎలా తెలుసు? అంటే, నిజంగానే ట్యాపింగ్‌ కి పాల్పడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేలా చేశాయి. మరి ఈ విషయంపై విజయసాయి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏడాది లోపే నిర్మాణం పూర్తిచేసేలా.. రిటైర్డ్ ఇంజనీర్ నియామకం

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని కట్టితీరాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చల్లో డిజైన్ ఖరారు చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అందుకు అనుగుణంగానే త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా రోడ్డు భవనాల శాఖలో కొత్త పోస్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీను సృష్టించారు. ఈ పోస్టులో రిటైర్డ్ ఇంజనీర్ ఎం. సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే వరకు లేదా ఏడాది వరకు ఈ పోస్టులో ఆయన కొనసాగుతారు.   కొత్త సచివాలయ భవనిర్మాణ డిజైన్ ను ఆగస్టు 5న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. గతంలో ఆరు అంతస్తుల్లో భవననిర్మాణం ఉండాలని అనుకున్నా స్పల్పమార్పులు చేస్తూ ఏడు అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించేలా డిజైన్లో మార్పులు చేశారు. ఈ మేరకు అధికారులతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చర్చలు నిర్వహిస్తున్నారు.   జూలై 7 కూల్చివేత పనులను ప్రారంభించింది. కూల్చివేత సమయంలోనూ హైకోర్టు పలుమార్లు స్టే విధించినా ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. భవనాల శిధిలాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణం ప్రారంభిస్తారు.   నిర్మాణ వ్యయం ఐదు వందల కోట్లు కొత్త సచివాలయ భవన నిర్మాణ అంచనా వ్యయం ఐదు వందల కోట్లు. అత్యంత ఆధునిక హంగులతో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండనున్నాయి. ఆయా శాఖల మంత్రుల కార్యాలయాలతో పాటు కార్యదర్శుల కార్యాలయాలు, సెక్షన్ ఆఫీస్ లు, మీటింగ్ హాల్స్, వెయిటింగ్ హాల్స్, డైనింగ్, పార్కింగ్ సదుపాయాలతో కొత్త సచివాలయం నిర్మించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్‌ పై ఎందుకు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌కూడ‌దు: ఏపీ హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.    అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది.    మ‌రోవైపు ఈ అంశంపై ఎందుకు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌కూడ‌దో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రెండు రోజుల గ‌డువు ఇస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కేసీఆర్ సర్కార్‌ పై గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కార్‌ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని, కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ పేర్కొన్నారు.   కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని అన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.   కేసీఆర్ సర్కార్ పై గవర్నర్‌ తమిళిసై తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. తెలంగాణలో బలపడటానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కేసీఆర్ ఆరేళ్ళ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బండి సంజయ్ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమిళిసై కూడా గవర్నర్ గా తన మార్క్ చూపిస్తూనే.. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా సాక్షిగా కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే బీజేపీ అన్ని వైపుల నుండి కేసీఆర్ సర్కార్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీజేపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. 

సెప్టెంబర్ 7 నుంచి వర్షాకాల సమావేశాలు

కోవిద్ నియమాలకు అనుగుణంగానే ఏర్పాట్లు   తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నాయి. ఈమేరకు  సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. 20రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, శాసన సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయనున్నారు.  అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తారు.   అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా ప్రభావం, వర్షాలు, పెరిగిన వ్యవసాయ సాగు, విద్యాసంవత్సరం ప్రారంభం తదితర ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. పలు బిల్లులు, తీర్మానాలతో పాటు రాష్ట్ర  ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తారు.   కరోనాను అరికట్టడంలో అధికార పార్టీ విఫలం అయ్యిందని, శాసనసభలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే ఆగమేఘాల మీద సచివాలయం కూల్చడాన్ని కూడా సభలో లేవనెత్తనున్నారు. కృష్ణాజలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండకట్టేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ భూములలో నాట్లు వేసిన రైతులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎపి రాజధాని అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడంతో విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వారు ఇచ్చిన భూముల్లో మళ్ళీ సాగు చేపట్టి సవాల్ విసిరారు. తాజాగా విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి రైతులు సిద్ధమయ్యారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. ఇప్పటికే విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఈ వ్యవహారం పై రైతులతో చర్చలు జరుపుతున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.   రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం లో రియల్‌ భూమ్‌ ఉండడంతో భూముల ధరలు భారీగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రం పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది. దీనికి అవసరమైన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించింది. అయితే అప్పట్లో రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు ఏటా ఇచ్చే కౌలుతో పాటు కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్ లు, యాన్యుటీ వంటి సౌకర్యాలు కల్పించడానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కూడా కేటాయించారు.   అయితే ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసింది. అప్పటికే ప్లాట్లు కేటాయించగా మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అటకెక్కింది. దీనికి సంబంధించి దాదాపు 108 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి కూడా విలువ లేకుండా పోతుందని.. తాము ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ఐతే ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   దీంతో రన్‌వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో తాజాగా రైతులు దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్‌వే వెంట ఉన్న నేవిగేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ దగ్గర ఉన్న భూముల్లో వారు సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ఒకవేళ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే అమరావతి రైతులు కోర్టు బాట పట్టగా, తాజాగా తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు కూడా న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తమ సమస్యల పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపికతో ఎదురు చూసామని, ఐతే తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు గురుగాం లోని వేదాంత హాస్పిటల్ లో రెండు వారాలుగా చికిత్స అందించిన తరువాత ఆయనకు టెస్ట్ చేయగా నెగెటివ్‌ రావడంతో డిస్చార్జు చేసారు. కరోనా నుండి కోలుకున్నందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.    అయితే తాజాగా ఆయన శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఇప్పటి నుండి ఎయిమ్స్‌లోనే ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

సీఎం కేసీఆర్ పై దుష్ప్రచారం.. సౌదీలో పని చేస్తున్న యువకుడి అరెస్ట్ 

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ యువకుడు అసత్య ప్రచారం చేశాడు. ఆయనకు ముక్కు ద్వారా కరోనా వైరస్ సోకి సీఎం కేసీఆర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. తాజాగా ఆ యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.   హైదరాబాద్ కు చెందిన పన్యాల రాజు అనే యువకుడు ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించారని, దానిని గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా ధ్రువీకరించారని ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్ చేశాడు. దీనికోసం మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్‌ను సోషల్ మీడియాలో రాజు షేర్ చేశాడు. జూన్ 8వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసారు.   జగిత్యాలకు చెందిన రాజు సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. అతడు ఈనెల 14వ తేదీన సౌదీ అరేబియా నుండి ఇండియాకు వచ్చాడు. అయితే ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాజును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఇచ్చిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వెళ్లి అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై పిల్.. హైకోర్టులో ఈ రోజు విచారణ

ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లపై నిఘాపెట్టారని అనుమానాలతో కూడిన వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్‌ సోమవారం ఈ పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా మొదలైన విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం తో దర్యాప్తు చేయించాలని, అంతేకాకుండా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిల్ లో అభ్యర్థించారు.   పిటిషనర్ నిమ్మీగ్రేస్‌ తరఫున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరై న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని, లేకపోతె ట్యాపింగ్‌కు పాల్పడినవారు సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశముందని శ్రవణ్‌కుమార్‌ న్యాయమూర్తులను కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారణ చేపడతామని పేర్కొంది.   ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్‌ చట్టం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని ప్రకటించాలని ఆ పిల్ లో కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్‌ నంబర్లను కూడా ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని లాయరు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తుల గోప్యతా హక్కును పరిరక్షించాల్సిన అధికారులే దురుద్దేశంతో న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం ద్వారా వారిని నిరుత్సాహపరుస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పులిచ్చారన్న తప్పుడు భావనలో కొంతమంది అధికారులున్నారని అయన అన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న కొంతమంది అధికారపార్టీ మద్దతుదారులు ఏకంగా న్యాయమూర్తులను దూషిస్తూ, అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న శాసనసభ స్పీకర్‌, ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రులు వంటి వారు కూడా న్యాయమూర్తుల పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అయన తెలిపారు.

ఎన్నారై హాస్పిటల్ కు అచ్చెన్నాయుడు తరలింపు..

ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం అయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఎన్నారై ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అచ్చెన్నాయుడికి ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స అందించాలని సూచించింది.   ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఎసిబీ అధికారులు జూన్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పైల్స్ కు సంబధించిన సమస్యకు చికిత్స అందించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనను రమేష్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గణపతి పూజలు గడపలోపలే..

ఆన్ లైన్ లో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం   బాలా పూర్ లడ్డు వేలం రద్దు   ప్రతి ఏడాది నగరమంతా మండపాలలో వెలిసి 11రోజులు పూజలు అందుకునే గణపయ్య ఈ ఏడాది ఇంటికే పరిమితం కానున్నారు.   దశాబ్దాలుగా ప్రతి ఏటా వేలాది మండపాలు దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో ముంబాయి, హైదరాబాద్ అత్యంత వైభవంగా గణనాధులు పూజలందుకుంటారు. నిమర్జనం కూడా కోలాహమే. అయతే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వినాయక మండపాలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలు కూడా విష్నేశ్వరుడి పూజలను ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. ముంబయి తర్వాత అత్యంత వైభవంగా జరిగే హైదరాబాద్ లోనూ  గణేష్ మండపాలను అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.   దశాబ్దాలుగా.. ప్రజలందరికీ ఒక తాటిపైకి తీసుకురావాలన్న ఆలోచనతో స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ఉత్సవాలు దేశంలోని వాడవాడలా నిర్వహిస్తున్నారు. చిన్నపెద్ద అన్న తారతమ్యం లేకుండా ప్రజలంతా రోజూ పూజలు, అన్నదానాలు,  ఊరేగింపులలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయడం, ప్రజలు గుంపులుగా రావడం వల్ల కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ముందస్తులుగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.    వేలాది విగ్రహాలు.. నెలరోజుల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలుపెట్టిన కార్మికులు ఇప్పటికే వేలాది భారీ విగ్రహాలను తయారుచేశారు. కొన్నివందల కుటుంబాలు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటాయి. జూలై, ఆగష్టు నాటికైనా కరోనా అదుపులోకి వస్తుందన్న ఆలోచనతో విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే నానాటికీ పెరుగుతున్న కేసుల కారణంగా పూర్తిగా వినాయక ఉత్సవాలను ఇంటికే పరిమితం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.            ఇదే తొలిసారి.. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మండపాలు ఏర్పాటుచేయని సందర్భం ఎప్పుడూ రాలేదు అంటున్నారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అంటున్నారు. 1980 నుంచి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలు నిర్వహించకపోవడం ఇదే తొలిసారి అన్నారు.   ధన్వంతరి నారాయణగా.. ఆన్ లైన్ లోనే హైదరాబాద్  గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ భారీ వినాయకుడి స్థానంలో ఈ సారి తొమ్మది అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పేరు పెట్టారు. ఆన్ లైన్ లోనే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. లడ్డు వేలంలో అత్యంత పేరున్న బాలాపూర్ గణేష్ ఎత్తు తగ్గించడమే కాకుండా లడ్డూ వేలం రద్దు చేశారు. అనుమతులు లేవు..   కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ సారి గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. ఇంటిలోనే పూజలు చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యం కోసమే.. దయచేసి గణపతి పూజ గడపలోపలే చేసుకోండి అంటున్నారు.   కరోనా మహమ్మారి కారణంగా  ప్రభుత్వాలు  ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  అయితే ఇప్పటికే వివిధ రంగుల్లో మండపాలకు తరలడానికి సిద్ధంగా ఉన్న వినాయకుల సంగతి.. విగ్రహాల అమ్మకాలపై ఆధారపడిన కార్మికుల సంగతేఎంటీ అన్నది ప్రశ్నార్ధకం.   మట్టి గణపతులు..విత్తన విగ్రహాలు.. భారీ విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడేలా మట్టి గణపతులను, విత్తన గణపతులను పూజించాలంటూ మరికొందరు సందేశాలు ఇస్తున్నారు. ఉగాదులు లేవు ఉషస్సులు లేవు..శ్రీరామ కళ్యాణ వేడుకలు లేవు, గ్రామదేవతలకు బోనాలు లేవు.. శ్రావణమాస పేరంటాలు లేవు, ఇప్పడు గణపతి ఉత్సవాలు కూడా లేవు.. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంటికే పరిమితాలు అంటూ ప్రజలు వాపోతున్నారు.  

బాబు, పవన్ ల పై సెటైర్లు వేసిన అంబటికి చుక్కలు చూపిన నెటిజన్స్

వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ అంటే వెటకారాలు.. పంచ్ లతో వైరి పక్షాలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. అటువంటిది తాజాగా అయన ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ తో ఒక్క సారిగా నెటిజన్స్ అంబటి పై విరుచుకు పడుతున్నారు. నిన్నటి రోజు మొత్తం సోషల్ మీడియాలో ఆయనకు చుక్కలు చూపించారు.   పూర్తి వివరాల్లోకి వెళితే మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాంబాబు ఒక ట్వీట్ చేస్తూ స్వరాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోలేని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లకి రాష్ట్ర రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు జన సైనికులు రంగంలోకి దిగి అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.   అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎక్కడి నుంచైనా జరుపుకోవచ్చని వారు అంబటికి హితబోధ చేస్తున్నారు. మన దేశంలోనే కాదు విదేశాలలో ఉండి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవచ్చని ఈ సందర్భంగా వారు చెపుతున్నారు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన వేడుకని ఆ విషయం కూడా తెలియని అంబటి రాంబాబు అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యారని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్ర్తున్నారు. అయ్యా అంబటి గారు "2015 ఆగస్టు 15 న జగన్ కూడా హైదరాబాద్ నుంచి జెండా ఎగురవేశారు, మరి మీ లాజిక్ ప్రకారం చూస్తే, జగన్ కి మన రాష్ట్రానికి సిఎం గా ఉండటానికి అర్హత ఉందంటారా ?" అంటూ సెటర్లు వేశారు. మరి కొందరు "ఇదేమీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదని కాబట్టి రాష్ట్రంలోనే ఉండి జరుపుకోవాల్సిన అవసరం కూడా లేదని" స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక మీ చిల్లర రాజకీయాలు ఆపమని కూడా వారు సలహా ఇచ్చారు. రాష్ట్రం మీద అంత ప్రేమున్న మీరు కరోనా సోకితే పక్క రాష్ట్రంలో ఎందుకు చికిత్స తీసుకున్నారు అదేదో ఇక్కడే చేయించుకోవచు కదా అని కూడా వారు అంబటిని నిలదీస్తున్నారు. ఎపుడూ ఇతర పార్టీల నేతలకు చుక్కలు చూపించే అంబటి చేసిన ఒకే ఒక్క ట్వీట్ బూమ్ రాంగ్ అయి మళ్ళీ వాయిస్ లేకుండా చేసింది.

నిత్యానంద లీలలు.. కైలాస దేశంలో రిజర్వుబ్యాంకు, కొత్త కరెన్సీ

ఇటీవల ‘కైలాస’ అని కొత్త దేశాన్ని ప్రకటించిన నిత్యానంద.. తాజాగా ఆ దేశానికి రిజర్వు బ్యాంకుని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 22 వినాయక చవితి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ కైలాస(ఆర్బీకే) ను ప్రారంభించబోతున్నట్లు  వెల్లడించారు. అదే రోజు నుంచి ఆర్బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని నిత్యానంద తెలిపారు. అయితే, ఈ కథనాలన్నీ నిత్యానంద సొంత వెబ్‌సైట్‌ 'కైలాస.ఆర్గ్‌' వండివార్చిన సమాచారమేనంటూ ఈక్వెడార్‌ కొట్టిపారేసింది. కర్ణాటకలోని బిడిదిలో ఆశ్రమాన్ని స్ధాపించి పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, యువతులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ క్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, కొత్త దేశంగా ప్రకటించి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి పాస్‌పోర్ట్‌, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు​ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ ఆయన ఎక్కడున్నారో మాత్రం తెలియడం లేదు. నిత్యానంద పేరుతో వస్తున్న ప్రకటనలు మినహా ఆయన గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.   మరోవైపు ఈక్వెడార్‌  ఆర్బీకే, కరెన్సీ వార్తలను కొట్టిపారేసింది. అసలు నిత్యానంద తమ దేశంలో కానీ, చుట్టు పక్కల కానీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని ఈక్వెడార్‌ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇవన్నీ జనాన్ని బురిడీ కొట్టించేందుకు నిత్యానంద చేస్తోన్న ప్రకటనలని అర్ధమవుతోంది.

చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్‌

పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో   బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి సేకరించిన లంగ్స్ ను హైదరాబాద్‌ కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇనిస్టిట్యూట్‌ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్‌  తరలించారు. పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో చేరుకునేలా ఎయిర్ ఫోర్స్  అధికారులు, పోలీసులు సహకరించారు.    పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. ఆ వ్యక్తి  కుటుంబసభ్యులు మానవత్వంతో అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవన్‌దాన్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. దాంతో పూనేలో మరణించిన వ్యక్తి లంగ్స్ హైదరాబాద్ లోని వ్యక్తికి అమర్చడానికి జీవన్‌ధాన్‌ డాక్టర్‌ స్వర్ణలత, పుణేలో జడ్‌టీసీసీ సెంట్రల్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్తిగోఖలే సమాయత్తం అయ్యారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సర్జరీ ద్వారా లంగ్స్ సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు  గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు.   అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్ తో  బయలుదేరిన వైద్యసిబ్బంది  బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. అప్పటికే  సమాచారం అందడంతో  కిమ్స్‌ వైద్యుల బృందం లంగ్స్  అవసరమైన వ్యక్తిని సర్జరీకి సిద్దం చేశారు. దాదాపు ఎనిమిది గంటల సర్జరీ తో ఆ వ్యక్తికి ఊపరితిత్తులను అమర్చుతారు.   నిర్ణీత సమయంలో అవయవాలు అమర్చడానికి సహకరించిన విమాన ఆధికారులకు, పోలీస్ అధికారులకు ఆపరేషన్ అవసరం అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.