ఐతే చర్చలు.. లేదంటే మిలట్రీ యాక్షన్.. చైనాకు బిపిన్ రావత్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ చైనా ల మధ్య సరిహద్దు వివాదం చైనా మొండి వైఖరి తో ఇంకా జఠిలమవుతున్నట్లుగా తెలుస్తోంది. సరిహద్దు వివాదం పరిష్కారం కోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలలో చిక్కుముడి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో ముఖ్యంగా ప్యాంగ్యాంగ్ సరసు వద్ద ఉన్న ఫింగర్స్ ప్రాంతంలో సైనిక బలగాల ఉపసంహరణ పై ప్రతిష్టంభన ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో చైనా సైన్యం అతిక్రమణలను ఎదుర్కోడానికి చర్చల ద్వారా తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఒకవేళ అవి సఫలం కాకపోతే మాత్రం మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగానే ఉందని భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం దీనికి శాంతియుతంగానే పరిష్కారం కోరుతోందని, అయితే చర్చలు ఫలించకపోతే మాత్రం ఆర్మీని రంగంలోకి దింపడానికి, యుద్ధానికి కూడా సిద్ధమని అయన చెప్పారు. అయితే ఈ విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు భారత్ చైనా కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఏప్రిల్‌కి ముందు ఉన్న యథాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతుండగా చైనా సైన్యం మాత్రం ససేమిరా అంటుండడంతో భారత్‌ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

ఎమ్మెల్యే వంశీ ఆ ఒక్క స్టేట్ మెంట్ తో గన్నవరం వైసీపీలో మంటలు

కృష్ణ జిల్లా గన్నవరం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంఛార్జి రెండూ నేనే. దుట్టా రామచంద్రావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పనిచేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, గొడవలు ఏం లేవు.’ అంటూ వంశీ వ్యాఖ్యానించారు.   ఈ వ్యాఖ్యల ద్వారా ఒకవేళ తాను రాజీనామా చేసి, గన్నవరంకి ఉప ఎన్నిక జరిగినా వైసీపీ నుంచి తానే అభ్యర్థిగా పోటీ చేస్తాననే సంకేతాలు పంపడం వంశీ ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే, వంశీ చేతిలో ఓడిపోయిన అప్పటి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆయనకి ఎంతవరకూ సహకరిస్తారో సందేహమే. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. గత ఎన్నికలకు ముందు తమని ఇబ్బంది పెట్టిన వంశీ.. ఇప్పుడొచ్చి గన్నవరం ఇంఛార్జ్‌గా తనను తాను ప్రకటించుకోవడం పట్ల కూడా యార్లగడ్డ వర్గం గుర్రుగా ఉందని తెలుస్తోంది.    ఇక మొదటి నుంచి వైఎస్ జగన్‌ వెంట నడిచిన నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు రూపంలో వంశీకి మరో గండం కూడా ఉంది. తాజాగా దుట్టా చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే ఆ విషయం స్పష్టమవుతోంది.    తాజాగా గన్నవరం రాజకీయాలపై స్పందించిన దుట్టా.. "నాకు 40సం.లనుండి రాజశేఖర్ రెడ్డి తో పరిచయం ఉంది, ఆరోజు నుండి ఈరోజు వరకు ఆయన కుటుంబం తో నడిచాను. జగన్ పార్టీ పెట్టిన తరువాత ఆయనతో నడిచాను. నియోజకవర్గంలో ఏపని చేసిన నాతో సంప్రదించి చేశారు. జగన్ ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించాను" అన్నారు.   "నియోజకవర్గంలో టీడీపీలో ఉండి పది సంవత్సరాల పాటు వైసీపీ కార్యకర్తలు పై కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టిన వారు ఈరోజు వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీలో చేరి.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డాక్టర్ గారి వెంట ఉంటే ఏమి వస్తుంది అంటూ ఎమ్మెల్యే పక్కన ఉంటే పదవులు కాంట్రాక్టు లు ఇస్తాం.. రాకపోతే ఇబ్బందులు పడతారని నా దగ్గర ఉన్నవారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ నియోజకవర్గంకు అన్నీ నేనే అని ఎమ్మెల్యే వంశీ అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వైసీపీ వెంట ఉన్నది ఇందుకేనా అని వైఎస్సార్ కార్యకర్తలు నా దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు." అని దుట్టా చెప్పారు.   "నాకూ యార్లగడ్డ వెంకట్రావు కి విభేదాలు లేవు చిన్న మనస్పర్థలు తప్ప. నా అల్లుడు శివభరత్ రెడ్డి వంశీ చేసే అక్రమాలు ను ఆపుతున్నాడని ,శివ భరత్ రెడ్డి పక్కన ఉన్న నాయకులు ను బెదిరిస్తున్నారు. శివ భరత్ రెడ్డి కి పదవులు అవసరం లేదు, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తా. వైసీపీ కార్యకర్తలు మీద చెయ్యి వేయాలంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు నన్నేమి చేయలేరు. వైసీపీ జెండా కప్పుకొనే చస్తా." అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు కు రానున్న 15రోజుల్లో ఒక చల్లని కబురు చెబుతా అని పేర్కొన్నారు.   దుట్టా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఒకవేళ గన్నవరం ఉప ఎన్నిక జరిగినా వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఎంతవరకూ దక్కుతుందో నమ్మకం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యార్లగడ్డతో విభేదాలు లేవని చెప్పడం, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తానని దుట్టా చెప్పడం చూస్తుంటే.. వంశీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. రాజీనామా చేసినా ఉపఎన్నికల్లో టికెట్ కష్టమే, ఒకవేళ టికెట్ వచ్చినా దుట్టా, యార్లగడ్డ వర్గాలు కలిసి ఓడించే అవకాశాలున్నాయి. మొత్తానికి వంశీ పరిస్థితి అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కాకుండా అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ వివరాల కోసం పోర్టల్

కోవిద్ 19 వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి...   కొవాగ్జిన్‌ ట్రయల్స్ లో మార్పులు   చర్మపొరలకు వ్యాక్సిన్..   జీవితాన్ని నాలుగుగోడల మధ్య బందీ చేసిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు ఏఏ దశల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు, ఫలితాలు, మార్కెట్ ధరలు అన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ వ్యాక్సిన్‌ పోర్టల్‌ను ఐసీఎంఆర్‌ హెడ్‌ (అంటువ్యాధుల విభాగం) అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు అనేక స్థానిక భాషల్లో కూడా సమాచారం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.   భారతదేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయోగాలు అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌తోపాటు జైకోవ్-డి వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించాయి. ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది. ఆరోగ్యవంతులైన వారికి రెండు వారాల వ్యవధిలో వారికి రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. డోసేజ్ ఇచ్చిన 58 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్ సురక్షితమేనా, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందా లేదా అని పరీక్షిస్తారు. అయితే  భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్  ట్రయల్స్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించారు.   చర్మం పొరల్లో.. వ్యాక్సిన్ ను వివిధ రకాలుగా శరీరంలోకి పంపిస్తారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాలకు వేసే వ్యాక్సిన్ ఇస్తారు. దీన్ని ఇంట్రామస్కులర్ పద్దతిగా పిలుస్తారు. ప్రస్తుతం హైపటైటిస్, క్షయ, ధనుర్వాతం మొదలైన వ్యాక్సిన్లు ఇంట్రామస్కులర్ లో అందుబాటులో ఉన్నాయి. పోలియా వ్యాక్సిన్ నోటి చుక్కల ద్వారా ఇస్తారు. అయితే ఇప్పుడు కోవిద్ 19 వైరస్ అరికట్టే వ్యాక్సిన్ ను చర్మం కింది పొర ద్వారా శరీరంలోకి పంపించాలన్న శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీని వల్ల తక్కువ మోతాదులో వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది.   కోవిద్ 19 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున, ఎక్కవ డోసులు తయారు చేయాల్సి వస్తుంది. చర్మం ద్వారా ఇస్తే తక్కువ మోతాదులో ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కండరాలకు ఇచ్చే ఒక వ్యాక్సిన్ డోస్ తో  నలుగురికి చర్మం ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. దీనితో వ్యాక్సిన్ తక్కువ తయారు చేసినా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ధర కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.

చైనాలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం వారికి మాత్రమే.. 

కరోనా పుట్టిన చైనాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే దీని వినియోగంపై అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది. దీనిని కేవలం అత్యవసరంగా అవసమైన వారికి మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.   ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని జులై 22 నుండి ప్రారంభించినట్టు టీకా అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జెంగ్ జోంగ్‌వీ తెలిపారు. నిజానికి ఈ టీకాలు ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. ఆహార మార్కెట్లు, ట్రాఫిక్ వ్యవస్థ, సేవారంగాల్లో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యంగా వీటిని ఇస్తున్నట్టు జోంగ్‌వీ పేర్కొన్నారు. క్లినిక్ల ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ ను అత్యవసర సర్వీసులలో ఉన్నవారికి ఉపయోగించేందుకు చైనాలోని చట్టాలు అనుమతిస్తాయి. ఇది ఇలా ఉండగా సినోఫార్మ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా యుఎఇ లోని 20 వేల మందికి ఇచ్చినట్లుగా ఆ సంస్థ చైర్మన్ తెలిపారు.

దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీకి సారధి కరువయ్యాడు!!

సారధి లేని రథమైనా, సైన్యమైనా, పార్టీ అయినా సరైన దారిలో నడవలేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీది కూడా అదే పరిస్థితి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీని నడిపించే సారధి ఎవరా అని సతమతమవుతోంది.   2019 ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకులు ఎంతమంది చెప్పినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోనియాగాంధీ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. అయితే వయస్సు, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేక పోతున్నారు. దీంతో అసలే వరుస ఓటములతో జోష్ తగ్గిన కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయింది. దీంతో కాంగ్రెస్ లో జోష్ రావాలంటే కొత్త అధ్యక్షుడు రావాలని, అది కూడా రాహుల్ అయితేనే బాగుంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.   కరోనా విషయంలో ముందే హెచ్చరించడం, వివిధ అంశాలపై మోడీ సర్కార్ ని ప్రశ్నిస్తుండటం వంటివి పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచాయి. అదీగాక రాహుల్ అయితేనే అందరూ ఆమోదిస్తారని పార్టీ సీనియర్ నేతలతో పాటు మిత్రపక్ష నేతలు కూడా చెప్తున్నారు. కానీ రాహుల్ మాత్రం పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పటికీ ఆసక్తి చూపడంలేదు. అంతేకాదు అధ్యక్ష పదవి కోసం రాహుల్ కొత్తగా రెండు పేర్లు సూచించినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్లను రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు, సోనియాకు అత్యంత సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి గాంధీ కుటుంబేతర వ్యక్తులే ప్రస్తుతానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.   అయితే మన్మోహన్, ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్ లలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలే అప్పజెప్పనున్నారని సమాచారం. ప్రస్తుత కరోనా సంక్షోభం తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహిస్తారని, అందులోనే రాహుల్ పూర్తిస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్ కోవిడ్ సమస్య సమసిపోయిన తర్వాత.. దేశవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ తర్వాతే అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీని కిందిస్థాయి నుంచి బలపడేలా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి రాహుల్ కరోనా సంక్షోభం తర్వాత అయినా పార్టీ బాధ్యతలు చేపడతారో లేక అప్పుడు కూడా చేతులు ఎత్తేస్తారో చూడాలి. విచిత్రం అంటే ఇదేనేమో.. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ఇప్పుడు సారధి కోసం సతమతమవుతోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కోమాలోకి... బాధ్యతలు చేపట్టిన కిమ్ సోదరి

ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లిపోయారని దక్షిణ కొరియా మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కిమ్ కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని ఆ అధికారి తెలిపారు. గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు రాజకీయ సలహాదారుగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ దేశ గూఢచార వర్గాలు తెలిపాయని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం చైనా లోని ఒక ముఖ్య వ్యక్తి నుండి అందినట్లుగా అయన తెలిపారు   ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నట్టుగా తెలుస్తోందని అయితే ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో కిమ్ చాలా తక్కువసార్లు బయట కనిపించారని, అపుడే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. దీంతో దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ పేర్కొన్నారు. అయితే కిమ్‌ బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలో కూడా వార్తలు వచ్చాయి కానీ.. ఆ తర్వాత కిమ్ ఒక ఫెర్టిలాజర్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు తెర పడింది. అయితే ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి వార్తలే వస్తున్నాయి.

ఏపీలో విచిత్ర పరిస్థితి.. ఆ జిల్లాలలో లక్షణాల్లేకుండానే పాజిటివ్ 

కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి లక్షణాలు కచ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేకపోవడంతో పాటు కొంత మందికి అసలు ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న సంగతి తెలిసిందే. వారినే వైద్యపరిభాషలో ఎసింప్టమెటిక్ అంటారు. మన దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి పై పలు సంస్థలు సర్వే చేసి సెన్షేనల్ విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం సీరో సర్వైలెన్స్‌ సంస్థతో నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ‌లోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాలలో అత్యధిక శాతం మందికి లక్షణాలు లేనప్పటికీ పరీక్షల్లో మాత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సర్వేలో తేలింది.   ఈ సర్వే ప్రకారం అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలోని జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కనీసం తెలియకుండానే వైరస్ వచ్చి దానంతట అదే తగ్గిపోయింది.   అయితే లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో కానీ, ఐసోలేషన్ కేంద్రాల్లో కానీ ఉంచుతున్నట్టు వైద్యులు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్నపుడు ఏవైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం మందులు ఇస్తామని, లేదంటే బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని వారో చెపుతున్నారు. వీరికి మళ్లీ కొవిడ్ టెస్టు కూడా అవసరం లేదని, అంతేకాకుండా 11వ రోజు నుంచి వీరు బయటకు కూడా వెళ్లొచ్చని... వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదని స్పష్టం చేస్తున్నారు.

నీ సినిమాలు మీ వాళ్ళు మాత్రమే చూస్తారా.. హీరో రామ్ కు ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన వ్యాఖ్యల పై తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారంలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని అయన విమర్శించారు. అయితే రామ్ సినిమాలు కేవలం అతని సామాజిక వర్గం వాళ్లే చూస్తారా? వేరే సామాజిక వర్గం వాళ్లు చూడరా? అని ప్రశ్నించారు. వేరే సామాజిక వర్గం వాళ్లను తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పగలడా? అంటూ వంశీ నిలదీశారు.    కొద్ది రోజుల క్రితం రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కులం అనే జబ్బు కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, ఇది కరోనా కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. నిశ్శబ్దంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరైనా సంగతి తెలిసందే.   ఇదే సందర్భంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదని, గతంలో చాలామంది నాయకులు తమ వర్గం కోసం పనిచేశారని తెలిపారు. అసలు తమ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే పెద్ద ప్రమాదం ఉందని, చంద్రబాబు తనకున్న సమస్యలన్నింటినీ తన కులంపై రుద్దుతాడని విమర్శించారు.

కొన్ని క్షణాలలో నేను చనిపోతున్నా.. ఎవరు రావద్దు: శ్రీశైలం ప్రమాదంలో ఏఈ మోహన్ ఆఖరిమాటలు 

శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారు చనిపోయే ముందు తమ సహచరులను కాపాడే ప్రయత్నం చేస్తినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో తాము చనిపోతున్నామని తెలుసుకొని పవర్ ప్లాంట్ ను కూడ ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో ప్రమాదం జరిగిన సమయంలో మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏఈ మోహన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇదే సందర్భంలో తన వద్దకు ఎవరూ రావొద్దని ఆయన కోరారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సమాచారాన్ని మరో ఏఈ అనిల్ కు ఇస్తూ.. మంటలు తీవ్రంగా ఉన్నాయని మిగిలినవారంతా అప్రమత్తంగా ఉండి ప్లాంట్ నుండి బయటపడాలని అయన సూచించారు. మరో కొద్ది నిమిషాల్లో తాను చనిపోతున్నానని అనిల్ కు ఏఈ మోహన్ ఫోన్ లో చెప్పారు. అయితే దురదృష్టవశాతూ మంటలను తగ్గించే క్రమంలో మోహన్ మంటల్లోనే కాలిపోయారు.   ఇక మరో ఉద్యోగి ఉజ్మ ఫాతిమా పవర్ ప్లాంట్ ద్వారం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే అమరాన్ కంపెనీ నుండి ఇద్దరు ఉద్యోగులు కొత్తగా బ్యాటరీలు బిగించేందుకు పవర్ ప్లాంట్ కు వచ్చారు. అయితే అమరాన్ ఉద్యోగులు ప్లాంట్ కు కొత్తవారు కావడంతో మళ్లీ వెనక్కు వెళ్లి వారిద్దరిని బయటకు పంపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఉజ్మా ఫాతిమా కూడ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ప్లాంట్ లోని మరికొందరు అధికారులు కూడా ల్యాండ్ లైన్ ద్వారా చివరి నిమిషంలో తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 15 నిమిషాల్లో కనుక తాము బయటకు రాకపోతే చనిపోతామని అయితే పిల్లలను మాత్రం బాగా చదివించి ప్రయోజకులను చేయాలనీ వారు కుటుంబసభ్యులకు తెలిపారు.

రోహిత్ శర్మకు ఖేల్ రత్న.. తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున

క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు అర్హత సాధించిన అభ్యర్థులకు అవార్డులను రాష్ట్రపతి అందజేయనున్నారు.    కాగా, క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు.   అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ యువ కెరటం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం. 

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 9 మంది మృతి

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌ కో అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతుల వివరాలు: డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్) ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ)  ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ) ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్) ఏఈ సుందర్ (సూర్యాపేట)  ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా)  జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ)  హైదరాబాద్‌కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ 

ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!!

ఏపీ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో సీబీఐతో పాటు సర్వీస్ ప్రోవైడర్లు ఉన్నారు. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో సమాధానాలు చెప్పాలని.. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని వారికి ఆదేశాలిచ్చింది.    కాగా, జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా హైకోర్టు ఆదేశించింది.   హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో తాజాగా న్యాయవాది శ్రవణ్ కుమార్ అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అనుబంధ అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్యాపింగ్ కోసం నియమించిన అధికారి పేరును, అలాగే కొంత మంది సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నుంచి కాల్ డేటాను ఎలా సేకరించారో వివరించే ఆధారాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. 16 మందికి నోటీసులు జారీ చేసింది.   న్యాయవాది శ్రవణ్ కుమార్ అఫిడవిట్‌ లో ఏం చెప్పారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. ఆయన సమర్పించిన వివరాలతో.. హైకోర్టు 16 మందికి నోటీసులు ఇవ్వడంతో ఆధారాలు బలంగానే ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నాలుగు వారాల తర్వాత కేసు విచారణకు రానుంది. అప్పుడు విచారణ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదు

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం అని పేర్కొన్నారు.    స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఉన్న వైఎస్ జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదని అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, గత కొంతకాలంగా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న, తొలగిస్తున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర దుమారం రేగింది. అధికార పార్టీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా ఇతర  టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే.. బాలకృష్ణకు ఫోన్ చేసి, తానూ ఎన్టీఆర్ అభిమానినేనని, విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.   నిజానికి కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహాం తొలగింపుపై పలువురు వైసీపీ నేతలు సైతం ఆవేదనకు గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మనస్తాపానికి గురై వైసీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి మాజీ కౌన్సిలర్ గంగినేని పద్మావతి వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.   కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు. ఆ విషయాన్ని మరిచి కొందరు ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, తొలిగించడం వంటివి చేసి విమర్శలు పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ ‌ను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.   శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని ర‌క్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.   కాగా, ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఏఈ సుందర్‌ నాయక్‌ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.

స్వీడన్ లో ఎంపీల జీతమెంతో తెలుసా..!

ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువే..   కాఫీకి కూడా బిల్లు చెల్లించాల్సిందే ..!   అధికారం ఉన్నవారు జవాబుదారీగా ఉండాలి. ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాలి అన్నది స్వీడన్ లో మనం చూస్తాం. ఇక్కడి ప్రజాప్రతినిధుల జీతభత్యాలను, వారి జీవనవిధానాన్ని పరిశీలిస్తే షాక్ కావల్సిందే..   స్వీడిష్ ఎంపీలకు కార్యదర్శులు ఉండరు. వారి వేతనాలు కూడా చాలా తక్కువ. అంతేకాదు.. పార్లమెంటరీ క్యాంటిన్ లో వారు తాగే కాఫీకి కూడా బిల్లు వారి జేబు నుంచి చెల్లించాల్సిందే..   స్వీడిష్ పార్లమెంటు లో కేవలం మూడు కార్లు మాత్రమే ఉంటాయి. అవి కేవలం అధికారిక పర్యటనల కోసం మాత్రమే ఉపయోగించాలి. స్వీడిష్ ఎంపీలు ప్రజా రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిందే. వారికి ఇయర్లీ టికెట్ జారీ చేస్తారు. 1957 వరకు ప్రజాప్రతినిధులకు వేతనాలు కూడా లేవు. ఆ తర్వాతే వారికి వేతనం ఇస్తున్నారు. ఇది అక్కడి కరెన్సీలో నెలకు 40వేల స్వీడిష్ క్రోనాలు(3,22,000 రూపాయలు) ఇది అక్కడ పనిచేసే ఒక ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువ. అంతకు మించి వారికి ఓవేతనం వచ్చే అవకాశం లేదు.   ఎంపీల నివాసం కోసం అపార్ట్ మెంటు సదుపాయాలు కల్పిస్తారు. అవి కూడా దేశ రాజధాని స్టాక్ హోమ్ వెలుపలే ఉంటాయి. ఇవి 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక రూం ప్లాట్స్ మాత్రమే. విడిగా బెడ్ రూం అంటూ ఉండదు. వాషింగ్ మిషిన్, డిష్ వాషర్ గాని ఉండవు. ఎంపీలు వారి స్నేహితులను ఇక్కడికి అనుమతించకూడదు. వారి కుటుంబ సభ్యులైనా వచ్చి వుండేందుకు వీలు లేదు. ఎవరైనా వచ్చి ఒక రోజు ఉన్నా అందుకు అయ్యే ఖర్చు ఎంపీనే భరించాలి.   పార్లమెంటు కేఫటేరియాలో వెయిటర్స్ ఉండరు. ఎంపీలు వారికి కావల్సిన ఆహారాన్ని వారే డబ్బు చెల్లించి తీసుకోవాలి. తిన్న తర్వాత వారి ప్లేట్స్ వారు శుభ్రం చేయాలి.   ఎంపీలకు కార్యదర్శులు, వ్యక్తిగత సిబ్బంది ఉండరు. పార్టీ పరంగా మాత్రమే నియమించే కార్యదర్శులకు నిర్ధిష్ట మొత్తం వేతనంగా ఉంటుంది. ఎవరికీ వారు వ్యక్తిగతంగా నియామకాలు చేసుకోవడానికి వీలులేదు. తమ కార్యక్రమాల షెడ్యూల్ ను స్వయంగా వారే తయారుచేసుకోవాలి. అంతేకాదు వారికి వచ్చే ఫోన్ కాల్స్ కూడా వారే మాట్లాడాలి.   పార్లమెంటు భవనం ఆవరణలో వార్తపత్రికలు, మ్యాగజైన్స్ మాత్రం ఉచితంగా అందుబాటులో ఉంటాయి. మిగతా ఎంపీలతో కలిసి వాటికి షేర్ చేసుకోవాలి. అన్ని ప్రముఖ మీడియాల వార్తప్రతికలకు పార్లమెంటే చందా చెల్లిస్తుంది. ఎంపీలు ఎటైనా అధికారిక పర్యటనకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు అతి తక్కువ ఖర్చు అయ్యే రవాణా వ్యవస్థను ఎంచుకోవాలి. ప్రైవేటు కారు అద్దెకు తీసుకున్నప్పుడు తక్కువ దూరం చూపించే మార్గంలోనే వెళ్లాలి. ఒకవేళ విదేశాలకు వెళ్లాల్సి వస్తే వారి మొత్తం పర్యటన ఖర్చు 50వేల స్వీడిష్ క్రోనాలు(4,30,000 రూపాయలు)లోపే ఉండాలి. మాజీ ఎంపీలకు జీవితాంతం ఫించన్ ఉండదు. పదవీ విరమణ తర్వాత రెండు సంవత్సరాలు వారి వేతనంలో 85శాతం ఇస్తారు. ఆ లోగా వారు కొత్త ఉద్యోగంలో చేరాలి.   ప్రాంతీయ రాజకీయ నాయకులకు ఈ మాత్రం జీతాలు కూడా ఉండవు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవ్వడం ప్రజలకు మంచి చేయడానికి అని భావిస్తారు. ఇందుకోసం ప్రతిఫలం ఆశించరు. ప్రజలకు సేవ చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా భావించరు. దీనిని లాభదాయకంగా కూడా చూడరు.   ఇలాంటి నియమాలు పాటిస్తున్నారు కాబట్టే అక్కడ అవినీతికి ఆస్కారం లేదు. నాణ్యమైన జీవనశైలి, ఆరోగ్యం, విద్య, పౌర హక్కుల రక్షణ, సమానత్వం,  మానవ అభివృద్ధి వంటి అనేక అంశాల్లో స్వీడన్ ముందుంది.

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. జరిగింది ప్రమాదమా? కుట్రా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు అయింది. తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్‌ లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు.   శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్న సందర్భంగా.. రాయలసీమతో పాటు పలు ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు అంశంతో పాటు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ పరిధిలో ఉన్న లెఫ్ట్ పవర్ హౌస్‌ లో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని సీఎం భావించినట్టు తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి.. తెలంగాణ అధికారులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.   కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని  శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో షాట్ సర్క్యూట్ కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. ఏడు ఫైరింజన్‌ల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.   ఇదిలా ఉంటే, ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జరిగింది ప్రమాదమా? కుట్రా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ జల దోపిడికి కేసీఆర్ సహకరించేలా.. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని రేవంత్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని, ప్రమాదం పేరుతో కుట్రను కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమో అనిపిస్తోందని అన్నారు. నిజానిజాలు తేలాలంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్ వరకు

ప్రమదావనంతో పాఠకులకు చేరువై   మరణించిన తర్వాత శరీరదానంతో స్పూర్తి నింపిన రచయిత   మాలతీ చందూర్ (1930 - ఆగష్టు 21, 2013)   మహిళల జీవితంలో వంటింటి నుంచి ఉద్యోగనిర్వాహణ వరకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సూచనలు ఆమె శీర్షిక ద్వారా లభించేవి. అందుకే ఆమె శీర్షికలు రెండు దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించాయి. ఆమె రాసే "జవాబులు" శీర్షిక పేజీలను పుస్తకాలుగా బైండింగ్ చేసి చాలామంది దాచుకునేవారు. ఆమే ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీచందూర్.   మూడు దశబ్దాలకు పైగా సాహిత్యరంగంలో రాణించిన ఆమె ప్రముఖ రచయిత జేన్ ఆస్టిన్ నుంచి అరుంధతీరాయ్ వరకు ఎందరో రచయితలు రాసిన  రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. వాటిలో చాలా రచనలు స్వాతి మాసపత్రికలో  'పాత కెరటాలు'గా ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా ఇతివృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసే సమయంలో తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు.   మాలతీ చందూర్  1930లో కృష్ణా జిల్లా లోని నూజివీడులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ఆమెకు ఆరుగురు అన్నలు. నూజివీడులోనే ఎనిమిదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏలూరులో వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అక్కడే చందూర్,  డి.కామేశ్వరి, సి. ఆనందారామం తదితరులతో పరిచయం ఏర్పడింది. ఏలూరులో ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దేవుల పల్లి కృష్టశాస్త్రీ, నండూరి సుబ్బారావు, వెంకటచలం తదితరులు వచ్చేవారట. వారందిరినీ చూడటం, వారి మాటలు వినడంతో ఆమెకు సాహిత్యరంగంపై ఆసక్తి పెరిగింది. 1947లో ఆమె, చందూర్‌ కలిసి చెన్నై వెళ్ళి పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. 1949లో రచనలు చేయడం ప్రారంభించారు. రేడియో లో  తన  రచనలను చదివి వినిపించేవారు. ఆ తర్వాత 1950 నుంచి సాహిత్యంలో రాణించారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 'నన్ను అడగండి' అంటూ మహిళల కోసం "ప్రమదావనం"  శీర్షికలను  దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాశారు. వంటలు, సరదా విషయాలతో పాటు మహిళలకు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు. విదేశాలకు వెళ్ళివచ్చిన వారి అనుభవాలు కూడా రాయించేవారు. ఆమె నిర్వహించే జావాబులు శీర్షిక ఎంతో పాఠకాధరణ పొందింది. పాతిక దాకా మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్  వరకూ అనేక మంది ప్రముఖ రచయితల రచనలను ఆమె తెలుగులోకి అనువాదం చేశారు.  ఇవి  స్వాతి మాసపత్రికలో 'పాత కెరటాలు' శీర్షికన ప్రచురించారు.   నవలా రచయితగా, మహిళా సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ కాలమిస్టుగా అనేక రచనలు చేశారు. మహిళలు ఎదుర్కోంటున్న ఎన్నో సమస్యలకు ఆమె రచనలు పరిష్కారం సూచించేవి. మహిళల్లో ఆలోచన శక్తి, సమస్యను ఎదుర్కోనే యుక్తి పెంచేలా ఆమె రచనలు ఉండేవి. 17కు పైగా నవలలు రాసిన ఆమె కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 21 ఆగస్టు, 2013న చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 

ఆకాశరామన్న ఉత్తరం పై అమరావతి మహిళల ఆగ్రహం

ఏపీలో రాజధాని విషయం పై రచ్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన 248వ రోజుకు చేరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని విషయంలో మాకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.    ఈ సందర్భంగా అమరావతి మహిళలు మాట్లాడుతూ "రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం మాకు సంబంధం లేదంటున్నప్పుడు ఏ అధికారంతో రాష్ట్రాన్ని విడదీశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ప్రకటించండి" అంటూ కేంద్రం పై మండి పదారు.    ఒకటే రాష్ట్రం దానికి ఒకటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా "మీకు ఈ పరిస్థితి రావటానికి కారణం చంద్రబాబు" అంటూ మందడంలోని దీక్ష శిబిరానికి నిన్న గురువారం ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. దీనిపై అక్కడ దీక్ష చేస్తున్న రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోము వీర్రాజు వ్యూహంతో ఏపీలో టీడీపీ పతనం ఖాయమా..?

కొద్ది రోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న ఏపీ బీజేపీ, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిననాటి నుండి కొత్త జోష్ తో ముందుకు సాగుతోంది. అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లడుతూ తమకు ఉన్న సొంత బలానికి జనసేన, ఇతర పార్టీల నుండి వచ్చే కొందరు నేతల బలం తోడైతే వచ్చే ఎన్నికలలో అధికారం బీజేపీ జనసేన కూటమిదేనని చెప్పి విపక్షాలలో సంచలనమ్ సృష్టించారు.   తాజాగా దీని పై అయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం అయన కొంత మంది తో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి ముందుగా ఇతర పార్టీలలో ఉండి గుర్తింపు పొందని ముఖ్య నేతలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లీడర్లను ఏదో ఒక రకంగా బిజెపి లోకి తీసుకురాగలిగితే పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ప్రయత్నం. అయితే దీనికంటే ముందు ఇప్పటికే ఇతర పార్టీల నుండి వచ్చి బీజేపీలో చేరిన కొంతమంది పైనా అలాగే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని వీలయితే పార్టీ నుండి తప్పిస్తూ.. ఒకవేళ అలా సాధ్యం కానివారిని పార్టీ అధిష్టానం తో చెప్పి సైలెంట్ చేసే పనిలో వీర్రాజు బిజీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.   ఇతర పార్టీ నేతలను ఆకర్షించే క్రమంలో అయన చూపు ప్రస్తుతం టిడిపి పై ఉందని.. ఆ పార్టీ లో ఉండి బిజెపి అంటే ఆసక్తి ఉన్న వారి జాబితాను కూడా అయన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లిస్టులో ప్రముఖంగా మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనను కనుక తీసుకురాగలిగితే ఆయనతో పాటు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా వస్తారని అయన ఆశాభావంతో ఉన్నారు. అలాగే రాయలసీమ నుండి జగన్ ప్రభుత్వం తాకిడికి విలవిలలాడుతున్న జేసి కుటుంబం, పరిటాల కుటుంబాలను కూడా వారితో సన్నిహితంగా మెలిగే బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇక కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించి ఇపుడు సైలెంట్ గా ఉన్న నేతల పై సోము వీరాజు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ ముఖ్య నేతలను కనుక చేర్చుకోగలిగితే వారి వెంట ఉండే పార్టీ కేడర్ కూడా వచ్చి చేరతారు కాబట్టి బీజేపీకి తిరుగు ఉండదని.. అదే సమయంలో తెలంగాణాలో లాగా ఏపీలో కూడా టీడీపీ మటాష్ అవుతుందని అయన వ్యూహం గా కనిపిస్తోంది. ఇక తటస్థుల విషయానికి వస్తే సబ్బంహరి, హర్షకుమార్, అలాగే వైసిపి నేత దాడి వీరభద్రరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.   అయితే ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహం కనుక విజయవంతమైతే బీజేపీ బలోపేతం సంగతేమో కానీ సీఎం జగన్ పార్టీ అయిన వైసిపి నెత్తిన పాలు పోసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే టీడీపీలోని కొంత మంది నాయకులు బీజేపీ లో చేరినా ఆ పార్టీ కేడర్ మాత్రం వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెపుతున్నారు. అంతేకాకుండా ఎపి ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజధాని, ప్రత్యేక హోదా వంటి ముఖ్య సమస్యల పై బీజేపీ గోడమీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న తీరుతో అసలు ఏపీ ప్రజలు ఎంతవరకు బీజేపీని ఆదరిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న అని.. దీనికి కాలమే సమాధానం చెప్పగలదని విశ్లేషకుల అభిప్రాయం.