సీఎం కేసీఆర్ పై దుష్ప్రచారం.. సౌదీలో పని చేస్తున్న యువకుడి అరెస్ట్
posted on Aug 18, 2020 @ 9:36AM
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ యువకుడు అసత్య ప్రచారం చేశాడు. ఆయనకు ముక్కు ద్వారా కరోనా వైరస్ సోకి సీఎం కేసీఆర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. తాజాగా ఆ యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ కు చెందిన పన్యాల రాజు అనే యువకుడు ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించారని, దానిని గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా ధ్రువీకరించారని ఫేస్బుక్లో తప్పుడు పోస్ట్ చేశాడు. దీనికోసం మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్ను సోషల్ మీడియాలో రాజు షేర్ చేశాడు. జూన్ 8వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసారు.
జగిత్యాలకు చెందిన రాజు సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. అతడు ఈనెల 14వ తేదీన సౌదీ అరేబియా నుండి ఇండియాకు వచ్చాడు. అయితే ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన రాజును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు అధికారుల ఇచ్చిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వెళ్లి అతడిని హైదరాబాద్కు తీసుకువచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు.