బాబు, పవన్ ల పై సెటైర్లు వేసిన అంబటికి చుక్కలు చూపిన నెటిజన్స్
posted on Aug 17, 2020 @ 6:30PM
వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ అంటే వెటకారాలు.. పంచ్ లతో వైరి పక్షాలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. అటువంటిది తాజాగా అయన ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ తో ఒక్క సారిగా నెటిజన్స్ అంబటి పై విరుచుకు పడుతున్నారు. నిన్నటి రోజు మొత్తం సోషల్ మీడియాలో ఆయనకు చుక్కలు చూపించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాంబాబు ఒక ట్వీట్ చేస్తూ స్వరాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోలేని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లకి రాష్ట్ర రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు జన సైనికులు రంగంలోకి దిగి అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎక్కడి నుంచైనా జరుపుకోవచ్చని వారు అంబటికి హితబోధ చేస్తున్నారు. మన దేశంలోనే కాదు విదేశాలలో ఉండి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవచ్చని ఈ సందర్భంగా వారు చెపుతున్నారు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన వేడుకని ఆ విషయం కూడా తెలియని అంబటి రాంబాబు అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యారని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్ర్తున్నారు. అయ్యా అంబటి గారు "2015 ఆగస్టు 15 న జగన్ కూడా హైదరాబాద్ నుంచి జెండా ఎగురవేశారు, మరి మీ లాజిక్ ప్రకారం చూస్తే, జగన్ కి మన రాష్ట్రానికి సిఎం గా ఉండటానికి అర్హత ఉందంటారా ?" అంటూ సెటర్లు వేశారు. మరి కొందరు "ఇదేమీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదని కాబట్టి రాష్ట్రంలోనే ఉండి జరుపుకోవాల్సిన అవసరం కూడా లేదని" స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక మీ చిల్లర రాజకీయాలు ఆపమని కూడా వారు సలహా ఇచ్చారు. రాష్ట్రం మీద అంత ప్రేమున్న మీరు కరోనా సోకితే పక్క రాష్ట్రంలో ఎందుకు చికిత్స తీసుకున్నారు అదేదో ఇక్కడే చేయించుకోవచు కదా అని కూడా వారు అంబటిని నిలదీస్తున్నారు. ఎపుడూ ఇతర పార్టీల నేతలకు చుక్కలు చూపించే అంబటి చేసిన ఒకే ఒక్క ట్వీట్ బూమ్ రాంగ్ అయి మళ్ళీ వాయిస్ లేకుండా చేసింది.