ఫోన్ లో డాక్టర్ సూచనలతో ప్రెగ్నెంట్ కు డెలివరీ చేసిన మహిళా ఎస్ఐ

బాగా పాపులర్ అయిన హిందీ సినిమా "త్రీ ఇడియట్స్" లో డాక్టర్ అయిన హీరోయిన్ కరీనా కపూర్ సూచనలతో అమిర్ ఖాన్ ఒక ప్రెగ్నెంట్ కు డెలివరీ చేయించడం మనమందరం చూసాం. తాజాగా ఒక మహిళా ఎస్ఐ వైద్యురాలి అవతారం ఎత్తి ఒక మహిళకు పురుడు పోసింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానై వ్యవహరించి ఆమెకు అండగా నిలబడింది. అక్కడ ఆ మహిళకు వైద్యం చేయడానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా మారి.. ఫోన్ లో డాక్టర్ సూచనల మేరకు వైద్యం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రావత్‌పురా జిల్లా బింద్‌లో నివసిస్తున్న బాద్‌షా తన భార్య పూజ (19) తో కలిసి గోవా ఎక్స్‌ప్రెస్‌లో దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. అయితే దారి‌లో పూజకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌లో దిగిపోయారు. దీంతో అంత రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో పాటు ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లే సమయం కూడా లేకపోవడంతో అక్కడే ఉన్న మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ మరికొంత మంది మహిళల సాయంతో ఏసీ కేబిన్ నుండి కొన్ని దుప్పట్లు తీసుకుని ఆ గ‌ర్భిణికి డెలివ‌రీ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆ గర్భిణీ పరిస్థితిని గ‌మ‌నించిన మ‌హిళా ఎస్‌ఐ ‌ తన స్నేహితురాలైన‌ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలు కసోటియాకు వీడియో కాల్ చేశారు. ఆ డాక్టర్ ఫోనులో సూచ‌న‌లు ఇస్తుండ‌గా ఆ సూచనల ప్రకారం ఎస్ఐ రాజ‌కుమారి ఆ గ‌ర్భిణికి సుర‌క్షితంగా డెలివ‌రీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఆ తరువాత అంబులెన్స్‌ను పి‌లిపించి త‌ల్లీబిడ్డ‌లను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆ తల్లి బిడ్డ ఆసుప‌త్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన పై ఆ గర్భిణీ భర్త అయిన బాద్‌షా స్పందిస్తూ మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ కనుక లేకపోతె తన భార్య బిడ్డ కూడా దక్కేవారు కాదని అంటూ.. ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు.

అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష

నిరుద్యోగులకు శుభవార్త   నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు   ఆన్ లైన్ పరీక్షలు, మూడేండ్ల వరకు స్కోర్ కార్డ్ వాలిడిటీ   నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చు, శ్రమ తగ్గించే ప్రయత్నం   ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై బ్యాంక్ ఉద్యోగం కోసం ఒక పరీక్ష, రైల్వే జాబ్ కోసం మరో పరీక్ష ఇలా అనేక రకాల ఉద్యోగాల కోసం రకరకాల పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. రెండు వేరువేరు ఉద్యోగాల పరీక్షలు ఒకే రోజు ఉన్నాయంటూ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఏదో ఒక జాబ్ సాధించాలన్న పట్టుదలతో అనేక పరీక్షలకు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు.   కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ లోని బ్యాంక్ ఉద్యోగాలు దాదాపు ప్రతి ఏటా భర్తీ చేసే లక్షా25వేల ఉద్యోగాల ను ఒకే పరీక్ష ద్వారా నియామాలు చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ మూడేండ్ల వరకు వర్తిస్తుంది. దేశంలోని దాదాపు 20 సంస్థల్లోని ఉద్యోగాలు ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.   ఊరికి దగ్గరలో, నచ్చిన భాషలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలంటే రాష్ట్ర రాజధాని, ముఖ్యపట్టణాల్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఖర్చు, శ్రమతో కూడిన అంశం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామీణ యువతకు  అవకాశాలు మెండుగా కల్పించేలా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను వారికి దగ్గరలో ఉండే సెంటర్ నే పరీక్ష రాయడానికి ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు తమకు నచ్చిన భాషలో రాసుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం గ్రామీణయువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దిశగా నడిపించేలా ఉంది.   1517కోట్ల కేటాయింపు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటుకూ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఇందుకోసం 1517.57కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఢిల్లీలో ఈ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారి ఏజెన్సీకి చైర్ పర్సన్ గా ఉంటారు. ఈ ఏజెన్సీ నిర్వాణకు మూడేండ్లకు 1517.57 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశంలో ప్రతి ఏటా భర్తీ చేసే 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2.50కోట్లమంది ప్రతిఏటా పోటీ పడుతున్నారు. ఇకపై ఈ ఏజెన్సీ ద్వారానే 1.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా మొదటిదశలో వెయ్యి పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేస్తారు. గ్రామీణ ప్రాంత యువతకు అందుబాటులో ఉండేలా జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాల కోసం మౌలికసదుపాయాలు కల్పిస్తారు. 

అప్పట్లో చంద్రబాబు నా ఫోన్ ట్యాప్ చేయించిన ఆధారం ఇదిగో.. టీడీపీకి సజ్జల కౌంటర్

ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటు న్యాయమూర్తుల ఫోన్లు ఇటు విపక్ష నేతల ఫోన్లు కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇదిగో అంటూ ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇదే ఆధారాన్ని తాము కోర్టులకు కూడా సమర్పించామని అయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపించడం లేదని అయన ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ టైంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని వైసీపీ నేత సజ్జల చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

గోదావరి మధ్యలో చిక్కుకు పోయిన టీడీపీ ఎమ్మెల్యే... 

గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి జిల్లాలలో పలు గ్రామాలు, లంకలు నీట మునిగాయి. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడవలో బాడవ గ్రామానికి వెళ్లి వస్తుండగా మధ్యలో సాంకేతిక లోపం తలెత్తి మర పడవ గోదావరిలో యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరిలో నిలిచిపోయింది. అంతేకాకుండా నదిలో ఉధృతికి పడవ కొంతదూరం కొట్టుకుపోయిందని సమాచారం.   మంగళవారం కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు గోదావరి వరదతో పూర్తిగా జలదిగ్భంధం అయ్యాయి. ఈ గ్రామాల్లో ప్రజలు పూర్తిగా పడవలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. దాదాపు 1733 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని తహసీల్దార్ ఎల్.నరసింహారావు తెలిపారు. దీంతో ముంపుకు గురైన ఈ లంక గ్రామాల్లో పర్యటించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మురుగు నీటిలో కరోనా.. 

ఏది పట్టుకోవాలన్నా.. ఏది ముట్టుకోవాలన్నా ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి ప్రజలు కనీసం అడుగు బయట పెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో బయటి ఫుడ్ కూడా ఎవాయిడ్ చేసి ఇంటి భోజనం తో జనం సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైద‌రాబాద్ న‌గర ప్ర‌జ‌ల‌కు సీసీఎంబీ మ‌రో చేదు వార్త తెలిపింది. న‌గ‌రంలోని మురుగు నీటి ట్రీట్ మెంట్ ప్లాంట్ల వద్ద నుండి సేక‌రించిన నీటిలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.   కరోనా సోకినా ప్ర‌తి మ‌నిషిలో కూడా 35 రోజుల వ‌ర‌కు వైర‌స్ ఉండే అవ‌కాశం ఉంద‌ని, ఇది మ‌ల మూత్ర విసర్జ‌న ద్వారా మురుగునీటిలో క‌రోనా వైర‌స్ ఉండ‌వ‌చ్చ‌ని రాకేష్ మిశ్రా తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో కరోనా కేసులు బయటపడనప్పటికీ.. అక్కడ ఇన్ఫెక్షన్ బారిన పడినవారు ఉండవచ్చని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం అసలు లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి హాస్పిటల్ లో చేరకుండానే తగ్గిపోతున్న వారి సంఖ్య కూడా ఏమి తక్కువ కాదని అందువల్లనే మన దగ్గర వైద్య సదుపాయాలు తక్కువగ్గా ఉన్న కూడా కరోనా తో నెట్టుకు రాగలుగుతున్నామని తేల్చింది. దీంతో ఇన్నాళ్లు కేవ‌లం ద‌గ్గు, తుమ్ములు, తుంప‌ర్ల ద్వారానే క‌రోనా వ్యాపిస్తుంద‌ని తేల‌గా ఇప్పుడు మ‌ల, మూత్ర విస‌ర్జ‌న ద్వారా కూడా వ‌స్తుంద‌ని సీసీఎంబీ తన తాజా పరిశోధన ద్వారా షాకింగ్ న్యూస్ తెలిపింది. దీంతో నగరంలో ప్రవహించే నాలాల్లోని మురుగు నీటి ద్వారా కూడా వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని తాజాగా హెచ్చ‌రించింది. సీసీఎంబీ, ఐఐసిటీ కలిసి చేసిన ప‌రిశోద‌నల్లో ఈ విష‌యం తేలినట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

గవర్నర్ పై వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. రాష్ట్ర బిజెపి డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని బిజేపి రాష్ట్ర నాయకులు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో గవర్నర్ పై పోస్టులు పెట్టిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ కు రాజకీయాలను ఆపాదించడం అప్రజాస్వామికం అన్నారు.  గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగి నట్లు చూస్తున్నారని విమర్శించారు. బిజేపి జాతీయ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ ,అధికార ముఖ్య ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు, కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, మహిళామోర్చా నాయకులు డిమాండ్ చేశారు.   రాజ్యంగ పదవిలో ఉన్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతాపార్టీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్ గా ఆమె కోవిద్ 19 వైరస్ వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రజలు పడుతున్న అవస్థలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.    హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. పార్టీ అదినేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి లో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం ,శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవి లో ఉండి ఒక వైద్యరాలిగా  ప్రభుత్వానికి, సి ఎస్ కు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు గవర్నర్ చేశారు. అయితే ఆ సూచనలు ఏవీ పాటించకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను గాలికి వదిలేశారు. వాస్తవాలు చెప్పి, బాధ్యతయుతంగా సూచనలు చేసిన గవర్నర్ పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమో గమించాలన్నారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితి లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు .   అధికారపార్టీ కబ్జాల కారణంగానే.. టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని సుధాకర్ రెడ్డి విమర్శించారు .   ఇకనైనా పద్దతి మార్చుకోండి - కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 ఎదుర్కోవడంలో దారుణ వైఫల్యం చెంది, సంక్షోభానికి కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ డా. తమిళిసై చివాట్లు పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తమ పంథా మార్చుకుని కోవిడ్ విషయంలో వ్యవహరిస్తోన్న పద్ధతిని సరిచేసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.   తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాల్లోనూ, హైదరాబాద్ లోనూ చాలా కాలనీల్లో, అపార్టుమెంట్లలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ వాటి వివరాలు సేకరించే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. స్వయంగా వైద్యురాలైన గవర్నర్ మార్చి నుంచీ టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా విషయంలో వ్యవహరిస్తోన్న తీరు, నేరపూరిత నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు. చివరికి ఇప్పుడు, ఆఖరి అస్త్రంగా బహిరంగంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న గవర్నర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్‌ పై కొందరు దౌర్జన్యం చేసి.. తాళాలు పగలగొట్టి రూ. కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు. దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఎస్పీ కూడా స్పందించలేదు.    అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు. తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని, ఎమ్మెల్యే వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్‌ లో ఆరోపించాడు. తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. పిటిషన్‌ ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే మద్దాలి గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభాకర్‌ రెడ్డి కడప జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.   వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాలకి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ప్రభాకర్‌రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను మళ్లీ రిమాండుకు కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా సోకింది.  ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

ఫోటో జర్నలిస్టులను ఆదుకోవాలి: బండి సంజయ్ కుమార్

వంద పదాలు వర్ణించలేని భావాన్ని ఒక ఛాయాచిత్రం వర్ణింపజేస్తుంది. అంతటి అపురూప, మహోన్నతమైన కళ ఫొటోగ్రఫీ.  ఓ ఫోటోను ఆకట్టుకునే విధంగా ఫ్రేంలో బంధించాలంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎంతో సృజనాత్మకతను జోడించాలి. అటువంటి ఫోటోగ్రాఫర్లందరికి హ్యాట్సాఫ్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ లకు పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.   విషాద సంఘటనలే కాదు.. ఆహ్లాదకరమైన దృశ్యాలను అందించి.. మనస్సులను రంజింప చేసి శక్తి ఫోటోకు ఉంది. మనస్సులను తుళ్లిపడేలా చేసి..మైమరిచేలా చేసే ఫోటోలు కూడా అనేకం ఉన్నాయి.  అంతట ఔచిత్యం ఉన్న ఫోటోగ్రఫీ నేడు సాంకేతికతను అద్దుకుని మరింత కొత్తగా ముందుకు సాగిపోతోంది అంటూ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సందర్భంగా ఆయన ఫొట్రోగ్రఫిలో వస్తున్న ఆధునికతను ప్రస్తావించారు.   సమాజ అభివృద్ధిలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది. పత్రికా రంగంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమైంది.  ఒక ఫొటో ద్వారా వార్తా విషయం మొత్తాన్ని తెలియజేయడంలోనే ఫొటోగ్రాఫర్ల ప్రావీణ్యం దాగుంది. ప్రస్తుతం మనమందరం ఎదుర్కొంటున్న కరోనాపై చేస్తున్న యుద్ధంలో ఫొటో జర్నలిస్టులు కూడా ముందు వరుసలో ఉన్నారు. అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడమే లక్ష్యంగా వీడియో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వారందరి సేవలకు ధన్యవాదాలు అన్నారు.   తెలంగాణ ప్రభుత్వం ఫొటో జర్నలిస్టును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి డబుల్‌బెడ్రూంల కేటాయింపులు జరగకపోవడం శోచనీయమన్నారు సంజయ్.  జర్నలిస్టుల సంక్షేమం కోసం  100  కోట్ల రూపాయల  సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ  హామీని నిలబెట్టుకోకపోవడం జర్నలిస్టులను విస్మరించడమే అన్నారు. కరోనా వార్తల సేకరణలో ఫొటో జర్నిలిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శుభకార్యాలు నిలిచి ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేక, పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, కెమెరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

వరద నీరుతో మునిగిన స్థలాలను ఇళ్లకు కేటాయించారు

కాదేదీ ఇళ్ల స్థలాలకు అనర్హం అన్నట్టు ఏపీ ప్రభుత్వం పలు వివాదాస్పద స్థలాలను పేదవారి ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.   ఆవ భూములలో ఇళ్ల స్థలాలు పంపిణీని వెంటనే రద్దు చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే ఈ ప్రాంతమంతా మునిగిపోయిందని.. మళ్లీ వర్షం వస్తే 30 వేల మందికి పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ భూములకు ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆవలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని, ప్రభుత్వానికి కళ్లు ఉంటే అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు.   ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా, ఆ నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణ వ్యవహారంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా.. ఇప్పుడు అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే.. ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సెప్టెంబర్ 5 నుంచి జగనన్న విద్యాకానుక

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.  సెప్టెంబర్‌ 11న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.   సెప్టెంబర్‌ 1న గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనుంది. 3 జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించాలని నిర్ణయించింది.    ఎన్నికల హామీ ప్రకారం ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని డిసెంబర్1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు సబ్సిడీపై వాహనాలు అందజేయనుంది. అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.    పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సుప్రీం కోర్టులో అమరావతి కేసు మరో సారి వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటంతో ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.    దీంతో ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ అధ్యక్షతన ఏర్పడిన బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా అమరావతి రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును మరో సారి వాయిదా వేసారు.    ఐతే ఒకే కేసు విషయంలో సుప్రీం కోర్టు లో వరుసగా రెండో సారి ఇలా జరగటం అరుదైన విషయం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన మరో బెంచ్ వద్ద విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాల పైన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చిన సర్వే ఆఫ్‌ ఇండియా

ఏపీలో రాజధాని అంశం వివాదాస్పదం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌ సింగ్ లేఖ రాశారు. దేశ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చామని లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆమోదం మేరకే లేఖను విడుదల చేస్తున్నామని ప్రదీప్‌ సింగ్ స్పష్టం చేశారు.   కేంద్ర ప్రభుత్వం గతేడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్‌ లో ఏపీ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. మ్యాప్‌ లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని ఎంపీ గల్లా జయదేవ్ 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించారు. అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలతో పాటు, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆమోదం మేరకు తాజాగా గల్లా జయదేవ్‌కు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. దీనిపై గల్లా జయదేవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా మ్యాప్‌ లో ఏపీ రాజధాని అమరావతిని పేర్కొనకపోవడాన్ని తాను 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తానని చెప్పారు. దీంతో సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి తాజాగా ప్రకటన చేసిందని, ఏపీ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ మ్యాప్‌ ను అప్ డేట్ చేసిందని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.

అమరావతి రైతులకు బాసటగా అయోధ్య వీరుడు.. ఫీజు కేవలం ఒక్క రూపాయి 

లాయ‌ర్ ప‌రాశ‌రన్ ఈ మధ్య కాలంలో ఈ‌ పేరు తెలియ‌ని వారుండ‌కపోవచ్చు. దీనికి కారణం కొన్ని ద‌శాబ్దాల పాటు సాగిన బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో ఎంతో నిష్ఠతో వాదించి మన దేశానికి సంబంధించిన అతిపెద్ద స‌మ‌స్యను పరిష్కరణలో పాలు పంచుకున్నారు. అయన గ‌తంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కూడా సేవ‌లు అందించారు. అటువంటి పెద్ద లాయర్ ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీం కోర్టులో వాదించబోతున్నారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది.   ఇప్పటికే మూడు రాజధానులు, అమ‌రావ‌తి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు ప్ర‌ముఖ లాయర్ హ‌రీష్ సాల్వేను జగన్ ప్ర‌భుత్వం నియ‌మించుకుంది. ఎంతో స‌క్సెస్‌ఫుల్ లాయ‌ర్‌గా పేరున్న ఆయ‌న ఈ కేసును చేపట్టడంతో అమరావతి రైతులు ఆందోళ‌న చెందారు. దీంతో హ‌రీష్ సాల్వే స్థాయిలో త‌మ త‌ర‌పున పోరాడే మరో లాయ‌ర్ కోసం ప్రయత్నం చేసారు. అయితే ఎంత మందిని అప్రోచ్ అయినా వారు ఎక్కువ మొత్తంలో ఫీజు డిమాండ్ చేయడంతో రైతులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అయితే చివ‌రి ప్ర‌య‌త్నంగా వారు న్యాయవాద వృత్తిలో తల పండిపోయిన పరాశ‌రన్‌ను ఆశ్ర‌యించారు. రైతుల గోడు విని చ‌లించిపోయిన ప‌రాశ‌ర‌న్ వారి తరుఫున వాదించేందుకు అంగీకరించారు. అయితే ఈ కేసును అయన కేవ‌లం ఒక్క రూపాయి ఫీజు తోనే వాదించేందుకు అంగీక‌రించారు. ఇప్పటికే ప‌రాశ‌ర‌న్ త‌రుపున ఆయ‌న కుమారుడు మోహ‌న్ ప‌రాశ‌ర‌న్ అమ‌రాతి వివాదంపై రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తున్నారు. రెండు రోజుల కిత్రం అమ‌రావతిపై జ‌రిగిన వాద‌న‌ల్లోనూ ప‌రాశ‌రన్ పాల్గొన్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి భూముల‌పై సుప్రీం కోర్టులో రైతుల‌కు అనుకూలంగా తీర్పు రావ‌డంతో.. రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలోనూ తాము గెలుస్తామ‌ని ఆ రైతులు ధీమాగా ఉన్నారు.

భారత్ లో ముందుగా వచ్చేది ఆ వ్యాక్సినే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం...!

కరోనా తో ప్రపంచం తో పాటు భారత్ కూడా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అందరి చూపు వ్యాక్సిన్ పైనే ఉంది. ఇప్పటికే మన దేశంలోని భారత్ బయోటెక్, జైడస్ కాడిలా కంపెనీల వ్యాక్సిన్ల ట్రయల్స్ కీలక దేశాలలో ఉన్నాయి. అయితే మనదేశంలో అన్నిటి కంటే ముందుగా ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా ఈ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అయితే స్థానికంగా తయారవుతున్న వ్యాక్సిన్ లను కూడా నిశితంగా గమనిస్తున్నామని, అవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని ఆయన తెలిపారు.    అంతేకాకుండా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, స్వదేశీ వ్యాక్సిన్ లు మార్కెట్లోకి రావడానికి మధ్య కేవలం కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉండడంతో దానికే ముందుగా అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఈ వ్యాక్సిన్ పై పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సుశాంత్ సింగ్ మృతి‌ కేసులో కీలక పరిణామం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర సర్కార్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తున్నట్లు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.   సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విచారణ సమయంలో మహారాష్ట్ర, బీహార్ పోలీసులు మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం కోరింది. బీహార్‌ సీఎం వినతి మేరకు కేసును ఇప్పటికే సీబీఐకి కేంద్రం అప్పగించింది. అయితే, సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును మహారాష్ట్ర పోలీసులే పూర్తి దర్యాప్తు చేస్తారని, సీబీఐ విచారణ అవసరమే లేదని తేల్చి చెప్పింది.   ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారాణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సహకరించాలని, అవసరమైతే ఈ కేసును తాజాగా ఫైల్ చేయవచ్చన్న సౌలభ్యం కూడా కల్పించింది.

కరోనా కేసుల్లో ఏపీ రికార్డులు.. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష!!

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. గత 11 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది.   మంగళవారం కొత్తగా 9,652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు నమోదు చేసింది.   ఏపీలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష కేసులు మాత్రం కేవలం 11 రోజుల్లోనే నమోదయ్యాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. ఈ స్థాయిలో కేసులు మరే రాష్ట్రంలో నమోదు కావడం లేదు.    రోజువారీ కేసుల్లో ఏపీ టాప్‌ లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదు కావడంలేదు. మహారాష్ట్రలోనూ రోజుకు సగటున 8 వేల కేసులు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.   ఏపీలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష మంది కరోనా బారిన పడినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.    కరోనా విజృంభణలో దేశంలో అంత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీలో మరో అవినీతి తిమింగలం.. నేల మాళిగలో తవ్వే కొద్దీ బంగారం..

ఏపీలో మ‌రో అవినీతి తిమింగలం బయట పడింది. మరో అవినీతి అధికారి అక్ర‌మార్జ‌నలో ఏకంగా విశ్వ‌రూపం చూపించాడు. అనంత‌పురం జిల్లా బుక్క‌రాయ స‌ముద్రం ఎస్సీ కాల‌నీ‌లో.. ట్రెజ‌రీ ఉద్యోగికి డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్యక్తి బంధువు ఇంట్లో భారీ ఎత్త‌న ఖ‌జానా బ‌య‌ట‌ప‌డటం తాజాగా సంచ‌ల‌నం రేపింది. ఎదో పురాతన కాలంనాటి గుప్త నిధులు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు.. త‌వ్వే కొద్ది కిలోల కొద్ది బంగారం, వెండి నిల్వ‌లు వెలుగుచూశాయి. దాదాపు 8 ట్రంకు పెట్టెల్లో దాచిన‌ బంగారం, వెండి వస్తువుల‌ను తవ్వి తీసి చూసిన పోలీసులే షాక్ తిన్నారు. అంతేకాకుండా ఇదంతా అక్ర‌మార్జ‌న అని తెలియ‌డంతో వాళ్ళు కూడా గుడ్లు తేలేశారు.   వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ట్రెజ‌రీ ఆఫీసులో కొన్నేళ్ల కిత్రం కారుణ్య నియామ‌కం కింద మనోజ్‌కుమార్ ఉద్యోగం పొందాడు. ఈ అవినీతి అధికారి బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలో ఉండే నాగలింగం అనే వ్య‌క్తిని త‌న కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే మ‌నోజ్‌కుమార్ అవితీనిపై ఇటీవ‌ల అనేక‌ ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు అత‌ని క‌ద‌లిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో డ్రైవర్ నాగ‌లింగం మామ ఇంట్లో మ‌నోజ్‌కుమార్ దాచిన సొమ్ము విష‌యం తెలిసింది. అయితే అదేదో కొద్ది మొత్తంలో ఉంటుందిలే అనుకొని సోదాలు నిర్వహించిన పోలీసులు బయట పడ్డ నిధులను చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. ప్రస్తుతం మనోజ్, నాగలింగంలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగలింగం బంధువు బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, సోదాలకు వెళితే, బంగారం దొరికిందని, ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం కడప జైల్లో ఉన్నారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి నడుపుతున్నారనే కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద విడుదలై ఇంటికి వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించారని, జనంతో భారీగా ర్యాలీ నిర్వహించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో ఆయనను కడప జైలుకు తరలించారు. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసు బందోబస్తును పెంచారు.   ఇది ఇలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉంచిన కడప జైలులోని ఖైదీలు, సిబ్బంది సహా మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బంది, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, వారికి చికిత్సను అందిస్తున్నామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు.