ఆ టీకా తీసుకున్నవారిలో కరోనా ప్రభావం తక్కువే.. కన్ఫర్మ్ చేసిన తాజా పరిశోధన

టీబీ పై పోరులో భాగంగా ఇస్తున్న బిసిజి టీకా కరోనా సమయంలో కూడా సురక్షితమేనని తాజా అధ్యయనం తేల్చింది. ఈ టీకా వేయించుకున్న వారు కరోనా సోకినప్ప‌టికీ తీవ్ర అనారోగ్యం బారిన పడట్లేదని ప‌రిశోధ‌కులు గుర్తించారు. తాజాగా ఈ టీకా వేయించుకున్న వారితో పాటు టీకా వేయించుకోని వారిపై ప‌రిశోధ‌న‌లు చేసిన నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు తాము కనుగొన్న ఫ‌లితాలు వెల్ల‌డించారు. టీకా వేయించుకున్న వారు ఎక్కడ కూడా తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు త‌మ దృష్టికి రాలేదని వారు తెలిపారు. అంతే కాకుండా క‌రోనా బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న పరిస్థితులు కూడా లేవని వారు తెలిపారు. క్షయ(టిబి) బారిన ప‌డ‌కుండా బీసీజీ టీకా వేస్తార‌న్న సంగతి తెలిసిందే. ఈ అధ్య‌య‌నంలో భాగంగా ఐదేళ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న వారి ఆరోగ్య ప‌రిస్థితితో పాటు ఆ టీకా వేయించుకోని వారిని క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిశీలించామ‌ని ఆ శాత్రవేత్తలు వెల్ల‌డించారు. ఆ వాలంటీర్ల‌లో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప‌రిశీలించి ఈ ఫ‌లితాలు చెబుతున్న‌ట్లుగా వారు వివ‌రించారు.

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో పాఠశాలలు మళ్ళీ తెరుచుకోనున్నాయి

కరోనా వైరస్ కారణంగా గత మార్చ్ నెలలో మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. తాజాగా సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియను ప్రకటిస్తున్న కేంద్రం అన్‌లాక్ 3.0 ప్రక్రియలో భాగంగా ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో పేర్కొననుంది.   ఐతే విద్యార్థులు ఎప్పుడు, ఏ పద్దతిలో తరగతులకు హాజరుకావొచ్చన్న దాని పై రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బోధన సిబ్బంది, అలాగే విద్యార్థుల్లో 33 శాతం సామర్థ్యంతో విడతల వారీగా తరగతులను నడపాలని, అంతే కాకుండా క్లాస్ రూముల్లో విద్యార్థులు 2, 3 గంటలకు మించి ఉండకుండా చూడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొనే అవకాశమా ఉన్నట్లుగా తెలుస్తోంది.   మొదటి షిప్టును ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, రెండో షిప్టును మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మధ్యలో ఉండే గంట విరామ సమయంలో తరగతి గదులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే భౌతికంగా క్లాసులు ఉండే అవకాశం ఉంది. మిగిలిన వారికి మాత్రం ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణ యాసను అక్షరాల్లో పొదిగి.. తెలుగు పాఠకుల మనసులో ఒదిగి

పాకాల యశోద రెడ్డి (8ఆగస్టు 1929 - 7 అక్టోబర్ 2007) సాహిత్యంలోని అనేక ప్రక్రియలను తన కలం ద్వారా సృజించినప్పటికీ పల్లె తెలంగాణను అక్షరాల ఆవిష్కరించిన ఎచ్చమ్మ కథలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమే ప్రముఖ రచయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్  పాకాల యశోదారెడ్డి.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచ్చమైన యాస వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన తెలంగాణ యానను తన కథల ద్వారా బతికించారు యశోదరెడ్డి. ప్రతి కథలోనూ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆత్మ అక్షరాల్లో పొదిగి ఉంటుంది. చదివిన తర్వాత పాఠకుల మనసులో ఒదిగిపోతుంది. దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ప్రసంగాలు చేసిన తొలి రచయిత ఆమె. యశోద రెడ్డి రచనలు భాషాభిమానులకు నిధులు. వెతుక్కుంటే అందులో ఎన్నో సామెతలు, ఉపమానాలు, చమత్కారాలు అంతర్లీనమై పాఠకులను అలరిస్తాయి. ఆమె ప్రసంగాలు విని తెలంగాణ భాష ఇంత అందమైన యాస అని చాలా మంది అబ్బుర పడేవారట.   మహబూబానగర్ జిల్లా బిజినేపల్లిలో యశోద జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆమె బంధువుల వద్ద పెరిగారు. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్చారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసే ఆయన చదువుపై ఆసక్తి ఉన్న ఆడపిల్లలు పట్టణంలో చదువుకునేందుకు వీలుగా వసతిఏర్పాటు కూడా చేసేవారట. అలా హైదరాబాద్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన యశోద  విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ పరీక్ష రాశారు. గుంటూరు ఎసి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు.    కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామవాసి ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో పెళ్లి జరిగింది. రాతకు గీత తోడైంది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నించి ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ (సంస్క-తం) పూర్తిశారు. తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్నారు.  హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు.    కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తన ప్రస్థానం ప్రారంభించి  ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోఫెసర్ పదవీవిరమణ చేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్ గా, అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా అనేక స్థాయిలో పనిచేశారు.   కథ, కవిత, వ్యాస ప్రక్రియల్లో ఆమె ఎన్నో రచనలు చేశారు. వందకు పైగా కథలు రాసినా అందులో కొన్ని కథలు మాత్రమే మూడు కథా సంపుటాలుగా వచ్చాయి. ఎచ్చమ్మ కతలు బాగా ప్రాచుర్యం పొందిన కథా సంపుటి. ఉగాదికి ఉయ్యాల, భావిక కవితా సంపుటాలు, కథలూ నవలలూ-ఒక పరిశీలన, కథా చరిత్ర, భారతంలో స్త్రీ, ఆంధ్ర సాహిత్య వికాసం, హరివంశము ఉత్తర భాగము, పారిజాతాపహరణం, తెలుగులో హరివంశములు వ్యాస సంపుటాలుగా వచ్చాయి.   ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్న ఆమె ఎచ్చమ్మ కతల యశోదగా పాఠకుల మనసులో నిలిచిపోయారు. తెలంగాణ యాసలో సాగే ఆమె రచనలపై చాలామంది పరిశోధనలు చేసి డాక్టరేట్ లు అందుకున్నారు.

అత్యంత అనుభవం ఉన్న పైలట్.. అయినా తప్పని ప్రమాదం.. కారణం అదేనా..!

భారీ వర్షాలతో సతమతమవుతున్నకేరళలో నిన్న రాత్రి విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్, కో పైలట్ సహా 20 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా కోజికోడ్ వచ్చిన ఈ విమానంలో ప్రమాదం సమయంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారిని కోజికోడ్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.   నిన్న కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలెట్ దీపక్ వసంత సాథే అత్యంత అనుభవం కలిగిన వారు, ఆయన IAF లో వింగ్ కమాండర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు NDA తరపున స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ కూడా లభించింది. అయినప్పటికీ ఆ విమానం రన్‌వేపై ల్యాండ్ అయేటపుడు కుదుపులకు లోనై రన్‌వేపై దూసుకుపోతూ పక్కనే ఉన్న లోయలోకి జారిపోతూ రెండు ముక్కలైపోయిందంటే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.   నిన్న రాత్రి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వర్షం పడ్తుండటం వల్ల రన్‌వే చిత్తడిగా ఉంది. అందువల్ల విమానం దిగగానే... టైర్లు జారి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీంతో విమానం లోయలోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. ఈ ప్రమాదం పై ఎయిర్ మార్షల్ పీకే బార్బోరా స్పందిస్తూ ఎంతో అనుభవం ఉన్న పైలెట్ అయిన దీపక్ వసంత సాథే కూడా విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే... ప్రమాదం ఏ స్థాయిలో జరిగివుంటుందో ఊహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.   మరో పక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్‌ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తొమ్మిదేళ్ల కిందటే ఎయిర్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్ ఒక నివేదికలో వివరించారు‌. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందని అప్పట్లోనే ఆయన చెప్పారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఐతే ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలనే అంశంపై దర్యాప్తు రిపోర్ట్ వచ్చాక... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మా నాన్నను చంపింది కరోనా కాదు: సున్నం రాజయ్య కుమారుడు

కొద్ది రోజల క్రితం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పై పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   ఉద్యమాలే ఊపిరిగా తన తండ్రి బతికారని... అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టారని అయన ఆ ఆడియో ద్వారా తెలిపారు. ఐతే కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో కొంత మంది వివక్ష చూపారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిగా మా ఇంట్లో మా అక్కకు కరోనా సోకిందని... దీంతో, తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం మొదలు పెట్టారని, ఆయన వస్తుంటే తలుపులు వేయడం చేశారని అయన తెలిపారు. దీంతో రాజయ్య మానసికంగా కృంగిపోయారని.. ఈ లోగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అయన తెలిపారు. దీంతో తన తండ్రి విపరీతమైన ఆందోళనకు గురయ్యారని అయన తెలిపారు.   తన తండ్రి జీవితంలో ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసారని అటువంటి ఆయనకు కరోనా ఒక లెక్క కానే కాదని అయన చెప్పారు. ఏ ప్రజల కోసం తన తండ్రి పరితపించారో ఆ ప్రజలే ఆయనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని అయన అన్నారు. అదే కనుక ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే తన తండ్రి బతికేవారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కరోనాపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని అయన విమర్శించారు.

విడుదలై 24 గంటల గడవకముందే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

ఊహించినట్లే జరిగింది. జైలు నుంచి విడుద‌లై 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు.   54 రోజుల పాటు కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే, కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కారు ర్యాలీతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కారు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ విరుచుకుపడ్డారు.   దాంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చుతారని తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది

ఆంధ్రప్రదేశ్‌ లో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి.    తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.    ఏపీ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్..!

హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఎపి ప్రభుత్వం తాజాగా మరో సారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర పడగానే, దాని పై అమ‌రావ‌తి రైతులు హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ బిల్లుల ఆమోదం పై స్టేటస్ కో విధిస్తు విశాఖప‌ట్నంకు ప్రభుత్వ కార్యాల‌యాలు త‌ర‌లించ‌కుండా హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది.    తాజాగా దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం పూర్తిగా రాజ‌కీయ ప్రేరేపిత ఉద్య‌మ‌మ‌ని, అవ‌స‌రం అయితే హైకోర్టు నిర్ణ‌యంపై సుప్రీం కోర్టుకు వెళ్లే విష‌యం కూడా ఆలోచిస్తాం అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా చంద్రబాబు తానొక్కడినే బాగుపడాలనే పెద్ద స్వార్ధపరుడని, అందుకే రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుకుంటున్నారని అయన తీవ్ర విమ్మర్శలు చేసారు. ఐతే మంత్రి తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టు స్టేటస్ కో పై సుప్రీంకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌హా ప‌లు కేసుల్లో సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కార్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌గా... మళ్ళీ మూడు రాజ‌ధానుల బిల్లుపై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా తయారయింది.

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి ఇటీవల ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని, న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని  మండిపడ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.   కాగా, మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇప్పుడు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.

కరోనా కాలం కలిసోచ్చింది.. 'గీత పొగత్' అంతరంగం...!!

ప్రపంచవ్యాప్తంగా జనజీవితాన్ని స్తంభించేలా చేసిన కరోనా వల్ల అనేక రంగాలు చతికిలాబడ్డాయి. కరోనా వల్ల టోక్యో నగరంలో ఈ సంవత్సరం జరగాల్సిన 'ఒలంపిక్స్ క్రీడలు' వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఒకరి విషయంలో మాత్రం అది అదృష్టంగానే భావించుకోవచ్చేమో...ఆ వ్యక్తే కామన్వెల్త్ క్రీడల్లో రేజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన గీత పొగత్. 2010లో జరిగిన కామన్ వెల్త్ గోమ్స్ లో మన దేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం ఆమె సాధించారు. ఒలంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే. 2016లో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న గీత 2019లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్  కరోనా కారణంగా వాయిదా పడటంతో తనకు మేలే జరిగిందనంటున్నారు. కరోనా కాలం కలిసోచ్చింది అంటూ ఆమె 2021లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక  ఇంటర్వ్యూలో ఆమె తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.   బాబు (అర్జున్) పుట్టి చూస్తుండగానే ఏడు నెలలు గడిచిపోయాయి. వాడి ఫోటోలను నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. వాటిని చూస్తూంటే  ఆనందంగా ఉంది. ఒక రకంగా బాబు పుట్టాక  చాలా సంతోషంగా ఉన్నాను. జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు టైం అంతా వాడితోనే... ప్రత్యేకమైన టైమింగ్ అంటూ ఏమీ ఉండవుకదా అందుకే నేను వాడి టైమింగ్ కు అనుగుణంగా మారాల్సి వస్తుంది. రాత్రివేళ కూడా చాలా సార్లు వాడు నిద్రలేస్తాడు. పాలు పట్టాలి ,బట్టలు మార్చాలి. అలా అన్నీ నేను చూసుకుంటున్నాను. వీటితో పాటు నా ఫిట్ నెస్ మీద కూడ దృష్టి పెట్టాల్సి ఉంది.   పెళ్లి చేసుకోవడం, అమ్మను కావడంతో నేను కుస్తీ మానేశాను అనుకుంటున్నారు. చాలామంది నెక్ట్స్ ఏంటీ అని అడుగుతుంటారు కూడా. అర్జున్ పుట్టాక మా ఇంట్లో వాళ్ళు కూడ ఇపుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేను మాత్రం ఎప్పుడు  కుస్తీని వదిలేది లేదు.   అయితే 2020లో జరిగే పోటీల్లో పాల్గొన్నలేనేమో అని బాధపడ్డాను. అయితే  కరోనా కారణంగా  ఈ ఏడాది జరగాల్సి ఒలంపిక్స్  2021 లో జరగబోతున్నాయి. ఒక రకంగా మళ్ళీ నాకు పాల్గొనే అవకాశం వచ్చినట్లే అందుకే దీన్నీనేను అసలు వదులుకోను. కచ్చితంగా ఈ ఒలంపిక్స్ కి వెళ్తడంతో పాటు పతకాలు తేవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. మా ఇంట్లో అందరూ కుస్తీ యోధులే.. నా భర్త కూడా రెజ్లరే కావడంతో నన్ను అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే నా గురువు. మా సోదరి, ఫ్యామిలీ మెంబర్స్ నన్ను గమనిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చేయగలవు, ఇంతకుముందు కన్నా ఇపుడే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తున్నారు. సాధించాలన్న తపన ఉంటే  చాలు ఎవరైనా చేస్తారు అంటూ వాళ్లందరూ  మోటివేట్ చేస్తున్నారు. అయితే నాన్నగారి గురించి ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత  నాన్న మా ఇంటికి వచ్చారు.  రాగానే ఆయన  నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ని బరువు ఎంత ఉంది? కుస్తీ చేయాలనే కోరిక ఉందా లేదా? తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నించారు.  నేను కాస్త బరువు చాలా పెరిగాను కాబట్టి నా బరువు తగ్గించి, మళ్ళీ ఎప్పటిలా కుస్తీ చేస్తాను అని చెప్పాను. దానికాయన అది చాలా కష్టం, ఇపుడు నువ్వింక ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నారు. అవును, నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి కష్టపడతాను, బరువు తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు కుస్తీ తప్పించి ఇంకేమి కనిపించడం లేదు.   మా నాన్న చెప్పినట్లే నిజానికి  రెజ్లర్స్ కి  బరువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే  బరువును బట్టే మన క్యాటగిరి అనేది నిర్ణయించబడుతుంది. లాస్ట్ టైం నేను  57 కేజీల విభాగంలో పాల్గొన్నాను.  దాని తర్వాత కూడ నేను ఆడాను.  ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కూడ 5 7 కేజీల విభాగంలో  ఆడాను. ఇపుడు జరగబోయే ఒలంపిక్స్ కి 62 కేజీల విభాగం అవసరం. ఈ మధ్య నా ఫోటోలను చూసి సోషల్ కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు. నా హర్డ్ వర్క్ ను గమనించకుండా కామెంట్స్  చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే వారి కామెంట్స్ కు బాధపడేతే అక్కడే ఆగిపోతాను. ఒకరకంగా ఇలాంటి నెగటివ్ విషయాలు కూడ నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేస్తాయి. ఒక రకంగా వాళ్ళ   మీద జాలి కలుగుతుంది. ఇపుడు నేను ఓ బిడ్డకు తల్లి ని.  అమ్మఅయిన తర్వాత సహజంగానే శరీరంలో మార్పులు వస్తాయి. బరువు పెరుగుతారు. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా కాకుండా  మీరు ఇలా లావాపోయారేంటి? కుస్తీ వదిలేశారా? లావయితే ఇక కుస్తీ ఎలా చేయగలరు' అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారంటేనే తెలిసిపోతుంది వాళ్ళకి అంతగా అర్థం చేసుకునే శక్తి లేదని. అందుకే నేను వాళ్ళ మీద జాలి పడి వదిలేస్తాను. అమ్మ అయినంత మాత్రానా నాకు ఇష్టమైన కుస్తీని వదిలేయాలా  దాన్ని ఛాలెంజ్ గా కూడా తీసుకుంటాను. మళ్ళీ నేను ఫిట్ అవ్వడానికి సాధన చేస్తున్నాను.

చట్ట సభల నిర్ణయాల పై కోర్టుల జోక్యం సరికాదు.. స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ ‌లో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు సంబంధించి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై సభలో 11 గంటల పాటు చర్చించామన్నారు. ఇందులో ప్రతిపక్ష పార్టీకి రెండు గంటలకు పైగా చర్చించేందుకు సమయం ఇచ్చామన్నారు. అంతే కాకుండా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం కంటే కూడా వారికి ఎక్కువ సమయం ఇచ్చామని అయన తెలిపారు. ఐతే ఈ బిల్లులపై అసలు చర్చ జరగలేదని టీడీపీ అనడం సరికాదని అయన అన్నారు. పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని చెబుతూ, 1997 సంవత్సరంలో అప్పటి శాసన సభ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని, మరి శాసనసభ తీసుకొనే నిర్ణయాలపై కోర్టులకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు..   ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలిలోకి రాకూడదనడం ఎంతవరకు సమంజసమని తమ్మినేని టీడీపీని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదు అని కొందరు వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అని అయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయంటూ కొందరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమ్మినేని అన్నారు. అసలు సెలక్ట్ కమిటీనే ఏర్పాటు చేయనప్పుడు ఆ బిల్లులు పెండింగ్‌లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే ఓటింగ్ కచ్చితంగా జరగాలని, కానీ అలా జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. అసలు సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు అడగలేదని తమ్మినేని నిలదీశారు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేస్తామని వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రగతి భవన్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. "ముఖ్యమంత్రి మేలుకో ప్రజల ప్రాణాలు కాపాడు బతుకుదెరువు నిలబెట్టు" అనే నినాదంతో ప్రగతి భవన్ వద్ద నల్ల బెలూన్లతో నిరసనకు పిలునిచ్చిన ప్రొఫెసర్ కోదండరాం ను ప్రగతి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రొఫెసర్ కోదండరాం తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , pow నేత సంధ్యతో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసి వేరు వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.    ఐతే మీడియాతో మాట్లాదిన ప్రొఫెసర్ కోదండరాం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, త్వరలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలియజేస్తామని అయన కెసిఆర్ ను హెచ్చరించారు. అమెరికాలో వైట్ హౌస్ ముందు కూడా నిరసన తెలియజేసే పరిస్థితి ఉందని, కానీ తెలంగాణాలో ఆపరిస్థితి లేదని అయన అన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్.. మళ్లీ అరెస్ట్ తప్పదా?

కడప జైలు నుంచి బెయిల్ పై నిన్న విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలకు మరో షాక్ తగిలింది. కడప సెంట్రల్ జైలు వద్ద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు 31 మంది టీడీపీ కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు.   జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జైలు నుంచి భారీ వాహనాల నడుమ తాడిపత్రికి బయల్దేరారు. అయితే, కోవిడ్ కారణంగా వాహన శ్రేణికి పోలీసులు అనుమతించలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు మరో 31 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు, పోలీసులతో వాగ్వాదానికి దిగడంపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.    కాగా, అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆయనపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యే బామ్మర్ది అక్రమ తవ్వకాలు.. జేబుల్లోకి కోట్లు, జరిమానా లక్షలు!!

'వడ్డించే వాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చున్నా పరవాలేదు' అన్నట్టుగా 'అధికారంలో ఉన్నది మన పార్టీ అయితే.. ఎలాగైనా సొమ్ము చేసుకోవచ్చు' అని కొందరు ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు రుజువు చేస్తున్నారు.   మైలవరం నియోజకవర్గ పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కోసం లోతట్టు భూములు కొన్నారు. అయితే, వాటిని మెరక చేయాలన్న సాకుతో ఎమ్మెల్యే బామ్మర్ది.. ఎలాంటి అనుమతులు లేకుండానే దేవదాయ భూములు, అటవీశాఖ పరిధిలోని కొండలను నెల రోజులుగా తవ్వేస్తున్నారట. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి షాబాదలో ఇప్పటికే కోట్ల విలువచేసే అక్రమ తవ్వకాలు జరిగాయని సమాచారం. అలాగే, కొండపల్లి అటవీ భూముల్లో ఉన్న కొండల్ని తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కొండపల్లి కపిలవాయి సత్రం దేవాలయ భూముల్లోనూ ఎటువంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారట.    తవ్వకాలపై స్థానికులెవరైనా ప్రశ్నిస్తే.. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లకు మట్టి అవసరమని, అందుకు మట్టిని తరలించాల్సి ఉందని ఎమ్మెల్యే బామ్మర్ది నమ్మబలుకుతున్నారట. గట్టిగా ఎవరైనా నిలదీస్తే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తోంది.   అటవీ భూముల్లో మట్టిని ఉచితంగా తరలించి ప్రభుత్వం నుంచి డబ్బును కాజేయడంతో పాటు తవ్విన గ్రావెల్‌ను బయట అమ్ముకుని కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపినిస్తున్నాయి. అటవీ భూమిలోని మట్టిని తరలించడంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదట. చివరికి ఎమ్మెల్యే బామ్మర్ది ఆగడాలపై సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచే ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు జరిమానా విధించారని సమాచారం.    కొండపల్లి అటవీ క్వారీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అటవీశాఖ, విజిలెన్స్‌ అధికారులు ఇటీవల దాడులు చేసి, అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల పైచిలుకు గ్రావెల్‌ ను తరలించారని అంచనా. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు కేవలం రూ.10 లక్షల జరిమానాతో సరిపెట్టారు. అటవీశాఖ చట్టం ప్రకారం అక్రమంగా తవ్వేసిన గ్రావెల్‌ విలువకు ఐదురెట్ల వరకు జరిమానా విధించవచ్చు.. కానీ అధికారులు రూ.10 లక్షలతో సరిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధ్వానంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది!

ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ చెల్లింపులు ఆలస్యమవ్వడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.   "ఈ నెల పెన్షన్ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, బడ్జెట్లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒకరోజు అటు ఇటు గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక వారం పెన్షన్ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అర్ధాన్నం గా ఉన్నది అర్థమవుతున్నది." అని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.   "ఆదాయానికి పొంతన లేని వ్యయంతో ముందుకు పోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇటువంటి భంగపాటు తప్పదు. ఒక నాలుగు రోజులు ముందా వెనక అంతే." అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. కాగా, ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజధాని మార్పు అంశంపై స్పందించిన ఆయన.. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదన్నారు.   ప్రస్తుతం ఐవైఆర్ కృష్ణారావు, రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమయానికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేని ప్రభుత్వం.. అసలు మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తుంది? ముందు ముందు రాష్ట్రాన్ని ఎలా నడుపుతుంది? పథకాలను ఎలా అమలు చేస్తుంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ దుర్గమ్మ గుడిలో కరోనాతో అర్చకుడి మృతి

దేశ వ్యాప్తంగా సామాన్యులను విఐపిలను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని పలువురు అర్చకులు, సిబ్బందికి కరోనా రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ కనకదుర్గ గుడి ఆలయంలోని సిబ్బంది, ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దుర్గ గుడి ఈవో సురేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా ఆలయంలో మరో 18 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఐతే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా కారణంగా నిన్న కన్ను మూశారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ప్రస్తుతం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.   ఇది ఇలా ఉండగా కరోనా కారణంగా నిన్న టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కన్నుమూయడంతో తిరుమలలోని అర్చకులు విషాదంలో మునిగిపోయారు. దీంతో విధులు నిర్వహించేందుకు అర్చకుల్లో చాలామంది జంకుతున్నారు. శ్రీనివాసాచార్యులు చనిపోయారనే సంగతి తెలిసిన వెంటనే పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమయ్యారు. తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో ఈ విషయం పై అర్చకుల చర్చలు జరిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కళ్యాణోత్సవ సేవను ఈ నెల 31వరకు నిలిపి వేయాలని అర్చకుల ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.

అలా చేస్తే జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్ట్ అయ్యి కడప జైల్లో ఉన్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జైలులో కూడా కక్ష సాధింపు తీరుతోనే వ్యవహరించారని ఆరోపించారు. తనకు ఆహారం కూడా ఇవ్వకుండా జైలు అధికారులపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.    అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలని అన్నారు. తమను ఏజెంట్లు మోసం చేశారన్న ఆయన.. ఇంజిన్, చాయిస్ నెంబర్లు కొడితే వాహనం వివరాలు మొత్తం వస్తాయని.. తమ సంతకాలు ఉంటే ఉరి వేయమన్నానని గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.   రాజకీయాలు చేయాలనకునేవారు ఏదైనా చేస్తారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ తనను అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైల్లో ఉన్నానని, ఇప్పుడు 54 రోజులు జైల్లో ఉంచారన్నారు. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదన్నారు. అలాగే జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ర్యాలీలో తాను పోలీసులతో దురుసుగా ప్రవర్తించాననడం దారుణమన్నారు.   టీడీపీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాము విభజన తర్వాత కాంగ్రెస్ ద్రోహం చేయడంతో టీడీపీలోకి వచ్చామని,  టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎవరో ఏదో అనుకుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీ మారే ఆలోచన లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.   కాగా, మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను సీఎం జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

రవివర్మ చిత్రాలకు ప్రేరణ ఆమె

అంజనీబాయి మాల్పెకర్ (22 ఏప్రిల్ 1883 - 7 ఆగస్టు 1974) రవివర్మ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మరి ఆయన చిత్రాల్లో కనిపించి ముగ్ధమనోహర సౌందర్యవతి నిజంగానే ఈ భూమి మీద ఉందా లేదా ఊహసుందరినా అన్న అనుమానం చాలామందికి వస్తుంది. అయితే అంజనీ బాయి మాల్పెకర్ ను చూసిన వారు ఆమె రవివర్మ చిత్రాలకు నమూన అని అంటారు.   సంగీత కళాకారిణిగానే ఎక్కువ మందికి తెలిసిన ఆమె రవివర్మ  కుంచెతో ప్రాణం పోసుకున్న  లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని" ,"ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు ప్రేరణ అని అతి తక్కువ మందికి తెలుసు.  పండిత్ అంజనీ బాయి మాల్పెకర్ ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. హిందూస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలిలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత విధ్యాంసుడు  ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. గోవాలోని మాల్పేలో 22 ఏప్రిల్ 1883లో కొంకణి భాష మాట్లాడే గోవా సంగీత కారుల  కుటుంబంలో  అంజనీ జన్మించారు. ఆమె తాత గుజాబాయి,  తల్లి నబుబాయిలు  సంగీత  ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినవారు. తన 8వ ఏట ఉస్తాద్ నజీర్ ఖాన్ వద్ద భెండి బజార్ గరానా శైలిలో సంగీత శిక్షణ తీసుకున్నారు. గురువుతో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్న మొదటి మహిళగా ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఎనిమిదేండ్ల పాటు కఠోన సంగీత సాధన చేసిన ఆమె 1899లో తన 16వ ఏట ముంబైలో మొదటిసారి కచేరి చేశారు. అప్పటికి మహిళలు ప్రదర్శనలు ఇచ్చేవారు కాదు. కానీ అంజనీ మాత్రం  తన కచేరీల ద్వారా ఎంతో గౌరవం సాధించుకుంది.     1920 వరకు ఆమె సంగీత కెరీర్ చాలా బాగా సాగింది. అయితే ఆమె గురువు చనిపోవడంతో  ప్రజా ప్రదర్శనలకు దూరమైంది. అందమైన ఆమె రూపం కూడా ప్రదర్శనలకు దూరం కావడానికి ఒక కారణం. కచేరిలో  కొందరు ప్రేక్షకుల నుంచి వచ్చే వేధింపులు ఆమెను బాధించేవి.  దాంతో ఆమె కచేరిలు ఆపేసి 1923 నుంచి పూర్తిగా సంగీత శిక్షణకే సమయం కేటాయించేవారు. ఆమె వద్ద సంగీతం నేర్చుకున్న కుమార్ గాంధర్వ, కిషోర్ అమోంకర్ ప్రసిద్ధ సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు.  అద్భుతమైన గాత్రంతో పాటు అపూర్వమైన అందం ఆమె సొంతం. ప్రముఖ చిత్రకారుడు ఎం.వి. ధురంధర్ ఆమె చిత్రాన్ని గీసినప్పుడు రవివర్మ చూసి అబ్బురపడ్డారట. తమ చిత్రాలు ఆమెను ప్రేరణగా తీసుకున్నారు. "లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని",  "ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు అంజనీ ప్రేరణగా నిలిచారు.

ఢిల్లీలో కూర్చుని ఏపీ తలరాతను శాసిస్తున్న తెలుగు బీజేపీ నేత..!

ఢిల్లీ నుండి కథ నడిపించే ఆ బీజేపీ నాయకుడు మన తెలుగువాడే. కానీ రాష్ట్రంలో కనిపించేది తక్కువే కానీ టీవీ డిబేట్లలో మాత్రం ప్రముఖంగా కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకులు ఏపీకి అనుకూలంగా ఏదైనా మాట్లాడగానే టీవీ స్క్రీన్ల పైన ఢిల్లీ నుండి ప్రత్యక్షం అవుతారు. అబ్బే ఆ నాయకులు తొందర పడ్డారు, వారి వ్యాఖ్యలతో అసలు పార్టీకి సంబంధం లేదు అని ఖండించి పారేస్తారు. ఢిల్లీ స్థాయిలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం పట్టించుకోరు సరికదా.. ఎక్కడైనా కూసింత మేలు జరుగుతుందంటే వెంటనే వాలిపోయి దానిని కూడా చెడకొట్టడం అయన స్పెషాలిటీ.   ఒక రకంగా ఢిల్లీలో ఏపీ బీజేపీకి ఆయనే వాయిస్ అన్నంతగా బిల్డప్ ఇస్తారు. కాని ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిలా వ్యవహారం చేసేస్తూ ఉంటారు. ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా ఉండగా ఆయనను సాగనంపే వరకు నిద్రపోలేదని పార్టీ వర్గాలే చెపుతాయి. అంతే కాకుండా సీఎం జగన్ కు కొంత అనుకూలంగా ఉంటారనే పేరున్న సోము వీర్రాజును ఆయనే తెచ్చి పెట్టారని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ అధికార ప్రతినిధులను, మీడియాలో చర్చలకు హాజరయ్యేవారిని అయన తన కనుసన్నలలో శాసిస్తున్నారని కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది బడా నాయకుల పై ఆయనకు గుర్రుగా ఉన్నా ప్రస్తుతం ఏమీ చేయలేక ఆగిపోయారు కాని లేదంటే వాళ్లకు కూడా చుక్కలు చూపించేవారని తెలుస్తోంది.   ఏపీలోని గత ప్రభుత్వం పై ప్రతి రోజు ఉన్నవి లేనివి కూడా చెప్పి ఆ విధంగా అలుపెరుగని పోరాటం చేసి టీడీపీ అడ్రస్ గల్లంతు చేసిన ఈయన ప్రస్తుతం సొంత పార్టీ నేతల మీదే విరుచుకు పడుతున్నారు. కొంతమంది రాష్ట్ర బిజెపి నేతలు పార్టీ ప్రతిష్టను బజారున పడేస్తున్నారని నానా యాగీ చేస్తున్న అయన నిజంగా ఏపీ బీజేపీ అభివృద్ధి కోరుకుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చ పెట్టి వారి పై చర్య తీసుకోవాలి గానీ ఇలా బయటకు వచ్చి సొంత పార్టీ నేతల పై విరుచుకు పడితే పార్టీ ప్రతిష్ట ఏమౌతుందో పాపం అయన ఆలోచిస్తున్నట్టు లేదు. అసలు రాష్ట్ర ప్రజలకు ఏదైనా కూసింత మంచి చేస్తే ఆయనను, అయన పార్టీని కూడా గుర్తించి ప్రజలు గౌరవిస్తారు. ఐతే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తే ప్రజల మనస్సులో వేరే విధంగా గుర్తుండి పోయే అవకాశం ఉందని తెలుసుకోలేనంత అమాయకుడు మాత్రం కాదు. తాజాగా రాజధాని బిల్లులు న్యాయపరీక్షకు నిలబడవని గొప్ప గొప్ప న్యాయ నిపుణులు వాదిస్తుంటే.. అబ్బే అవేవీ నిజం కాదని ముందుగానే తేల్చేసిన మహానునుభావుడు ఈయన.   తాజాగా టీవీ డిబేట్లలోపాల్గొంటున్న కొంతమంది బీజేపీ ప్రతినిధుల పై అయన తన ప్రతాపం చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీవీ చర్చలలో ఎవరైనా న్యాయం వైపు మాట్లాడితే చాలు వారికీ షోకాజ్ నోటీసులు ఇప్పించడంతో అయన హింస భరించలేక కొంత మంది బీజేపీని కూడా వీడడం జరిగింది. మొత్తంగా ఏపీని అభివృద్ధి చెందనీయకుండా అడ్డగోలుగా వాదించటం అలవాటైన ఆ నేత అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని కూడా నాశనం చేసే పనిలో ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.