వైజాగ్ నే... జగన్ ఎందుకు ఎంచుకున్నారు? జగన్ మాటల్లోనే...
విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పరిపాలనా రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానే. ఎక్కడ్నుంచి పరిపాలన జరుగుతుందో అదే ఆ రాష్ట్ర రాజధాని అవుతుంది. అంటే, పేరుకు మూడు రాజధానులు అంటున్నా... ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం విశాఖే అవుతుంది. అయితే, విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు. కుటుంబం కోసం ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో... ప్రభుత్వ పెద్దగా తాను అలాగే ఆలోచించి విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశానన్నారు. ఏ రాజధానిలోనైనా కనీస మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని... అయితే, లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తేనే గానీ... అమరావతిలో మౌలిక సౌకర్యాలు కల్పించడం సాధ్యంకాదన్నారు. అదే, ఆ లక్ష కోట్లలో 10శాతం ఖర్చుచేస్తే చాలు... వైజాగ్ను హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన నిలబెట్టొచ్చంటూ తనకున్న విజన్ ను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఇప్పటికే నెంబర్వన్ సిటీ అని, అలాగే విశాఖలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కనీస మౌలిక వసతులైన రోడ్స్, వాటర్, పవర్, డ్రైన్స్, రైల్వే... ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నారు. ఇప్పుడున్న మౌలిక వసతులకు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఐదేళ్లలో లేదా పదేళ్లలో కచ్చితంగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన వైజాగ్ నిలబడుతుందని, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ వైజాగ్ పై తనకున్న అంచనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, లక్ష కోట్లు ఖర్చు చేసినా అమరావతిలో కనీస మౌలిక వసతులు కల్పించలేమని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలుకొట్టారు. విశాఖ కాకుండా... మరెక్కడ రాజధానిని ఏర్పాటు చేసినా అభివృద్ధి చేయలేమన్నారు. అదే, లక్ష కోట్లలో కేవలం పదిశాతం ఖర్చు చేస్తేచాలు విశాఖను... పదే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సరసన నిలబెట్టవచ్చని చెబుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టింది కడప జిల్లా పులివెందులలోనే అయినా... పెరిగింది, చదువుకుంది మాత్రం హైదరాబాద్లోనే.... దాదాపు జగన్ బాల్యమంతా భాగ్యనగరంలో నడిచింది... డిగ్రీ వరకు చదువు కూడా హైదరాబాద్లో సాగింది.... దాంతో, హైదరాబాద్లో పరిస్థితులు, అభివృద్ధి జరిగిన తీరు... ఇలా, అన్నింటిపై పూర్తి అవగాహన జగన్ కు ఉంది. ముఖ్యంగా పాతిక ముప్పై ఏళ్లలో హైదరాబాద్ ఏవిధంగా ట్రాన్స్ ఫామ్ అయ్యిందో ...స్వయంగా చూసిన వ్యక్తి జగన్. అంతేకాదు, ఐటీ రంగంలో హైదరాబాద్ ఎదిగిన విధానం తెలిసిన వ్యక్తి... అలాగే, మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో... పారిశ్రామికంగా ఏవిధంగా డెవలప్ అయ్యిందో.... ఉద్యోగాల కల్పనకు కల్పతరువుగా ఎలా మారిందో... అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి.... ఆ స్థాయిలో వైజాగ్ను అభివృద్ధి చేయడానికి పకడ్బందీ ప్రణాళితో ముందుకెళ్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. వైజాగ్ను ఏవిధంగా డెవలప్ చేస్తే... ఐదు లేదా పదేళ్లలో హైదరాబాద్ను అందుకుంటుందో... ఆవిధమైన వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నట్లుగా జగన్ మాటలను బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది.
ఇక, రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన జగన్మోహన్రెడ్డికి.... ఆ నగరం గురించి కూడా బాగా తెలుసు. బెంగళూరు ఎలా అభివృద్ధి చెందిందో... బెంగళూరుకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో జగన్కు పూర్తి అవగాహన ఉంది... ముఖ్యంగా బెంగళూరు అభివృద్ధిలో ఐటీ రంగానిదే ప్రధాన పాత్ర.... దేశంలోనే అత్యధిక ఐటీ కంపెనీలు బెంగళూరులోనే ఉన్నాయి... అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఐటీ కంపెలన్నీ బెంగళూరులోనే కొలువుదీరాయి.... ఏ విదేశీ కంపెనీ ఇండియా వచ్చినా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరే అవుతుంది.... అందుకే, బెంగళూరును ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది....అంతేకాదు, యువత ఉద్యోగాల కోసమే మొదట చూసే నగరం బెంగళూరే... అయితే, వైజాగ్ను బెంగళూరు స్థాయికి తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి... ఐటీని ఆ స్థాయిలో ప్రోత్సహించే అవకాశం కనిపిస్తోంది.... అలాగే, మోస్ట్ లవబుల్ సిటీగా బెంగళూరుకు పేరుంది.... ముఖ్యంగా బెంగళూరు ప్లాన్డ్ సిటీ అంటారు.... ఎందుకంటే, బెస్ట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ బెంగళూరు సొంతం.... అన్నింటికీ మించి బెంగళూరులో బ్యూటీఫుల్ వెదర్ ఉంటుంది... అందుకే, బెంగళూరును లండన్ సిటీతో పోల్చుతారు.... అంతేకాదు, చెన్నై, ముంబై మాదిరిగా బీచ్లు లేకపోయినా... ప్రతి వీధి చివరన కచ్చితంగా ఒక పార్కు తప్పనిసరిగా ఉంటుంది... వీటన్నింటినీ మించి పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ బెంగళూరు సిటీ సొంతం... ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి.... కనీసం ఐదేళ్లు.... మాగ్జిమం పదేళ్లలో బెంగళూరు స్థాయికి వైజాగ్ను తీసుకొస్తామంటూ అందుకే చెప్పినట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్, బెంగళూరులాగానే ఆంధ్రప్రదేశ్కు సమీపంలో ఉండే మెట్రో సిటీ చెన్నై.... అందుకే, జగన్మోహన్ రెడ్డి.... తన స్పీచ్లో చెన్నైను కూడా ప్రస్తావించారు... వైజాగ్ మాదిరిగా సీ కోస్ట్ ఉండే చెన్నై నగరం... దేశంలోనే టాప్ మోస్ట్ ఫైవ్ సిటీస్లో ఒకటిగా ఎదిగింది.... ముఖ్యంగా పారిశ్రామికరంగంలో చెన్నై ముందు కనిపిస్తుంది... దేశ విదేశీ కంపెనీలెన్నో చెన్నైలో కొలువుదీరాయి.... అయితే, చెన్నై నగరం గురించి క్షుణ్ణంగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి.... విశాఖను ఆ స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చారు... కేవలం ఐదారేళ్లలోనే చెన్నై స్థాయికి విశాఖను తీసుకురావొచ్చని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్లో నెంబర్వన్ సిటీగా ఉన్న విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా అభివృద్ధి చేస్తే అతి తక్కువ కాలంలోనే దేశంలోనే టాప్ ఫైవ్ మెట్రో సిటీస్లో ఒక్కటిగా అవతరించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి... ఎందుకంటే, సహజ వనరులతో దేశంలో ఏ నగరానికీ లేని ఎన్నో పాజిటివ్ పాయింట్స్ విశాఖలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఒకటి కాదు... రెండు కాదు... వందలకొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం.... ముఖ్యంగా విశాఖకు మెయిన్ అస్సెట్... సీ కోస్ట్.... సముద్ర తీరం వెంబడి మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్లో సహజసిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి.... అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ.... అలాగే, దేశంలోనే అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్.... అంతేకాదు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది....భారత నౌకాదళ తూర్పు ప్రధాన స్థావరం విశాఖలో ఉంది.... ఇక, సుందరమైన సముద్ర తీరం... ఆహ్లాదకరమైన వాతావరణం... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... ఇలా చెప్పుకుంటూ పోతే.... ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్కి ఉన్నాయి....
ఆంధ్రా విశ్వ విద్యాలయం, నేషనల్ లా యూనివర్శిటీ, గీతం విశ్వ విద్యాలయం, ఇండియన్ మారిటైం వర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ లాంటి విద్యాసంస్థలన్నీ విశాఖలో కొలువుదీరాయి. అలాగే కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, నేషనల్ సైంటిఫిక్ టెక్నాలజీ లేబోరేటరీ, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి ఎన్నో పరిశోధనా సంస్థలు వైజాగ్ లో ఉన్నాయి. ఇక, వైద్యరంగంలోనూ విశాఖ మెరుగైన స్థితిలోనే ఉంది. మోస్ట్ అడ్వాన్స్డ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కింగ్ జార్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ మొదలుకొని విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టాటా కేన్సర్ ఇనిస్టిట్యూట్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, కేర్, అపోలో లాంటి ఎన్నో టాప్ హాస్పిటల్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గీతం మెడికల్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్, ఎన్నారై మెడికల్ కాలేజ్... ఇలా ఎన్నో మల్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విశాఖలో కొలువుదీరాయి.
ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా కూడా విశాఖ అభివృద్ధి చెందింది. విశాఖలో ఎన్నో భారీ పరిశ్రమలు, ఆర్ధిక మండళ్లు (సెజ్ లు) కొలువుదీరాయి. విశాఖపట్నం ప్రత్యేక ఆర్ధిక మండలి(దువ్వాడ), ఏపీఐఐసీ బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్ధిక మండలి(అచ్చుతాపురం), ఐటీ సెజ్లు (రుషికొండ హిల్-1, రుషికొండ హిల్-3, గంభీరం), జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ రాంకీ ఫార్మా సిటీ, అన్ రాక్ అల్యూమినియం(మాకవరపాలెం), దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, హెటెరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నక్కపల్లి), జేఎస్డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (ఎస్.కోట), దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఫిన్ టెక్ వ్యాలీ, మెడిటెక్ జోన్ లాంటివి ఇఫ్పటికే నెలకొల్పబడ్డాయి.
ఇక, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా భారీగానే ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (చమురు శుద్ధి కర్మాగారం), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం ఉక్కు కర్మాగారం), హిందుస్థాన్ జింక్ స్మెల్టర్, భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (హెవీ వెస్సెల్స్ ప్లాంట్), హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, నావెల్ డాక్ యార్డ్, కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, డ్రెడ్గింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, హిందుస్థాన్ పాలిమర్స్, ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వరంగ సంస్థలు విశాఖలో ఉన్నాయి.
క్రీడారంగంలోనూ మంచి స్థానంలో విశాఖ కనిపిస్తుంది. వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియంతోపాటు ఇంకా అనేక స్టేడియాలు విశాఖలో ఉన్నాయి. అయితే, పైన చెప్పినవన్నీ కొన్ని మాత్రమే... పర్యాటకం, పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే... ఏ విభాగంలోనూ విశాఖ దేనికీ తీసుపోదు. అందుకే, వైజాగ్ ను జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారని ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏమీ లేని చోట లక్షకోట్లు ఖర్చు పెట్టి.. ఒక కృత్రిమ నగరాన్ని నిర్మించడం కన్నా.. అన్ని వసతులు ఉన్న నగరానికి కాస్త ఊతమిచ్చి అందమైన రాజధానిగా రూపు దిద్దుకోవచ్చని పెట్టుబడులకు విశాఖ అనుకూలమైన నగరమనీ జగన్ అంటున్నారు. హైదరాబాద్ లా విశాఖ కూడా మినీ ఇండియాను తలపిస్తుంది. అక్కడా పరిశ్రమల విస్తరణ కారణంగా పొరుగు రాష్ట్రాల వారూ వలస వచ్చారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధానికోసం పునాదుల నుంచి నిర్మించి అప్పుల పాలవడం కన్నా... అందులో పదిశాతం ఖర్చుచేసి అందుబాటులో ఉన్న వాటితో అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చని జగన్ అంటున్నారు.