తెలంగాణలో 20 వేల కోట్ల పెట్టుబడి! అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లు

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ఈ  అవైలబిలిటీ జోన్లలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపిన కంపెనీ, ఇవన్నీ ఒకటే రీజియన్ లో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పని చేస్తుందని తెలిపింది. దీంతో  విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందని వెల్లడించింది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న ఏషియా పసిఫిక్ హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 ప్రథమార్థంలో  తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.    అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు అంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ మరియు ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు మరియు విద్య మరియు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసులను నడుపుకునెందుకు వీలు కలుగుతుంది. భారీ ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి మరియు ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.    అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రం లోకి రావడం పట్ల పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కేటీఆర్   హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటన లో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటన లో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.  అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్  చెప్పారు.    అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలనకు నిదర్శనమన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటి మరియు ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ వస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ విధానాల ద్వారా ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

కరోనా కట్టడికి క్రూరమైన చట్టాలు! కేరళ సర్కార్ పై విమర్శలు

కేరళలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నియంత్రణకు కఠిన చట్టాలను ప్రయోగిస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. అందులో కొన్ని క్రూరమైన చట్టాలు కూడా ఉన్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144తో పాటు, సెక్షన్ 151, 149 తదితరాలను విధించింది. ప్రజలు గుమికూడటాన్ని, ఏదైనా కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరు కావడాన్ని అడ్డుకునేందుకే ఈ చట్టాలను ప్రయోగిస్తున్నట్టు కేరళ  ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కట్టడి కోసమే ఈ చట్టాలను అమలు చేయాల్సి వస్తోందని సీఎం విజయన్ ప్రకటించారు.    సెక్షన్ 151, 149 అమలులో ఉన్నప్పుడు పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే, మెజిస్ట్రేట్ అనుమతి లేదా వారంట్ లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఆపై వారిని ఒక రోజు కస్టడీలో ఉంచవచ్చు. అవసరమైతే, దాన్ని పొడిగించవచ్చు. సెక్షన్ 144 అమలులో ఉంటే, ముగ్గురి కన్నా అధికంగా ఒక ప్రాంతంలో గుమికూడరాదు. ఈ చట్టాలు అమలులో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తే, గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్లను అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఎక్కువగా వినియోగిస్తుంటారు.                    అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే చట్టాలను ఇప్పుడు కేరళ రాష్ట్రమంతా ప్రయోగించడం వివాదమవుతోంది.  కేరళ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నివారణకు ఈ సెక్షన్ల ప్రయోగం అవసరం లేదని నారు భావిస్తున్నారు. ఈ చట్టాల అమలు సమయంలో తమ అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రజల స్వేచ్ఛ హరిస్తుందని అంటున్నారు.  కరోనాను అడ్డుకునేందుకు ఇటువంటి కఠిన చట్టాలు అవసరమా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీజేపీ కార్యకర్త మృతి.. అంతిమ యాత్రలో పాల్గొననున్న బండి సంజయ్

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంలో జరిగిన ఘటనలలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నవంబర్‌1న హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌ ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ స్వస్థలం ఐన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, తుమ్మలోనిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్ది సేపట్లో శ్రీనివాస్‌యాదవ్ అంతిమయాత్ర జరగనుంది. శ్రీనివాస్ మృతి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం తనన్నెంతగానో బాధిస్తోందని అన్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ అంతిమయాత్రలో బండి సంజయ్‌ స్వయంగా పాల్గొననున్నారు. శ్రీనివాస్‌యాదవ్ కాలిన గాయాలతో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భారీ భద్రత మధ్య ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి చేశారు.   నవంబర్‌1 ఆదివారం శ్రీనివాస్‌ యాదవ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అదే రోజు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే శరీరం 60 శాతంపైగా కాలిపోవడంతో శ్రీనివాస్‌ కోలుకోవడం కష్టమైంది. అతనిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

చిరు బీజేపీలో చేరుతారని ప్రచారం! పాస్ మార్కుల కోసం సోము టీమ్ మాస్టర్ ప్లాన్?

నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి. సోము వీర్రాజు పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ ఉనికే కనిపించకుండా పోయింది. పార్టీ బలోపేతం చేస్తానంటూ బీరాలు పలికిన వీర్రాజు.. కొన్ని రోజులు బయటికే రాలేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నా కమలం నేత పట్టించుకోలేదు. దీంతో ఏపీలో పువ్వు పార్టీ పురోగతి ప్రశ్నార్దమయిందనే ప్రచారం జరిగింది. పైపెచ్చు పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించాల్సింది పోయి ఉన్న నేతలను సాగనంపారు సోము వీర్రాజు. దీంతో ఆయన సోము వీర్రాజు కాదు సస్పెండ్ల వీర్రాజు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలాయి. మొత్తంగా పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో  సోము వీర్రాజు  నేతృత్వంలో  ఏపీ బీజేపీ హోం క్వారంటైన్ లోకి వెళ్లిందనే చర్చ  జనాల్లో జోరుగా  జరిగింది.    తనపై వస్తున్న విమర్శలు, పార్టీ పరిస్థితిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలియడంతోనే ఏమో సదరు సోము వీర్రాజు కొత్త డ్రామాకు తెర తీశారని తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి చేరుతున్నారన్న ప్రచారం. కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ నేతలు చిరంజీవి త్వరలోనే కమలం గూటికి చేరుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే దీని వెనక సోము వీర్రాజు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సోము  డైరెక్షన్ లోనే ఆయన వర్గం నేతలు ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారంతో ఏపీలో బీజేపీ బలోపేతం కోసం సోము వీర్రాజు బాగా కష్టపడుతున్నారని, పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని హైకమాండ్ భావిస్తుందని వీర్రాజు వర్గీయుల భావనంగా ఉందని చెబుతున్నారు. దీంతో సోముకు పార్టీ పెద్దల నుంచి ప్లస్ మార్కులు పడతాయని వారి ఆశలట. కొందరు కమలం నేతలు కూడా అఫ్ ది రికార్డుగా ఇదే విషయం చెబుతున్నారు.    ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని రోజులకే హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిశారు సోము వీర్రాజు. తనకు సహకరించాలని చిరంజీవిని సోము వీర్రాజు కోరారని..  జనసేనాని పవన్‌‌కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారని అప్పడు ప్రచారం జరిగింది. చిరంజీవిని బీజేపీలోకి రావాలని వీర్రాజు ఆహ్వానించినట్లు కూడా మరో చర్చ జరిగింది. అయితే చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని సోము వీర్రాజే సమావేశం తర్వాత క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని వీర్రాజు చెప్పారు. చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని కూడా చెప్పారు సోము వీర్రాజు.   గతంలో హైదరాబాద్ లో చిరంజీవిని సోము వీర్రాజు కలిసిన ఫోటోలను వాడుకుంటూ ఇప్పుడు కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ అనుచరులు. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ ఫోకస్ చేసిందని, సినీ తారలను పార్టీలోకి ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఆ ఆపరేషన్ లో భాగంగానే కాంగ్రెస్ లో నుంచి సినీ నటి కుష్బూ బీజేపీలో చేరిందని చెబుతున్నారు. తమిళనాడుపై ఫోకస్ చేసిన మోడీ టీమ్.. అధికారమే లక్ష్యంగా గురుమూర్తి ద్వారా రజినీ కాంత్ కు  ఒక ప్రతిపాదన పంపినట్లుగా బలంగా వినబడుతోంది.  సోము వీర్రాజు మనుషులు కర్ణాటక, తమిళనాడు పరిణామాలను సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేస్తున్నారు. రజనీకాంత్, కుష్బూ బాటలోనే చిరంజీవి కూడా త్వరలోనే కమలం కండువా కప్పుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతోంది సోము వీర్రాజు వర్గం.    అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇప్పుడు షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి అసలు ఆలోచించడం లేదని తెలుస్తోంది. గతంలో పార్టీ పెట్టిన చిరంజీవి అధికారంలోకి రాలేకపోయారు. ఆ తరువాత పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని  నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినీ లోకంలోకి వచ్చారు. గతంలో తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని మళ్లీ ఉన్న పేరు తెచ్చుకోవటానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయాలకు రావడం అసాధ్యమంటున్నారు మెగాస్టార్ అభిమానులు.    మరోవైపు సొంత తమ్ముడు జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళుతున్నారు. గత ఎన్నికలలో పవన్‍ ఓడిపోయినా.. ప్రజలలో ఆయనకు ఆదరణ తగ్గలేదని.. ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలలో వెల్లడైంది. అంతే కాకుండా బిజెపితో పవన్‍ కళ్యాణ్‍ పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో  చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు ఆలోచిస్తే జనసేనతో ఉంటారు కాని తమ్ముడి పార్టీ ఉండగా మరో పార్టీలోకి ఎందుకు వెళతారనే బేసిక్ ప్రశ్న సామాన్య ప్రజల నుంచే వస్తోంది. ఒకవేళ సోము వీర్రాజు చెబుతున్నట్లు బీజేపీ పట్ల చిరంజీవి సానుకూలంగా ఉన్నా.. ఎలాగూ జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి జనసేనలో ఉన్నా పెద్ద తేడా ఉండదని చెబుతున్నారు. జనసేనతో ఉంటూ కమలానికి సపోర్ట్ చేయవచ్చు. ఏ రకంగా చూసినా చిరంజీవి బీజేపీలో చేరడమంటూ ఉండదని రాజకీయ అనలిస్టులు కచ్చితంగా చెబుతున్నారు.   మొత్తంగా చిరంజీవి బీజేపీలో చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనక వీర్రాజు మాస్టర్ మైండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవిని అడ్డుపెట్టుకుని తనపై వస్తున్న విమర్శల నుంచి గట్టెక్కాలని ఆయన ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును వాడుకుంటున్నారని  మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా ఆయన పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు అన్నయ్య అభిమానులు.

ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు.. ఓటమి తప్పదా..! 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి ఓట్లు లెక్కింపు కొనసా.... గుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తరువాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది. ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ తొలి దశలలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, తరువాత అనూహ్యంగా బైడెన్ పుంజుకుని లీడింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా జార్జియా విషయంలో 53 బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా వస్తే, వాటిని కూడా కలిపివేశారని ఆరోపిస్తూ, ట్రంప్ టీమ్ కోర్టును ఆశ్రయించింది. ఇటు మిచిగన్ లో కూడా ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ టీం డిమాండ్ చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల న్యాయమూర్తులూ ట్రంప్ పిటిషన్లను తోసిపుచ్చారు.   జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్, ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చుతూ.. బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. ఇక మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్ అయితే అసలు కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదని పేర్కొన్నారు.   మిచిగన్, జార్జియా కోర్టు తాజా తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్ లో బైడెన్ విజయం ఖాయమైంది. జార్జియాలో మాత్రం ప్రస్తుతానికి ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, అంతేకాకుండా కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని ట్రంప్ టీమ్ సభ్యుడు, నెవడా మాజీ అటార్నీ జనరల్ అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు తాము సైద్దమౌతున్నామని తెలిపారు.

సిట్ పై స్టే ఎత్తివేతకు సుప్రీం కోర్టు నిరాకరణ.. జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి తప్పులు జరిగి ఉంటే వాటిపై కేసులు నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు గత సెప్టెంబర్ లో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే పై జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈరోజు జరిగిన విచారణలో జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. అయితే దీనిపై ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది. అలాగే స్టే పై తదుపరి విచారణలో తాము తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో అమరావతి భూముల విషయంలో సీబీఐ దర్యాప్తు కోరామని.. ఐతే దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.   ఏపీ హైకోర్టు గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలపై స్టే విధిచింది. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించిన దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని, అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలు కూడా లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చడం దగ్గర్నుంచి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వరకు అన్నీ లోపభూయిష్టమేనని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ సిట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఫ్యాన్ గాలి లేదు.. సొంతంగా గెలిచా! జగన్ కు ఎమ్మెల్యే ఝలక్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. అది మామూలు ఝలక్ కాదు.. పార్టీ అధినేత , మెనార్కిజానికి మారుపేరుగా చెప్పుకునే సీఎం జగన్ నే ధిక్కారించాడు ఆ ఎమ్మెల్యే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు ఎవరితోనూ పని లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యేగా తాను ఫ్యాన్ గాలితో గెలవలేదని, సొంత బలంతో కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని చెప్పుకొచ్చారు. పార్టీ మారేందుకు సిద్ధమనే సంకేతమిచ్చారు. పార్టీపై ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపింది ఎవరో కాదు నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్.   గూడూరు నియోజవర్గ వైఎస్సార్‌సీపీలో చాలా కాలంగా విభేదాలున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్‍ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇటీవల అసంతృప్తి భగ్గుమంటోంది. ఎన్నికలో కష్టపడి పనిచేసి గెలిపించిన వారిని విస్మరిస్తున్నారని స్థానిక నాయకులు, కార్యకర్తలు వరప్రసాద్‍పై తిరగబడ్డారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి నిలదీశారు. ఎమ్మెల్యే మొండి వైఖరితో పార్టీ నష్టపోతుందంటూ మండల పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.ఎమ్మెల్యే ముందే నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.   సొంత పార్టీ కార్యకర్తలే తనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే వరప్రసాద్. నిరసనకు దిగన నేతలపై విరుచుకుపడ్డారు. తాను ఫ్యాన్‍ గాలితో గెలవలేదు. సొంత బలంతో కోట్లు ఖర్చు పెట్టి గెలిచానంటూ బిగ్గరగా అరిచారు వరప్రసాద్. నన్ను ప్రశ్నించే అధికారం మీకెవరికీ లేదని హెచ్చరించారు. తనను ఇబ్బంది పెడితే.. పార్టీని వీడి వేరే పార్టీలో చేరతానని స్పష్టం చేశారు గుడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. ఎమ్మెల్యే వైఖరితో అవాక్కయ్యారు వైసీపీ నేతలు.    వరప్రసాద్ 2014లో తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల సమయంలో రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి వచ్చిన బల్లి దుర్గా ప్రసాద్‌కు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వరప్రసాద్‌ను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు.  ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి  స్థానిక నేతలతో వరప్రసాద్ కు  గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాలంలో విభేదాలు తీవ్రమయ్యయి. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కుట్రలు జరుగుతున్నాయని వరప్రసాద్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దలపై అసహనంగా ఉన్న వరప్రసాద్.. ఇలా తన వాయిస్ వినిపించారని భావిస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వరప్రసాద్ సిద్ధమయ్యారని చెబుతున్నారు.    గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాన్ గాలి లేదంటూ సీఎం జగన్ పరువు తీశారని వరప్రసాద్ వ్యాఖ్యలను ఇతర పార్టీలు వైరల్ చేస్తున్నాయి. వరప్రసాద్ ఎపిసోడ్ తో వైసీపీ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వరప్రసాద్ విషయంలో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆర్నాబ్ సంగతి సరే.. మరి ఆ జర్నలిస్టుల మాటేంటి.. బీజేపీకి శివసేన సూటి ప్రశ్న

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ ఘటన పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అరెస్ట్ ను తప్పు పట్టారు. అయితే తాజాగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వ్యాఖ్యల పై మండిపడింది. ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిన అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే బీజేపీ "బ్లాక్ డే, మీడియా స్వేచ్ఛపై దాడి" అంటూ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేసింది. అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే అటు కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. మహారాష్ట్రలో ఏకంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారని శివసేన తన అధికార పత్రిక "సామ్నా"లో విమర్శించింది.   మరి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని, అదే ఉత్తరప్రదేశ్ లో ఏకంగా జర్నలిస్టులను చంపేశారని ఆ పత్రిక తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ సంఘటనలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ ఎందుకు అనలేదని శివసేన ఈ సందర్భంగా ఎద్దేవా చేసింది. అంతేకాకుండా అర్నాబ్ వల్ల ఒక అమాయక వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారని... తమకు న్యాయం చేయాలని ఆ మృతుడి భార్య డిమాండ్ చేస్తోందని సామ్నా ద్వారా శివసేన తెలిపింది. అయినా పోలీసులు వారి పని వారు చేసుకుంటున్నారని కూడా శివసేన స్పష్టం చేసింది.

సోము వీర్రాజుది వైసీపీ స్క్రిప్టు! వాస్తవాలు చెప్పాలన్న జవహర్  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ మంత్రి జవహర్. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకుని.. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా, దానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వీర్రాజుపై మండిపడ్డారు జవహర్. నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇచ్చారని స్పష్టం చేశారు.   రాజమండ్రిలో ఉదయం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబే పోలవరం కాంట్రాక్టరుగా ఉన్నారని గతంలో ఒక కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారని చెప్పారు. 48 వేల కోట్ల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని వీర్రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం ప్రైవేటు భూములుగా చూపించిందని,  గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసిందని చెప్పారు. దీంతో దేవీపట్నం మునిగిపోయిందన్నారు సోము వీర్రాజు. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్‌మెంట్లు కట్టారని, 10 కోట్లతో విజయవాడలో భారీ గెస్ట్ హౌస్ కట్టారని సోము వీర్రాజు ఆరోపించారు.

ఐదేళ్లలో 5 వేల మిస్సింగ్ కేసులు! టీఎస్ సర్కార్ వివరణ కోరిన హైకోర్టు 

తెలంగాణలో మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మిస్సింగ్ కేసులపై ప్రభుత్వ ప్రణాళిక ఏంటో చెప్పాలని కోరింది. తెలంగాణలో మైనర్ బాల బాలికల అదృశ్యం పై  హైకోర్టులో పిల్  దాఖలైంది. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారి కేసులే ఎక్కువగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటిషనర్  కోరారు.    దీనిపై స్పందించిన న్యాయస్థానం మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ, మిస్సింగ్ కేసులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షీ టీమ్, దర్పణ్ యాప్, ఆపరేషన్ ముస్కాన్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సాయంతో చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. డిసెంబరు 3 లోగా నివేదిక అందిస్తామని ఏజీ విన్నవించగా, డిసెంబరు 10కి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.                    బాలికలు మిస్సయ్యారంటూ తెలంగాణలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజుల్లోనే  ఏకంగా 203 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. గత బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో  65 మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఇందులో  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసుల వెబ్‌సైట్‌లో వెల్లడించారు.                తెలంగాణలో మిస్సింగ్ కేసులు  మిస్టరీగానే మిగిలి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్‌‌ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్‌‌ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌‌ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్‌‌ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌‌ఫర్ చేస్తున్నారు పోలీసులు.

క్రికెట్‌లో కొత్త రూల్ పెట్టాలన్న సచిన్

క్రికెట్ లో కొత్త రూల్ పెట్టాలంటున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. బ్యాట్స్ మెన్ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొనేలా రూల్ అమలు చేయాలని సూచించారు. ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొనేటప్పుడైనా లేదా స్పిన్నర్ ను ఎదుర్కొనే సమయంలోనైనా బ్యాట్స్ మెన్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకురావాలని మాస్టర్ చెబుతున్నారు. ప్రొఫెనల్ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఈ నిబంధనను పాటించాలని చెప్పాడు.    ఇటీవల క్రికెడ్ ఆడుతూ ప్లేయర్లు గాయపడుతున్నారు. బ్యాట్స్ మెన్ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ఆడుతుండటం వల్లే బౌన్సర్లు తలకు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతన్నాయి. ఈ నేపథ్యంలోనూ కొత్త రూల్ పెట్టాలని సూచిస్తున్నారు సచిన్ టెండుల్కర్. బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. బౌలర్లు విసిరే బంతులు బౌన్స్ అయి వారి ముఖాలను తీవ్రంగా గాయపరుస్తుంటాయి. స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా గాయపడిన బ్యాట్స్ మెన్లు ఉన్నారు. అందుకే ఈ రూల్ కంపల్సరి చేయాలని చెబుతున్నారు.    క్రికెట్లో ఇప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఉండగా... ఆ తర్వాత వన్డేలు, టీ20లు వచ్చాయి. ఇప్పుడు 10 ఓవర్ల లీగులకు కూడా సన్నాహకాలు చేస్తున్నారు. ఆట నిబంధనల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరో కొత్త రూల్ పెడితే మంచిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. మాస్టర్ సూచనకు ప్లేయర్ల నుంచి మద్దతు వస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం హెల్మెట్ కంపల్సరి చేయాలని పాతతరం ఆటగాళ్లు, కోచ్ లు కూడా సూచిస్తున్నారు.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ఫల్టీ! అంతా సేఫ్ 

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. వేగంగా వస్తున్న కారు  అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. దీంతో కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని సెప్టెంబర్‌ 25న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్‌ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.     దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కేబుల్‌ బ్రిడ్జిపై ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి వంతెనపై బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం, బ్రిడ్జిపై పడుకొని ఫొటోలు దిగడం చేస్తున్నారు. దీంతో ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు బ్రిడ్జ్‌పై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు లింక్ చేశారు. దీంతో ఇటీవల అర్ధరాత్రి బ్రిడ్జిపైకి చేరి షర్ట్ లేకుండా రోడ్డుపై పడుకొని ఫొటోలకు పోజులిస్తున్న పోకిరీలను కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది గుర్తించి పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్‌ సిబ్బంది బ్రిడ్జిపైకి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

దుబ్బాకలో గెలుపెవరది! హరీష్ రావు భవిష్యత్ ఏంటీ? 

తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా.. ఆ సెగ మాత్రం కంటిన్యూ అవుతూనే  ఉంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాకలో ఎవరూ గెలుస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా భిన్న అంచనాలు ప్రకటించడంతో.. దుబ్బాకలో ఎవరూ గెలుస్తారో ఎవరు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దుబ్బాకలో గెలుపెవరది అన్న అంశంతో పాటు మంత్రి హరీష్ రావు భవిష్యత్ ఏంటన్న దానిపై కూడా జోరుగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. దుబ్బాక ఫలితాన్ని భట్టే  ట్రుబుల్ షూటర్ ఫ్యూచర్ అధారపడి ఉందంటున్నారు.    దుబ్బాక ఉప ఎన్నిక కేంద్రంగా మంత్రి హరీష్ రావుపై కుట్రలు జరిగాయని, ఆయన మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీనే హరీష్ ను టార్గెట్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక బైపోల్ బాధ్యతలన్ని హరీష్ రావే చూశారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. దీంతో దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దుబ్బాకలో పార్టీ గెలిస్తే కేసీఆర్ సంక్షేమ పథకాలే కలిసివచ్చాయని చెప్పడం.. ఓడిపోతే హరీష్ రావు బాధ్యుడిని చేసేలా గులాబీలోకుట్ర జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.    గులాబీ ప్లాన్ లో భాగంగానే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసినా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ నేతలెవరు వెళ్లలేదని హరీష్ అనుచరులు చెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్నం దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని వారంతా బలంగా వాదిస్తున్నారు. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.    నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక అధికార పార్టీకి సవాల్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్మాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ తరపున ఆ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లంతా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ ముమ్మర ప్రచారం చేశారు. కాంగ్రెస్  ప్రచారానికి పీసీసీ పెద్దలంతా వచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో కేసీఆర్ తో హరీష్ రావును తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. అయినా హరీష్ కు మద్దతుగా గులాబీ ముఖ్య నేతలెవరు దుబ్బాకకు వెళ్లలేదు. దీంతో దుబ్బాకలో ఒంటరి పోరాటం చేశారు హరీష్ రావు.   పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ దుబ్బాకను సీరియస్ గా తీసుకోవాలి. కాని ఆయన మాత్రం పట్టించుకోలేదు.  డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మడలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేసిన కేటీఆర్.. ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకపోవడం ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.  పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని తెలుస్తున్నా కేటీఆర్. కవిత, ఎంపీ సంతోష్ దుబ్బాకలో ఎందుకు ప్రచారం చేయలేదన్నది రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పాలనలో మాార్పులు ఉంటాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ఇప్పటిేకే ప్రచారం ఉంది. కేటీఆర్ కు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తారని, కవితను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కు చెక్ పెట్టి ఆ ప్లేస్ ను కవితతో భర్తీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చర్చలు, ప్రచారాలకు అనుగుణంగానే దుబ్బాకలో పరిణామాలు జరిగాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.    దుబ్బాకలో ఒంటరి పోరాటం చేసిన మంత్రి హరీష్ రావు పోలింగ్ తర్వాత కొంత ఢీలా పడినట్లుగా కనిపించారు. మీడియాతో ఆయన మాట్లాడిన సమయంలోనూ ఆయన యాక్టివ్ గా లేరు. పోలింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఫేక్ ప్రచారంతో బీజేపీ నేతలు ఓటర్లను గందరగోళానికి గురి చేశారని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు.  హరీష్ రావు కామెంట్లను బట్టి పోలింగ్ అధికార పార్టీ అనుకున్నతంగా జరగలేదని తెలుస్తోంది. పార్టీ నేతల తీరుపైనా హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కొందరు నేతలు కీలక టైంలో హ్యాండిచ్చారని కూడా మంత్రి చెబుతున్నారట.    మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడమే కాక టీఆర్ఎస్ లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. దుబ్బాకలో కారు గెలిస్తే మంత్రి హరీష్ రావుకు గ్రాఫ్ మరింత పెరుగుతుందంటున్నారు. ఓడిపోతే మాత్రం ఆయనకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. అయితే హరీష్ రావు అనుచరులు మాత్రం దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హరీష్ రావు అభిమన్యుడులా వెలిగిపోతారని చెబుతున్నారు.

ఒకే ప్రైవేట్ సంస్థకు అన్ని ఇసుక రీచులు! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త ఇసుక పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. సబ్ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. దీంతో ఆ దిశగానే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.             కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీచులను అప్పగించాలని తొలుత ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ పట్ల మొగ్గు చూపకపోవడంతో... వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అన్ని రీచులను ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.

గంటకో మిస్సింగ్.. పట్టపగలే హత్యలు! తెలంగాణలో పెరిగిన క్రైమ్     

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మగాంధీ అప్పట్లో చెప్పారు. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి ఏడు దశాబ్దాలు అయినా దేశంలో పరిస్థితులు మాత్రం మారలేదు.  తెలంగాణలో అర్ధరాత్రి కాదు పట్టపగలు మగవారికే భద్రత లేకుండా పోయింది. ఇటీవలే సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో మిట్ట మధ్నాహ్నం క్లీనిక్ లో రోగులను పరీక్షస్తున్న డాక్టర్ ను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకోవడంతో ఈ  కేసు సుఖాంతమైనా.. పట్టపగలే డాక్టర్ ను ఎత్తుకెళ్లడం ప్రజల్లో భయాందోళన కల్గించింది.           తెలంగాణలో ఇటీవల హత్యలు, హత్యాచారాలు పెరిగిపోయాయి. గత నెలలోనే తమ కూతురిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో  పటాన్ చెరువు ప్రాంతంలో హేమంత్ అనే వ్యక్తిని అమ్మాయి బంధువులు దారుణంగా చంపేశారు. నమ్మించి తమతో తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు . మహబూబా బాద్ లో బాలుడిని కిడ్నాప్ చేసి చంపేసి.. తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేపింది. తర్వాత రెండు రోజులకే శామీర్ పేటలో మరో బాలుడిని కిడ్నాప్ చేసి మర్డర్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు లెక్కేలేకుండా పోయింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. గత ఏడాది హాజీపూర్ లో బయటపడిన సైకో కిల్లర్ దారుణా లను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత మేలో వరంగల్  గొర్రెకుంటలో తొమ్మిది మందిని ఒక్కడే చంపేసి బావిలో పడేసి జల సమాధి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసులో ఇటీవలే వరంగల్ జిల్లా కోర్టు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ కు ఉరిశిక్ష విధించింది.    బాలికలు మిస్సయ్యారంటూ తెలంగాణలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మిస్సింగ్‌ కేసులు భారీగా పెరిగినట్లు పోలీసుల  లెక్కలే చెబుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజుల్లోనే  ఏకంగా 203 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. గత బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో  65 మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఇందులో  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసుల వెబ్‌సైట్‌లో వెల్లడించారు.                తెలంగాణలో మిస్సింగ్ కేసులు  మిస్టరీగానే మిగిలి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్‌‌ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్‌‌ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌‌ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్‌‌ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌‌ఫర్ చేస్తున్నారు పోలీసులు.  అయితే తెలంగాణలో మైనర్ బాల బాలికల అదృశ్యం పై  హైకోర్టులో పిల్  దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. పోలీసులు క్లోజ్ చేసిన మిస్సింగ్ కేసులను  మళ్ళీ రీ ఓపెన్ చేయాలని ఆయన వాదించారు.    దిశ హత్యాచార ఘటన, దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మహిళల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సర్కార్ హడావుడి చేసింది. ఉమెన్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడంతో పాటు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తామని ప్రకటించింది. హైవే పెట్రోలింగ్ టీమ్ లను పెంచుతామని చెప్పింది. సీఎం కేసీఆర్ కూడా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయనే వార్నింగ్ ఇచ్చారు.మహిళల వంక చూడాలంటనే భయపోడిపోయేలా చేస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత ఆ ఉద్యోగులతో సమావేశమైన కేసీఆర్.. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల తర్వాత  డ్యూటీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ రూల్ ను అన్ని సంస్థలు పాటించేలా చూడాలని ప్రభుత్వ అధికారులను అదేశించారు. కాని సీఎం ప్రకటనలన్ని ప్రచారానికే పరిమితమయ్యాయి. ఎప్పటిలానే మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.   కేసుల విచారణలో పోలీసులు సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేసింది. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వచ్చాయి. కిడ్నాపర్ డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నా అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో ,  లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక శామీర్ పేటలో కిడ్నాప్ చేసి చంపేసిన అదియాన్ ఘటన విచారణలో తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యానికి సాక్షంగా నిలిచింది. బాలుడు కిడ్నాపై పది రోజులైనా పోలీసులు కేసులో పురోగతి సాధించలేకపోయారు. బాలుడిని అతడి పక్కింట్లో నివాసముండే వ్యక్తే హత్య చేసినట్లు తేలడం కలకలం రేపింది. బాలుడి కోసం గాలింపు చేశామని చెబుతున్న పోలీసులు..  పది రోజుల విచారణలో పక్కింటి వారిని ప్రశ్నించకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేసింది.    మరోవైపు నేరాల నియంత్రణలో నిత్యం బిజీ గా వున్న పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్ విసురుతున్నాయి. పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. కొందరు తమ వాళ్లు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని... మిస్సింగ్ కేసులను చేధించడంలో జాప్యానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా మిస్సింగ్ కేసులను పోలీసుల దృష్టికి తీసుకురావడం వల్ల.. తప్పిపోయిన వాళ్ల ఆచూకీని తొందరగా కనిపెట్టే అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.    శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. అయితే తాజాగా జరుగుతున్న దారుణ ఘటనలు పోలీసులకు మచ్చగా మారాయి. నేరాలను అరికట్టకపోతే పరిస్తితులు మరీ దారుణంగా తయారవుతాయని, ప్రభుత్వాలు మరింతగా పోలీస్ శాఖను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

భారత్ లో మళ్ళీ 50 వేలకు పైగా కేసులు.. సెకండ్ వేవ్ మొదలయిందా..!

మన దేశంలో చలికాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక పక్క పలు విదేశాల్లో సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో... భారత్ లోనూ ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వింటర్ సీజన్ లో భారత్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.    గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం కలిపి 50,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు మూడు వారాలుగా కరోనా కేసులు రోజుకు 40 వేల కు మించడం లేదు. అయితే తాజాగా అవి 50 వేలు నమోదవడం అటు ప్రజలలోను.. ఇటు నిపుణులలోను ఆందోళన కలిగిస్తున్నది. నిన్న నమోదైన తాజా కేసులతో కలిపి భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కు చేరకుంది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 704 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,24,315 కు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా 55,331 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,27,962 ఉన్నాయి.    మరో పక్క ఉత్తరాది రాష్ట్రాలలో చలి కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 6,842 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఇటు దక్షిణాది రాష్ట్రాలలోనూ కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేరళలో నిన్న 8,516 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 2,487 కేసులు, ఏపీ లో 2,477 కేసులు నమోదయ్యాయి.

అంబులెన్స్ ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. శభాష్ బాబ్జి అంటున్న జనం

పోలీసులంటే లాఠీ ఊపుకుంటూ జనాన్ని భయపెట్టే వాళ్ళే కాదు.. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి అండగా నిలబడేవాడు కూడా అని నిరూపించాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో బాబ్జి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న సాయంత్రం విపరీతమైన రద్దీగా ఉండే అబిడ్స్ సర్కిల్ వద్ద డ్యూటీలో ఉన్నాడు. సాయంత్రం కావడంతో పాటు కార్యాలయాలు వదిలే సమయం కూడా అవడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంది. అబిడ్స్ చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లే మార్గం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ సైరన్‌ విన్నాడు బాబ్జి. దాంట్లో ఒక రోగి ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ అంబులెన్స్ వద్దకు చేరుకుని తన వెనుకే రమ్మని డ్రైవర్‌కు చెప్పి అక్కడ అడ్డుగా ఉన్న వాహనదారులను "తప్పుకోండి.. తప్పుకోండి.." అంటూ అంబులెన్స్‌ ముందు పరుగులు తీశాడు. తన ముందున్న వాహనాలను క్లియర్‌ చేస్తూ అంబులెన్స్‌కు వెళ్లేందుకు దారి ఏర్పరిచాడు. అలా అబిడ్స్ బిగ్‌ బజార్‌ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్‌ వరకు పరుగులు తీస్తూ అంబులెన్స్ గమ్యం చేరేందుకు సహాయపడ్డాడు. అయితే ఈ దృశ్యాన్ని అంబులెన్స్‌లోని రోగి బంధువులు తమ మొబైల్ లో వీడియో తీశారు. ఆ అంబులెన్స్ లోని రోగి సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే కానిస్టేబుల్‌ బాబ్జి చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియోను రోగి బంధువులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో అటు నెటిజన్లు. ఇటు పొలిసు ఉన్నతాధికారులు కూడా బాబ్జీని అభినందిస్తున్నారు.

యూఎస్ ఎన్నికల్లో ఐదుగురు ఎన్నారైల విజయం! మూడోసారి గెలిచిన రాజా క్రిష్ణమూర్తి

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతి నేతలకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. యూఎస్ దిగువ సభ అయిన హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు నలుగురు ఇండియన్​ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్​ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్​’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్​ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్​ రాజ్​కుమార్​లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్​ డాక్టర్​ హిరాల్​ తిపిర్నేని లీడింగ్​లో ఉన్నారు.    భారత సంతతి రాజా క్రిష్ణమూర్తి డెమొక్రటిక్ పార్టీ తరఫున వరుసగా మూడోసారి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికయ్యారు. లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రీస్టన్ నెల్సన్‌పై రాజా ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రాజా ఏకంగా 71 శాతం ఓట్లు దక్కించుకోవడం విశేషం. రాజా పేరెంట్స్‌ది తమిళనాడు కాగా, ఆయన న్యూఢిల్లీలో జన్మించారు. రాజా మొదటిసారి 2016లో యూఎస్ హౌస్‌కు ఎన్నికయ్యారు.                అమెరికాలోని కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్​ అమెరికన్​ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున పోటీ చేసిన రో ఖన్నా మరో ఇండియన్​ రితేశ్​ టాండన్​ను ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నాకు 50 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. సమోసా కాకస్​లో చాలా సీనియర్​ మెంబర్​ అయిన డాక్టర్​ ఎమీ బేరా కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్​ పార్టీకి చెందిన 65 ఏళ్ల బజ్​ ప్యాటర్​సన్​ను 25 శాతం ఓట్ల తేడాతో ఆయన మట్టి కరిపించారు.   2016లో గెలిచిన ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు గెలిచి చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్​ అమెరికన్​ ఆమె. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన డేవిడ్​ ష్వూకెర్ట్​పై డెమొక్రాట్​ అభ్యర్థి హిరల్​ తిపర్నేని లీడింగ్​లో ఉన్నారు. అరిజోనా ఆరో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఆమె గెలిస్తే హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు ఎన్నికైన రెండో ఇండియన్​ మహిళగా నిలుస్తారు.   న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి జెన్నిఫర్​ రాజ్​కుమార్​ అనే లాయర్​ ఎన్నికయ్యారు. న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డ్​ సృష్టించారు. డెమొక్రాట్​ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. రిపబ్లికన్​ అభ్యర్థి జియోవనీ పెర్నాను ఓడించారు. 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీ చేశారు. న్యూయార్క్​ సిటీకి ఆమె అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు. అంతకుముందు న్యూయార్క్​ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. లీగల్​ అడ్వైజరీ కౌన్సిల్​ ఆఫ్​ శాంక్చువరీ ఫర్​ ఫ్యామిలీస్​లో లీగల్​ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. గృహ హింస, సెక్స్​ ట్రాఫికింగ్​, జెండర్​ వయొలెన్స్​ బాధితులకు అండగా నిలుస్తూ.. వారి తరఫున పోరాడుతున్నారు. ఆమె పనితీరు నచ్చి న్యూయార్క్​ రాష్ట్రానికి ఇమిగ్రేషన్​ అఫైర్స్​ అండ్​ స్పెషల్​ కౌన్సెల్​కు డైరెక్టర్​గా నియమించారు గవర్నర్​ ఆండ్రూ క్యువోమో.   కొన్ని చోట్ల డెమొక్రాట్​, రిపబ్లికన్​ పార్టీల తరఫున పోటీ చేసిన మనోళ్లకు ఓటమి తప్పలేదు.  టెక్సస్​లోని 22వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి డెమొక్రాట్​ పార్టీ నుంచి పోటీ చేసిన  చెందిన ప్రెస్టన్​ కులకర్ణి .. రిపబ్లికన్​ క్యాండిడేట్​ ట్రాయ్​ నెల్స్​ చేతిలో ఓడిపోయారు. రిపబ్లికన్​ నుంచి బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రాట్​ అభ్యర్థి జెర్రీ కానలీ చేతిలో ఓడిపోయారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆయన పోటీ చేశారు.   మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగిన నిషా శర్మ 50 శాతానికిపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆమెను డెమొక్రాట్​ క్యాండిడేట్​ మార్క్​ డిశాల్నియర్​ ఓడించారు.న్యూ జెర్సీ సెనేట్​ కు పోటీ చేసిన రిపబ్లికన్​ క్యాండిడేట్​ రిక్​ మెహతా ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్​ క్యాండిడేట్​ సెనేటర్​ కోరీ బుకర్​ చేతిలో ఓడిపోయారు. మెహతాకు 37.9% ఓట్లు పోలవగా.. బుకర్​కు 60.6% ఓట్లు వచ్చాయి. అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారిగా మెహతా పనిచేశారు.

అమెరికా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన జో బైడెన్ 

డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంతకు ముందు ఎవరూ సాధించని రికార్డును స్వంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని పాపులర్ ఓట్లను సంపాదించుకుని జో బైడెన్ ఘన విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా పాప్యులర్ ఓట్లను సంపాదించుకున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థి కూడా ఇన్ని ఓట్లను సాదించలేదు. అయితే 2008లో జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో జో బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ 270కు చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఖాతాలో 264 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుండగా, మూడింటిలో ట్రంప్, ఒకదానిలో బైడెన్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.