ఇరకాటంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...కావాలనే కార్నర్ చేస్తున్న వైసీపీ...
2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఉత్తరాంధ్రను వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. కేవలం ఆరు స్థానాలు మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం సీట్లను ఊడ్చిపారేసింది. శ్రీకాకళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం... అలాగే, విశాఖ జిల్లాలో విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలుంటే 28 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకున్నా... అసెంబ్లీ వరకు వచ్చేసరికి అర్బన్ ఏరియాలో తెలుగుదేశం సత్తా చాటింది. అంటే, విశాఖ ఈస్ట్(వెలగపూడి రామక్రిష్ణబాబు), విశాఖ వెస్ట్(గణబాబు), విశాఖ నార్త్(గంటా శ్రీనివాసరావు), విశాఖ సౌత్(వాసుపల్లి గణేష్ కుమార్) నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ జిల్లాలోని రూరల్ ఏరియా మొత్తం వైసీపీ సత్తా చాటితే... అర్బన్ వరకు వచ్చేసరి మాత్రం తెలుగుదేశం తన పట్టునిలుపుకుంది.
అయితే, ఇప్పుడు విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఒకవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా టీడీపీ వ్యతిరేకిస్తుంటే, అందుకు సపోర్ట్ చేయలేక, అలాగని విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా అంగీకరించలేక సతమతమవుతున్నారు. దాంతో, ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుతున్నారు. విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా చేయడం వైజాగ్ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేలకు సమ్మతమో కాదో స్పష్టమైన ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇష్టంలేకపోతే, రాజీనామా చేసి రిఫరెండం కోసం ఉపఎన్నికలకు వెళ్లాలని పదేపదే సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, పార్టీ లైన్ను దాటలేక... మరోవైపు, విశాఖను పరిపాలనా రాజధానిగా అంగీకరించలేక సతమతమవుతున్నారు వైజాగ్ టీడీపీ ఎమ్మెల్యేలు.
వైసీపీ నేతల రెఫరెండం సవాల్పై విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఎవరికివారు, మౌనంగా జారుకుంటున్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తే, స్థానికంగా వ్యతిరేకత తప్పదు. అలాగని చంద్రబాబు మాటను జవదాటలేరు. పార్టీ స్టాండ్ను ఫాలో అవుతూనే పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా వ్యవహరిస్తున్నారు. అయితే, వెలగపూడి రామక్రిష్ణబాబు(విశాఖ ఈస్ట్), గణబాబు(విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు(విశాఖ నార్త్), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్)... ఈ నలుగురిలో గంటా మాత్రమే ధైర్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించగా... మిగతా ముగ్గురూ రాజధాని అంశాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.