HC to hear Jagan plea today seeking exemption from personal appearance in CBI

వైఎస్ జగన్ కు ఉపశమనం కలుగుతుందా.. సీబీఐ కౌంటర్ పిటీషన్ పై సర్వత్రా ఆసక్తి!

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను హైకోర్ట్ ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని గత వారం సిబిఐ కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో సీబీఐ కౌంటర్ పై ఆసక్తి నెలకొంది.  ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది. ప్రధానంగా ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సీబీఐ సరైన టైమ్ లో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో విచారణ ఈ నెల 12 కు వాయిదా వేయడంతో  సిబిఐ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తారో ఆ కౌంటర్ లో ఎటువంటి విషయాలు పొందుపరుస్తారనేది మాత్రం  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు దానిని కొట్టివేసిన నేపధ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనకు  ప్రతి వారం కోర్ట్ కు హాజరు కావాలంటే దాదాపు 60 లక్షల రూపాయల ఖర్చవుతుందని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద నేడు దాఖలయ్యే కౌంటర్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.

Andhra Pradesh Cabinet meeting begins

ఢిల్లీ పర్యటనకు ముందు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు!!

జగన్ సర్కార్ ఏపీలో మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఆసాంతం సమూలంగా మార్చాలని ప్రవేశపెట్టిన నాడూ నేడూ పధకంతో పాటు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోట్ బుక్స్ ఇవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.  రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా మంత్రి వర్గం ముందుకు ప్రతిపాదనలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీల పై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రి వర్గానికి పంపారు.  కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించగా మంత్రి వర్గంలో ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా ఇక పై 20 రోజులకే కుదించాలని మునిసిపల్ శాఖ నుంచి మంత్రి వర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వెళ్ళింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిని ఏర్పాటు చేయటం ద్వారా 10,000 ల మెగావాట్ల విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు అధికారులు.ఇవాళ జరిగే మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లి పర్యటణలో మోదీని కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించక పోవడం పై మరియు  రైల్వే ప్రాజెక్టుల పై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

ponnam prabhakar political career in dilemma

పాపం... పొన్నం..! తలకిందులైన పరిస్థితి..!

పొన్నం ప్రభాకర్... ప్రస్తుతం తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... చాలా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం, ఎంపీగా గెలిచిన తరువాత ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకమైన లీడర్‌గా చలామణి అయ్యారు. ఎంపీ ఫోరమ్ కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు కూడా ఉండటంతో పొన్నం ప్రభాకర్‌కు, పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాతే, పొన్నం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.  తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెడుతుంటే, లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పేని అడ్డుకున్నారు పొన్నం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అయినా, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ కోలుకోలేదు పొన్నం. ప్రతీ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బలే తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారున్ని అంటూ పొన్నం మొత్తుకుంటున్నా, ప్రజలు మాత్రం ఆదరించడం లేదు. ఇటు క్యాడర్‌లో మనోస్దైర్యం నింపడంలోను, పొన్నం విఫలమవుతున్నారని అంటున్నారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగిన పొన్నం... ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయారు. సొంత జిల్లాలో కాంగ్రెస్‌ను బతికించుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వరుస ఎన్నికల ఫలితాలు చూస్తే, ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోను పోటీ చేసినా థర్డ్‌ ప్లేసే మిగిలింది. ఇక, మున్సిపల్ ఎన్నికల్లోనూ కరీంనగర్ జిల్లాలో అన్నీ తానై నడిపించారు పొన్నం. తాను అనుకున్నవారికే పొన్నం టికెట్లు ఇచ్చారు. అయినా కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీల్లో, ఎక్కడా కాంగ్రెస్‌కి, అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయారు. ఇక కరీంనగర్ నగర పాలక ఎన్నికల్లో అయితే, పార్టీ ప్రకటించిన మేయర్ అభ్యర్థితో సహా చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో, పొన్నం మీడియా ముందుకే రావడం మానేశారు. మరి పొన్నం సక్సెస్‌ ట్రాక్‌ ఎప్పుడు పడతారో, మళ్లీ తన హవాను ఎప్పుడు నడిపిస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.

teacher misbehave with Students

కీచక టీచర్... దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు

'ఆచార్యదేవో భవా' అని గురువుకి తల్లి తండ్రి తరువాత స్థానాన్ని ఇచ్చారు మన పెద్దలు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న కొందరు గురువులు తమ నైతిక విలువలను సైతం మరిచిపోయి అత్యంత దారుణాంగా ప్రవర్తిస్తున్నారు. నేటి సమాజంలో చెడు వైపుకు వెళ్ళకుండా కాపాడాల్సిన గరువే తన విలువలను సైతం మరచిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో ఓ కీచక టీచర్ కు దేహశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్లో పాఠాలు చెప్పకుండా విద్యార్ధినులతో అసభ్యకరంగా మాట్లాడడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించటం విసుగు తెప్పించింది. ఈ విషయాన్ని విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టీచర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రకాశం జిల్లాలో  బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి హై స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి.పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354, ఫోక్సో యాక్ట్ సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM KCR asks District Collectors to implement govt priorities

జిల్లాకి కలెక్టరే బాస్.. కలెక్టర్లకు ప్రత్యేక నిధులు!

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల పై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై వివరణ ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్లే బాస్ అని స్పష్టంజేశారు. మంచి జరిగినా చెడు జరిగినా వారే భరించాలి అని చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీలో నిధుల కొరత రాకుండా కలెక్టర్ లకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అందులోభాగంగా అత్యవసర పనుల కోసం కలెక్టర్ లకు నిధులు విడుదల చేశారు. ఒక్కో కలెక్టర్ కు కోటి రూపాయల చొప్పున 33 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెప్రగతి తరహాలో పట్టణ ప్రగతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ లకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన చర్యల పై అవగాహన కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్ లు మున్సిపల్ సమావేశం నిర్వహించి మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పట్టణ ప్రగతి కంటే ముందే అన్ని వార్డుల్లో కమిటీలను నియమించాలని కార్యక్రమం కోసం వార్డుకో అధికారిణి ఇన్ చార్జ్ గా నియమించాలనే సూచించారు. పట్టణాలూ నగరాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పార్క్ లు ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలన్నారు. కేబీఆర్ పార్క్ తరహాలో అన్ని పట్టణాలకు రెండు కిలోమీటర్ల దూరంలో నడక కోసం పార్కులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

Baby Boy Died With Food Poison in Manasa sarovar Hotel

హోటల్ నిర్లక్ష్యానికి బలైపోయిన చిన్నారి జీవితం...

హైదరాబాద్ బేగంపేట లోని మానస సరోవర్ హోటల్ లో కలుషిత ఆహారం తినడం వల్ల ఎన్నారై కుటుంబం అస్వస్థత పాలైంది. హైదరాబాద్ బేగంపేట లోని ప్రముఖ మానస సరోవర్ హోటల్లో వడ్డించిన పన్నీర్ కర్రీతో రోటీ తినడంతో రెండేళ్ల బాలుడు నిహాన్ ప్రాణాలు కోల్పోయాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవి నారాయణ దంపతులతో పాటు మరో కుమారుడు ఏడేళ్ల వరుణ్ తీవ్ర అస్వస్థత పాలయ్యారు. కేవలం కలుషిత ఆహారం తినడం వల్ల జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో రెండేళ్ల బాబు మృతి చెందగా. వారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా అస్వస్థకు గురై ప్రస్తుతం బేగంపేట్ లోని కిమ్స్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వీసా స్టాంపింగ్ కోసం నిన్న ఉదయం బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వచ్చి మానస సరోవర హోటల్ లో వసతి కోసం దిగి స్టాంపింగ్ కోసం వీసా ఆఫీసుకు వెళ్ళారని సమాచారం. వీసా ఆఫీసు నుంచి వచ్చి భోజనం చేసిన తరువాత నుంచి నలుగురు కడుపు నొప్పి తీవ్ర వాంతులతో అస్వస్థతకు గురి అవ్వగా వారిని తక్షణమే .హాస్పటల్ కి తీసుకువెళ్తున్న దారి మధ్యలోనే చిన్నారి మృతి చెందాడని బంధువులు తీవ్ర ఆవేదనను వెల్లడించారు. తక్షణమే హోటల్ పై కఠిన చర్యలనుతీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  

ycp targeting four tdp mlas

ఇరకాటంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...కావాలనే కార్నర్ చేస్తున్న వైసీపీ...

2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఉత్తరాంధ్రను వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. కేవలం ఆరు స్థానాలు మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం సీట్లను ఊడ్చిపారేసింది. శ్రీకాకళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం... అలాగే, విశాఖ జిల్లాలో విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలుంటే 28 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకున్నా... అసెంబ్లీ వరకు వచ్చేసరికి అర్బన్ ఏరియాలో తెలుగుదేశం సత్తా చాటింది. అంటే, విశాఖ ఈస్ట్(వెలగపూడి రామక్రిష్ణబాబు), విశాఖ వెస్ట్(గణబాబు), విశాఖ నార్త్(గంటా శ్రీనివాసరావు), విశాఖ సౌత్(వాసుపల్లి గణేష్ కుమార్) నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ జిల్లాలోని రూరల్ ఏరియా మొత్తం వైసీపీ సత్తా చాటితే... అర్బన్ వరకు వచ్చేసరి మాత్రం తెలుగుదేశం తన పట్టునిలుపుకుంది.  అయితే, ఇప్పుడు విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఒకవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా టీడీపీ వ్యతిరేకిస్తుంటే, అందుకు సపోర్ట్ చేయలేక, అలాగని విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా అంగీకరించలేక సతమతమవుతున్నారు. దాంతో, ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుతున్నారు. విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా చేయడం వైజాగ్ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేలకు సమ్మతమో కాదో స్పష్టమైన ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇష్టంలేకపోతే, రాజీనామా చేసి రిఫరెండం కోసం ఉపఎన్నికలకు వెళ్లాలని పదేపదే సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, పార్టీ లైన్‌ను దాటలేక... మరోవైపు, విశాఖను పరిపాలనా రాజధానిగా అంగీకరించలేక సతమతమవుతున్నారు వైజాగ్ టీడీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ నేతల రెఫరెండం సవాల్‌పై విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఎవరికివారు, మౌనంగా జారుకుంటున్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తే, స్థానికంగా వ్యతిరేకత తప్పదు. అలాగని చంద్రబాబు మాటను జవదాటలేరు. పార్టీ స్టాండ్‌ను ఫాలో అవుతూనే పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా వ్యవహరిస్తున్నారు. అయితే, వెలగపూడి రామక్రిష్ణబాబు(విశాఖ ఈస్ట్), గణబాబు(విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు(విశాఖ నార్త్), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్)... ఈ నలుగురిలో గంటా మాత్రమే ధైర్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించగా... మిగతా ముగ్గురూ రాజధాని అంశాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Prashant Kishor The Man Behind AAP Winning Campaign

కేజ్రీ విజయం వెనుక పీకే వ్యూహం... తెర వెనుక కథ నడిపింది అతనే....

దేశమంతా గెలిచినా... ఢిల్లీలో మాత్రం మీ పప్పులుడకవని కమల దళాన్ని శాసించిన ఒకే ఒక్కడు కేజ్రీవాల్. అయితే ఈసారి విజయం అంత సులభంగా రాలేదు. కేజ్రీవాల్ విజయం వెనుక కనబడని ప్రశాంత్ కిషోర్ హస్తముంది. నిజానికి, పీకే అంటే ఒకప్పుడు కేజ్రీవాల్ కి వ్యతిరేక భావన ఉండేది. కానీ, ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ.. బీజేపీ తన వ్యూహాలకు పదునుపెట్టడంతో... కేజ్రీవాల్ కూడా అనివార్యంగా తన వ్యూహాలను మార్చాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాల్సి వచ్చింది.  ప్రశాంత్ రంగంలోకి దిగడంతో కాంపెయినింగ్ పద్ధతే మారిపోయింది. చివరకు విజువల్ పబ్లిసిటీ విషయంలోనూ ప్రశాంత్ కిషోర్ జిమ్మిక్కులు చేశారు. ఆప్ పార్టీ పోస్టర్లను సమూలంగా మార్చేశారు. మొన్నటివరకూ వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పోస్టర్లను.... పూర్తి బ్లాక్ కలర్ లో డిజైన్ చేశారాయన.. దీనివల్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు చాలా అట్రాక్టివ్ గా రూపొందాయి. కలర్ సైకాలజీలో దిట్టయిన పీకే... ఇప్పటికే బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ప్రజల సెంటిమెంట్ ఆధారంగా కలర్స్ ను ఉపయోగించుకుని ఆయా నేతలకు విజయాలను కట్టబెట్టారు. అదే స్టైల్లో ఢిల్లీలోనూ ప్రయోగం చేశారు. ఇక, నాయకుల ముఖమే అతిపెద్ద ప్రచారమని పీకే నమ్ముతారు. అందుకే ఆప్ లీడర్ ఇమేజ్ చుట్టూనే ప్రచారమూ సాగింది. అందుకే, కేజ్రీవాల్ పోస్టర్స్ ను విభిన్నంగా రూపొందించారు పీకే. ఇక, లగే రహో కేజ్రీవాల్.... ఇది ప్రభుత్వ వ్యతిరేకతను జయించే మంత్రం... ఈ నినాదం కేజ్రీవాల్ కు బాగా కలిసొచ్చింది. జాతీయ నేతగా అరవింద్ కు గుర్తింపు తగ్గిన నేపధ్యంలో ప్రశాంత్ కిషోర్ రచించిన ఈ గెలుపు నినాదం కేజ్రీని మరోసారి సరికొత్త నేతగా పరిచయం చేసింది. ఈ గెలుపుతో ఇప్పుడు కేజ్రీ మరోసారి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. ఇక, పీకే వ్యూహంలో చివరాఖరిది.. పోస్టర్ మీద లగే రహో కేజ్రీవాల్ కేప్షన్... ఈ ట్యాగ్ లైన్ ను పసుపు పచ్చని రంగులో ముద్రించారు. ఇది హిందూవాదుల మనోభావాల్ని గౌరవించడమే కాదు.. ఆప్ హిందువుల పార్టీ కూడా అని చాటి చెప్పారు. దాంతో ఆప్ పై ఉన్న హిందూ వ్యతిరేక భావజాలం కూడా కొట్టుకుపోయింది. అంతేకాదు.. జాతీయ అంశాలు తక్కువగా, ఢిల్లీ అంశాలను ఎక్కువగా ప్రచారంలో చోటు కల్పించాలని పీకే సూచించారు. ఇలా, పోస్టర్ నుంచి ప్రసంగం వరకు.... మేనరిజమ్స్ నుంచి మేకోవర్ వరకు ప్రశాంత్ కిశోర్ చేసిన జిమ్మిక్కులు వర్కవుట్ అయ్యాయని... కేజ్రీవాల్ గుడ్ గవర్నెన్స్ ను తోడు.... ఇవి కూడా కలిసొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.

AP Police amazing response for SOS Call through Disha app

దిశ యాక్ట్ కింద తొలి విజయం... ఆకతాయికి క్షణాల్లో సంకెళ్లు...

అమ్మాయిలకు రక్షణగా తీసుకొచ్చిన ఏపీ దిశ చట్టం... తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ ద్వారా బాధితురాలికి వేగంగా ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ అత్యాచార, హత్య ఘటన తర్వాత..మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ సర్కార్ దిశ చట్టం పేరుతో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాజమండ్రిలో ఏపీ సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు.  మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ దిశ యాప్ లో తొలి సక్సెస్ స్టోరీ నమోదైంది. విశాఖ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో ఆకతాయి వేధింపులకు దిగడంతో ....బాధితురాలు దిశా టీంకు సమాచారం ఇచ్చింది. తెల్లవారుజామున 4గంటల 21నిమిషాల సమయంలో... బాధిత మహిళ SOS అనే యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, దిశ యాప్ కు వచ్చిన మొదటి కేసును నిమిషాల వ్యవధిలోనే చేధించారు. వెంటనే స్పందించిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు వేధింపులకు పాల్పడ్డ ఆకతాయిని అరెస్ట్ చేశారు. చిమ్మ చీకట్లలో ప్రయాణిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిశ యాప్ ద్వారా మహిళకు అండగా నిలిచిన ఈ కేసును స్పందన రివ్యూలో డీజీపీ గౌతం సవాంగ్.... సీఎం జగన్ కు వివరించారు. ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఇంత త్వరగా స్పందించి ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులను.. సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. దిశ యాక్ట్ ఉద్దేశ్యాన్ని, ఫలితాన్ని చూపించినందుకు అభినందించారు.

shots fired at mla naresh yadav convoy volunteer killed

ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు.. కాల్పుల్లో మృతి చేందిన ఆప్ కార్యకర్త

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో ఆప్ ఘన విజయాన్ని ఎగురవేసింది. ఎన్నికల్లో గెలిచి ఘన విజయాన్ని జరుపుకుంటున్న నేపధ్యంలో ఆప్ ఎమ్మెల్యే  పై కాల్పులు జరిగాయి.ఢిల్లిలో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు కలకలం రేపాయి. ఎన్నికల్లో గెలిచి విజయోత్సాహంలో ఉన్న నరేష్ యాదవ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆశోక్ కుమార్ అనే ఆప్ కార్యకర్త మృతి చెందగా మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. తన కాన్వాయ్ పై కాల్పులకు దిగిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించడం ద్వారా ఆగంతకులను పోలీసులు గుర్తించవచ్చన్నారు.పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యప్తును కొనసాగిస్తున్నారు.

CM YS Jagan Mohan Reddy Delhi Tour

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు అదే కారణమా? పర్యటనకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లి పర్యటణ చేయనున్నారు. ఈ రోజ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపైనే ప్రధానితో చర్చించే అవకాశం ఉండగా ఈ సారి జరిగిన  పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.ఈ అంశంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులు పైనే ప్రధాని దృష్టికి సిఎం తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు మరి కొంత మంది కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం. నేడు జరిగే రాష్ట్ర క్యాబినేట్ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లికి వెళ్లనున్నట్లు సమాచారం.  బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న నేపధ్యంలో సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లి ప్రయాణానికి సిద్ధం అవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లి పర్యటనలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసి రాష్ట్రానికి సంబంధించి వాయిదాలో ఉన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువస్తారని అధికార వర్గాల సమాచారం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ లకు తగిన కేటాయింపులు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళటమే కాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల పై మరోసారి ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం రాత్రి ఏడు గంటలకు సిఎం వైఎస్ జగన్ ఢిల్లి నుంచి తిరుగు ప్రయాణమవ్వనున్నారు. మొత్తానికి మన ఏపీ సీఎం జగన్ ఢిల్లి పర్యటణతో కీలక విషయాలకు తెర పడనుందో లేదో వేచి చూడాలి.

AP Coucil secretary rejected select committee file

సెలెక్ట్ కమిటీ ఫైల్ వెనక్కి... ధిక్కరణ నోటీసులు ఇస్తామంటోన్న టీడీపీ

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్ ను శాసనమండలి కార్యాలయం వెనక్కిపంపింది. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసి తిప్పిపంపారు. దాంతో సెలెక్ట్ కమిటీ ఫైల్ తిరిగి మండలి ఛైర్మన్ వద్దకే చేరింది. అయితే, ఫైల్ వెనక్కి పంపారన్న సంగతి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు మండలి కార్యదర్శిని కలిశారు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై కౌన్సిల్ ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కోరారు. అయితే, ఈసారి ఛైర్మన్ నుంచి ఫైల్ వచ్చిన వెంటనే సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయకపోతే మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రూల్‌ 154 కింద మండలి ఛైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే సెలెక్ట్ కమిటీలు వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. అసలు సెలెక్ట్ కమిటీలంటేనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే మండలి సెక్రటరీని బెదిరించి ఫైల్ ను వెనక్కిపంపేలా చేశారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇక, సెలెక్ట్ కమిటీలకు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇవ్వగా, తాము ఆ కమిటీల్లో ఉండబోమని అధకార వైసీపీ తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో తాము భాగస్వాములు కాబోమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మండలి ఛైర్మన్ కు లేఖలు రాశారు.

reason behind kesineni nani fires on ab venkateswara rao

నాని ఓడిపోతాడు... పీవీపీ గెలుస్తాడు... ఏబీవీపై కేశినేని కోపానికి కారణమిదేనా?

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం, అటు తిరిగి ఇటు తిరిగి, తెలుగుదేశంలోనే చిచ్చురేపింది. ఏబీవీ సస్పెన్షన్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంటే, టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెలుగుదేశంలోనే కలకలం రేపుతోంది. అసలు ఏబీవీని వెనకేసుకురావడమేంటంటూ టీడీపీ నేతలనే తీవ్రంగా తప్పుపట్టారు కేశినేని. ఎందుకంటే, తప్పుడు రిపోర్టులతో చంద్రబాబును నిండా ముంచిన ఏబీవీ, వైసీపీకి మేలు చేశారనేది కేశినేని వాదన. కేశినేని నాని బయటపడ్డారు కానీ, ఎంతో మంది టీడీపీ సీనియర్లు ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏబీవీకి టీడీపీ అండగా నిలవడాన్ని కేశినేని తప్పుబట్టడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన ఏబీవీని, ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ వైఫల్యం చెందారంటూ, ఆమె స్ధానంలో నిఘా విభాగం అధిపతిగా ఏబీని నియమించుకున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం ప్రతిపక్ష వైసీపీకే కాదు, టీడీపీలోని పలువురు సీనియర్లకూ నచ్చలేదట. వారిలో కేశినేని నాని ఒకరు. ఎందుకంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితులను చెప్పాల్సిందిపోయి, టీడీపీ పరిస్ధితి అన్నిచోట్లా బావుందని తప్పుడు నివేదికలు ఇచ్చారని, అదే తెలుగుదేశం ఘోర పరాజయానికి కారణమైందనేది కేశినేని వాదన. అయితే, ఏబీవీ తప్పుడు నివేదికల వల్లే పార్టీకి జరగరాని నష్టం జరిగిందని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారట.  అయితే, కేశినేని బాధ అదొక్కటే కాదట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఏబీవీ వ్యతిరేకించారట. కేశినేనికి టికెట్ ఇస్తే ఓడిపోతారంటూ చంద్రబాబుకు నివేదికలిచ్చారట. ఇదే, కేశినేని కోపానికి కారణమంటున్నారు. ఇలా, తప్పుడు రిపోర్టులతో టీడీపీని తప్పుదారి పట్టించి, పరోక్షంగా వైసీపీకి మేలు చేశారని, అలాంటి ఏబీని టీడీపీ వెనకేసుకురావడమేంటని కేశినేని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏబీ వెంకటేశ్వర్రావు సస్పెన్షన్‌, చివరికి టీడీపీలోనే చిచ్చురేపింది. కక్షపూరితంగా సస్పెండ్ చేశారని చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అందుకు విరుద్ధంగా అదే పార్టీ ఎంపీ నాని మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో జగన్ ప్రభుత్వం మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు విలువే లేకుండాపోతోందన్నది మిగతా టీడీపీ నేతల ఆవేదన. అలా, ఏబీవీ సస్పెన్షన్‌, చివరికి తెలుగుదేశంలోనే రచ్చకు దారి తీస్తోంది.

Arvind Kejriwal likely to take oath for CM post on Feb 14

ప్రేమికుల రోజున కేజ్రీ ప్రమాణం... ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై...

సామాన్యుడి చీపురు.. మరోసారి ఊడ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీని.. క్లీన్ స్వీప్ చేసింది. కేజ్రీవాల్‌.. తీన్‌మార్‌ కొట్టారు. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబోతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఢిల్లీ ఎన్నికల్లో.. రాజధాని ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టారు. బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీగా మారిన ఎన్నికల్లో.. ఫలితం ఒకేవైపు నిలిచింది. బీజేపీ మాత్రం మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కౌంటింగ్ మొదలైన క్షణం నుంచీ ఆప్‌ దూసుకుపోయింది. మెజార్టీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. అయితే రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు... ఒకానొక సమయంలో 20కి పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు కనిపించారు. కానీ ఆ ఊపు ఎంతో సమయం నిలువలేదు. అనూహ్యంగా ఆయా స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించడంతో మొత్తం 62 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించారని.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. ఈ విజయం.. సరికొత్త రాజకీయాలకు నాంది అని.. అభివృద్ధికి ఓటేశారని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్‌కు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక, ఈసారి కూడా ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. 2015 లో 3 స్థానాలు నెగ్గిన కమలం పార్టీ.. ఈసారి అధికారం తమదే అంటూ చెప్పుకొచ్చిన కాషాయ పార్టీ.. కనీసం డబుల్‌ డిజిట్‌ కూడా సాధించలేకపోయింది. ప్రజల తీర్పు గౌరవిస్తామని.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని.. ఫలితాల తర్వాత బీజేపీ అగ్రనాయకులు ప్రకటించారు.

vijaya sai reddy and nandigam suresh into modi cabinet

కేంద్ర క్యాబినెట్ లోకి విజయసాయి రెడ్డి, నందిగం సురేష్!

రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యం లో, కేంద్ర క్యాబినెట్ లోకి ఇద్దరు వైఎస్ఆర్సిపీ ఎం.పీ లకు చోటు దక్కబోతున్నట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి గట్టి లాబీయింగ్ తో -ముఖ్యమంత్రి- ప్రధానమంత్రి మధ్య బుధవారం జరగబోతున్న రెండు గంటల కీలక సమావేశం లో... కేంద్ర  క్యాబినెట్ లోకి వై ఎస్ ఆర్ సి పీ చేరటానికి జగన్ మోహన్ రెడ్డి తన అంగీకారం తెలియచేయబోతున్నట్టు సమాచారం. విజయసాయి రెడ్డి సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలోనూ, అలాగే బాపట్ల లోక్ సభ స్థానం నుంచి గెలిచిన నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్ లో చేరబోతున్నట్టు సమాచారం. అసలిక ఎలాంటి పరిస్థితుల్లోనూ, వైఎస్ఆర్సిపికీ, బీజెపికి మధ్య సయోధ్య కుదరకపోవచ్చుననీ, ఈ నేపథ్యంలో బీజెపీ తో జట్టు కట్టిన జనసేనను అడ్డం పెట్టుకుని రాష్ట్రం లో మరో సారి వ్యూహాత్మక రాజకీయం నడపవచ్చుననీ భావించిన తెలుగు దేశానికి, ఈ తాజా పరిణామం కొంచెం మింగుడు పడని అంశమే. వాస్తవానికి లోగడ రెండు సందర్భాల్లోనూ.. ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తోనూ, అమిత్ షా తో నూ అపాయింట్మెంట్ దొరక్క వెనుదిరిగిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత అపాయింట్మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోపు, బిజెపి రాజ్య సభ్యుడు వై.ఎస్. సుజనా చౌదరికి, అలాగే వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మధ్య నడిచిన లేఖల యుద్ధం, అలాగే ట్విట్టర్ వార్, ఇంకా సుజనా ఆర్ధిక నేరాల మీద రాష్ట్రపతి జోక్యం కోరుతూ విజయసాయి రెడ్డి రాసిన లేఖల పర్యవసానం గా ....బీ జీ పీ కి, వై ఎస్ ఆర్ సి పీ కి మధ్య చెడిందనే అందరూ భావించారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావటం, విజయసాయి రెడ్డి గట్టిగా లాబీయింగ్ చేయటంతో మొత్తానికి... ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకోనుంది. కీలకమైన బిల్లుల ను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలంటే, బీజెపీ కి అనివార్యంగా ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం. దానికి తోడు, మార్చ్ లో ఆంద్ర ప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు కాబట్టి, అది రాజ్యసభ లో ' ఆపత్కాలం' లో బీజీపీ కి అనుకూలించే అంశం. తన సహజ స్వభావానికి విరుద్ధంగా, పరిమితంగా అయినప్పటికీ మీడియాతో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి గా తన ప్రాధాన్యాలేమిటో చెప్పకనే చెప్పారు. కేంద్రానికి కూడా తమతో అవసరాలుంటాయనీ, ఆ సందర్భంలో ప్రత్యేక హోదా అంశం మీద తమ పట్టు బిగిస్తామనీ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అంతే కాదు... ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని స్పష్టం చేశారు కూడా. పోలవరం నిధుల దగ్గరనుంచి, రాష్ట్రానికి రావలసిన వాటాల దాకా అన్నీ మాట్లాడటానికి తగిన సరంజామా తో ఢిల్లీ కి బయల్దేరుతున్న జగన్ మోహన్ రెడ్డి ని కేంద్ర క్యాబినెట్ లో వై ఎస్ ఆర్ సి పీ ని భాగస్వామి కావాల్సిందిగా స్వయంగా నరేంద్ర మోడీ నే కోరే అవకాశాలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ కూడా అందుకు అంగీకరిస్తారనీ వై ఎస్ ఆర్ సి పీ వర్గాల భోగట్టా!

సోషల్ మీడియా వికృత చేష్టలపై కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలి: విజయశాంతి

అరచేతిలో వైకుంఠం చూసేందుకు నేటి జనాలు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ప్రతినిత్యం ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో తెలిసుకొనే అవకాశం ప్రజలకు సోషల్ మీడియా కల్పించింది. అలాంటి సోషల్ మీడియా ఎంత అద్భుతమో.. ఉపయోగించే విధానాన్ని బట్టి అంతే.. ప్రమాదం అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రమాదాలు రోజు రోజుకూ వికృతంగా మారుతున్నాయి. ఇందుకు నెటిజన్లు కొందరు సోషల్ మీడియా స్వేచ్ఛను విశృంఖలత్వంగా వాడుకోవడమే కారణంగా భావించవచ్చు. అయితే సోషల్ మీడియాలోని విశృంకలత్వాన్ని కట్టడి చేసేందుకు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణలోకి వచ్చి సోషల్ మీడియా వికృత పోకడలను నియంత్రిస్తేనే మహిళలపై జరిగే దారుణాలను అదుపు చేయవచ్చని ఆమె తెలిపారు. అదే విషయాన్ని తెలంగాణలోని మహిళాలోకం కోరుకుంటుందని కూడా ఆమె వివరించారు. అలాగే.. ఈ సోషల్ మీడియాలో వికృత చేష్టలపై వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని తాజాగా విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు విజయశాంతి ఇలా కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేయటం వెనుక ఓ ఘటన దాగి ఉంది. దిశ ఉదంతం మర్చిపోకముందే కరీంనగర్ లో ఓ బాలికపై ప్రేమోన్మాది దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ ఘటన తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసిన ఆ ప్రేమోన్మాది విచక్షణా రహితంగా హత్య చేశాడని విజయశాంతి ఆవేదన చెందారు. ఈ ఘటనను బట్టి మహిళలు బయట స్వేచ్ఛగా తిరగటం కాదు.. అసలు ఇక్కడ ఇంట్లో ఉన్నకానీ.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న సంకేతాలు సమాజాన్ని భయపెడుతోందని విజయశాంతి హెచ్చరించారు.  అంతేకాకుండా ఎన్ కౌంటర్ లు చేసిన ఉన్మాదులు మారటం లేదని.. అలాగే.. ఉరితీసినప్పటికీ.. ఏమాత్రం భయపడటం లేదని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మహిళలపై జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలకు సోషల్ మీడియానే ప్రధాన కారణమని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోషల్ మీడియాలో విశృంఖలత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా ఇదే పరిస్థితి కొనసాగితే అరబ్ దేశాలలో మాదిరిగా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించే వ్యక్తులను బహిరంగంగా శిక్షించే విషయాన్ని పరిశీలించాలని కూడా సీఎం కేసీఆర్ ను విజయశాంతి కోరారు.

ఢిల్లీలో ఆప్.. ఘన విజయం అంబరం తాకే సంబరాలు

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. జాతీయ పార్టీలను కాదని.. ఢిల్లీలో పరిశుభ్రంగా చీపురు కట్ట ఊడ్చేసింది. దీంతో ఆప్ సంపూర్ణ ఆధిక్యతను సాధించినట్లైంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించింది. కాంగ్రెస్ పార్టీని నామా రూపాలు లేకుండా చేసింది. ఏకంగా ఆప్ 63 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. దీంతో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజల ఆదరణ తప్పక ఉంటుందని మరోసారి రుజువుచేశారు.శతాబ్దాల నుంచి ఉన్న జాతీయ పార్టీకి.. కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్త్వ పార్టీకి ఢిల్లీ ప్రజలు బలంగా బుద్ధి చెప్పారని ఆప్ ఆనందంలో మునిగితేలుతుంది. అభివృద్ధికే ఓటేశారని ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేవలం ఏడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తున్న బీజేపీకి ఇది గట్టి దెబ్బగానే భావించాలి. కాంగ్రెస్ అసలు కోలుకోలేని దెబ్బగా పరిగణించాలి. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి హాట్రిక్ విజయం సాధించారు కేజ్రీవాల్. 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రివాల్ ఘన విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించారు. అలాగే.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రం బీజేపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరి రౌండ్ లో  సిసోడియా 3,508 ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం. అంతేకాకుండా ఢిల్లీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా భావించాయి. కేజ్రివాల్ కు ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కేజ్రివాల్ కి కూడా వ్యూహకర్తగా వ్యవహరించడంతో ఇప్పుడు పీకే క్రేజ్ అమాంతం పెరిగింది. ఢిల్లీలో ఆప్ విజయానికి పీకే వ్యూహం కూడా పనిచేసింది. ఈ విజయోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్ శుభాకాంక్షలు తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. ఆప్ నేతలతో కీలకంగా భేటీ అయ్యారు. ఇక ఆప్ పార్టీ ఘన విజయం అందుకోవడంతో పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏకంగా ఆప్ కార్యకర్తలు.. అమిత్ షాకు కరెంట్ షాక్ కొట్టిందంటూ నినాదాలు చేస్తుండటం విశేషం.

అంచనాలను మించుతున్న ఏపీ బడ్జెట్...

  ఈసారి ఏపీ బడ్జెట్ అంచనాల్ని మించిపోతోంది, మార్చి ఆరో (మార్చి 6) తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్ధికశాఖ రేయింబవుళ్లూ కసరత్తు చేస్తోంది. అయితే అంచనాలకు మించిన ప్రతిపాదనలు రావడంతో ఆర్థిక శాఖ ఆందోళనలో పడింది. వివిధ శాఖల అవసరాలను బట్టి రెండున్నర లక్షల కోట్ల మేర బడ్జెట్ రూపొందిస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కానీ, అంచనాలకు మించిన ప్రతిపాదనలు మూడున్నర లక్షల కోట్ల మేర రావడంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆర్థిక శాఖ ఉంది. వార్షిక అవసరాల కోసం ప్రభుత్వ శాఖలు భారీ డిమాండ్ లు పెడుతున్నాయి. ఖరారు చేసే బడ్జెట్ దాదాపు రెండున్నర లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆయా శాఖల నుంచి మూడున్నర లక్షల కోట్లకు పైగా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. అవసరాలు, ఖర్చులు తగ్గించుకోవాలని పదేపదే చెపుతున్నా ఆయా శాఖల నుంచి వస్తున్న డిమాండ్ లు భారీగా ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ పై వివిధ శాఖల అధికారులతో గత నెల ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఆయా శాఖ నుంచి ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించుకుని ఈ నెల మూడో తేదీ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఇతర శాఖల మంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అవసరాలకు మించి వచ్చిన ప్రతిపాదనలపైనే ఈ సమావేశాల్లో చర్చించారు. గత బడ్జెట్ సమావేశాల్లో కసరత్తు సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. శాఖల నుంచి డిమాండ్ లు ఎంత భారీగా వచ్చాయంటే, భారీగా నిధుల కేటాయింపుల్లోనూ కోత విధించారు. ఆ నిధులను పలు శాఖలు ఖర్చు చేయలేకపోయాయి. ఇచ్చిన నిధుల్ని ఖర్చుచేయలేకపోవడం ఒకెత్తయితే ఇవ్వాల్సిన నిధులను ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇవ్వకుండా చేతులెత్తేసిన వైనం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. ఇదే సమయంలో గత బడ్జెట్ లో కన్నా ఈ సారి సంక్షేమానికి నేరుగా నగదు బదిలీకి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశముంది. నవరత్నాల పేరుతో ప్రవేశ పెట్టిన అనేక పథకాలకే లక్ష కోట్లు కావాల్సి వస్తుంది. దీంతో ఇతర ఖర్చుల్లో కోత తప్పదన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతిపాదనల్లో అత్యవసరమైన వాటికే డిమాండ్ చేయాలని ఆర్థిక శాఖ పేర్కొంటుంది. భారీ బడ్జెట్ ను, శాఖల డిమాండ్ లను యధాతథంగా అమోదిస్తే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ముందుగా నవరత్నాలు, ఉద్యోగుల జీతాలు, పింఛన్ లకు పెద్ద పీట వేసిన తర్వాతే ఇతర పథకాలకు నిధులు కేటాయించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.