ఎపి సీఎం హద్దులు దాటారు.. చర్యలు తీసుకోండి.. సుప్రీం కోర్టులో పిటిషన్
posted on Oct 13, 2020 @ 12:24PM
ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ జస్టిస్ రమణతోపాటు, ఎపి హైకోర్టు న్యాయమూర్తుల పై చీఫ్ జస్టిస్ బాబ్డే కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను ప్రెస్ మీట్ లో వెల్లడించడాన్ని తప్పు పడుతూ ఎపి సీఎం జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టులో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేసారు. మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని లాయర్ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాకుండా న్యాయవ్యవస్థను తప్పుబడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నా సీఎం జగన్ అడ్డుకోవడంలేదని... ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ ఆ పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించకుండా చూడాలని.. ఈ చర్యలకు కారణమైన సీఎం జగన్ పై ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్ కోరారు.
న్యాయస్థానాలను కించపర్చేలా వ్యవహరించినందుకు ఏపీ సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ సుప్రీం కోర్టు ను కోరారు. న్యాయమూర్తులను భయాందోళనకు గురిచేసేలా జగన్, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ చర్యల వల్ల న్యాయస్థానాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం వుందన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థను కాపాడాలని...భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్ కుమార్ సింగ్ తన పిటిషన్ లో కోరారు.
ఈ నెల 10న ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశాన్ని ఆయన తన పిటిషన్ లో ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ ఓ లేఖ రాశారని, అందులో తదుపరి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న మరో న్యాయమూర్తి ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేశారని అయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీల పై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సునీల్ కుమార్ సింగ్ తెలియజేశారు. తన చర్యల ద్వారా వైఎస్ జగన్ "దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని" చూస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.