యువకుడిని కొట్టిన కలెక్టర్.. సస్పెండ్ చేసిన సీఎం
posted on May 23, 2021 @ 1:43PM
అతనో జిల్లా కలెక్టర్.. గౌరవప్రదమైన పదవిలో ఉన్న కలెక్టర్ ఓవరాక్షన్ చేశారు. విచకణారహితంగా ప్రవర్తించాడు. ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. యువకుడిపై కలెక్టర్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేసింది. దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో తప్పు తెలుసుకున్న కలెక్టర్ క్షమాపణ కోరారు. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోవడంతో .. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించారు. యువకుడిని కొట్టిన కలెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్న టైంలో బయటకు వచ్చిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఏకంగా జిల్లా కలెక్టరే ఓ యువకుణ్ని కొట్టడం వివాదాస్పదమైంది. లాక్డౌన్ సమయంలో సూరజ్పూర్లో ఓ యువకుడు మందులు కొనుగోలు చేయడం కోసం బయటకొచ్చాడు. అతడితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ.. ఆ యువకుడి ఫోన్ తీసుకొని చూసి.. కాసేపట్లోనే ఫోన్ను నేలకేసి కొట్టాడు. ఆ యువకుడు ఏవో పేపర్లు చూపిస్తుండగానే.. అతడి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా.. పక్కనే ఉన్న పోలీసులకు వీడి సంగతేంటో చూడండని ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించాడు. ఈ తతంగం మొత్తాన్ని సెల్ఫోన్ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో.. కేంద్ర హోం శాఖ స్పందించింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ సెక్రటరీ సంజీవ్ గుప్తా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆ కలెక్టర్ చర్య హేయమైందన్నారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ దృష్టికి ఈ వ్యహారాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ మరింత హుందాగా ప్రవర్తించాల్సి ఉందన్న సంజీవ్ గుప్తా.. ఇది గోరా సాహిబ్ సిండ్రోమ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారం పెద్దది అవుతుందని గమనించిన జిల్లా కలెక్టర్ ఆ యువకుడికి క్షమాపణలు చెప్పారు. జిల్లాలో కరోనా సమస్య తీవ్రంగా ఉందని.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. తనకు, తన తల్లిదండ్రులకు కూడా కోవిడ్ సోకిందన్న రణబీర్ శర్మ.. తాను కరోనా నుంచి కోలుకున్నానని.. కానీ తన తల్లికి ఇంకా తగ్గలేదని ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్న యువకుడు మైనర్ కాదని ఆయన వివరణ ఇచ్చారు. జిల్లా ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని.. ఎంతో అవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు.
కలెక్టర్ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రంగా స్పందించారు. సూరజ్పూర్ కలెక్టర్ రణబీర్ శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘సూరజ్పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ ఒక యువకుడిపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. ఇది చాలా విచారకరం.. ఖండించదగింది. ఛత్తీస్గఢ్లో ఇలాంటి చర్యను అస్సలు సహించం.. కలెక్టర్ రణబీర్ శర్మను తొలగించే ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని సీఎం అన్నారు. రణబీర్ను తప్పించిన సీఎం ఆయన స్థానంలో రాయ్పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్కుమార్ సింగ్ను నియమించారు.
కలెక్టర్ రణబీర్ శర్మ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరికత ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.