బ్లాక్ అండ్ వైట్ అటాక్‌.. ఫంగ‌స్‌తో ఫ‌స‌క్‌..

5,500 కేసులు. 126 మరణాలు. ఇవేమీ క‌రోనా సోకిన వారి వివ‌రాలు కావు. అవేమీ కొవిడ్‌తో సంభ‌వించిన చావులేమీ కావు. ఇన్నాళ్లూ.. ప్ర‌తీరోజూ కొత్త‌గా ఇంత మందికి క‌రోనా సోకింది.. వైర‌స్ వ‌ల్ల అంత మంది చ‌నిపోయారంటూ అప్‌డేట్స్ తెలుసుకున్నాం. ఇక‌పై క‌రోనాకు తోడుగా బ్లాక్ ఫంగ‌స్ డిటైల్స్ సైతం తెలుసుకోవాల్సిన దుస్థితి. ఎందుకంటే, క‌రోనా మాదిరే.. బ్లాక్ ఫంగ‌స్ కేసులు సైతం దేశంలో విప‌రీతంగా పెరుగుతున్నాయి. మ‌ర‌ణాలూ అదే జోరుతో న‌మోద‌వుతున్నాయి. కొవిడ్‌తో పోలిస్తే.. బ్లాక్ ఫంగ‌స్ మ‌రింత డేంజ‌ర‌స్ అనే వార్త‌లు మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.  ఓ వైపు దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ ఫంగస్‌ వ్యాధి భయపెడుతోంది. రోజురోజుకీ బ్లాక్‌ ఫంగస్ (మ్యుకర్‌ మైకోసిస్‌) కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,500 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకాగా.. 126 మంది చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనే ఈ ఫంగస్‌ కేసులు కూడా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 మరణాలు సంభవించాయి.    ఆ తర్వాత హరియాణాలో 14 మంది, ఉత్తరప్రదేశ్‌లో 8 మంది, ఝార్ఖండ్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో మరణించారు. కొన్ని రాష్ట్రాలు ఈ ఫంగస్‌ కేసులు, మరణాలను నమోదు చేయకపోవడంతో ఇంకా పూర్తి సంఖ్య స్పష్టంగా తెలియడం లేదంటున్నారు.  తెలుగురాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగ‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. ఏపీలో ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు స‌రైన స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో.. బాధితులంగా హైద‌రాబాద్‌కు క్యూ క‌డుతున్నారు. క‌రోనా విష‌యంలోనే అట్ట‌ర్‌ఫ్లాప్ అయిన జ‌గ‌ర్‌రెడ్డి స‌ర్కారు.. ఇక బ్లాక్ ఫంగ‌స్‌ను అరిక‌ట్ట‌డంలో చేతులెత్తేసింది. ఏపీ స‌ర్కారు బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చి చేతులు దులిపేసుకుంది.   అటు, తెలంగాణ‌లో బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచీ హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి వస్తున్నా పడకలు దొరకడం లేదు. తమ వంతు కోసం ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని బ్లాక్‌ ఫంగస్‌కు నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. ప్రస్తుతం 90 పడకల వరకు నిండడంతో మరో 50 పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలవారనే వివక్ష లేకుండా అందర్నీ చేర్చుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తుండగా, పడకలు లేకపోవడం వల్లే కొందరికి కేటాయించలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు.  ఈఎన్‌టీ వైద్యశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సీటీస్కాన్‌ పనిచేయడం లేదు. ఫంగస్‌ ముఖ భాగంలో ఎక్కడెక్కడ వ్యాపించిందనేది గుర్తించడం కష్టమే. ఫంగస్‌ మెదడులోకి విస్తరించిందో లేదో తెలుసుకోవాలంటే బ్రెయిన్‌ ఎం.ఆర్‌.ఐ., మరికొన్ని ఇతర పరీక్షలు అవసరమవుతాయి. ఇవేమీ ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులను ఉస్మానియా ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.    గాంధీ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. కేవలం కరోనా పాజిటివ్‌తో పాటు బ్లాక్‌ఫంగస్‌ ఉంటేనే చేర్చుకుంటున్నామని వైద్యులు తెలిపారు. ఇక్కడ చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య గురువారానికి 23కు చేరింది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని నాలుగో అంతస్తులో 30 పడకలతో ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేశారు.  నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బ్లాక్‌ఫంగస్‌ బాధితుల తాకిడి పెరుగుతోంది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 39 మంది చేరారు. ఇప్పటికే ఇక్కడ 90 మంది వరకు చేరారు. ఏడుగురికి శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో ఇదే వ్యాధితో 23 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కోఠి ఈఎన్‌టీలో పడకలకు కొరత ఏర్పడుతోంది.    మరోవైపు బ్లాక్‌ఫంగస్‌ ఉద్దృతమవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాలని, రోగులకు అత్యవసర చికిత్స అందించాలని కేంద్రం ఆదేశించింది. అటు కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఉపయోగించే లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ ఔషధం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ మందుల కొరతను అధిగమించేందుకు మరో 5 కంపెనీలకు అనుమతులిచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.  కొవిడ్ వైరస్, బ్లాక్ ఫంగస్ భయం ఉండగానే తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ... వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే వీరికి  యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. వైద్యులు చెపుతున్న దాని ప్రకారం బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మ‌రింత డేంజ‌ర‌స్‌. వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్ఆర్సీటీ ద్వారా ఈ ఫంగస్ ను గుర్తించవచ్చు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు హెచ్ఆర్‌సీటీలో కనిపిస్తే, వైట్ ఫంగస్‌ను కనుగొనడానికి మ్యూకస్ (శ్లేష్మం) కల్చర్‌ను ఎగ్జామిన్ చేయాలి. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు.. వైట్ ఫంగస్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌.  ఇలా క‌రోనాకు పోటీగా బ్లాక్ అండ్ వైట్ ఫంగ‌స్ కేసులు పెరుగుతుండ‌టం తీవ్ర ఆందోళ‌న‌క‌రం. క‌రోనానే అంటే ఈ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు మ‌రింత డేంజ‌రస్ అని చెబుతుండ‌టంతో ప్ర‌జ‌లు మ‌రింత బెదిరిపోతున్నారు. 

ఆసియా సంప‌న్నులు.. మోదీ హ‌యాంలో అప‌ర కుబేరులు..

ప్ర‌ధాని మోదీ దేశ సంప‌దంతా అంబానీ, అదానీల‌కు దోచి పెడుతున్నాడనేది విప‌క్షాల ఆరోప‌ణ‌. ఇందులో నిజ‌మెంత ఉందో తెలీదు కానీ.. అంబానీ, అదానీలు మాత్రం ఆసియాలోకే సంప‌న్నులుగా ఎదిగారు. రిల‌య‌న్స్ గ్రూపు మొద‌టి నుంచీ రిచెస్ట్ కంపెనీగానే ఉన్నా.. అదానీ గ్రూప్ మాత్రం ఇటీవ‌ల కాలంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలోని పోర్టుల‌న్నిటిలోనూ ఆదానీ కంపెనీ పాగా వేస్తోంది. ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు పోర్టులు అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయాయి. ఇలా తీర ప్రాంత వ్యాపార‌మంతా దాదాపు అదానీ హ‌స్త‌గ‌తంలోనే ఉంది.  ఎక్స్‌పోర్ట్స్‌, ఇంపోర్ట్స్‌, ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్‌, ఫ్రీడ‌మ్ బ్రాండ్‌, ఇలా ప‌లుర‌కాల వ్యాపారాల‌తో గ‌డిచిన ప‌దేళ్ల‌లో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు ఎగ‌బాకింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టుగానే.. మోడీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే.. గుజ‌రాత్‌కు చెందిన అదానీ.. ఆసియా కుబేరుల్లో నెంబ‌ర్ 2 పొజిష‌న్‌కు చేరుకున్నాడు. మ‌రో గుజ‌రాతీ అయిన‌ ముకేశ్ అంబానీ త‌ర్వాత స్థానంలో నిల‌బ‌డ్డాడు. తాజాగా, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద మరింత పెరిగింది. ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం.. ఇంతవరకూ ఆసియా నెం.2గా కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్‌ షాన్షాన్‌ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీతో గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద  6,650 కోట్ల డాలర్లకు అన‌గా సుమారు రూ.4.86 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో అదానీ.. చైనాకు చెందిన షాన్షాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరారు.  ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్ల మేర పెరగగా.. షాన్షాన్‌ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ఇక ఆసియా నెం.1 గా ఉన్న ముకేశ్‌ అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో సుమారు రూ.5.58 లక్షల కోట్లు. అంటే అంబానీ, అదానీల మ‌ధ్య సుమారు ల‌క్ష కోట్ల మేర తేడా ఉంది. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13, అదానీ 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు. 

తండ్రిని చంపిన కొడుకు.. 

యముడు సిగ్నల్ ఇస్తే.. ఎవడైనా యమలోకానికి వేలాల్సిందే.. పెద్దల సామెతలో చెప్పాలంటే ఈ భూమి  మీద నూకలు చెల్లితే ఏ మనిషైన బకెట్ తన్నాల్సిందే.. కానీ ఈ రెండు కాకుండానే కొత్త కన్నా వాళ్లే తల్లిదండ్రులను ఖతం చేస్తున్నారు. ఏమోక్షన్స్ నేటి సినిమాలో అయినా ఉన్నాయేమోగాని జనాలకు మాత్రం ఎలాంటి ఎమోషన్స్ లేవు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రోజు జరిగే క్రైమ్ అలా ఉంది. అనవసరంగా ఒక మనిషిని  చంపితే ఆ చంపినా వాడి లెక్క ఆ దేవుడు అనేవాడు  ఉంటే ఆయనే చూసుకుంటాడు.. తప్పుచేసిన వాడి లెక్కలు ఆయనే తెలుస్తాడు.. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. మీరే చూడండి..  ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనికరం లేకుండా కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన జిల్లాలోని సంతమాగులూరు మండలం సజ్జాపురంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున కోడలు, కొడుకు కలసి తండ్రిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు, కోడలు పరారీలో ఉన్నట్టు సమాచారం.  కరోనా ఏమోగాని.. కరోనా ఆత్మహత్య ఎక్కువ..  ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మరోవైపు వైరస్‌ భయానికి పలువురు పేషెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మరింత కలచివేస్తున్నాయి. ఇటువంటి విషాద ఘటన కృష్ణా జిల్లాలోని పెడనలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్, భారతి భార్యా భర్తలు. వీరికిద్దరు పిల్లలు. 10 రోజుల క్రితం ఈ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో హోంఐసోలేషన్‌లో ఉంటున్న దంపతులు.. వైరస్ ఎంతకీ తగ్గడం లేదన్న మనస్థాపంతో ఉరివేసుకున్నారు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చివరకు అనాథలుగా మిగలడం బాధాకరం. మూడు రోజుల్లో పెళ్లి కరోనా తో వరుడు మృతి..  మరో మూడు రోజుల్లో పెళ్లి భాజాలు మోగుతాయనుకున్న ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాలూరు మండలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుకుట్టి గ్రామంలోని ఓ బ్యాంకులో బ్యాంకుమిత్రగా పనిచేస్తున్న చిన్నపాత్రుని మనోహర్‌(22)కు ఈ నెల 23న వివాహం జరగనుంది. 21న ముహూర్తపు రాట వేసేందుకు పెద్దలు ఏర్పాట్లు చేశారు. 13న ఆయనకు జ్వరం రావడంతో తోణాం పీహెచ్‌సీలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటానని మనోహర్‌ చెప్పినా, ఆక్సిజన్‌ శాతం తగ్గడంతో ఆయనను వైద్యాధికారిణి సుజాత బొబ్బిలికి రిఫర్‌ చేశారు. అక్కడి నుంచి ఆయన జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారం నుంచి అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.    ఆసుపత్రిపై నుండి పడి మరొకరు మృతి..  కరోనా సోకిన భార్యను ఆసుపత్రిలో చేర్పించి ప్రమాదవశాత్తు అదే ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి పడి భర్త దుర్మరణం చెందిన ఘటన మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్‌ సమీప మిందిలో నివాసముంటున్న మల్లప్పరెడ్డి మురళీకృష్ణ (48) డాబాగార్డెన్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. భార్య గీతారాణి (45)కి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈనెల 18న కేజీహెచ్‌ సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు సపర్యలు చేస్తున్నారు. ఈనెల 19న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ మూడో అంతస్తు బాల్కనీ వద్ద నిల్చొని మాట్లాడుకుంటుండగా ప్రమాదవశాత్తు మురళీకృష్ణ కింద పడి దుర్మరణం చెందారు. వీరికి పాప, బాబు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో వీరిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. బంధువులే దగ్గరుండి అంత్యక్రియలకు సహకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.          

తెలంగాణ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5 , 21 , 073  మంది విద్యార్థులను ఉత్తిర్ణులను చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 5, 16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని అన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారని తెలిపారు. 2 , 10 , 647  మంది విద్యార్థులు  10/10 జి.పి.ఎ. సాధించినట్లు మంత్రి  వెల్లడించారు. మొత్తం 535  పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయని వెల్లడించారు.   ఇంటర్నల్ అసెస్మెంట్  మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలను  WWW  .bse .telangana .gov .in  మరియు   http .// results .BSETELANGANA .ORG వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చని మంత్రి సబిత చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు.  విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపిన యెడల వెంటనే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్ లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని  తమ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి కోరారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తిర్ణులను చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నిర్ణయం మేరకు అందరిని ఉత్తిర్ణులను చేయడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు.  ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.   

దూకుడు పెంచిన రఘురామ.. జగన్ సర్కార్ కు చుక్కలేనా? 

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరింత దూకుడు పెంచారు. కొంత కాలంగా జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న రఘురామ.. న్యాయ పోరాటాలు తీవ్రతరం చేశారు. రాజద్రోహం కేసులో తనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. తాజాగా జగన్ సర్కారు మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు సీఎం జగన్ వ్యక్తిగత అంశాల మీద విమర్శలు సంధించే రఘురామ.. తాజాగా అందుకు భిన్నంగా ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తుల్ని గుజరాత్ కు చెందిన అమూల్ కు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ ఆస్తుల్ని అమూల్ సంస్థకు అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న జీవో 117ను జారీ చేసిందని.. దీని కారణంగా రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు రఘురామ. రఘురామ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామన్నారు. ప్రభుత్వ సొమ్మును అమూల్ వాణిజ్య అవసరాలకు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఘురామ తరఫు న్యాయవాది కోరారు.  అయితే విచారణ అనంతరం అలాంటిది చేస్తే ఆసొమ్ము వెనక్కి రాబట్టేలా చేస్తామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.  వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని.. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెబుతామని హైకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రఘురామ తరఫు న్యాయవాది.. మే నాలుగున ఏపీ మంత్రివర్గం ఆస్తుల్ని అమూల్ చేతికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని.. వేసవి సెలవుల తర్వాత విచారణ జరిపితే పిల్ వ్యర్థమవుతుందన్నారు. డెయిరీ ఆస్తుల బదలాయింపులపై స్టే కావాలని భావిస్తే.. ఆ జీవోను సవాలు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం కోరింది. ఈ మేరకు అనుబంధ పిటిషన్ ధాఖలు చేస్తామని చెప్పగా.. అందుకు అంగీకరించి ఈ నెల 27న జరిగే ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చేలా వాయిదా వేశారు. రఘురామ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. తదుపరి వాయిదాలో చెప్పాలని.. తాము వింటామని ధర్మాసనం చెప్పింది. మొత్తంగా.. ఇప్పటివరకు చర్చకు లేని రీతిలో అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న డీల్ కొత్త రభసకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏపీ సర్కార్ తీసుకున్న మరికొన్నినిర్ణయాలపైనా రఘురామ రాజు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా నొటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదన్న హైకోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఆంధ్రప్రదేశ్ లో  పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ 8న జరిగాయి. ఈ ఎన్నికలపై మొదటి నుంచి హైడ్రామానే నడిచింది. 2020 మార్చిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా.. కొవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడ్డాయి. 2021 ఏప్రిల్ 1న  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు పరిషత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ నిలిచిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎస్ఈసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. గత నోటిఫికేషన్ ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై  విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన బెంచ్.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిలిపేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఎస్ఈసీ పిటిషన్ పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాలు ప్రకటించరాదని పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఏప్రిల్ 8న 516 జెడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు  జరిగాయి. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది పోటీ పడ్డారు.126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరిగినా.. హైకోర్టు ఆదేశాలతో లెక్కింపు జరగలేదు. తాజాగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచనంగా మారింది .

దేశంలో మరణాలు 4 వేలు.. రికవరీలు కూడా ఎక్కువే.. 

దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. నిన్న మృతుల సంఖ్య మరోసారి నాలుగువేలకు పైగా నమోదైంది. అలాగే 2.59లక్షల మంది వైరస్ బారిన పడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   గురువారం 20,61,683 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,59,551 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చుకుంటే కొత్తకేసులు స్వల్పంగా తగ్గాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకోట్ల 60లక్షల మార్కును దాటింది. 24గంటల వ్యవధిలో 4,209 మంది ప్రాణాలు వదిలారు. క్రితంరోజు ఆ సంఖ్య 3,874గా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది చనిపోయారు. ఇప్పటివరకు 2,91,331మంది ప్రాణాలు గాల్లోకలిశాయి. అయితే వరసగా మూడురోజులుగా 20లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదు అవుతున్నాయి.   ఇక, క్రియాశీల కేసుల్లో తగ్గుదల, రికవరీల్లో పెరుగుదల సానుకూల అంశాలు. ప్రస్తుతం 30,27,925 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 11.63 శాతానికి తగ్గింది. వరసగా ఎనిమిదో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న 3,57,295 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.27కోట్ల మందికిపైగా కోలుకోగా..రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 14,82,754 మంది టీకాలు అందాయి.  ఒక వైపు ఈ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ లెక్కలపై విమర్శలు లేక పోలేదు.. రోజుకి 4000 మరణాల కంటే ఎక్కువ సంభవిస్తున్నాయి అని కొందరు పేర్కొంటున్నారు. రోజుకి 4 వేల మంది చనిపోతే స్మశానం లో శవాలు క్యూ లు ఎందుకు ఉన్నాయని, గంగ నదిలో శవాలు ఎందుకు తేలుతున్నాయని విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంటుంది.  మరో వైపు కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి వరకు ఉంటుందని ప్రజల్లో ఆందోళన లేకపోలేదు. శాస్త్రవేత్తలు  మాత్రం జులై వరుకు కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని అంటున్నారు. ఏవి వాస్తవాలో అవాస్తవాలో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంది.     

కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు కోసం క్యూ కట్టిన జనాలు 

కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి పంపిణి ప్రారంభించారు. ఆనందయ్య యాదవ్ పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని ల్యాబ్లో తేలడంతో.. శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది. ఆనందయ్య కరోనా మందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం క్యూకడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో ఇంకా పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశముంది. దీంతో  కృష్ణపట్నంలో ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మందు కోసం వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. గ్రామానికి వెలుపల పోలీసు ఔట్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మందు పంపిణీ ఏర్పాట్లను తహశీల్దార్ సోమ్లా నాయక్, కృష్ణపట్నం సీఐ ఖాజావలి పరిశీలించారు. మందు కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా భోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.  నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య యాదవ్ ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. ఐతే దీనికి మొదట బ్రేక్‌లు వేసిన ప్రభుత్వం.. తాజా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత వారం నెల్లూరు జిల్లా అధికారులు ఈ కరోనా ముందు నమూనాలను హైదరాబాద్‌లోని ఆయుష్‌ ప్రయోగశాలకు పంపించారు. అనంతరం ఆనందయ్య ఆయుర్వేద మందులో హానికారకాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పెద్ద పల్లేరు కాయ, నేల ఉసిరి, పిప్పిళ్ల చెక్క, పుప్పింట ఆకు, గుంట గరగర తేనె, పసుపు, జాజికాయ,మారేడు, నేరేడు, వేప ఇగురు, దేవర ఒంగి తదితర పదార్థాలు ఉన్నాయని.. ఇవి హానికారక పదార్థాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక ముందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి మూడు రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యా రాలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ఓ వ్యక్తి ఈ మందు తీసుకున్నాక కోలుకున్నారని అంటున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగపడుతున్నారు. 

ఆమెకు 65 ఏళ్ళు.. అబ్బాయికి 16 ఏళ్ళు..  చివరికి ఇలా.. 

అది ప్రకాశం జిల్లా. టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామంలో. ఒక వ్యక్తి కి చేపల చెరువులు ఉన్నాయి. అలాగే ఆ గ్రామ శివారులో బొప్పాయి తోట కూడా ఉంది.. అతని తల్లి రోజు ఆ బొప్పాయి తోట దగ్గరకు కాపలాగా వెళ్ళేది..ఎప్పటి ఆలాగే అతని తల్లి బొప్పాయి తోట దగ్గరికి వెళ్ళింది. కానీ తిరిగిరాలేదు.. ఆ వృద్ధురాలి కొడుకు కంగారు పడ్డాడు.. తల్లి ఏమైందో వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికిన ఆచూకీ తెలియపోయే సరికి పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సినిమా లెవీల్లో రెక్కీ చేశారు. తలలు పట్టుకున్నారు. చివరికికి ఆ వృద్ధురాలు చనిపోయిందని ఫైనల్ చేశారు. ఆమె శవం ఉన్న చోటుని గుర్తించాడు. అసలు ఏం జరిగింది. ఆ హత్య ఎవరు చేశారు..?  ఎలా చేశారు...? తెలుసుకోవాలంటే..  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వృద్ధురాలి కుమారుడికి రొయ్యల చెరువులున్నాయి. వాటిల్లో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలను కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి తీసుకువచ్చాడు. తన స్వగ్రామం మల్లవరప్పాడులో తమ బొప్పాయి తోటలో పని చెయ్యడం కోసం ఈ నెల 13న ఇద్దరిని అక్కడికి పంపాడు. 14న కూడా వారికి అక్కడే పని చేయించాడు. అప్పుడే తోటకు వచ్చిన పూర్తిగా వినపడని, అంతంతమాత్రరగా మాట్లాడే వృద్ధురాలైన అతని తల్లి రోజు మాదిరిగానే ఈ నెల 14న తమ బొప్పాయి తోట వద్దకు కాపలాగా వెళ్లింది. తోట గేటు తీసే సమయంలో ఆమెకు, అక్కడ పనిచేస్తున్న బాలునికీ మధ్య వివాదం తలెత్తింది. ఆమె తనను దూషించిందని ఆ బాలుడు కోపంతో రగిలిపోయాడు. తోటలో గడ్డి కోసే పనిలో నిమగ్నమై ఉన్న ఆమెపై దోకుడు పారతో ఆ బాలుడు దాడి చేశాడు. ఆమె కింద పడిపోవటంతో మెడకు కండువా బిగించి హత్య చేయాలని చూశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో బండరాయితో తలపై బాది ప్రాణాలు తీశాడు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియకూడదని తెలివి ప్రదర్శించాడు. ఏ పాపం తెలియనట్టు డ్రామాలు ఆడాడు. హత్య చేసి.. అత్యాచారం చేసిన తరువాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా బిందు సేద్యం పైపులు, చెత్త వేసి వెళ్లిపోయాడు. అసలు ఏం తెలియనట్టు తర్వాత రోజు కూడా తను అక్కడే పని చేశాడు. తల్లి ఆచూకీ కోసం ఆమె కుమారుడు వెతుకూతూ ఉంటే.. తనకు తెలియనట్లుగా నటించాడు. చివరికి పోలీసు దర్యాప్తులో దొరికిపోయాడు.  అక్కడితోనే అతడి కసి తీరలేదు. దీంతో ప్రాణం లేని శరీరంతో తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అయితే విషయం ఎవరికీ తెలియకూడదని భావించి మృతదేహంపై పైపులు, గడ్డి వేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పొలానికి వెళ్లిన తల్లి ఇంటికి రాకపోవటంతో ఆమె కుమారుడు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి బొప్పాయి తోటలోనే వృద్ధురాలు హత్యకు గురైన స్థితిలో గుర్తించి టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ సీఐ కె.శ్రీనివాసులు ఈ హత్య కేసును దర్యాప్తు చేశారు. ఆ రోజు తోటలో పనిచేసిన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్‌ హోంకు తరలించినట్లు ఎస్సై నాయబ్‌రసూల్‌ చెప్పారు.

సీబీఐ విచారణ జరిపించండి.. రఘురామ కేసులో మరో పిటిషన్ 

నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ రఘురామ కృష్ణం రాజు కేసులో శుక్రవారం కీలక విచారణ జరగనుంది. గతంలో రఘురామ వేసిన బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరపనుంది. ఈకేసులోనే సుప్రీకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు రఘురామ తనయుడు భరత్‌. తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్‌ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో), సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌ విజయ పాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.  ‘2004-09 మధ్యకాలంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ‘క్విడ్‌ ప్రొ కొ’ పద్ధతిలో అవినీతికి పాల్పడినందున 11 కేసుల్లో సీబీఐ జగన్‌ను నిందితుడిగా చేర్చింది. ఆయనపై మనీలాండరింగ్‌ కేసులు కూడా ఉన్నాయి. 16 నెలలు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం జగన్‌ తన సహనిందితులకు ఉన్నత స్థానాలు కల్పించి సాక్షులను దారికి తెచ్చుకోవడానికి భయోత్పాతం సృష్టిస్తున్నారు. దాంతో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నా తండ్రి రఘురామరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి రోజూ ఫోన్లు, సామాజిక మీడియా ద్వారా ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు’ అని తన పిటిషన్ లో భరత్ తెలిపారు.  ఈ నెల 14న ఉదయం 9 గంటలకు రఘురామరాజుపై కేసు నమోదుచేయించి.. 40 మంది పోలీసులను గుంటూరు నుంచి హైదరాబాద్‌ పంపించి.. మధ్యాహ్నం 3.30కి అరెస్టు చేయించారు. గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ గైనకాలజిస్టు. ఇది అప్పుడు మా న్యాయవాదులకు, గౌరవ హైకోర్టుకు తెలియదు. పైగా ఆమె భర్త వైసీపీ లీగల్‌ సెల్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు’ అని తన పిటిషన్ లో పొందు పరిచారు భరత్.  సీఎం జగన్‌ చెప్పినట్లు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ నడుచుకుంటున్నారని భరత్‌ తన పిటిషన్‌లో తెలిపారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఆయన చెప్పుచేతల్లో ఉందన్నారు. సీఐడీ ఏడీజీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చినవారిని ఎంచుకుని సీఐడీలో కీలక పోస్టుల్లో నియమించుకున్నారు. వీరిలో సీఐడీ అదనపు ఎస్పీ, నా తండ్రి కేసు దర్యాప్తు అధికారి విజయపాల్‌ కూడా ఒకరు. నిరుడు డిసెంబరు 29న విజయనగరం జిల్లా రామతీర్థంలో వెయ్యేళ్లనాటి శ్రీరామచంద్రుడి విగ్రహం తలనరికేశారు. దీనిపై హిందూ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో ఈ సంఘటనపై సునీల్‌కుమార్‌ నేతృత్వంలో జగన్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. వీరిద్దరూ ఒకే మతానికి చెందినవారు. దీనిపై రఘురామరాజు ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. అలాగే సునీల్‌కుమార్‌ ఏసుక్రీస్తును, బ్రిటిష్‌ పాలకులను పొగడుతూ చేసిన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.  సునీల్‌కుమార్‌కు, ఆయన భార్యకు వైవాహిక జీవితంలో సమస్యలున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.  ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను తమకు అందించాలని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదిక ఇప్పటికే కోర్టుకు చేరింది. మరోవైపు  బెయిలు కోసం రఘురామ పెట్టుకున్న స్పెషల్‌ లీవ్ పిటిషన్‌కు కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది. గురువారం జరిగిన విచారణలో రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రఘురామ రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇప్పటికే వై సెక్యూరిటీని కూడా పొందారని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. రఘురామ పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నేటి వరకు వాయిదా కోరింది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. 

కరోనాతో ఎంపీ, ఆయన ఇద్దరు కుమారులు మృతి

దేశంలో కరోనా మహమ్మారికి లక్షలాది మందిని బలైపోతున్నారు. పేద, దనిక తేడా లేకుండా అంతా వైరస్ సోకి చనిపోతున్నారు. కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే.. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు. వందల కోట్ల ఆస్తిపరులు, రాజకీయ నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒడిషాలో ఒక ఎంపీ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. ఎంపీతో పాటు ఆయన ఇద్దరు కుమారులను వైరస్ బలి తీసుకుంది.  ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78) కూడా కరోనాతో చనిపోయారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా కొన్నిరోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. మహాపాత్ర ఈ నెల 9న మరణించారు. గత నెల 22న ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకోలేకపోయారు.ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్ కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత బుధవరం  కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత గురువారం తుదిశ్వాస విడిచాడు. రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

బీహార్ లో కొత్త వైరస్.. ఇదీ యమ డేంజరట!

దేశంలో ఇప్పటికే కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి సోకిన జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే వెలుగులోకి వచ్చిన బ్లాక్ ఫంగస్ కూడా వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి.మహారాష్ట్రలో 1,500 మంది దాని బారిన పడగా.. 90 మంది చనిపోయారు. దాని మరణాల రేటు 50 శాతంగా ఉంది. బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు అంటువ్యాధిగా ప్రకటించాయి. చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కొవిడ్ వైరస్, బ్లాక్ ఫంగస్ భయం ఉండగానే తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ... వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే వీరికి  యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.వైద్యులు చెపుతున్న దాని ప్రకారం వైట్ ఫంగస్ కన్నా బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకారి. వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్ఆర్సీటీ ద్వారా ఈ ఫంగస్ ను గుర్తించవచ్చు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు హెచ్ఆర్‌సీటీలో కనిపిస్తే, వైట్ ఫంగస్‌ను కనుగొనడానికి మ్యూకస్ (శ్లేష్మం) కల్చర్‌ను ఎగ్జామిన్ చేయాలి. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. దానిని ఎపిడెమిక్ గా గుర్తించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద దానిని ‘ప్రమాదకరమైన జబ్బు’గా గుర్తించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స, నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలిన ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదేశించారు. తాజా ఆదేశాలతో ప్రతి బ్లాక్ ఫంగస్ కేసునూ జిల్లాల అధికారులు ఆరోగ్య శాఖకు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆరోగ్య శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది.

అసెంబ్లీలోనూ కులం కంపేనా! రాష్ట్రం పరువు పోతున్నా జగన్ మారరా?

దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్ని వైరస్ పై వార్ చేస్తున్నాయి. కొవిడ్ కంట్రోల్ కోసం లాక్ డౌన్ అమలు చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ఏపీలోను కొవిడ్ విలయ తాండవం చేస్తోంది. పాజిటివిటి రేటు ప్రమాదకరంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి కూడా ఉంది. రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కొవిడ్ భయంతో ఏపీ జనాలు వణికిపోతున్నా జగన్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పై ఫోకస్ చేస్తే.. ఏపీలో మాత్రం కక్ష రాజకీయాలు, కులం కంపే ప్రాధాన్యతగా ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీలో వరుసగా జరుగుతున్న అరెస్టులు, కొవిడ్ వ్యాక్సిన్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలానే ఉంటున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే మీడియా సమావేశంలో కులాల ప్రస్తావన తేవడం దుమారం రేపింది.  కొవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. వ్యాక్సిన్లకు కులం లింక్ కలపడంపై తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన తీరు మారలేదు. ఈసారి అసెంబ్లీ వేదికగా మళ్లీ ఆవే వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన జగన్..  విపక్ష తెలుగుదేశం పార్టీపైనా, కొన్ని మీడియా సంస్థలపైనా విమర్శలు చేశారు. వ్యాక్సిన్ అంశంపై కొందరు పదేపదే వక్రీకరిస్తున్నారని, తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారని జగన్ అన్నారు. దేశంలో18 ఏండ్ల పైబడిన వారందరికి  రెండు డోసులు ఇవ్వాలంటే 170 కోట్ల డోసులు కావాలని చెప్పారు జగన్. అయితే మనదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కేవలం 7 కోట్ల డోసులేనని.. వీటిలో 6 కోట్ల డోసులు సీరమ్ సంస్థ, 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్నాయని తెలిపారు. దేశానికి 172 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగింది 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు.  ఇక ఏపీలో 7 కోట్ల డోసులు అవసరం ఉందన్నారు జగన్ . కానీ కేంద్రం ఇప్పటివరకు 76 లక్షల 29 వేల 580 డోసులే ఇచ్చిందని చెప్పారు.వాస్తవాలు ఇలావుంటే... కొందరు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఆరోపణలు చేసేవారందరికీ ఈ పరిస్థితులు తెలుసన్నారు. ఈ ఆరోపణలనే ఈనాడులో రామోజీరావు గారు రాస్తుంటారు. ఇదే రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే ఈ భారత్ బయోటెక్. చంద్రబాబునాయుడికీ బంధువులు. మరి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలుసు కదా అధ్యక్షా అంటూ జగన్ ప్రసంగించారు. తెలిసి కూడా... వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు పెట్టి వ్యాక్సిన్లు ఎందుకు కొనడంలేదు? కమీషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడంలేదని అంటున్నారు. కొవిడ్ సమయంలో ఈ దుర్మార్గపు ఆరోపణలు, వక్రీకరణలు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతుందన్నారు జగన్.  కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఎంపీ కృష్ణా ఎల్లాకు కులం లింక్ కలుపుతూ గతంలో సీఎం జగన్ మాట్లాడారు. ఈనాడు గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయనకు స‌మీప బంధువులు అని చెప్పారు. ఇక్క‌డ మ‌రో అక్ర‌మ సంబంధమూ అంట‌గట్టారు సీఎం గారు. రామోజీరావుకు చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎలాంటి బంధుత్వం లేద‌నేది జ‌గ‌మెరిగిన విష‌యమే. అయినా.. జ‌గ‌న్‌రెడ్డి వారిద్ద‌రికీ బ‌ల‌వంతంగా బంధం క‌లిపేశారు. కొవాగ్జిన్ త‌యారు చేస్తున్న‌ భార‌త్ బ‌యోటెక్ య‌జ‌మాని.. రామోజీరావు కొడుకు వియ్యంకుడు కాబ‌ట్టి.. ఆయ‌న‌ చంద్ర‌బాబుకూ బంధువే అవుతార‌ట‌. అదెలాంటి చుట్ట‌రిక‌మో ఆయ‌న‌కే తెలియాలి. కొవాగ్జిన్ కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌కుండా.. ఆ ముగ్గురు క‌మ్మ కుల‌స్తులు కాబ‌ట్టే.. ఏపీకి వ్యాక్సిన్ ఇవ్వ‌టం లేదనే సంకేతం ఇచ్చేలా కూత‌లు కూశారు గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు. తాజాగా మరోసారి అసెంబ్లీ వేదికగా ఆవే మాటలు మాట్లాడారు. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

జిల్లాకో ఆక్సిజన్ ప్లాంట్.. సోనుసూద్ బాటలో చిరంజీవి

కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు సోనుసూద్. సూద్ ఫౌండేషన్ నుంచి దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ప్రస్తుతం సోనుసూద్ దేవుడిలా కనిపిస్తున్నారు. క‌రోనా బాధితుల‌కు, వ‌ల‌స కూలీల‌కు, ఆప‌ద‌లో ఉన్న వారికి నేనున్నాంటూ ఆదుకుంటున్నారు. అందుకే ప్ర‌స్తుత కొవిడ్ కాలంతో.. క‌ష్టం వ‌స్తే ప్ర‌భుత్వాల వైపు చూడ‌ట లేదు.. పాల‌కుల‌ను వేడుకోవ‌డం లేదు.. సోనుసూద్‌నే త‌లుచుకుంటున్నారు. సోను సేవలతో టాలీవుడ్ హీరోల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  సోనుసూద్ ప్రభావమో, తమపై వస్తున్న విమర్శలే కారణం తెలియదు కాని.. టాలీవుడ్ హీరోలు కూదా కోవిడ్ కోసం కదలివస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల తిరుపతి రుయాలో కూడా ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆక్సిజన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్‌ మానిటర్‌ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్‌ ఖాతాను కూడా ప్రారంభించారు.  చిరంజీవి ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నారు. ఎవరూ రక్తం దొరకని సరిస్థితిలో ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును స్థాపించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మృతి చెందాడు. చాలాకాలంగా తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ మరణించడంతో చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు. 

ఎమ్మెల్యే తిట్ల దండకం.. అభినందించిన సీఎం జగన్! 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ప్రతిపక్ష టీడీపీ సభను బహిష్కరించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఇంకేం సభా వేదికగా కొందరు ఎమ్మెల్యేలు నోటికి పని చెప్పారు. సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహించారు. సభలోని లేని వ్యక్తులను టార్గెట్ చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదు సీఎం జగన్. వారించాల్సింది పోయి.. తిట్ల దండకం చేసిన ఓ ఎమ్మెల్యేను ఓపెన్ గానే అభినందించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సీఎం స్పందన చూసిన వారంతా షాకవుతున్నారు.  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఉన్నారు. రఘురామ రాజును కొన్ని రోజులుగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలోనూ అదే కంటిన్యూ చేశారు. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ నిర్వహించగా... గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై మాట్లాడకుండా ఎంపీ రఘురామపై మాటల దాడికి దిగారు వైసీపీ సభ్యులు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వేరే సభలో సభ్యుడిగా ఉన్న గురించి మాట్లాడటానికి వీలు లేదు. కాని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం లోక్ సభ సభ్యుడిగా ఉన్న రఘురామ కృష్ణం రాజును తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎంపీ రఘురామపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తు, నాయకుడి ఫోటోతో రఘురామ గెలిచారని.. ఆయన రాజీనామా చేస్తే వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేరని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన.. వేరే సభలో సభ్యుడి గురించి ఈ అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని.. తాను మాట్లాడినదాంట్లో తప్పుంటే ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను జోగి రమేష్ కోరారు. సభా రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడానని ఎమ్మెల్యే జోగి రమేషే అంగీకరించినా.. సీఎం జగన్ అతన్ని అభినందించి మరీ దారుణంగా వ్యవహరించారు. సీఎం  జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జోగి రమేష్‌కు థాంక్యూ చెప్పాలంటూ ఆయన్ను అభినందించాలన్నారు. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని జగన్ అన్నారు.  అసెంబ్లీలో లోక్ సభ సభ్యుడి గురించి మాట్లాడటం రూల్స్ కు విరుద్ధం. ఎమ్మెల్యే తిట్ల దండకం కూడా విరుద్ధమే. రెండు రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేను మందలించకుండా సీఎం జగన్ అభినందించడం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. స్వార్ధ రాజకీయాలతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటంపై టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు  విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మంత్రి గుర్తు చేశారు. ఈ తీర్మానం అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

2 స్టేట్స్.. సేమ్ రివేంజ్ పాలిటిక్స్‌.. ఇద్దరు మొన‌గాళ్లు..

ర‌ఘురామ కృష్ణరాజు. వైసీపీ స‌భ్యులు. న‌ర్సాపురం ఎంపీ. ఈటల రాజేంద‌ర్‌. టీఆర్ఎస్ స‌భ్యులు. హుజురాబాద్ ఎమ్మెల్యే.ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఎవ‌రి స్థాయిలో వారు మంచి నాయ‌కులే. వారిరువురూ స్వ‌ప‌క్షంలో విప‌క్షంగా మారారు. బాస్‌ల‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారారు. అందుకే, సొంత పార్టీల‌కే టార్గెట్ అయ్యారు. ఏ పార్టీ నుంచి అయితే ఎన్నిక‌య్యారో.. అదే పార్టీ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు. ఏ అధినేత‌ల‌కైతే వాళ్లు జై కొట్టారో.. ఇప్పుడు అదే అధినేతలు వాళ్లను ఏకాకుల‌ను చేసి.. కేసుల్లో ఇరికించి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏపీలో ర‌ఘురామ‌, తెలంగాణ‌లో ఈట‌ల టార్గెట్‌గా రాజ‌కీయం రంజుగా సాగుతోంది.  ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. జ‌గ‌న్ టికెట్ ఇస్తే వైసీపీ త‌ర‌ఫున న‌ర్సాపురం ఎంపీగా గెలిచారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ఆయ‌న అవ‌లంభిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను స‌హించ‌లేక‌పోయారు. అందుకే, ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రివి త‌ప్పుడు నిర్ణ‌యాలంటూ తూర్పార‌బడుతూ వ‌చ్చారు. అంతే. త‌ప్పును త‌ప్ప‌ని చెబితే జ‌గ‌న్ త‌ట్టుకోలేక‌పోయారు. త‌న పార్టీ నేత‌ల‌ను ర‌ఘురామ‌పై ఉసిగొల్పారు. అప్ప‌టి నుంచి ఏపీలో జ‌గ‌న్ వ‌ర్సెస్ ర‌ఘురామ‌, వైసీపీ వ‌ర్సెస్ ఆర్ఆర్ఆర్‌.. ఎపిసోడ్ వాడి-వేడిగా సాగింది. ప్రాణ‌భీతితో కేంద్రం నుంచి తెచ్చుకున్న‌ సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ర‌క్ష‌ణ‌తో.. కొన్నాళ్లుగా ఢిల్లీలో సుర‌క్షితంగా ఉంటూ వ‌చ్చారు ర‌ఘురామ‌.  సేమ్ టూ సేమ్‌.. తెలంగాణ‌లోనూ అంతే. ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌. ఉద్య‌మం కాడినుంచి కేసీఆర్ వెంట ఉన్న నాయ‌కుడు. అందుకే, ఆయ‌న తాను గులాబీ జెండ‌కు బానిస‌లం కాదు.. ఓన‌ర్లం అంటూ రెబెల్ జెండా ఎగ‌రేశారు. ఆత్మాభిమానం కోసం అధినేత‌కు దూర‌మ‌య్యారు. పార్టీ, ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త విష‌యాలు బ‌య‌ట‌కు లీక్ చేస్తున్నారని.. వేరే పార్టీల‌తో ట‌చ్‌లో ఉన్నారనే అనుమానంతో.. ఈట‌ల‌ను చాలా రోజులుగా దూరం పెట్టారు కేసీఆర్‌.  క‌ట్ చేస్తే.. గ‌త శుక్ర‌వారం త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అనుకోకుండా హైద‌రాబాద్ వ‌చ్చారు ఎంపీ ర‌ఘురామ‌. దొరికింది ఛాన్స్ అంటూ ర‌ఘురామ ఇంటిపై దాడి చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ఆయ‌న్ను అరెస్ట్ చేసి.. గుంటూరుకు తీసుకెళ్ల‌డం.. ఆయ‌న కోర్టుల‌కెళ్ల‌డం.. త‌న కొట్టారంటూ ఫిర్యాదు చేయ‌డం.. ఎంపీని జైలుకు త‌ర‌లించ‌డం.. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుప‌త్రిలో చేర‌డం.. కోర్టు ఉల్లంఘ‌న‌పై ఏపీ స‌ర్కారుకు హైకోర్టు నోటీసులు ఇవ్వ‌డం.. ఇలా వేగంగా ప‌రిణామాలు మారుతూ వ‌చ్చాయి.  తెలంగాణ‌లోనూ అంతే. ఉన్న‌ట్టుండి మంత్రి ఈట‌ల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డం.. వెంట‌నే విచార‌ణ క‌మిటీ వేయ‌డం.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే నివేదిక రావ‌డం.. రాత్రికి రాత్రే ఆయ‌న్ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. ఇలా 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్‌లో కేసీఆర్ వెంట ఉన్న నేత‌ను.. ఒక్క‌రోజులోనే.. అవినీతిప‌రుడిగా, పార్టీ ద్రోహిగా ముద్రేసి.. ప‌క్క‌న పెట్ట‌డం కేసీఆర్ త‌ర‌హా కంత్రీ పాలి..ట్రిక్స్‌కు నిద‌ర్శ‌నం.  ఏపీ ప్ర‌భుత్వంపై ర‌ఘురామా గ‌ట్టిగా పోరాడుతున్నారు. త‌న‌ను అంత‌లా ఇబ్బందిపెట్టినా.. త‌ల‌వంచ‌కుండా తుద‌కంటూ ఫైట్ చేస్తున్నారు. మెజిస్ట్రేట్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో త‌నవంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ర‌ఘురామ కుటుంబ స‌భ్యులు పార్ల‌మెంట్ స్పీక‌ర్‌ను క‌లిసి అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వం మాత్రం ర‌ఘురామ‌ను ఏకాకి చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. న‌ర్సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌లంతా మీటింగ్‌లు పెట్టించి.. తమ‌కు ర‌ఘురామ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పించింది. అటు, ప‌శ్చిమ గోదావ‌రిలో క్ష‌త్రియ సేవా స‌మితి సైతం స‌మావేశ‌మై ర‌ఘురామ‌కు త‌మ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించింది. అంతా దూర‌మైనా.. అంద‌రి నుంచి దూరం చేసి.. ర‌ఘురామ‌ను ఏకాకి చేసే మ‌రింత కార్న‌ర్ చేసేలా స‌ర్కారు చ‌ర్య‌లు ఉన్నాయి.  ఈట‌ల విష‌యంలోనూ అలానే జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ హుజురాబాద్ స్టార్ట్ చేసింది. న‌యానో, భ‌యానో.. నియోజ‌క‌వ‌ర్గంలోని ఈట‌ల వ‌ర్గీయులంద‌రినీ ఆయ‌న నుంచి దూరం చేస్తున్నారు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ హుజురాబాద్ ప‌రిధిలోని స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీల‌తో మాట్లాడుతూ.. వారికి ప్ర‌భుత్వ నిధుల ఆశ చూపి.. వారితో కేసీఆర్‌కు జై కొట్టిస్తున్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఏకాకిని చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ ఈట‌ల రాజేంద‌ర్‌ను రెచ్చ‌గొడుతున్నారు.  ర‌ఘురామ‌, ఈట‌ల‌. ఇద్ద‌రూ గ‌ట్టి పిండాలే. ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ర‌కం కాదు. తెగించారు కాబ‌ట్టే.. అధికార పీఠానికి భ‌య‌ప‌డ‌కుండా ఎదురు నిలిచారు. కొండ‌ను ఢీ కొంటున్నామ‌ని తెలుసు. అయినా.. స‌రెండ‌ర్ కాకుండా.. స‌మ‌రానికే సిద్ద‌మ‌వుతున్నారు. ఈ ఇద్ద‌రు ఉద్దండులు.. బ‌స్తీమే స‌వాల్ అంటూ ఏకంగా సీఎంకే స‌వాల్ విసురుతున్నారు. అందుకే ఇప్పుడు.. ఏపీలో జగ‌న్ సైన్య‌మంతా ఒక‌వైపు.. ర‌ఘురామ ఒక్క‌డు ఒక‌వైపు.. తెలంగాణ‌లో గులాబీ ద‌ళ‌మంతా ఒక‌వైపు.. ఈట‌ల రాజేంద‌ర్ ఒక్క‌డు ఒక‌వైపు..వ‌న్ మ్యాన్ ఆర్మీలా.. ఆ ఇద్ద‌రు ఇప్పుడు బ‌ల‌మైన రాజ్యంపై ఒంట‌రిగా దండ‌యాత్ర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఈ టార్గెట్ పాలిటిక్స్‌లో గెలుపు ఎవ‌రిదో త్వ‌ర‌లోనే తేలుతుంది.. అప్ప‌టి వ‌ర‌కూ ఈ ఇద్ద‌రూ మొన‌గాళ్లే...

గొడవ ఆపడానికి వెళ్లిన.. గర్భవతి మృతి.. 

ఎవరైనా గొడవ పడితే గొడవ పడినవాళ్ళకి దెబ్బలు తగలడం సహజం. ఆ గొడవ పడుతున్న వాళ్ళను విడిపించడానికి వెళ్లిన వాళ్లకు కూడా అప్పుడప్పుడు దెబ్బలు తగలడం కూడా సహజం.. కానీ ఆ గొడవ జరుగుతున్నపుడు.. మధ్యలో ఆపడానికి వెళ్లిన వాళ్ళు చనిపోతే..అలా చనిపోయిన ఆమె గర్భం తో ఉంటే.. అలా జరిగితే అనే ఆలోచన వస్తేనే గుండె తరుక్కుపోతుంది కదా.. అయినా తప్పదు. ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ నిజంగానే ఒక నిండు గర్భిణీ ప్రాణం తీసింది.. ఎలాగో మీరే తెలుసుకోండి..  ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములు గొడవ పడీన సంఘటనలో ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన నిజాం పేట బిక్షపతి, నిజాంపేట పెంటయ్య లు అన్నదమ్ములు. వీరు గత కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ఇరువురి మధ్య రాజీ సైతం కుదిర్చారు. అయినప్పటికీ బుధవారం సాయంత్రం అన్నదమ్ముల ఇంటి సందు విషయంలో బిక్షపతి పెంటయ్య లు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో బిక్షపతి మనవరాలు లావణ్య (22) ఎందుకు గొడవ పడుతున్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా తాతయ్య అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా, పెంటయ్య అతని కుమారుడు శ్రీనివాస్ ఆమెను తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఆమె ఐదు నెలల గర్భవతి అని మృతురాలు బంధువులు తెలిపారు. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో మోకిల గ్రామంలో పోలీసులు బారీగా మోహరించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు.  

కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్స్.. అందరూ పాటించాల్సిందే.. 

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని అందరూ పాటించాలని.. అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని  ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కమిటి స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ కన్నా భయంకరంగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. గాలి ద్వారా కూడా సంక్రమిస్తోందని శాస్త్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వాడడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్ కూడా బాగా ఉండేలా చూసుకోవాలని, రెండు మాస్క్‌లు ధరిస్తే ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కోవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రోగులు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు... నోటి నుంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఈ తుంపర్లతో రెండు రకాలు ఉంటాయి. పెద్ద తుంపర్లు (సూక్ష్మ బిందువులు) నేరుగా కిందపడతాయి. అవి 2 మీ. వరకు వ్యాపిస్తాయి. ఈ బిందువులు పడిన ప్రాంతాలను ముట్టుకొని.. అదే చేతులతో ముఖం, నోటిని తాకితే కరోనా సంక్రమిస్తుంది. అందుకే ఇంటి లోపల ఫ్లోర్‌ను, తలుపు హ్యాండిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులను సబ్బులు, శానిటైజర్లతో క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న గాలి తుంపర్లతో ఎక్కువ ప్రమాదం ఉంది. అవి గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. కిటికీలు, తలుపులు మూసిఉండే గదుల్లో ఇవి ఎక్కువ సేపు ఉంటాయి. సరైన వెంటిలేషన్ ఉంటే వీటి నుంచి బయటపడవచ్చు. గాలి, వెలుతురు బాగా ఉండాలి. ఇళ్లు, ఆఫీసుల్లో కిటికీలు, తలులు తెరిచి ఉంచడంతో పాటు ఫ్యాన్స్ వేసుకోవాలి. కార్యాలయాల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుంటే మరీ మంచిది. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. కరోనా సెకండ్ వేవ్‌లో రెండు మాస్కులు ధరించడం మంచింది. సర్జికల్ మాస్క్‌పైన కాటన్ మాస్క్ పెట్టుకోవడం శ్రేయస్కరం. సర్జికల్ మాస్క్‌ ఒక్కటే వాడితే.. ఒకసారి మాత్రమే వినియోగించాలి. కాటన్ మాస్క్‌తో కలిపి వాడితే ఐదుసార్లు వరకు ధరించవచ్చు. మాస్క్‌లను ఉతికిన ప్రతిసారీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈసారి నగరాలే కాదు పల్లెటూర్లకు కూడా వైరస్ విస్తరించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో కరోనా టెస్ట్‌ల సంఖ్యను మరింతగా పెంచాలి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడంలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవవాలి. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు పెద్దగా లేకున్నప్పటికీ.. వారిని హోంఐసోలేషన్‌లో ఉండాలి. వారు బయట తిరిగితే వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదముంది.

నెల్లూరులో క‌రోనా మందు.. ఆనంద‌య్య మెడిసిన్‌పై ప్ర‌యోగాలు.. రిపోర్టులో ఏముంది?

ప్ర‌కృతిలో అన్నిరోగాల‌కు మందు ఉంది. క‌రోనాను సైతం ఆయుర్వేద మెడిసిన్‌తో ఖ‌తం చేయొచ్చు. జిల్లేడు, మారేడు, నేరేడు.. ఇలా కొన్ని మూలిక‌ల‌ను తేనేలో మ‌రిగించి.. బాధితుడికి వేస్తే వైర‌స్ చ‌నిపోతుంది. కొవిడ్ త‌గ్గిపోతుంది. డౌట్ ఉంటే మీరూ వాడి చూడండి తెలుస్తోంది అంటున్నారు. అందుకే, ఆనంద‌య్య ఉచితంగా ఇస్తున్న క‌రోనా మందు కోసం జ‌నాలు తెగ ఎగ‌బ‌డుతున్నారు. ముందు ప‌దుల సంఖ్య‌లో మొద‌లైంది. ఆ త‌ర్వాత రోజుకు 5-6వేల మంది వ‌స్తున్నారు. కిలోమీట‌ర్ల మేర క్యూ లైన్లో నిల‌బ‌డి ఆయుర్వేద మందు స్వీక‌రిస్తున్నారు. క‌రోనా మెడిసిన్‌తో కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం క‌రోనా నివార‌ణ కేంద్రంగా మారింది.  బొనిగే ఆనందయ్య. ఇత‌నే ఆ క‌రోనా మందుకు పితామ‌హుడు. గొలగమూడి వెంకయ్య స్వామి భక్తుడు. కరోనా మొదటివేవ్​ సమయంలో తమిళనాడుకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడి సూచనల మేరకు మందు తయారు చేసి తనపైనే ప్రయోగం చేసుకున్నాడట‌. ఆ మందు ప్ర‌భావంతో కొవిడ్ త‌గ్గిపోవ‌డంతో.. తర్వాత తమ కుటుంబ సభ్యులపై ప్రయోగించాడు. వాళ్లకూ ఉపశమనం లభించింది. దీంతో రెండో వేవ్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయర్వేద మూలికల్లో కాస్త మార్పులు చేసి మొత్తం 5 ర‌కాల మందులు తయారు చేశాడు. ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాడు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న ఆయర్వేద మందు మనచుట్టూ లభించే మూలికలతో తయారయ్యేదే. పటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనెతోపాటు మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 30 వేల మందికి ఉచితంగా ఈ మందును పంపిణీ చేశారు. కృష్ణ పట్నం గ్రామ జనాభా సుమారు 11 వేలుంటుంది. వీళ్లంతా మందు తీసుకున్నారు. ఒక్కరికీ కరోనా సోకలేదు. ఈపాటికే పాజిటివ్ ​లక్షణాలు ఉన్నవాళ్లు మందుతో వేగంగా కోలుకున్నారు. ఆ విష‌యం ఆనోటా ఈనోటా అంద‌రికీ తెలిసి.. కృష్ణ‌ప‌ట్నం పేరు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో మారిమోగిపోతోంది. ఉచితంగా ఇచ్చే మందు కోసం కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గ్రామానికి తరలి వస్తున్నారు. ఆనంద‌య్య ఇంటిముందు క్యూ లైను పెరుగుతోంది. కొన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనూ.. సీరియ‌స్‌గా ఉన్న రోగుల‌కు.. ర‌హ‌స్యంగా ఆ ఆయుర్వేద‌ మందు ఇస్తున్నారంటే.. ఆనంద‌య్య ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.  అయితే, ఎటువంటి అనుమతుల్లేకుండా, అర్హత లేనివ్యక్తి ఆయుర్వేదం పేరుతో మందులు పంపిణీ చేస్తున్నారని కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజన్‌ అధికారితో పాటు మరో ముగ్గురు ఆయుర్వేద వైద్యులను బృందంగా నియమించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆ బృందం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టింది. ఆయుష్​శాఖ వైద్యులతో ఆనందయ్య ఇస్తున్న మందును పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబొరేటరీకి పంపారు. మందు తీసుకున్న కరోనా బాధితులను వాకబు చేశారు. ఎవరికీ ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ లేవని నిర్ధారించారు. పైగా తమకు కరోనా నుంచి ఉపశమనం లభించినట్లు బాధితులు తెలిపారు. ఓ క‌రోనా బాధితుడి కంట్లో ఆనంద‌య్య ఇచ్చిన ఆయుర్వేద మందు వేయ‌గా.. గంట‌ వ్య‌వ‌ధిలోనే  అత‌ని ఆక్సిజ‌న్ లెవెల్స్ 83 నుంచి 95కి పెర‌గ‌డం అధికారుల‌నే ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.   ఆ మందు తీసుకున్న వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులు రాలేదు. కానీ కంట్లో వేస్తోన్న మందు వల్ల దీర్ఘకాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ బృందం తమ ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు అందించింది. దాని ఆధారంగా లోకాయుక్తకు, ఆయుష్‌ కమిషనర్‌కు ప్రత్యేక నివేదిక తయారు చేసి పంపారు. మందులో వాడుతున్న మూలికల వివరాలన్నింటినీ రాష్ట్ర ఆయుర్వేద ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను అందజేస్తామని లోకాయుక్తకు కలెక్టర్‌ నివేదించారు. అయినా సరే జనం భౌతిక దూరం పాటించడం లేదంటూ ఆనందయ్య ఇస్తున్న ఉచిత ఆయుర్వేద మందును బలవంతంగా నిలిపేయించారు. మందుపై పరీక్ష ఫలితాలు వచ్చే దాకా పంపిణీ చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. అధికారుల తీరుపై స్థానికులు మండిప‌డుతున్నారు. ఇదే మందును ఏ ప‌తంజ‌లి కంపెనీనో త‌యారు చేసి ఉంటే ఇలానే అడ్డుకునే వారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆవు పేడ‌, గోమూత్రం కంటే.. ఆనంద‌య్య ఆయుర్వేద మందే సో బెట‌ర్ అని వాదిస్తున్నారు. మ‌రి, ఆనంద‌య్య మందుకు అధికారులు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా? క‌ళ్ల ముందే ఫ‌లితాలు క‌నిపిస్తున్నా.. మందును అడ్డుకుంటారా?  చూడాలి...