చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ
posted on Jun 6, 2021 @ 9:08PM
దేశవ్యాప్తంగా చర్చగా మారిన, లక్షలాది మంది జనాలు కావాలని కోరుకుంటున్న కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ చిత్తూరు జిల్లాలోనూ చంద్రగిరిలోనూ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి నియోజక వర్గ ప్రజల కోసం మందు తయారు చేస్తున్నారు.ప్రభుత్వ అనుమతులు వచ్చిన నాటి నుంచి సహజ సిద్ధ వనమూలికల సేకరణ ప్రక్రియను చేపట్టారు. సాంప్రదాయ మందు తయారీలో ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్య బృందం చంద్రకుమార్, సురేష్, వంశీ కృష్ణ సహకరిస్తున్నారు. మందు తయారీలో కూడా కట్టెల పొయ్యి, రాగి బాండలి వంటి సాంప్రదాయ పద్దతుల్లో చేపట్టారు.
సహజసిద్ధమైన 16 వనమూలికలతో ఆనందయ్య మందు తయారీ కి శ్రీకారం చుట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, పిప్పింట, బుడ్డ బుడవ ఆకులు, కొండ పల్లేరు కాయలు, తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చారు. ఆదివారం ఆనందయ్య మందు తయారీ విధానాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్(పి) ను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజక వర్గంలో 1.60 లక్షల కుటుంబాలకు 5.20 లక్షల మంది ప్రజలకు ఉచితంగా అనందయ్య మందును అందించనున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నియోజకవర్గ పరిధిలో 142 గ్రామ పంచాయతీలు, దాదాపు 1600 గ్రామాలలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడించారు.
కరోనా కట్టడికి ఉపయుక్తమైన సాంప్రదాయ మందు తయారీ లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ అభినందన నీయమని ఆనందయ్య తనయుడు శ్రీధర్ అన్నారు. వనమూలికల సేకరణ యజ్ఞంలా చేపట్టారన్నారు. చెవిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయమన్నారు ఆనందయ్య తనయుడు శ్రీధర్.