కొవిడ్ బాధితులకు ఊపిరి.. ఆదర్శంగా యువపారిశ్రామిక వేత్తలు
posted on Jun 6, 2021 @ 5:24PM
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సెకండ్ వేవ్ తో భారత్ కూడా అతలాకుతలమైంది. కొవిడ్ రోగులకు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకలేదు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ అందని పరిస్థితి. రోగులు శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బారిన పడిన 45 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆపద్భాంధవిగా నిలుస్తోంది ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’.వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’ ఈ బృహత్కార్యాన్ని తలపెట్టింది.
ఏపీలోని యువ పారిశ్రామిక వేత్తల మదిలో పుట్టిన ఆలోచనే ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’. ఆక్సిజన్ కొరతతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూసి చలించిపోయి ఏదో ఒకటి చేసి ఆ జీవితాలకు అండగా నిలవాలని ఆ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఏపీలోని ఆ సంస్థ సభ్యులంతా చర్చించుకుని ఓ కొత్త ఆలోచనకు పునాది వేశారు. అలా ఏర్పడిందే ఈ సంస్థ. వైజాగ్ లోని గీతం హాస్పిటల్ కి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చి చేరాయంటే అది ఈ సంస్థ చలవే. ఇలాంటి కేంద్రాలు ఏపీలో మరో ఐదింటిని ఈ సంస్థే ఏర్పాటుచేసింది.
మొదటి దశలో అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లో ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్, బీపీ యంత్రాలు, మెడిసిన్స్ వంటిలాంటి ప్రాథమిక వైద్య అవసరాలతో కూడిన పడకలు ఏర్పాటుచేశారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, శ్రీకాకుళంలో రిమ్స్ గవర్నమెంట్ హాస్పటల్, టెక్కలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఆక్సిజన్ బ్యాంకు, ఆక్సిజన్ సెంటర్ కూడా ఏర్పాటుచేశారు. విజయవాడలో ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేశారు.
విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రానికి 50 చొప్పున ఆక్సిజన్ కాన్ సెన్ ట్రేటర్ల,ను, ఆక్సిజన్ సిలెండర్లను ఇప్పటిదాకా సరఫరా చేశారు. ఏలూరులో జాయింట్ కలెక్టర్ల హిమాంశు శుక్లాకు 45 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందజేశారు. ప్రతి కేంద్రంలోనూ హెల్త్ కేర్ టీమ్స్,భద్రతా సిబ్బంది ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కేంద్రాల్లో ఆహారం, నీరు, వాష్ రూమ్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉంటాయి.ఈ ఆరు కేంద్రాల నుంచి సమీప ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లను పంపించే ఏర్పాటుచేశారు. అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరతతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించే ఏర్పాటుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లో ఎంటర్ ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ (ఇవో) ఉంది. దాదాపు 15000 పైచిలుకు సభ్యులు ఇందులో ఉన్నారు. తమ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవడం, పరస్పర సహకారం అందించుకుంటూ ఏర్పడిన సంస్థ ఇది. 1987 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థలో 2018 నుంచి ఏపీ నుంచి 26 మంది యువ పారిశ్రామిక వేత్తలు ఇందులో భాగమయ్యారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్న వార్తలు గత ఏప్రిల్ లో ఈ సంస్థ సభ్యుల దృష్టికి వచ్చాయి.
కొవిడ్ రోగులను ఏదో ఒక విధంగా ఆదుకోవాలని సంకల్పించారు. తమ వంతుగా తలా కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి నిధులు సమకూర్చుకుని కొవిడ్ బాధితుల సేవకు నడుంబిగించారు. రామ్మోహన్ నాయుడు కింజరపు, దివ్య నల్లమోతు, స్మిత వల్లూరుపల్లి, విధాన్ మిట్టల్, రవి మూల్పూరి, రాజీవ్ సెన్నార్, రాజీవ్ బొల్లా, శ్రీహర్ష వడ్లమూడి తదితరులు విరాళాలు ఇచ్చి దాదాపు మూడు కోట్ల రూపాయలను సమీకరించారు.
ఈ నిధులతోనే ఈ ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి ఏమేం సౌకర్యాలు అవసరమో వాటిని ఏర్పాటుచేశారు. ఈ మెడికల్ ఆక్సిజన్ సమీకరణకు మూడున్నర కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించి ఆ దిశగా అడుగులు వేశారు.
ఈ యువ పారిశ్రామిక వేత్తలు చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ తరహాలో సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. కోవిడ్ బాధితులకు ఎవరైనా సహాయ సహకారాలు అందించదలుచుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయవచ్చు. నిధుల సమీకరణకు మీ వంతు సహకారాన్ని కూడా అందించవ్చు. https://fundraisers.giveindia.org/…/help-andhra-and ని చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి.