టీడీపీ నేత‌ల ఫ్యాక్ష‌న్ మ‌ర్డ‌ర్.. వైసీపీ హ‌త్యా రాజ‌కీయం!

కాపు కాశారు. మందిమార్బ‌లంతో పొంచి ఉన్నారు. ఎప్ప‌టి నుంచో ఉన్న ప‌గ‌. ఇప్పుడు అధికార పార్టీ అండతో రెచ్చిపోయారు. అన్నద‌మ్ములైన ఇద్ద‌రు టీడీపీ నేత‌ల‌ను వెంటాడి.. వేటాడారు. వాహ‌నంతో గుద్ది.. వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి దారుణంగా చంపేశారు. క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ఈ ఫ్యాక్ష‌న్ డ‌బుల్ మ‌ర్డ‌ర్‌తో సీమ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అధికారం కోల్పోయిన‌ప్ప‌టి నుంచీ టీడీపీ నేత‌ల వ‌రుస హత్య‌లు ఏపీవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.  క‌ర్నూలు జిల్లా గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయిలో ఇద్ద‌రు టీడీపీ నేతలు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అన్నదమ్ములైన మాజీ స‌ర్పంచి నాగేశ్వ‌ర‌రెడ్డి, స‌హ‌కార సంఘం మాజీ అధ్య‌క్షుడు ప్ర‌తాప్‌రెడ్డిని కొంద‌రు బొలేరో వాహ‌నంతో ఢీకొట్టి చంపేశారు. ఘ‌ట‌న‌లో వాళ్లిద్ద‌రు స్పాట్‌లోనే చ‌నిపోయారు. మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని నంద్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  మూడు రోజుల క్రితం మృతుల బంధువులు చ‌నిపోయారు. మూడో రోజు దినం కోసం శ్మ‌శానానికి వెళ్లారు ఆ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్. విష‌యం తెలుసుకున్న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం.. వారి కోసం స్కెచ్ వేసింది. శ్వ‌శానం నుంచి తిరిగి వ‌స్తుండ‌గా.. స్పీడ్‌గా బొలేరో జీపుతో ఢీకొట్టారు. వాళ్లిద్ద‌రు కింద‌ప‌డ‌గానే ఒక్క‌సారిగా క‌త్తుల‌తో దాడి చేశారు. దారుణంగా న‌రికి చంపేశారు. నిందితులు వైసీపీ నాయ‌కుల‌ని మృతుల కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. మృతిచెందిన అన్న‌ద‌మ్ముల వ‌ర్గానికి, శ్రీ‌కాంత్‌రెడ్డి అనే వ‌ర్గానికి ద‌శాబ్దాలుగా ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్నాయి.  పోలీసులు ఘ‌ట‌న‌పై ఇంకా కేసు కూడా న‌మోదు చేయ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. నిందితుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. టీడీపీ నేత‌ల‌ హ‌త్యతో గ్రామంలో ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.   

ఛీ.. మనిషా..? రాక్షసా..?

మనుషుల్లో మానవత్వం కరువైంది. ఒక వైపు ప్రజలు కరోనా తో ఆస్తులతో పాటు ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్న పేషేంట్లను కూడా వదల కూడా వాళ్ళ వంటి మీద నగలు దొంగతనం చేసిన సంఘటనలు చాలా చూశాం.. అయినా దొంగల బుద్ది ఎక్కడ పోతుంది చెప్పండి.. బంగారు సింహాసనం మీద కుక్క ను కూర్చోపెడితే చివరికి కుక్క బిడ్డి చూపించినట్లు.. దొంగ ఎక్కడ ఉన్న దొంగతనం చేయకుండా ఉంటాడా చెప్పండి. వాళ్ళు  దొంగలు దొంగతనం చేయాలి అనుకోవాలి గానీ ఎవర్ని వదలరు. అది కోట్లకు పరుగెత్తిన వాడినైనా కూటికి లేని వాడినైనా సరే.. దొంగల చేయి పడితే దోచేయాల్సిందే తాజాగా ఓ ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణాతి దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్ వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌పై కన్ను వేసింది.. ఆ తర్వాత చేయివేసింది ఆ ఆస్పత్రి ఉద్యోగిణి.. ఆ తర్వాత పేషెంట్‌ను చంపేసింది. అయితే, తన భార్య కనిపించడం లేదంటూ భర్త చేసిన ఫిర్యాదు అసలు విషయం అంతా బయటపడింది. మే 23వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన సునితకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమె స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ అయింది. సునీత భర్త మౌళి అమెకు అవసరమైన మందులు భోజనం అందిస్తూ వచ్చాడు. అయితే, సునీత వద్ద కొంత నగదు, సెల్ ఫోన్ ఉన్నాయి. వాటిని కన్ను వేసింది ఆసుప్రతిలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగిని రతీదేవి. ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ వేసుకున్న రతీదేవి.. మే 23వ తేదీన రతీదేవి.. కోవిడ్ పేషెంట్ సునీతను అత్యంత దారుణంగా చంపేసింది. ఆమె వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ తీసుకుని.. సునీత మృతదేహాన్ని ఆస్పత్రి వెనుకవైపు పడేసింది. ఒక రకంగా కరోనా చంపేసిన మనుషులకంటే ఇలా నగల కోసం, డబ్బుల కోసం జనాలను  చంపేసిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి.  అయితే, సునీత భర్త మౌళి తన భార్య ఆస్పత్రిలో కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి మొత్తం గాలించారు. అయినా ఎక్కడా కనిపిపంచలేదు. చివరకు ఇవాళ ఆస్పత్రి వెనుకవైపు సునీత మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసింది రతీదేవి అని తేల్చారు. రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెల్లడించింది. సునీత వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లు రతీదేవి అంగీకరించింది. రతీదేవిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపరుచనున్నారు.

మైక్రోసాఫ్ట్‌ చైర్మన్ గా సత్య నాదేళ్ల.. తెలుగు తేజానికి అరుదైన ఘనత 

తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఆయనకు మరో కీలక పదవి దక్కింది. ప్రస్తుతం మెక్రో సాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. తాజాగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్లను నియమిస్తుస్తున్నట్లు మెక్రో సాఫ్ట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బోర్డు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ స్థానంలో త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు సత్య నాదేళ్ల. ఇక్కడ మరో ఘనత కూడా ఉంది. సీఈవోగా కొనసాగుతూనే చైర్మెన్ గా కూడా వ్యవహరించనున్నారు సత్యనాదేళ్ల. గతంలో బిల్ గేట్స్ ఇలా రెండు పదవులు ఒకేసారి నిర్వహించారు.  s2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్నారు. ఏడేళ్ల క్రితం స్టీవ్ బామర్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా సత్య నాదెళ్ల చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో థామ్సన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు థామ్సన్ స్థానంలో సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత ఏడాది మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన 'బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌' నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే మైక్రో సాఫ్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అందులో నిజం లేదని అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాలను ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఓ న్యాయ సంస్థతో విచారణ చేయించిందని సంచలన కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా బిల్ గేట్స్ దంపతులు వీడిపోయారు. 

HCAలో ఏం జరుగుతోంది? అజార్ సస్పెండ్ కు కారణం ఎవరు? 

వివాదాలకు కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెచ్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మరో సంచలనం జరిగింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. అజార్ పై వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో  సంచలనం సృష్టించింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ సంయుక్తంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అందులో అజారుద్దీన్ బీసీసీఐ, హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్దంగా ఎలా ప్రవర్తించారో కూలంకషంగా వివరించారు.  హెచ్ సీఏలో కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులకు, అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పలు మార్లు ఈ రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. అజార్ కు వ్యతిరేకంగా ఇతర సభ్యులు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. అజార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు పిర్యాదులు అందడంతో జూన్ 10న అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. అజార్‌పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ గుర్తించని టీ10 లీగ్‌లో పాల్గొంటున్న ఈ క్లబ్‌కు అజార్ మెంటార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దమే కాకుండా పరస్పర విరుద్ద ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్దారించింది.హెచ్‌సీఏ రూల్ నెంబర్ 38(1)(3) ప్రకారం ఒక అనధికార లీగ్‌లోని క్లబ్‌కు మెంటార్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేసింది అపెక్స్ కౌన్సిల్.  అజారుద్దీన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదనేది మరో ఆరోపణ. 2019 డిసెంబర్ 14న హెచ్‌సీఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను చివరి మ్యాచ్ ఆడిన 2000 మార్చి 6నే రిటైర్ అయినట్లు పరిగణించాలని కోరాడు. అదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. అంటే 19 ఏళ్ల పాటు తన రిటైర్మెంట్ గురించి చెప్పని అజారుద్దీన్.. సడెన్ గా 2019లో కేవలం ఒక లేఖ ద్వారా అప్పుడే రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డులో గానీ, అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో గానీ పదవి చేపట్టాలంటే క్రికెటర్లు రిటైర్ అయిన 5 ఏళ్ల తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. అయితే కీలకమైన హెచ్‌సీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. హెచ్‌సీఏకు దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలను గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. న్యాయ పరంగా ఈ విషయాలపై పూర్తి విచారణ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ సస్పెన్షన్‌లోనే ఉంటారని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే తన సస్పెన్సన్ పై న్యాయ పోరాటం చేస్తానని అజారుద్దీన్ ప్రకటించారు.   

వైఎస్ భారతికి ఎంపీ రఘురామ షాక్! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. తన దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ సర్కార్ కు కొరకరాని కొయ్యలా మారిపోయారు. రోజుకో అంశంలో లేఖ రాస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి షాకిచ్చారు ఎంపీ రఘురామ రాజు. ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయనే వార్నింగ్ కూడా ఇచ్చారు రఘురామ.  సాక్షి టీవీ చానెల్ కు ఎంపీ రఘురామ గతంలోనే లీగల్ నోటీసులు పంపించారు. తాజాగా మరోసారి  సాక్షి మీడియాకు రఘురామ లీగల్‌ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  15 రోజుల్లో నోటీసుకు సమాధానమివ్వాలని, అలా చేయకుంటే 50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీచానల్‌కు రఘురామ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర నోటీసు జారీ చేశారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా సాక్షి చానెల్ అనేక కథనాలు  ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఎంపీ రఘురామ రాజు.  అంతేకాదు తన నోటీసుపై వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని చెప్పారు ఎంపీ రఘురామ రాజు. ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నేమాని భాస్కర్‌, కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఆ నోటీసులిచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆ నోటీసుపై సాక్షి చానెల్ స్పందించలేదు. తాజా నోటీసుపై కూా స్పందిస్తారో లేదో చూడాలి మరీ... 

అంతా సిరిసిల్ల‌, సిద్ధిపేట‌ల‌కేనా? త‌ల్ల‌డిల్లుతోన్న‌ తెలంగాణం!

ఈ మ‌ధ్య సిరిసిల్ల‌కు గానీ, సిద్ధిపేట‌కు గానీ వెళ్లారా? కొత్త‌గా వెళ్లిన వారు అవాక్క‌వుతారు.. గ‌తంలో ఎప్పుడో వెళ్లి.. ఇప్పుడు మ‌ళ్లీ వెళితే.. ఆశ్చ‌ర్య‌పోతారు.. ఇది సిరిసిల్లేనా? అది సిద్ధిపేటేనా? అని నోరెళ్ల‌బెడ‌తారు. అంతా బాగుంటాయి ఆ రెండు ప‌ట్ట‌ణాలు. అచ్చం హైద‌రాబాద్‌లాంటి అభివృద్ధి అక్క‌డ అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. ఆ రెండు ప్రాంతాలు ప‌ర‌స్ప‌రం పోటీప‌డుతూ మౌలిక వ‌స‌తుల్లో దూసుకుపోతున్నాయి. అద్దంలాంటి రోడ్లు.. అంద‌మైన స‌ర్కిళ్లు.. ఎటుచూసినా ప‌చ్చ‌ద‌నం.. చెత్తాచెదారం లేకుండా ప‌రిశుభ్ర‌త‌.. అంద‌మైన ప్ర‌భుత్వ భ‌వ‌నాలు.. హాస్ట‌ళ్లు.. స్టేడియాలు.. మార్కెట్లు.. స్టోరేజ్ యార్డ్లు.. స్కూళ్లు.. కాలేజీలు.. ఆసుప‌త్రులు.. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అబ్బో ఇది లేదు అది లేదు అనేది లేదు.. నిజంగా సిరిసిల్ల‌, సిద్ధిపేట‌ల‌దే అదృష్ట‌మంటే. కేసీఆర్ సొంత గ‌డ్డ‌, ఆయ‌న అల్లుడు హ‌రీష్‌రావు ఇలాఖా కావ‌డంతోనే సిద్ధిపేట‌లో అంత డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగింది. కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్ల‌ను త‌న రాజ‌కీయ వేదిక‌గా చేసుకోవ‌డంతోనే ఇంత‌టి అభివృద్ధి సాధ్య‌మైంది. సిరిసిల్ల సిగ‌లో టెక్స్‌టైల్ పార్కు కొలువుదీరింది. తాజాగా, సిరిసిల్ల‌ను కోన‌సీమ‌గా మారుస్తానంటూ హామీ ఇచ్చారు కేటీఆర్‌. సిరిసిల్ల‌లో కొన్ని ప్రాంతాల్లో బంజారాహిల్స్ మాదిరి.. గ‌జం భూమి ల‌క్ష రూపాయ‌లు ప‌లుకుతోందంటే న‌మ్మాల్సిందే. డౌట్ ఉంటే వెళ్లి చూడాల్సిందే... సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు బాగా అభివృద్ధి చెంద‌టం సంతోష‌క‌రం. బ‌హు బాగుంది క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ప‌నిత‌నం. ఆ అభివృద్ధికి వారిని అభినందించాల్సిందే. కానీ.. తెలంగాణ అంటే సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు మాత్ర‌మే కాద‌ని.. ఇంకా హైద‌రాబాద్ మిన‌హా మ‌రో 20 జిల్లాలు ఉన్నాయ‌నే విష‌యం మ‌రిచిన‌ట్టున్నారు. సిరిసిల్ల దాటి ప‌క్క జిల్లాలో అడుగుపెడితే క‌నిపిస్తుంది అస‌లైన తెలంగాణ‌. సిద్ధిపేట వ‌దిలి మ‌రో జిల్లాలో ఎంట్రీ అయితే అడుగ‌డుగునా వెన‌క‌బాటుత‌న‌మే. మెద‌క్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌.. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా.. ఏ జిల్లా చూసినా అభివృద్ధికి ఆమ‌డ‌దూర‌మే. అంతెందుకు.. హైద‌రాబాద్ త‌ర్వాత అతిపెద్ద న‌గ‌రంగా గొప్ప‌లు చెప్పే వ‌రంగ‌ల్‌ను చూస్తే తెలుస్తుంది ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో. ద‌శాబ్దాలుగా స‌మ‌స్య‌ల సుడిగుండంలో కూరుకుపోయిన ఎమ్‌జీఎమ్ హాస్పిట‌ల్ ఉదంతం.. కేసీఆర్ కంటికి క‌నిపించ‌డానికి ఇంత కాలం ప‌ట్టిందంటే ఆశ్చ‌ర్య‌మే.  హైద‌రాబాద్ అంటే నిజాంల కాలం నుంచే డెవ‌ల‌ప్ అయిందనుకోండి. మ‌రి, సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు ఈ ఏడేళ్ల‌లోనే హైద‌రాబాద్ స్థాయికి ఎద‌గ‌డం ఆయా ప్రాంతాల వారికి ఆనంద‌దాయ‌క‌మే అయినా.. మ‌రి, మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఏంద‌నేదే ఇక్క‌డ ప్ర‌శ్న. ఎందుకీ, ద్వంద్వ వైఖ‌రి? ఎందుకీ స‌వ‌తి చేష్ట‌లు? కేవ‌లం మీ ఇలాఖాల‌నే డెవ‌ల‌ప్ చేసుకొని.. మీ రాజ‌కీయ వేదిక ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గుంటే స‌రిపోతుందా? మిగ‌తా జిల్లాలు ఎలా ఉన్నా ప‌ర్లేదా? అంటూ నిల‌దీస్తున్నారు మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌లు.   తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో సీఎం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి ఎన్నెన్నో మాట‌లు చెప్పారు. అలా చేస్తా, ఇలా చేస్తానంటూ అర‌చేతిలో స్వ‌ర్గం చూపించారు. మానేరు డ్యామ్‌లో బోటు షికార్లు.. ఓడ్డున స్టార్ హోట‌ళ్లు.. అదేదో అమెరికాలోని డ‌ల్లాస్‌లా చేస్తాన‌న్నారు కేసీఆర్‌. ఇప్పుడు క‌రీంన‌గ‌ర్‌ను చూస్తే.. డ‌ల్లాస్ సంగ‌తి దేవుడెరుగు.. ముందు రోడ్ల‌పై గుంత‌లు పూడ్చండి ముఖ్య‌మంత్రి గారూ అని వేడుకుంటున్నారు క‌రీంన‌గ‌ర్వాసులు. అప్ప‌ట్లో వ‌రంగ‌ల్‌లోనూ రెండు రోజులు విడిది చేసి.. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో ఊద‌ర‌గొట్టి.. ఆ త‌ర్వాత ఉసూరుమ‌నిపించారు. ఇలా.. జిల్లా జిల్లాకు కేసీఆర్ ఇవ్వ‌ని హామీ లేదు.. ముల్క‌నూరు, గంగ‌దేవిప‌ల్లి లాంటి గ్రామాల్లో ప‌ర్య‌టించి మ‌స్తు మాట‌లు చెప్పారు.. కానీ, వాటిని క‌నీసం అర‌కొరగానైనా నెర‌వేర్చిన పాపాన పోలేదు అంటున్నారు. ఏ జిల్లాను చూసినా అదే దౌర్బాగ్యం. కొత్త జిల్లాల పేరులైతే ఘ‌నంగా పెట్టారు కానీ.. ఖ‌జానా నుంచి కాసులు విద‌ల్చ‌క‌పోవ‌డంతో అవి అలానే కునారిల్లుతున్నాయి. అది జోగులాంబ-గ‌ద్వాల జిల్లా అయినా.. జ‌న‌గాం జిల్లా అయినా.. బంగారు తెలంగాణ‌లో సిరిసిల్ల‌, సిద్ధిపేట మిన‌హా ఏ జిల్లా చూసినా ఏముంది గ‌ర్వకార‌ణం..? సొంతింటి క‌ల గ‌జ్వేల్ వాసుల‌కే నెర‌వేరుతుందా? అద్దాల్లాంటి రోడ్లు సిద్దిపేట‌లోనే ఉండాలా? సిరిసిల్ల మాత్ర‌మే కోన‌సీమ‌లా మారాలా? మ‌రి, మిగ‌తా జిల్లాల మాటేంటి? ఆయా జిల్లాల వాసులు టీఆర్ఎస్‌కు ఓటు వేయ‌లేదా? అక్క‌డి వారు ప‌న్నులు క‌ట్ట‌డం లేదా? వారంతా తెలంగాణ బిడ్డ‌లు కారా? అని నిల‌దీస్తున్నారు అభివృద్ధికి నోచుకోని ప్ర‌జ‌లు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబ‌ట్టి.. రాష్ట్ర‌ ఖ‌జానా మీ గుప్పిట్లోనే ఉంది కాబ‌ట్టి.. మీ ప్రాంతాలు మాత్ర‌మే తీర్చిదిద్దుకుంటారా? మ‌రి మా సంగ‌తేంట‌ని నిగ్గ‌దీసి అడుతున్నారు జ‌నాలు. ఓహో.. మిగ‌తా జిల్లాలూ డెవ‌ల‌ప్ కావాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావులు ఒక్కో ట‌ర్మ్‌లో.. ఒక్కో జిల్లా నుంచి పోటీ చేయాల‌న్న మాట‌..? అని సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. మ‌రి, ఆ జిల్లాల ఆక్రంద‌న ఆ ముగ్గురి చెవికి సోకుతుందా? ఎప్ప‌టికైనా మిగ‌తా జిల్లాల్లోనూ ఆభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపిస్తాయా? సిరిసిల్ల‌, సిద్ధిపేటలే కాకుండా మిగ‌తా ప్రాంతాలూ బంగారు తెలంగాణగా మారుతాయా? ఏమో.....

లాక్ డౌన్ సడలింపులు ఇవే.. 

తెలంగాణాలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో తెర పడనుంది. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు సమరశంఖం మొగియ్యనుండి. కరోనా కేసులు తగ్గడంతో భారీగా సడలింపులు చేసే ఆలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో ముగియనుంది. 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని పెంచాలని సర్కార్ ఆలోచిస్తుంది.  ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు. అయితే సడలింపు సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పెంచాలని  ప్రభుత్వం యోచిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలుపై కేబినెట్‌ భేటీలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే మంత్రులతో మాట్లాడి ఆయన ప్రకటన చేసే అవకాశాలున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పొడిగించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి రాత్రి 10 వరకు వెసులుబాటు కల్పించి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల మాత్రం లాక్ డౌన్ అమలు చేయనున్నారు. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్‌డౌన్‌ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా వాళ్ళ ప్రాణాలు పోతే.. లాక్ డౌన్ వల్ల బతకడానికి ఉన్న భరోసా పోతుంది. ఇక అటు దేశం లోను ఇటు తెలుగు రాష్ట్రాల నాయకులూ అయితే ప్రజల మీద ఉన్న ప్రేమ కంటే కుర్చీల మీద మోజు వుందని చెప్పాలి.. కోవిద్ టైం లో కూడా ఎన్నికలకు వెళ్లిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమని గర్వగా చెప్పుకోవాలి. ప్రజల ఆరోగ్యం పట్టని పాలకులు ఎవరైనా ఉన్నారంటే మన నాయకులను చూపించాలి.. ఒక వైపు కరోనా సమాయులతో ఫుట్ బాల్ ఆడుతుంటే మన నాయకులూ మాత్రం ప్రజలతో వాళ్ళ ప్రాణాలతో రబ్బీ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఎలాంటి నిర్ణయాలు చేపట్టాయో..ప్రరోక్షంగా ప్రత్యేక్షంగా ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారో అందరికి తెలిసిన విషయమే.. మరి థర్డ్ వేవ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో చూడాలి.. ప్రిపేర్ ఆవ్వకుండా ఏం.. పీకే  వచ్చారు అని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన నాయకులూ థర్డ్ వావ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో చూడాలి మరి..   

చిప్పు దొబ్బింది.. భార్యను రెండో సారి పెళ్లిచేసుకున్నాడు..

ఎవరైనా ఒక సారి, ఒక అమ్మాయి ని ప్రేమించో, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ మనం మాట్లాడుకునే ఈ వార్తలో ఆల్రెడీ పెళ్లి చేసుకుని.. మళ్ళీ గతం మరిచి మళ్ళీ తన భార్యకే ప్రపోజ్ చేసి.. మళ్ళీ ఆమెను రెండో సారి పెళ్లి చేసుకున్నాడు.. ఏంటి ? ఏదో సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ స్క్రీన్ మీద జరుగుతాయి జీవితంలో జరగవు అని అనుకుంటున్నారా..? సమస్యేలేదు సమస్యే లేదు మీరు అలా అనుకుంటే కరోనా మీద కాలు వేసినట్లే.. విషయం లోకి వెళదాం..      పెళ్లి ఆడ, మగ ఇద్దరు నిండు నూరేళ్ళ.. నింగినేల ఉన్నంత  వరకు,  కలకాలం కలిసి ఉండే ఓ పవిత్రమైన బంధం. ప్రతి వ్యక్తి తన లైఫ్ లో అంగరంగ వైభవంగా  జరుపుకొనే వేడుక పెళ్లి. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని ఒకరికొకరు ప్రమాణం కూడా చేస్తారు. అయితే, పెళ్లినాటి ప్రమాణాలు కలకాలం ఉండాలంటే.. భార్యాభర్తలు ప్రేమగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఉండాలి.భార్యని భర్త, భర్తని భార్య  అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే పెళ్లి అనే ప్రమాణం ఆ బంధం నిలబడుతుంది, నిక్కచ్చిగా ఉంటుంది.కట్ చేస్తే.. మనం తెలుసుకోబోయే ఈ జంట జీవితంలో కొంచం భిన్నంగా ఉంటుంది. అలా అని వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ, భర్త మతిమరుపు.. జీవితాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్లింది. ఎందుకంటే.. అల్జీమర్స్‌తో బాధపడుతున్న అతడు తనకు పెళ్లయిన విషయాన్నే మరిచిపోయాడు. తన భార్యను కూడా రిమెంబర్ చేసుకోలేకపోయాడు. కానీ, విధి మాత్రం వారికి అన్యాయం చేయలేదు. జ్ఞాపకశక్తి కోల్పోయినా.. అతడు మళ్లీ ఆమెనే భార్యగా కోరుకున్నాడు. మళ్లీ ఆమెకే ప్రపోజ్ చేసి.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగాడు. ఇందుకు ఆమె ‘YES’ చెప్పింది. విరాల్లోకి వెళితే..56 ఏళ్ల పీటర్ మార్షల్ పన్నెండేళ్ల కిందట లీసాను వివాహం చేసుకున్నాడు.పెళ్లయిన కొన్నేళ్లలోనే అతడు అల్జిమర్స్‌కు ఎటాక్ చేసింది. ఫలితంగా అతడు క్రమేనా జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. వస్తువులు, ప్లేసెస్ తో పాటు  మనుషులను గుర్తుపట్టడం కూడా అతడికి కష్టంగా మారింది. చివరికి అతని  భార్యను కూడా మరిచిపోయాడు. రోజూ ఉదయం లేవగానే ఎవరు నువ్వు అని అడుగుతాడు. లైక్  భలేభలే మగాడివోయి సినిమాలో నాని క్యారెక్టర్ లా చేసేవాడు.  కనీసం పేరు కూడా గుర్తుకు రాదు. దీంతో ఆమె నేను నీ భార్య లిసాను అని చెప్పుకోవల్సి వస్తోంది. వారి గతంలో ఉన్న గుర్తులను అన్ని చెప్పింది అయిన అతనికి గుర్తురాలేదు. ఏది ఏమైనాగాని అతడి మనసు నుంచి మాత్రం ఆమె ఏ రోజు దూరంగా పోలేదు. ఓ రోజు లిసా అతడికి టీవీలో వారి పెళ్లి వీడియో చూపించింది. అయితే, అతడికి ఏదీ గుర్తురాలేదు. దీంతో లిసా చొరవ తీసుకుని మనం కూడా ఆ వీడియోలో ఉన్నట్లు పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ఆమె అలా అడగగానే పీటర్ ముఖం వెలిగిపోయింది. ఆ వెంటనే ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అన్నాడు. దీంతో ఆమె మళ్లీ తన అంగీకారాన్ని తెలుపుతూ ఉబ్బితబ్బిబయ్యింది. అతడు జ్ఞాపకశక్తిని కోల్పోయినా తన మీద ప్రేమ తగ్గలేదని, ఇప్పటికే అతడికి తానంటేనే ఇష్టమని ఆమె మురిసిపోయింది. రెండోసారి అతడితో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయంపై అతని భార్య స్పందిస్తూ ‘‘నేను చాలా లక్కీ. నా జీవితంలో రెండోసారి ఆ ఆనందాన్ని పొందుతున్నాను’’ అని లిసా తెలిపింది. వీరి పెళ్లి ఏర్పాట్లు చేసింది మరెవ్వరో కాదు.. స్వయంగా వారి కూతురే. ఈ స్పెషల్ వెడ్డింగ్‌కు ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని కొన్ని సంస్థలు ముందుకు రావడం గమనార్హం. పెళ్లి ప్రపోజల్ తర్వాత అతడిలో ఆనందాన్ని చూశానని, అతడి వ్యాధి కూడా క్రమేనా తగ్గుముఖం పడుతోందని లిసా తెలిపింది. అంత మతిమరపులోను అతడు తన ప్రేమను మరచిపోలేదంటూ ఆనంద భాష్పాలు కురిపించింది. పెళ్లి సందర్భంగా అతడు తన చెవిలో.. ‘‘నాతో ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పాడని ఆమె పేర్కొంది. మతిమరుపు మెదడుకు ఉంటుందేమో.. కానీ, మనసుకు కాదని లీసా-పీటర్‌ల గురించి చదివితే అనిపిస్తోంది కదూ.  

కారెక్కిన ఎమ్మెల్యేల సంగతేంటి? ఈటల బాటలో రాజీనామా చేస్తారా ?

దేశంలో బీజేపీ సహా అన్ని పార్టీలు ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరంటే వారిని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నాయి. నిమిషాల వ్యవధిలో చొక్కాలు, చడ్డీలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీ మారిపోతున్నారు. సరే, అది వారిష్టం. నిజాకి పార్టీ మారడం నేరం కాదు. కానీ, అలా పార్టీ మారినప్పుడు, ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయక పోవడం నేరం అయినా కాకపోయినా, అనైతికం. ప్రజాస్వామ్య నైతిక విలువలకు విరుద్హం.  ఒక పార్టీ ద్వారా వచ్చిన  పదవులను అక్కడే విడిచేసి, కొత్త పార్టీలో చేరితే అది నాయకుడి  హుందాను, గౌరవాన్నే కాదు పార్టీ ప్రతిష్టను కూడా కొంచెం పెంచుతుంది అయితే ఇప్పుడు,రాజకీయాల్లో హుందాతనం, గౌరవం అనే మాటలకు అర్ధాలే లేకుండా పోయాయి. ఎవరికి వారు ‘నాకేంటి’ నే దగ్గరే ఆగిపోతున్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి.   ఇలాంటి పరిస్థితిలోనూ, మాజీమంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ముందుగా పార్టీకి, ఆ తర్వాత శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే, బీజేపీలో చేరారు. అలాగే, హైదరాబాద్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. గతంలో, కేసీఆర్ కూడా ఇలాగే, తెలుగు దేశం పార్టీకి,  ఆ పార్టీ టికెట్ పై గెలిచినఎమ్మెల్యే,  తద్వారా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చసిన తర్వాతనే సొంత పార్టీ తెరాస జెండా ఎగరేశారు. అయితే, ఆ ‘నీతి’ని ఆయన తమ వరకే పరిమితం చేసుకున్నారు. బయటి పార్టీ వారిని తమ పార్టీలో చేర్చుకునే సమయంలో ఆయన ఏ నీతి సూత్రాలను పాటించలేదు. ముఖ్యంగా, రాష్ట్ర విభజన లక్ష్యం నెరవేరి, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇతర రాష్టాలకు, ఇతర పార్టీలకు భిన్నంగా నూతన రాజకీయ సంసృతిని అవలంబిస్తారని ఆశించిన వారికి, నిరాశనే మిగిల్చారు.  రాజకీయ పునరేకీకరణ అనే అందమైన పేరును తగిల్చి, కాంగ్రెస్, తెలుగు దేశం, చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను కారేక్కించారు. అంతే కాదు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీచ రాజకీయ సంస్కృతిని మరో మెట్టు కిందకు దించి, సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ను నేరుగా మంత్రివర్గంలోకే తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎలాంటి నీతీ నియమాలు లేకుండా, తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల సభ్యులను పార్టీలో చేర్చుకుని, సంఖ్యా బలాన్ని పెంచుకున్నారు. ఒక్క బీజేపీ, ఎంఐఎం తప్ప  వామపక్షాలు సహా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గులాబీ గుంపులో చేర్చుకున్నారు. రెండేళ్ళ క్రితం 2018 డిసెంబర్’లో జరిగిన శాసన సభ ఎన్నికలలో, తెరాస 88 స్థానాలు గెలుచుకుంది. కానీ, ఇప్పడు ఆ పార్టీ బలం 103. అంటే 15 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఫిరాయింపుల ద్వారా పార్టీలో కలిపేసుకుంది. ఈటల రాజేందర్’కు కేసీఆర్  ‘బి’ ఫారం ఇచ్చినట్లే, ఈ 15 మందికి  కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ‘బి’ ఫారం ఇచ్చాయి. హస్తం లేదా సైకిల్ గుర్తు మీదనే వీరు గెలిచారు. అయినా, అందులో ఒకరు కూడా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఇంచక్కా, అధికార పార్టీలో చేరి పోయారు. పదవులు అనుభవిస్తూ, అధికార పార్టీ అండతో, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు.  ఈటల ఎపిసోడ్ నేపధ్యంలో ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. తెరాస నాయకులను ఇరకాటంలోకి నెట్టేస్తోంది. తెరాస టికెట్ మీద గెలిచిన ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని  డిమాండ్ చేసిన తెరాస నాయకులు, తమ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చుక్కలు చూస్తున్నారు. అయితే, రాజకీయాలలో ఇవ్వన్నీ మాములే, చివరకు ప్రజలు ఏమి చేస్తారు. ఎలాంటి తీర్పు ఇస్తారు, అన్నదే కీలకం.

కాపు నేస్తంకు అవినీతిపరుడైన వైఎస్సార్ పేరేందుకు? 

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలన్ని వైఎస్ కుటుంబం పేర్లతోనే ఉన్నాయి. గత రెండేండ్లలో మొదలుపెట్టిన అన్ని పథకాలకు వైఎస్సార్, జగనన్న పేర్లతోనే ప్రారంభించారు. అంతేకాదు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల పేర్లు కూడా మార్చి.. వైఎస్ కుటుంబం పేర్లతో నింపేశారు. ఏపీలో జరుగుతున్న వైఎస్ జపంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయినా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. కాపు నేస్తానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. దీనిపై ఆ వర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏపీ సర్కార్ కాపులను అవమానించిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాపు నేస్తానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం సరికాదని ఏపీ సీఎం జగన్ కు  కాపు ఉద్యమ నేత, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్  పేరు పెడితే  కాపులకు అవమానమని అన్నారు. వెంటనే ఆ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించాలని వేల్పూరి డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిత్య అసమ్మతి వాది అని, దేశంలో అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడని తన లేఖలో వేల్పూరి చెప్పారు. వైఎస్ అవినీతి కారణంగా పది మంది IAS, IPS అధికారులు జైలుకు వెళ్లారని జగన్ కు ఆయన గుర్తు చేశారు. చిరంజీవి పై పులివెందుల, తిరుపతిలో దాడులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాముడు, ఎమ్ ఎల్ సి  చెంగలరాయులు, మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య ఇంటిపై దాడి, తిరుపతి మాజీ శాసన సభ్యులు వెంకటరమణపై,  ఒంగోలు గ్రానైట్ వ్యాపారి డాక్టరు ఆనంద్ పై, చిత్తూరు జిల్లా బలిజ ఉద్యమ నేత కటారి మోహన్ల పై దాడులకు పాత్రధారి, సూత్రధారి వైఎస్సార్ అన్న విషయం ప్రజలందరికి తెలుసన్నారు వేల్పూరి శ్రీనివాసరావు.  2004,2009 లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించినా  సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నది వాస్తవం కాదా అని జగన్ ను సూటిగా వేల్పూరి ప్రశ్నించారు. కాపుల సర్వే కోసం ఒక్కరూపాయి కూడా ఇవ్వని కాపు వ్యతిరేకి వైఎస్ పేరు  కాపు నేస్తంకు పెట్టడం సరికాదన్నారు. సామాజిక ఉద్యమ వీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి మహిళా ఉద్యమ నేత సావిత్రి బాయి పూలే, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరాం , సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, నరేంద్ర మోడీ, వంగవీటి మోహన్ రంగా, దళిత శిఖరం దామోదరం సంజీవయ్య, మొట్టమొదటి కాపు ఉద్యమ నేత మిరియాల వెంకట రావు పేర్లలో ఏదో ఒకటి  కాపు నేస్తంకు పెట్టాలని సూచించారు. దెబ్బతిన్న కాపుల మనోభావాలను రక్షించాలని, కాపు భక్షకుడైన వైఎస్ఆర్ పేరును తక్షణం తొలగించాలని సిఎం జగన్ కు రాసిన లేఖలో వేల్పూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.  

టీఆర్ఎస్ కౌన్సిలర్ మందు వేసి రచ్చ రచ్చ.. 

అది నిజామాబాద్ జిల్లా ఆర్మర్ పట్టణం. అతను టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్. తెలంగాణలో వాళ్లదే పై చేయి ఉండాలి.. అందుకోసం ఎంతటి నీచమైన పనికైనా పూనుకుంటారు. ఈ టీఆరఎస్ లీడర్స్. అందితే మీద అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. పట్నం లీడర్ కానుంచి పల్లే లీడర్ వరకు టీఆర్ఎస్ నాయకుల జన్మనక్షత్రం ఆ అలవాటు. అసలే అదిరకం లో ఉన్నారు.. అధికారులు మాటవినకపోతే.. మందు వేసి నోటికి మస్తు మస్తు హంగామా చేయడం వీళ్ళకి ముందు నుండి ఉన్న బుద్ది. ఇలాంటి వార్తలు చాలానే చూశాం. తాజాగా ఒక మున్సిపల్ కౌన్సిలర్ మందు వేసి.. మున్సిపల్ ఆఫీస్ ముందు.. అధికారులపై పెద్ద సినిమానే చూపించాడు.. మరి అసలు విషయంలోకి వెళ్దామా..  గంగా మోహన్ చక్రు ఆర్మూర్ మున్సిపాలిటీలోని 15 వ వార్డ్ కౌన్సిలర్. అయితే అధికారులు, మున్సిపల్ సిబ్బంది తన మాట వినటం లేదంటూ మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి మున్సిపల్ మేనేజర్ మనోహర్, టీపీవో రాజేష్ లతో గొడవకు దిగాడు. ఆఫీస్ ముందు రచ్చ రచ్చ చేశాడు. అక్కడితో ఆగక ఒక రౌడీలా ప్రవర్తించాడు. టీపీవో కు సంబంధించిన కంప్యూటర్ లను ధ్వంసం చేశాడు. దీంతో అక్కడే వున్న సిబ్బంది అతనిని సర్దిచెప్పి అక్కడి నుండి పంపించారు. ఈ సంఘటన బుధవారం అలస్యంగా వెలుగు చూసింది. కేవలం బల్ధియా అధికారులు తాను చెప్పిన పనులు చేయ్యడం లేదని అధికారులతో గొడవకు దిగి నానా రభస చేయ్యడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. బుధవారం ఈ సంఘటనపై బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే కమిషనర్ రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు.

ఈట‌ల‌కు రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్‌!.. హుజురాబాద్‌లో తీన్మార్‌..

ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్‌. ఈటల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌. కొంత‌కాలంగా ఇదే వినిపిస్తోంది. హుజురాబాద్‌లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌ నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. ఈట‌ల బీజేపీలో చేర‌డంతో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. ఈట‌ల‌ను కారుతో ఢీకొట్టేందుకు అధికార‌పార్టీ స‌ర్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గులాబీ దెబ్బ‌ను కాచుకునేందుకు ఈట‌ల క‌మ‌లం పువ్వు ప‌ట్టుకున్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జ‌రిగితే.. పోరు ప‌క్కా హోరాహోరీ. కొంత‌కాలంగా ఇవే విశ్లేష‌ణ‌లు. అయితే.. అక్క‌డ ఈట‌ల‌-బీజేపీ, కేసీఆర్‌-టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా అత్యంత బ‌లంగా ఉంద‌నే విష‌యం సైడ్ ట్రాక్ ప‌డుతోంది.  కాంగ్రెస్ నుంచి ఖ‌త‌ర్నాక్ కేండిడేట్ కౌశిక్‌రెడ్డి ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి క‌నుక కంప్లీట్ ప్రెసిడెంట్ అయితే.. హుజురాబాద్ రాజ‌కీయ ముఖ‌చిత్రం మ‌రోలా ఉంటుంద‌నే విష‌యం మ‌రుగున ప‌డుతోంది. ఎందుకంటే.. కౌశిక్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మామూలోళ్లు కాదు.. వాళ్లిద్ద‌రూ క‌లిసి.. స‌వాల్‌గా తీసుకుంటే.. ఇటు ఈట‌ల అయినా.. అటు టీఆర్ఎస్ అయినా.. హుజురాబాద్‌లో లెక్క‌లు స‌రి చూసుకోవాల్సిందే. అల్లాట‌ప్పాగా చెబుతున్న మాట కాదిది.. ప‌క్కా లెక్క‌ల‌తో చేస్తున్న విశ్లేష‌ణ అంటోంది కాంగ్రెస్‌.  ఈట‌ల రాజీనామాతో కాంగ్రెస్ సైతం ఇదే మంచి ఛాన్స్ అంటూ కాక మీదుంది. యంగ్ ట‌ర్క్, డైన‌మిక్ లీడ‌ర్‌, మాజీ క్రికెట‌ర్ కౌశిక్‌రెడ్డి ఉండ‌గా.. త‌మ‌కు తిరుగులేద‌ని భావిస్తోంది. గ‌తంలో టీఆర్ఎస్‌కు ల‌క్ష పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. హ‌స్తం పార్టీ 60వేలకు పైగా ఓట్లు సాధించింది. అప్ప‌టి ఈట‌ల ఓట్లు.. ఇప్పుడు కారు గుర్తుకు, పువ్వు గుర్తుకు మ‌ధ్య చీలుతాయంటున్నారు. అప్పుడు చేతి గుర్తుకు ప‌డిన ఓట్లు అలానే మ‌ళ్లీ ప‌డితే.. ఓట్ల లెక్క ప్ర‌కారం కౌశిక్‌రెడ్డి గెలుపు ఖాయం. ఇదే లెక్క‌తో ఆయ‌నిప్పుడు మ‌రింత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కౌశిక్‌రెడ్డి.. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి క‌జిన్ కావ‌డంతో కాంగ్రెస్ పెద్ద‌లు సైతం ద‌న్నుగా నిల‌బ‌డ‌తారు. రెడ్డి కార్డు లాభిస్తుంది కూడా. ఇక మ‌రో కీల‌క‌ అంశం రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌. రేపోమాపో రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు ప‌క్కా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే నిజ‌మైతే.. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌న్ఫామ్ అయితే.. రాజ‌కీయం మ‌రింత రంజుగా మారడం గ్యారంటీ. ఎందుకంటే, రేవంత్ పీసీసీ ప‌గ్గాలు చేప‌డితే.. ఆ త‌ర్వాత జ‌రిగే మొట్ట‌మొద‌టి ఎన్నిక హుజురాబాదే అవుతుంది. ఆ ఉప ఎన్నిక‌పై అధిష్టానం ఫోక‌స్ కూడా ఉంటుంది. త‌న స‌త్తా ఏంటో హైక‌మాండ్‌కు చూపించేందుకు రేవంత్‌రెడ్డి హుజురాబాద్ బైపోల్‌ను స‌వాల్‌గా తీసుకునే అవ‌కాశం ఉంది. రేవంత్‌లాంటి చిచ్చ‌ర‌పిడుగు గ‌ట్టిగా ఫోక‌స్ చేస్తే.. అత‌నికి కౌశిక్‌రెడ్డి లాంటి యంగ్ ట‌ర్క్ తోడైతే.. కాంగ్రెస్ విజ‌యావ‌కాశాల‌ను అస‌లే మాత్రం కొట్టిప‌డేయ‌లేని అంశం. ఆ ఇద్ద‌రు క‌లిసి.. కేసీఆర్‌-ఈట‌ల‌, టీఆర్ఎస్‌-బీజేపీ దొందు దొందేనంటూ ఊద‌ర‌గొట్ట‌డం ఖాయం. రాజ‌కీయ వ్యూహాలు, ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో రేవంత్‌రెడ్డి.. కౌశిక్‌రెడ్డి ప‌క్షాన నిల‌బ‌డితే.. ఇటు ఈట‌ల‌కు, అటు టీఆర్ఎస్‌కు ద‌బిడి దిబిడే.

ప్రధాని మోడీకి రఘురామ లేఖ..  జగన్ కు ఇక చుక్కలేనా? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. రోజుకో అంశంపై జగన్ రెడ్డి సర్కార్ ను ప్రశ్నిస్తున్న రఘురామ.. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఏపీ అప్పుల పాలై విలవిల్లాడుతోందని తెలిపారు. తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్రం ఊబిలో చిక్కుకుందని తెలిపారు. 2020లో సగటున ప్రతి నెల రూ.9,226 కోట్లు అప్పు చేశారని వివరించారు. అందులో ఉచిత పథకాల కోసమే రూ.13 వేల కోట్లు తెచ్చారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.   ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్‌డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని తెలిపారు ఎంపీ రఘురామ రాజు. ఏపీఎస్‌డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని ఆయన లేఖలో వివరించారు. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని ఎంపీ రఘురామ విమర్శించారు. విశాఖలో కేటాయించిన భూములను దుబాయ్‌కి చెందిన లులు సంస్థకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసిందని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని దృష్టి సారించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. లులూ గ్రూప్ నుంచి భూములు వెనక్కి తీసుకుని, వాటిని కూడా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు.ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.   

జూన్ 21న కేంద్ర కేబినెట్ విస్తరణ! ఏపీ ఎంపీకి ఛాన్స్ ?

ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ  రెండవసారి అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇంతవరకు  ఒక్క సారి కూడా కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరగలేదు. ఒకరిద్దరు మంత్రులు కాలధర్మం చెందారు.ఒకరిద్దరిని కరోనా కాటేసింది. మొత్తంగా చూస్తే ఓ 20 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొందరు మంత్రుల మీద పని భారం ఎక్కువగా వుంది.   కొన్ని కీలక రాష్ట్రాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. మరోవంక వచ్చే సంవత్సరం ఆరంభంలో  ఉత్తర ప్రదేశ్ సహా ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవంక 2024లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బేస్  పెంచుకోవలసిన అవసరం వుంది. అదే విధంగా, కొవిడ్ షాక్ తర్వాత  మిత్ర పక్షాలను అక్కున చేర్చుకుని,, ఎన్డీఎ స్ట్రక్చర్’ను మళ్ళీ బలంగా తెరమీదకు తీసుకు రావలసిన అవసరం ఏర్పడిందని, బీజేపీ, సంఘ్ పరివార్ నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపధ్యంలోనే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై దృష్టిని కేంద్రీకరించారు. కరోనా సెకండ్ వేవ్ కొంత శాంతించిన నేపధ్యంలో, సంఘ్ నాయకులతో, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు సంప్రదింపులు చేస్తున్నారు. దేశంలో ఎక్కడిక్కడ,, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను జాతీయ నాయకుల పర్యవేక్షణలో స్థానిక నాయకులు, పరివార్ సంస్థల కార్యకర్తలు అధ్యయనం చేసి నివేదికలను పార్టీ నాయకత్వానికి సమర్పించారు. ఈనెల 21న కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని పక్కా సమాచారం.  ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు తప్పక స్థానం ఉంటుందని, ఢిల్లీ వర్గాలు ఘంటాపథంగా చెపుతున్నాయి. అందులో ఆంధ్ర ప్రదేశ్’కు సంబంధించి, పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, అందుకు షరతులు వర్తిస్తాయని, అంటున్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే, అప్పుడు ఆయన్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సుముఖంగా లేరని, అదే విధంగా, బ్రదర్ చిరంజీవి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి రాజకీయ వేషం కట్టేందుకు కూడా సుముఖంగా లేరని, ఉండీ లేనట్లుగా ఉంటూ మెల్లిగా రాజకీయ ప్రస్థానాన్ని సాగించాలన్నదే పవన్ కళ్యాణ్  ప్లాన్ అని అంటున్నారు. సో, ఈ సారికి పవన్ కళ్యాణ్’కు ఛాన్స్  లేదని తెలుస్తోంది.  తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన సుగుణా చౌదరి, సీఎం రమేష్, టీజే వెంకటేష్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా, ఒక నిర్ణయానికి అయితే రాలేదని, ముఖ్యంగా ప్రధానమంత్రి అందుకు సుముఖంగా లేరని అంటున్నారు. ఈనేపధ్యంలో ఇప్పుడు ఇంకొకరిని మంత్రి వర్గంలోకి తీసుకుని ఇంకో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే, కంటే ఇప్పటికే, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్య సభ సభ్యునిగా ఉన్న జీవీఎల్ నరసింహ రావుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే, మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా  వెతకడం ఎందుకన్నట్లు, అన్ని విధాలా అర్హతలు ఉన్న జీవీఎల్  పేరును  ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  జీవీఎల్ పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యునిగా సమర్ధంగా పనిచేయడమే కాకుండా, పార్టీలో ఐడిలాజికల్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు వుంది. సో.. ఏపీ నుంచి జీవీఎల్ పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లే అని, విశ్వసనీయ సమాచారం. ఇక తెలంగాణ విషయానికివస్తే, ఆ ఇద్దరిలో ఒకరు లేదా ఒక సర్ప్రైజ్ ఛాయస్ ఉంటుందని అంటున్నారు. అయితే, అది ఎవరన్నది  మాత్రం .. సస్పెన్స్ గానే వుంది.

భార్య, ఇద్దరు అత్తలు కలిసి అల్లుడ్ని చంపేశారు.. 

మద్యం బాబులకు మందేస్తే కిక్కు కానీ చూసేవాళ్ళకి చాలా చిరాకు గా ఉంటుంది. మద్యం తాగడం వల్ల చాల కుటుంబాల్లో నిత్యం గొడవలు కొని సార్లు ఈ మద్యం మత్తులో ఎందరో చంపుకున్న విషయాలు ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఒక వ్యక్తికి ఏం జరిగిందో చూడండి.  కొంత మంది ఆడవాలను చూస్తే జాలివేస్తుంది.. మరి కొంత మంది ఆడవాళ్లను చూస్తే గౌరవించాలని ఉంటుంది. కానీ వీళ్ళు ఆడవాళ్లు కాదు. కిలేడీలు.. కీలాడీలు, మాయలేడీలు,అది గుంటూరు జిల్లా. గోరంట్ల శివారులో అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌‌గా పనిచేస్తూ హత్యకు గురైన వ్యక్తి మర్డర్ మిస్టరీని జిల్లాలోని నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. అతన్ని ఎవరు చంపేచారు. ఆ వాచ్ మెన్ ని ఎవరు చంపారు.. ఎందుకు చంపారు..దానివెనుక కారణాలు ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంతున్నారా..?  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన నల్లబోతు వెంకటేశ్వర్లు, అతని భార్య రామలింగమ్మ ఐదు సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి బతుకుదెరువు కోసం వలస వచ్చారు. జిల్లా శివారులోని గోరంట్ల సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్లు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య రామలింగమ్మ కూడా నగరంలోని ఓ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ అపార్ట్‌మెంట్‌లో ఓ గదిలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటేశ్వర్లు అత్తమామలు కూడా అతను పనిచేసే అపార్ట్‌మెంట్ పక్కనే మరో అపార్ట్‌మెంట్‌లో పనికి కుదిరారు. వెంకటేశ్వర్లు అత్త పేరు నాగేంద్రం. ఆమె చెల్లి వీరమ్మ కూడా ఇళ్లలో పనులు చేసుకుంటూ వీరితో పాటే ఉంటోంది. వెంకటేశ్వర్లు‌కు మద్యం అలవాటుంది. ఇటీవల వెంకటేశ్వర్లు భార్య రామలింగమ్మతో తరచూ మద్యం తాగొచ్చి గొడవపడుతున్నాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రామలింగమ్మ అతనిని చంపాలని నిర్ణయించుకుంది. ఆమె ఈ విషయాన్ని తన తల్లి నాగేంద్రంతో, పిన్ని వీరమ్మతో చెప్పింది. వాళ్లు కూడా అల్లుడిని చంపేందుకు సాయం చేస్తామని చెప్పడంతో వాళ్ళ పథకానికి బలం చేకూరింది. ప్లాన్ వేశారు ఆ పథకం అమలు చేయాలనుకున్నారు.  ఈ నెల 11న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చి గొడవపడి.. అనంతరం నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు మెడకు చీరతో ఉరి బిగించి కాళ్లూచేతులూ పట్టుకుని ముగ్గురూ హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. వెంకటేశ్వర్లు తల్లి అంకమ్మకు ఫోన్ చేసి రామలింగమ్మ, నాగేంద్రం, వీరమ్మ అక్కడి నుంచి పరారయ్యారు. కోడలి మాటలతో అనుమానం వ్యక్తం చేసిన వెంకటేశ్వర్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణను సవాల్‌గా స్వీకరించిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా వెంకటేశ్వర్లును హత్య చేసినట్లుగా ముగ్గురూ ఒప్పుకున్నారు. భర్త వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చంపాలని నిర్ణయించుకుని అతనిని భార్య హతమార్చడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.  

ఈట‌ల‌కు క్రొక‌డైల్ ఫెస్టివ‌ల్‌.. అంద‌రివాడు కొంద‌రివాడై..!

ఇలా రాజీనామా చేసి.. అలా బీజేపీలో చేరి.. ఆ వెంట‌నే ఉప ఎన్నిక వ‌చ్చేసి.. ఆ వెనువెంట‌నే తాను ఎమ్మెల్యేగా గెలిచేసి.. కేసీఆర్‌ నెత్తి కొట్టేందుకు అసెంబ్లీలో అడుగుపెడ‌తాన‌నేది ఈట‌ల రాజేంద‌ర్ లెక్క‌. అయితే, లెక్క బాగానే ఉందికానీ.. ప‌రిస్థితే అంతా తిక్క తిక్క‌గా మారింది. రాజీనామా, బీజేపీలో చేరిక వ‌ర‌కూ అంతా స‌వ్యంగానే సాగింది. ఎందుకంటే ఆ రెండూ ఆయ‌న చేతిలో ఉన్న పనులే కాబ‌ట్టి. ఇందులోనూ చివ‌రాఖ‌రున కాస్త తేడా కొట్టిన‌ట్టుంది. ఢిల్లీలో ఈట‌ల‌కు అవ‌మానం జ‌రిగింది.. అమిత్‌షా, న‌డ్డాలు రాలేదు.. రాజేంద‌ర్‌ స్థాయి త‌గ్గించేశారు.. ఇలా గుస‌గుస‌లు గ‌ట్టిగానే వినిపించాయి. ఇలాంటి అవ‌మాన భారాలు, దూరాలు రాజ‌కీయాల్లో కామ‌నే అనుకుని.. తుడిపేసుకుపోవ‌డ‌మే పాలిటిక్స్ అంటే. అది వేరే విష‌యం అనుకోండి. ఇక‌, వాట్ నెక్ట్స్‌? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  రాజీనామాకు ముందే కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ అయి.. మీ మ‌ద్ద‌తు నాకేనంటూ రిక్వెస్ట్ చేశారు ఈట‌ల‌. త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే అనేది అట్నుంచి వ‌చ్చిన రిప్లై. ఇండిపెండెంట్‌గా పోటీ చేయ్‌.. కుదిరితే స‌పోర్ట్ చేస్తామ‌నేది కాంగ్రెస్ ఆన్స‌ర్‌. నువ్ బ‌డుగుల బాహుబ‌లివి.. సింగిల్‌గా బ‌రిలో దిగితే.. మా అంద‌రి మ‌ద్ద‌తు మీకేనంటూ ఇటు ప్ర‌జాసంఘాలు, అటు ఉద్య‌మ‌కారులు ఈట‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు పోటీప‌డ్డాయి. కోదండ‌రాం సారు, కొండా గారు.. అయితే ఈట‌ల‌ను కాళ్లావేళ్లా ప‌ట్టుకున్నంత ప‌ని చేశారు. మ‌రీ మ‌రీ బ‌తిమిలాడుకున్నారు.. బాబ్బాబు మా ఆశాకిర‌ణం నువ్వే.. నువ్ గానీ బీజేపీలో చేరితే మా దీపం కొండెక్కిన‌ట్టే.. స్వ‌తంత్రంగా పోటీ చేయండి.. మ‌న స‌త్తా ఏంటో చూపిద్దాం.. అంటూ తెగ న‌చ్చ‌జెప్పారు. వింటేగా.. ఈట‌ల అస‌లు వింటేగా... నా కేసులు, నా క‌ష్టాలు నావి.. నేనెవ‌రికి చెప్పుకోను.. మిమ్మ‌ల్ని ఏల న‌మ్ముకోనూ.. అన్న‌ట్టు అంద‌రికీ రాం రాం.. చెప్పేసి.. ఢిల్లీ వెళ్లి జై శ్రీరాం అనొచ్చారు.  ఢిల్లీ నుంచి హుజురాబాద్ తిరిగొచ్చే స‌రికి సీన్ మొత్తం మారిపోయింది. ప్ర‌జా సంఘాలు, ఉద్య‌మ కారులు.. అంతా రివ‌ర్స్ అయిపోయారు. పోటుగాడివ‌ని అనుకుంటే.. కాషాయం పార్టీతో క‌లుస్తావా అంటూ అంతా సైడ్ అయిపోయారు. మీ ఆస్తులే మీకు ముఖ్యం కానీ.. ప్ర‌జా ఉద్య‌మం కాదా? అంటూ క‌స్సుమంటున్నారు. త‌న డీఎన్ఏలోనే క‌మ్యూనిజం ఉంద‌ని ప్ర‌క‌టించుకున్న ఈట‌ల‌కు.. ఇప్పుడ‌దే కామ్రేడ్ల నుంచి వార్నింగ్ కూడా వ‌చ్చింది. ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జాద్రోహి అంటూ మావోయిస్టు పార్టీ నుంచి లేఖ రావ‌డం కల‌క‌లం రేపింది. ఈట‌ల‌కు ప్రజాసంఘాలు, ఉద్య‌మ‌కారులెవ‌రూ మ‌ద్ద‌తు ప‌ల‌కొద్ద‌ని మావోయిస్టులు పిలుపు ఇవ్వ‌డం షాకింగ్ ప‌రిణామం.  ఇక‌, బీజేపీనే త‌న అండా, దండా అనుకొని ధీమాగా ఉండ‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే, ఢిల్లీలో ద‌క్కిన ప్రాధాన్య‌త‌ను అంతా టీవీల్లో చూసి ఆయ‌నకు బీజేపీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంతో డిసైడ్ అయిపోయారు. అబ్బో.. ఇలాగైతే ముందుముందు క‌ష్ట‌మేన‌ని మెళ్లిగా అనుచ‌ర వ‌ర్గమూ చేజారిపోతోంద‌ని అంటున్నారు. ఇటు అధికార పార్టీ నుంచి ప్రెజ‌ర్.. అటు బీజేపీ నుంచి క‌న్ఫ్యూజ‌న్‌.. ఎందుకైనా మంచిద‌ని కొంద‌రు న్యూట్ర‌ల్‌గా ఉంటున్నార‌ట‌. ఇక‌, సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే బీజేపీ నాయ‌కుల నుంచి ఎదురుదెబ్బ‌లు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే ఇద్ద‌రు బీజేపీ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. హుజురాబాద్‌లో బీజేపీ కేండిడేట్‌గా చెలామ‌ణి అవుతున్న‌.. ఒక‌ప్ప‌టి టీడీపీ బ‌డా నేత పెద్దిరెడ్డి.. ఈట‌ల‌పై ధ‌ర్మాగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌నొచ్చి త‌న సీటుకు ఎస‌రు పెడితే ఎలా..? త‌న‌ను కాద‌ని ఈట‌ల‌కు టికెట్ ఇస్తే.. పార్టీలో ఉండే ప్రస‌క్తే లేదు.. అవ‌స‌ర‌మైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ స‌హ‌చ‌రుల ద‌గ్గ‌ర రెబెల్ జెండా ఎగ‌రేస్తున్నార‌ట పెద్దిరెడ్డి. ఎంత చెడినా.. పెద్దిరెడ్డికి ఇప్ప‌టికీ ఎంతోకొంత ఫాలోయింగ్ లేక‌పోలేదు. ఆ మేర‌కు ఈట‌ల‌కు న‌ష్టం జ‌ర‌గ‌క‌పోదు.  అటు, రాజీనామాకు ముందు ఇంటి చుట్టూ తిరిగిన కోదండ‌రాం సారు కానీ, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిక కానీ.. ఇప్పుడు అటువైపే చూడ‌టం లేదు. ఎందుకు చూస్తారు లెండీ.. అంత మంచిగా చెప్పినా విన‌న‌ప్పుడు.. ఎవ‌రి పాపాన వాళ్లు పోతార‌ని సైలెంట్ అయి ఉంటార‌ని అంటున్నారు. బీజేపీ అన‌గానే బ‌హిరంగంగా స‌పోర్ట్ చేసేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు కొన్నివ‌ర్గాలు. ఈట‌ల మీద ఎక్క‌డ‌లేని అభిమానం ఉన్నా.. పువ్వు గుర్తుకు ఓటేసేందుకు ఎంత‌మంది సిద్ద‌మ‌వుతార‌నేదే ఈట‌ల‌ గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేసే పాయింట్‌. ఈట‌ల రాజేంద‌ర్ కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ఆయ‌న వ‌ర‌కూ క‌రెక్టే అయినా.. బీజేపీలో చేరి అంద‌రివాడైన ఈట‌ల‌.. కొంద‌రివాడై పోయాడ‌నే ఆవేద‌న ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గంలో వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌రిస్థితులూ అలానే మారుతున్నాయి మ‌రి.

ఏపీకి త్వరలో కొత్త గవర్నర్? 

ఆంధ్రప్రదేశ్ కు త్వరలో కొత్త గవర్నర్ రాబోతున్నారా? కేంద్ర సర్కార్ ఇప్పటికే ఆ దిశగా కసరత్తు పూర్తి చేసిందా? అంటే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ఏపీ ప్రస్తుత గవర్నర్  విశ్వభూషణ్ కు హస్తిన పిలుపు రావడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం, కేంద్ర హోంశాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరపడం.. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్ ను కలవడం జరిగింది.ఈ  పరిణామాలన్ని గవర్నర్ మార్పు కు సంకేతాలు ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.  ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్‌ హరిచందన్ 2019 జూలై 14న  బాధ్యతలు స్వీకరించారు. ఒడిషాకు చెందిన ఆయన  వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. 1934 ఆగస్టు3న ఆయన జన్మించారు. వయసు ఎక్కువగా ఉండటం వల్లే ఆయనను మార్చాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. వయసు రీత్యా గవర్నర్ చురుకుగా ఉండటం లేదు. ఆయన రాజ్ భవన్ విడిచి బయటికి వెళ్లిన సందర్భాలు  చాలా తక్కువ. రాజ్యాంగ పరమైన కార్యక్రమాలు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం మినహా ఎక్కడికి ఆయన వెళ్లడం లేదు. అందుకే విశ్వభూషన్ హరిచందన్ ను మార్చాలని కేంద్రం నిర్ణయించిందని తెలుస్తోంది.  గవర్నర్ మార్పు అంశంపై ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ తోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారని సమాచారం. అందుకే ఢిల్లీ నుంచి రాగానే.. జగన్ సతీసమేతంగా వెళ్లి గవర్నర్ ను కలిశారని అంటున్నారు. జగన్ ను గవర్నర్ ను కలిసిన మరుసటి రోజే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో... ఆయన మార్పు ఖాయమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తదుపరి గవర్నర్ గా బెంగళూరు హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసి ఇటీవలే పదవి విరమణ చేసిన జస్టిస్ ను నియమించనున్నారని తెలుస్తోంది. గవర్నర్ మార్పుపై ఒకటి, రెండు రోజుల్లోనే కేంద్రం నుంచి ప్రకటన రావచ్చొంటున్నారు.  ఇటీవలే గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం ప్రభుత్వం పంపిన పేర్లను వెంటనే ఆమోదించలేదు గవర్నర్ విశ్వభూషణ్. సర్కార్ పంపిన పేర్లలో ఇద్దరిపై గవర్నర్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్చలొచ్చాయి. కేసులు ఉన్న కారణంగా తోట త్రిమూర్తులు, అప్పిరెడ్డి అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. అయితే సీఎం జగన్.. రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలిసిన వెంటనే ఆ నాలుగు పేర్లకు ఆమోదముద్ర పడింది. ఈ విషయంలో గవర్నర్ తీరుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆ వెంటనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గవర్నర్ మార్పు కోసమే విశ్వభూషణ్ ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.  మరోవైపు గవర్నర్ మార్పు వెనక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీ ఎంపీలకు బెర్త్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఏపీలో దూకుడు రాజకీయం చేయాలని భావిస్తున్న కేంద్రం పెద్దలు.. యాక్టివ్ గా ఉండే గవర్నర్ ను అపాయింట్ చేయాలని చూస్తుందని చెబుతున్నారు. వెస్ట్ బెంగాల్ తరహాలో దూకుడుగా ఉండే వ్యక్తిని గవర్నర్ గా నియమించాలని ప్లాన్ చేస్తుందని కూడా చెబుతున్నారు. 

కేసీఆర్, ఈటల ఒకటేనా! రాజకీయ డ్రామా చేస్తున్నారా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల ఏం చేస్తారన్నది జనాలు ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ ఉద్యమకారులందరిని రాజేందర్ ఏకం చేస్తారని ఎక్కువ మంది భావించారు. కొత్త పార్టీ దిశగానే ఈటల కూడా సంకేతాలిచ్చారు. కాని చివరికి ఆయన సొంత దుకాణం తన వల్ల కాదంటూ కమలం గూటికి చేరారు. ఈటల బీజేపీలో చేరడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగిన ఈటల రాజేందర్... రైటిస్ట్ పార్టీలో చేరడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పలు సంఘాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.  తాజాగా   ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంపై మావోయిస్టు పార్టీ కూడా స్పందించింది. ఈటలకు సంబంధించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటనను జగన్ తప్పుబట్టారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ఈటల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన అనంతరం హిందూత్వ పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని జగన్ విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీనితో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారన్నారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్ విమర్శించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని జగన్ తన లేఖలో మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడాన్ని  తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపడుతూ మావోయిస్టుులు విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. ఈటల అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు మొదటి నుంచి ఉద్యమ సంఘాలే మద్దతుగా నిలిచాయి. ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. ఈటలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు కూడా ఉద్యమకారులు, ప్రజా సంఘాలే ఆయనకు మద్దతుగా కేసీఆర్ ప పై విరుచుకుపడ్డాయి. అయితే ఈటల బీజేపీలో చేరడంతో... ఈ సంఘాలన్నిఆయనకు దూరం అయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

చెక్కపెట్టెలో బాలుడు.. 

రామాయణంలో సీత భూమిలో దొరికిందని చెప్పుకున్నాం.. మొన్నటికి మొన్న గంగా నదిలో కరోనా శవాలు దొరికాయని వార్తలు విన్నాం.. తాజాగా గంగా నదిలో  ఓ చక్క పెట్టె కొట్టుకు వచ్చింది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు కనకదుర్గ అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి అంతా అశ్చర్యపోయారు.  మణిరత్నం దళపతి  సినిమాలో చిన్నపుడు రజనీ కాంత్ నదిలో గడ్డిమీద వచ్చినట్లు ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. ఆ సౌండ్ వినగానే  ఆ నదిలో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీంతో పరిశీలించి చూడగా..నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీంతో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్‌లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం కరువైయింది. నవమాసాలు మోసి కన్న పిల్లలను కూడా గాలికి వదిలేస్తున్నారు. పసికందులను పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి ఇలాంటి వార్తలు బాగా పెరుగుతున్నాయి. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.