ప్రధాని మోడీకి రఘురామ లేఖ.. జగన్ కు ఇక చుక్కలేనా?
posted on Jun 16, 2021 @ 5:58PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. రోజుకో అంశంపై జగన్ రెడ్డి సర్కార్ ను ప్రశ్నిస్తున్న రఘురామ.. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఏపీ అప్పుల పాలై విలవిల్లాడుతోందని తెలిపారు. తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్రం ఊబిలో చిక్కుకుందని తెలిపారు. 2020లో సగటున ప్రతి నెల రూ.9,226 కోట్లు అప్పు చేశారని వివరించారు. అందులో ఉచిత పథకాల కోసమే రూ.13 వేల కోట్లు తెచ్చారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని తెలిపారు ఎంపీ రఘురామ రాజు. ఏపీఎస్డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని ఆయన లేఖలో వివరించారు. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని ఎంపీ రఘురామ విమర్శించారు. విశాఖలో కేటాయించిన భూములను దుబాయ్కి చెందిన లులు సంస్థకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసిందని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని దృష్టి సారించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.
లులూ గ్రూప్ నుంచి భూములు వెనక్కి తీసుకుని, వాటిని కూడా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు.ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.