కేంద్రం గుప్పిట్లోకి కృష్ణా, గోదావరి బోర్డులు.. జల వివాదాలకు చెక్ పడేనా? 

గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరుచూ తలెత్తుతున్న నీటి వివాదాలకు పుల్ స్టాప్ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బ్యాంక్‌ అకౌంట్‌లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది.  కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి.ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టులు..  కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్‌ఎల్‌సీ(హైలెవల్‌ కెనాల్‌), ఎల్‌ఎల్‌సీ(లోలెవల్‌ కెనాల్‌), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్‌ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చాయి.  గోదావరి బోర్డు పరిధిలోని ప్రాజెక్టులు.. కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి.  బోర్టుల ఏర్పాటుపై ముందు నుంది తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్‌–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్‌ 21న జరిగిన తొలి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ, 2020, అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్‌ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్‌లో చూసి బైకులు చోరీ.. సినిమా స్టైల్ లో పోలీసుల వేట.. 

మన దేశంలో యూట్యూబ్‌ చాలా మంది యువకులకు తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలిపేందుకు వాడుకుంటే ఇంకొంత మంది.. అదే యూట్యూబ్ చూసి సంఘవిద్రోహ  పనులు చేస్తున్నారు. అయినా యూట్యూబ్ లో చూసి ఎవడైనా వంట ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఎలా డ్రాయింగ్ చేయాలో నేర్చుకుంటారు . ఇలా చెపుతూపోతే చాలానే ఉన్నాయి. ఇంకొంత మంది యూట్యూబ్ లో చూసి రోగులకు ఆపరేషన్ కూడా చేయడం విడ్డురం.. అదే తరహాలో తాజాగా యూట్యూబ్ చూస్తూ బైక్స్ ని  చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ లో ఉండే బైక్‌లను అర్థరాత్రి సమయంలో దొంగతనం చేసే ముఠీను పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులు రంగంలోకి దిగారు. పల్సర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ బైక్స్‌ను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠాను ఆసిఫ్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌ కేవలం 12రోజుల వ్యవధిలోనే ఎనిమిది వాహనాలను తస్కరించినట్లు పశ్చిమ మండల పోలీసు కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ, గొల్ల మధు స్నేహితులు. ప్రైవేట్‌ ఉద్యోగులైన వీరిలో నాగతేజ ప్రస్తుతం కుందన్‌ బాగ్‌లోని ఓ హాస్టల్‌లో నివసిస్తూ ఉండగా.. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారు. ఇంకేముందు ఇది ఒక్కటి చాలు జీవితం నాశనం అవ్వడానికి. అందులోనూ తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం తాగేందుకు చందు, మధు తరచూ తేజ వద్దకు మందు తాగడానికి వస్తూ ఉండేవాళ్లు. అదే సమయంలో ఈజీ మనీ కోసం సెర్చ్ చేయడం ప్రారంభించాడు. అందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గమే బైక్‌లను చోరీ చేయడం వెంటనే వాళ్ళ పధకాన్ని స్టార్ట్ చేశారు. ఆసిఫ్‌నగర్, ఎస్ఆర్ నగర్‌ ప్రాంతాల్లోని హాస్టళ్లలో పార్కింగ్‌ సదుపాయం లేని హాస్టళ్ల బయట ఉండే స్పోర్ట్స్‌ బైకులను చోరీ చేసేందుకు ప్లాన్‌ చేశారు. దొంగతనం చేసేందుకు టెక్నాలజీ సాయం కోసం యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశారు. ఆ వీడియోల ఆధారంగా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను నరసరావుపేటలోని మధు ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్టి మళ్లీ సిటీకి వచ్చేవాళ్లు. పన్నెండు రోజుల్లోనే ఆసిఫ్‌నగర్, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్‌బీ కాలనీల్లో ఎనిమిది పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్స్‌ కొట్టేశారు. ఈ చోరీలను ఛేదించడానికి ఆసిఫ్‌నగర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. అసలే ఇప్పుడు అడుగడుగుల సీసీ కెమెరాలు ఉన్నాయి.. పోలీసులు దాదాపు  100 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను పరిశీలించిన టీమ్‌ అందులో దొరికిన క్లూతో వారిని పట్టుకునేందుకు నిఘాపెట్టింది. ఈ క్రమంలోనే బైక్ దొంగలను గుర్తించిన కానిస్టేబుల్స్ రామకృష్ణ, శ్రీకాంత్ ఛేజ్ చేసి దొంగలను పట్టుకున్నారు. మొత్తం ముగ్గురినీ, ఈ కేసులో అరెస్ట్ చేసి, ఎనిమిది వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా వారిని పట్టుకున్నందుకు కానిస్టేబుల్‌లను అధికారులు అభినందించారు. అందుకే అంటారు తప్పు నిప్పులాంటిది.. దాన్ని పట్టుకుంటే కాలుతుందని.. ఈజీ మనీ కాదు కస్టపడి పనిచేయడానికి ఇష్టపడండి.. ఈ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు అవుతుంది. 

చదువుకున్నోళ్లకు హమాలీ ఉద్యోగం.. గొప్పగా చెప్పుకున్న మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. దిగజారి ప్రవర్తిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నించిన వారిపై జులూం ప్రదర్శిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మంత్రి మరింత ఓవరాక్షన్ చేశారు. ఉద్యోగాల కల్పనైప మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేలాది మందికి హమాలీ పని కల్పించామని, చదువుకున్నోళ్లకు హమాలీగా అవకాశం కల్పించామని గొప్పగా ప్రకటించుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలో జరిగిన దిశ సమీక్షలో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలియ్యలేమని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏటా ఐదు నెలలపాటు హమాలీ పని చేసుకునే వెసులుబాటు ఉందని, ఇంతకుమించిన ఉపాధి ఏముంటుందని అన్నారు. ‘ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్​ అంటే ఇదే..’ అని హమాలీ పని గురించి ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రంలో, పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ ఉద్యోగాలు పీకేసి,  ఇక్కడ మాత్రం ఇవ్వాలని ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్మలకు పాల్పడితే కామన్ ​సెన్స్ ​లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ‘తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వానకాలం, యాసంగి సీజన్లలో రెండు నుంచి రెండున్నర నెలలు సొంత పనులు చేసుకుంటూనే  హమాలీ పని చేసునునే వెసులుబాటు రాష్ట్రంలో గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకుమించిన ఉపాధి ఏముంటదని నేను అడుగుతున్న.. ఉపాధి అంటే ఇది కాదా అంటున్న.. ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్ ​అంటే ఇదే.. ఇలాంటి విషయాలను చర్చకు పెట్టకుండా సదువుకున్నోళ్లందరికీ సర్కారు నౌకర్లు కావాలంటే ఎట్ల?’  అని నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు.  చదువుకున్నోళ్లకు హమాలి పని కంటే బెటరేంటీ అంటూ వ్యాఖ్యలు వివాదం కావడంతో మంత్రి మళ్లీ వివరణ ఇచ్చారు. తాను నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఉపాధి అవకాశాలు పెంచామని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని అన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నారని తాను అన్నట్టుగా ప్రచారం చేయడం విచారకరమన్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ టౌన్​లో దిశ రివ్యూ మీటింగ్​లో మంత్రి నిరంజన్ రెడ్డి అన్న మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ.. వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్​సోషల్ మీడియా ఇన్​చార్జి గంగాపూర్ విక్రమ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లయింట్ మేరకు వే2న్యూస్, దిశ డైలీ డాట్ కమ్, 6టీవీ, టీవీ9 యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు వనపర్తి టౌన్ ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. నాగర్​కర్నూల్​లో కూడా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌‌‌‌‌‌‌‌..  డీఎస్పీ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఎకరాకు 60 కోట్లు.. కోకాపేట భూముల వేలంలో రికార్డ్ 

తెలంగాణ ప్రభుత్వం  భూముల వేలం లో రికార్డు సృష్టించింది. హైదరాబాదు శివారు ప్రాంతం కోకాపేటలోని ప్రభుత్వ భూములను వేలం వేయగా భారీ స్పందన వచ్చింది. ఎకరం ధర గరిష్టంగా 60 కోట్లు పలికింది. కోకాపేటలో నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ రూపొందించిన లే అవుట్ లో ని ఫ్లాట్ కి  ఆన్లైన్ వేలం నిర్వహించారు. ఇందులో దాదాపు యాభై ఎకరాలను విక్రయించగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఒక్కో ఎకరం దర రూ 60 కోట్లకు పైగా ధర పలకడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ప్లాట్ నెంబర్ ఒకటిలో 7.721 ఎకరాలు .... ఇందులో ఒక ఎకరం ధర 42.2 కోట్లు కాగా మొత్తం 325.8 మూడు కోట్లు ధర పలికింది. దీనిని మన్నె సత్యనారాయణ రెడ్డి కొనుగోలు చేశారు. రెండవ నెంబర్ ప్లాట్ లో 7.755ఎకరాలు... ఒక ఎకరం ధర 42.4 కోట్లు కాగా మొత్తం 328.81 కోట్ల రూపాయలు వెచ్చించి రాజ పుష్ప పి పి ఎల్ సంస్థ కొనుగోలు చేసింది. మూడవ ప్లాట్ 7.738ఎకరాలు..., ఒక ఎకరం ధర 36.4 కోట్లు ధర పలకగా మొత్తం 281.16 కోట్లకు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 12వ ప్లాట్ విస్తీర్ణం 7.564ఎకరాలు.. ఒక ఎకరం ధర 37.8 కోట్లు పలక మొత్తం 285.92 కోట్లకు ప్రెస్టేజ్ ఏస్టేట్స్ ప్రాజెక్టు లిమిటెడ్ కొనుగోలు చేసింది.  నాలుగు ప్లాట్స్ లోని 30.77 ఎకరాలకు 1222 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్లాట్ 4లో 8.946ఎకరాలు.. 39.2 కోట్ల రూపాయలకు ఒక ఎకరం చొప్పున 350.68 కోట్లకు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోగా.. ప్లాట్ నెంబర్ 13లో  7.575ఎకరాలు..ఎకరం ధర 39.2 కోట్ల చొప్పున 296.94 కోట్లకు వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.  ప్లాట్ A ఒకఎకరం.. ఒక ఎకరం 31.2 కోట్ల చొప్పున హేమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. గోల్డెన్ మైల్ సైట్ 1లోని ప్లాట్ నెంబర్ 2/పి లో 1.650 ఎకరాలు... ఈ ఫ్లాట్ అత్యధికంగా 60.2 కోట్ల చొప్పున 99.33  కోట్లకు రాజ పుష్ప రియాలిటీ llp కొనుగోలు చేసింది.  ఈ భూముల వేలానికి గత సంవత్సరం నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేస్తోంది. నియో పోలిస్ వెంచర్ లోని 49.92 ఎకరాలను ఎమ్మెస్టీసీ వెబ్ సైట్ ద్వారా వేలం వేసింది.  ఎకరం కనీస ధరను ప్రభుత్వం రూ.25 కోట్లు అని ప్రకటించగా, దాదాపు అందుకు రెట్టింపు ధర లభించడం విశేషం. కోకాపేటలో నేడు వేలం వేసిన భూములు అవుటర్ రింగురోడ్డు పక్కనే ఉండడమే అందుకు కారణం. కాగా ఈ వెంచర్ కు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా రహదారులు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో, రియల్ వ్యాపారులు భారీగా వేలం పాటలో పాల్గొన్నారు.  గతంలో ఇక్కడ కొన్ని భూములను వేలంగా వేయగా గరిష్ఠంగా రూ.40 కోట్ల వరకు ధర పలకగా, ఈసారి అంతకు మించిన ధర పలికింది.  కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా వేలంలో పాల్గొంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన భూములకు కూడా ఇదే ధర వెళుతుందని భావిస్తున్నారు.

భ‌లే భ‌లే పుల‌స‌.. ఈసారి ధ‌ర ఎంతో తెలుసా..? సీజ‌న్ వ‌చ్చేసిందోచ్‌...

అన్నీ తిని చూడు.. పుల‌స తినిచూడు. చూడ చూడ రుచుల.. పుల‌స రుచియే వేర‌యా. నాన్‌వెజ్ ఐట‌మ్స్ ఎన్నున్నా.. పుల‌స పులుసు ముందు అవ‌న్నీ దిగ‌దుడుపే. అందుకే, రుచిలోకి మేటి అయిన పుల‌స‌కు అంత డిమాండ్‌. కేవ‌లం కొన్ని రోజులు మాత్ర‌మే.. అది కూడా గోదావ‌రి ప్రాంతంలో మాత్ర‌మే దొరికే పుల‌స కోసం స్థానికుల‌తో పాటు ఎక్క‌డెక్క‌డి వారంతా త‌ర‌లివ‌స్తుంటారు. ఎంత ధ‌ర అయినా పెట్టి.. పుల‌స కొనేందుకు ఎగ‌బ‌డతారు. అందుకే, పుల‌స రేటు.. ఏటికేటికి తారాజువ్వ‌లా ర‌య్ ర‌య్ మంటూ పైపైకి చేరుతోంది. వానాకాలం మొద‌లు కావ‌డంతో మ‌ళ్లీ పుల‌స సీజ‌న్ ప్రారంభ‌మైంది. వ‌ల‌కు చిక్కిన చేప‌ల‌కు వేలం పాట కూడా మొద‌లైపోయింది. ధ‌ర కూడా దండిగానే ప‌లుకుతోంది.  యానాం, ఉభయ గోదావరి జిల్లా చేప‌ల మార్కెట్లో పుల‌స‌కు ఈఏడాది కూడా ఎప్ప‌టిలానే ఫుల్ డిమాండ్ ప‌లుకుతోంది. తాజాగా, యానాంలో గౌతమి గోదావరిలో ఓ పులస చేప జాలర్లకు చిక్కింది. ఈ చేపను కొనేందుకు స్థానికులు పోటీపడ్డారు. వేలంపాటలో అది 6 వేలు ధర పలికింది. చేప బ‌రువు సుమారు కిలోకు పైగా ఉంది. అంటే, కిలో చేప‌కు 5వేల వ‌ర‌కూ ప‌లికిన‌ట్టు. వర్షాకాల సీజన్ మొదలై వరదలు వస్తుండటంతో ఇక మరిన్ని పులస చేపలు వ‌ల‌కు చిక్కుతాయ‌ని స్థానిక జాల‌ర్లు సంబ‌ర‌ప‌డుతున్నారు.  జీవితంలో ఒక్క‌సారైనా పులసను రుచి చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటున్నారు. ఎంతో రుచికరమైన పులస చేప ధర ఎక్కువే పలికినా.. వాటిని కొనేందుకు పోటీపడుతుంటారు చేపల‌ ప్రియులు. అందుకే నీటిలో ఉండే పుల‌స చేప ధర ఎప్పుడూ చుక్క‌ల‌ను తాకుతూ ఆకాశంలోనే ఉంటుంది. గోదావరి నదిలో మాత్రమే లభించడం వీటి ప్ర‌త్యేక‌త‌. వరద నీరు సముద్రంలోకి వెళ్లే క్రమంలో.. ఆ వ‌ర‌ద ఉధృతికి వ్య‌తిరేకంగా ఈది.. సముద్రం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తుంటాయి పుల‌స చేప‌లు. మ‌ట్టితో కూడిన వరద నీటికి ఎదురీది వెళ్లడం వల్లే వీటికి ఇంత రుచి వస్తుందని అంటుంటారు. ఇలా బంగాళాఖాతం నుంచి గోదావ‌రిలోకి ఈదుతూ వ‌చ్చే పుల‌స‌లు.. జాల‌ర్ల వ‌ల‌కి చిక్కి.. కాసులు కురిపిస్తాయి. చేప‌ల ప్రియుల‌కు జిహ్వ చాప‌ల్యం తీరుస్తాయి. అందుకే, పుల‌స స్పెషాలిటీయే వేరు...  

ఐదుగురు అక్కాచెల్లెళ్లకు సర్కారీ ఉద్యోగాలు.. అన్నదాత ఇంట్లో సంబరం.. 

దేశానికి అన్నం పెట్టేది అన్నదాత. దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు సుఖంగా ఉండాలని అంటారు. కాని దేశంలో రైతులంటే కొందరికి చిన్నచూపు. పొలం దున్ని .. మట్టి పిసికే అన్నదాతను కొందరు హీనంగా చూస్తుంటారు. రైతు కుటుంబంలోని ఇంటికి తమ పిల్లలను కోడలిగా పంపించటానికి చాలా మంది ఇష్టపడటం లేదు. అలాంటిది రాజస్థాన్ కు చెందిన ఓ రైతు కుటుంబం మాత్రం అందరిని అబ్బురపడేలా చేసింది.ఐదుగురు అక్కా చెల్లెళ్లు సర్కారీ కొలువులు సాధించి ఔరా అనిపించారు.  రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలందరినీ చదివించాడు. ఇప్పుడా ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు సాధించారు. కొన్నిరోజుల కిందటే ఆర్ఏఎస్ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో సహదేవ్ కుమార్తెలు రీతు, సుమన్, అన్షు కూడా ఉన్నారు. ఆ రైతు మరో ఇద్దరు కుమార్తెలు రోమా, మంజు గతంలోనే ఆర్ఏఎస్ కొలువులు సాధించారు.  ఒకే ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఆర్ఏఎస్ సాధించడం స్థానికంగా సంచలనంగా మారింది. మీడియాలో ప్రముఖంగా  వార్తలు వస్తున్నాయి. ఈ అంశాన్ని ఓ అటవీశాఖ ఉన్నతాధికారి ట్విట్టర్ లో పంచుకున్నారు. సరైన విధంగా ప్రోత్సహిస్తే అమ్మాయిలు కూడా ఉన్నతస్థాయికి ఎదగలరని ఈ రాజస్థాన్ అక్కాచెల్లెళ్లు నిరూపించారు. రైతు కుటుంబంలో ఐదుగురు అమ్మాయిలు సర్కార్ ఉద్యోగాలు సాధించడంతో హనుమాన్ గఢ్ వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 

హైదరాబాద్ లో మరో ఐటీ హబ్.. ఎక్కడో తెలుసా?

మన దేశంలో ఐటీ అనగానే బెంగళూరుతో పాటు వినిపించే పేరు తెలంగాణ రాజధాని హైదరాబాద్. గత కొన్నేండ్లుగా భాగ్యనగరంలో ఐటీ వేగంగా వృద్ధి చెందుతోంది. కొవిడ్ కల్లోల సమయంలోనూ హైదరాబాద్ ఐటీ గణనీయమైన వృద్ధి సాధించింది. ఐటీ ఎగమతుల్లో ప్రతి ఏటా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం నాలుగున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగాలు ఉన్నారని తెలుస్తోంది. ఐటీపై ఆధారపడి మదో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. హైదరాబాద్ నగరానికి నలువైపులా ఐటీ రంగం విస్తరిస్తోంది.  ఐటీ రంగానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ భాగ్యనగరం బాట పట్టాయి. తాజాగా మరో ఐటీ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని పరిసర గ్రామాల్లో ఐటీ హబ్‌కు అనుకూలంగా ఉందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుర్తించింది.  హైటెక్ సిటీ తరహాలో  ఇక్కడ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రాంతీయ అభివ‌ృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.ఐటీ హబ్ కోసం సమీకరించే భూములకుగాను భూ యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల ద్వారా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని హెచ్‌ఎండీఏ ప్రాథమిక అంచనా వేస్తోంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తోంది. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు తెలిపారు. మారిన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైనదని, సమర్థతకు నైపుణ్యం కూడా తోడైతే తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు లభించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని  వివరించారు.

పీకే ఆట భలే బాగుందిగా.. విపక్షాలను ఆడిస్తున్నారుగా! 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అయన సోదరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాలతో సమావేశమయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని మీడియాలో బ్రేకింగులొచ్చాయి. ఆ వార్త  రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది. అనేక ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఇందులో ఏది నిజం ఏది కాదు అనేది ఎవరికీ తెలియదు.సోనియా,రాహుల్, ప్రియాంక త్రయంలో ఏ ఒక్కరూ మీడియాలో షికారు చేసిన వ్యూహాగానలపై స్పందించలేదు. ప్రశాంత్ కిశోర్’తో మూడు గంటలు ఏమి చర్చించారో, ఎవరికీ చెప్పలేదు. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం, సమావేశంలో వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే యూపీ , పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంశం ఒక్కటే కాదు, ఇంకా పెద్ద విషయమే చర్చకు వచ్చిందని, అంటున్నారు. అయితే ఆ మ ‘పేద్ద’ విషయం ఏమిటో మాత్రం గోప్యంగా ఉంచారు.   అయితే, ఈ సమావేశంలో తనను రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే అంశం చర్చించినట్లు వచ్చిన పుకార్ల పై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ స్పందించారు. ఆ పుకార్లను అయన ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని ఓడించడం ఉమ్మడి ప్రతిపక్షానికి అయినా అయ్యేపని కాదని, తేల్చి చెప్పారు. బీజేపీకి 300 మందికి పైగా ఎంపీలున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నాటికి కూడా బీజేపే సంఖ్యా బలం మారదు. అలాంటప్పుడు ప్రతిపక్షాల అభ్యర్ధి గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు, అని పవార్ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితం  ఎలా ఉంటుందో తనకు తెలుసునని, తాను రాష్ట్రపతి రేసులో లేనని, స్పష్టం చేశారు. అలాగే, 2024 ఎన్నికల కోసం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పవార్ తెలిపారు.  ప్రశాంత్ కిశోర్ ముంబైలో  ఒకసారి, ఢిల్లీలో  మరోసారి తనతో రెండుసార్లు సమావేసమైనా, ఈ రెండు సందర్భాలలో  రాష్ట్రపతి ఎన్నికలు లేదా 2024 సార్వత్రిక ఎన్నికల అంశమే చర్చకు రాలేదని ఆయన వివరించారు.అంతే కాదు, ప్రశాంత్ కిశోర్’తో ఇంతవరకు రాజకీయ అంశాలేవీ తనతో చర్చించలేదని కూడా పవార్’  చెప్పారు. అయితే, అన్నేసి గంటలు ఏమి చర్చించారు, ఏమి చేశారు, అనేది ఆయన చెప్పలేదు. కానీ, పాత్రలు వేరైనా రాజకీయాలలో నిండామునిగిన ఇద్దరు ప్రముఖులు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండరు,అయినా అసలు రాజకీయాలే చర్చించలేదంటే, పవర్ కూడా ఎదో దాస్తున్నారనే అనుకోవలసి వస్తుంది.  సరే అదల ఉంటే, రాహుల్  గాంధీ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు చేపడుతున్నారు అంటూ వచ్చిన బ్రేకింగ్ న్యూస్’కూడా నిజం కాదని అంటున్నారు. అంటే కాదు, ప్రస్తుతం ఓకే సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్’ ను మార్చే ఆలోచన కూడా అటకెక్కిందని, ప్రస్తుతానికి అధీర్ అంజనే, ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. మొత్తానికి పీకే తోలు బోమ్మలాట బానే ఆడిస్తున్నారు.మాస్ సినిమా పాటలో లాగా పీకే కూర్చున్నా, నుంచున్నా అది న్యూసై కూర్చుంటోంది.

అయ్యో రోజా... పార్టీ పెద్దలే పొగ పెడుతున్నారా? 

అధికార వైసీపీలో నోరున్న నాయురాలిగా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజాకు.. రోజులు కలిసిరావడం లేదా, ఆమెకు రోజురోజుకు ఇంటిపోరు పెరుగుతోందా? పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి చిత్తూరు జిల్లా వైసీపీ కీలక నాయకులు ఎవరితోనూ ఆమెకు సయోధ్యత లేదన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో ఆమెకు ఉన్న ఇమేజికి, నియోజకవర్గం నగరిలో ఆమెకున్నపట్టు, పలుకుబడికి పొంతన లేదని అంటారు. అందరితోనూ  ఎదో ఒక సమయంలో ఆమెకు విబేధాలున్నాయని అంటారు. అందుకు తగ్గట్టుగానే గతంలో కొంతకాలం రోజా, డిప్యూటీ సీఎంనరాయణ స్వామి మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్’లో దుమ్మెత్తి పోసుకున్నారు.  అయితే నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని,అందరినీ  అశ్చర్యపరిచారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పేరున్న మంత్రి, జిల్లాలో పార్టీ  రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనూ, రోజాకు విబేధాలున్నాయి. ఒక దశలో ఆ ఇద్దరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని సోషల్  మీడియాలో  ప్రచారం జరిగింది. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచాద్రరెడ్డి  తన  వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో రోజా ఉన్నట్లు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, రోజా మంత్రి పెద్ది రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అదే సోషల్ మీడియాలో ద్వారా చెప్పుకున్నారు. అంతేకాదు. సయోధ్య చిహ్నంగా రక్షా బంధన్ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు. ఆవిధంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలను పంపారు.అంతకు ముందు అదే పెద్ది రెడ్డి టార్గెట్’ గా ఆమె పార్టీలో కొంత మంది త‌న‌ను కావాల‌ని టార్గెట్ చేస్తున్నారని బ‌హిరంగంగానే వాపోయారు. ఓ దశలో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు.   తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లో మరో మారు పార్టీలో వర్గపోరు భగ్గుమంది. రోజా వర్గం ఆమె ప్రత్యర్ధి వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్   కేజే శాంతికి వర్గం విడివిడిగా వైఎస్ జయంతి  వేడుకలు నిర్వహించడంతో పార్టీలో వర్గపోరు మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్’గా తీసుకుందని అంటున్నారు. దివంగత నేత వైఎస్ జయంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దృష్టిలో ఈ కార్యక్రమం విధేయతను రెన్యువల్ చేసుకోవడంగా భావిస్తారని అంటారు. అలాంటిది వైఎస్ జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో చర్చనీయాంసంగా మారింది.  మత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజా టార్గెట్ ఆమె ప్రత్యర్ధి వర్గం పావులు కదపడం చూస్తుంటే.. పార్టీ పెద్దలే తేరా వెనక నుంచి కథ నడుపుతున్నారు అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అంతే కాదు రోజాను పొమ్మన కుండా పొగపెట్టే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు పార్టీలో వినవస్తున్నాయి.

వాకింగ్ పో*ర్న్‌.. క్రికెట‌ర్ల‌పై చీర్‌లీడ‌ర్ షాకింగ్ కామెంట్స్‌..

అందం ఎక్క‌డ ఉంటుందో.. అక్క‌డ ఆ ప్ర‌మాదం త‌ప్ప‌కుండా ఉంటుందంటారు. అది బ్యూటీ షోలైనా.. క్రికెట్ మ్యాచులైనా. ఆట‌ను.. ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా.. మ‌ధ్య‌లో అందాల రాశుల‌ను జ‌త చేస్తే.. ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా ఉంటుందా? అంటే, అల్రెడీ జ‌రిగిపోయిందంటున్నారు. ఐపీఎల్ పార్టీలు, క్రికెట‌ర్ల మైండ్‌సెట్‌పై ఓ చీర్ లీడ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె కామెంట్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. ఐపీఎల్‌ను షేక్ చేస్తోంది. ఐపీఎల్ పార్టీలపై ముంబై ఇండియన్స్ చీర్ లీడర్ ​గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో షాకింగ్ కామెంట్స్ చేశారు. చీర్ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత గాబ్రియెల్లా మరోసారి ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తన బ్లాగులో.. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని కామెంట్స్ చేశారు. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నన్ను చీర్​ లీడర్​ బృందం నుంచి తొలగించారు. పార్టీల్లో మమ్మల్ని ఓ మాంసం ముద్దగానే చూసేవారు. నేను ఎవరో చెప్పిన విషయాలు నా బ్లాగ్​లో రాయలేదు. బాహుశా.. నాపై ఫిర్యాదు చేసిన క్రికెటర్‌కు దోషిననే భావన కలిగి ఉండవచ్చు’ అని గాబ్రియెల్లా చెప్పుకొచ్చారు. అయితే, ఐపీఎల్ చీర్ గార్ల్ గాబ్రియెల్లా చాలా రోజుల క్రితం.. ‘@ఐపీఎల్​ గర్ల్’ పేరుతో తనకు జరిగిన అనుభవాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించేవారు. ఈ క్రమంలో ఆమె ఓ గుర్తు తెలియని వ్య‌క్తి ఐడీతో ఓ బ్లాగ్‌ను క్రియేట్ చేశారు. అందులో ఐపీఎల్‌ పార్టీలు, క్రికెటర్ల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ క్రికెటర్ చేసిన‌ ఫిర్యాదు మేరకు ఆమెను చీర్ లీడ‌ర్స్‌ బృందం నుంచి తొలగించారు. తాజాగా, ఆమె.. We are like walking p*rn అంటూ కామెంట్లు చేయ‌డం ఐపీఎల్ పార్టీల లోగుట్టు మ‌రోసారి ర‌ట్టు అవుతోంది. ఓ వెబ్ పోర్ట‌ల్‌లో వ‌చ్చిన ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.

మంత్రుల చాటుమాటు య‌వ్వారం.. స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు?

చ‌ట్టాలు చేసేది పాల‌కులు. వాటిని అమ‌లు చేసేది అధికారులు. పాటించాల్సింది ప్ర‌జ‌లు. మ‌రి, ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రూల్స్ రూల‌ర్స్‌కు వ‌ర్తించ‌వా? ఎలాగూ చ‌ట్టాలు చేసేది వాళ్లే కాబట్టి.. చ‌ట్టం త‌మ చుట్టం అంటూ మ‌డిచి జేబులో పెట్టుకుంటారా? రూల్స్‌ను బేఖాత‌రు చేస్తారా? రూల్ ఈజ్ రూల్‌. రూల్ ఫ‌ర్ ఆల్‌. అనేది తెలంగాణ‌లో వ‌ర్తించ‌దా? సుప్రీంకోర్టు ఆదేశాల‌తో దేశంలో పొగాకు, గుట్కా అమ్మ‌కాల‌ను నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. గుట్కా అమ్మ‌కాల‌పై ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులైతే.. వారికి వేరే ప‌ని ఏదీ లేన‌ప్పుడ‌ల్లా.. మామూళ్లు రాన‌ప్పుడ‌ల్లా.. గుట్కా దందాపైనే దాడులు చేస్తుంటార‌ని అంటారు. ఎవ‌రైనా గ‌ల్లీ పాన్‌షాపుల్లో గ‌ప్‌చుప్‌గా గుట్కా అమ్మితే వారిపై కేసులు బుక్ చేసి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. మ‌రి, ఇంత చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. మ‌రి, త‌మ మంత్రులే ఓపెన్‌-సీక్రెట్‌గా గుట్కాలు తింటుంటే..? స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు..? అలాంటి మంత్రుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ట్టు..? తాజాజా, కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారింది. ఆ వీడియో మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంది. అందులో.. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ నుంచి మ‌రో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. సీక్రెట్‌గా గుట్కా తీసుకోవ‌డం.. ట‌ప‌క్కున నోట్లో వేసుకొని.. ఏం తెలీన‌ట్టు మాస్క్ పెట్టుకోవ‌డం.. ఇదంతా ఇంకో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డం.. ఆ ర‌హ‌స్య గుట్కా బ‌దిలీ కార్య‌క్ర‌మ‌మంతా ఎంచ‌క్కా వీడియోలో రికార్డు అవ‌డం.. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో క‌ల‌క‌లం మొద‌లైంది. మంత్రులు గుట్కాలు తినేంత చీపా? అనే చ‌ర్చ ఓవైపు.. నిషేధిత పొగాకు మంత్రులే వాడుతుంటే.. చ‌ర్య‌లు తీసుకోరా? అనే డిమాండ్ మ‌రోవైపు.. నెటిజ‌న్లు తెలంగాణ మంత్రుల‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.  ఇక దాసోజు త‌న‌ ట్వీట్‌లో ప‌లు డిమాండ్లు కూడా చేశారు. తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు? బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా? అంటూ ట్వీట్ చేసి క‌ల‌క‌లం రేపారు. త‌న ట్వీట్‌ను తెలంగాణ సీఎమ్‌వో, తెలంగాణ సీఎస్‌, తెలంగాణ డీజీపీ, హైద‌రాబాద్ సీపీకి ట్యాగ్ చేసి మ‌రింత ర‌చ్చ రాజేశారు.  మంత్రుల గుట్కా య‌వ్వారంపై సోష‌ల్ మీడియాలో గ‌ట్టి ప‌నిష్మెంటే ప‌డుతోంది కానీ, మ‌రి సర్కారు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాద‌ని.. చ‌ట్టం ముందు అంతా స‌మానులేన‌ని.. నిరూపిస్తారా? లేక‌, గుట్కానే క‌దాని గ‌ప్‌చుప్‌గా ఊరుకుంటారా? ఇక్క‌డ మంత్రులు గుట్కా తిన‌డం ఒక్క‌టే కాదు మేట‌ర్‌.. ఆ గుట్కా వారి వ‌ర‌కూ ఎలా వ‌చ్చింది? ఎవ‌రు స‌ప్లై చేస్తున్నారు? మంత్రుల‌కు తెలిసే గుట్కా దందా న‌డుస్తోందా? గుట్కా స్మ‌గ్ల‌ర్ల‌కు మంత్రుల అండాదండా ఉందా? ఇలాంటి అనుమానాల‌న్నీ నిగ్గు తేలాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు.  

ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్.. ఆగస్టు1 లోపు నరేగా బిల్లులు చెల్లించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్‌ అయింది. ఆగస్ట్‌ 1వ తేదీలోపు ఉపాధి హామి పనుల బకాయిలు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 లోపే బిల్లులు చెల్లించకపోతే.. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోరుటుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.  ఏపీలో సుమారు 2,500 కోట్ల నరేగా నిధులు గత రేండేండ్లుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడంతో బాధితులు కోర్టు ఆశ్రయించారు. నరేగా బిల్లులకు సంబంధించి చాలా పిటిషన్లు వచ్చాయి. వివిధ పిటిషన్లను కలిపి ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎస్‌ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.  

పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం.. ఏం చేస్తారో చేసుకోండి? 

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ పీసీసీ పిలుపిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం టెన్షన్ పుట్టిస్తోంది. ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ తీయాలని కాంగ్రెస్ నిర్ణయించగా... అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరా పార్క్ దగ్గర నిరసనకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అది కూడా రెండు మైకులు మాత్రం ఉపయోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలు, కొవిడ్ రూల్స్ దృష్ట్యా రాజ్ భవన్ వరకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం లేదని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సిటీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ  ఛలో రాజ్ భవన్ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. శుక్రవారం 'ఛలో రాజ్ భవన్' చేపడుతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపారు. పెట్రో ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తీరుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. పోలీసులు అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని, నిర్బంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని జైళ్లలో పెడతారో, ఎన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తారో చూస్తాం అని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై మోదీ, కేసీఆర్ కలిసి ప్రజల నుంచి రూ.35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంటును కూడా స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని  రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందన్నారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైంది. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటి అని ప్రశ్నించారు. వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా... 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటి అని నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని... అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

రాజద్రోహం రూల్ అవుటేనా? జగన్ పై రఘురామదే విజయమా?

రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిపై ఘనవిజయం సాధించబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రఘురామ వర్సెస్ జగన్ ఎపిసోడ్ కొన్నిచారిత్రక నిర్ణయాలకు దారి తీస్తుందనే అనిపిస్తోంది. రాజద్రోహం అనే సెక్షన్ సైతం ఎత్తేయమని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారంటే.. పరిస్ధితి సీరియస్  నెస్ ఎంతగా ఉందో అర్ధమవుతోంది. రఘురామ కేసు గురించి కాకపోయినా.. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అందరూ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను, మావోయిస్టులకు సహకరించే మేధావులను ఇదే కేసు కింద వేధిస్తున్నారు. 124ఎ అనేది రాజకీయంగా ఓ ఆయుధంగా మారిపోయింది. అలాంటిదానిని రఘురామ మీద పెట్టి.. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ లోపు ఆ సెక్షన్ కేంద్రం ఎత్తేస్తే.. కేసును కాకెత్తుకుపోతుంది. అప్పుడు రఘురామరాజు ఇంకా రిలాక్స్ అయిపోతారు. ఈ ఆలోచనే ఇప్పుడు వైసీపీ నేతలను నిద్రపోనివ్వడం లేదు. మరోవైపు సీఐడీ అధికారుల ఓవరాక్షన్ పై సభలో చర్చ జరిగేట్టే ఉంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా జగనన్న సైన్యం చేస్తున్న యవ్వారాలన్నీ విపులంగా తెలుసుకుంటారు. అలాంటి ముఖ్యమంత్రికి బెయిల్ రద్దు చేయమంటే చేయకపోతే అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరు.  ఇంకోవైపు స్పీకర్ ఓం బిర్లా రఘురామపై అనర్హత వేటుకు తొందరపడటం లేదని అర్ధమవుతూనే ఉంది. అంటే దానిపై డీటెయిల్ విచారణ జరిగాకే నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో వైసీపీ ఎంపీలు ఏమనాలో అర్ధం కాక సైలెంటుగా చూస్తున్నారు. దీనిపై పార్లమెంటులో రభస చేయాలనే ఆలోచన ఉన్నా ఇంకా ధైర్యం చాలక ఊగిసలాటలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ దేవుడు బిజెపికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వలన మనం ప్రత్యేక హోదా అడగటం తప్ప ఇంకేం చేయలేమన్న  జగన్ రఘురామ విషయంలో మాత్రం ఎలా పోరాడతాడనే ప్రశ్నలు వస్తాయి కదా. ఇక సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు గురించి విచారణ జరుగుతుంది. 26వ తేదీ కోర్టు నిర్ణయం రాబోతుంది. సీబీఐ కూడా తన అఫిడవిట్ ను దాఖలు చేయబోతుంది. చూస్తా చూస్తా బెయిల్ రద్దు చేయనక్కర్లేదని సీబీఐ రాసి ఇవ్వలేదు. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ పెరిగిపోతోంది.  ఇలా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో జగన్మోహన్ రెడ్డి వైరం రాచపుండులా తయారైంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని.. ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేసి ఇష్టమొచ్చినట్లు డీల్ చేస్తే..ఇప్పుడు అన్నీఎదురొస్తున్నాయి. ప్రతి విషయంలోనూ రఘురామదే పై చేయి అవుతుంది. వాస్తవానికి నర్సాపురంలో ఎన్నిక పెడితే రాజుగారికి గెలవడం ఈజీయేమీ కాదు..కష్టమే. కాని కేవలం జగన్ సర్కార్, వారి గణం చేసిన, చేస్తున్న తొందరపాటు చర్యల వలనే పరిస్ధితి ఇక్కడిదాకా వచ్చిందని వైసీపీలోనే చెప్పుకుంటున్నారు.  

పంజాబ్ లో సంధి  కుదిరింది.. కెప్టెన్ తో కలిసి సిద్దూ గేమ్ 

పంజాబ్ లో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విద్యుత్ చార్జీల విషయం మినహా మరే విధంగానూ పెద్దగా ప్రజావ్యతిరేకత లేదు. మరో వంక, అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రతిపక్షం,  బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ విడిపోవడంతో మరింత బలహీన పడింది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు గెలుచుకుని, ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నా, అది అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్’ను పంజాబీలు సొంత పార్టీగా చూడడం లేదు..ఢిల్లీ పార్టీగానే భావిస్తున్నారు. అందుకే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, అన్ని రంగాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దానంతో పాటు, సిక్కునే సీఎం చేస్తామన్న వాగ్దానం కూడా చేశారు. అయినా,ఆప్’ అధికార పగ్గాలు చేపట్టడం కష్టమే అని పరిశీలకులు భావిస్తున్నారు. మరో వంక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు  వ్యతిరేక రైతాంగం సుదీర్ఘకాలంగా సాగిస్తున  ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులు రైతుల ఆందోళనకు బహిరంగం మద్దతు తెలవడమే కాకుండా ప్రత్యక్షంగా ఉధయ్మలో పాల్గొన్నారు. పార్లమెంట్’లోనూ ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే విషయంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రుజువైంది. ఆరుకు ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ స్వీప్ చేసింది. అయితే, అన్నీ ఉన్నా , కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విబేధాలు  పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంచుమించుగా గత మూడు సంవత్సరాలకు పైగా, ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ  మంత్రి నజ్యోతి సింగ్ సిద్దూ వర్గాల మధ్య ఓ మోస్తరు యుద్ధం సాగుతూనే వుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యుద్దం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ గెలుపు మీద అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది.  ఇరు వర్గాల మధ్య సంధి కుదిరింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ఎవరి స్థాయిలో వారు, అటు అమరేంద్ర సింగ్’తో ఇటు సిద్దూతో చర్చలు జరిపారు. ఇద్దిరి మ‌ధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెర‌పైకి వచ్చింది. దీని ప్ర‌కారం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమ‌రీంద‌ర్ కొన‌సాగుతారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమిస్తారు. ఈమేరకు ఇద్దరు నేతలు అంగీకరించారని, పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ హ‌రీష్ రావ‌త్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుందని సమాచరం.  ఈ ఇద్దరికీ తోడుగా  మరో ఇద్ద‌రు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని తెసుస్తోంది. అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని అమ‌రీంద‌ర్ చెప్పిన‌ట్లు హ‌రీస్ రావ‌త్ వెల్ల‌డించారు. సిద్ధూ ఈ రాష్ట్ర భ‌విష్య‌త్తు అని, ఆయ‌న ఏదైనా నిర్ణ‌యం తీసుకునే ముందు, మాట్లాడే ముందు కాస్త ఆలోచించాల‌ని కూడా రావ‌త్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే, బుధవారం సిద్దూ, ఆప్’ కు అనుకూలంగా ట్వీట్ చేసిన నేపద్యంలో అధిష్టానం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. ఇప్పటికైనా ఇద్దరు విబేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

డైవోర్స్ త‌ప్పే..! బిల్‌గేట్స్ క‌న్నీటి క‌హానీ..!

వాల్డ్ మోస్ట్ పాపుల‌ర్‌ సెలబ్రిటీ క‌పుల్స్ విడాకుల‌కు సిద్ధ‌మైపోయారు. రేపేమాపో అఫిషియ‌ల్‌గా డైవోర్స్ తీసుకోబోతున్నారు. ఆస్థి పంప‌కాల ప్ర‌క్రియ సైతం వేగంగా జ‌రిగిపోతోంది. ఎప్ప‌టి నుంచో వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇక‌పై శాశ్వ‌తంగా వారి మ‌ధ్య ఎడ‌బాటు రాబోతోంది. బిల్‌గేట్స్‌కు మ‌రో మ‌హిళ‌తో ఎఫైరే.. మిలిండాతో విడాకుల‌కు దారి తీసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్నాళ్లూ ఈ విష‌యంలో సైలెన్స్ మెయిన్‌టెన్ చేసిన గేట్స్‌.. తాజాగా ఆయ‌న‌ మౌనం వీడారు. విడాకుల‌పై స్పందించారు. కార‌ణం చెప్పాలు. క‌న్నీరు పెట్టారు. గతవారం జరిగిన ‘సమ్మర్ క్యాంప్ ఫర్ బిలియనీర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్‌ భావోద్వేగంతో మాట్లాడారు. ఒక దశలో కంట తడిపెట్టినంత పని చేశారు. మెలిండాతో డైవోర్స్ వ్యవహారం, ఇక మీ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన డైవోర్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తప్పేనన్నారు. అయితే మరో మహిళతో తనది ‘ఎఫైర్’ అన్నదాన్ని ఒప్పుకోనని, అసలు ఆ పదమే సరికాదని అన్నారు. 20 ఏళ్ల‌కు క్రితం తన సహోద్యోగితో బిల్‌గేట్స్‌కు శారీర‌క సంబంధం ఉండేద‌ని.. ఆ విష‌యం తెలిసే మిలిందా ఆయ‌న‌తో విడిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. త‌మ‌ది ఎఫైర్ కాదంటూ తాజాగా గేట్స్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మిలిండాతో విడిపోవాల‌నే నిర్ణ‌య‌మూ త‌ప్పేనంటూ ఆల‌స్యంగా గుర్తించిన‌ట్టున్నారు. కానీ, ఇప్పుడు స‌రిదిద్దుకునే స్థాయిని దాటిపోయింది ప‌రిస్థితి అంటున్నారు.  2019 నుంచే బిల్‌గేట్స్‌ను దూరం పెడుతూ వచ్చిందట మిలిండా. అప్పటి నుంచే విడాకుల విషయమై లాయర్లతో సంప్రదిస్తూనే ఉంది. ఇక గ‌త మే 4న తామిద్ద‌ర‌మూ డైవోర్స్ తీసుకోబోతున్న‌ట్టు సంయుక్తంగా ప్ర‌క‌టించారు మిలిండా-గేట్స్ దంప‌తులు. పిల్ల‌లు, ఆస్తుల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.  

మందుబాబులతో  25 వేల కోట్ల అప్పు.. జగనన్న తోపు! 

మందు ఇప్పుడు కిక్కు ఇవ్వడమే కాదు.. మన లక్కు కూడా మార్చేస్తోంది. మేం ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం అని మందుబాబులు కొట్టే డైలాగ్ లెవెల్ పెంచుకుని మరీ ఇప్పుడు కొట్టొచ్చు.  మా వల్ల 25 వేల కోట్లు అప్పు పుట్టింది రా అని. అవును మందుబాబులిచ్చే డబ్బులు చూపించి.. ఏపీ సర్కార్ 25 వేల కోట్ల అప్పు సంపాదించిందంట. మా మద్యం అమ్మకాలు ఈ రేంజ్ లో నడుస్తున్నాయ్.. 15 ఏళ్లలో ఇంత అవుతాయ్.. దాని నుంచి మీ అప్పు తీర్చేయగలం అని రాసిచ్చారంట. బహుశా అప్పు ఇచ్చినోడు కూడా మందేసి ఓకె చేసినట్లున్నాడు. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎన్నాళ్లుంటుందో తెలియదు... మళ్లీ ఎన్నికలు జరిగితే.. ఎవరు గెలుస్తారో తెలియదు.. మరోవైపు బాస్ మద్య నిషేధం అన్నాడు.. ఇవన్నీ పెట్టుకుని కూడా నమ్మేశారంటే నమ్మబుద్ధి కావటం లేదు. అయినా జగనన్న మాట తప్పడు..మడమ తిప్పడు. ఎవరి మాట వాళ్లకే చెబుతాడన్నమాట. ఎన్నికల ముందు మహిళలకేమో మద్య నిషేధం విధిస్తానని చెప్పాడు. ఆ మద్య నిషేధం ఐదేళ్ల లోపు ఎప్పుడైనా చేయొచ్చంట. కాబట్టి మాట తప్పనట్లే మరి. అదే మద్యం చూపించి 15 ఏళ్లు అమ్ముతానని చెప్పి అప్పు తీసుకున్నాడు. వాళ్లకిచ్చిన మాట కూడా తప్పడు.. ఎందుకంటే అప్పటికి ఎటూ అధికారంలో ఉండడు కాబట్టి.. ఉంటాడు ఉండడనేది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందనుకోండి. ఇంత అడ్డగోలుగా గేమ్స్ ఆడుతుంటే.. ఇంకా విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్పడమెందుకో జనానికి అర్ధం కావడం లేదు. మద్య నిషేధం అని చెప్పారు.. మద్యం విపరీతంగా అమ్ముతున్నారు. అవి కూడా సొంత బ్రాండ్స్ పెట్టుకుని మరీ అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అవే అమ్మకాలను చూపించి కొత్త అప్పులు చేస్తున్నారు.వాస్తవానికి ప్రభుత్వానికి గ్యారంటీ ఆదాయం తెచ్చిపెడుతుంది ఇప్పుడు అదొక్కటే. మరి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు లేవు.. వాటి ద్వారా ఉపాధి లేదు.. దాని వల్ల మార్కెట్ పెరిగిందీ లేదు. పైగా ఉన్న బిజినెస్లన్నీ పడుకున్నాయి. జనం బిజినెస్ చేసుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు పోతున్నారు మరి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే ఇలా అప్పులు విపరీతంగా చేసేసుకుంటున్నారు.  

కూతురికి  గర్భం చేసిన తండ్రి..

చేతి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సిన నాన్న.. తన పిల్లలకు ఏదైనా అయితే గడ్డ తన పిల్లను కాపాడినట్లు సమాజం నుండి చుట్టూ ఉన్న జనాల నుండి తన పిల్లలను కాపాడుకోవాల్సిన నాన్న. బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. తన కూతురిపై కన్నేశాడు. అంతే కాదు 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచాడు.. చివరికి  గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరగలేదు. మన  ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.  ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్లింది. ఎప్పడి నుండి కన్నేశాడా తెలీదు.. అదే సమయం అనుకుని మద్యం మత్తులో ఉన్న ఆ నీచపు తండ్రి.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక అరిచింది.. గోల చేసింది.. అయినా వినిపించుకోలేదు ఆ ప్రబుద్దుడు.. చివరికి గద్ద వచ్చిన కోడిపిల్లను తన్నినట్లు ఐయింది ఆ బాలిక..  అప్పటి ఆగలేదు.. మందు తాగి తప్పుచేసిన వాడు ఐతే ఆ మందు గిడగానే తన తప్పును తెలుసుకుని పాశ్చతప్పడుతాడు.. వాడి ఎప్పటి నుండో తన మనసులో ఆ బాలికను అనుభవించాలని అనుకున్నాడు కాబట్టి అక్కడితో ఆగక  పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటికు చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ కసాయి తండ్రి బెదిరించేవాడు. తండ్రి నిజంగానే కసాయి వాడని తెలిసి ఎంతకైనా తెగిస్తాడని తెలిసి ఆ బాలిక నోరు తెరవలేదు.  ఈ క్రమంలో తండ్రి తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక తాత ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో.. ఇంతకాలం బాలిక తండ్రికి భయపడి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

పొలిటిక‌ల్ ఫ్లైట్‌.. సంథింగ్ స్పెష‌ల్‌..

రాజ‌కీయ నాయ‌కుల‌ను జ‌నాలు తెగ తిడుతుంటారు. అవినీతి, అరాచ‌కాల‌పై మండిప‌డుతుంటారు. పెద్ద‌గా చ‌దువుకోని వారే రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే అభిప్రాయ‌మూ ఉంది. అయితే.. అంతా అలా ఉండ‌రు. కొంద‌రు దోపిడీ దారులు, అరాచ‌క శ‌క్తులు రాజ‌కీయాల్లో, అధికారంలో ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. అనేక మంది మంచివారు, ఉన్న‌త చ‌దువులు చ‌దివిన వారు, అనేక నైపుణ్యాలు క‌లిగిన వారూ రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌నే అందుకు నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు.  వారిద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు. ఒకరు బీజేపీ ఎంపీ, మరొకరు డీఎంకే ఎంపీ. పార్లమెంటరీ ఎస్టిమేట్స్‌ కమిటీలో ఆ ఇద్దరూ సభ్యులు. కమిటీ భేటీ జరిగితే పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు. భేటీలో ఇద్దరూ ఒక అంశంపై తీవ్రంగా వాదించుకున్నారు. భేటీ ముగిసింది.. ఎవరికి వారు వెళ్లిపోయారు. అందులో ఒకరు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. కమిటీ భేటీ తరువాత ఆయన ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు. అంత‌లోనే.. విమానం పైలట్ ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు. ‘మీరు కూడా ఇదే విమానంలో వస్తున్నారా?’ అని అడిగారు. పైలట్‌ మాస్కు ధరించి ఉండడంతో ఎంపీ దయానిధి మారన్ ఆ పైలట్‌ను స‌రిగా గుర్తించలేకపోయారు.  పైలట్‌ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించడంతో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ విషయం గమనించిన పైలట్‌.. ‘మీరు నన్ను గుర్తించలేకపోయారు కదా?’ అంటూ చిరునవ్వులు చిందించారు. అప్పుడర్థమైంది ఎంపీ దయానిధి మారన్‌కు.. ఆ పైలట్‌ మరెవరో కాదు.. తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అని. అంతేకాదు కొద్దిగంటల ముందు పార్లమెంటరీ ఎస్టిమేట్స్‌ కమిటీలో వాదన జరిగింది కూడా ఈ ఇద్దరు ఎంపీల మధ్యే. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని పైలట్‌గా చూసి దయానిధి మారన్ ఆశ్చర్యపోయారు. అంతకన్నా ఎక్కువ ఆనందించారు. తనకు ఎదురైన ఈ అపూర్వ అనుభవాన్ని మారన్‌.. ‘ఎ ఫ్లైట్‌ టు రిమెంబర్‌’ శీర్షికతో ట్వీట్‌ చేశారు. పైలట్‌ దుస్తుల్లో ఉన్న రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ ఫొటోను కూడా పెట్టారు. ఆ రోజు ఆయన తమను దిల్లీ నుంచి చెన్నైకి క్షేమంగా చేర్చారంటూ.. ‘థాంక్‌ యూ కెప్టెన్‌’ అని కృతజ్ఞతలు తెలిపారు. జులై 13న ఢిల్లీ నుంచి చెన్నైకి విమానం నడిపిన రూడీ ఆ రోజు చెన్నైలో ట్రావెల్, సివిల్ ఏవియేషన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అది పూర్తయిన తరువాత ఆ మరుసటి రోజు గురువారం చెన్నై నుంచి కేరళలోని కోచీకి విమానం నడిపారు. కమిటీ సమావేశంలో పాల్గొన్న 20 మంది ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ నడిపిన విమానంలోనే ప్రయాణించారు. వీరితో పాటు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ త‌దిత‌రులు కూడా రూడీ న‌డిపిన విమానంలో ప్ర‌యాణించారు. రాజీవ్ ప్రతాప్ రూడీ బిహార్‌లోని చాప్రా నియోజకవర్గ ఎంపీ. బీజీపీకి చెందిన ఆయన గతంలో కేంద్రంలో సివిల్ ఏవియేషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీకి ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అయితే, ఆయన ఏ సంస్థలోనూ పైలట్‌గా పనిచేయడంలేదు, జీతం తీసుకోవడం లేదు. కానీ, గౌరవ పైలట్‌గా అప్పుడప్పుడూ కొన్ని సంస్థలకు చెందిన విమానాలను నడుపుతుంటారు. రూడీ.. అనేక విద్యాసంస్థలలో ఎకనమిక్స్ పాఠాలు కూడా చెబుతారు. 50 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన ఆయన ‘‘ఎయిర్ బస్ 320, ఎయిర్ బస్ 321 వంటి భారీ జెట్‌లు నడిపే పార్లమెంటేరియన్ ప్రపంచంలో నేను తప్ప వేరేవారు లేరేమో’’ అంటారు రూడీ. ఎంతైనా.. రూడీ రూటే సెప‌రేటు అన్న‌ట్టు ఉందిక‌దా.