జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి భూముల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం
posted on Jul 19, 2021 @ 4:52PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై జగన్ రెడ్డి సర్కార్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ప్రభుత్వం చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తిరస్కరించింది. జస్టిస్ వినీత్ శరన్ ,జస్టిస్ దినేశ్ మహేశ్వరి ద్విసభ్య బెంచ్ ముందు అమరావతి భూముల కేసు వాదనలు ముగియడంతో.. ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు వెల్లడించింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదార్లకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ధ్రువీకరించాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నట్టు తెలుస్తోందని దవే ఏపీ ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారిన తర్వాతే ఫిర్యాదులు అందాయని దవే స్పష్టం చేశారు.
ప్రభుత్వ వాదనలతో ప్రతివాదుల తరఫు న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని ప్రతివాది తరఫు న్యాయవాది ఖుర్షీద్ స్పష్టం చేశారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఏముందని అన్నారు. అసలు ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదని చెప్పారు. ఇద్దరి మధ్య వ్యవహారంలో మోసం జరిగిందా? లేదా? అనే అంశాలు ఈ చట్టం పరిధిలోకి రావని వివరించారు. రాజధాని ఎక్కడన్న అంశం 2014 అక్టోబరు నుంచి మీడియాలో వచ్చిందని ఖుర్షీద్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 14 గ్రామాల్లో 30 వేల ఎకరాల పరిధిలో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని వివరించారు. 2014 డిసెంబరు 30న రాజధానిపై అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఖుర్షీద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారని స్పష్టం చేశారు.
మరో ప్రతివాది తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆరేళ్ల తర్వాత భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. అంతేతప్ప భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానికులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న అంశం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తెలుస్తుందని దివాన్ వివరించారు. ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం సెక్షన్-55 వర్తించదని అన్నారు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందని సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.