అక్రమార్కులకే కార్యదర్శి వత్తాసా? జూబ్లీ హిల్స్ సొసైటీలో కొత్త కుట్రలా?
posted on Aug 14, 2021 @ 6:19PM
జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించిన రికార్డుల విషయంలో తలెత్తిన వివాదం పోలీసు స్టేషన్ వరకు చేరింది. సొసైటీ బైలా ప్రకారం.. దీనికి సంబంధించిన రికార్డులను సభ్యులు పరిశీలించుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ విషయంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర సభ్యులతో సెక్రటరీ వ్యవహరించిన తీరు గొడవకు కారణమైందని అంటున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ మురళీముకుంద్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అధ్యక్షుడు బొల్లినేని రవీందర్ కోరితే.. ఆయనకు సహకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కార్యదర్శిపై వస్తున్నాయి.
గత పాలకమండలి చేసిన అక్రమాలన్నీ తవ్వితీసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రస్తుత పాలకమండలి సీరియస్గా ప్రయత్నం చేస్తోంది. అయితే కార్యదర్శిగా దానికి సపోర్ట్ చేయాల్సిన మురళీ ముకుంద్ రివర్స్ కావడం చర్చగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడిపైన, ఇతర సభ్యులపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అందరిని అశ్చర్యపరుస్తోంది. పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అడగడటం వాటిని తప్పెలా అవుతుందని పాలకమండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అడిగిన వివరాలు ఇవ్వడం, రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయడం సొసైటీ కార్యదర్శి పని అని.. అది చేయకుండా అక్రమార్కులకు వంత పాడేలా మురళీ ముకుంద్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 'ఓట్ ఫర్ ఛేంజ్' అన్న నినాదంతో గెలిచి ఇప్పుడు 'నాట్ ఫర్ ఛేంజ్' అంటూ పాత పాలకమండలికి సపోర్ట్ చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని అంటున్నారు.కొందరి ప్రయోజనాల కోసం ఆయన యూటర్న్ తీసుకున్నారని జూబ్లీహిల్స్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త పాలకమండలి మార్చిలో బాధ్యతలు చేపట్టింది. గతంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన నేపథ్యంలో వాటిని వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. రికార్డులు, పక్కా ఆధారాలతో వాటిని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి టైమ్లో.. ఎవరికో లాభం చేయడానికే మురళీ ముకుంద్ ప్రస్తుత పాలకమండలిని బద్నాం చేయాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీమ్ వర్క్గా ముందుకు సాగాల్సిన చోట మురళీ ముకుంద్ ఏకఛత్రాధిపత్యం కోరుకున్నారని, రెండిళ్ల పూజారిలా అటు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్గా, ఇటు సొసైటీ కార్యదర్శిగా సర్వం తన పెత్తనమే సాగాలనుకున్నారని చెబుతున్నారు. సొసైటీ ప్రెసిడెంట్ను సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబని జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యులు నిలదీస్తున్నారు.
సొసైటీ బైలాస్ ప్రకారం రికార్డులన్నీ కార్యదర్శి దగ్గరే ఉంటాయి. అయితే ఆ రికార్డులు పరిశీలించడానికి ఇంకెవ్వరికీ హక్కు లేదని కార్యదర్శి ఎదురు తిరగడంతోనే ఈ పేచీ అంతా వచ్చిందని అంటున్నారు. నిజాయితీగా రికార్డులన్నీ పరిశీలించి పాత పాలకమండలి అక్రమాల్ని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొత్త అధ్యక్షుడు. దీనికి మురళీ ముకుంద్ సహకరించడం లేదు. సొసైటీ కార్యదర్శిగా మురళీముకుంద్ పోరాడాల్సింది గతంలో పలు రికార్డులు మాయం చేసిన వారితోనా..? లేదంటే ఆ అక్రమాల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అధ్యక్షుడితోనా..? ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉంటే ఈ గొడవలు, వివాదాలు ఉండనే ఉండవని అంటున్నారు.
జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదంపై కొత్త పాలకమండలి బహిరంగ లేఖ విడుదల చేసింది... సొసైటీ ప్రెసిడెంట్ రవీంధ్రనాథ్ చౌదరి ఇచ్చిన ప్రెస్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి...
ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను.
కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా డెల్లాయిట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని నిర్ణయించాం. ఈనెల 11వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాం. తద్వారా స్థలాల కేటాయింపులు ఎవరెవరికి ఎలా జరిగాయి. ఎంత ధరలకు ఇచ్చారనే అన్ని విషయాలు తేల్చాలని భావించాం.
కానీ కార్యదర్శి మురళీముకుంద్ పాత పాలకవర్గం తప్పులను బయటపెట్టే ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారు. కమిటీ నిర్ణయాల అమలుకు కార్యరూపం ఇవ్వాల్సిన కార్యదర్శి ఫైళ్ళను తన ఆధీనంలోనే ఉంచేసుకున్నారు. అసలు గత కొంతకాలంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారికి అండగా నిలవాలనే వైఖరితోనే ఉన్నారు. తన అధీనంలో ఉన్న ఫైళ్ళను ఇంటి వద్దకు తీసుకెళ్ళడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. కొంత మంది సభ్యులకు సంబంధించిన న్యాయమైన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్ళను కూడా పెండింగులో పెట్టేశారు. కార్యాలయంలో ఫైళ్లు ఉన్న లాకర్లకు తాళం వేసుకుని వెళ్ళారు. ఎవరి అక్రమాలను బయటపెడతామని నమ్మి సభ్యులు మమ్మల్ని గెలిపించారో ఆ పాత పాలకవర్గంలోని పెద్దలతో మురళీ ముకుంద్ కుమ్మక్కయ్యారు. వాళ్ళ అవినీతి బయటికి రాకుండా కుట్ర పన్నారు. అందులో భాగంగానే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు, సహకార శాఖకు తప్పుడు ఫిర్యాదులు చేశారు.
ఈనెల 11 వ తేదీన జరిగిన సమావేశంలో తనపై ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని మురళీ ముకుంద్ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు. అక్కడ ఏం జరిగిందనే దానికి హాజరైన సభ్యులే సాక్ష్యం. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూసినా తేటతెల్లమవుతుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంది. వాటి ద్వారా మా చిత్తశుద్ధి ఏంటో నిరూపితమవుతుంది. మురళీ ముకుంద్ ఏ ప్రయోజనాలను ఆశించారో కానీ గత పాలకవర్గంతో లాలూచీ పడ్డారు. తాను వాళ్ళతో చేరిపోయానని, పాలకవర్గాన్ని రద్దు చేయిస్తానని, ఇంకెవరికో ధారాదత్తం చేస్తానని అంటున్న ఆడియో రికార్డింగ్లు కూడా బయటికొచ్చాయి. ఇవి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాయి.
ఈ పరిస్థితుల్లోనే బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు మురళీముకుంద్ వైఖరిని తప్పుపట్టారు. దాంతో ఆయనే సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో సభ్యుల హక్కులను కాపాడే క్రమంలో పాలకవర్గం కార్యదర్శి అధికారాలను తప్పించేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ సొసైటీ ప్రెసిడెంట్కు దఖలుపరుస్తూ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సొసైటీ బైలాస్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. సొసైటీ అధ్యక్షుడు స్వయంగా ఎన్ని సార్లు అడిగినా, మొత్తం మేనేజింగ్ కమిటీ చెప్పినా ఫైళ్ళను ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన గత పాలవర్గంలో అక్రమాలు చేసిన వారితో కుమ్మక్కయ్యారనేది తేలిపోయింది. దీనివల్లే అయనకున్న అధికారాలను తొలగించాం. దీనికి సంబంధించిన వివరాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమాలను నిరోధించి తీరుతాం. సభ్యులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అంటూ కొత్త పాలకమండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.