కశ్మీర్ కు త్వరలో ఎన్నికలు.. ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రకటన
posted on Aug 15, 2021 @ 9:43AM
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. వాడ వాడలా త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతున్నాయి. జనాలంతా దేశభక్తితో ఉప్పొంగి పోతున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్ఘాట్కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోడీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మోదీ ప్రణామాలు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. కరోనా సంక్షోభం వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను మోడీ కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కొవిడ్తో దేశ ప్రజలు సహనంతో పోరాడారని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో అనే సవాళ్లను ఎదుర్కొన్నామని, అసాధారణ వేగంతో పనిచేశామని గుర్తు చేశారు. ఇది మన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందించిన బలమని అన్నారు. టోక్యో ఒలింపిక్స్లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశానికి వారు పతకాలు మాత్రమే అందించలేదని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారందరికీ దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు.
దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నంగా మిగిలిపోకూడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పేదరికానికి కులం, మతం తేడా ఉండకూడదని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందించాలని మోడీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా మార్చాలన్న సంకల్పం తీసుకోవాలని మోదీ కోరారు. శతాబ్ది ఉత్సవాలకు మిగిలి ఉన్న ఈ 25 ఏళ్లు అమృత ఘడియలని చెప్పారు. ఈ కాలంలో ప్రతి పౌరుడు క్షణం కూడా వృథా చేయకుండా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించినట్టు తెలిపారు. భారతీయుల జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కరోనా నుంచి చాలా వరకు రక్షించాయని మోడీ వివరించారు.భారతదేశం నేడు టీకాల కోసం ఏ ఇతర దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ ఎన్నికలపై మోడీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో పోషకాహారాన్ని అందిస్తామని, దేశంలోని ప్రతీ ఇంటీకీ నల్లా నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎర్రకోట వేదికగా మోడీ హామీనిచ్చారు.