రివ‌ర్స్ పాల‌న‌కు గండి.. రేవంత్ జ‌నజాగ‌ర‌ణ.. ప‌వ‌న్ గాడిద‌ప‌ళ్లు తోమాడా? టాప్‌న్యూస్ @7pm

1. స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపిచ్చారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. గంజాయిపై ప్రశ్నించినవారిపై కేసులు, దాడులు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.  2. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్  సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి.  3. ఈ నెల 14 నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. డిసెంబర్ 9న సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక‌, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదంటూ ప‌రోక్షంగా ష‌ర్మిల పార్టీని విమ‌ర్శించారు. ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.  4. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్టేనని వైఎస్‌ఆర్‌టీసీ అధినేత్రి షర్మిల అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని మండిప‌డ్డారు. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన హక్కు కాదా? అని షర్మిల ప్రశ్నించారు. 5. స్టీల్‌ప్లాంట్ విషయంలో పవన్‌కల్యాణ్‌ ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని ఎందుకు ఒక్క మాట అనరని ఆయన ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీకి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో పవన్‌ ఎలా మద్దతు ఇచ్చారని అన్నారు. పవన్ విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు మంత్రి అప్ప‌ల‌రాజు. 6. రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు. తొలిరోజు 14.5 కిలోమీటర్లు మహా పాదయాత్ర కొనసాగింది. అమరావతి పోరులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభించారు. వైసీపీ మిన‌హా మిగ‌తా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి. 7. రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు చంద్ర‌బాబు.  8. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి– అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా  నవంబర్ 4, 5 తేదీలలో ఇటలీలోని రోమ్ నగరంలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై నిర్వహించే “అంతర్జాతీయ విత్తన సదస్సు” కు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం అందినట్టు మంత్రి ఒక ప్రకటన విడుద‌ల చేశారు.  9. సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. వల్లబాయ్ పటేల్‌తోనే తెలంగాణ విమోచనం అయిందన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వలనే నిజాం‌ తలొగ్గాడని, గోబెల్స్ ప్రచారాన్ని ఆపి.. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 10. విశాఖలో నార్కోటిక్ ట్రాఫికింగ్‌పై ఇంటర్ స్టేట్ కో-ఆర్డినేషన్ సమావేశం జ‌రిగింది. ఈ మీటింగ్‌కి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, ఒడిశా ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకకు చెందిన పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీఆర్ఐ, ఎక్సైజ్, నార్కోటిక్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, గంజాయి సాగు, నివారణ, ఇతర అంశాలపై చర్చించారు.    

వైసీపీ గుర్తింపు రద్దు!.. యాక్ష‌న్‌లోకి ఈసీ!..

మాట్లాడితే కేసులు.. ప్ర‌శ్నిస్తే దాడులు.. ఏపీలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు. ప‌ట్టాభి వ్యాఖ్య‌ల‌తో బీపీ తెచ్చుకొని.. వైసీపీ రౌడీ మూక‌లు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దేవాల‌యంలాంటి ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై మూక దాడులు జ‌ర‌గ‌డాన్ని టీడీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆ విధ్వంస ఆన‌వాళ్ల సాక్షిగా.. 36 గంట‌ల దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధించాల‌ని కోరారు. అటు, టీడీపీ ఎంపీల బృందం సైతం త‌మ వంతుగా ఢిల్లీలో ప‌లు రాజ్యాంగబ‌ద్ధ సంస్థ‌ల దృష్టికి విష‌యాన్ని తీసుకెళుతున్నాయి. ఇప్ప‌టికే ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. మ‌రోవైపు, అరాచ‌కాల‌కు కేరాఫ్‌గా మారిన వైసీపీ గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని నేరుగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.  తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిశారు. ఢిల్లీకి వెళ్లిన పలువురు ఎంపీలు ఈసీ అధికారుల్ని కలిసి.. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, మంత్రులు చేస్తున్న దుర్భాష‌ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ దృష్టికి తీసుకెళ్లారు.  గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీల బృందం ఈసీకి విజ్ఞ‌ప్తి చేసింది. ఘ‌ట‌న‌పై విచారించి త‌గు చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు తెలిపారు. 

రూ.2000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర.. బాదుడే బాదుడు..

తెల్లారితే చాలు. రోజూ సేమ్ న్యూస్‌. ఈ రోజు మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌. మ‌రోసారి పెట్రోల్ మంట‌. కొన్ని వారాలుగా ఇదే తంతు. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్‌గా పెంచేస్తున్నారు ధ‌ర‌లు. ఓవైపు సైలెంట్‌గా గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీని ఎత్తేస్తూ.. మ‌రోవైపు రోజుకింత చొప్పున రేట్లు పెంచేస్తూ.. సామాన్యుల నుంచి కాసులు పిండుకుంటోంది కేంద్ర స‌ర్కారు. ఇటు, గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.వెయ్యి వైపు ప‌రుగులు పెడుతుంటే.. అటు క‌మ‌ర్షియ‌ల్ సిలిండర్ రేట్ ఏకంగా రూ.2వేలు దాటేసింది. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు సంస్థలు. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2000 దాటేసింది.   తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.2000.5, ముంబయిలో రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటి, 15వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. గ‌త కొంత‌కాలంగా డొమెస్టిక్ సిలిండ‌ర్ల‌పై వాయింపు జ‌ర‌గ్గా.. లేటెస్ట్‌గా క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల మోత మోగించాయి చ‌మురు కంపెనీలు.   ఈ విష‌యం తెలిసి.. హ‌మ్మ‌య్యా వంట‌గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌లేద‌ని సంబ‌ర‌ప‌డ‌టానికి లేదంటున్నారు. త్వ‌ర‌లోనే వంట‌గ్యాస్ మ‌రింత మంట పుట్టించ‌డం ఖాయ‌మని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా.. వంట‌గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ వంట గ్యాస్‌ ధర రూ.205 పెరిగి సిలిండర్‌ ధర రూ.1000కి చేరువైంది. గత నెల ఒకటో తేదీన కూడా వాణిజ్య సిలిండర్ ధరను పెంచి, ఆరో తేదీన డొమెస్టిక్‌ సిలిండర్ రేటు పెంచేశారు. అలానే ఈసారి కూడా మ‌రో వారంలో మ‌ళ్లీ వంట‌గ్యాస్‌పై వ‌డ్డింపు త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. వ‌రుస‌గా పెరుగుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌పై సామాన్యులు మండిప‌డుతున్నారు. అచ్చే దిన్ అంటే ఇవేనా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇటు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. అటు గ్యాస్ రేట్లు.. అన్నీ క‌లిసి పేద‌లు, మిడిల్‌క్లాస్ న‌డ్డి విరిచేస్తున్నాయ‌ని మోదీ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ఇదే మంచి ఛాన్స్‌.. చంద్ర‌బాబు అల‌ర్ట్‌..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే, స్థానిక సంగ్రామంలో శాయ‌శ‌క్తులా పోరాడాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపిచ్చారు. ఓటర్లంతా ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని అన్నారు. వైసీపీని ఓడిస్తేనే.. ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు చంద్ర‌బాబు.  ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని చంద్ర‌బాబు మండిపడ్డారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టుపెట్టారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. యథావిధిగా ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. గంజాయిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాడుతుందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.   

టీమిండియా ఓట‌మికి మెయిన్‌ రీజ‌న్స్‌.. ఎందుకు ఫ‌స‌క్ అయ్యారంటే...

ఐపీఎల్‌లో దుమ్ము రేపారు. పోటాపోటీగా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అటు బ్యాట్స్‌మెన్‌, ఇటు బౌల‌ర్స్‌.. అంతా చెల‌రేగిపోయారు. కోట్ల‌కు కోట్లు సంపాదించుకున్నారు. క‌ట్ చేస్తే.. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌. అంతా ఐపీఎల్‌లో రాణించిన వారే. అంతా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్లే. 11మంది ఆణిముత్యాల‌ను ఏర్చి-కూర్చి ప్ర‌పంచ క‌ప్‌కు పంపిస్తే.. వ‌రుస మ్యాచుల్లో ఫ‌స‌క్ అనిపించారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌పై చిత్తు చిత్తుగా ఓడిపోయిన దారుణ అనుభ‌వం మ‌ర్చిపోక‌ముందే.. న్యూజిలాండ్ చేతిలోనూ ఓట‌మి చ‌వి చూశారు. సెమీస్ ఛాన్సెస్ దాదాపు గ‌ల్లంతు చేసుకున్నారు. అస‌లేం జ‌రిగింది? ఎందుకింత చెత్త‌గా ఓడిపోయారు? ఐపీఎల్ స్టార్స్‌.. ఐసీసీ కొచ్చే స‌రికి ఎందుకిలా హ్యాండ్స‌ప్ అనేశారు. టీమిండియా ఓట‌మికి మెయిన్ రీజ‌న్స్ ఏంటి? క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇప్పుడిదే చ‌ర్చ‌..ర‌చ్చ‌. అల‌స‌ట‌. అలుపెర‌గ‌ని ఆట‌. ఇదే ఇండియా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం అంటున్నారంతా. ఎంతైనా మ‌నోళ్లు అంత వేస్ట్ ప్లేయ‌ర్స్ కాద‌నే విష‌యం మ‌న‌కే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి తెలుసు. అయినా.. అంత‌మంది పోటుగాళ్లున్న టీమ్‌.. ఇలా ఫ‌స‌క్ ఫ‌స‌క్ అన‌డాన్ని ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఐపీఎల్ వ‌ల్లే ఐసీసీ మ్యాచ్‌ల‌పై ఎఫెక్ట్ ప‌డింద‌ని అంటున్నారు. బీసీసీఐ కాసుల క‌క్కుర్తితో ఆట‌గాళ్ల‌ను విశ్రాంతి లేకుండా ఆడిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. ఇక‌, బయోబబుల్ సిస్ట‌మ్‌తోనూ ప్లేయ‌ర్స్‌పై ఒక‌ర‌క‌మైన మాన‌సిక ప్ర‌భావం ప‌డింద‌ని అనేవారూ ఉన్నారు. మ‌రి, ఆ ఎఫెక్ట్ ఐపీఎల్‌లోనూ ఉంటుందిగా అంటూ మ‌రికొంద‌రు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా.. కంటిన్యూయ‌స్‌గా, రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడ‌ట‌మే.. ప్ర‌స్తుత ఓట‌మిల‌కు కార‌ణ‌మ‌నేది మెజార్టీ అభిప్రాయం.  బ్యాటింగ్‌..బౌలింగ్‌.. రెండింటిలోనూ టీమిండియా ఘోరంగా విఫ‌ల‌మైంది. మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ కోహ్లీ మాట‌లే అందుకు నిద‌ర్శ‌నం. ‘‘ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’ అని కోహ్లీ విశ్లేషించారు. కెప్టెన్ మాట‌ల ప్ర‌కారం.. టీమిండియాలో టీమ్ స్పిరిట్ క‌రువైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓట‌మికి ఇది మ‌రో మెయిన్ రీజ‌న్‌.  టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టులోని ఆటగాళ్లంతా దుబాయ్‌లోనే ఐపీఎల్‌ ఆడారు. బ్యాట్స్‌మెన్ ట‌న్నుల‌కు ట‌న్నుల ప‌రుగులు చేశారు. విరాట్‌ కోహ్లీ (405), రోహిత్‌ శర్మ (381), కేఎల్‌ రాహుల్‌ (626), సూర్య కుమార్‌ యాదవ్‌ (317), రిషబ్‌ పంత్‌ (419), ఇషాన్‌ కిషన్‌ (241), రవీంద్ర జడేజా (227) పరుగుల వరద పారించారు. మ‌రి, వీళ్లంతా ఇప్పుడు ఒకే జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతుంటే.. ఎందుకిలా విఫ‌ల‌మ‌వుతున్నార‌నేది ప్ర‌శ్న‌. ఓపెనింగ్‌ జోడీ కుదురుకోకపోవడంతో మిడిలార్డర్‌ మీద ఒత్తిడి పడుతోంది. వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌తుండ‌టంతో సైకిల్ స్టాండ్‌గా మారింది.  బ్యాంటిగే కాదు బౌలింగ్‌లోనూ తేలిపోయారు. ఒక్క వికెట్ అయినా తీయ‌లేక బౌల‌ర్లు ఎలా హ్యాండ్స‌ప్ అన్నారో చూశాం. ష‌మీ, భువ‌నేశ్వ‌ర్‌, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌, ర‌వీంద్ర జ‌డేజా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. ఇలా పేరు గొప్ప ప్ర‌ద‌ర్శ‌న సున్నా.. బౌల‌ర్లుగా మారారు మ‌నోళ్లు.  ఇక‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటు బ్యాటింగ్‌లోనూ అటు కెప్టెన్సీలోనూ విఫ‌ల‌మ‌వ‌డం ఓట‌మికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు. కోహ్లీలో మునుప‌టి ఆట అట‌కెక్కేసింద‌ని చెబుతున్నారు. ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ వదులుకుంటాన‌ని కోహ్లీ ఇప్ప‌టికే ప్రకటించ‌గా.. ఆ ప్ర‌భావం అత‌ని ఆట మీద ప‌డిందా? అనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. లాస్ట్ సిరీస్‌ను ఛాలెంజింగ్‌గా కాకుండా.. లైట్ తీసుకున్నారా? అని నిల‌దీస్తున్నారు ఫ్యాన్స్‌. ఇలా ప‌లు కార‌ణాల‌తో ఐసీసీ వాల్డ్ క‌ప్‌లో టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌ణ‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ డిస‌ప్పాయింట్ చేసింది. సెమీస్‌కి ఛాన్సెస్ క‌రువ‌వ‌డంతో మ‌న‌కు ప్ర‌పంచ‌ క‌ప్ ఫ‌స‌క్‌. 

ఆ రెండూ లేని రాష్ట్రం అంధ‌కార‌మ‌యం.. మ‌హా పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు సంఘీభావం

అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్ర‌భుత్వానికి ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమ‌ల‌కు అమ‌రావ‌తి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లిలాంటి భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలు ఎదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అన్నారు.  అమరావతి ఉద్యమంపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురిచేసినా అనుకున్న ఆశయ సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో మూడు రాజధానుల పేరుతో రివర్స్‌ పాలనకు వైసీపీ పాల‌కులు తెరలేపారని తెలిపారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని.. అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్రం అంధకారమవుతుందని చంద్ర‌బాబు చెప్పారు. పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

అమ‌రావ‌తి రైతుల‌ పాద‌యాత్ర‌కు చెక్‌?.. అందుకేనా స్థానిక ఎన్నికల షెడ్యూల్?

అమ‌రావ‌తినే ఏపీకి ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ రైతులు, మ‌హిళ‌లు, ప్ర‌జాసంఘాలు మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమ‌ల‌కు పాద‌యాత్ర‌గా క‌దులుతున్నారు. వైసీపీ మిన‌హా అన్ని పార్టీలు, సంఘాలు రైతుల పాద‌యాత్ర‌కు మ‌ద్దతు ప‌లికాయి. 45 రోజుల పాటు ప‌లు జిల్లాల మీదుగా సాగే పాద‌యాత్ర‌తో అమ‌రావ‌తి నినాదం మారుమోగనుంది. ఆ సౌండ్‌కు జ‌గ‌న్ స‌ర్కారు షేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే, మొద‌ట్లో పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదని అన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అనుమ‌తి రాలేదు. అందులోనూ కొర్రీలు పెట్టారంటూ విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.  అయితే, అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైన గంటల వ్య‌వ‌ధిలోనే ఈ నోటిఫికేషన్ విడుదల కావ‌డం అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతోందని అంటున్నారు. పాద‌యాత్ర‌కు డీజీపీ ఇచ్చిన పర్మిషన్‌లో.. ఎన్నికల కమిషన్ విధించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు. ఈ నేపథ్యంలో మ‌హా పాద‌యాత్ర మొద‌ల‌వ‌గానే.. స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల నోటిఫికేషన్ రావడం చర్చనీయాంశంగా మారింది.  

పిచ్చోడి చేతిలో రాయిలా పీకే వ్యూహాలు!.. త‌ల ప‌గిలేది ఎవ‌రికో?

దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, పదికి పైగా రాష్ట్రల్లో బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందులో మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా జోడీని ఢీ అంటే ఢీ అని ఢీకొనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే , పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒక్కరే, కనిపిస్తారు. మమతా బెనర్జీ గురించి ఇంకే విషయంలో అయినా ఎవరికైనా అభ్యంతరం లేదా భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చును కానీ, మోడీ, షా జోడీని ఎదిరించే దమ్మున్న‌ ముఖ్యమంత్రి దీదీ ఒక్కరే అనే  విషయంలో మాత్రం ఎఎరికీ భిన్నాబిప్రాయం ఉండదు. నిజానికి ఆమె రాజకీయ జీవితం అంతా అలాగే సాగుతూ వచ్చింది అనుకోండి అది వేరే విషయం.  అదలా ఉంటే, వరసగా మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నమమతా దీదీ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు మరలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గోవాలో పర్యటించిన ఆమె తమ మనసులో కోరికను నేరుగా బయట పెట్టేందుకు, కొద్దిగా చాలా సిగ్గును అభినయించినా, ప్రధాని పదవిపై ఆమె మనసు పారేసుకున్నారు, అనేది మాత్రం నిజం.అది ఇప్పటికే దేశం అంతటికీ తెలిసిన బహిరంగ రహస్యం.   కాగా, గోవాలో పర్యటనలో మీడియా ముందుకొచ్చిన మమత 2024 ప్రధాని రేసులో ఉన్నారా అని అడిగితే, “అన్నీ ఇప్పుడే చెప్పెస్తే ఎలా ... రేపు చెప్పుకునేందుకు ఏముంటుంది?” అంటూ చిరు నవ్వుతో సమాధానాన్ని దాట వేశారు. నిజానికి దీదీ ప్రధాని ప్రధాని రేసులో ఉన్నారనే వార్త ఇప్పుడు కాదు  చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా దీదీ కానీ, చివరకు ఆమెను పీఎం చేసే ‘కాంట్రాక్టు’ పుచ్చుకున్న ‘కిరాయి’ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ కానీ, ఎక్కడా ఆవిషయం  చెప్పలేదు.కానీ, 2024 ఎన్నికల్లో ప్రధాని పదవికి దీదీ పోటీలో ఉంటారనే  ఊహాగానాలు మాత్రం షికారు చేస్తున్నాయి.  అయితే, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సరికి, తృణమూల్ కాంగ్రెస్’ పేరుకు జాతీయ పార్టీ అయినా, ఆ పార్టీ ప్రభావం, ఈరోజు వరకు అయితే చాలా వరకు  బెంగాల్ వరకే పరిమితం. లోక్ సభ మొత్తం స్థానాల సంఖ్య 543 అందులో తృణమూల్ గట్టిగా పోటీ ఇవ్వగల స్థానాలు, బెంగాల్’లోని 42 స్థానాలు మాత్రమే. అక్కడ కూడా తృణమూల్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ 22 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది.  ఒరిస్సా, అస్సాం, జార్ఖండ్, బిహార్, అండమాన్’ లలో కూడా తృణమూల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ఒక్క సీటులో  కూడా దీదీ గెలవలేదు. జాతీయ స్థాయిలో  తృణమూల్’కు వచ్చింది 22 సీట్లు (అన్నీ బెంగాల్ నుంచే), అలాగే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే. అదే కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే, కేవలం 52 సీట్లు మాత్రమే వచ్చిన 2019 ఎన్నికల్లోనూ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా 20 (19.49) శాతం వరకు ఓట్లు పోలయ్యాయి.(మూడు వందలకు పైగా సీట్లు దక్కించుకున్న బీజేపీకి వచ్చింది, 32శాతం ఓట్లు మాత్రమే) అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వరసగా మూడవ సారి విజయం సాధించడం, అధికారానికి నిచ్చెనలు వేసిన బీజేపీ, ముఖ్యంగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న మోడీ, షా జోడీ చతికిల పడడంతో మమతా దీదీ, నేషనల్ ఇమేజ్ హటాత్తుగా పెరిగిపోయింది. మరో వంక, ఆమెను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కూడా ఫైపైకి పాకింది. దీంతో, బీజేపీ వ్యతిరేక శక్తులకు ఆ ఇద్దరూ ఆశా జ్యోతిగా కనిపించారు.  మరోవంక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కిరాయి వ్యూహాలకు ఇక స్వస్తి అని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, కొత్త అవతారంలో కాంగ్రెస్/రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నం చేశారు. అలాగే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, చివరకు బీజేపీ, మోడీని ఓడించడం రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో కాదని, నిర్ణయానికి వచ్చారో, లేక అది కూడా వ్యూహంలో భాగమో ఏమో కానీ, ప్రశాంత్ కిశోర్ మకాం బెంగాల్’కు  మార్చారు. మమత పంచన చేరి కాంగ్రెస్’ టార్గెట్’ గా మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.మమతను  జాతీయ నేతను చేసి 2024 ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు పార్టీ విస్తరణకు మమత నడుం బిగించారు.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గోవాలో కాలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వంక 2024 లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఒక్క గోవాలోనే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగి యూపీ సహా ఇతర రాష్టల్లోనూ కాంగ్రెస్ నాయకులను తృణమూల్’లో చేర్చేందుకు, ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేస్తోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, లూయిజినో ఫిలేరియో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తృణమూల్’లో చేరారు. అలాగే, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు, యూపీలో ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్ల్యేలు కూడా  తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, కాంగ్రెస్ టార్గెట్’గా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ, పరోక్షంగా బీజీపీకి మేలు చేస్తుందే, కానీ, ప్రధాని పీఠం ఎక్కాలనే, దీదీ కలను ఎలా నిజం చేస్తుందనేది,ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.అయితే ఇది  ఒక్క పీకేకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆయన గుప్పిట విప్పితేనే కానీ, అసలు వ్యూహం ఏమిటి? అనేది తేలదు. రాహుల్ పోయి .. మమత వచ్చే .. అన్నట్లుగా  మరో బాంబు పేలుస్తారా ... చూడవలసిందే.. పిచ్చోడి చేతిలో రాయి ఏ తలకు అయినా తగలవచ్చును కదా...

సినిమా హాల్లో మంత్రి.. కేసీఆర్‌ నుంచి ఫోన్‌.. ప‌రుగో ప‌రుగు..

ఆయ‌న తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు. నిత్యం వివిధ కార్య‌క్ర‌మాల‌తో,  బాధ్య‌త‌ల‌తో బిజీ బిజీగా ఉంటారు. ఊపిరి సలపని పని ఉంటుంది. ఇటు హైదరాబాద్లో, అటు సొంత నియోజకవర్గంలో అనేక ప్రొగ్రామ్స్ లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి మంత్రి ఎర్రబెల్లి.. కాస్త రిలాక్స్ అవుదామనుకున్నారు. రెబెల్ యాక్టర్ నారాయణమూర్తి రిక్వెస్ట్ తో ఆయనతో కలిసి వరంగల్లో ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. అయితే.. సినిమాకు వచ్చిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీన్ కట్ చేస్తే.. హుటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు ఎర్రబెల్లి. ఇంతకీ ఏం జరిగింది? మంత్రి అంత సడెన్ గా సినిమా హాల్ నుంచి హైదరాబాద్ కు ఎందుకు బయలు దేరాల్సి వచ్చింది? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.. సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి వ‌రంగ‌ల్‌లోని అమృత థియేటర్‌కు వచ్చారు. సినిమా స్టార్ట్‌ అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌కు రావాలని ముఖ్య‌మంత్రి ఆదేశించ‌డంతో.. సినిమా చూడకుండానే మంత్రి ఎర్రబెల్లి అర్జెంట్‌గా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అట్నుంచి అటే హైద‌రాబాద్ బాట ప‌ట్టారు.  అంత‌కుముందు, మంత్రి ఎర్రబెల్లి, న‌టుడు నారాయ‌ణ‌మూర్తితో క‌లిసి మీడియాతో మాట్లాడారు. నారాయణమూర్తి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. రైతన్న సినిమాతో రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.  ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా ‘రైతన్న’ అని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు.  

జ‌గ‌న్‌తో విజ‌య‌మ్మ‌.. వైఎస్సార్‌ ఫ్యామిలీ డ్రామా!

వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం. ఏపీ ఫార్మేష‌న్ డే సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 1న వివిధ రంగాల ప్ర‌ముఖుల‌కు ఇస్తున్న ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వం ఆస‌క్తిక‌ర‌ ప‌రిణామాల‌కూ వేదిక‌వుతోంది. ఈ అవార్డును ప‌లువురు ప్ర‌ముఖులు తిర‌ష్క‌రించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా, విజ‌య‌వాడ‌లో జ‌రిగిన‌ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్.. వైఎస్సార్ ఫ్యామిలీ డ్రామాకు వేదికైంద‌ని అంటున్నారు. అందుకు కార‌ణం.. వైఎస్ విజ‌య‌మ్మ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ‌డం. వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రొగ్రామ్‌కు వైఎస్సార్ స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ హాజ‌ర‌వ‌డం మామూలుగా అయితే పెద్ద విశేష‌మేమీ కాదు. కానీ, ఇటీవ‌ల వ‌రుస‌గా జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు నేప‌థ్యంలో ఆమె రాక‌.. రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. కొంత‌కాలంగా వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో విభేదాలు నెల‌కొన్నాయి. అన్న మీద కోపంతో చెల్లి ష‌ర్మిల మెట్టింటికి మ‌కాం మార్చేశారు. కొడుకు మీద అస‌హ‌నంతో త‌ల్లి విజ‌య‌మ్మ సైతం కూతురు వెంటే హైద‌రాబాద్ వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచీ జ‌గ‌న్‌తో షర్మిల కానీ, విజ‌య‌మ్మ కానీ.. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నారు. వైఎస్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపులపాయ‌లో వైఎస్సార్‌ స‌మాధి ద‌గ్గ‌ర కూడా వాళ్లు మాట్లాడుకోలేదు. దీంతో కుటుంబ క‌ల‌హాలు తీవ్రంగా ఉన్నాయ‌ని తేలిపోయింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వైఎస్సార్ ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు వైఎస్ విజ‌య‌మ్మ‌. త‌న‌ తండ్రి వైఎస్సార్‌ పేరు మీదుగా త‌ల్లి విజ‌య‌మ్మ‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ హాజ‌రు కాక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ తాను వెళ్ల‌క‌పోవ‌డ‌మే కాదు.. వైసీపీ శ్రేణులెవ‌రూ ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లొద్దంటూ ఆదేశించడం.. త‌ల్లి-చెల్లితో ఆయ‌న‌కున్న విభేదాల‌కు నిద‌ర్శ‌నం అన్నారు. అలాంటిది.. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనిది.. వైఎస్ విజ‌య‌మ్మ‌ తాజాగా జ‌గ‌న్‌తో వేదిక పంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వైఎస్సార్ పేరు మీదుగా ఇస్తున్న‌.. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్ర‌దాన కార్య‌క్ర‌మానికి విజ‌య‌మ్మ హాజ‌రు కావ‌డం.. జ‌గ‌న్‌తో ఒకే వేదిక‌పై ఉండ‌టం.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  అయితే... ఒకే వేదిక‌పై ఉన్నా.. కాస్త ప‌క్క ప‌క్క‌నే కూర్చున్నా.. త‌ల్లి-కొడుకు పెద్ద‌గా మాట్లాడుకున్న‌ది లేదు. ప‌ల‌క‌రింపే బంగార‌మైంది వారి మ‌ధ్య‌. జ‌గ‌న్ సిగ్గుతో త‌ల‌దించుకున్న వానిలా మౌనంగా ఉండిపోయారు. వారి మ‌ధ్య ఆప్యాయ‌త క‌నిపించ‌లేదు. ఏదో, ఫార్మాలిటీకి వ‌చ్చామా.. ఉన్నామా.. వెళ్లామా.. అన్న‌ట్టే సాగింది వ్య‌వ‌హారం అంటున్నారు. మరోవైపు, ప్రభుత్వ కార్యక్రమానికి విజయమ్మను ఏ హోదాలో ఆహ్వానించారనే ప్రశ్ననూ లేవనెత్తుతున్నారు కొందరు. పోనీ పిలిచారే అనుకున్నా.. ఆమెతో ఒక్క అవార్డు ఇప్పించకపోవడం అవమానించడం కాదా అంటున్నారు. ఇక, విజయమ్మను ప్రత్యేక ఆహ్వానితురాలిగా పిలిచినా.. వేదికపై జగన్ తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెబుతున్నారు. అంటే, వైఎస్ కుటుంబంలో విభేదాలు అస‌లేమాత్రం త‌గ్గ‌లేద‌ని.. త‌ల్లి-కొడుకు మ‌ధ్య స‌త్సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయ‌ని.. చెబుతున్నారు. త‌ల్లి-చెల్లిని స‌రిగ్గా చూసుకోలేని జ‌గ‌న్‌.. ఇక ఏపీని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా పాలిస్తారో చెప్పేదేముంది.. అందుకే ఈ అరాచ‌క పాల‌న అంటూ మండిప‌డుతున్నారు జ‌నాలు. 

ఏపీ ఫార్మేష‌న్ డే.. జ‌గ‌న్‌కు పాద‌యాత్ర సెగ‌.. ప‌వ‌న్‌కు అచ్చెన్న స‌పోర్ట్‌.. టాప్‌న్యూస్ @1pm

1. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంత‌రం.. ఏపీ ఫార్మేష‌న్ డే సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో వివిధ రంగాల ప్ర‌ముఖుల‌కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌ను అంద‌జేశారు సీఎం జ‌గ‌న్‌.  2. ఏపీలో పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని’ వెంక‌య్య తెలిపారు. 3. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో అమ‌రావ‌తి రైతులు మ‌హా పాద‌యాత్ర చేప‌ట్టారు. తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మ‌హా పాదయాత్రను 9 మంది ముత్తైదువలు ప్రారంభించారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. 4. అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర 45 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కాలిన‌డ‌క‌న చేరుకోనున్నారు. శాంతి భద్రతలకు ఎలాండి భంగం కలగకుండా పాదయాత్ర ఉంటుంద‌ని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే పాదయాత్రకు అనుమతి నిరాకరించిందన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమం అని అంటున్నారు. 5. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌‌ను స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తమకు నమ్మకం లేదని.. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో బల్ల గుద్ది మాట్లాడారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి అక్కడ ఒక మాట ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని వైసీపీపై మండిపడ్డారు. 6. వైఎస్ షర్మిల చేస్తున్న‌ ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరింది. ఉదయం 9.30 గంటలకు దేవరకొండ నియోజక వర్గం మాల్ టౌన్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చింతపల్లి మండలంలోని 10 గ్రామాల ప్రజలను షర్మిల కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గొల్లపల్లి గ్రామ ప్రజలతో మాట ముచ్చట నిర్వహించనున్నారు. 7. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. సమిష్టిగా కృషి చేసి.. ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చుతామ‌ని తెలిపారు.  8. యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతుండ‌గా.. హైద‌రాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 20 మంది ప్ర‌ముఖుల‌ను ప‌ట్టుకున్నారు. పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు బయటకు వచ్చింది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు.  9. పెట్రోల్ రేట్స్‌తో టీమిండియా స్కోర్‌ను కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇటు పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయ‌నే మంట ఓవైపు.. అటు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా, చిత్తు చిత్తుగా ఓడిపొతున్నార‌నే కోపం ఇంకోవైపు. ఆ రెండు క‌ల‌గ‌లిసి.. ఇదే ఛాన్స్ అంటూ విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. కాసులు కుమ్మ‌రించే ఐపీఎల్ టోర్నీల్లో రాణిస్తూ.. ఐసీసీ క‌ప్‌లో మాత్రం హ్యాండ్స‌ప్ అంటున్నారంటూ సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక క్రస్ట్ గేట్ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 58,035 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 589.90 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి సామర్థ్యం : 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీరు నిండుగా ఉంది. 

నవంబర్ 1న బందర్ పై ఉప్పెన.. సగం జనాభా మృత్యువాత.. అసలేం జరిగిందంటే?

నవంబర్ 1 పేరు వింటేనే మచిలిపట్నం ప్రజలు ఉలిక్కిపడతారు. 1864 నవంబర్ 1న బందర్ లో పెను ఉప్పెన స్పష్టించిన ప్రళయం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఆ రోజున మచిలీపట్నంలో 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఘోషించాయి. 157 ఏండ్లు అవుతున్నా అప్పటి బీకర దృశ్యాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి.                     నౌకా వ్యాపారంలో నాడు  అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు 1864 నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు  సముద్రతీరంలో  భారీ ఇసుకమేటలు వేయడంతో  బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది. తీరం లోతు లేనందున భారీ ఓడల రాకపోకలు మహా కష్టమైంది. నేటికీ ఆ ఇసుకమేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపం అయింది. పరాయి పాలనలో ఒక మెట్రో నగరం మాదిరిగా వెలిగిన బందరు అభివృద్ధి క్రమేపి కుంటుపడింది.  రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1న బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి ,  780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన తీర ప్రాంతం పై కరాళ నృత్యం చేసింది. ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది. నాడు బందరు పట్టణంలో 65 వేల మంది జనాభా ఉండగా  అందులో  30 వేల మంది తమకేమి జరుగుతుందో తెలిసేలోపు  ఆ కాళరాత్రి  జలసమాధి అయ్యారు. సముద్రం తీరాన్ని దాటి, 17 మైళ్ళు ఊళ్ళపై   చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచివేసింది. నేటి కాలేఖాన్ పేట ప్రాంతంలోని  శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలో 700 మంది ప్రజలు నివసించేవారని ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని చరిత్రలో లిఖితమైంది. . ఇక చింతగుంటపాలెంలో పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయన సముద్ర కెరటాలకు ఎక్కడికో  చాలా దూరం కొట్టుకొనిపోయి ఒక తాటిచెట్టుపై  మొవ్వలో చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చి అతి కష్టం మీద తన స్వస్థలానికి చేరుకున్నాడని నాడు ప్రజలు చెప్పుకొనేవారు.   బందరులో కోటావారితుళ్ళా సెంటర్  పాత దుర్గామహల్  (ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద) శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ( డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా ఆ పురాతన మేడ  కొనసాగింది. దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఈ భవనానికి కొందరు దుండు నిప్పు పెట్టి తగలబెట్టారు )  ఆ పంతులు గారి మేడలో ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు తల దాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారు.  నాటి బ్రిటిష్ అధికారి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు ఎంతో చిరస్మరణీయం.  ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు తమ పొలిసు సిబ్బందితో కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న శవాల గుట్టలను ..పశువుల కళేబరాలను ఎక్కడికక్కడే భూమిలో పూడ్చిపెట్టారు...ఎడ్మన్డ్ షార్కి తమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సముద్రంలో మునిగిచనిపోగా.. వారినందరిని  ఆ సమీప ప్రాంతంలో  ఖననం చేశారు. 40 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి గుట్టలు  కనబడేవి.. విషయం తెలియని చాలా మంది ఆ మట్టిని తమ ఇళ్ళను మెరకు చేసుకునేందుకు ఎడ్ల బండ్లలలో ట్రాక్టర్లలో తరలించుకోన్నారు.. ఆ మట్టిని తవ్వే టప్పుడు తమకు మానవ కళేబరం తాలూకా కొన్ని ఎముకలు కూడా దొరికాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు   ఆనాటి ఘోర దుర్ఘటనలో పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో మానసికంగా చలించిపోయారు. ..ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం శవాహారంకు నాడు అలవాటుపడ్డాయట ...నేడు మాచవరం సమీపంలో 1809 సంవత్సరం నుంచే  ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అక్కడకు వ్యాపించిన సముద్రపు నీరు చర్చి గోడలు ఎనిమిది అడుగుల మేర ప్రవహించిందని నాటి తరం పెద్దలు చెప్పుకొన్నారు.. ఈ చర్చ్ గోడలకు ఇప్పటికీ ఆ ఉప్పునీటి చారిక స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రదేశమతా సున్నం ఎంత పులిమినప్పటికీ ఇప్పటికి ఆ చార స్పష్టంగా కనబడుతూనే ఉంటుందని కొందరు స్థానికులు అంటుంటారు.  1864 నవంబర్ 1 వ తేదీన సంభవించిన  ఉప్పెన అనంతరం ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. బందరు పరిసర ప్రాంతాలపై సముద్రపు నీరు ప్రవహించిన  కారణంగా వ్యవసాయ భూములు చౌడు బారిపోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పునీరుగా మారిపోయాయి. ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. నాడు మానవత్వం కల్గిన కొందరు వ్యాపారవర్గాలు ప్రజల తాగునీటి అవసరాల కోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్  థారన్ హిల్ కు అందించారు. ఆయన మరో 30 వేల రూపాయలను ప్రభుత్వం నుంచి సమీకరించి నాటి నాగులేరు ( ఇప్పటి ఖాలేఖాన్ పేట  మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ తాగునీటి పైప్ లైన్  నిర్మించారు. అప్పట్లో టౌన్ ప్రజానీకo మొత్తం  తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు సెంటర్ ప్రాంతం.. అంతటి ఘన చరిత్ర గల కోనేరు కూడలి ఇప్పుడు కొందరు మూర్ఖులకు మూత్ర విసర్జన కేంద్రంగా మారింది.              ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా పైకం కోసం ధన పిశాచాలుగా మారారు. సముద్రం నీటిలో ఊపిరాడక అర్థంతరంగా చనిపోయిన  మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో నిమగ్నమైయ్యారంట . వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి రహస్యంగా తమ ఇంటి గోడల్లో దాచుకున్నరని ఆ తర్వాత వారే పట్టణంలో అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో వృద్ధతరం వారు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్పుకొన్నారు , అయితే , చనిపోయినవారి శాపం తగిలిన కారణంగానో ఏమో,  బంగారం భారీ ఎత్తున సేకరించు కున్న  ఆ కుటుంబంలో ఒక వింత శాపం మూడు తరాల వరకు కొనసాగిందట.. సంబంధిత వ్యక్తికి భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగులుగా మాదిరిగా లుకలుకలాడుతూ  కనిపించేదని దాంతో ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని ఆహరం తీసుకొనేవారని  చెప్పేవారు.  ఈ ఉప్పెన అనంతరం ఎందరో బందరును విడిచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై భ్రమలు పూర్తిగా వదులుకొన్నారు. తమ స్థావరాలలో  ప్రాణ ఆస్తి నష్టం అధికం కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు. ఆ  ఉప్పెన అనంతరం బందరు తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం ప్రారంభమైంది..               ఆనాటి  విషాదం అత్యధికులకు నేటికీ తెలియదు. బందరు వుప్పెన పై అవగాహన ఉన్న ఏ ఒక్కరు గుర్తు చేసుకోకపోవడం విచారకరం.  పరాయి పాలకులైన నాటి ఉప్పెనలో మృతి చెందిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని బందరుకోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ లో ఒక భారీ స్థూపం నిర్మించారు. నేటికీ ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపం గుర్తు చేస్తూనే ఉంటుంది. కనీసం  పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో  లేక  ఒక్క పుష్పగుచ్ఛమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం ఎంత బాధాకరమో కదూ ? 

భారత్ సెమీస్ ఆశలు ఉన్నట్టా.. లేనట్టా? 

హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు టీట్వంటీ వరల్డ్ కప్ లో దారుణంగా ఆడుతోంది. ఎన్నో అంచనాలతో దుబాయ్ వెళ్లిన కోహ్లీసేన.. పేలవమైన ఆట తీరుతో మొదటి రెండు మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తైన కోహ్లీసేన... రెండో మ్యాచ్ లో కివీస్ తోనూ ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో గ్రూప్ 2లో ఐదో స్థానంలో నిలిచింది. ఆప్ఘనీస్తాన్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. నమీబియా కూడా భారత్ పైనే ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో భారత్ ఇంకా మూడు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నదానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి.  సాంకేతికంగా చూస్తే ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు సెమీస్‌ దారులు ఇంకా కనిపిస్తున్నయి.  సెమీస్‌ చేరే చాన్సులున్నా..అందుకు ఇతర లెక్కలు మనకు అనుకూలించాల్సి ఉంటుంది. గ్రూప్ 2లో  ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌ మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో టాప్‌లో  నిలిచింది. నమీబియా, స్కాట్లాండ్‌లతో ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో గెలిస్తే పాకిస్థాన్‌ టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది. ఈ గ్రూప్‌ నుంచి సెమీస్ చేరే రెండో జట్టుపైనే ఉత్కంఠ నెలకొంది. భారత్ పై గెలిచిన న్యూజిలాండ్‌ రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారత్‌ ఆడిన రెండింటిలో ఘోర పరాజయం చవిచూడడంతో మన రన్‌రేట్‌ కూడా దారుణంగా ఉంది. భారత్‌ ఇంకా అఫ్ఘానిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాతో ఆడాలి. ఈ మూడింటిలో మనోళ్లు గెలుపొందుతారనే అనుకుందాం. నెగ్గడమంటే నెగ్గడం కాదు.. భారీ తేడాతో విజయం సాధిస్తేనే మన రన్‌రేట్‌ మైనస్‌ నుంచి ప్లస్‌కు చేరుతుంది. అప్పుడు ఆరు పాయింట్ల మన ఖాతాలో ఉంటాయి. ఇక నమీబియా, స్కాట్లాండ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లతో న్యూజిలాండ్‌ కూడా తలపడాల్సి ఉంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న కివీస్‌ నెట్‌రన్‌రేట్‌ (+0.765) మనకంటే మెరుగ్గా ఉంది. ఇక ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్‌ విజయం సాధిస్తే.. టీమిండియా సెమీస్‌ అవకాశాలు గల్లంతే. అలా జరగకూడదనుకుంటే.. న్యూజిలాండ్‌ను ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనున్న అఫ్ఘానిస్థాన్‌ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్ఘాన్‌ తలా ఆరు పాయింట్లతో పట్టికలో సమంగా ఉంటాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల రెండు వరుస పరాజయాల భారం నుంచి కోలుకొని తదుపరి మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ సూపర్ గా ఆడాలి. ఏదేమైనా వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్‌ అవకాశాలు కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.  2007 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ తో ఓటమితో లీగ్ దశనుంచి ఇంటి దారి పట్టింది టీమిండియా. టీమిండియా తీరుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అప్పటి కెప్టెన్ ద్రావిడ్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. ఇపుడు అదే తరహాలో లీగ్ దశలోనే ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టాలు తప్పకపోవచ్చు.

అమరావతి రైతుల‌ ‘మహా పాదయాత్ర’.. సీఎం జ‌గ‌న్‌కు రాజ‌ధాని సెగ‌..

అమ‌రావ‌తి కోసం అవిశ్రాంత పోరాటం. క‌ల‌ల‌ రాజ‌ధాని కోసం అలుపెర‌గని ఉద్య‌మం. ఒక‌టి, రెండు కాదు.. దాదాపు రెండేళ్లుగా త‌గ్గేదే లే అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై యుద్ధం. కేసుల‌కు వెర‌వ‌లేదు.. లాఠీ దెబ్బ‌ల‌కు బెద‌ర‌లేదు.. పెయిడ్ ఆర్టిస్టులు అన్నా.. ఓ పార్టీ మ‌నుషుల‌న్నా.. ఆ కులం వార‌న్నా.. ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా సంక‌ల్పం స‌డ‌ల‌లేదు. అదే ఉద్య‌మ‌ స్పూర్తితో ఇప్పుడు మ‌రో ఐక్య కార్య‌చ‌ర‌ణ మొద‌లుపెట్టారు అమ‌రావ‌తి రైతులు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ల‌క్ష్యం దిశ‌గా మ‌హా పాద‌యాత్రతో క‌దం తొక్కుతున్నారు.  ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వ‌హించారు.  45 రోజుల పాటు అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌ కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతుల మ‌హా పాదయాత్రకు అధికార వైసీపీ మినహా.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్‌ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు క‌మిటీలు సంఘీభావం ప్రకటించాయి.     ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ వ‌ర‌కు నిర్వ‌హించే మ‌హా పాద‌యాత్ర సజావుగా సాగేందుకు అమ‌రావ‌తి రైతులు 20 కమిటీలు ఏర్పాటు చేశారు. పాద‌యాత్రలో శ్రీవారి విగ్రహం ఉంచిన వాహనం ముందుండ‌గా.. ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపే వారు ఇలా వరుస క్రమంలో సాగుతున్నారు.  మ‌హా పాదయాత్ర ప్ర‌తీరోజూ రెండు విడతలుగా సాగ‌నుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4నుంచి 6గంటల వరకూ.. రోజూ దాదాపు 12 నుంచి 14 కిలోమీటర్లు ముందుకు సాగ‌నుంది. డిసెంబ‌ర్‌ 15న తిరుమలకు చేరుకోనుంది అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌. ఈ పాద‌యాత్ర‌తోనైనా జ‌గ‌న్ మ‌న‌సు మారాల‌ని.. అమ‌రావ‌తినే ఏపీ ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని.. ఆ క‌లియుగ‌దేవుడిని కోరుకోనున్నారు అమ‌రావ‌తి రైతులు, మ‌హిళ‌లు.

అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ మద్దతు

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అండగా నిలవాలని ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనన్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రైతుల మహా పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు అ. రాజధాని నిర్వీర్యంతో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారని మండిపడ్డారు. పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఉంటే వారి విమర్శలకు తావుండేది కాదని అచ్చెన్న పేర్కొన్నారు.  రాష్ట్ర రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ... అణిచివేత, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకు తమరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ ఆకాంక్షించారు.  అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు, హారతి పట్టేందుకు మూలపాడులో కాంగ్రేస్ మహిళా నేతలు, కార్యకర్తలు  సిద్ధమయ్యారు. కాగా... రోడ్డుపై ఉండొద్దంటూ, హారతి, స్వాగతం చేయడానికి వీల్లేదంటు పోలీసులు ఆంక్షలు విధించారు.  ఇబ్రహీంపట్నం రింగ్‌లో కూడా కాంగ్రెస్ జెండాలను పోలీసులు తొలగించారు.  రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు.  

ఇండియా స్కోర్ వ‌ర్సెస్‌ పెట్రోల్ రేట్‌.. కుమ్మేస్తున్న నెటిజ‌న్స్‌..

వ‌స్తున్నారు.. వెళ్తున్నారు.. ఒక‌రి త‌ర్వాత ఇంకొక‌రు.. క్రీజ్‌లో ఉండ‌ట‌మే పాప‌మ‌నుకున్న‌ట్టున్నారు. సైకిల్ స్టాండ్‌లో సైకిల్స్ ప‌డ్డ‌ట్టు.. వ‌రుస‌గా ఒక్కో వికెట్ ట‌పీ ట‌పీమ‌ని ప‌డ్డాయి. పిచ్ బాలేదు అన‌టానికి లేదు.. బాల్ స్వింగ్ అవుతోందంటూ కుంటి సాకులతో ఎస్కేప్ అవ‌లేరు.. టాస్ ఓడిపోయాం.. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఎవ‌రో తుమ్మారు.. ఇలా సొల్లు రీజ‌న్స్ చెబితే త‌న్నేలా ఉన్నారు ఫ్యాన్స్‌. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా చెత్త‌..వ‌రెస్ట్‌..బ‌క్‌వాస్ ప‌ర్ఫార్మెన్స్‌పై భార‌తీయులంతా ర‌గిలిపోతున్నారు. ముంబైకి రండి మీ సంగ‌తి చెబుతామంటూ పోస్టుల‌తో చిత‌క్కొడుతున్నారు. ఇక టీమిండియాపై జ‌రుగుతున్న ట్రోలింగ్ అట్టా ఇట్టా లేదు. నెటిజ‌న్లు త‌మ క్రియేటివిటీ అంతా క్రికెట‌ర్ల మీదే చూపిస్తున్నారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వామ్మో.. మామూలుగా లేవు పోస్టులు. ఆ మీమ్స్ అన్నిటిలోకి హైలైట్‌.. టీమిండియా స్కోర్ కంటే పెట్రోల్ రేటే ఎక్కువ అనే పోస్ట్‌. ఇండియాలో పెట్రోల్ రేట్ ఎంత‌? 120 రూపాయ‌లు. సిటీని బ‌ట్టి రెండు-మూడు రూపాయ‌లు త‌క్కువ ఉండొచ్చు. మ‌రి, వ‌రల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ స్కోర్ ఎంత‌? జ‌స్ట్‌.. 111. అంటే.. పెట్రోల్ రేట్ కంటే ఇంకో ప‌ది ర‌న్స్ త‌క్కువే. ఇది చాల‌దా.. నెటిజ‌న్ల‌కి. పెట్రోల్ రేట్స్‌తో కంపేర్ చేస్తూ టీమిండియాను కుమ్మేస్తున్నారు..ఏకేస్తున్నారు..చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇటు పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయ‌నే మంట ఓవైపు.. అటు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా, చిత్తు చిత్తుగా ఓడిపొతున్నార‌నే కోపం ఇంకోవైపు. ఆ రెండు క‌ల‌గ‌లిసి.. ఇదే ఛాన్స్ అంటూ విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌.  కాసులు కుమ్మ‌రించే ఐపీఎల్ టోర్నీల్లో రాణిస్తూ.. ఐసీసీ క‌ప్‌లో మాత్రం హ్యాండ్స‌ప్ అంటున్నారంటూ సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌నోళ్లు పైస‌లు లేనిదే ఆడేలా లేరంటూ.. ఐపీఎల్ బ్యాన్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. 

రెండో మ్యాచ్ లోనూ కోహ్లీ సేన చిత్తు.. నమీబియా కన్న చివరన భారత్..

కోట్లాది మంది ఆశలు ఆవిరి చేస్తూ టీమిండియా మరోసారి చేతులెత్తేసింది. కోహ్లీ సేన ఇంకోసారి అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందిటీట్వంటీ ప్రపంచ కప్ లో మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది భారత క్రికెట్ జట్టు. కివీస్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్‌ 2 టేబుల్ లో మరింత వెనకబడి ఐదో స్థానానికి పడిపోయింది.  భారత జట్టు విధించిన 110 పరుగుల లక్ష్యాన్ని సునాయసనంగా చేధించింది కివీస్ జట్టు. కివిస్ తొలి వికెట్ త్వరగానే పడిపోయినా.. రెండో వికెట్ కు మిచెల్ , విలియమ్సన్ అద్భుతంగా ఆడారు. మిచెల్ అవుటైనా విలియమ్సన్ మిగితా పని పూర్తి చేశారు. కివీస్ కేవలం 14. 2 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేనకు ఏ దశలోనూ కలిసి రాలేదు. బ్యాటింగ్ వైఫల్యం మరోమారు కొట్టొచ్చినట్టు కనిపించింది. న్యూజిలాండ్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసి బలమైన ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.  70 పరుగులకే ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9) వంటి కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదుకుంటాడనుకున్న పంత్ (12) కూడా బ్యాటెత్తేశాడు. హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (26, నాటౌట్) చివర్లో కాసేపు క్రీజులో కుదురుకోవడంతో భారత్ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2 వికెట్లు తీసుకోగా, సౌథీ, మిల్నేచెరో వికెట్ తీసుకున్నారు. 

ఉద్యమ నేతలకా.. బీటీ బ్యాచ్ లీడర్లకా! కేసీఆర్ ఎమ్మెల్సీ జాబితాలో ఉండేదెవరో? 

ఐదు నెలలుగా పెండింగులో ఉన్న శాసనమండలి ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కానుండటంతో అశావాహులంతా యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీలో ఉన్న బలం ఆధారంగా ఆరు సీట్లు అధికార టీఆర్ఎస్ కు దక్కనుండటంతో ... సీఎం కేసీఆర్ ప్రసన్నం కోసం గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో కేసీఆర్ ఎవరిని ఖరారు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.  కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన  ఆకుల లలిత, ఫరీజుద్దీన్, గుత్తా సుఖేందర్​రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. వీళ్లలో శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్​రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమంటున్నారు. ఆయనకు బెర్త్ ఖాయమైనట్లు కేసీఆర్ నుంచి సిగ్నల్ వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరినప్పుడే హామీ ఇచ్చినందున ఆకుల లలితకు మళ్లీ అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. మిగితా నాలుగు స్థానాల కోసం పలువురు పోటీ పడుతున్నారు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పోస్టు ఆశిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్, కోటిరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వారే. దీంతో నల్గొండ జిల్లా నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి అవకాశం ఉండదంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. వీళ్లలో ఒకరిని కేసీఆర్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  ఉమ్మడి వరంగల్​జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఈసారి అవకాశం వస్తుందా.. లేదా అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దళిత సామాజికవర్గం నుంచి కడియం శ్రీహరికి చాన్స్ ఉంటుందని పార్టీ నేతల్లో కొంత ప్రచారం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వరని కూడా చెప్పుకుంటున్నారు. కడియం కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. హుజురాబాద్​రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్​రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్​ తీర్మానం చేసి పంపినట్లు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఇది పెండింగ్‌లో పడింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో పంపి.. గవర్నర్ కోటాలో మరొకరిని సిఫారస్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు,  బొడికుంట్ల వెంకటేశ్వర్లకు కూడా రెన్యూవల్ ఉండవచ్చనే టాక్ వస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ స్పీకర్ మధుసూదనచారీ కూడా ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మైండ్ లో ఎవరదున్నది మాత్రం తేలడం లేదు. ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ కానుంది. అదేనెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణలకు అవకాశం.  నవంబర్ 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ ఉండగా.. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది. 

ప్రజలు కాదు డబ్బులు, కాంట్రాక్టులే ముఖ్యం! ఏపీ ఎంపీలపై పవన్ కల్యాణ్ ఉగ్రరూపం..

ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తమను గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ వెళ్లిన పవన్ కల్యాణ్..  స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. సభలో స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. ఓట్ల సమయంలో మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌కి భూములు ఇచ్చినవారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు జనసేనాని.   25 మంది ఎంపీలు విశాఖకు గనులు కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.  కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దని  కేంద్ర ప్రభుత్వానికి చెప్పేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలన్నారు. తమ  ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయిందని.. తన వెంట ప్రజలున్నారనే కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని చెప్పారు. నష్టాలు లేని వ్యాపారం అంటూ ఏదీలేదన్నారు. 18 వేల మంది రైతులు భూములు వదులకుంటేనే విశాఖ ఉక్కు వచ్చిందన్నారు పవన్ కల్యాణ్.   విశాఖ ఉక్కు కోసం 32 మంది యువకులు బలిదానం చేశారన్నారు. కులాలు, వర్గాలకి అతీతమైన నినాదం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్నారు.  రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదని పవన్ నిలదీశారు.  ఆంధ్రాలోని పాతికమంది ఎంపీలు దీనిపై మాట్లాడలేదేం? ఎందుకంటే వారికి పదవులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం. వారికి ప్రజల కష్టాలు, కన్నీళ్లు ముఖ్యం కాదు... అందుకే వారి మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినవారిలో చాలామంది దేవాలయాల్లో ప్రసాదం తిని కడుపు నింపుకునేవాళ్లన్న సంగతి ఆ ఎంపీలకు తెలుసా? అని పవన్ ధ్వజమెత్తారు.  తాను  ప్రజలను మోసం చేయనని, తాను ఓడిపోయినా  ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేదని పవన్ అన్నారు.  ఇక్కడి ప్రజాసమస్యపై పోరాడడం కర్తవ్వంగా భావిస్తానన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందరం ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి రావాలని.. ఇది అన్ని పార్టీలు కలిసివస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.కార్మికుల కష్టాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయి? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి తెలియజేయాలని అన్నారు. మీ రాష్ట్రం ఎంపీలు ఏంకావాలో చెప్పకపోతే మేం చేయడానికి ఏముంటుందని జాతీయనేతలు అంటున్నారని పవన్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలు ఏమీ మాట్లాడరు... రాష్ట్రానికి ఏం కావాలో కూడా వారికి తెలియదు... మాకు నష్టం వస్తోందని కూడా వారు చెప్పరయ్యా... అంటూ ఆ జాతీయస్థాయి నేతలు చెబుతున్నారని తెలిపారు. వీళ్లకు డబ్బు, కాంట్రాక్టులే ముఖ్యమా? వీళ్లు ప్రజల్లో తిరిగే వాళ్లు కాదు. ఎన్నికలప్పుడు వచ్చి, రెండు వేలో, మూడు వేలో ఇచ్చి వెళ్లిపోతారు. మళ్లీ ఓట్ల సమయంలోనే వస్తారు. సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ రారు, ఎవరూ నిలబడరు. ఓడిపోయిన మనమే రావాలి, మనమే నిలబడాలి. జనసైనికులు నిలడతారు, వీర మహిళలు నిలబడతారు... ప్రజల కోసం మేం నిలబడతాం!" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. "దేశంలో ప్రతి పరిశ్రమకు గనులు ఉన్నాయి. ఉదాహరణకు టాటా ఉక్కు పరిశ్రమ ఉంది. టాటా స్టీల్ కు జార్ఖండ్ లోనూ, ఒడిశాలోనూ సొంత గనులు ఉన్నాయి. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో సొంత గనులు ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంత ఎక్కువగా గనులు ఉన్నాయంటే... 70 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది. దాన్నేం చేయాలో తెలియక ఉన్నదంతా అమ్మేయండని చెబుతుంటుంది. ఇక్కడ ఏపీలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. మనకు ఆ గనులను ఇవ్వాలని, మా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని కేంద్రాన్ని ఒక్క ఎంపీ అయినా నోరెత్తి ఎందుకు అడగరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.