బాబు సభలో వైసీపీ కార్యకర్త.. జగన్ కు బిగ్ షాక్.. ఉమ్మడి సీఎంగా కేసీఆర్.. టాప్ న్యూస్@7PM

టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా  చంద్రబాబు చెల్లిస్తామన్నారు. ---  అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది -------- నుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు చెప్పారు. జగన్ ఇచ్చిన లైసెన్సుతో బొల్లా దోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా ఇళ్ల స్దలాల పేరుతో కోట్లు దోచుకున్నాడన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలకు ఎకరాకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు -------- తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. రాజోలు మండలంలోని తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేయించారు. అధికారులు రెండురోజుల పాటు స్కూలుకి సెలవులను ప్రకచించారు.  -------- శ్రీనివాససేతు నిర్మాణ పనులపై కార్పొరేషన్ కమిషనర్ గిరీషా, నిర్మాణ సంస్థతో సమీక్ష టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. నవంబర్ మాసం లోపల పనులు పూర్తి చెయ్యాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీ తరుపున చెల్లించాల్సిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ చేత నవంబరులో శ్రీనివాస సేతును ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. -------- తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తప్పుబట్టారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్‌ అనుమానం వ్యక్తం చేశారు.జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. -------- సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. -------- రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలో కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బుల కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని శశాంక్ తెలిపారు. --- వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. వరి విత్తనాలు అమ్మకూడదంటూ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని బాతుల నారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు.  ------- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందడపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు విశేషాభిమానాన్ని చూరగొనిన ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్‌కుమార్ అని, అలాంటి పునీత్‌ను విధి మన నుంచి దూరం చేయడం బాధాకరమని ఓ ట్వీట్‌లో సంతాపం తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయన కాలం చేసినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోతుందని తెలిపారు. 

జైలుకు జగన్... ఉమ్మడి ఏపీ సీఎంగా కేసీఆర్? 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ తేవడం వెనుక ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని గురువారం ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ట్వీట్ పై దుమారం రేగుతుండగానే మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళుతున్నారని అన్నారు.  ఉమ్మడి రాష్ట్ర కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు.  షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడం, కలిసిపోదాం అని ఏపీ మంత్రి పేర్ని నాని అనడం అనుకోకుండా జరిగినవి కావన్నారు రేవంత్ రెడ్డి.  జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందన్నారు. కేటీఆర్ భీమవరం లో పోటీ చేస్తారో, లేక బొబ్బిలి లో పోటీ చేస్తారో తెలువదు.కానీ ఇలాంటి కుట్రలు ప్రజలు సహించరని అన్నారు. జరుగుతున్న కుట్రలను ప్రజలు ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ జైలుకు వెళుతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పేర్ని వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే నాని వ్యాఖ్యలు స్వాగతించినట్లే కదా అని రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.  రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని  సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది. 

ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం! జగన్ రెడ్డికి చంద్రబాబు సవాల్...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి  ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు.  ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసారు. తన మీద బాంబు వేస్తామని ఒకాయన అంటున్నారని, తనను ప్రజా దేవుళ్లే కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని అన్నారు.  తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. రెండు రోజుల పర్యనటలో భాగంగా తొలిరోజు బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన పర్యటనకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని  చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం, ధైర్యం ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసి, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి దాడి సమయంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించారు.  ఏపీలో షాక్‌ కొట్టేలా విద్యుత్‌ చార్జీలు పెంచారని మండిపడ్డారు. . పన్నులు పెంచుతూ.. ప్రజలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీని సారాయి, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారన్నారు. అక్రమ కేసులకు భయపడి మేం సరెండర్‌ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వదిలేసి పారిపోవాలా అని చంద్రబాబు నిలదీసారు.  

చంద్రబాబు సభలో బాంబు కలకలం? కుప్పంలో హై టెన్షన్..  

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అతని వైపు జనాల్లోనుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూసుకువచ్చారు. వాళ్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు వైపు దూసుకొచ్చింది వైసీపీ కార్యకర్తగా అనుమానిస్తున్నారు. దుండగుడి  చేతిలో రాళ్లు, కర్ర ఉండటంతో అంతా షాకయ్యారు. ఈ ఘటనతో చంద్రబాబు సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్త కర్రలు, రాళ్లతో దూసుకురావడంతో చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుపై వేయడానికి బాంబులు తీసుకుని వైసీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై బాంబులు వేస్తామని ఇటీవలే కొందరు వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుప్పం చంద్రబాబు పర్యటనలో రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్త హల్ చల్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 

హుజూరాబాద్ పై ఆంధ్రా బుకీల బెట్టింగ్స్! గంటగంటకు మారుతున్న ఈక్వేషన్స్..

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. యావద్దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న, అత్యంత ఖరీదైన ఎన్నికగా చెబుతున్న హుజూరాబాద్ ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్ దందా నిర్వహించే ముఠాలు ముంబై, బెంగళూరు నుంచే కాక ముఖ్యంగా ఆంధ్రా నుంచి పెద్దఎత్తున  రంగంలోకి  దిగినట్టు విశ్వసనీయ సమాచారం. హుజూరాబాద్ కు సమీపంలోనే ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లోని పలు లాడ్జీల్లో తిష్ట వేసి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. కొందరు సుదూరంగా ఉన్న ముఠాలైతే  హుజూరాబాద్ లోని తమకు తెలిసినవారి ద్వారా సమాచారం తెలుసుకొని పందేలు కాస్తున్నట్టు  తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపే ఆంధ్రా బుకీలు... సంక్రాంతి సీజన్లో నిర్వహించే కోడిపందేల్లాగే పెద్దఎత్తున బెట్టింగ్ నిర్వహించి పెద్దఎత్తున సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ వేశారు.  స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బెట్టింగ్ రూ. వందల కోట్ల రేంజ్ దాటి వేల కోట్లకు  చేరిందంటున్నారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని లాడ్జీలు, గెస్ట్హౌజ్ లతో పాటు ప్రత్యేకంగా తీసుకున్న గదుల్లో ఉంటూ ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్లు సమాచారం. తమపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు బుకీలంతా కలిసి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను ఓ బృందంగా ఏర్పాటు చేసుకుని బెట్టింగులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బృందం సభ్యులు పోలీసులు, మీడియా, ఇతరులను మేనేజ్చేస్తూ వారికి ఎంతో కొంత ముట్టజెపుతూ తమ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రణాళికలకు రూపొందించుకుంటున్నారు.  హుజూరాబాద్ ఫలితాలపై తొలినుంచీ ఓ జాతీయ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని అన్ని సర్వేలూ తేల్చి చెప్పిన క్రమంలో ఆ పార్టీ అభ్యర్థిపై పెట్టిన సొమ్ముకు ఆరింతలు ముట్టజెప్పే విధంగా బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ దాదాపు ఆరు నెలలుగా ఉత్కంఠ భరిత ప్రచారం కొనసాగగా, ఇప్పుడు అందరి దృష్టీ ఓట్లు, ఫలితాలపైనే ఉంది. ఎన్నికల్లో ఈటల రాజేందరే గెలుస్తాడని కొందరు, లేదు.. గెల్లు శ్రీనివాసే గెలుస్తాడని ఇంకొందరు జోరుగా బెట్టింగ్ కడుతున్నారు. అంతేకాదు... ఆయా పార్టీలకు ఇంత మెజారిటీ వస్తుంది.. అంత మెజారిటీ వస్తుందని,  ఓ పార్టీ అభ్యర్థికైతే అసలు డిపాజిటే రాదని.... ఇలా సర్వేల ద్వారా తాము నమ్ముతున్న మేరకు బెట్టింగ్లు జోరందుకున్నాయి. కొందరైతే  ప్రత్యేకంగా ప్రైవేటు  సంస్థల ద్వారా ప్రాంతాలు, కులాల వారీగా సర్వే చేసుకుని ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయోనని తెలుసుకుని మరీ పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది.  సుమారు నెల రోజుల ముందు నుంచే బెట్టింగులు షురూ అయ్యాయి. వందల కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన బెట్టింగ్ పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో అది దాదాపు వేయి కోట్లకు చేరినట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్తోనే ఎక్కువగా దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కడప, ఇక మహారాష్ట్రకు చెందిన నాందేడ్, ముంబై, షోలాపూర్, గుజరాత్ తదితర రాష్ట్రాల వారు కూడా ఇందులో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.  ఈ బెట్టింగ్ వ్యవహారం ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో సాగుతోంది. ఒక్కో వ్యక్తి సుమారు రూ.5వేల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్ వేసే వ్యక్తి చెప్పినట్టుగా ఫలానా అభ్యర్థి గెలిస్తే అతను పెట్టిన డబ్బులకు ఐదు, పది రెట్లు ఇస్తామని బుకీలు చెబుతుండడంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న పార్టీ వైపే పెద్దఎత్తున డబ్బు గుమ్మరిస్తున్నారు. 

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి రైతు పాదయాత్రకు హైకోర్టు అనుమతి..

అంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు తలపెట్టిన పాదయాత్రను రైతులు చేసుకోవచ్చని ఆదేశించింది.  ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 22 నెలలుగా ఆందోళన చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. అందులో భాగంగానే అమరావతి నుంచి తిరుమల వరకు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు రైతులు. పాదయాత్ర అనుమతి కోసం అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని  ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. దీంతో రైతుల పాదయాత్రకు షరతులతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అమరావతి రైతులు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ మంత్రులు.. కారణం ఆయనేనా?  

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకునే వైసీపీ మంత్రులు.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుపై విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని గురువారం రాత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి  పేర్ని నాని కౌంటరిచ్చారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వారు ఇలాగే మాట్లాడతారని చెప్పారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని తెలిపారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించకూడదని సూచించారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.  రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని  సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది. 

వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్.. జ‌న‌సేనాని సొల్యూష‌న్‌..

గంజాయి సాగు కొంద‌రికీ ఉపాధి. గంజాయి దందా మ‌రికొంద‌రికి వ్యాపారం. గంజాయి స్మ‌గ్లింగ్‌పై ఉదాసీన‌త చాలామంది పెద్ద‌ల‌కు క‌న‌క‌వ‌ర్షం. ఇలా విశాఖ మ‌న్యంలో గంజాయి.. అంశాన్ని అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది. తాజాగా, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న గంజాయి అంశంపై వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి ట్విట‌ర్‌లో వైసీపీ తీరును ఏకిపారేశారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ట్విటర్ వేదికగా గంజాయి అంశంపై స్పందించారు. ‘‘ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదు, ఇది 15-20 ఏళ్లుగా ఉంది. నేను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది. YCP ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలి. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలి. సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలి’’ అంటూ 2018లో గంజాయి గురించి తాను మాట్లాడిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.

రూల్స్ పాటించకుండా అరెస్టు! పట్టాభి కేసులో ఇద్దరు పోలీసులపై వేటు..

తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. తర్వాత ఆయన అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదమైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు అతిగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. పట్టాభి అరెస్ట్ విషయంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించారు. రూల్స్ పాటించకుండా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. వాళ్లంతా ఇప్పుడు చిక్కులో పడ్డారు.  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అరెస్ట్ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకుంది. అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా సీరియస్ గా స్పందించింది. పట్టాభి అరెస్ట్ సమయంలో రూల్ ఆఫ్ లా పాటించలేదంటూ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై దృష్టిసారించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఏ పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించారనే దానిపై ఆరా తీశారు. చివరకు ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఆ పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీటీసీ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో, సీఐ నాగరాజును ఏలూరు రేంజ్‌ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సురేష్‌ను గవర్నర్‌పేట ఇన్‌చార్జి సీఐగా సీపీ శ్రీనివాసులు నియమించారు. పట్టాభికి బెయిల్‌ మంజూరులో అసంపూర్తి నోటీసులు, అయన నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు అంశాలు కీలకమయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్‌లో మాయం.. వ‌రంగ‌ల్‌లో ఈట‌ల‌ ప్ర‌త్య‌క్షం.. చంపుకుంటారో-సాదుకుంటారో!

హుజురాబాద్ హోరెత్తుతోంది. ప్ర‌చారం ముగిసినా.. డ‌బ్బుల‌ పందేరం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వాళ్లు ఓటుకు 6వేలు ఇస్తున్నారు-అంటున్నారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ ఇచ్చే ఆరు వేలు త‌మ‌కు అంద‌లేదంటూ మ‌హిళ‌లు ధ‌ర్నాకు దిగ‌డం ఆస‌క్తిక‌రం. ఆ రేంజ్‌లో సాగుతోంది డ‌బ్బుల పంప‌కం. అయితే, ఓట‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డంలో బీజేపీ బాగా వ‌న‌క‌బ‌డింద‌ని అంటున్నారు. ఈట‌ల త‌ర‌ఫు వాళ్లు ఓటుకు 1500 నుంచి 2 వేలు మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. అంత‌కుమించి ఇవ్వ‌డం లేద‌ని టాక్‌. ఆ ఇచ్చేది కూడా కొంద‌రికే అట‌. ఫ‌లానా వాళ్లు ప‌క్కాగా త‌మ‌కే ఓటేస్తార‌ని అనిపిస్తేనే.. డ‌బ్బులిస్తున్నార‌ట‌. లేదంటే లేదు. ఆ కాస్త డ‌బ్బులు కూడా ఇవ్వ‌కుండా ఇటు టీఆర్ఎస్ కేడ‌ర్‌, అటు ప్ర‌భుత్వ యంత్రాంగం బీజేపీ డ‌బ్బు పంపిణీని బాగా క‌ట్ట‌డి చేస్తున్నాయ‌ని అంటున్నారు. ఈట‌ల మ‌నుషుల చుట్టూ.. గులాబీ మ‌నుషులు మోహ‌రించి.. పైస‌లు పంచ‌కుండా అడ్డుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌డెన్‌గా హుజురాబాద్ నుంచి మాయ‌మ‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆయ‌న ఎక్క‌డికి వెళ్లారంటే.. మరికొద్ది గంటల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కేవ‌లం డ‌బ్బుల పందేర‌మే న‌డుస్తోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి ఎల‌క్ష‌న్ కోడ్ లేని వరంగల్ జిల్లాలో వాలిపోయారు. ఆయ‌న వ‌చ్చే స‌రికే ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌లు వ‌రంగ‌ల్‌లో ఈట‌ల కోసం ఓ హోట‌ల్‌లో వేచి చూస్తున్నారు.  వ‌రంగ‌ల్‌లోని హోటల్‌లో బీజేపీ నేతలు-ఈట‌ల రాజేంద‌ర్ సమావేశం కావాల్సి ఉంది. విలేక‌రుల స‌మావేశమూ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ భేటీని పోలీసులు అడ్డుకున్నారు. ఈటల హోటల్ లోపలికి వెళ్ల‌కుండా పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను వారించి రాజేందర్‌ను బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, రావు పద్మ తదితరులు హోటల్ లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈటల భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రజలతో 19ఏళ్ల బంధం నాది. చంపుకుంటరో-సాదుకుంటరో మీకిష్టం నేను చచ్చినా బతికినా మీవెంటే’ అంటూ ఆవేదన చెందారు.  

కేసీఆర్ పై భగ్గుమన్న ఓయూ.. తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్రలా? 

రాజకీయ నాయకుల అనాలోచిత వ్యాఖ్యలు ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తాయో ఉహించడం కష్టం. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ నాయకులు ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. అలాకాకుండా ముందు వెనకా చూసుకోకుండా నోటికి ఎదోస్తే అది, మాట్లాడితే ఇదిగో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసి వస్తుంది.  తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో, తమ గొప్పలు చెప్పుకునే క్రమంలో, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలో కూడా తెరాస పెట్టాలని కోరుతున్నారని, కుప్పలు, కుప్పలుగా విజ్ఞప్తులు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  దుమారం రేపాయి. ఏపీ మంత్రి పేర్ని నానీ, కేసీఆర్ వ్యాఖ్యలఫై స్పందిస్తూ చాలా  క్యాజువల్’ గా మళ్ళీ ఇక్కడో పార్టీ, అక్కడో పార్టీ ఎందుకు, రెండు రాష్ట్రాలను కలిపేస్తే, అక్కడా ఇక్కడా పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని మీరే ఎలుకోవచ్చును కదా ..అని అన్నారు.  ఇలా, కేసీఆర్ రేపిన తెనేపట్టుతో ఇప్పుడు ఉస్మానియాలో భగ్గుమంది. ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాలను కలపాలని కేసీఆర్,జగన్ లు కుట్ర చేస్తున్నారని విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. టిఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ తల్లి విగ్రహం బదులు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టి అమర వీరుల త్యాగాలను కేసీఆర్ కించపరిచాడని ఆరోపించారు. అలాగే కేసీఆర్;కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  నిజానికి కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదే. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే, కేసీఆర్ ప్లీనరీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్ధులు ఆయన కోరుకున్నవిధంగానే స్పందించారు, అయితే ఇది ఇంతటితో ఇది ఆగుతుందా, లేక మరోమారు బలిదానాల వరకు వెళుతుందా ..అనేది చూడవలసి ఉంది.

కుప్పంలో చంద్రబాబు షో.. ఫ్లెక్సీల ర‌చ్చ‌తో ఉద్రిక్త‌త‌..

కుప్పంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు షో. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బాబుకు ఘ‌న‌స్వాగ‌తం. బెంగ‌ళూరు విమానాశ్రయం నుంచి వ‌చ్చిన‌ చంద్రబాబుకు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని రాళ్లబూదుగూరు ద‌గ్గ‌రికి పెద్ద సంఖ్య‌లో తెలుగు త‌మ్ముళ్లు చేరుకున్నారు. త‌మ అభిమాన నేత‌ను ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో కుప్పంకు తీసుకొచ్చారు. చంద్రబాబు రాకతో రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.   ఇక‌, ఉద‌యం నుంచీ కుప్పంలో హైడ్రామా న‌డుస్తోంది. చంద్ర‌బాబు రాక‌ను త‌ట్టుకోలేని కుళ్లుబోతు వైసీపీ నేత‌లు.. బాబు ఫ్లెక్సీల‌ను చింపేశారు. లక్ష్మీపురంలో టీడీపీ బ్యానర్లను డ్యామేజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ద‌గ్గ‌ర‌ టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేయ‌గా.. వాటిని ధ్వంసం చేసే ప్ర‌య‌త్నం చేశారు దుండ‌గులు.  చంద్రబాబు గత పర్యటనలోనూ వైసీపీ వాళ్లు ఇలానే టీడీపీ ప్లెక్సీలు చింపివేశారు. అప్ప‌ట్లో బాబు బ‌స చేసిన గెస్ట్‌హౌజ్‌లో క‌రెంట్ కూడా నిలిపేశారు. జ‌న‌రేట‌ర్‌తో క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేశారు. ఈసారి సైతం ఫ్లెక్సీల‌ను చించేచి ర‌చ్చ రాజేశారు అధికారపార్టీ నేత‌లు. దీంతో.. బీపీ పెరిగిన తెలుగు త‌మ్ముళ్లు రోడ్డుపై నిర‌స‌న‌, ధ‌ర్నాకు దిగారు. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా ఉద్రిక్త‌త‌ల న‌డుమ చంద్ర‌బాబు కుప్పంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న మొద‌లైంది.   

ఊరంతా ఒక్కటై ఆ ముగ్గురిని చెట్టుకు కట్టేశారు.. కేటీఆర్ చూశారా?

"నా కడుపు నిండితే దరిద్రం పాయె" అని తెలంగాణలో ఓ సామెత ఉంది. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అలాంటి సామెతలే గుర్తుకొస్తాయి మరి. ప్రభుత్వాలు నడుపుతున్న పెద్ద సార్లందరూ పెద్దపెద్ద డీళ్లో మునిగిపోయి పేదోళ్ల ఆకలిని పట్టించుకోకపోతే జరిగే సామాజిక ఘోరాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఆరంభం మాత్రమేనని, సమస్య ముదురుతున్నకొద్దీ దాని సామాజిక పర్యవసానాలు మరింత ఘోరంగా ఉంటాయని, కళ్లు తెరవాల్సిన నాయకులు విస్మరిస్తే ఆ పరిణామాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యంగా పరిణమించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు చెప్పగానే టీఆర్ఎస్ యువనాయకుడు, ప్రభుత్వంలో నెంబర్ టూ గా చెలామణీ అవుతున్న కేటీఆర్ గుర్తుకొస్తారు. ఆయన నియోజకవర్గమైన సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ మండలంలో కొంతకాలంగా ఓ దొంగల ముఠా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. చేతికి పనిలేని, చిల్లిగవ్వా లేని కొందరు యువకులు తమ అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం సులభంగా ఆస్తులు కూడబెట్టాలని భావించారు. దీంతో వారంతా ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.  పత్తి ఏరిన తరువాత మార్కెట్ కు తరలించే ముందు సంచుల్లో నింపి పొలాల్లోనే పెడతారు. వాటిని అట్నుంచి అటే మార్కెట్ కు తరలిస్తారు. అలా పత్తితో నిండిన బోరాలు, గోనె సంచుల్లో నిల్వ ఉంచిన వరి పంటను ఈ దొంగల ముఠా ఎత్తుకుపోతోంది. అంతేకాదు.. కరెంటు మోటార్ల మీద కూడా వీరి ప్రతాపం చూపిస్తున్నారు. దేవాలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకెళ్లిన ఘటనలు కూడా ఇక్కడ జరిగాయి. దొంగల ముఠాను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా... వీరు మాత్రం పోలీసుల కళ్లుగప్పి హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాచర్ల గొల్లపల్లిలో కొందరు రైతులు పత్తి చేలో గోనె సంచుల్లో నిల్వ ఉంచిన పత్తి దొంగలపాలవడంతో వారు ఎంతో చాకచక్యంగా ఈ ముఠాను రెడ్ హేండెడె్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలోో కొందరు దొంగలు పారిపోగా ఈ ముగ్గురు మాత్రం దొరికిపోయారు. వీరి ద్వారా మొత్తం ముఠా సభ్యులను పట్టుకుందామని భావించిన రైతులు ఆ ముగ్గురిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేశారు. తీరిగ్గా పోలీసులకు అప్పగించారు. తాము వెదికి పట్టుకోవాల్సిన దొంగలను  రైతులే పట్టుకోవడంతో పోలీసుల పని సులభంగా మారింది. దొంగల్ని పట్టుకున్న రైతుల తెగువ, స్ఫూర్తిని పోలీసులు అభినందించారు.  ఒకప్పుడు వరుస బలవన్మరణాలతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల... తెలంగాణ వచ్చిన తరువాత అక్కడి మరమగ్గాలకు పని కల్పించింది. పెద్దసంఖ్యలో ఉన్న పద్మశాలీలకు మరమగ్గాలు నడిపించడం ద్వారా చేతినిండా కల్పించింది. ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలకు పెద్దఎత్తున ఆర్డర్లు ఇచ్చి భారీగా చీరలు తయారు చేయించింది. దీంతో గత మూడేళ్లుగా ఆత్మహత్యలు ఆగిపోయాయి. నేతన్నల బతుకుల్లో వెలుగులు పూస్తున్నాయని ప్రభుత్వం కూడా ఘనంగా చెప్పుకుంటోంది. అయితే అది నాణేనికి ఒకవైపు మాత్రమేనని, ఆ రెండోవైపు సమస్య తీవ్రత అలాగే ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. సిరిసిల్ల పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపేటలో ఈడుకొచ్చిన యువకులు చేతినిండా పనిలేక, అవసరాలు తీరే మార్గం లేక, అడిగితే ఇచ్చే నాథుడు లేక అసాంఘిక శక్తుల అవతారం ఎత్తుతున్నారు. ఈజీ మనీ కోసం ముఠాలు కట్టి దొంగతనాలు చేస్తున్నారు. ఇలా వదిలేస్తే వీరే రేపటి రోజుల్లో దోపిడీ దొంగలుగా తయారవుతారని స్థానికులు అభిప్రాయపుతున్నారు.  ఈడుకొచ్చి, పెళ్లి చేసుకొని ప్రయోజకులు అవ్వాల్సిన వయసులో ఎంతో భవిష్యత్తున్న యువకులు ఇలా దొంగలుగా మారితే అది నియోజకవర్గానికే గాక యావత్ రాష్ట్రానికే తలవంపులు తెస్తుందంటున్నారు. కేవలం పద్మశాలీల అవసరం తీర్చామని ఘనంగా చెప్పుకుంటున్న కేటీఆర్, తన నియోజకవర్గంలోనే వివక్షకు గురవుతున్న యువతరాన్ని పట్టించుకోకపోతే ఇక తెలంగాణలోని యువకులం సంగతేంటని ప్రశ్నిర్శిస్తున్నారు. తమకు చిక్కిన ముగ్గురు యువకుల ద్వారా మిగతా ముఠా సభ్యులను పట్టుకునేందుకు... ఆ దొంగలు రైతులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరి.. ఈ సమస్యను కేటీఆర్ ఓ చిన్న సంఘనటగా చూస్తారా.. లేక రానున్న సామాజిక సమస్యకు ఆనవాలుగా భావించి అడ్డుకట్ట వేయడానికి పూనుకుంటారా... అన్నది చూడాలి.

పంచ్ ప్రభాకర్ పై చర్యలేవి.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ 

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా విశాఖ సీబీఐ ఎస్పీ ఇవాళ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పంచ్‌ ప్రభాకర్‌ వీడియోలపై యూట్యూబ్‌కు లేఖ రాశామని ఆయన చెప్పడంతో..  తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పంచ్‌ ప్రభాకర్‌ను ఎవరో నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది. ఆయనపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలని.. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జ‌రుగుతున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా, పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తెలుగువారి  ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని గ‌ట్టిగా నిలదీసింది హైకోర్టు.  తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచ్ ప్ర‌భాక‌ర్‌కి కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. 

భ‌ర్త కాదు బ‌ద్మాష్‌.. భార్య‌కు టార్చ‌ర్‌.. ఇంత‌కీ ఏం చేశాడంటే..

వాడో వెద‌వ‌. భ‌ర్త ముసుగులో ఉన్న బ‌ద్మాష్‌. శాడిస్ట్‌. సైకో. ఉన్మాది. ఎంత తిట్టినా త‌క్కువే. భార్య‌ను కులం పేరుతో తిట్టేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. బ‌ట్ట‌లు విప్పించేవాడు. యూరిన్ తాగాల‌ని టార్చ‌ర్ చేసేవాడు. ప్రెగ్నెంట్ అయితే అబార్ష‌న్ చేయించాడు. ఇక చాలంటూ.. ఇక భ‌రించ‌లేనంటూ.. ఎట్ట‌కేళ‌కు ఆ భార్య ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. భ‌ర్త వేధింపులపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో జ‌రిగిన ఈ కేసు సంచ‌ల‌నంగా మారింది. తనను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొడుతూ అర్ధ నగ్నంగా ఉండమంటాడని, మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని ఆ మహిళ తన భర్త ఆగడాలపై జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. అతని కుటుంబ సభ్యులూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.  నారాయణపేట మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఆమెకు 2016లో ఓ యువకుడితో ప్రేమ వివాహమైంది. గర్భం దాల్చినా గర్భస్రావం చేయించారు. భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్‌ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవారు. అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ ప‌దే పదే వేధించేవారు. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ఆ భార్య‌. ఆమె ఫిర్యాదు మేర‌కు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు.    

కుప్పంలో ర‌చ్చ‌.. ప‌ట్టాభి కేసులో పోలీస్ యాక్ష‌న్‌.. ఓటుకు ఎన్నినోట్లు? టాప్‌న్యూస్ @1pm

1. కుప్పంలో పెక్సీల రగడ కలకలం రేపుతోంది. లక్ష్మీపురంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ బ్యానర్లు చింపేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ద‌గ్గ‌ర‌ టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల‌ను చింప‌డంపై టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. చంద్రబాబు గత పర్యటనలోనూ దుండగులు ఇలానే ప్లెక్సీలు చించేశారు.  2. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. అరెస్ట్‌ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఏసీపీ రమేష్, సీఐ నాగరాజును విధుల నుంచి తప్పించారు. అరెస్టు సమయంలో ఖాళీలతో నోటీస్ ఇవ్వడంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేయ‌డంతో వారిద్ద‌రి బదిలీ జరిగినట్టు తెలుస్తోంది.  3. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ డబ్బు మనిషని, ఆయనకు ఏమి తెలుసునని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ విమర్శించారు. పీకే జర్నలిస్టులను పక్కన పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడమేంటి.. ఆయన ఓ బచ్చగాడని మండిప‌డ్డారు. 4. పోలింగ్‌కు ముందు హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. వీణవంకలో ఇతర ప్రాంతాల వాళ్లు డబ్బుల పంపిణీ చేస్తుండ‌గా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌లు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలు సైతం డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు 6వేలు ఇస్తుంటే.. బీజేపీ మాత్రం రూ.1500-2000 మాత్ర‌మే ఇస్తున్నారని స్థానికుల మండిపడుతూ.. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.  5. కడప జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌లోనూ భారీగా వర్షం ప‌డుతుండ‌టంతో.. శ‌నివారంనాటి పోలింగ్‌కు ఆటంకం ఇబ్బంది అవుతుందేమోన‌ని నేత‌లు, అధికారుల్లో ఆందోళన వ్య‌క్తం అవుతోంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బందికి గొడుగులు, రెయిన్ కోట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 6. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 300 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో ర‌ఘునంద‌న్‌రావును హౌజ్ అరెస్ట్ చేశారు.  7. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే ఆమె 100 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటేశారు. శుక్రవారం 10వ రోజున వైఎస్ షర్మిల పాదయాత్ర ఇబ్రహీంపట్నం నుంచి సీతంపేట, నోముల, లింగంపల్లి, మంచాల, చాంద్‎ఖాన్ గూడ,అస్మతపూర్‎లో కొనసాగుతోంది.  8. ఎల్బీనగర్‌లో ఎస్.ఓ.టి పోలీసులు మ‌రోసారి భారీగా గంజాయి ప‌ట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగ్‎పూర్‎కు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.  9. గోవాకు తాము ముఖ్యమంత్రి అయ్యేందుకు రాలేదని, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ దాదాగిరిని అడ్డుకునేందుకు వచ్చామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న మ‌మ‌తా.. గోవా, బెంగాల్‌ మధ్య చేపలు, ఫుట్‌బాల్‌‌కు మధ్య ఉన్న సంబంధం ఉందని అన్నారు. కేంద్రం పిడికిలి నుంచి గోవాను రక్షిస్తానని పిలుపిచ్చారు.  10. డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హిట్ కొట్టిన అజ‌య్‌.. సెకండ్ మూవీ 'మహా సముద్రం' ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో నెటిజ‌న్స్‌ మూవీ రిజల్ట్ గురించి నిల‌దీస్తుండ‌టంతో.. అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. ‘మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. ఈసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను’.. అని ట్వీట్ చేశారు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.   

తెలుగు రాష్ట్రాలు  ఏకమవుతాయా?  రెచ్చగొట్టే రాజకీయమా? 

ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఏకమవుతాయా? ఇటు నుంచి మహా రాష్ట్ర, అటునుంచి కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాలు కూడా వచ్చి తెలంగాణలో చేరిపోతున్నాయా? అదేమో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పీఠాలు కదులుతున్నాయి. అందుకే కావచ్చు, మళ్ళీ సెంటిమెంట్స్’ను రెచ్చగొట్టి అసలు సమస్యలను పక్కదారి పట్టించే వికృత రాజకీయ క్రీడకు  రెండు రాష్ట్రాల పాలక పక్షాలు తెరతీస్తున్నాయని అంటున్నారు.  ఆంధ్రాలోనూ తెరాస పార్టీ పెట్టాలని అక్కడి అక్కడి ప్రజలు కోరుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  పార్టీ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. నిజానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ వేదిక నుంచి పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించలేదు. హుజూరాబాద్ ఓటర్లను ఉద్దేశించి ఉప ఎన్నిక ప్రచార ఉపన్యాశం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్’ను ఎంతో కొంత రెచ్చగొట్టేందుకు, పనిలో పనిగా దళిత బంధు విషయంలో హుజూరాబాద్ ఓటర్ల అనుమానలను తొలిగించే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నాయకులు కొంచెం ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. ముందు ‘ఆల్ ఇన్ వన్’ సలహదారు సజ్జల, ఆ తర్వాత ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. అయితే  మంత్రి వర్గ సమావేశం తర్వాత బహుశా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సలహా మేరకు కావచ్చు, మంత్రి నానీ, కథను కొత్త మలుపు తిప్పారు.“ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’’ అని పేర్ని నాని ట్విస్ట్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడానికి తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌ తరఫున తాము సహకరిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.  అయితే ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదు. ఆ విషయం కేసీఆర్’కు మంత్రి నానీకి తెలుసు. అయినా, ఉప ఎన్నిక సమయంలో ఉభయ ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యాలు చర్చకు రాకుండా, కేసీఆర్ సెంటిమెంట్ తేనే తుట్టెను రేపారు. అయితే, సెంటిమెంట్ ఆధారంగా  పుష్కరకాలానికి పైగా సాగిన తెలంగాణ, సమైఖ్య ఆంధ్ర ఉద్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాయో గుర్తుచేసుకుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ సెంటిమెంట్స్ రెచగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా అది నేరం కాదు మహాపరాధం అవుతుంది.

SP నాయక్ కి డాక్టరేట్.. తెలుగువన్ యాంకర్ కి గౌరవం

బంజారా మాట పాటకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగువన్ టోరిబంజారా యాంకర్ SP నాయక్ అలియాస్ సోమ్లా దాదా శీనుకు బెంగుళూర్ లోని ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. బంజారా పాటల మాంత్రికుడిగా పేరున్న ఎస్పీ నాయక్.. బంజారా నటుడిగా కూడా గుర్తింపు పొందారు. బంజారా మొటివేషన్ స్పీకర్ గా, వక్తగా కూడా ఆయనకు మంచి పేరుంది.  బంజారా జాతికోసం ఎన్నో పాటలు పాడారు ఎస్పీ నాయక్. వాళ్లకు అర్ధమయ్యేలా ఎన్నో పాటలు రాశారు. బంజారా జనాల విధివిధానాలపై  చిన్న చిన్న సినిమాలు తీశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జనాలకు  అర్ధమయ్యే రీతిలో వీడియోలు తీశారు. స్వచ్చంద కార్యక్రమలు చేస్తూ పేదలకు తనకు తోచిన సహాయం అందించారు ఎస్పీ నాయక్. బంజారా జాతికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి గౌరవ డౌక్టరేట్ ప్రకటించింది బెంగళూరు యూనివర్శిటీ.  ఎస్పీ నాయక్ బంజారా Tv ఛానల్లో యాంకర్ గా చేసారు. ఇప్పటికే అదే చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగువన్ టోరిబంజారా యూట్యూబ్ ఛానల్లో యాంకర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు తెలుగువన్ CMD కంఠంనేని రవి శంకర్ గారు, ఇంచార్జి సుబ్బు ప్రోత్సాహం వల్ల చాలా కార్యక్రమలు చేస్తున్నారు. టోరిబంజారా ఛానలో తాను డైరెక్టర్ గా వ్యవరిస్తూ అశోక్ రాథోడ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేసున్నారు ఇప్పుడు బంజారా జాతీ ఖ్యాతి ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి తమవంతు పనిచేస్తు ముందుకు పోతున్నారు. ఇప్పటి వరకు Sp నాయక్  మూడు వేల పాటలు రాసి పాడారు ఇంకా చాలా బంజారా సినిమాల్లో నటించారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. అనేక వేదికలపై కాలికి గజ్జెకట్టి ఆడారు పాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది కి సాంస్కృతిక పరిధిలో ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఎస్పీ నాయక్ కు మాత్రం రాలేదు. అయినా నిరాశపడకుండా తమ ప్రతిభతో ముందుకు సాగారు. తనకు పాటలు పడడం అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని చెప్పారు ఎస్పీ నాయక్. 

స్నేహ‌మే జీవితం.. దూర‌మ‌వ‌డంతో ముగ్గురి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

గంగజల, మల్లిక, వందన. ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ద‌గ్గ‌రి బంధువులు. ఒకే ఊరు. ఒకే వాడ‌. చిన్న‌ప్ప‌టి నుంచీ క‌లిసిమెలిసి పెరిగారు. తిరిగారు. ఆడారు. పాడారు. చ‌దువుకున్నారు. ఆ ముగ్గురూ వేరు వేరు కాదు.. ఒక్క‌రే అనేలా జీవించారు. అలా 19ఏళ్లు గ‌డిచాయి. పెళ్లీడుకు రావ‌డంతో రెండు నెల‌ల క్రితం ప‌రిస్థితి మారిపోయింది. తాజాగా వారి స్నేహ జీవితం విషాదాంతమవ‌డం జ‌గిత్యాల‌లో క‌ల‌క‌లంగా మారింది.    ఇటీవలే ఆ ముగ్గురిలో గంగజల, మల్లికల‌కు పెళ్లి చేశారు ఇంట్లోవాళ్లు. ఆగ‌స్టులో మూడు రోజుల గ్యాప్‌లోనే వాళ్లిద్ద‌రి వివాహం జ‌రిగింది. రెండు నెల‌లు గ‌డిచాయి. ఈ రెండు నెల‌లు ఆ ఇద్ద‌రూ అత్తారింట్లో ఉండ‌టం.. ఆ ముగ్గురూ ఒక‌రినొక‌రు క‌లుసుకోకుండా ఉండ‌టం వాళ్లు త‌ట్టుకోలేక‌పోయారు. ఒక‌రు లేకుండా ఇంకొక‌రు ఉండ‌లేక‌పోయారు. క‌ట్ చేస్తే.. ఆ ముగ్గురూ చెరువులో శ‌వ‌మై తేల‌డం విషాదం.  పెళ్లయిన ఇద్దరు యువతులు వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండున్న‌ర ప్రాంతంలో ఆ ముగ్గురూ ఇళ్లలోంచి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొర‌క‌లేదు. గురువారం ఉదయం ధర్మసముద్రం రిజర్వాయర్‌లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ముగ్గురూ క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలుస్తోంది.  ‘అనారోగ్యం కారణంగానే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని’ గంగ‌జ‌ల‌, మ‌ల్లిక‌ల‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ముగ్గురి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి కావ‌డంతో ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇలా 19 ఏళ్ల‌ వారి స్నేహం..జీవితం.. ఒక్క‌సారిగా విషాదాంతం అవ‌డం గురించి తెలిసిన వారంతా క‌లత చెందుతున్నారు.