సినిమా హాల్లో మంత్రి.. కేసీఆర్ నుంచి ఫోన్.. పరుగో పరుగు..
posted on Nov 1, 2021 @ 1:44PM
ఆయన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. నిత్యం వివిధ కార్యక్రమాలతో, బాధ్యతలతో బిజీ బిజీగా ఉంటారు. ఊపిరి సలపని పని ఉంటుంది. ఇటు హైదరాబాద్లో, అటు సొంత నియోజకవర్గంలో అనేక ప్రొగ్రామ్స్ లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి మంత్రి ఎర్రబెల్లి.. కాస్త రిలాక్స్ అవుదామనుకున్నారు. రెబెల్ యాక్టర్ నారాయణమూర్తి రిక్వెస్ట్ తో ఆయనతో కలిసి వరంగల్లో ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. అయితే.. సినిమాకు వచ్చిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీన్ కట్ చేస్తే.. హుటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు ఎర్రబెల్లి. ఇంతకీ ఏం జరిగింది? మంత్రి అంత సడెన్ గా సినిమా హాల్ నుంచి హైదరాబాద్ కు ఎందుకు బయలు దేరాల్సి వచ్చింది? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి వరంగల్లోని అమృత థియేటర్కు వచ్చారు. సినిమా స్టార్ట్ అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్కు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. సినిమా చూడకుండానే మంత్రి ఎర్రబెల్లి అర్జెంట్గా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అట్నుంచి అటే హైదరాబాద్ బాట పట్టారు.
అంతకుముందు, మంత్రి ఎర్రబెల్లి, నటుడు నారాయణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. నారాయణమూర్తి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. రైతన్న సినిమాతో రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా ‘రైతన్న’ అని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు.