రెండో మ్యాచ్ లోనూ కోహ్లీ సేన చిత్తు.. నమీబియా కన్న చివరన భారత్..
posted on Oct 31, 2021 @ 10:07PM
కోట్లాది మంది ఆశలు ఆవిరి చేస్తూ టీమిండియా మరోసారి చేతులెత్తేసింది. కోహ్లీ సేన ఇంకోసారి అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందిటీట్వంటీ ప్రపంచ కప్ లో మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది భారత క్రికెట్ జట్టు. కివీస్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 టేబుల్ లో మరింత వెనకబడి ఐదో స్థానానికి పడిపోయింది.
భారత జట్టు విధించిన 110 పరుగుల లక్ష్యాన్ని సునాయసనంగా చేధించింది కివీస్ జట్టు. కివిస్ తొలి వికెట్ త్వరగానే పడిపోయినా.. రెండో వికెట్ కు మిచెల్ , విలియమ్సన్ అద్భుతంగా ఆడారు. మిచెల్ అవుటైనా విలియమ్సన్ మిగితా పని పూర్తి చేశారు. కివీస్ కేవలం 14. 2 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేనకు ఏ దశలోనూ కలిసి రాలేదు. బ్యాటింగ్ వైఫల్యం మరోమారు కొట్టొచ్చినట్టు కనిపించింది. న్యూజిలాండ్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసి బలమైన ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 70 పరుగులకే ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9) వంటి కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదుకుంటాడనుకున్న పంత్ (12) కూడా బ్యాటెత్తేశాడు. హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (26, నాటౌట్) చివర్లో కాసేపు క్రీజులో కుదురుకోవడంతో భారత్ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2 వికెట్లు తీసుకోగా, సౌథీ, మిల్నేచెరో వికెట్ తీసుకున్నారు.