వరి పోరాటం ఏమైంది.. ఢిల్లీలో కేసీఆర్ పనేంటీ? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఒకటి రెండురోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో వడ్ల పంచాయతీ తేల్చుకుని, వచ్చే యాసంగి పంటల పై  క్లారిటీ ఇస్తానని డెల్లి వెళ్ళీ ముందు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అయినా ఇంతవరకు, కేంద్ర మంత్రులు ఎవరినీ కలవ లేదని సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి బృందం సోమవారం క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. తుగ్లక్  రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో రెస్ట్  తీసుకున్నారు. అలాగే, కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్ళిన  మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వారికంటే ముందు రోజే ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సీఎంతోనే ఉన్నారు.  కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించి ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మూడు రోజులు అయినా, ఇంకా శంఖారావం పూరించక పోవడం ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.  హైదరాబాద్’లో వరసగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తీవ్రంగా విమర్శించి, చూపిస్తా తడాఖా అంటూ ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి, రెండురోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార ప్రతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ ఇచ్చినట్లే ఇచ్చి లేదు పొమ్మన్నా, ముఖ్యమంత్రి కేసేఅర్, మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.  అయితే ప్రధాని మోడీ, కేంద్ర ఆహర, పౌర సరఫరాల శాఖ  మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం  కోరినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అలాగే, ఒకటి రెండురోజుల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ వస్తుందిని తెరాస నేతలు అంటున్నారు. కాగా, ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు, సీఎస్, ఆయా శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై సమీక్ష చేసినట్టు సమాచారం. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీతో సీఎస్ భేటీ అయ్యారు. కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సుధాన్ష్ పాండేతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కృషి భవన్ లో జరిగిన సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సివిల్ సప్లైయర్స్ కమిషనర్ అనిల్ కుమార్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కోటా పెంచాలని కోరినట్లు సమాచారం.40 లక్షల టన్నులకు బదులుగా 90 లక్షల టన్నుల బియ్యం కొనాలని, గతంలో చేసిన విజ్ఞప్తినే మళ్ళీ చేశారు. రాష్ట్రంలో రైతులు ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్నారు. యాసంగిలో వారి వేయాలా వద్దా అనే విషయంలో ముఖ్యమంత్రి వచ్చి క్లారిటీ ఇస్తారని, అదే విధంగా   వర్షాలలో తడిసి ముద్దాయి పోతున్న వర్షాకాలం పంట కొనుగోలు వేగం పుంజుకుని తమకు కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తారనే దానిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేక పోతున్నారు. ప్రధాని, మంత్రులు అప్పాయింట్మెంట్ ఇచ్చేవరకు అక్కడే ఉంటారా లేక ఢిల్లీ వెళ్ళిన స్వకార్యం పూర్తి చేస్కుని వేనుతిరుగుతారా అనేది అధికారులు కూడా చెప్పలేక పోతున్నారు.

గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స 

ప్రజా పోరాటాల్లో తనదైన శైలిలో దూసుకుపోతే సీపీఐ  కార్యదర్శి నారాయణ.. అనంతపురం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అయితే వరద ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో కాలు జారి కింద పడ్డారు నారాయణ. ఆయన కాలు బెణకడంతో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆయన చికిత్స చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారాయణ కాలికి గాయం అవ్వడంతో అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రాధమిక చికిత్స చేశారు.  రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరుకు చేరుకున్న నారయాణ రాయల చెరువు కట్టను పరిశీలించేందుకు కొండను ఎక్కారు. కొండ దిగే సమయంలో నారాయణ జారి పడ్డారు. కాలు బెణకడంతో నారాయణ అక్కడే కూర్చుండి పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ అదే ప్రాంతానికి వైసీపీ నేతలు పర్యటనకు వచ్చారు. మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చారు. అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే డాక్టర్ అయిన గురుమూర్తి నారాయణకు ఫిజియోథెరపీ చేశారు. కట్టు కట్టారు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తన వాహనంలో నారాయణను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

జగన్ కు ఝలక్.. మడమ తిప్పడమే.. దిక్కులేని సీఎం.. టాప్ న్యూస్@8PM

టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. -------- ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సొంత కులానికి ముఖ్యమైన 1600 ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టుకుని సీఎం జగన్ వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సీఎం జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. సామాజిక‌ న్యాయం గురించి జగన్ మాట్లాడొద్దని, సిగ్గుతో ఆ ప‌దం ఆత్మ‌హ‌త్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ‘‘నీ కులం కుతంత్రం, నీ మ‌తం మార‌ణ‌హోమం, నీ ల‌క్ష్యం విధ్వంసం’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  --------- ఆనాడు మెజారిటీ లేదని కౌన్సిల్ రద్దుచేస్తామన్న ప్రభుత్వం.. ఈనాడు వైసీపీ మెజారిటీ పెరిగిందని మాటతప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వమేనని గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దు, ఏర్పాటు అనేది రాష్ట్రాల చేతిలో ఉండదన్నారు. మెజార్టీ పెరిగిందనే కౌన్సిల్ రద్దుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. 3 రాజధానుల బిల్లుని తిరిగి ఆమోదించుకోవడానికే కౌన్సిల్ అవసరం వచ్చిందన్నారు.  --------- కడప జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో 13 మంది సర్పంచ్‌లు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించినందుకు నిరసనగా సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు.  ------- ఏపీకి దశ తిరిగిందనుకుంటే దురదృష్టంగా మారిపోయిందని సీపీఐ నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చే వరకు వైసీపీ నిద్రపోదన్నారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నామని తెలిసే బిల్లును వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని అంశాన్ని మళ్లీ కాలయాపన చేస్తారని చెప్పారు. వైసీపీ తప్పులు చేసి దానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉండదని, వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే నష్టపోతున్నామని మండిపడ్డారు.  ---------- కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక బుధవారం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ సీపీ.. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినప్పటికీ ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించింది --------- దేశంలోని 11 పోర్టుల సమన్వయంతో క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పోర్టు, టూరిజం శాఖ అధికారులతో నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూయిస్ టెర్మినల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఏపీ టూరిజం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. -------- ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తా అంటున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు ------------ శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దుబాయ్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.18 లక్షల విలువైన బంగారం, ఐ ఫోన్‌లను పట్టుకుని సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న  ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ---- సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. గతంలోని యూపీఏ ప్రభుత్వం స్పందించే తత్వం లేనిదని, నిరుపయోగమైనదని, కనీసం దేశ భద్రత గురించి కూడా ఆ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఈ పుస్తకాన్నిబట్టి స్పష్టమవుతోందని ఆరోపించింది. 

జ‌గ‌న్‌కి ఎందుకింత కక్ష?.. ర‌ఘురామ నిల‌దీత‌..

అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా తేడా ఉంది. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.  ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష? రాజధాని అంటే ఏం చెప్పాలి? ఎక్కడని చెప్పాలి? రాయలసీమ రాజకీయాలు మానేసి అభివృద్దిపై ఫోకస్‌ పెట్టండని ఎంపీ ర‌ఘురామ విమ‌ర్శించారు. పది రోజుల్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని గ్రహించిన సీఎం జగన్‌.. 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నార‌ని ఆరోపించారు. రాజధాని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉందని.. న్యాయస్థానం న్యాయం చేయాలని అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.    మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3లక్షల కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు. ఎక్కడ దేనికి ఎంత ఖర్చు చేశారు? ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశామా? అంటే ఏదీ లేదు. సవ్యంగా నడిచే ఇసుక పాలసీని నాశనం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధానికి సంబంధం లేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ ఎక్కడ ఉంది. హైదరాబాద్‌ నిజాం హయాంలోనే మహానగరం.  చెన్నై, ముంబై బ్రిటీష్‌ కాలంలోనే మహానగరాలు.  ఏ ముఖ్యమంత్రి ఉంటే విశాఖపట్నానికి పోర్టు వచ్చింది అని గ‌తాన్ని గుర్తు చేశారు. ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని  శాసన మండలి రద్దు చేస్తామన్నారు. నెల క్రితం కిరణ్‌ రిజుజును కలిసి మండలి రద్దు విషయం వారి దృష్టికి తీసుకెళ్లారని ర‌ఘురామ చెప్పారు. అంత‌లోనే మండ‌లి ర‌ద్దుపై వెన‌క్కి ఎందుకు త‌గ్గార‌ని నిల‌దీశారు. ఇక‌, రాష్ట్రంలో 95శాతం మున్సిపాలిటీలు గెలిచాం.. ఒక్క కొండపల్లి మున్సిపాలిటీ పోతే ఏమవుతుంది? అని ప్ర‌శ్నించారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. 

పెట్రో ధరలపై కేంద్రం సంచ‌ల‌నం!.. ఎమ‌ర్జెన్సీ కోసం దాచింది వెలికితీత‌!

పాకిస్తాన్‌తో యుద్ధం రావొచ్చు. చైనాతో జ‌గ‌డం ముద‌రొచ్చు. గల్ఫ్ వార్ జ‌ర‌గొచ్చు. ఆయిల్ కంట్రీస్ నుంచి దిగుమ‌తులు ఒక్క‌సారిగా ఆగిపోవ‌చ్చు. అలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు వ‌స్తే.. దేశంలో చ‌మురు నిల్వ‌ల స‌మ‌స్య రాకుండా.. ముందు జాగ్ర‌త్త‌గా ఇండియా.. ముడి చ‌మురును పెద్ద ఎత్తున నిల్వ చేసింది. ఇలా అనేక దేశాలు చేస్తుంటాయి. ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు వ‌స్తే.. ఆ ఆయిల్‌ను వాడుకోవ‌చ్చ‌నేది వ్యూహం.  తూర్పు, పశ్చిమ తీరాల్లో.. మూడు ప్రాంతాల్లో భారత్‌కు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇంధ‌న ధ‌ర‌లు భారీగా పెరిగిన నేప‌థ్యంలో.. ఆ బ‌ఫ‌ర్ స్టాక్ నుంచి కొంత ఆయిల్‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని యోచిస్తోంది. దేశంలో ఇంధ‌న స‌ర‌ఫ‌రా పెంచి.. ధ‌ర‌లు కాస్త నియంత్ర‌ణ‌లో ఉంచాల‌ని భావిస్తోంది.  ఇటీవ‌లే పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం త‌న‌వంతు ట్యాక్స్‌ను కాస్త త‌గ్గించుకుంది. అయినా, పెట్రో ధ‌ర‌లు సెంచ‌రీ దిగిరాక‌పోవ‌డంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. మ‌రోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ పెట్రో ప్రైజెస్ పెరిగితే.. బీజేపీకి బిగ్ డ్యామేజ్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భ‌య‌ప‌డుతోంది. అందుకే, చ‌మురు నిల్వ‌ల నుంచి చ‌మురు బ‌య‌ట‌కు తీసే దిశ‌గా అడుగులు వేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు స‌మాచారం. వచ్చే వారం-ప‌ది రోజుల్లో చమురును బయటకు తీయనున్నట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే మ‌రింత ఆయిల్ కూడా వాడుకోవాల‌ని ఆలోచిస్తోంది. ఈ ముడి చమురును ‘మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌)’, హెచ్‌పీసీఎల్‌కు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆ మేర‌కు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.  

13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో జగన్ కు దిమ్మతిరిగే షాక్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాలోనే ఆయన వైసీపీ నేతలు ఝలక్ ఇచ్చారు. ఏకంగా 13 మంది సర్పంచులు వైసీపీకి రాజీనామా చేశారు. వైయస్సార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు.. పత్రికా ప్రకటన విడుదల చేశారు 13 మంది సర్పంచులు. సొంత సొంత గడ్డలో 13 మంది సర్పుంచులు రాజీనామా చేసిన ఘటన కడప జిల్లాతో పాటు ఏపీలో సంచలనంగా మారింది.  కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైయస్సార్ పార్టీ కి మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు  13 మంది సర్పంచులు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు సర్పంచులు.  ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై... కేవలం వైయస్సార్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు గా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తమ గ్రామ పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతు లను, శానిటేషన్ కార్యక్రమం తో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లు గా పత్రికా ప్రకటనలో తెలియజేశారు. 

పంచాయతీ నిధులు ఎత్తుకుపోయిన జగనన్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. డబ్బుల్లేక నిలువెత్తు గోతిలోకి దిగిపోయిన సర్కార్ పలు శాఖల్లోని నిధులు భయపెట్టి, బెదిరించి తరలించుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా గ్రామ పంచాయతీ నిధులను కూడా ఖాళీ చేసేసింది. ఒక్క రోజులో వందల కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ స్వాహా చేసిందనే లెక్కలు బయటికి వస్తున్నాయి. అనేక పంచాయతీల ఖాతాల్లోని కేంద్ర ఆర్థిక సంఘం నిధులను తీసేసుకుంది. కొన్ని గ్రామ పంచాయతీల్లోని ఎక్కువభాగం నిధులు పట్టుకుపోగా.. మరి కొన్ని పంచాయతీల్లోని నిధుల్ని జీరో చేసేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం రెండు విడతలుగా 965 కోట్ల రూపాయలు జమచేసింది. ఇలా ఆర్థిక సంఘం వేసిన నిధుల్ని గ్రామంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేద్దామని సర్పంచ్లు సమాయత్తమవుతున్న సమయంలోనే ఏపీ సర్కార్ గుట్టుచప్పుడు కాకుండా తరలించేంది. పంచాయతీ సర్పంచ్ల ముందస్తు అనుమతి లేకుండానే, వారికి చెప్పకుండానే నిధులు తీసుకుపోవడం గమనార్హం. ఏ పంచాయతీ నుంచి ఏ మేరకు నిధులను రాష్ట్ర సర్కార్ తీసుకుపోయిందనే సమాచారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారుల వద్ద కూడా జవాబు లేకపోవడం ఆశ్చర్యపరిచే అంశం. గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయిన ఆ నిధులను ప్రభుత్వం ఏ అవసరాలకు వినియోగిస్తోందనే విషయం కూడా వారికి ఏమాత్రం ఎరిక లేదట. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో 345 కోట్ల రూపాయలు తీసేసి విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. అయితే.. తాజాగా తరలించుకుపోయిన నిధులను అలాంటి కారణంతోనే తీసిందా? లేక ప్రభుత్వం మరింకెందుకైనా మళ్లించిందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్లు అవాక్కయ్యారు. గ్రామాల రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేక అల్లాడిపోతున్నారు. కొన్ని పంచాయతీల సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శలకు దిగుతున్నారు. మరికొందరు సర్పంచ్లు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదల అయిన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాల్లోంచి అకస్మాత్తుగా మినహాయించిన ప్రభుత్వం విద్యుత్ చార్జీలు చెల్లించడంతో సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్లో సర్పంచ్లు 60 డబ్బులను పారిశుధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మతులు, కార్మికుల జీతాలు, పంచాయతీల అభివృద్ధికి ఖర్చుచేశారు. ఇక శనివారం ఆయా పంచాయతీల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపించడంతో సర్పంచ్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర సర్కార్ వాపస్ తీసుకుందని నిరసిస్తూ విశాఖ జిల్లా అరకు లోయలో పలువురు సర్పంచ్లు, వార్డు సభ్యులు భిక్షాటన చేయడం అందర్నీ ఆలోచింపజేసింది. పెదలబుడు పంచాయతీ ఖాతాలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం 56 లక్షలు డ్రా చేసుకుందని సర్పంచ్ దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం తమ గ్రామానికి ఇటీవలే విడుదల చేసిన మొత్తం 76 లక్షల రూపాయలు కూడా జగన్ సర్కార్ లాగేసుకుందని వాపోయారు ఆయన. పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం బిల్లులు అప్లోడ్ చేస్తున్న తరుణంలోనే తమ తమ పంచాయతీ ఖాతాల్లోని డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసిందని సర్పంచ్లు అయోమయానికి గురవుతున్నారు.పంచాయతీల నిధులు ప్రభుత్వం చెప్పా పెట్టకుండా వెనక్కి తీసుకోవడాన్ని సర్పంచ్లతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నామో పోయామో చూట్టానికి వచ్చారా.. మంత్రిని తరిమికొట్టిన వరద బాధితులు.. 

నెల్లూరు జిల్లాలు వర్షాలు తగ్గినా వరద బాధలు మాత్రం కొనసాగుతున్నాయి. ముంపు గ్రామాల్లో ఇప్పటికి దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ప్రాంతాల్లో అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి బాలినేనితో పాచు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, కలెక్టర్ చక్రధర్ ను తరిమి తరిమి కొట్టారు నెల్లూరు జిల్లా వరద బాధితులు. తామంతా  నష్టపోయిన తర్వాత సినిమా చూడటానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే,  కలెక్టర్ పై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు వరద బాధితులు. దీంతో పోలీసులు మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ను అతి కష్టం మీద అక్కడి నుంచి తరిలించారు. 

కేటీఆర్‌కు క‌విత చెక్‌!.. పంతంప‌ట్టి ఎమ్మెల్సీ.. నెక్ట్స్ మంత్రి?

క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో కుంప‌టి. ఆ కుంప‌టి.. వేరుకుంప‌టిగా మార‌కుండా ఆస‌క్తిక‌ర ట‌ర్న్‌లు తీసుకుంటోంది. కేటీఆర్‌, క‌విత‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. క‌విత‌ను దాదాపు దూరం పెట్టేశారు. క‌విత సైతం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు బాగా దూరంగా ఉండిపోయారు. ఆ గ్యాప్ బాగా పెర‌గ‌డం.. దారం తెగేదాకా లాగుతుండ‌టం.. అస‌లుకే ఎస‌రు అనుకున్నారో ఏమో.. ఆ ముగ్గురు కాస్త త‌గ్గారు. క‌విత విష‌యంలో ఓ అండ‌ర్‌స్టాండింగ్‌కు వ‌చ్చారని అంటున్నారు.   క‌విత‌కు ప్రాధాన్యం ఇస్తే ఓకే. కానీ, ఇక్క‌డ కాదు. రాజ్య‌స‌భ‌కు పంపించాలి. ఢిల్లీకి ప‌రిమితం చేయాలి. అంటూ కేటీఆర్ కండీష‌న్ పెట్టార‌ని తెలుస్తోంది. కొడుకు మాట కాద‌న‌లేని కేసీఆర్‌.. కేటీఆర్‌కు రూట్ క్లియ‌ర్ చేసేందుకు క‌విత‌ను రాజ్య‌స‌భ రేసుకు సిద్దం కావాల‌ని చెప్పార‌ట‌. కానీ, క‌విత ఆయ‌న కూతురే క‌దా.. అత‌ని సోద‌రే క‌దా.. అందుకే, ఆమె సైతం అంతే ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. రాజ్య‌స‌భ వ‌ద్దంటే వ‌ద్దు.. రాష్ట్ర‌మే ముద్దు.. అంటూ పంతం ప‌ట్టార‌ట‌. త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌మంటే చేయ‌ట్లేదు.. అన్న‌కే అన్నీ ఇచ్చేస్తున్నారు.. పైగా రాష్ట్రంలోనే లేకుండా చేయాల‌ని చూస్తున్నారంటూ.. అంటూ తండ్రి ద‌గ్గ‌ర లొల్లిలొల్లి చేసింద‌ట కూతురు.  ఓవైపు గారాల ప‌ట్టి. ఇంకోవైపు రాజ‌కీయ‌ వార‌సుడు. కొడుకు-కూతురు ఆధిప‌త్య పోరుతో స‌త‌మ‌త‌మైన కేసీఆర్‌.. చివ‌రాఖ‌రికి మ‌ధ్యే మార్గంలో మరో ఆప్ష‌న్‌కు ఒప్పుకున్నార‌ట‌. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించేయాల‌నే ఎత్తుగ‌డ‌ను క‌విత పంతం ప‌ట్టి మ‌రీ చిత్తు చేశార‌ట‌. అప్ప‌టికే నిజామాబాద్ బ‌రి నుంచి ఆకుల ల‌లిత పేరును ఖ‌రారు చేసినా.. ఆఖ‌రి నిమిషంలో క్యాన్సిల్ చేయించార‌ట‌. కూతురు డిమాండ్ మేర‌కు.. కేసీఆర్ దిగొచ్చి.. కేటీఆర్ వ‌ద్దంటున్నా.. క‌విత‌నే మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తున్నారు కేసీఆర్‌.  అయితే, క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ డ్రామా ఇక్క‌డితో ముగిసిపోలేదు. జ‌స్ట్‌ ఎమ్మెల్సీతో క‌విత కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు. మంత్రిని చేసేదాకా వ‌దిలే స‌మ‌స్య లేదంటున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో త‌న‌ను మంత్రిని చేయాల్సిందేనంటూ ప‌ట్టుబ‌డుతున్నార‌ట క‌విత‌. సీఎం సీటు ఎలాగూ ఇవ్వ‌ట్లేదు కాబ‌ట్టి.. క‌నీసం మినిస్ట‌ర్‌ను అయినా చేయాల్సిందేన‌ని మొండిప‌ట్టు ప‌డుతున్నార‌ట క‌విత‌. మ‌రి, కూతురు ఒత్తిడికి కేసీఆర్ త‌లొగ్గుతారా? త్వ‌ర‌లోనే మంత్రిని కూడా చేస్తారా? లేదంటే, క‌విత మినిస్ట‌ర్ పోస్ట్‌కు కేటీఆర్ చెక్ పెడ‌తారా? ఏదిఏమైనా క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో రాజుకున్న కుంప‌టి ఇప్ప‌ట్లో ఆరిపోయేలా లేదంటున్నారు.   

ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో మీటింగ్స్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం పెద్దలు పట్టించుకోవడం లేదా? ఆయనను కలవడానికి కేంద్రమంత్రులు ఇష్టపడటం లేదా? అంటే మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నిజమే అనిపిస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చిస్తానంటూ హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మూడు రోజులైనా ఎవరినీ కలవలేదు. కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నా అటు నుంచి స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలుసుకోలేని కేసీఆర్.. ప్రధాని మోదీ అమిత్ షా లతో భేటీ అనుమానమేనని అంటున్నారు. దీంతో కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్లు లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నది ఇప్పుడు చర్చగా మారింది.  తెలంగాణ వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించమని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదని ధాన్యం కొనుగోలు చేస్తామని లేఖ ద్వారా హామీ పత్రం ఇచ్చే వరకు పోరాడుతామని అన్నారు.  ధ్యానం కొనుగోలుకు ఇక ఢిల్లీ వేదికగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. వరిధాన్యం కొనుగోలుతో పాటు జల వివాదాల్లో పరిష్కారానికి కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తానని అన్నారు.ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రి ఢిల్లీ వెళ్లారు.  అయితే ఢిల్లీ వెళ్లి మూడు రోజులవుతున్నా కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదు. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాక మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వర్తక ప్రతినిధుల సమావేశంలో బిజీగా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జోధ్ పూర్ కు బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు తిరిగి రారు. దీంతో వీళ్లద్దరితో కేసీఆర్ సమావేశం సాధ్యం కాలేదని చెబుతున్నారు. దీంతో ముందుగా అపాయింట్ మెంట్ సెట్ చేసుకోకుండానే కేసీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  తో పాటు  పౌర సరఫరాల ఆర్థిక వ్యసాయ ఉన్నతాధికారులు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ కార్యదర్శి సుధాం పాండేను కలిశారు. కానీ వాళ్లు ఇదివరకు చెప్పినట్లే ఉప్పుడు బియ్యం కొనమని ముడిబియ్యం పెంపు సేకరణను పరిశీలిస్తామని చెప్పడంతో  తెలంగాణ అధికారులు నిరాశ చెందినట్లు సమాచారం.కేంద్ర మంత్రిని కలిసినా ఇదే సమాధానం వస్తుందని అంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశం అయ్యారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి న్యాయ సలహా కోసం పంపామని అక్కడి నుంచి అభిప్రాయం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనని అక్కడ సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.   మొత్తంగా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటూ ప్రకటనలు చేసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మూడు రోజులైనా ఎలాంటి సమావేశాలు జరపకపోవడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతుల సమస్యలపై కేసీఆర్ చిత్తశుద్ది లేదని, ఏదో చేస్తున్నామని చెప్పడానికే ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఢిల్లీలో దిక్కులేకుండా గులాబీ బాస్ ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. 

కొండపల్లిపై వైసీపీకి షాక్.. చైర్మెన్ ఎన్నికకు హైకోర్టు ఆదేశాలు

కొండపల్లి మున్సిపాలిటీలో తమకు మెజార్టీ లేకపోవడంతో చైర్మెన్ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారమే ఎన్నిక నిర్వహించాలని రిటర్నింగ్ ఆఫీసర్ ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులను రక్షణ కల్పించాలని సీపీని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించవద్దని, పూర్తి వివరాలను హైకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు గురువారానికి వాయిదా వేసింది.  కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. మున్సిపాలిటీల్లో 29 వార్డులు ఉండగా వైసీపీ 14, టీడీపీ 14 చోట్ల గెలుపొందాయి. 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లిలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫిషియే మెంబర్ గా కొండపల్లి నమోదు చేయించుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు ఉన్నా.. వాళ్ల బలం 15 15 దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీకి చైర్మెన్ పీఠం దక్కకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. సోమావరం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. నానా రభస స్పష్టించి అడ్డుకుంది. మంగళవారం కూడా చైర్మెన్ ఎన్నిక జరగకుండా విధ్వంసం స్పష్టించింది. 

ఆటోడ్రైవ‌ర్ ఇంట్లో సీఎం భోజ‌నం.. మ‌న ముఖ్య‌మంత్రులూ ఉన్నారే..

విందు భోజ‌నం లేనిదే ముద్ద దిగ‌దు. హంగూ ఆర్బాటం లేనిదే పూట గ‌డ‌వ‌దు. ఒక‌రేమో తాడేప‌ల్లి ప్యాలెస్‌లో రాజ‌భోగాలు అనుభ‌విస్తుంటారు. ఇంకొక‌రేమో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కే ప‌రిమిత‌మ‌వుతూ విందు రాజ‌కీయాలు చేస్తుంటారు. ప్ర‌జ‌లంటే చిన్న‌చూపో లేక, ఏహ్య‌భావ‌మో తెలీదు కానీ.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం కానీ, వారి క‌ష్టాలు తీర్చ‌డం కానీ, క‌నీసం వారికి నేరుగా క‌నిపించ‌డం, మాట్లాడ‌టం కానీ చేయ‌నే చేయ‌రు. ప్ర‌జ‌ల‌ను ప‌లిక‌రిస్తే అదేదో పాప‌మ‌న్న‌ట్టు దూరంగా ఉంటున్నారు.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఓదార్పు యాత్ర‌, పాద‌యాత్ర పేర్ల‌తో జ‌నాల‌పై ముద్దులు కురిపించిన జ‌గ‌న్‌రెడ్డి.. అధికారంలోకి వ‌చ్చాక ప్యాలెస్‌కే ప‌రిమితం అవుతున్నారు. కొవిడ్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చిందే లేదు. తాజాగా వ‌ర‌ద‌ల‌తో సీమ ప్ర‌జ‌లు విల‌విల్లాడిపోతుంటే.. విమానంలో చ‌క్క‌ర్లు కొట్టి వెళ్లిపోయారే కానీ, క్షేత్ర స్థాయిలో బాధితుల‌ను ఓదార్చిన పాపాన పోవ‌డం లేదు. ఇక సీఎం కేసీఆర్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ద‌త్త గ్రామాలు మిన‌హా.. ఏడేళ్లుగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి సంద‌ర్భం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు.  తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు ఇలా ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే.. ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మాత్రం.. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చెంత‌.. అన్న‌ట్టు ఉంటున్నారు. సైకిల్ తొక్కుతున్నారు. పార్కులో క‌నిపిస్తున్నారు. బ‌స్సు ఎక్కుతున్నారు. ప్ర‌జ‌లతో క‌లిసి.. ప్ర‌జ‌ల‌తో మెలిసి.. ఉంటున్నారు. ఇక ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అయితే మ‌రింతగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌జా పాల‌న‌, సుప‌రిపాల‌న‌.. అందిస్తున్నారు.  తాజాగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం పంజాబ్ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా లూధియానాలో ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో భోజ‌నం చేశారు. దిలీప్ తివారీ ఇంట్లో వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విందు ఆర‌గించారు. ఢిల్లీ సీఎం సింప్లిసిటీని అంతా మెచ్చ‌కుంటున్నారు. మ‌న ముఖ్య‌మంత్రులూ ఉన్నారే.. అంటూ తెలుగువారు బాధ‌ప‌డుతున్నారు.        

వైసీపీ విధ్వంసంతో చైర్మన్ ఎన్నిక వాయిదా.. ఎస్ఈసీ తప్పుకోవాలన్న చంద్రబాబు 

అనుకున్నట్లే జరిగింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. వరుసగా రెండో రోజు చైర్మన్ ఎన్నిక జరగపోవడంతో... కొండపల్లి ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేరింది. చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం  కూడా వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించారు.  హైకోర్టు తీర్పు వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది. కార్యాలయంలోనే టీడీపీ సభ్యులు, ఎంపి కేశినేని నాని కూర్చొన్నారు. వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి సైతం బయటకు వెళ్లిపోయారు. సర్ది చెప్పినా సభ్యులు తగ్గలేదని.. దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు  రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ రెడ్డి. అందుకే ఎన్నికను వాయిదా వేశామన్నారు. లోపలే ఉన్న టీడీపీ సభ్యుల గురించి అడిగితే... సునీల్ కుమార్ స్పందించకుండా వెళ్లిపోయారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. మున్సిపాలిటీల్లో 29 వార్డులు ఉండగా వైసీపీ 14, టీడీపీ 14 చోట్ల గెలుపొందాయి. 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లిలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫిషియే మెంబర్ గా కొండపల్లి నమోదు చేయించుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు ఉన్నా.. వాళ్ల బలం 15 15 దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీకి చైర్మెన్ పీఠం దక్కకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. సోమావరం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. నానా రభస స్పష్టించి అడ్డుకుంది. మంగళవారం కూడా చైర్మెన్ ఎన్నిక జరగకుండా విధ్వంసం స్పష్టించింది.  కొండపల్లి చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి... ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారినే చైర్మన్‌గా నియమించుకోవాలన్నారు. భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్‌ చల్ చేస్తున్నా... అక్కడే ఉన్న  పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని, తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దన్నారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు అన్నారు.

తెలుగు వీరుడికి మ‌హా వీర చ‌క్ర‌.. సంతోష్‌బాబు అమ‌ర్ ర‌హే..

మ‌హా వీరుడిని మ‌ర‌ణానంత‌రం మ‌హా వీర చ‌క్రతో గౌర‌వించింది కేంద్రం. గ‌ల్వాన్ లోయ‌లో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన నల్గొండ జిల్లాకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు కేంద్రం మహావీర చక్ర పురష్కారం ప్రదానం చేసింది. కల్నల్‌ సంతోష్‌బాబు త‌ల్లి, భార్య‌.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గతేడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ ధీటుగా ఎదురుకొని.. ఆ హోరాహోరీ దాడిలో అమరుడ‌య్యారు కల్నల్ సంతోష్ బాబు. ఆనాడు సంతోశ్‌బాబు బృందం చైనాను అడ్డుకోక‌పోయి ఉంటే.. ఇప్పుడు గ‌ల్వాన్ లోయ ఇండియా ఆధీనంలో ఉండి ఉండ‌క‌పోయేద‌ని అంటారు. స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకొస్తున్న చైనీస్ ఆర్మీతో.. సంతోష్‌బాబు ఎలాంటి ఆయుధాలు లేకుండా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేశారు. కానీ, పెద్ద సంఖ్య‌లో ఉన్న చైనా సోల్జ‌ర్స్ ఇనుప కంచె చుట్టి ఉన్న ఐర‌న్ రాడ్ల‌తో మ‌న సైనికుల‌పై ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. ఆ ఆక‌స్మిక దాడిలో సంతోష్‌బాబు అమ‌రుడ‌య్యారు. గ‌ల్వాన్‌ను చైనా చేతికి చిక్క‌కుండా చేయ‌డంలో స‌ఫ‌లుడ‌య్యారు.  కల్నల్‌ సంతోష్‌బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించారు. క‌ల్న‌ల్ సంతోష్‌బాబు ప్రాణ‌త్యాగానికి గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మ‌హా వీర చ‌క్ర‌ పురస్కారం ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ప‌ర‌మ వీర చ‌క్ర త‌ర్వాత‌.. ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.  సంతోష్ బాబు వీర మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 

వెంకట్రామిరెడ్డికి హైకోర్టు నోటీసులు.. ఎమ్మెల్సీ ఎన్నికపై విచారణ

సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామా వివాదంపై  తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. దీనిపై విచారణ జరగగా.. ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు.  ఇక వరి విత్తనాల అమ్మకుడదంటూ సమావేశంలో వెంకట్ రామి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ కంట్మెంట్‌లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వెంకట్రామిరెడ్డితో బేషరత్‌గా క్షేమపణల స్టేట్మెంట్ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.   

బుగ్గన మాటలకు అర్థాలు వేరులే.. 

“విశాఖపట్నం రాష్ట్రంలోనే పెద్ద నగరం. అక్కడ అన్ని సదుపాయాలున్నాయి. అనుసంధానత ఉంది. ఉక్కు కర్మాగారం, తూర్పు నౌకాదళ్ కమాండ్, షిప్’యార్డ్ ... ఇంకా .. అనేక పరిశ్రమలున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. కొద్దిపాటి తోడ్పాటు అందిస్తే తూర్పు కోస్తాలోనే అది అతి పెద్ద నగరం అవుతుంది. ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. అందుకే, అక్కడి నుంచి పరిపాలన చేపట్టాలని నిర్ణయించాము” ఇవి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలికిన పలుకులు.  అయితే, అదే సమయంలో ఆయన మరో ముచ్చట కూడ చెప్పు కొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధిలో వెనక బడ్డాయని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, వికేంద్రీకరణ అవసరమని శివరామ కృష్ణన్ కమిటీ చెప్పాయని .. చెప్పుకొచ్చారు. నిజమే, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.  అయితే ఇలా ముందు చెప్పిన దానికి ... అందుకు కొనసాగింపుగా చెప్పుకొచ్చిన ముక్తాయింపుకు మద్య ఎక్కడా పొంతన కుదరడం లేదని, అంటున్నారు. నిజానికి, ఇది ఒక్క బుగ్గన మాటల్లోనే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసేపీ మంత్రులు, ఇతర నాయకులు అందరి మాటల్లోనూ ఈ వైరుధ్యం ఉంటుందననేది, అందరూ అనే మాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే, నిన్న (సోమవారం౦) శాసన సభలో ఇదే విషయంపై మాట్లాడుతూ, హైదరబాద్’కు ధీటుగా ఎదిగే అవకాశం ఒక్క విశాఖపట్నం నగరానికి మాత్రమే ఉందని అన్నారు. మరో వంక అదే ముఖ్యమంత్రి,అదే మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్’లోనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమం సాగిందని అన్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ఇప్పటికే అభివృద్ధి విశాఖపట్నం నగరాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అంటున్నారు. ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు వికేంద్రీకరణ జపం చేస్తూ అందుకు విరుద్ధంగా  విశాఖ నగరాన్ని భివృద్ధి చేయాలని, విశాఖ నగరాన్ని మరో హైదరాబద్ నగరం అంతభివ్రుద్ధి చేయాలని అనడం పట్ల రాజకీయ వ్యాఖ్యాతలు,ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న తీరుగమనిస్తే, వారికి వికేంద్రీకరణ  అంటే ఏమిటో తెలియక పోవడం అయినా కావాలి ... కాదంటే వికేద్రీకరణ విషయంలో చిత్తశుద్ది లేకపోవడం అయినా కారణం కావచ్చని అంటున్నారు.  అలాగే రాజకీయ పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలి అన్నది రాజ్యాంగమే నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం మొదలు  గ్రామపంచాయతీ వరకు వికేంద్రీకృత పరిపాలన విధానంలో చిన్న చిన్న లోపాలున్నా, పట్ల మీదనే నడుస్తోంది. అదలా ఉంటే. పరిపాలన వికేద్రీకరణ, ఆర్థిక వికేద్రీకరణ మధ్య ఉన్న సన్నని గీతను జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేసపూర్వకంగా మరిచి పోవడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు.   ఒకే రాజదాని ఉన్నా, అది ఆర్థిక వికేద్రీకరణకు అడ్డం కాదు. అమరావతి ఒకటే రాజధానిగా ఉన్నా ఒక్కొక్క ప్రాంతంలో  ఆ ప్రాంతానికి అనువైన పరిశ్రమలను స్థాపించి  స్థానిక యువతకు ఉపాధి కలిపించవచ్చని, నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మనసులో రియల్ ఎస్టేట్ కాలు కంటూ పైకి వికేద్రీకరణ జపం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ ధోరణి వలన అభివృద్ధి కుంటుపడడమే కాకుండా ప్రాంతీయ అసమానట్లు తలెత్తి, ప్రత్యేకవాదం, వేర్పాటు వాదం సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు

అంత‌రాత్మ సాక్షిగా అబ‌ద్దాలు.. వికేంద్రీకరణ‌పై సోము వీర్రాజు

జ‌గ‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షమే కాకుండా.. త‌న‌కు మిత్ర‌ప‌క్షంలాంటి బీజేపీ సైతం ముఖ్య‌మంత్రి తీరుపై విరుచుకుప‌డుతోంది. ఇన్నాళ్లూ జ‌గ‌న్‌పై త‌మ‌ల‌పాకుల‌తో దాడి చేసిన‌ట్టు న‌టిస్తూ వ‌చ్చిన సోము వీర్రాజు సైతం.. అమిత్‌షా షంటింగ్స్‌తో దూకుడు పెంచారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. సీఎం చిత్తశుద్ధిని శంకించారు.  అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ద‌గ్గ‌ర‌ అసలు అందుకోసం నిధులున్నాయా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని.. అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చేయగలుగుతారని నిలదీశారు. ఈ విషయంలో ప్రజల్ని మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు సోము వీర్రాజు.  కోర్టు పెడితే రాజధాని అవుతుందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. సీమ అభివృద్ధిపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు.  రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పారని.. ఆ మాట అన్నారో లేదో సీఎం, మంత్రులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు అన్నారు. ఆత్మను టేబుల్‌పై పెట్టి సభలో మాట్లాడారంటూ త‌ప్పుబ‌ట్టారు. అంతరాత్మ సాక్షిగా సభలో అబద్ధాలు చెప్పారని.. శాసనసభను అబద్ధాలు, బండబూతులు, వ్యక్తిగత జీవితాలు మాట్లాడేందుకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులకు బాబు భరోసా.. జగనన్న మరో బాదుడు.. కొండపల్లి రచ్చ.. టాప్ న్యూస్@1PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాధితులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో ఆయన తిరుగుతున్నారు.  చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మఖ్య నేతలు ఉన్నారు. అంతకుముందు కడపకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ----- వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నానన్నారు. పంచాయతీల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి  విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారని లోకేష్‌ అన్నారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే అని మండిపడ్డారు. -------- ఏపీ అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ జరిగింది. కందుకూరులో ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్లు లేకుండానే క్లైమ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ అలా అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. --- ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది జగన్ రెడ్డి. మోటారు వాహ‌నాల ప‌న్ను చ‌ట్టం 1963లో స‌వ‌ర‌ణ‌లకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. కొత్త చట్టం ద్వారా నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో... ఇక‌పై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించబోతోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అద‌న‌పు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో ర‌వాణా శాఖ‌కు రూ. 3,181 కోట్ల ఆదాయం లభించింది. టాక్స్‌ల పెంపుతో ల‌క్ష‌ల‌ మందిపై వంద‌ల కోట్ల భారం మోపనుంది. ----- కొండపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేష్ మకాం వేశారు. టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇబ్రహీంపట్నంలో వాహనాల్లో కర్రలు వేసుకుని వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు. ---- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నిర్ణయమే తమ నిర్ణయం.. పార్టీ నిర్ణయమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్టణానికి పర్యాటక రంగంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదన్నారు. ----- జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. మేయర్ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బల్దియాకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. మేయర్ హఠావో అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్‌ చాంబర్‌లో ఫర్నీచర్‌ను బీజేపీ నేతలు  ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  -----  సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. కాగా... ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు ---- మెట్రోరైలు నడుస్తున్న సమయంలో ఆయా స్టేషన్ల మూల మలుపుల వద్ద వస్తున్న శబ్దాలతో ప్రయాణికులు కంగారుపడుతున్నారు. అప్పటివరకు సాఫీగా నడుస్తున్న రైలు కింది భాగంలో సౌండ్‌ వస్తుండడంతో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడిందోననే భయంతో వణికిపోతున్నారు. బేరింగ్‌లు అరిగిపోయిన శబ్దాలు వినిపిస్తుండడంతో ప్రయాణికులు, రోడ్లపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా నాంపల్లి, అసెంబ్లీ, బేగంపేట్‌, రసూల్‌పురా, ప్రకాష్‌నగర్‌, ఎంజీఆర్‌ఐ, తదితర ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.  --- గత పది వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రోడ్లపై వరదనీరు పారుతుండటంతో కార్లు తేలియాడుతున్నాయి. యలహంక చెరువు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొగిలు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, యెలహంక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. వరద ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయ పనులు చేపట్టారు.

జ‌గ‌న్ గ‌డ్డ‌పై చంద్ర‌బాబు.. బాధ దిగ‌మింగుకొని ప్ర‌జ‌ల్లోకి..

భ‌రించ‌లేని బాధ‌లో ఉన్నారు చంద్ర‌బాబు. ఆ క‌న్నీటి చార‌లు ఇంకా ఆర‌నే లేదు. గుండె గాయం మాన‌నే లేదు. ఆ మ‌నసిక వేధ ఇంకా మ‌దిని తొలిచేస్తూనే ఉంది. స‌భ‌లో కౌర‌వ మూక చేసిన దారుణ ప‌రాభ‌వం నుంచి ఇంకా కోలుకోనే లేదు. అయినా, ఆ బాధ‌ను గొంతులోనే దిగ‌మింగుకున్నారు. క‌న్నీటిని అతిక‌ష్టం మీద తుడిచేసుకున్నారు. ప్ర‌జ‌ల బాధ ముందు త‌న బాధ ఎంత‌నుకున్నారు. వ‌ర‌ద‌ల‌తో విల‌విల్లాడుతున్న జ‌నం క‌ష్టాల‌ను క‌ళ్లారా చూసేందుకు క‌ద‌లివ‌చ్చారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. నాయ‌కుడంటే ఇలా ఉండాలి. ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్‌ను ప‌క్క‌న‌పెట్టేసి.. ప్ర‌జ‌ల కోసం ఇలా త‌ర‌లిరావాలి. అందుకే చంద్ర‌బాబు నిజ‌మైన లీడ‌ర్‌. ప్ర‌జ‌లు మెచ్చే నాయ‌కుడు.  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో రాయ‌ల‌సీమ‌లో క‌నీవినీ ఎరుగ‌ని విప‌త్తు. జ‌ల‌ఖ‌డ్గం అనేక గ్రామాల‌కు లోతైన గాయం చేసింది. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు జ‌ల స‌మాధి అయ్యారు. ల‌క్ష‌ల ఎక‌రాలు నీట మునిగాయి. ఊర్ల‌కు ఊర్లే ధ్వంస మ‌య్యాయి. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌న్నీటి సంద్ర‌మ‌య్యారు. ప్ర‌జ‌ల కష్టాల‌ను చూసి చంద్ర‌బాబు చ‌లించిపోయారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డి త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు ప్యాలెస్‌కే ప‌రిమిత‌మైనా.. విమానంలో విహ‌రించిపోయినా.. సొంత‌జిల్లాను క‌నీసం క‌న్నెత్తి చూడ‌క‌పోయినా.. ప్ర‌తిప‌క్ష నేత మాత్రం జ‌గ‌న్‌లా త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు ఉండ‌లేక‌పోయారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు క‌ద‌లివ‌చ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ.. ప్ర‌జ‌ల దుఃఖాన్ని తీర్చేందుకు, బాధితుల‌ను ఓదార్చేందుకు ముందుకొచ్చారు చంద్ర‌బాబు.  వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప వ‌చ్చారు. క‌డ‌ప విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.  సీఎం జ‌గ‌న్‌రెడ్డి సొంత ఇలాఖాలో చంద్ర‌బాబుకు అనూహ్య ప్ర‌జాధ‌ర‌ణ ల‌భించింది. బాబుకు వెల్‌క‌మ్ చెప్పేందుకు.. పెద్ద సంఖ్య‌లో అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. జై చంద్ర‌బాబు నినాదాల‌తో క‌డ‌ప మారుమోగింది. చంద్రబాబు రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. రోజంతా కడప జిల్లాలోనే చంద్ర‌బాబు పర్యటిస్తారు. బుధ‌వారం చిత్తూరు.. గురువారం నెల్లూరు జిల్లా వ‌ర‌ద ప్ర‌భావ ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.