ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో మీటింగ్స్
posted on Nov 23, 2021 @ 2:56PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం పెద్దలు పట్టించుకోవడం లేదా? ఆయనను కలవడానికి కేంద్రమంత్రులు ఇష్టపడటం లేదా? అంటే మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నిజమే అనిపిస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చిస్తానంటూ హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మూడు రోజులైనా ఎవరినీ కలవలేదు. కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నా అటు నుంచి స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలుసుకోలేని కేసీఆర్.. ప్రధాని మోదీ అమిత్ షా లతో భేటీ అనుమానమేనని అంటున్నారు. దీంతో కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్లు లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తెలంగాణ వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించమని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదని ధాన్యం కొనుగోలు చేస్తామని లేఖ ద్వారా హామీ పత్రం ఇచ్చే వరకు పోరాడుతామని అన్నారు. ధ్యానం కొనుగోలుకు ఇక ఢిల్లీ వేదికగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. వరిధాన్యం కొనుగోలుతో పాటు జల వివాదాల్లో పరిష్కారానికి కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తానని అన్నారు.ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రి ఢిల్లీ వెళ్లారు.
అయితే ఢిల్లీ వెళ్లి మూడు రోజులవుతున్నా కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదు. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాక మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వర్తక ప్రతినిధుల సమావేశంలో బిజీగా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జోధ్ పూర్ కు బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు తిరిగి రారు. దీంతో వీళ్లద్దరితో కేసీఆర్ సమావేశం సాధ్యం కాలేదని చెబుతున్నారు. దీంతో ముందుగా అపాయింట్ మెంట్ సెట్ చేసుకోకుండానే కేసీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పౌర సరఫరాల ఆర్థిక వ్యసాయ ఉన్నతాధికారులు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ కార్యదర్శి సుధాం పాండేను కలిశారు. కానీ వాళ్లు ఇదివరకు చెప్పినట్లే ఉప్పుడు బియ్యం కొనమని ముడిబియ్యం పెంపు సేకరణను పరిశీలిస్తామని చెప్పడంతో తెలంగాణ అధికారులు నిరాశ చెందినట్లు సమాచారం.కేంద్ర మంత్రిని కలిసినా ఇదే సమాధానం వస్తుందని అంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశం అయ్యారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి న్యాయ సలహా కోసం పంపామని అక్కడి నుంచి అభిప్రాయం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనని అక్కడ సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటూ ప్రకటనలు చేసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మూడు రోజులైనా ఎలాంటి సమావేశాలు జరపకపోవడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతుల సమస్యలపై కేసీఆర్ చిత్తశుద్ది లేదని, ఏదో చేస్తున్నామని చెప్పడానికే ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఢిల్లీలో దిక్కులేకుండా గులాబీ బాస్ ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.