komati reddy brothers

కేసీఆర్ కి హస్తం ఇచ్చిన కోమటిరెడ్డి సోదరులు

  కోమటిరెడ్డి సోదరులు ఎట్టకేలకు తామిరువురు ప్రస్తుతం కాంగ్రెస్ వీడే ఆలోచనలేనట్లు సూచన ప్రాయంగా ఈరోజు తెలియజేసారు. తెరాస అధ్యక్షడు కేసీఆర్ తమ పార్టీలో చేరే కాంగ్రెస్ నేతలకి ఈనెల 27వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించడంతో, ఇంతకాలంగా తెరాసలో చేరాలా లేక వైయస్సార్ పార్టీలో చేరాలా అనే విషయంపై తీవ్ర అయోమయంలో ఉన్న కోమటిరెడ్డి సోదరులు, తప్పనిసరి పరిస్థితుల్లో తమ నిర్ణయం ప్రకటించవలసి వచ్చింది.   భువనగిరి కాంగ్రెస్ పార్టీ యంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలోగా తమ అధిష్టానం తెలంగాణ అంశంపై ఖచ్చితమయిన ప్రకటన చేయకపోతే తామిరువురు తమ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించక తప్పదని చెప్పారు.తద్వారా వారు ప్రస్తుతం కాంగ్రెస్ వీడే ఆలోచనలేనట్లు తెలియజేయడమే కాకుండా, కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ కూడా తాము కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని స్పష్టం చేసినట్లయింది. అదే సమయంలో తమపై ఆసక్తి ఉన్న రాజకీయ పార్టీలు మరికొంత కాలం ఎదురుచూడక తప్పదనే సూచన కూడా వారి ప్రకటనలో ఇమిడి ఉంది. ప్రజలు, కార్యకర్తలు కోరినట్లయితే రాబోయే ఎన్నికలలో నల్గొండ జిల్లా ఆలేరు నుండి శాసనసభకు పోటీ చేస్తానని ఆయన తెలిపారు.   కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్రపడ్డ కోమటిరెడ్డి సోదరులు, ఒకవేళ తమకు పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నట్లున్నారు. అందుకే వారిరువురూ మరికొంత కాలం పార్టీలోనే కొనసాగుతూ వేచి చూసేందుకు నిర్ణయించుకొని ఉండవచ్చును.   కేసీఆర్ చెప్పటిన ఆపరేషన్ ఆకర్షకి వెలువడిన మొదటి ప్రతిస్పందన ఈవిధంగా రావడం కేసీఆర్ కు కొంచెం నిరాశ కలిగించక మానదు. ఇక ఇప్పటికీ ఎటువంటి ఖచ్చితమయిన ప్రకటన చేయకుండా సస్పెన్స్ నడిపిస్తున్న మందా జగన్నాధం, వివేక్ మరియు కే.కేశవ్ రావుల ప్రకటన కోసం కేసీఆర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.   ఇంకా కేవలం వారం రోజులే గడువు ఉన్నపటికీ, వారు కూడా మరికొంత కాలం ఈ సస్పెన్స్ కొనసాగించవచ్చును. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో వారికున్న అనుబంధం వారిని ఇప్పటికీ వెనక్కు లాగుతూనే ఉంది. పార్టీలో ఇతర సీనియర్లు ఇన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, ఇక రిటైర్ అయ్యే సమయంలో తెరాసలో జేరి ఇంతకాలం పొందిన గౌరవం, పరువు ప్రతిష్టలు పాడు చేసుకోవడం ఎందుకని అడిగిన ప్రశ్నతో వారిని తీవ్ర సందిగ్ధంలో పడేశాయి. అందువల్ల కేసీఆర్ పెట్టిన 27వ తేదీ డెడ్ లైన్ లోగా ఎవరు చేరకపోవచ్చును.

sabita reddy

హోం కుర్చీచుట్టూ మంత్రుల మ్యూజికల్ చైర్స్ ఆట

  సీబీఐ తనపై అభియోగాలు మోపుతూ చార్జ్ షీట్ నమోదుచేయగానే పరుగు పరుగున వచ్చి “అయ్యో!నీ కెంత కష్టం వచ్చిందే చేవెళ్ళ చెల్లెమ్మో..అక్కమ్మో!” అంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొదలుకొని మంత్రులు గల్లా అరుణకుమారి, గీతా రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ వరకు అందరూ వరుసకట్టి వచ్చి ఒదార్చినప్పుడు, “నాకు పార్టీలో ఇంతమంది అభిమానులున్నారా?” అనుకొన్న సబితమ్మ కళ్ళుఆనందంతో చమర్చాయి.   కానీ, వారందరూ ఆమె తన హోంమంత్రి పదవి నిజంగా వదిలి పెడుతుందా లేక అంటిపెట్టుకొనే ఉంటుందా అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చారని మాత్రం గ్రహించలేకపోయింది ఆ చేవెళ్ళ చెల్లెమ్మ. ఆమెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయమని కోరకపోయినా, ఆమె ఇంకా రాజీనామా ఇవ్వకపోయినా, స్వీయ గృహ నిర్బంధం విదించుకొని డ్యూటీకి రాకపోవడంతో, ఇక ఆమె రాదని రూడీ అవగానే మంత్రులందరూ ఆమె కుర్చీకోసం మ్యూజికల్ చైర్స్ ఆటను రాష్ట్ర జాతీయ స్థాయిలో మొదలుపెట్టేసారు.   “ఈవిషయంలో అందరికంటే ముందుగా ఆమెను తానే ఓదార్చాను గనుక, తనకే ఆమే కుర్చీలో కూర్చొనే ‘నైతిక హక్కు’ ఉందని” భావిస్తున్న బొత్ససత్యనారాయణ గారు, పార్టీ ఉపాధ్యక్షుడు “రాహుల్ బాబు కను సైగ చేయగానే పీసీసీ అధ్యక్ష పదవిని తృణప్రాయంగా భావించి తను ‘చేయనున్న’ త్యాగాలు వృధా కావలసిందేనా? అందుకు నష్ట పరిహారంగా కాళీగా పడున్న హోం కుర్చీలో కూర్చొంటే తప్పేటి? ఇలాగయితే ఇక నేను ప్రజాసేవ ఎలా చేసుకోగలను” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   “మా తెలంగాణా ఆడపడుచు ఖాళీ చేసిన కుర్చీలో మేము తప్ప మరెవరు కూర్చొన్నా మా తెలంగాణకే అవమానం” అనే ఒక చక్కటి ‘లా పాయింటు’తో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ ఆమె కుర్చీ చుట్టు ఉపగ్రహాల వలే తిరుగుతున్నారు.   “మా సబితమ్మ తరువాత సీబీఐ లిస్టులో నా పేరే ఉంది గనుక, న్యాయంగా ఆసీటు నాకే దక్కాలి” అని మంత్రి గీతా రెడ్డి చక్కటి సీబీఐ పాయింటుతో వాదిస్తుంటే అందరికీ చాలా ముచ్చటేసింది.   “ఇంకా ఎంత కాలం నేను ఈ పప్పు, బెల్లాలు, నూనె డబ్బాలు నెత్తిన బెట్టుకొని తిరగాలి? తిరిగి తిరిగి అలసిపోయాను. కనీసం కుర్చీ ఖాళీగా ఉన్నపుడయినా కాసేపు నన్ను అందులో కూర్చొని సేద తెరనీయండి,” అంటూ పౌర సరఫరాల మంత్రి డీ శ్రీధర్‌బాబు కూడా కొంచెం ‘గట్టిగానే ప్రార్దిస్తున్నట్లు’ సమాచారం.   “పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా కావడానికి డిప్యూటీ సీఎంగా ఉన్నపటికీ, ముఖ్యమంత్రి నన్ను ఏనాడు, ఏ విషయంలో కూడా సంప్రదించలేదు, సలహా కోరలేదు. అసలు నేనొకడిని ఇక్కడ ఉన్నానని గుర్తుచేస్తే తప్ప ఆయన కళ్ళకి నేను ఆనడమేలేదు,” అని వాపోతున్న దామోదర రాజనర్సింహ, “కనీసo హోంమంత్రి కుర్చీలో కూర్చోనిస్తే అప్పుడయినా ఆయన నన్ను పలకరిస్తాడు కదా!” అనే ఒకే ఒక చిన్న కోరికతో ఆయన కూడా డిల్లీ వెళ్లి ఇంకా ఖాళీ అవని సబితమ్మ కుర్చీలో కర్చీఫ్ వేసి వచ్చారు.   పీసీసీ కుర్చీకి టికెట్టు దాదాపు కన్ఫర్మ్అయిపోయినప్పటికీ, ‘హోం కుర్చీ’కోసం వెయిటింగు లిస్టులో కూడా తనపేరు నమోదు చేయించుకొనేందుకు డిల్లీ చుట్టూ తిరుగుతున్నారు డీ శ్రీనివాస్. ఇంతమంది తన కుర్చీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చూసిన చేవెళ్ళ చెల్లెమ్మ కళ్ళు చెమర్చాయి, ఈ సారి బాధతో!

Bayyaram mines

విజయమ్మ మెడకు చుట్టుకొన్న బయ్యారం గనులు

  అదేమి దురదృష్టమో తెలియదు కానీ ఎంకి పెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లు, రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం గనులను విశాఖ ఉక్కుకి కట్టబెడితే అందుకు ప్రభుత్వంతో పట్లు పట్టవలసిన తెరాస నేతలు ఆ సమస్యను వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మెడకు చుట్టారు. కొంచెం రాజకీయ అవగాహన పెంచుకొని, సభలలో మాట్లాడేందుకు అడ్డువస్తున్న తన బెరుకుదనం వదిలించుకోవాలనే ఆలోచనతో, ఈ నెల 27నుండి తన భర్తకు బాగా అచ్చొచిన చేవెళ్ళలో ‘రచ్చబండ’కార్యక్రమం పెట్టుకొంటే, “ముందు బయ్యారం గనుల గురించి మీ పార్టీ అభిప్రాయం చెప్పి ఆనక రచ్చబండ మీద కూర్చోమని తెరాస నేత హరీష్ రావు విజయమ్మను హెచ్చరించారు. అసలు చేవెళ్లలో కూర్చొనే బదులు వెళ్లి బయ్యారం రచ్చబండ వద్ద కూర్చొంటే బాగుంటుందని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. బయ్యారం గనులను విశాఖకు తరలించరాదని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి తెలంగాణా పట్ల మీ పార్టీ వైఖరి స్పష్టం చేసిన తరువాత మీరు మా తెలంగాణాలో ఏ రచ్చబండ మీద కూర్చొన్నా మాకేమి అభ్యంతరం ఉండదు” అని చెప్పారు. అసలు బయ్యారం గనులు ఆమె అల్లుడు అనిల్ కుమార్ చేతిలోనే ఉన్నాయని కాంగ్రెస్ మంత్రి ఆనం రామి నారాయణ రెడ్డి చెప్పిన విషయం పట్టించుకోకుండా, ఈ విధంగా పెద్దావిడ ను ఇబ్బంది పెట్టడం ఏమి సబబు? తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మండు వేసవిలో తన రాజమందిరం నుండి బయటకి వస్తున్నఆమెకు చలువ పందిళ్ళు వేసి సాదరంగా ఆహ్వానించకపోగా నిలదీయడం ఏమి న్యాయం? అయినా కరెంటు చార్జీలను కొంచెం తగ్గించమని కోరుతూ ఆమె 5 రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేస్తేనే పట్టించుకోని ప్రభుత్వం, బయ్యారం గనుల గురించి ఆమె చెపితే వింటుందా? అందువల్ల పెద్దావిడను ఇబ్బoది పెట్టకుండా తెరాస నేతలు వెళ్లి అల్లుడిగారిని కలిస్తే బాగుంటుందేమో!

delhi

మానవత్వం అడుగంటుతున్నసమాజం

  డిల్లీ ఘటన తరువాత నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత కూడా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగకపోగా అదొక అంటూ రోగంలా దేశమంతటా వ్యాపించి ఇప్పుడు అభం శుభం తెలియని పసిపిల్లలను సైతం బలి తీసుకొంటోంది. ఈ ఆకృత్యాలు సరిపోవన్నట్లు మనుషుల్లో దాగిఉన్న రాక్షస ప్రవృతి కూడా ఇప్పుడు బయటపడుతోంది. డిల్లీలో జరిగిన సంఘటనతో దేశం మరో మారు ఉలిక్కి పడింది.   నానాటికి దేశంలో పెరిగిపోతున్నఇటువంటి ఆకృత్యాలకు వెంటనే కటినమయిన శిక్షలు అమలు చేయడంలోచట్టపరంగా జరుగుతున్నఆలస్యమే ఇటువంటి ఉన్మాదులకు మరింత దైర్యం ఇస్తోందని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు చట్టాలు చేసి, నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటే, న్యాయ వ్యవస్థలో ఉన్న అన్నిఅవకాశాలను, లొసుగులను సంపూర్ణంగా వాడుకొంటూ, తమకు మంచి ఆహారం, పళ్ళు, సౌకర్యాలు కావాలని నిందితులు డిమాండ్ చేయగలుగుతున్నారు. అయినప్పటికీ పటిష్టమయిన మన న్యాయ వ్యవస్థ వారిని ఇంతవరకు శిక్షించలేకపోతోంది. ఈ ఆలస్యమే నేడు మృగాళ్ళను ఇటువంటి దారుణాలకు పాల్పడేందుకు దైర్యం కల్పిస్తోంది.   డిల్లీ ఉదంతం జరిగినప్పుడు అక్కడి బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో దానిని ఖండించడమే కాకుండా, ఆ నేరస్తుల తరపున తామెవరము కూడా వాదించబోమని భీషణ ప్రతిజ్ఞలు కూడా చేశారు. కానీ, నెల తిరిగేసరికి వారి ఆలోచనలలో మార్పులు వచ్చి, ఇప్పుడు ఆ నేరస్తుల తరపున వాదించడానికి పోటీలు పడుతున్నారు కూడా. ఎందుకంటే అటువంటి కేసుల్లో వాదించినప్పుడే మీడియాలో కనబడుతూ, మంచి పేరు సంపాదించుకోవచ్చుననే దురాశ వారిలోమానవత్వాన్ని కబళించివేసింది.   ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగిన ప్రతీసారి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తే తప్ప మన వ్యవస్థలలో స్వయం చలనం కనబడకపోవడం చూస్తుంటే, మనుషుల్లో మానవత్వం కూడా ఇప్పుడు క్రమంగా అడుగంటిపోతున్నదని అనిపిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని 5ఏళ్ల పసిపాపపై రాక్షసత్యాచారం జరిగిన తరువాత కటినంగా వ్యవహరించవలసిన డిల్లీ పోలీసులు, ఆ పసిపాప తల్లి తండ్రులు పిర్యాదుచేయడానికి వస్తే, “మీ పాప మీకు దక్కింది కదా ఇంకా ఎందుకు ఈ ఏడుపులు? అనవసరంగా కోర్టులు, కేసులు అంటూ ఎందుకు తిరుగుతారు?” అని వారి చేతిలో పోలీసులే ఓ రెండువేలు పెట్టడం చూస్తే ఇక ప్రజలకి దిక్కెవరని అనిపించకమానదు. పైగా నిరసన తెలియజేస్తున్న మహిళలపై కూడా పోలీసులు చెయ్యి చేసుకోవడం వారు ఇటువంటి సంఘటనల పట్ల స్పందన కోల్పోయారని తెలియజేస్తోంది.   ఇటువంటి వ్యవస్థలో ఎవరు మాత్రం భద్రత ఆశించగలరు? ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే యధావిధిగా మీడియాలో పతక శీర్షికన వార్తలు, టీవీ స్క్రోలింగులు, చర్చలు, పద్దతి ప్రకారం రాజకీయ పార్టీల ఖండనలు, అధికార పార్టీపై విమర్శలు, అధికార పార్టీ నేతల దిగ్బ్రాంతి ప్రకటనలు, హామీలు వగైరాలన్నిమాత్రం అత్యంత నిర్దిష్టమయిన పద్దతిలో జరిగిపోతున్నాయి. మానవత్వంతో స్పందించవలసిన సమాజం, వ్యవస్థలు, ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగినప్పుడు కూడాఇంత యాదృచ్చికంగా, ఇంత అమానవీయంగా స్పందించడం చూస్తుంటే అసలు మనమెటువంటి సమాజంలో బ్రతుకుతున్నామనే బాధ కలుగకమానదు.   శరీరంలో ఒక భాగానికి కాన్సర్ సోకితే దానిని ముందుగా మందులతో నయం చేసుకొనేందుకు ప్రయత్నించి, నయం అవకపోతే ఆ భాగాన్నే తొలగించుకొని బ్రకాలనుకొంటాము తప్ప చనిపోవాలని ఎవరూ అనుకోము. అదే విధంగా ఇటువంటి అకృత్యాలకి పాల్పడుతున్న వారికి మంచి మాటలతో అర్ధం కానప్పుడు, మరణదండన వంటి కటిన శిక్షలు విధించినప్పుడే, మళ్ళీ అటువంటి నేరాలు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ, అవి కూడా నేరం జరిగిన రెండు మూడు నెలలోగా అమలు చేయగలిగినప్పుడే, మృగాళ్ళలో అటువంటి నేరం చేస్తే ఉరి తప్పదనే ఒక భయం ఏర్పడుతుంది. మన వ్యవస్థలను శక్తివంతం, ప్రక్షాళనం చేసుకోనంతకాలం ఇటువంటి ఘోర అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి.

chandrababu padayatra

బర్త్ డే వేడుకలు రద్దు

        టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటితో 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం నేడు. వస్తున్నా మీకోసం అంటూ ఆరున్నర నెలలుగా పాదయాత్ర చేస్తున్న ఆయన పాదయాత్ర ఈ రోజుకు సరిగ్గా 200 రోజులకు చేరుకుంది. అయితే ఆయన తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం లేదు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారి మీద అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, దాని కేసు నమోదులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా జన్మదిన వేడులకు దూరంగా ఉంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. బాబు జన్మదినం కోసం 64 కిలోల కేకును సిద్దం చేసిన పార్టీ శ్రేణులు ఆయన నిర్ణయంతో వెనక్కితగ్గారు. జన్మదినం సంధర్భంగా బాబును కలిసేందుకు పాదయాత్ర జరుగుతున్న చోటికి ఆయన భార్య భువనేశ్వరి విచ్చేశారు.

2G spectrum scam

రాజాను పట్టించుకోవడం లేదు!

        2జీ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్, చిదంబరంలకు జేపీసీ క్లీన్‌చిట్ ఇచ్చింది. వారికి చెప్పకుండా విధాన నిర్ణయాలను రాజా మార్చేశారని తప్పుబట్టింది. 2జీ నష్టాన్ని అంచనా వేయడంలో కాగ్ కుట్రపూరితంగా వ్యవహరించిందని తప్పుబట్టింది. ఇప్పుడు ఈ నివేదిక రాజకీయంగా కలకలం రేపుతోంది. జేపీసీ చైర్మన్ చాకోపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. ఆయన వాదన తప్పని రాజా స్పష్టం చేస్తున్నారు.   స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనుమతితోనే తీసుకున్నానని టెలికం శాఖ మాజీ మంత్రి, 2జీ స్కాంలో నిందితుడు ఎ.రాజా స్పష్టం చేశారు. మన్మోహన్, చిదంబరంలకు జేపీసీ క్లీన్‌చిట్ ఇచ్చిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. "జేపీసీకి సోమవారం 200 పేజీల సవివర నివేదిక పంపుతాను. నా నివేదికను పరిశీలించిన తర్వాత అయినా జేపీసీ తనను పిలుస్తుందని భావిస్తున్నాను.'' అని తెలిపారు. 2జీ వ్యవహారమంతా చట్ట వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు.

Twitter launches music service

మ్యూజిక్ సర్వీస్ ప్రారంభించిన ట్విట్టర్

  వీడియోలు, ఫోటోలు, రాతలకే పరిమితమైన ట్విట్టర్ తాజాగా మ్యూజిక్ సర్వీసును ప్రారంభించింది. ఈ సోషల్ నెట్ వర్క్ లో ఏయే పాటలు, ఆర్టిస్టులు ఎక్కువ ప్రచారంలో ఉన్నారో తెలుసుకోడానికి కూడా వీలుంటుంది. హాష్ టాగ్ తో ఉండే ఈ మ్యూజిక్ సర్వీసును ట్విట్టర్ వాడుతున్న వారు ఎంజాయ్ చేయవచ్చు. ట్విట్టర్ మ్యూజిక్ ను తెరవడానికి రెండు రకాలున్నాయి. మొదటిది కంప్యూటర్ లో అయితే మ్యూజిక్ ట్విట్టర్.కామ్ సైట్ ను ఓపెన్ చేసి ఆనందించవచ్చు. రెండో రకం ఐపోడ్ లో ఉచితంగా లభించే యాపి ను డౌన్ లోడ్ చేసుకుని ఆనందించావచ్చు. కానీ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఫోన్ లో ట్విట్టర్ మ్యూజిక్ వినే అవకాశం లేదు. ట్విట్టర్ ఖాతాను తెరిచి చూస్తే సరికొత్త పాటలు, ఆర్టిస్టుల పేర్లు అన్నీ ఒకే చోట కాకుండా, వేర్వేరు లింకులలో ఉంచారు. పాపులర్, ఎమర్జింగ్, సజెస్టేడ్, నౌ ప్లేయింగ్, మీ అనే విభాగాలు కనిపిస్తాయి. ప్రతి క్యాటగిరీలో కొన్ని పాటలను సూచిస్తారు. నౌ ప్లేయింగ్ విభాగంలో అయితే అదే సమయంలో మిగిలిన వాళ్ళు ఏయే పాటలు వింటున్నారో, వాళ్ళ ట్విట్టర్ లో ఏ పాటలు ప్రస్తావిస్తున్నారో కనిపిస్తూ వుంటుంది. మీరు ఏ పాట వింటున్నా ముందుగా ఐట్యూన్స్ అందించే చిన్న ప్రివ్యూలో కనపడతాయి. మీరు స్పాట్ ఫై ప్రీమియం సభ్యులో లేక ఆర్.డి.యో. పెయిడ్ యూజర్ గానీ అయితే నేరుగా మీ ఖాతాకు కనెక్ట్ అయ్యి పూర్తి పాటను వినవచ్చు. అలా కాకుండా మామూలుగా పాట వినాలంటే టైల్ మీద క్లిక్ లేదా టాప్ చేయాలి. ఎడమచేతి వైపు కింద భాగంలో ప్లే కంట్రోళ్ళు ఉంటాయి. అక్కడ ఏదైనా ట్రాక్ ను కాసేపు పాజ్ చేయవచ్చు, లేదా పూర్తిగా స్కిప్ చేయవచ్చు. పాటలు వింటూనే ట్విట్ ను కంపోజ్ కూడా చేయవచ్చు.

Kadiyam Serious Allegations on TDP

సొంత పార్టీపైనే మండిపడ్డ కడియం

  శుక్రవారం తెలంగాణా టిడిపి ఫోరం ఎన్టీఆర్ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో కడియం శ్రీహరి వాడి వేడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వడం చాలా పెద్ద పరిణామం అని, అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పామని, ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళలేకపోయామని, ఈ పరిణామం వల్ల తెలంగాణాలో పార్టీకి రావాల్సినంత ఫలితం కనబడడం లేదని, లోపం ఎక్కడుందో మనం ఆత్మ విమర్శ చేసుకొని పొరపాట్లు సరిదిద్దుకోవాలని, తెలంగాణలో మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ ఇంతవరకూ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసుకోలేదని, 30-35 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంకా ఇన్ ఛార్జీలను కూడా ఎంపిక చేయలేదని, జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా తగ్గలేదని, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం  చేయాల్సినంత చేయలేకపోతోందని, ఈ సమస్యలను పరిష్కరించకుండా అధికారంలోకి రావాలంటే రాలేము అని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

kiran kumar

రాహుల్ గాంధీకి గంతలు కట్టిన కిరణ్

  నిన్న డిల్లీలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సమావేశమయిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులతో బాటు, చంద్రబాబు మరియు షర్మిల చేస్తున్నపాదయాత్రల గురించి కూడా వాకబు చేశారు. వారి పాదయాత్రల ప్రభావం ప్రజల మీద ఎలాఉంది? తద్వారా ఆయా పార్టీలకు ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది? దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఏవిధంగా ఉంటుంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించడం చూస్తే వారిద్దరూ పాదయాత్రలు చేస్తూ ఒకవైపు తమ పార్టీలు బలోపేతం చేసుకొంటూనే, మరోవైపు తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేఖతను పెంచుతున్నారని, తద్వారా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అర్ధం అవుతోంది. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, రాహుల్ గాంధీ కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేయడం విశేషం.   గత 7 నెలలుగా చంద్రబాబు పాదయాత్రల చేస్తున్నపటికీ, ఆయన స్వంత పార్టీ మీద కానీ, ప్రజలమీద గానీ ఆయన ప్రభావం చూపలేకపోయారని, ప్రజలు కూడా ఆయన మాటలు విశ్వసించడంలేదని చెప్పారు. అంతే కాకుండా వారి పార్టీలో, కుటుంబంలోనే కలహించుకొంటున్నారని అందువల్ల ఆ పార్టీ నుండి రాబోయే ఎన్నికలలో తమకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని కిరణ్ స్పష్టం చేసారు.   షర్మిలా చేస్తున్న పాదయాత్రల పట్ల కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. జగన్ అవినీతి గురించి, అక్రమార్జన గురించి క్రమంగా ప్రజలు కూడా నమ్మడం మొదలుపెట్టారని అందువల్ల వైయస్సార్ కాంగ్రెస్ వల్ల కూడా తమకొచ్చే నష్టం ఏమిలేదని ఆయన వివరించారు.   తానూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించి, త్వరలో మరి కొన్ని పధకాలు ప్రవేశ పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు. తానూ ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని, అది వచ్చే ఎన్నికల నాటికి పూర్తి అనుకూల వాతావరణం సృష్టించడం ఖాయమని గట్టిగా భరోసా ఇచ్చారు.   ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం చూస్తే, రాష్ట్రప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతున్నారని అర్ధం అవుతుంది. కానీ, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికయినా ఆయన స్వయంగా ఆత్మవంచన చేసుకొంటూ, తమ అధినేతను కూడా మభ్యపెడుతున్నారని అర్ధం అవుతుంది. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కలహించుకొంటున్నపటికీ, ఇద్దరూ కూడా గత 6నెలలుగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల గురించి,అవినీతి గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా సోదాహరణగా వివరిస్తుంటే, ఆ ప్రభావం అసలు ప్రజల మీద ఉండబోదని నమ్మించే ప్రయత్నం చేయడం భ్రమలో బ్రతకడమే అవుతుంది.   ఇక ఒకవైపు ఎన్ని పధకాలు ప్రవేశ పెడుతున్నపటికీ, మరో వైపు కరెంటు కోతలు, తద్వారా ఎండుతున్న పంటలు, కుంటుపడిన పరిశ్రమలు , దివాలా తీస్తున్న వ్యాపారాలు, తద్వారా పెరుగుతున్న నిరుద్యోగం వంటివి ఆయన తమ అధినేతకు చెప్పకుండా కేవలం తన పధకాల గురించి మాత్రమె చెప్పుకోవడం ఆయన కళ్ళకు గంతలు కట్టడం కాక మరేమిటి?   గతంలో ఏ ఆరు నెలలకో, ఏడాదికో పెరిగే కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రతీ నెలా పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ, వారు తను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పదకాలను చూసి ఐస్’ అయిపోయి తమకే గంప గుత్తగా ఓట్లేసి గెలిపించేస్తారని భావించడాన్ని ఏమనుకోవాలి?   ఇక, ప్రజాగ్రహం సంగతి పక్కన పెట్టినా, తెలంగాణలో తెరాస ప్రభావం, ఆంధ్రాలో తెదేపా, జగన్ ప్రభావం అసలు ఉండబోదని అనుకోవడం భ్రమ కాదా? రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కాకపోవచ్చును. కానీ, తెరాస, తెదేపా, మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ మూడు పార్టీలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేయకమానవు. వీటికి అదనంగా రాష్ట్రంలో ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతున్న కులం, ప్రాంతం, ధనం మొదలయిన వాటి ప్రభావం ఎన్నికలపై ఉండనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని లుకలుకలు, ముఠాలు మరే పార్టీలోను కనబడవని లోకోక్తి ఉండనే ఉంది.   ఇన్ని అంశాలు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే మరి రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో చాలా హాయిగా బ్రతుకుతున్నట్లు, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రభావం అసలు ఏమిలేనట్లు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా నమ్మడమే కాకుండా, తమ పార్టీ అధినేతకు కూడా చెప్పడం చూస్తే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే శల్యసారద్యం చేస్తున్నారని భావించవలసి ఉంటుంది. నిద్ర పోయే వారిని లేపోచ్చు కానీ, నిద్ర నటించే వారిని లేపడం ఎవరి తరం?

ABK Prasad

సివిల్స్ ప్రహసనంలో దాగిన డెవిల్స్!

 డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       కుడుము చేతికిస్తే చాలు అదే పండగనుకొనేవాడు అల్పసంతోషి! ఆరంభశూరత్వానికి ఆంధ్రుడు ఎంతపేరు మోశాడో, అల్పసంతోషానికి కూడా అంతగా అలవాటు పడిపోయాడు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐ.ఎ.ఎస్. సిబ్బంది రిక్రూట్ మెంట్ కోసం అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ అవసరమైన ఉన్నతస్థాయి సబార్డినేట్ స్థాయి శాఖలకు నిర్వహించే పరీక్షలు రాయగోరే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలలోనే రాయాలన్న నిబంధనను "ప్రస్తుతానికి నిలుపు చేసినట్టు'' ఒక వార్త [16-03-2013] వెలువడింది. గడచిన నలభైఏళ్ళుగా ఈ 'రూలు'తోనే హిందీమినహా రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్ లోని 17 ప్రాంతీయభాషల అభ్యర్థుల నోళ్ళకు 'సీళ్ళు' వేసేశారు! భారతదేశంలోని చట్టాలముందు పౌరులంతా సమానులేననీ, ఈ చట్టాల కింద అందరికీ సరిసమాన రక్షణ ఉంటుందనీ, ప్రభుత్వ ఉద్యోగ సద్యోగాలలో సర్వులకూ సమానావకాశాలుంటాయనీ హామీపడిన రాజ్యాంగంలోని 14-16 అధికరణలకు విరుద్ధంగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణకు, ఉద్యోగాల్లో అభ్యర్థుల నియామకాలకు బాధ్యత వహించవలసిన స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి.) వ్యవహరిస్తూవచ్చింది. దీని పర్యవసానంగా దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కేంద్ర-రాష్ట్ర సర్వీసులకు లక్షలసంఖలోనే ఉద్యోగార్హులుకాగల అవకాశమున్న యువకులు ప్రాంతీయ భాషలయిన మాతృభాషలకు దూరంకావలసివచ్చి ఉపాధి కోల్పోయారు!     40 ఏళ్ళుగా రాష్ట్రప్రభుత్వాలు స్థానిక భాషలలో కేంద్ర సర్వీసులకు పరీక్షలను (ప్రిలిమ్స్/మెయిన్) నిర్వహించే విషయాన్ని పట్టించుకోకుండా "గుడ్లు అప్పగించి'' చూస్తూ ఉన్నందున ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2011 వరకూ సుమారు 4 లక్షలమంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అంచనా! ఇప్పటికైనా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పాక్షిక విధానాన్ని కేంద్రమూ, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ శాశ్వతంగా నిరోధించి, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషలలో కూడా సివిల్ సర్వీసు పరీక్షలను, ఇంటర్వ్యూలనూ, నియామకాలనూ నిర్వహించకపోతే జాతీయ సమైక్యతా భావనను సంరక్షించడం ఉత్తరోత్తరా సాధ్యపడకపోవచ్చు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తోందంటే, దక్షిణాది రాష్ట్రాలు సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు (బీహార్ వగైరా) కూడా ఎస్.ఎస్.సి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించడంవల్ల 05-03-2013 నాటి సివిల్స్ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా ("ప్రస్తుతానికి'') నిలిపి ఉంచారుగాని, దాని ఉపసంహరణ మాత్రం జరగలేదని గుర్తుంచుకోవాలి. ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ జరిగి, యావద్భారతంలోనూ రాజ్యాంగం హామీపడిన ప్రాంతీయ భాషలలో కూడా యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ లు నిర్వహించే పరీక్షలను రాయడానికి అభ్యర్థులకు అధికారికమైన ఏర్పాట్లు జరిగేదాకా యువకులు విశ్రమించరాదు. ఎందుకంటే, ఇప్పటికీ, నోటిఫికేషన్ కేవలం "తాత్కాలిక నిల్పివేత'' [నోటిఫికేషన్ పుటాన్ హోల్డ్] జరిగిన తరువాత కూడా "సామర్థ్యం'' పేరిట, "సంభాషణా నైపుణ్యా''ల పేరిట, "అవగాహనశక్తి'' పేరిట, "గ్రహ్యశక్తి''. "సంక్షిప్తీకరణ యోగ్యతా'' వగైరాల పేరిట ప్రాంతీయ భాషలను అవమానపరిచే ప్రయత్నం కొందరు ఉన్నతాధికారులు మానుకోలేకుండా ఉన్నారు! ఉదాహరణకు నోటిఫికేషన్ "తాత్కాలిక నిలుపుదల'' వార్త వచ్చిన మరునాడే [17-03-2013] యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ పూర్వాద్యక్షుడు అరుణ్ నిగావేకర్ ఓ విచిత్రమైన "కప్పదాటు'' ప్రకటనతో ముందుకొచ్చాడు. సర్వీస్ కమీషన్ పరీక్షలను, ఇంటర్వ్యూలనూ కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే నిర్వహించాలన్న నోటిఫికేషన్ జారీ చేయడానికి సిఫారసు చేసిన "నిపుణుల కమిటీకి'' ఇంతకుముందు సారథ్యం వహించిన వ్యక్తి ఈ నిగావేకరే! నిజానికి ఇతర ప్రాంతీయ భాషలలో పరీక్షలను, ఇంటర్వ్యూలను నిరోదిస్తున్న నిరంకుశ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ - వేళ కాదు ఎనిమిదేళ్ళ క్రితమే క్రితమే [2004లో] సోదర ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త సుభాష్ చంద్రన్, నేనూ ఆందోళన లేవనెత్తాం. సుభాష్ చంద్రన్ సర్వీస్ కమీషన్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో కీలకమైన రిట్ వేయగా [రిట్ నెం డబ్యు.పి.11000/2004] నేను దానికి దన్నుగా రచనాపరంగా ఆందోళన చేపట్టాను. రిట్ ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కూ నోటీసులు జారీ చేయడమూ తరువాత పరీక్షలు, ఇంటర్వ్యూలను తెలుగు సహా దక్షిణాది ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న కోర్కెలోని సామంజస్యాన్ని సమర్థించడమూ జరిగింది. దానితో చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూచే సర్వీస్ కమీషన్ సంచాలకుడు మన రాష్ట్ర హైకోర్టుకు లేఖరాస్తూ "పిటీషనర్ల డిమాండ్ మేరకు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రాంతీయ భాషలలో దేనిలోనైనా సరే అభ్యర్థులు సమాధాన పత్రాలు రాయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమ్మతించింద''ని తెలిపాడు!   అయినా సరే "కుక్కతోక వంకర'' అన్నట్టుగానే ప్రాంతీయ (మాతృ) భాషలలో సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్, మెయిన్ తుది పరీక్షలు రాయకుండా అభ్యర్థులను నిరోధిస్తూ సర్వీస్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఈసారి కూడా జారీ చేసిందంటే పాలనా నియంత్రణ వ్యవస్థ ఎలా పతనోన్ముఖంగా ప్రయాణిస్తోందో అర్థమవుతుంది. ఇంతకుముందొకసారి సుప్రీంకోర్టు సహితం [రాధేశ్యామ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు] ఇలాంటి నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమనీ, జోనల్ పద్ధతిపైన విడివిడిగా పరీక్షలు నిర్వహించడం "సమానత్వ సూత్రానికే విరుద్ధమ''నీ సర్వీస్ కమీషన్ లాంటి అఖిలభారత స్థాయి సంస్థలకు రిక్యూట్ మెంట్ పరీక్షలను ఏకకాలంలో దేశమంతటా ఒకేసారి నిర్వహించాలనీ ఆదేశించిందని మరవరాదు. కానీ నిగావేకర్ తన కమిటీ సిఫారసును పరోక్షంగా సమర్ధించుకోడానికి 'రూటు'మార్చి ఒక ప్రకటనలో "ఫలానా భాషలోనే సివిల్స్ పరీక్షలను నిర్వహించాలని కమిటీ నొక్కి చెప్పలేద''ని అంటూనే మరొక మెలిక పెట్టాడు : "అభ్యర్థులు సంభాషణా సామర్థ్యాల్ని (కమ్యూనికేషన్ స్కిల్స్) పరీక్షించి మరీ నిర్ణయం చేయాల''ని మాత్రమే కమిటీ కోరిందని చెప్పాడు! కాని ఆ వెంటనే మరొక ఉన్నతాధికారేమో "కమిటీ పరిశీలనకు నివేదించిన అంశాలలో భాషా సమస్యే లేద''ని 'కథ' వినిపించడానికి ప్రయత్నించాడు! అయినప్పుడు మెడమీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికీ వెంటనే స్ఫురించే ప్రశ్న : "అయితే మరి ఇంతకూ ప్రాంతీయ భాషలలో పరీక్షలను అడ్డుకుని సివిల్స్ ను కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే రాయాలన్న నిబంధనను చేర్చిందెవరు? లేదా 'రూల్స్'ను మార్చిందెవరు?'' అని! దేశ స్వాతంత్ర్యం అప్పనంగా అర్థరాత్రి పూట చేతికి బదిలీ అయినట్టే, పాలకులు, అధికారగణం బుద్ధులు కూడా వలసపాలనా వశేషంగా అప్పనంగా సంక్రమించాయి! దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభంలో భాగంగా "చుట్టుచూపు లేని'' విద్యలు, విద్యావిదానాలూ ఏలినాటి శనిగా, ఎలేనాటి శనిగా పీడించడం! సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారనడానికి మరొక ఉదాహరణ - ఆ యు.జి.సి. మాజీ చైర్మన్ నిగావేకర్ "ప్రపంచీకరణ'' నేపథ్యంలో మాట్లాడుతూ "21వ శతాబ్దపు సివిల్ సర్వెంటు (ఉన్నతాధికారి, అంటే ఇంగ్లీషు చదవరి) వర్తమాన ప్రపంచంనుంచి ఎదురయ్యే అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన లక్షణాలు, అర్హతలూ కలిగి ఉండాల''ని ఒక షరతును ముందుకు నెట్టడం! అంటే, మరొక మాటలో, మాతృభాష లేదా 'ప్రాంతీయ భాష నీకు బువ్వపెట్టదు, ఉద్యోగమివ్వదు, కాబట్టి ఇంగ్లీషో, హిందీయో రాకపోతే అసలు నీకు బతుకే లేదు' పొమ్మని చెప్పడమే!   నిజానికి, ఏ సమాచార సాంకేతిక వ్యవస్థ ఆధారంగా ఐ.టి.రంగం దండిగా బువ్వపెడుతుందని, రెండు చేతులూ రెండు జేబులూ కాసులు నింపుతుందని భ్రమింపజేసి అమెరికా పాలకులు తమ బాడుగుపనులను (ప్రోగ్రామింగ్ వగైరా) మనకు అప్పగించారో ఆ పనులను కాస్తా అమెరికాలో తామెదుర్కొంటున్నతీవ్ర నిరుద్యోగ పరిష్కారంలో భాగంగా రేపో మాపో నిలిపివేయక తప్పదని ప్రెసిడెంట్ ఒబామా యిప్పటికీ పదే పదే బెదిరిస్తున్నాడు! పైగా శృతిమించిన ఐ.టి. మోజులో పడిపోయిన మన పాలకులు, బ్యూరోక్రాట్లు దేశంలో భారీ ఎత్తున కోట్లాదిమందికి ఉపాధిని కల్పించగల వ్యవసాయక, వస్తూత్పత్తి (మాన్యుఫాక్చరింగ్), లఘుపరిశ్రమల రంగాలను 'మాడ' బెట్టారు! ఇప్పుడు మన దేశ పరిస్థితి - "తల్లినీతండ్రినీ చంపి వచ్చి అయ్యా నేను తల్లీతండ్రీ లేనివాడిని, ఆదుకోండ''ని మొట్టుకున్నట్టు అయింది! స్థానిక పాలనా సంస్థలు, గ్రామస్థాయి వరకూ సామాన్య ప్రజల అవసరాలు, వారి అవసరాలను గురించి తెలుసుకోడానికి ఉపయోగించాల్సిన సంభాషణా మాధ్యమం ఏది, ప్రజాసమస్యల పరిష్కారంలో ఏ భాషా మాధ్యమం ద్వారా ప్రజాబాహుళ్యాన్ని సమీకరించాలన్న ప్రశ్నలే, ఆచార్య నిగావేకర్ లాంటి "వేతనకర్మ''లకు అనవసరం!   పైగా "నేడు వీస్తున్న పరివర్తనా వాయువులకు అనుగుణంగా'', అంటే, "ప్రపంచభాష అయిన ఇంగ్లీషు భాషకు కిటికీలను బాహాటంగా తెరిచి ఉంచాల''నీ, నేడు "ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, ఇంగ్లీషే చలామణీలో ఉన్న ఈనాటి కరెన్సీ'' అనీ, అదే వెలుగూ, జిలుగూ, అదే కాంతీ, అదే ధ్వనీ (లైట్ అండ్ సౌండ్) అనీ నిగావేకర్ పూనకం పూనారు! ఈ సందర్భంగా ఆయన మరొక అబద్ధాన్ని కూడా వ్యాపింప చేయడానికి వెనుకాడలేదు: "అన్ని వైపులనుంచి శుభ్రపవనాలను-ఆరోగ్యకర గాలుల్ని-వీచనివ్వండి'' అని గాంధీజీ మతమౌఢ్యంతో తీసుకుంటున్నవారికి హెచ్చరికగా వాడిన మాటల్ని వక్రీకరించుతూ "గాంధీజీ కోరుకున్నది ఈ మార్పునే''నని భాషాపరంగా వర్తింప చేయడానికి నిగావేకర్ ప్రయత్నించాడు! కాని, ఇంగ్లీషు భాషా బోధనా గురించి, మాతృభాషలను పణంగా పెట్టి దానిని పెంచాలన్న దేశీయ ఆంగ్ల విద్యాధికుల ప్రయత్నాలను గాంధీజీ వ్యతిరేకిస్తూ ఎలా హెచ్చరించవలసి వచ్చిందో ఈ క్రింది గాంధీజీ మాటల్లోనే నిగావేకర్ వినడం మంచిది:   "భారతీయ విద్యార్థులు ఒక విదేశీభాషను (ఇంగ్లీషును) పాఠశాల తరగతుల్లో నేర్చుకోడానికి వారానికి ఏడుగంటల శ్రమను వృధా చేసుకుంటున్నారు. ఈ దేశానాయకులు పవిత్రమైన ప్రజల విశ్వాసాన్ని కాస్తా వమ్ము చేస్తున్నారు. ఒక భాషగా నేర్చుకోడానికి ఇంగ్లీషు పట్ల నాకు వ్యతిరేకత లేదు. కానీ దేశీయ మాతృభాషలను చంపి వాటి సమాధిపైన ఇంగ్లీషుభాషను మీరు రుద్ద దలిచితే 'స్వదీషీ'భావాన్ని మీరు సరైన అర్థంలో అనుసరించడం లేదని నేను స్పష్టం చేయదలచాను. ఏ దేశమూ తన సొంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేదు. వీరికి ఎంతసేపూ ఇంగ్లీషు విద్యావ్యాప్తిని గురించిన గొడవే. కాని మనం అసలు సమస్యను మరచిపోరాదు - గత అనేక దశాబ్దాల కొలదీ మన తల్లిభాషలోనే మనం విద్య పొందుతూ [ఇంగ్లీషు ఒక భాషగా నేర్చుకోడానికి అవకాశం కల్పిస్తూనే] వస్తున్నామే అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? మనకీపాటికే స్వేచ్చాభారతం ఏర్పడి, మన సొంత విద్యావంతులు మనకు తయారై ఉండేవారు. అప్పుడు తమ సొంత నేలపైన తామే విదేశీయులుగా గడపాల్సిన పని మనకి ఉండేది కాదు; అలా సొంత భాషను గుండెగొంతుకలో పలికించడం ద్వారా నిరుపేదల మధ్యకు చొరబడి బాగా పనిచేయగలిగి ఉండేవారు.   ఆ అనుభవం జాతి భద్రపరచుకోదగిన వారసత్వ సంపదై ఉండేది. కాని ఈ రోజున మనం పరాయిభాషకు అలవాటు పడినందున, మన మంచి భావాలను చివరికి మన భార్యలు కూడా పంచుకోగల స్థితిలో లేరు! అంతేగాదు, మన విద్యాధిక వర్గమంతా విదేశీ (ఇంగ్లీషు) భాష ద్వారానే విద్యావంతులయినందున దేశ ప్రజాబాహుళ్యం సమస్యలపైనగాని, వారి కోర్కెల గురించిగానీ మనలో స్పందన లేకుండా పోయింది. ఎందుకని? మన ప్రజాబాహుళ్యం ఇంగ్లీషు ఆఫీసర్లను గుర్తించిన దానికన్నా మించి మనల్ని గుర్తించడంలేదు గనుక ఫలితం? అటు ఇంగ్లీషు నేర్చిన అధికారులతోనూ, ఇటు మనతోనూ కూడా ప్రజలు మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు. కనుకనే ప్రజల అవసరాలు, కోరికలు మనవి కాకుండా పోయాయి. అన్ని రకాల విజ్ఞాన శాఖలలోనూ మాతృభాషలోనే బోధనా జరిగి ఉంటే ఈ సరికి ఆ శాఖలన్నీ అద్భుతంగా పరిపుష్టమై ఉండేవి. ఆ పనే జరిగి ఉంటే, గ్రామ పంచాయితీలు తమ ప్రత్యేక పద్ధతుల్లో నేడు సజీవశక్తులుగా మనగల్గుతూ ఉండేవి; అదే జరిగి ఉంటే, భారతదేశం స్థానిక అవసరాలకు తగినట్టుగా స్వపరిపాలనా దిశలో, సౌభాగ్యదశలో ఉండేది; అదే జరిగి ఉంటే, తన పవిత్ర భూమిపైన పనిగట్టుకుని మాతృభాషల హత్య అనే అవమానకరమైన దృశ్యాన్ని చూడకుండా దేశప్రజలు తప్పించుకొగలిగేవారు. నాకు ఇంగ్లీషుపైన ద్వేషంలేదు. కాని నాబాధల్లా మాతృభాషల స్థానాన్ని తాను ఎన్నటికీ పొందలేని ఇంగ్లీషుకు అవసరాలకు మించిన ప్రాధాన్యం యివ్వడానికి చేసే ప్రయత్నం గురించే. మాతృభాషలను విస్మరించితే దేశాన్ని భాషా దారిద్ర్యం ఏలడం ఖాయం!''   అంతేగాదు, నిగావేకర్ మరొక అబద్ధాన్ని కూడా ప్రచారంలో పెట్టడానికి సాహసిస్తున్నాడు : "ఒక దశాబ్దం కిందటి దాకా చైనా, జపాన్ లు కూడా ఇంగ్లీషుపైన కేంద్రీకరించకుండానే అభివృద్ధిని సాధించాయ''ని ఒప్పుకుంటూనే ఆయన "ప్రపంచపోటీని తట్టుకోడానికి'' ఇంగ్లీషు భాషను ఒక సాధనంగా గుర్తిస్తున్నాయ''ని ఒక 'టూమ్రీ' వదిలాడు! కాని ఈ రోజుకీ ఆ రెండు దేశాలూ ఇంగ్లీషును కేవలం వాణిజ్యభాషగానే వినియోగించుకుంటున్నాయనిగాని పాఠశాల దశలనుంచి పట్టభద్ర, పట్టభద్రానంతర దశలవరకూ చైనీస్, జాపనీస్ భాషలలోనే విద్యాబోధ జరుగుతోందని ఈ పెద్దమనిషి మరచిపోకూడదు. రేపో మాపో చైనా, ప్రపంచంలోకెల్లా ఆర్థికరంగంలో ఇప్పటికి ప్రథమస్థానంలో అగ్రేసరశక్తిగా ఉన్న అమెరికాను తోసిరాజనబోతోందని అమెరికన్ ఆర్థిక నిపుణులు, అమెరికా, బ్రిటన్, జర్మనీ పాలకులే ప్రకటిస్తున్నారు. అందుకు తగినట్టుగానే రేపటి వాణిజ్యభాషగా చైనీస్ భాష దూసుకు వస్తున్నందున, ఈ మూడు అగ్రరాజ్యాలూ తమ దేశాలలో వందలాదిగా చైనీస్ భాషాధ్యయన పాఠశాలలు ఎందుకు తెరవవలసి వచ్చిందో నిగావేకర్ వివరిస్తే బావుంటుంది!  దూసుకువస్తున్న రేపటి చైనీస్ భాషను కూడా ఇంగ్లీషులాంటి వాణిజ్య భాష మాత్రమే కాగల్గుతుందిగాని దేశీయ మాతృభాషల స్థానాన్ని తోసిపుచ్చజాలదు!   అంతేగాదు, ఇంగ్లీషుభాష మాత్రమే ఉపాధి అవకాశాలు పెంచగలదన్న భ్రమలో పడిన నిగావేకర్ లాంటి విద్యాధికులు అమెరికా, బ్రిటన్ లాంటి "అభివృద్ధి'' చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో అక్కడి పాలనా, బోధనా భాషగా శతాబ్దాల తరబడిగా ఉన్న ఇంగ్లీషు, ఆ దేశాలలో రోజుకొక తీరుగా రెండు అంకెల జోడుగుర్రాలపైన పరుగెత్తుతున్న నిరుద్యోగ సమస్యను (10 నుంచి 11 శాతం దాకా) ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయో కూడా నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి; పెట్టుబదీదారీ విధానాలవల్ల ముమ్మరించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ దేశాల ఆర్థిక సంక్షోభంలో పెట్టుబడి వ్యవస్థకు మూలవిరాట్టుగా ఉన్న వాల్ స్ట్రీట్ గుత్తవ్యాపార వానిజ్యపు ఆయువుపట్టును నొక్కడానికి "ఆక్యుపై ది సిస్టమ్'' అన్న (వ్యవస్థా మార్పుకోసం ఆక్రమణోద్యమం) నినాదంతో విద్యాధికులయిన నిరుద్యోగాలు ఎందుకు ప్రయత్నించవలసి వచ్చిందో నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి! కాని అమెరికా ఆర్థిక విశ్లేషకులలో ప్రసిద్దుడయిన ప్రొఫెసర్ మైఖేల్ యేట్స్ తాజా అంచనాల ప్రకారం, 2009-2011 మధ్యకాలంలో అమెరికా జాతీయోద్యమంలో 88 శాతం కార్పోరేట్ గుత్తసంస్థల లాభాల కింద స్వాహా అయింది; కాగా కేవలం 1 శాతం ఆదాయం మాత్రమే ఉద్యోగవర్గాల వేతనం కింద జమ అయింది! వ్యక్తిగత ఆదాయాల్లో మొత్తం ఆదాయ పెరుగుదలలో 93 శాతం ఆదాయం జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్న అమెరికన్ల హక్కుభుక్తమై పోయింది! అమెరికా విధాన నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అమెరికన్ గూఢచారి సంస్థ (సి.ఐ.ఎ) నిర్వహిస్తున్న "వరల్డ్ ఫేస్ బుక్'' అంచనా ప్రకారం నేడు ఇంగ్లీషు ప్రపంచభాషా కేంద్రంలో ఒకటైన అమెరికాలో ప్రబలిపోయిన ఆర్థిక అసమానతలు ఏస్థాయికి వెళ్ళాయంటే చిన్నదేశాలయిన ఐవరీకోస్టు, కామెరూన్ దేశాలకన్నా అమెరికాను వెనకపడేశాయి, ఇక అసమానతలలో ఉగాండాకన్నా అమెరికా ఓ మెట్టు కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంది! ఇక ఇంగ్లీషుకు శిష్టాది గురువుగా భావించుకుంటున్న అదే అమెరికాలో 2001 తర్వాత ఈరోజు దాకా మొత్తం ఉద్యోగాల సంఖ్యా పెరగనేలేదు. 16-50 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతి ఒక్క వయోవిభాగంలోనూ ఉపాధి పొందినవారి సంఖ్య "సముద్రంలో నీటిబొట్టు''తో సమానమని నిపుణుల అంచనా! విచిత్రమేమంటే, ఈ ఆంగ్లభాషా కేంద్రం (అమెరికా)లో కార్పోరేట్ రంగం చెల్లించవలసిన పెన్షన్ ల విషయంలో అనుసరిస్తున్న దోపిడీ పద్ధతుల మూలంగా వృద్ధాప్యంలో ఉన్న కార్మికులు మాత్రమే ఎక్కువ శ్రమించవలసి రావటం! ఇక 16-29 సంవత్సరాల మధ్యవయస్సులో ఉన్న యువతకు ఉపాధి బాగా దూరమైపోయింది! కళాశాలల నుంచి వచ్చే పట్టబద్రులలో మెజారిటీ నిరుద్యోగులుగా ఉండిపోవలసివస్తోంది, లేదా డిగ్రీ అవసరంలేని పనులకయినా ఎగబడాల్సి వస్తోందని అంచనా! [2011 డిసెంబర్ 15: అసోసియేటెడ్ ప్రెస్]! ఆంగ్లభాషా కేంద్రమైన అదే అమెరికాలో కళాశాలల పట్టభద్రులు అసంఖ్యాకంగా ఉపాధి దొరకక తిరిగి ఇళ్ళదారి పడుతూండటం మరొక విశేషం! అతి చిన్న దేశాలయినా, అమెరికానుంచి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను 50 ఏళ్ళకుపైగా ఎదుర్కొంటున్న క్యూబా, వెనిజులాల్లో విద్య, వైద్య, ఉపాధిరంగాలను ఎంతటి సామర్థ్యంతో నిర్వహించుకుంటూ ప్రపంచప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారో మన పాలకులు, బ్యూరోక్రాట్లూ తెలుసుకోవటం శ్రేయస్కరం! తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుడుతూనే ఉందట, తెలుకొండిలాంటి నిరంకుశాధికారవర్గం కనుసన్నల్లో జరిగే తంతు కూడా అంతే! నోటిఫికేషన్ "నిలుపుదల'' ఉపసంహరణ కాదు, స్పష్టమైన జీ.వో. విడుదలయ్యేదాకా అల్పసంతోషం అల్పాయుర్థాయం లాంటిది! ఇంతవరకూ కేంద్రప్రభుత్వంగాని యు.పి.ఎస్.సి.గానీ జీ.వో. విడుదల చేసినట్టు వార్తలేదు, నోటి ప్రకటనలు తప్ప!    

boston bomb blast

బోస్టన్ పేలుళ్ళ కు పాల్పడిన వ్యక్తి కాల్చివేత

        అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్ళకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు 'మిట్' క్యాంపస్ లో భద్రతా సిబ్బంది పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళసిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు. దుండగులపై పోలీసులు కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో వ్యక్తి పారిపోయాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తిని బోస్టన్ మారథాన్ లో బాంబు పేలుళ్ళకు పలుపడిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. బోస్టన్ బాంబు పేలుళ్ళకు సంబంధించి ఎఫ్.బి.ఐ అధికారులు ఇద్దరు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేశారు. సీసీటీవీ కెమెరాల విడియో ఆధారంగా వీరిని అధికారులు గుర్తించారు.

Jupally Krishna Rao minister aruna

డీకే అరుణ కలియుగ తాటకి

      పాలమూరు జిల్లాలో మంత్రి అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్దం ముదిరి పాకాన పడింది. తనపై డికె అరుణ చేసిన వ్యాఖ్యలపై జూపల్లి ధీటుగా సమాధానం ఇచ్చారు. చీర, గాజులు నీ భర్త భరత్ సింహారెడ్డికి ఇవ్వాలని సూచించారు. నీవు కలియుగ తాటకివి అని, దమ్ముంటే రాజీనామా చేసి ఒక్క ఓటుతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు. తెలంగాణ వాదాన్ని అణచేందుకు ముఖ్యమంత్రి ఆడించినట్లు ఆడుతుందని, సోదరిలా భావించి ఊరుకుంటే బజారున పడి బజారు మాటలు మాట్లాడుతుందని, హోంమంత్రి పదవి కోసమే ఆమె ఆరాటం అని అన్నారు. జడ్పీటీసీగా గెలిపించి అరుణకు రాజకీయ భిక్ష పెడితే అధికారం ఉందని ఎగిరిపడుతుందని, పోలీసుల బలం చూసుకుని మాట్లాడుతుందని విమర్శించారు. అరుణ జీవితం దందాల మయం అని, నాకు దమ్ముంది కాబట్టే పోలీసుల భద్రతలేకుండా తిరుగుతున్నానని, గద్వాలలో పాదయాత్ర చేశానని, అరుణ అహంకారం చూసి అక్కడ జనం బ్రహ్మరథం పట్టారని అన్నారు. నన్ను పిల్లి అని అరుణమ్మ అందని, అవును నేను పిల్లినే అందుకే ప్రజల చుట్టూ తిరుగుతున్నాను. మీలాగ రక్త మాంసాలు తినే పులిని, తోడేలును కాదు అని జూపల్లి అన్నారు.

 SeetaRamula Kalyanotsavam

వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

        శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఆలయంలోని మిథిలాస్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా స్టేడియంకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.అనంతరం అభిజిత్ లఘ్యాన వేదపండింతులు మాంగల్య ధారణ చేశారు. అంతకు ముందు టీటీడీ తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. సీతారాముల కల్యాణానికి కేంద్ర మంత్రి బలరాంనాయ్, మంత్రులు సి.రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ప్రముఖుల రాకతో భద్రాద్రిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

hyderabad

హైదరాబాదులో నెలరోజుల-భార్యలతో అరబ్బుల వ్యభిచారం

  కొన్ని సం.ల క్రితం హైదరాబాద్ జంటనగరాలలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద ముస్లిం తల్లితండ్రులు డబ్బుకు ఆశపడి తమ కుమార్తెలను అరబ్ షేకుల ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి ఇంకా అడ్డుకట్ట పడిందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు కొత్తగా ‘నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు’ పేరిట అరబ్ షేకులకు తమ కుమార్తెలను ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఇస్లాం మతంలో వ్యభిచారం నేరం కనుక, అరబ్ షేకులు దానికి పరిష్కార మార్గంగా ఈ నెల రోజుల ఉత్తుత్తి పెళ్ళిళ్ళు పేరుతో తమ కామదాహం తీర్చుకొని గడువు పూర్తయిన తరువాత ఆ బాలికలకు మతాచారం ప్రకారం ‘తలాక్’ చెప్పేసి విమానం ఎక్కేస్తున్నారు. కానీ, వ్యభిచారం నేరమని భావించేవారు అదే పనిని మరో పద్దతిలో చేయడం, అందుకు నీతి నియమాలు పక్కన పెట్టడం ఏవిధంగా సమర్ధనీయం?  హైదరాబాద్ జంట నగరాలలో ఇటువంటి వ్యవహారాలూ గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం.   అటువంటి బలవంతపు వ్యభిచారం నుండి తప్పించుకొన్న 17 ఏళ్ల నౌషీన్ తోబస్సుం అనే బాలికను హైదరాబాద్ మోఘల్పురా పోలీసులు రక్షించడంతో ఈ కాంట్రాక్ట్-పెళ్ళిళ్ళ పేరిట సాగుతున్నవ్యభిచార వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఆమెను సూడాన్ దేశానికి చెందిన ఉసామా ఇబ్రహీం మొహమ్మద్ (44) అనే వ్యక్తికిచ్చి ఆమె తల్లి తండ్రులు ఇటీవలే ‘నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి’ చేసారు. అందుకు ప్రతిఫలంగా అతను లక్ష రూపాయలు ఇవ్వగా, దానిలో ఆ బాలిక బంధువు ముంతాజ్ బేగం రూ.70,౦౦౦ బాలిక తల్లితండ్రులకిచ్చి, మిగిలిన దానిలో రూ.5,౦౦౦ పెళ్ళికి ‘తలాక్ నమాతో కూడిన అగ్రిమెంటు’ పేపరు తయారు చేసిన ఖాజీకి రూ 5,౦౦౦, ఆ అగ్రిమెంటు పేపర్లను ఉర్దూ బాషలో అనువాదo చేసిన వ్యక్తికి రూ. 5,౦౦౦ ఇచ్చి, మిగిలినది తానూ ఉంచుకొన్నట్లు ఆమె తెలియజేసింది.   ఆమెతో కలిసి సుడాన్ వ్యక్తి బసచేసిన హోటల్ కి వెళ్ళిన తోబసం అతను బలవంతం చేయబోతే తప్పించుకొని ఇంటికి పారిపోయి వచ్చేసింది. కానీ, అతను కూడా ఆమెను వెంబడిస్తూ ఇంటికి రావడంతో, ఆమె తల్లితండ్రులు తమ కుమార్తెకు నచ్చజెప్పి త్వరలో అతని వద్దకు పంపుతామని హామీ ఇచ్చి పంపేసారు. తన కన్నతల్లితండ్రులే తనకు రక్షణ కల్పించకపోగా అతనికి అప్పజెప్పే ప్రయత్నం చేయడంతో, తోబసుం వారి నుండి తప్పించుకొని పోలీసుల ఆశ్రయంలో జేరడంతో ఈ వ్యవహారం అంతా బయట పడింది.   ఈ నెల రోజుల పెళ్లిళ్లకు వ్యతిరేఖంగా చాలా కాలంగా పోరాడుతున్న హైదరాబాదు మహిళా మరియు శిశు సంక్షేమ సంఘానికి చెందిన షిరాజ్ ఆమినా ఖాన్ కూడా ఒక్క హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటి నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి-వ్యభిచార వ్యవహారాలూ నెలకి కనీసం 15 వరకు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతీనెలా హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటివి చాలా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయ్ కుమార్ అనే స్థానిక పోలీసు అధికారి కూడా చెప్పడం విశేషం. ఇక దేశం మొత్తం మీద ఇంకెన్ని జరుగుతున్నాయో లెక్క లేదు, ఎవరికీ తెలియదు.   ఈ వ్యవహారంలో కొందరు దురాశాపరులయిన ఖాజీలు, బ్రోకర్లు చేతులు కలిపి పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. గల్ఫ్ దేశాలలో కన్యా శుల్కం పద్దతి అమలులో ఉన్నందున అక్కడ అబ్బాయిలకు వధువులు దొరకక పెళ్ళిళ్ళు కాకపోవడం దీనికి ఒక కారణం అయితే, పెళ్ళిళ్ళు అయినప్పటికీ, ధనవంతులయిన అరబ్ షేకులు తమ కామవాంఛలు తీర్చుకోవడానికి భారత్, పాక్ వంటి దేశాలలో పేదరికంలో మగ్గుతున్న ముస్లిం సమాజంపై కన్నేశారు.   ఈ వ్యవహారంలో అన్నెం పున్నెం ఎరుగని నిరుపేద ముస్లిం చిన్నారులు బలయిపోతుంటే, సమజానికి సరయిన మార్గ దర్శనం చేయవలసిన కొందరు ఖాజీలే ఆ పాపానికి ఒడిగట్టడం చాలా దారుణం. ఇక మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, నెలరోజుల తరువాత తలాక్ ఇవ్వబడిన బాలిక కష్టాలు దానితో తీరకపోగా, అప్పటి నుండే నిజమయిన కష్టాలు మొదలవుతాయి. నెలరోజుల పెళ్లి పేరిట వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆ బాలికల పేర్లు బ్రోకర్స్ లిస్టులో చేరిపోవడంతో నాటి నుండి ఆమె ఇటువంటి కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు చాలానే చేసుకోవలసి వస్తుంది.   మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, ఆవిధంగా సంపాదించిన డబ్బుతో ఆమె తన కుటుంబ అవసరాలు ఒక పక్క తీర్చుతూనే, ఆ తరువాత కాలంలో ఎప్పుడయినా సాద్యపడితే తన ‘నిజమయిన పెళ్లికోసం’ కూడా ఆమె డబ్బు కూడబెట్టుకోవలసిఉంటుందని ఆ బాలిక పోలీసులకి తెలిపింది. హృదయ విదారకమయిన ఇటువంటి వ్యవహారాలను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలి.   యావత్ ముస్లిం సమాజానికి తామే ప్రాతినిద్యం వహిస్తున్నామనే కొందరు నేతలు ఇటువంటి వాటిని అరికట్టడానికి ఏమి చేసారని ప్రశ్నించాల్సిన ఆవసరం ఉంది. ఈ ఊబిలో చిక్కుకొన్న, చిక్కుకొంటున్న అనేక మంది అభం శుభం తెలియని చిన్నారులను, బాలికలను కాపాడేందుకు వారేమి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.

బ్రాహ్మణుల కోసం 500కోట్లు

        మొన్న కాపు ఓటర్లకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రాహ్మణులకు కూడా వరాలిచ్చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు ఉచితంగా విద్యా సదుపాయం కల్పిస్తామని, దానికి బడ్జెట్‌లో రూ.500కోట్లు కేటాయి స్తామని చంద్ర బాబు హామీ ఇచ్చారు. పేద బ్రాహ్మ ణులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కార్యా చరణను తయారు చేసి అండగా ఉంటా మన్నారు. వృద్ధ బ్రాహ్మణులకు రూ.600ల పెన్షన్‌ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు కనీసం బంగారు తాళిబొట్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, తీసుకున్న రుణాలు మాఫీ చేసి వారిని ఆదుకుంటామన్నారు.

తెలంగాణ కోసం యువకుడు బలిదానం

      తెలంగాణ కోసం మరో యువకుడు ప్రాణాలర్పించాడు. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత విద్యాసాగర్ రావును గెలిపించాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలని అందులో పేర్కొన్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన పెరుమాండ్ల నరేష్ బీజెవైఎం మండల ఉపాధ్యక్షుడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రివరకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి వెతకగా పొలం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించింది. ఆ పక్కనే నరేష్ పడి ఉండడం గమనించిన అతని తండ్రి నారాయణ 108కు సమాచారాన్ని అందించాడు. 108 సిబ్బంది వచ్చి నరేష్ మరణించినట్లు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణను ఇస్తుందని, బీజెపీని ప్రజలు గెలిపించాలని ఆ లేఖలో రాశాడు.

బయ్యారం గనుల కేటాయింపుపై టి.ఆర్.ఎస్. గరం గరం

  బయ్యారం గనులలోని ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టి.ఆర్.ఎస్. నేతలు హరీష్ రావు, టి.ఆర్.ఎస్.ఎల్పీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సబ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విభేదించగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ స్వాగతిస్తున్నారు. గనుల కేటాయింపుపై మాట్లాడుతూ హరీష్ రావు ... విశాఖ స్టీల్స్ కు తెలంగాణాలోని గనులు అప్పగిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బొకారో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి భారీ ఫ్యాక్టరీ బయ్యారంలో స్థాపించి లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది తెలంగాణా యువతకు ఉద్యోగాలు కల్పించారో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. టి.ఆర్.ఎస్. ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణాలోని సహజ వనరులను తాతజాగీరులా సీమాంధ్రకు కట్టబెడితే ఖబడ్దార్ అని ఘాటుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.  బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని ఖమ్మం జిల్లాలోని ఖనిజాన్ని ఇక్కడే వినియోగించుకునేందుకు వీలుగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బయ్యారం, తెలంగాణాలోని బాగా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడే ఉక్కుపరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని, దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిఎంకు లేఖ రాశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే సరిపోదని, దాని ద్వారా ఖమ్మంలో పూర్తీస్థాయి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగానైనా బయ్యారం సహా 5342 హెక్టార్ల ఇనుపగనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు

యూనిట్ కు 70 పైసలు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

  విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలు, నిరాహార దీక్షలు, బంద్ లతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి యూనిట్ కు 70 పైసలు చొప్పున వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈ.ఆర్.సి.) ప్రస్తుత చైర్మన్ రఘోత్తమరావు ఈ నెల 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే విద్యుత్ ఛార్జీల పెంపు తీర్పు రాబోతోంది. సర్ ఛార్జీ (ఎఫ్.ఎన్.ఏ.) పేరిట ఈ.ఆర్.సి. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో అక్టోబరు, నవంబరు, డిసెంబరు(త్రైమాసికం)లో వాడిన విద్యుత్ కు ఒక్కొక్క యూనిట్ కు 70 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తం 850కోట్ల రూపాయలు సర్ ఛార్జీని ఈ.ఆర్.సి. విధించాబోతోంది. డిస్కంలు 1098కోట్ల రూపాయల ఇంధన సర్ ఛార్జీ వసూలుకు అనుమతి కోరాయి. దీని వసూలు జూన్ నెల బిల్లు నుంచి ఆగస్టు బిల్లు వరకు ఉంటుందని ఈ.ఆర్.సి. వసూలు చేసేందుకు సిద్ధమైంది.