జగన్ని తట్టుకోవడం కష్టమబ్బా: అనంత రెడ్డి

  జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత అతని పార్టీలోకి దూకాలనుకొన్న కొద్ది మంది కాంగ్రెస్ నేతలలో యంపీ అనంత వెంకట రామిరెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజన కారణంగా రానున్నఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తే ఘోరపరాజయం పాలవుతాననే భయంతో వైకాపా కండువా కప్పుకొనేందుకు సిద్దపడ్డారు. ఆ క్రమంలో జగన్ నిరాహార దీక్ష చేస్తున్నపుడు వెళ్లి అతనిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోనేందుకు ముహూర్తం కూడా ఖారారు చేసుకొన్నారు. అయితే విశ్వరూప్ వంటి వారు కొందరు వైకాపాలో చేరినప్పటికీ, ఆయన మాత్రం ఇంత వరకు చేరలేదు.   ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు. కారణం ఆయనను పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ ఆయనకి ఏవో కొన్ని షరతులు పెట్టడమేనట. సాధారణంగా పార్టీ మారదలచుకొన్నవారు ముందుగా తాము జేరబోయే పార్టీలో తమ టికెట్స్ కోసం బెరామాడుకొని, అంతా ఖాయం చేసుకొన్నాక పార్టీలో చేరుతారు. కానీ ఎవరయినా నేతలు వైకాపాలో చేరాలంటే ముందుగా జగన్ పెట్టే కొన్నిషరతులు అంగీకరించాలనడం విచిత్రమే.   జగన్మోహన్ రెడ్డి విచిత్ర వ్యవహార శైలిని తట్టుకొని ఇబ్బందులు పడటంకంటే ఆ కష్టమేదో కాంగ్రెస్ పార్టీలోనే పడితే కనీసం గౌరవమయినా దక్కుతుందని ఆయన వెనక్కి తగ్గారు. ఆయన వైకాపాలో చేరితే అనంతపురం నుండి మరి కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఆయనను అనుసరించాలని అనుకొన్నారు. కానీ, ఆయనే ఆగిపోవడంతో మిగిలిన వారు కూడా వెనక్కి తగ్గారు.

కాంగ్రెస్‌లో విలీనంపై కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  కాంగ్రెస్‌లో విలీనం ఉండదని ప్రజలకు గట్టిగా చెప్పాలంటూ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్న నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   "శిక్షణ తరగతుల నిర్వహణను సీరియస్‌గా తీసుకోండి. ఇందుకు సంబంధించి వివిధ బాధ్యతలు స్వీకరిస్తున్న వారు క్షేత్ర స్థాయి నివేదికలను పార్టీ నేత కడియం శ్రీహరికివ్వండి. నేను ఇంటెలిజెన్స్, సర్వే నివేదికలను తెప్పిస్తాను. అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత నాయిని నర్సింహారెడ్డి సారథ్యంలోని పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ జాబితాను డిసెంబర్‌లో వెల్లడిస్తాం'' అని టీఆర్ఎస్ చీఫ్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని కేసీఆర్ బదులిచ్చారు. "కాంగ్రె స్‌లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని నేను స్వయంగా చెప్పలేను. పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులుంటాయ్. నేను ఏది చెప్పినా ప్రతిస్పందనలు ఉంటాయి. మీరు ఏదైనా స్వేచ్ఛగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని మీడియా సమావేశాల్లో.. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో సూటిగా చెప్పండి. ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండి'' అని ఉద్భోదించారు.

తెలంగాణా ముఖ్యమంత్రిగా జైపాల్ రెడ్డికే తొలి ప్రాధాన్యత

  ఇంతవరకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెర వెనుకే ఉంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం కృషిచేసారు. అయితే ఇటీవల వరంగల్లో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో పాల్గొనడం ద్వారా ఇక ప్రత్యక్షంగా పనిచేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదట ముఖ్యమంత్రి పదవి చెప్పట్టాలని ఆశిస్తున్నవారు టీ-కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రమంత్రిగా సుదీర్గ అనుభవం, కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలున్నజయపాల్ రెడ్డి కూడా పోటీలో దిగితే మిగిలినవారు, ఇక ఆశలు వదులుకోక తప్పదు.   కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా అటువైపు నుండి సానుకూల సంకేతాలు రావడం లేదు. అంతే గాక తామే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసి, రాష్ట్ర పునర్నిర్మాణం కూడా చేస్తామని తెరాస నేతలు గట్టిగా చెపుతున్నారు. సీమాంధ్రని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నా కూడా దాని ఫలితం తమ పార్టీకి కాక తెరాసకు దక్కుతుందంటే కాంగ్రెస్ చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోదు.   కేసీఆర్ ధాటిని తట్టుకొని, తెలంగాణా సాధించిన కీర్తి భుజాన్నేసుకొని యుద్దానికి వస్తున్న తెరాసను డ్డీ కొని గెలవాలంటే చాలా సమర్దుడయిన నేత పార్టీకి చాలా అవసరం. ఇప్పుడున్న నేతలలో జయపాల్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవజ్నుడు, అందరినీ కలుపుకొనిపోగల సమర్ధుడు లేరు గనుక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఈయవచ్చును.   నీతి నిజాయితీలకు మారుపేరయిన ఆయన పెట్రోలియం శాఖా మంత్రిగా ఉన్నంత కాలం సాక్షాత్ రిలయన్స్ కంపెనీనే గుమ్మం దగ్గిర నిలబెట్టేసిన ఘనుడు. ఆయన కీలకమయిన తన పెట్రోలియం శాఖను వదులుకోవడానికి సిద్దపడ్డారు తప్ప, తన సిద్దాంతాలను, విలువలను వాదులుకోవలనుకోలేదు. అందుకే ఆయనను పెట్రోలియం శాఖ నుండి ప్రస్తుత శాఖలోకే మార్చేసింది కాంగ్రెస్ అధిష్టానం.   మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే క్రిందనున్న వారికి ఇక ‘మిగిలేదేమి ఉండదు’. అయితే ఆయన వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టిగా నిలద్రోక్కుకోవడమే కాకుండా, తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే, తెలంగాణాలో జైపాల్ రెడ్డి ప్రభుత్వాలు కొలువు తీరినట్లయితే అది తెలంగాణా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చవచ్చును. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక మౌలిక వసతులు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చెప్పతవలసి ఉంటుంది గనుక మొదటి ఐదు సం.లు చాలా కీలకం. అందుకు సమర్దుదయిన, నిజాయితీ పరుదయినా నాయకుడు చాలా అవసరం. గనుక ఆ అర్హతలన్నీ ఉన్న జైపాల్ రెడ్డికే ప్రాధాన్యత ఈయవచ్చును.   జాతీయస్థాయిలో పనిచేసిన ఆయన, అదే జాతీయ దృక్పధం చూపుతూ ఇంతకాలంగా తెరాస ప్రజలలో నాటిన విషబీజాలను ఏరిపారేసి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య మళ్ళీ సహృద్భావ వాతావరణం ఏర్పరచగలరు. తద్వారా రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చే అనేక సమస్యలను ఆయన సామరస్యంగా, చాకచక్యంగా ఎవరికీ నష్టం కలుగని రీతిలో పరిష్కరించగలరు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ కుర్చీ అప్పగిస్తుందో చూడాలి.

వ్యాటే టాక్స్ సర్ జీ!

  సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో అలా ఏదయినా మంచి హోటల్ కి వెళ్లి లైట్ గా ఏదయినా టిఫిన్ లేదా డిన్నర్ చేసి వద్దమనుకొంటున్నారా? అయితే ఓసారి ఇది చదివి బయలుదేరితే మంచిది. ఇటీవల విజిలన్స్ శాఖ అధికారులు హైదరాబాదులో ఆరు ప్రముఖ హోటల్స్ రికార్డులు తనిఖీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమయిన విషయం వెలుగులోకి వచ్చింది.   ఇప్పుడు మనం తినే భోజనానికి, తాగే నీళ్ళకి కూడా (పీల్చేగాలికి ఇంకా చెల్లించనవసరం లేదు)వాట్ టాక్స్, సర్వీస్ చార్జ్, సర్వీస్ టాక్స్ వగైరాలు కట్టక తప్పదని అందరికీ తెలుసు. సాధారణంగా వినియోగదారులు తాము తినే ఆహారానికి మాత్రమే 14.5 శాతం వ్యాట్ టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ సదరు హోటల్స్ వారు ఆహారంపై వసూలు చేస్తున్నసర్వీస్ చార్జ్ మరియు సర్వీస్ టాక్స్ లపై కూడా వ్యాట్ టాక్స్ వసూలు చేస్తున్నట్లు బయటపడింది. సాధారణంగా ఇటువంటి విషయాలు వినియోగదారులు పెద్దగా గమనించరు గనుక, హోటల్ యాజమాన్యాలు ఈవిధంగా టాక్స్ పై టాక్స్ వేసి గత ఏడాది రూ.2.48 కోట్లు అదనంగా వినియోగదారులకి తెలియకుండా పిండుకొన్నారు.   ఈ తెలివి తేటలు కేవలం ఈ ఆరు హోటల్స్ కే పరిమితం కాదు గనుక, రాష్ట్రంలో, దేశంలో ఏ హోటల్ కి వెళ్ళినా ఈ అదనపు టాక్స్ వడ్డింపులు కూడా ఉంటాయని మరిచిపోకండి. దైర్యం ఉంటే అడగండి. ఆ టెన్షన్లు మనకొద్దనుకొంటే బేరర్ కి మరో పదో పరకో ఎక్కువ టిప్పు ఇస్తున్నామని సరిబెట్టుకొని చల్లగా బయటపడండి.

శభాష్ ఎర్రబెల్లీ!

      తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వున్న కార్యకర్తల నుంచి జాతీయ స్థాయిలో వున్న నాయకుల వరకూ ఇప్పుడు శభాష్ ఎర్రబెల్లీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల తన సహచరులు కోడెల శివప్రసాదరావు, పయ్యావుల కేశవ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాదిగా ఎర్రబెల్లి చేసిన కామెంట్లను తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ సానుభూతితో అర్థం చేసుకున్నారు.   ఎర్రబెల్లి స్థానంలో ఎవరూ వున్నా అలాగే స్పందించేవారని భావించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతాయని, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి. అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యల వివాదం టీ కప్పులో తుపానులా చల్లారిపోయి ఆ పార్టీలకు నిరాశ మిగిల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన దింపుడుకళ్ళం ఆశలను వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుని కాంగ్రెస్ వైపు లాక్కోవాలని గాలం వేసింది. ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ సృష్టికర్త అయిన కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లిని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని చేసిన అన్ని ప్రయత్నాలనూ ఎర్రబెల్లి విజయవంతంగా తిప్పికొట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రాంత  నాయకులు, కార్యకర్తలో జరిపిన మేధోమధన సదస్సులో ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టనని, ఒకవేళ పార్టీని వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని ఎర్రబెల్లి ప్రకటించడం సదస్సులో కరతాళధ్వనులు మోగేలా చేసింది. శభాష్ ఎర్రబెల్లీ అని పార్టీలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించేలా చేసింది. ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకులు చంద్రబాబు వెంట వుంటే ఇక తిరుగేముంటుందని మేధోమథన సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు.  

టీ కాంగ్రెస్ తంటాలు చూతము రారండీ!

      టీ కాంగ్రెస్ నాయకులు పడుతున్న తంటాలు చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. తెలంగాణ వచ్చేస్తోందని పైపైకి మాత్రం లేని ఉత్సాహం ప్రదర్శిస్తూ సోనియాకి ‌కృతజ్ఞతలు చెప్పే సభలు నిర్వహించడం, సీమాంధ్రుల నుంచి ఏ రకంగా హక్కులన్నిటినీ లాక్కుని తరిమేయాలో కేంద్రానికి సూచించడం చేస్తున్నారుగానీ, లోలోపల వాళ్ళు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.     కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ వస్తుందా, రాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ తెలంగాణ రాకపోతే ఆల్రెడీ సీమాంధ్రలో గల్లంతైపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం వుంది. ఇప్పటి వరకూ తెలంగాణ ఇచ్చిందీ.. తెచ్చిందీ మేమే అని గొప్పలు చెప్పుకుంటున్న టీ కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనంత స్థాయిలో ఓడిపోయే అవకాశం వుంది. రెండు మూడు రోజుల నుంచి మారిన పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. అలాంటి సరుకులేని తెలంగాణను తెచ్చినందుకు తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోన్న భయం కూడా టీ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత వాళ్ళే పశ్చాత్తాపపడతారని అనడం అందరిలో బోలెడన్ని సందేహాలను రేకెత్తించింది. అలాగే, తెలంగాణ వచ్చేసింది కదా ఆరామ్‌గా కూర్చుని వినోదం చూద్దామనుకున్న టీ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ముందు ఎన్ని తంటాలు పడుతున్నారో టీ కాంగ్రెస్ నాయకులూ అన్ని తంటాలు పడాల్సిన పరిస్థితులొచ్చాయి.  వీటన్నిటికంటే వీళ్ళు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ఏంటంటే, తెలంగాణ వస్తే కాబోయే సీఎం ఎవరన్నదే!  టీ కాంగ్రెస్ నాయకులలో డజనుకు పైగా నాయకులు రాబోయే తెలంగాణకు తానే కాబోయే సీఎం అని కలలు కంటున్నారు. తెలంగాణ కోసం ఇన్ని తంటాలు పడుతున్నాను.. నేను సీఎం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రతి ఒక్క నాయకుడూ, నాయకురాలూ మనసులో మథన పడుతున్నారు.

'ఆమ్ ఆద్మీ'పై కాంగ్రెస్ పగ

      ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీని ఊడ్చేయడానికి 'చీపుళ్ళు' సిద్ధమయ్యాయి. చీపురుకట్ట గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన 'ఆమ్ ఆద్మీ' పార్టీ ఢిల్లీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఢిల్లీని మురికికూపంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ఊడ్చిపారేసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి అందుతున్న చందాల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించింది. తమకు అందిన చందాల వివరాలను బయటపెట్టింది. అందులో కొన్ని ప్రవాస భారతీయుల నుంచి అందిన చందాలు కూడా వున్నాయి. విదేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన చందాలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తమమీద విజయం సాధించబోతున్న 'ఆమ్ ఆద్మీ' పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     ఇది కాంగ్రెస్ మార్కు విచారణ జరిపి, ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగమని అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలకు లభించే చందాలను బహిర్గతం చేయాల్సన అవసరం లేదనీ గొంతెత్తి చాటి, పార్లమెంటులో బిల్లు కూడా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ చందాలపై విచారణ జరిపించాలనుకోవడం విచిత్రంగా వుందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. తన పార్టీ చందాలపై విచారణ జరిపించే ముందు కాంగ్రెస్ పార్టీ తనకు వస్తున్న చందాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. చందాల బహిర్గతం విషయంలో కాంగ్రెస్ కిక్కురుమనడంలేదు.

సీబీ‘ఐ’- కాంగ్రెస్‘ఐ’

      కాంగ్రెస్-ఐ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, తనకు అవసరమైన వారిని దారికి తేవడానికి అస్త్రంలా ఉపయోగిస్తున్న సీబీఐకి చట్టబద్ధతే లేదని గౌహతి హైకోర్టు తీర్పు ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీతి నిజాయితీలకు తానే కేరాఫ్ అడ్రస్ అని బిల్డప్ ఇచ్చుకుంటున్న సీబీఐ అసలు గుట్టు ఇదా అని దేశం మొత్తం తెల్లబోయింది.   గౌహతి హైకోర్టు తీర్పుతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం సదరు తీర్పు మీద స్టే విధించడం ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. మొత్తమ్మీద సీబీఐ ఉనికికే ప్రమాదం రావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోంది. సీబీఐ అంటే మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీకి కన్నులాంటిది. ఈ కన్ను లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒంటికంటిదైపోతుంది. ఈ కన్ను సాయంతోనే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థుల మీద దృష్టిని కేంద్రీకరించి ‘దిష్టి’ పెడుతూ వుంటుంది. సీబీఐ ఉనికి దేశానికి ఏం మేలు చేస్తుందో తెలియదుగానీ, కాంగ్రెస్‌కి మాత్రం బోలెడంత మేలు చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికే వస్తే, సీబీఐ కేసులను అడ్డు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ జగన్ మహాశయుణ్ణి తన దారికి తెచ్చుకుంది. అతని సహకారంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి పథకరచన చేసింది. ఇప్పుడు సీబీఐ అనేదే లేకపోతే, సీబీఐ బుక్ చేసిన కేసులన్నీ బుట్టదాఖలైపోతే జగన్‌ని కట్టడి చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి వుండదు. ఒక్క జగన్ మాత్రమే కాదు. లాలూప్రసాద్ యాదవ్, రాజా, కనిమొళి లాంటి ఎందరో అవినీతి చేపలు కాంగ్రెస్ వలలోంచి తప్పించుకుని పోతాయి. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ సీబీఐని కాపాడుకుని తీరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ హయంలోనే తెలంగాణ: షిండే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జీవోఎం సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ యూపీఏ -2 పదవీ కాలం పూర్తయ్యేలోపు తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే ప్రకటించారు. ఉమ్మడి రాజధాని విషయంలో హైదరాబాద్ పరిధిపై జీవోఎంకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. అవన్నింటినీ కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. 371డి సంగతి జీవోఎం చూసుకుంటుందని షిండే చెప్పారు. షిండే ఉద్దేశ్యం ప్రకారం, 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయనే స్పష్టం చేశారనుకోవాలి. బిల్లు తీసుకొస్తారు సరే, దానికి పార్లమెంటు ఆమోదం పొందుతుందా.? అంటే దానికింకా సమాధానం దొరకడంలేదు.   VIDEO courtesy TV9

ఢిల్లీకి కన్నా...సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా?

      రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ హైకమాండ్ పెద్దలతో మంత్రి కన్నా కీలక మంతనాలు జరుపనున్నారు. కన్నాకు హైకమాండ్ పిలుపుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మంత్రి శ్రీధర్‌బాబును నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తోందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా కన్నా నియామకానికి అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.     కాగా, కన్నా లక్ష్మినారాయణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం గతంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో మంతనాలు జరిపారు. తాజాగా కన్నాకు దిగ్విజయ్‌, అహ్మద్‌పటేల్‌ పిలుపునివ్వడం.. ఇద్దరూ ఆల్రెడీ కన్నాతో ప్రత్యేకంగా మాట్లాడటంటో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తారా? లేదంటూ ఎవరూ ఊహించని విధంగా కిరణ్‌ని తప్పించి, కన్నాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారా.? అన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.  

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్

      చత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్రంలో 85 వేల మంది పారామిలటరీ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రమణ్‌సింగ్ సహా 143 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా ఓటు వేస్తే చేతులు తీసేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే.   మరోవైపు చత్తీస్‌గఢ్‌లో కా౦కేర్ జిల్లా పంఖజోర్ లో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.     

అలా ముందుకు పోతున్నారు!

రాష్ట్ర విభజనపై తుది రూపునకు రంగులు, హంగులు అద్దుతున్న కేంద్రం నేడు అధికారులతో, రేపు, ఎల్లుండు రాష్ట్ర పార్టీలతో, 18న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతో.. ఇలా వరుస సమావేశాలు, చర్చలతో జీవోం బిజీ,బిజీ! 21నాటికి టి-బిల్లు ముసాయిదా క్యాబినెట్ లో సమర్పించే అవకాశం స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జీవోయం ఒకొక్క దశను  దాటి ముందుకు వెళ్ళిపోతోంది. ఎవరేమనుకున్నా, ఎవరెన్నిశాపనార్థాలు పెట్టినా పట్టించుకోకుండా తాను అనుకున్న దారిలో ముందుకు వెళుతోంది.   ఈ చర్చల ఆధారంగానే ముసాయిదా బిల్లుకు తుది రూపునిచ్చే పనిలో పడ్డారు. ఇక నుంచి 10రోజుల వరకు విభజన సెగ ఢిల్లీని తాకనుంది. ఈ మధ్యలో ట్విస్ట్ ఏమిటంటే రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమావేశానికి టీడీపీ వెళ్లకపోవడం. ఇదిలా ఉంటే జీవోం నిర్వహించే నేటి సమావేశానికి కేంద్ర ప్రభుత్వంలోని 9 ప్రధాన శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొననున్నారు.   ముఖ్యంగా హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, విద్యుత్ కేటాయింపులు , హైదరాబాదులో శాంతి భద్రతలు , హైదరాబాదు ఆదాయం.. ఇలా ఎన్నో విభాజనాంశాలను చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలతో సమావేశాలకి కాంగ్రెస్ నుంచి దామోదర రాజ నరసింహ, వట్టి వసంత్ కుమార్లకు పిలుపు వచ్చింది. ఇంకో ఎండ్ నుంచి దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లను రమ్మనమని దిగ్విజయ్ సింగ్ కబురుపెట్టారు.   చివరి ఆశనైనా నెరవేర్చుకోవాలని హైదరాబాదుని యూటీ చేయాలనే డిమాండుతో ప్రధానిని నేడు కలిసేందుకు సీమాంద్ర కేంద్రమంత్రులు రెడీ అవుతున్నారు. ఇలా ఎవరికీ తోచిన దారిలో వారు అలా ముందుకుపోతున్నారు.

కిరణ్ వాదనలు కూడా నాటకంలో భాగమేనా?

   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిననాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలలో మంచిపేరు సంపాదించుకొంటున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్లు, ఆయన అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కారణంగా మంచి దైర్యవంతుడని, కొత్త పార్టీ పెట్టగల సమర్ధుడని ప్రజలలో ఒక భావన కలిగిస్తూ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కారణం చేత అతనే బెస్ట్-సమైక్యవాదని, అందువలన రాష్ట్రాన్ని విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చెప్పాలంటే, ఆయన నేతృత్వంలో ఏర్పడే కొత్త పార్టీకే మద్దతు ఇవ్వవలసి ఉంటుందనే భావనని కూడా చాలా సమర్ధంగా ప్రజలలోకి జొప్పించగలిగారు.   ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నడూ కూడా అడ్డుపడలేదనే సంగతిని గ్రహించవలసి ఉంది. ఆయన మనస్పూర్తిగా రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటూ ఉండవచ్చు గాక! కానీ కేవలం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడటం తప్ప రాష్ట్రం విడిపోతుంటే ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నమేదీ కనబడలేదు.   అందువల్లే రాష్ట్రానికి సంబంధించిన విభజన ప్రక్రియ రాష్ట్రంతో ఎటువంటి సంబంధము, సమ్మతి లేకుండా ఎక్కడో డిల్లీలో చకచకా జరిగిపోతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వలన కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రక్రియను ఏవిధంగా గట్టెకించాల అనే సందిగ్ధంలో ఉన్నట్లు మీడియా చెపుతోంది తప్ప, కాంగ్రెస్ అధిష్టానంలో ఎవరూ కూడా అటువంటి భయాలు వ్యక్తం చేయలేదు. అంతే గాక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే అభ్యంతరం చెపుతున్నారు గనుక రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా భావించలేదు.   కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ మీడియాకి, తద్వారా ప్రజలకి మంచి కాలక్షేపం కలిగిస్తూ, అందరినీ చాలా తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పక తప్పదు.   ఒకసారి కిరణ్ పై చాకో, మరోసారి మనిష్ తివారి, ఇంకోసారి షిండే, దిగ్విజయ్ సింగ్ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తుంటారు. గత మూడు నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగులమధ్య జరుగుతున్న భాగోతం గమనిస్తే అది స్పష్టమవుతుంది.   ఇంత రాద్ధాంతం జరుగుతున్నపటికీ తెరవెనుక విభజన ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంటుంది. మరో పక్క అందుకు అవసరమయిని ఫైళ్ళు, వివరాలు, సమాచారం అంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ నేపద్యంలో కేంద్రం రచించిన నాటకంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తన పాత్ర తను సమర్ధంగా పోషిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవలసి వస్తోంది.   చివరికి ఆయనని నిత్యం విమర్శిస్తూనే మళ్ళీ ఆయనతో సమావేశాలవుతున్న టీ-కాంగ్రెస్ నేతలని కూడా అనుమానించక తప్పదు. అంటే, కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు దూషించుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టిస్తూ విభజన ప్రక్రియను సజావుగా ముందు తీసుకుపోతున్నారనుకోవలసి ఉంటుంది.

నాగం నోటికి తాళం!

  బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నోటికి చాలాకాలం తర్వాత తాళం పడింది.  నాగం సారు తెలుగుదేశంలో వున్నా, టీఆర్ఎస్‌తో రాసుకుని పూసుకుని తిరిగినా, సొంత కుంపటి పెట్టుకున్నా.. ఎప్పుడైనా ఆయన నోటికి అడ్డే ఉండేది కాదు. సీమాంధ్రులని తిట్టడంలో నాగం జనార్దన్ రెడ్డిది ప్రత్యేక శైలి. అవమానంతో సీమాంధ్రుల గుండె పగిలిపోయే స్థాయిలో తిట్టడంలో నాగం సిద్ధహస్తుడు. ప్రెస్‌మీట్లల్లో నాగం చూపుడువేలు చూపిస్తూ సీమాంధ్రులని తిడుతూ వుండే విభజనవాదుల మనసులు దూదిపింజల్లా హాయిగా గాలిలో తేలుతూ వుండేవి. అంతటి ఘనాపాటి నాగం ఈమధ్య సీమాంధ్రుల మీద తిట్ల పురాణం విప్పటం లేదు. బీజేపీలో చేరినప్పటి నుంచి నాగం గారి వాయిస్ చాలా సాఫ్ట్ అయిపోయింది. బీజేపీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్స్‌ లో పాల్గొంటున్నప్పటికీ నాగం క్లుప్తంగా, తిట్లూ గట్రా లేకుండా నాలుగు ముక్కలు మాట్లాడేసి బుద్ధిగా కూర్చుంటున్నారు. ఈ ధోరణి సీమాంధ్రులకి మనశ్శాంతిని కలిగిస్తూ వుంటే, విభజనులు మాత్రం ఏవి తండ్రీ నిరుడు కురిసిన తిట్ల పురాణాలు అంటూ విలవిలలాడుతున్నారు. ఆ విలవిల నాగం మనసులో కూడా వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు సీమాంధ్రులను గానీ, అటు తాను నిరంతరం తిట్టిపోసే చంద్రబాబుని కానీ తానిప్పుడు తిట్టలేకపోతున్నందుకు నాగం మనోవేదన చెందుతూ ఉండొచ్చని అంటున్నారు. నాగం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం బీజేపీ నాయకత్వం నాగం నోటికి తాళం వేయడమేనని తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద కామెంట్లు చేసే విషయంలో బీజేపీకి ఒక క్రమశిక్షణ వుండటం, తెలంగాణ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం ధోరణి మారుతూ వుండటం, తెలుగుదేశం పార్టీకి చేరువ అయ్యే ప్రయత్నాలు జరుగుతూ వుండటం వల్ల నాగం నోటికి తాళం పడటానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగం తన ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ పోతే అది బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడే అవకాశం వుంది. తన నోటికి తాళం వేయడం నాగానికి ఇష్టం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో నాగం సైలెంట్‌గా వుంటున్నారు. తెలంగాణ విషయంలో పట్టు సడలిస్తున్న బీజేపీని వదలాలని మనసులో వున్నా ఆయనకు వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇష్టంలేని కాపురం చేస్తున్నారు.

వసపిట్ట కేటీఆర్!

  కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి చిన్నప్పుడు వస ఎక్కువగాపోసినట్టున్నారు. అందుకే అయినదానికీ, కానిదానికీ సీమాంధ్రుల మీద నోరేసుకుని పడిపోతూ వుంటాడు. తాను సృష్టించే అబద్ధాలను తెలంగాణ ప్రజల చేత నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ విషయంలో కేటీఆర్‌ది తండ్రిపోలికే! ఇప్పుడు తాజాగా కేటీఆర్‌ తన క్రియేటివిటీని రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతల పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మీద చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల పరిస్థితి మీద సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారులు సభ్యులుగా వున్న ఈ టాస్క్ ఫోర్స్ అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో విభజనవాదులకు పళ్ళకింద రాళ్ళలాగా వుండే, విభజన అనంతరం వాళ్ళ హింసాత్మక ధోరణికి అడ్డు తగిలే అనేక అంశాలు వున్నాయి. దాంతో విమర్శల చిట్టా పట్టుకుని కేటీఆర్ రంగంలోకి దిగిపోయాడు. తమకు అనుకూలంగా వుంటే రైట్ లేకపోతే రాంగ్ అనే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే విభజనవాదుల ప్రతినిధి అయిన కేటీఆర్ టాస్క్ ఫోర్స్ నివేదిక మీద విమర్శల వర్షం కురిపించాడు. టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకట. చీఫ్ విజయ్ కుమార్ సీమాంధ్ర నాయకులతో రహస్య సమావేశం జరిపి సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే నివేదికను రూపొందించారట. టాస్క్ ఫోర్స్ లో వున్న సీమాంధ్ర అధికారులు నివేదికను ప్రభావితం చేశారట. తెలంగాణకు వ్యతిరేకంగా వున్న  ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ బిల్లు రూపొందిస్తే ఒప్పుకోరట... ఇదీ కేటీఆర్ వరస! అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ప్రవేశపెడితే మొట్టమొదటి అవార్డు కేసీఆర్‌కి, రెండో అవార్డు కేటీఆర్‌కి ఇవ్వాలి. గతంలో శ్రీకృష్ణ కమిటీ మీద కూడా సీమాంధ్రులు ప్రభావం చూపించారని నోరు పారేసుకున్న కేటీఆర్ లాంటి విభజనవాదులు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ విషయంలో కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నారు. తనకే అన్నీ తెలిసినట్టు ఆరిందాలా వసపిట్టలా మాట్లాడే కేటీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. కేటీఆర్ లాంటి నాయకులు ప్రతి విషయం మీదా నిరాధార ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజల పరువు తీయకుండా వుండాలని కోరుకుంటున్నారు.

పాపం కోదండరామ్‌!

  తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కి వచ్చిన పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు. నిన్న మొన్నటి వరకూ హీరోలా వెలిగి ఒక్కసారిగా జీరో అయిపోవడం అనేది ఎవరికైనా బాధ కలిగించే విషయమే. పొలిటికల్ జేఏసీ నాయకుడిగా ఎంపికయిన దగ్గర్నుంచీ కోదండరామ్ తెలంగాణని అగ్నిగుండం చేయడానికి తనవంతు ఆజ్యం పోశారు. తన పిల్లల్ని అమెరికాలో సెటిల్ చేసిన కోదండరామ్, తెలంగాణ యువకులను ఉద్యమోన్ముఖులను చేస్తూ వాళ్ళలోనే తన పిల్లల్ని చూసుకున్నారు. టీఆర్ఎస్‌కి తనవంతు సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తరించారు. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ ఉద్యమకారులందరూ కోదండరామ్ నోటి వెంట ఏ మాట వస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటించడానికి రెడీగా వుండేవాళ్ళు. టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు కోదండరామ్ చల్లనిచూపులు తమమీద వుండాలని కోరుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్, పొలిటికల్ జేఏసీల భాగస్వామ్యం లేకుండా తన సొంత వ్యవహారంలా రాష్ట్ర విభజకు పూనుకుంది. అప్పటి నుంచి పొలిటికల్ జేసేసీకి, దాని నాయకుడు కోదండరామ్‌కి చేతిలో పనిలేకుండా పోయింది. విభజన విషయంలో కేంద్రం పొలిటికల్ జేఏసీ అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా గమనించకుండా ముందుకు వెళ్తోంది. గతంలో పొలిటికల్ జేఏసీ పేరు చెబితేనే గడగడా వణికిన తెలంగాణ నాయకులు ఇప్పుడు కోదండరామ్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కోదండరామ్‌కి నీడనిచ్చి, ఆయనలో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆశల్ని పెంచి పోషించిన టీఆర్ఎస్ కూడా కోదండరామ్‌ని లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏరుదాటక ముందు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా తన పరిస్థితిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును కోదండరామ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ కలసి వస్తే టీఆర్ఎస్ ఆశీస్సులతో ఏ రాజ్యసభకో వెళ్దామని కలలు కన్న ఆయన ఇప్పుడు తనను ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆవేదనలో వున్నారు. ఎప్పుడూ తన వెనకాలే తిరిగే ఉద్యోగ సంఘ నాయకులని వెంట పెట్టుకుని చిన్నచిన్న ప్రదర్శనలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఓ పాతిక ముప్పై మంది కార్యకర్తలతో కలసి ఓ బుజ్జి ర్యాలీ చేసుకున్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుండా వుంటే తనకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఎదురు చూస్తున్నారు. పాపం కోదండరామ్!

కొత్త రాష్ట్రంలోనే కొత్త సంవత్సరం

  ఈ సారి కొత్త సంవత్సర వేడుకలు కొత్త రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి. ఈ నెల 26న అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్న ఆయన తరువాత జరిగే పక్రియ అంతా చాలా వేగంగా అవుతుందన్నారు. 2014 జనవరి 1 వేడుకలు ఈ సారి తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.   తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్‌ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, భద్రాచలం డివిజన్‌ కూడా తెలంగాణలోనే ఉంటుందన్నారు.  

వేర్పాటు ముసుగులో కబ్జాదారులు ఎవరెవరు?

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలుగా పరిగణింపబడే ముఖ్యకేంద్రాలను మీర్జా ఇస్మాయిల్ (నిజం) రిజర్వు పోలీసులు, సైన్యాలు వారంరోజుల్లో రాత్రికి రాత్రే చుట్టుముట్టి మెరుపు దాడులు చేసి, నిండుప్రాణాలను బలిగొని, వేలకు వేల సంఖ్యలో అరెస్టులు చేసి, హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణా ప్రాంతపు కారాగారాలందు నిర్భంధించి, కనీవినీ ఎరుగని నిర్బంధవిధానాన్ని నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రయోగించింది ... ఆ సమయంలో ఈ ప్రాంతపు ఆంధ్రమహాసభలో మితవాదులైన మందుముల సోదరులు (నర్శింగారావు, రామచంద్రరావు), బూర్గుల రాం కిషన్ రావు, కొండా వెంకటరంగారెడ్డి లాంటివారు నైజాం సైన్యాలు, రిజర్వుపోలీసులు చేస్తున్న అఘాయిత్యాలను ఖండిస్తూ కనీసం ప్రకటనలనైనా చేయడానికి సాహసించలేకపోయారు! పైవారంతా, ఆంధ్రమహాసభలో మాతో సమిష్టిగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై చన్నీళ్ళు చల్లిన ఘరానా పెద్దమనుషులే! నిజం వ్యతిరేకపోరాటం చాలా ఉన్నతస్థాయిలో వున్నప్పుడు కొండా వెంకటరంగారెడ్డి నాయకత్వాన ఒక బృందం [మితవాద నాయకులు పంపగా] ఒక నివేదికను పత్రికలకు విడుదల చేసింది. గ్రామ సీమలందు కమ్యూనిస్టులు దొరలను, భూస్వాములను పత్తి హింసిస్తున్నారని, వారి వ్యవసాయాల్ని సాగనీయడం లేదని, ఆయా గ్రామాలందు కాంగ్రెస్ లో సభ్యులుగా చేరినవారిని కమ్యూనిస్టులు హింసిస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు.   దొరల దోపిడీ, దౌర్జన్యాకాండలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఆంధ్రమహాసభ కార్యకర్తలను భూస్వాములు పోలీసులతో మిలాఖాతై చిత్రహింసలకు గురిచేస్తున్నప్పుడు నైజాం నవాబుకు తొత్తులుగా వున్నారని గ్రామాలనుండి తరిమివేయడంలో తప్పులేదు. ఆ దొరల తొత్తులయిన గూండాలను కాంగ్రెస్ లో చేర్చుకోగా, కాంగ్రెస్ వారిని కమ్యూనిస్టులే కొట్టారని కొండా వెంకటరెడ్డి నివేదిక చెప్పింది. అసలు ఈ కొండా వెంకటరెడ్డి ఎవరు? .... ఈ రంగారెడ్డికి భువనగిరి తాలూకాలోని శాహ్ రాజ్ పేట గ్రామంలోనే దాదాపు వేయి ఎకరాలభూమి సొంత వ్యవసాయంలో ఉంది. 1946-47, 1947-48 సంవత్సరాల్లో నైజాం నవాబుకు నమ్మినబంటు అని పేరుతెచ్చుకున్నారు. పులితోలు కప్పుకున్నా, నక్కనక్కే, గూండాలు కాంగ్రెస్ లో చేరినా గూండాలే ... అలాంటి కాంగ్రెస్ కు 1952 జనరల్ ఎన్నికల్లో సభ్యులకు అసలు పోలింగ్ ఏజెంట్లే దొరకలేదు. కమ్యూనిస్టు పార్టీ అద్వితీయమైన విజయాలు సాధించింది! [రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకులలో ఒకరైన ఆరుట్ల రామచంద్రారెడ్డి: "తెలంగాణా పోరాట స్మృతులు]   తెలంగాణాలో ఈ 'దొరల'గత చరిత్రే కాదు, నేటి చరిత్ర కూడా అదే అయినందుననే, హైదరాబాద్ స్టేట్ రద్దయి, దేశంలో తొలి "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్'' [ఫజల్ ఆలీ] స్పష్టమైన సిఫారసులు ఆధారంగా దేశంలోనే తొలి రెండవ పెద్ద రాష్ట్రంగా తెలుగువారందరికీ కలిపి తెలుగుప్రజల చిరకాల వాంఛలకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్ర అవతరణ హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న సుసాధ్యమయిన తరువాత కూడా నానారకాల 'దొరల' ఇతర భూస్వామ్య, నయాపెట్టుబడిదారుల అలానే ఉన్నాయి! ఈ కొనసాగింపులో భాగమే కోస్తాంధ్రలోని శ్రీకాకుళం (విజయనగరం)నుంచి తెలంగాణాకు వచ్చి, తన రాజకీయ నిరుద్యోగానికి పరిష్కార మార్గంగా మొత్తం తెలుగుజాతి మధ్యనే విషబీజాలు నాటినవాడు "బొబ్బ్లిదొర'', అతని కుటుంబమూ; తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో ఇతడు కాలుమోపిన నాటికి ఉన్న ఆస్తిపాస్తులెన్ని? ఆ తరువాత చేసిన దొంగసంపాదనలెన్ని? లెక్కల కోసం సీమాంతరాలు దాటి వెళ్ళనక్కరలేదు!   ఎందుకంటే తెలంగాణాలోని స్థానికులు హైదరాబాద్ లోని మిత్రులూ వెల్లడిస్తున్నా దాన్నిబట్టి - ఒక్క హైదరాబాద్ సమీపంలో 'బొబ్బిలిదొర'కు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల రహస్య కార్యకలాపాల కోసం నిర్మించుకున్న "ఫామ్ హౌస్'' ఉంది! ఇదిగాక, 2010 జనవరి 31న "ఇంటర్నెట్" సాక్షిగా ఒక "బ్లాగ్''లో "బొబ్బిలిదొర'' వారి "డాలర్ సామ్రాజ్యం'' అన్న మకుటం కింద ఇండియా మ్యాప్ లో అతడి బొమ్మ ముద్రించి తాజాగా మావోయిస్టులు ఒక వార్తను ప్రముఖంగా విడుదల చేశారు! ఆ వార్త తాలూకు తాజా సమాచారం ("అప్ డేటెడ్'') పేరిట "ఆంధ్రామానియా'' శీర్షిక కింద బొబ్బిలిదొర పేరుతొ వారి "సీక్రెట్ బిజినెస్: సీపోర్టు షిప్స్ అండ్ రు. 6000 క్రోర్స్'' అన్న ఉపశీర్షిక పెట్టి ఈ క్రింది సమాచారం అందులో పెట్టారు. అందులోని కొన్ని భాగాలు : తెలంగాణా ప్రజలంటే తనకెంతో ప్రేమ అని నటించే వ్యక్తీ నిజమైన ప్రేమంతా అతని వ్యాపారాల మీదనే ఉంటుంది. "తన ప్రజలు మోసపోయారని ఎవరు అరుస్తూంటారో అతను ఇతర రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు పెడుతుంటాడు!'' "ఇతరులమీద రాజకీయంగా ఎక్కువ పలుకుబడి పొందడం కోసం దోమల బెడదను కూడా లెక్క చేయకుండా తండాల మధ్య తలదాచుకోజూచే వ్యక్తీ రెండు ఓడలకు (కాండ్లారేవులో) అధిపతి కాగలగడమేకాదు, ఇప్పుడా వ్యక్తీ ఒక ప్రయివేట్ హార్బరునే నిర్మిస్తున్నాడు'' అని ఆ బ్లాగ్ లో బ్లాగర్ వివరించాడు.   అంతేగాదు, ఆ వ్యక్తీ తాలూకు "ఈ చీకటి కోణాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి ... ఈ వివరాలు చదివితే అతడు ప్రారంభించిన స్థానిక ఉద్యమం గురించీ, తెలంగాణా ఆత్మగౌరవం గురించీ అతను చేస్తే ప్రకటనలలోని డొల్లతనం బోధపడుతుంది ... 2001 సంవత్సరంలో ఇతడు స్థానిక పార్టీని స్థాపించిన తరువాత అపారమైన సంపదను కూడబెట్టుకున్నాడు. దానికి తగిన సాక్ష్యాధారాలను విశ్వసనీయవర్గాల నుంచే రాబట్టుకోవటం జరిగింది. రాజకీయంగా పొందిన ఈ సంపదతోనే ఆయన కాండ్లా (గుజరాత్) సముద్ర రేవుపైన గట్టిపట్టు సాధించాడు. రెండు భారీ నౌకలు కొన్నాడు. ఇప్పుడా నౌకలు ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయి. అతడు ఒక ప్రయివేట్ సీపోర్టును కూడా నిర్మించే యత్నంలో ఎద్దడిగా ఉన్నాడు. ఈ సీపోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.500 కోట్లు అని అంచనా. ఈ నిర్మాణాన్ని ఆయన సన్నిహిత బృందంతో ("క్లోజ్ సిండికేట్'') కలిసి చేస్తున్నాడు! ఈ రాజకీయవేత్త విలువ నేడు రూ.6,000 కొట్లనీ, ఇది పైకి కన్పించే సొమ్ము మాత్రమేననీ అతడి ఆర్ధిక లావాదేవీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తీ వెల్లడించాడు. ఈ మొత్తం కేవలం పైకి తెలియవచ్చిన సంపదకాగా, అజ్ఞాతంగా ఉన్న సంపద వాస్తవ విలువ ఎంత ఉండాలో ఎవరికీ వారే ఊహించుకోవచ్చు. అంతేగాదు, మహారాష్ట్ర, గుజరాత్ ల మధ్యదారిలో అతడికి అనేక ఆస్తులూ, ఎస్టేట్లూ, ఆర్ధిక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలేగాని, తెలంగాణాలో మాత్రం కావు. ముంబైకి, గుజరాత్ కు మధ్య ఈయన పొందిన భూముల విలువ కోటానుకోట్ల రూపాయల్లోనే ఉంటుంది''!   ఇవీ - ఇంటర్నెట్ కథనం (బ్లాగ్) వివరాలు! ఇంతకూ ఇక్కడ గమనించవలసిన విషయం - 1956కు ముందూ తెలుగుజాతి ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దరిమిలా ఇరుప్రాంతాలకు చెందినా (సీమాంధ్ర, తెలంగాణా) భూస్వామ్య, ధనికవర్గాలు పెట్టె పెట్టుబడులకు మాత్రం ప్రాంతీయ భేదాలుండవుగాక ఉండవు, అని! ప్రాంతాలలోని సామాన్య ప్రజాబాహుళ్యాన్ని వివిధ రూపాలలో దోచుకోవటంలో ఇరుప్రాంతాలలోని భూస్వామ్య, పెట్టుబడివర్గాలకు పద్ధతులలోనేగాని, దోపిడీ స్వభావంలో మాత్రం తేడాలుండవు గాక ఉండవు! లేవు కాబట్టే, తెలంగాణా సాయుధ పోరాట విజయాల ప్రభావంలో నాటి తెలంగాణా పేదరైతు, వ్యవసాయ కార్మికవర్గం, వెట్టిచాకిరీని, "నీబాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న బానిస సంకెళ్ళను కాస్తా విదిలించుకుని బయటపడవలసి వచ్చింది. అదీ అసలైన ఆత్మగౌరవ ప్రతిష్ఠాపాన!   అయితే నాటి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం సుసాధ్యం చేసిన ఈ పరిణామక్రమాన్ని నేడు తిప్పికొట్టడం కోసమే మరొకసారి ప్రాతపు దోరాలూ, భూస్వాములూ సమాయత్తం కావడానికి ఒక ఉద్యమం అవసరమైంది. అందుకనే ప్రజల మౌలిక సమస్యలయిన భూసమస్య, కనీసవేతనాలు, గనుల పేరిట, పరిశ్రమల విస్తరణపేరిట విచ్చలవిడిగా పెట్టుబడివర్గాలు సాగిస్తున్న భూసేకరణలు, భూముల స్వాదీనాలు, విద్యార్థి, యువజనుల నిరుద్యోగం వగైరా సమస్యలు ప్రస్తావనకు రాకుండా, ఆ సమస్యలపైన వాస్తవికమైన ఆందోళనలు, ఉద్యమాలూ రాకుండా పక్కదారులు పట్టించేందుకే, పదవీ స్వార్థంలో భాగంగా పాలకపక్షంలోని 'నిరుద్యోగ'వర్గమూ, "పక్కింటావిడ భర్త దొరికితే, నా భర్తా దొరుకుతాడ''న్న సామెతలాగా కొన్ని ప్రతిపక్షాలలోని స్వార్థపరులూ ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండా ద్వారా తెలుగుజాతిని చీల్చాలని కృత్రిమంగా ఉద్యమించారనడంలో సందేహం లేదు! ఈ రాజకీయ నిరుద్యోగుల అండలేకపోతే కాంగ్రెస్ అధిష్ఠానం కొమ్ములు కూడా విరిగిపోవటం ఖాయం.   అలాగే, 1956కు ముందు పరిస్థితిలో పోల్చుకుంటే ఆ తరువాత కడచిన 56 సంవత్సరాలలోనూ ఉభయప్రాంతాలలో రిజిస్టరయిన భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల పెట్టుబడులూ, పరిశ్రమల నిర్మాణం కూడా ఉన్న పరిధులలో గణనీయంగానే పెరిగాయని గణాంకాలన్నీ తెల్పుతున్నాయి. అందువల్ల హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడుల కేంద్రీకరణలో గానీ, విస్తరణలోగానీ ఉభయప్రాంతాల మోతుబరులూ ఉన్నారు. అందుకు ఏ ఒక్కరినో టార్గెట్ చేసీ లాభంలేదు! విచిత్రమేమంటే, ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయమే చూడండి - "న్యూ''కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారు ఉభయప్రాంతాల పెట్టుబడిదారులే. పైగా ఆ కంపెనీ కోసం స్థానిక మోతుబరూ, స్థానిక దినపత్రిక యజమానికి [ఇప్పటిదాకా ఆ పత్రిక నిర్వాహకుడు తెలంగాణాలో పాగా వేసిన 'బొబ్బిలిదొర'వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా] కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రముఖపాత్ర వహించడాన్ని పత్రికలు బయటపెట్టాయి!   అంతవరకూ ఇదే స్థానిక పత్రిక అధినేతగా ఉంటూ వచ్చిన 'బొబ్బిలిదొర' ఆ పత్రికను ఆ స్థానిక యజమానికి కుదువబెట్టిన సంగతీ బహిరంగ రహస్యమే! ఇక "బొబ్బిలిదొర'' కుమారరత్నం ఒక ఎన్.ఆర్.ఐ. "సీమాంద్ర పెట్టుబడిదారులు'' అంటే ఎక్కడ అదే సీమాంధ్రకు చెందినా తమకూ వర్తించుతుందేమొననిసిగ్గుపడిన ఈ తండ్రీకోడుకులూ మధ్యలో ఆ మాటను మానేసి మొత్తం "దోపిడీ'' పదాన్ని "సీమాంధ్రప్రజల''కే అంటగట్టేస్తూ వచ్చారు. అంతేగాదు, 'బొబ్బిలిదొర' కుమారరత్నానికి వ్యాపారాలకోసం సీమాంధ్ర కావాలట, అధికారానికి తెలంగాణా కావాలట! ఈ సత్యం - శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి గ్రామంలో ఎగుమతులకు గిరాకీ ఉన్న "శ్రీకాకుళం బ్లూస్'' అనే విలువైన రంగురాళ్ళ క్వారీని ఈ కుమారరత్నం 2005 సంవత్సరం దాకా కొల్లగొడుతూనే వచ్చాడని మరవరాదు!   ఈ భాగోతం ఇలా ఉండగానే, 1956కు ముందు మన తెలంగాణాలోగాని [రెండు ప్రాంతాలూ 1953 దాకా ఒకటి, 1956 దాకా మరొకటీ పరాయి పాలనల్లోనే ఉంటూ వచ్చినందున] ఉభయత్రా విదేశాలకు ఉద్యోగరీత్యాగానీ, వ్యాపారాల కోసంగానీ వెళ్ళిన ఎన్.ఆర్.ఐ.ల సంఖ వేళ్ళమీద లెక్కించదగిన దానికన్నా మించిలేదు. కాని 1956 తరువాతనే ఉభయప్రాంతాలలోనూ గత 57 సంవత్సరాలలోనూ ఇటు తెలంగాణానుంచీ, అటు సీమాంధ్రనుంచీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఎన్.ఆర్.ఐ.ల రాకపోకలూ, విదేశాల్లో నివాసాలూ, స్థిరనివాసాలూ పెరిగాయని మరచిపోరాదు. అమెరికా, బ్రిటన్, జర్మనీలలోనేగాక, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మలేసియా, సింగపూర్ లలో స్థిరపడి ఆయా చోట్ల పలు తెలుగు సాంస్కృతిక సంస్థలనూ ఏర్పరచుకున్నారు. ఈ విషయంలో ఇరుప్రాంతాల వారూ విద్యా విషయకంగానూ, సాంస్కృతికంగానూ కూడా ఎంతో అభివృద్ధి దిశగా పురోగామిస్తున్నారు. తెలుగునాట వివిధప్రాంతాల అభివృద్ధి కోసం తమకు వీలైన పద్ధతుల్లో పాటుపడుతూనూ ఉన్నారు. ఈ పరిణామం ప్రధానంగా 1956 తరువాతనే, తెలుగుజాతి ఏకైకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మాత్రమే సాధ్యమైందని గుర్తించాలి. ఇక హైదరాబాద్ లో ఉభయప్రాంతాల వారి పెట్టుబడులకు సంబంధించి కూడా 1956 తర్వాతనే ఇరుపక్షాల క్రమానుగతమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఉదాహరణకు 1956 తరువాతనే మన తెలంగాణా సోదరుల పరిశ్రమలు, సంస్థలలో ఉన్న పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి సుమారు రూ.4,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈ ఇరుప్రాంతాలకు చెందిన మోతుబరులు ఆక్రమించిన లేదా కొనుగోలు చేశామని చెబుతున్న భూముల వైశాల్యం వివరాలను రాష్ట్రప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన 'శాంతి'చర్చల సందర్భంగా మావోయిస్టులు పేర్లతో సహా పేర్కొన్న వివిధ ప్రాంతాలవారీ భూముల, పెట్టుబడి ఆస్తుల, కంపెనీల వివరాలతో ఒక పత్రాన్ని కూడా విడుదల చేశారు. కాగా, ఇటీవల తెలియవచ్చిన కొన్ని వివరాల ప్రకేరం గత పాతికేళ్ళలో స్థానిక సోదరులు సంపన్నులుగా ఎదిగి ఏ ఏ పరిశ్రమలు పెట్టి బలమైన పరిశ్రమాధిపతులుగా ఎదుగుతూ వచ్చారో తెలిసింది. పెట్టుబడిదారీ-భూస్వామ్య మౌలిక చట్రం అనుమతించినందువల్లనే అటువారుగాని, ఇటువారుగానీ వీలైనంత మేర సంపన్నులుగా తమ వృద్ధి నమోదు చేసుకున్నారు! ఆ వ్యవస్థ మౌలింగానే మారిపోనంత కాలం ప్రాంతాలతో నిమిత్తం లేకుండానే కొత్త 'టాటా'లు, కొత్త 'బిర్లా'లూ, ఇంకొత్త అంబానీలూ పుట్టుకొస్తూనే ఉంటారని మరవరాదు! అలాగే మన తెలంగాణాలో కూడా హైదరాబాద్ కేంద్రంగానూ, జిల్లాస్థాయిలోనూ కోట్లకు పడగలెత్తిన కేవల స్థానిక కంపెనీలున్నాయి. వాటిలో కొన్ని " ఆంశ్రీ కన్ స్ట్రక్షన్స్, శాలివాహనా బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్, మధుకాన్, మైహోమ్ కన్ స్ట్రక్షన్స్, నాగంవారి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కున్ డాయి, గుజరాత్ షిప్పింగ్ సర్వీసు, 'న్యూ' కంపెనీ, శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్, శ్రీకిరణ్ కన్ స్ట్రక్షన్స్ వగైరాలు!   అన్నట్టు - వెంకటస్వామి, వివేక్, మధుయాష్కీ, డి.ఎస్., ఎర్రబెల్లి, నాగం, ఈటెల వారి ఆస్తులు పుట్టుకతోనే వచ్చినవా, 1956 తర్వాత 'ఎదిగినవా' చంద్రబాబులాగా?! ఇంత అభివృద్ధిలోనూ ఒక చెరపరాని పెద్ద హంసపాదు - "బొబ్బిలిదొర'', అతడి కుటుంబమూ, దౌర్జన్య భాషతో, బూతులతో 'దీపి'స్తున్న అతడి అనుచరవర్గమూ, వెరసి వీళ్ళు కేవలం స్వార్థప్రయోజనాల కోసం ప్రోత్సహించిన తెలంగాణాబిడ్డల ఆత్మహత్యలూనూ! అందుకే ఈ పరిణామాన్ని మనం 'దొర'ల స్వామ్యానికీ, ఇతర భూస్వాముల వర్గ స్వామ్యానికీ మధ్య సాగుతున్న కుల, వర్గ ఆధిపత్యపోరని నిర్థారణ చేస్తుకోవచ్చు! ఇందులో రెక్కాడితే గాని డొక్కాడని "పూటబత్తెమే పుల్లవెలుగు''గా ఉన్న ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రాలేదు, లేదు, లేదు! ఆరుట్లవారి అంచనా ఆ రోజుకీ ఈ రోజుకీ అక్షరసత్యమే!