రెడ్డిగారి ఈ దూకుడు ఎందుకో

  టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో అకస్మాత్తుగా దూకిన జైపాల్ రెడ్డి మొన్ననిర్మల్ లో జరిగిన సభలో ‘సమన్యాయం అంటే అదేమయినా బ్రహ్మపదార్ధమా?’ అని ఒక మంచి ప్రశ్నవేసారు. నిజమే! అది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధమేమి కాదని, దాని భావమెంటో అందరికీ తెలుసునని ఆయనకి బాగా తెలుసును.   అయితే, మిగిలిన కేంద్ర మంత్రులకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు లేని అభ్యంతరం కేవలం తనకే ఉందని భావిస్తూ, ఇంతకాలం తెలంగాణాపై మాట్లాడానికి ఇష్టపడని ఆయన, పాపం టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసుకొని ముఖ్యమంత్రి సంపాదించుకోవాలనే ఆలోచనతో జైత్ర యాత్రలు చేసుకొంటుంటే, వారి మధ్యలో ఆయన సినిమా హీరోలా హటాత్తుగా ఎందుకు దూకారు? దూకి వారి కంటే బిగ్గరగా ‘సోనియమ్మ మనసు వెన్న, కానీ ఆమె సంకల్పం మాత్రం వజ్ర సంకల్పం’ అంటూ ఎందుకు భజన మొదలుపెట్టారు? భద్రాచలం మొదలు హైదరాబాదు వరకు, ఉద్యోగుల సమస్యల నుండి నదీ జలాల వరకు ప్రతీ అంశంపై అందరి కంటే పెద్ద గొంతుకు వేసుకొని ఎందుకు వాదిస్తున్నారు? ఆయనలో కలిగిన ఈ అకస్మాత్ మార్పుల వెనుక దాగిఉన్న బ్రహ్మ రహస్యం ఏమిటి? అని ఆయన వివరించితే బాగుంటుంది.   వీలయితే అవే సభల్లో తను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక చిన్న ప్రకటన చేసినట్లయితే, వేదిక మీద ఉన్న పోటీదారులకి అదో తుత్తి.

విభజనపై సుప్రీంను ఆశ్రయించిన ఎంపి

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేఫధ్యంలో కొందరునాయకులు న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. విభజన ప్రక్రియను ఆపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌ బుధవారం సుప్రింకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో తెలిపారు. కేంద్రంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ విభజన ప్రక్రియను రాజకీయ కోణంలో చూస్తుందని పిటిషనర్‌ అయిన సి.ఎం. రమేష్‌ తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా 371(డి) ని తొలగించాలని సి.ఎం. రమేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా వుండగా సీమాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలల కన్వీనర్‌ చిరంజీవిరెడ్డి కూడా రాష్ట్ర విభజనను సవాల్‌ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోసారి సమ్మెకు సై

  కాంగ్రెస్‌ అధిష్టానం విభజన దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఏపిఎన్జీవోలు మరోసారి సమ్మెకు సిద్దపడుతున్నారు. యుపీఏ ప్రభుత్వం, సీడబ్ల్యుసి గత జులై 30న రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె సరైన్‌ మోగింది. దాదాపు అన్ని ప్రభుత్వ సంఘాలకు సమ్మెకు మదతునివ్వడంతో దాదాపు 72 రోజుల పాటు రాష్ట్రంలో పాలన స్తంభించింది. అయితే ప్రస్థుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఏపీ ఎన్జీవో నేత అశోక్‌ బాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని జాతీయ పార్టీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరో మారు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన బిల్లు అసెంబ్లీకి వస్తే వెంటనే మరో మారు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ఏపిఎన్జీవోలు.

వైద్య విద్యార్థిపై హత్యాయత్నం

వైధ్యకళాశాలలో దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రనికి చెందిన ఓ వైద్య విద్యార్థిపైన తోటి విద్యార్థులే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని కోలార్ వైద్య విశ్వవిద్యాలయంలో ఈ దారుణం జరిగింది. బాధితుడు వైద్య విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన కామేష్ సాయిప్రసాద్. మంగళవారం రాత్రి కొందరు సహ విద్యార్థులు కామేష్‌ పై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలు అయిన అతనిని దగ్గర్లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అరవై శాతం గాయాలతో కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పైన దాడి చేసింది మన రాష్ట్రానికి చెందినవారేనని అనుమానిస్తున్నారు. కామేష్ తల్లిదండ్రులు హైదరాబాదులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు.

మరో ఘోరం

  మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం మరువక ముందే కర్ణాటకలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో మంటల్లో చిక్కుకుంది.ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉంది. బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలుదేరింది. అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్షంగా భావిస్తున్నారు. బస్సు డివైడర్‌ను డీకోని టైరుపేలటంతో మంటలు వ్యాపించాయన్నది ప్రాదమిక సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు.

అఖ్కర్లేనిపక్షం!

      కేంద్రప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏదో జరిగిపోతుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. కేంద్ర మంత్రుల బృందం అఖిలపక్షం మొదటిరోజు ఒక్కో పార్టీతో పదేసి నిమిషాలపాటు మాట్లాడించింది. ఆ పార్టీలు కొత్తగా మాట్లాడిందేమీ లేదు.. వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెలుసుకున్న విషయమూ ఏమీ లేదు. మొత్తమ్మీద చూస్తే ఈసారి అఖిలపక్షం ద్వారా ఒరిగిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఈ అఖిలపక్షం ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అస్సలు అఖ్కర్లేని పక్షమని జోక్ చేస్తున్నారు. ఈ అఖ్కర్లేనిపక్షంలో అన్ని పార్టీలూ మరోసారి రాష్ట్ర విభజన మీద తమ విధానాన్ని చెప్పాయి. బీజేపీ పాత పాట పాడిన తర్వాత ఈ విషయంలో కాంగ్రెస్ తీరు చెప్పాలంటూ కొత్త పల్లవి అందుకుంది.  ఆ పల్లవి బీజేపీ నోట్లోంచి బయటకి  రాకముందే మంత్రుల కమిటీ బీజేపీ నోరు నొక్కేసింది. కొత్త విషయాలు చెప్పనివ్వకుండా, పాత విషయాలనే మళ్ళీ వినడానికే ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసినట్టున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీలన్నీ పడుతూ లేస్తూ ఢిల్లీకి వెళ్ళాయి. పార్లమెంటు మెయిన్ గేటు నుంచి సమావేశం జరిగిన చోటకి వెళ్ళడానికి ఎంతసేపు పట్టిందో కనీసం అంతసేపు కూడా మంత్రుల బృందంతో సమావేశం జరగలేదు. ఈమాత్రం భాగ్యానికి, ఈ హడావిడి మేళానికి పార్టీల సమయం వృధా చేయడం ఎందుకని విమర్శకులు అంటున్నారు. కాకపోతే ఈసారి నిర్వహించిన అఖ్కర్లేనిపక్షం రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత బుర్రలేకుండా ఆలోచిస్తోందన్న విషయాన్ని మరోసారి బయటపెట్టింది. కేంద్రప్రభుత్వ అజ్ఞానం బయటపడటం మినహా ఈ అఖ్కర్లేనిపక్షం పింగళించిందేమీ లేదు!

ఎక్కడయినా బావ కానీ... వంగతోట కాడ కాదు

  జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో మిగిలిన వారినందరినీ విడిచి పెట్టేసి, తనలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గట్టిగా కృషి చేస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేసుకొంటున్నారు? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొని, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు వచ్చితనతో చేతులు కలపమని తన బద్ధశత్రువయిన తెదేపాని కూడా కోరుతున్నపుడు, మరి తన సమైక్యబాటలోనే పయనిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసి నడవడానికి ఇష్టపడటం లేదు?   వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వానికి మద్దతి ఇస్తామని చెపుతున్నపుడు, ‘సేమ్ టు సేమ్ డీ.యన్.ఏ.’ కలిగి ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్ ఎందుకు మండిపడుతున్నట్లు? ఇటువంటి ధర్మ సందేహాలు ప్రజలకు చాలానే ఉన్నాయి. అయితే ఇవి సమాధానాలు దొరకని భేతాళ ప్రశ్నలు కావు.   పరుగు పందెంలోనయితేనేమి సమైక్య చాంపియన్ రేసులోనయితేనేమి ఎవరూ కూడా తమ పోటీదారులతో చేతులు కలిపి పరిగెత్తాలనుకోరు కదా? ఇదీ అంతే! అదీకాక అన్నివిధాల సమాన, మ్యాచింగ్ డీ.యన్.ఏ.కలిగి ఉన్నవాడిని ప్రోత్సహించడం అంటే మొదటి స్థానం కోసం కాక రెండో స్థానం కోసం పరుగెడుతున్నట్లే లెక్క.   ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉంటే, ఎన్నికల సమయంలోనే కాక ఆ తరువాత కూడా రెండు కత్తులు ఒకటే ఒరలో ఇమడవన్నట్లు, ఆ ఇద్దరు రెడ్లు ఒకే పార్టీలో, ప్రభుత్వంలో ఇమడలేరు. అలాకాక కిరణ్ పార్టీ నుండి బయటపడి వేరే కుంపటి పెట్టుకొన్నప్పటికీ, ఆ పొగ, ఆ సెగ ఎన్నికలలో తనకి తగలక మానవు. ఎక్కడయినా బావ కానీ వంగ తోట కాడ మాత్రం కాదన్నట్లు తనకి అన్ని చోట్ల పోటీగా నిలుస్తున్న కిరణ్ కుమార్ అంటే అందుకే జగన్కి అంత ప్రత్యేకమయిన ఆ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలినవారినెవరినీ అతను తనతో సమానులుగా భావించడం లేదు గనుకనే వారు బ్రతికిపోయారు. లేకుంటే వారు కూడా పోయేవారే.   ఇక చంద్రబాబు రాజకీయ అనుభవమంతా వయసు కూడా లేని జగన్ ఆయనని లేఖ వెనక్కి తీసుకొని, వచ్చి తన వెనుక నడువమని చెప్పడం అతితెలివి, అహంకారమే తప్ప మరొకటి కాదు. తన దూకుడు వల్ల ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలు, ‘యూ టర్నులు’ తీసుకొని, చివరికి ఆ తెదేపాను చూసే తన తప్పుని గ్రహించి మళ్ళీ తెలంగాణాలో పార్టీని కాపాడుకోవాలని ప్రాకులాట మొదలుపెట్టిన అతను, తను వేసిన ఎత్తుకి చంద్రబాబు, అతని పార్టీ పడిపోతుందని భావించడం అవివేకమే.  

రాష్ట్ర విభజనకు సమైక్యవాది సలహాలా?

  కేంద్రమంత్రుల బృందం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుండి ఒక్క తెదేపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు హాజరయ్యి తమ తమ అభిప్రాయాలు చెప్పివచ్చాయి. మిగిలిన పార్టీల సంగతెలా ఉన్నా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైకాపా విభజనకోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వెళ్లి కలవడంలో అర్ధమేమిటని చంద్రబాబు ప్రశించారు. ఓట్లు సీట్ల కోసం పైకి సమైక్యాంధ్ర అంటూ, విభజన ప్రక్రియలో వైకాపా ఎందుకు పాలుపంచుకొంటోందని ఆయన ప్రశ్నించారు. ఇక ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో విలీనం కామని చెపుతూనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిన్న హోం మంత్రి షిండేతో రహస్యంగా సమావేశమయ్యి ఏమి మాట్లాడుకొన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తెరాస ఎన్నికల ముందు విలీనం అయితే, వైకాపా ఎన్నికల తరువాత అవ్వాలని ముందే నిర్ణయం అయిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కాంగ్రెస్ తో తెరాస చేతులు కలపడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నట్లు చెప్పుకొంటున్న వైకాపా కూడా చేతులు కలిపితే దాని అర్ధం వేరేలా ఉంటుంది.

రామయ్యా.. రావొద్దయ్యా!

      తండ్రి హరికృష్ణ, ఇతర సన్నిహితుల సూచనల మేరకు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వుంటున్నాడు. తాను దూరమైపోతే తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం జరిగి, చంద్రబాబు తనను బతిమాలుకుంటాడని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. అయితే బుడ్డోణ్ణి తెలుగుదేశం పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు పార్టీలో వుంటే ఎంత.. బయటకి పోతే ఎంత అన్నట్టుగా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోయారు. తనకు లభించిన రాంగ్ డైరెక్షన్ కారణంగా తెలుగుదేశం పార్టీకి అనవసరంగా దూరమయ్యానే అన్న ఆవేదన జూనియర్‌లో వుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితం కావాలన్న ఆలోచన కూడా ఆయనలో వుంది. అయితే తెలుగుదేశం పార్టీ పిలిస్తేనే వెళ్ళాలన్న బెట్టు మెయింటెయిన్ చేస్తున్నాడు.   ఈమధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లను ఎవరు క్రియేట్ చేశారో తెలియదుగానీ, వీటి ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద పడుతుందని జూనియర్ సన్నిహితులు భావించారు. వైఎస్సార్‌సీపీలో చేరితే జూనియర్ తమ నుంచి పూర్తిగా దూరమైపోతాడన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో పెరుగుతుందని, దాంతో  పార్టీ బుడ్డోడి దగ్గరకి దిగి వస్తుందని ఎదురుచూశారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సిగ్నలూ లభించలేదు.  జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీకి వెళ్తాడేమోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో మచ్చుకు కూడా కనిపించలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి వచ్చేస్తాడేమోనన్న ఆందోళన మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులలో కనిపిస్తోంది. ఇప్పటికే గందరగోళంగా వున్న వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ రాకతో మరింత గందరగోళంలో పడే అవకాశం వుందని భయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన సహచరులు, సన్నిహితులు తమ పార్టీలోకి రావడం, ఆధిపత్యం కోసం పోరాడటం, కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సీట్లకు టెండర్ పెట్టడం, వాటిని ఇవ్వకపోతే అలగడం.. ఈగోలంతా తమకు ఎందుకని అనుకుంటున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి రాకుండా వుండటమే తమ పార్టీకి మంచిదని భావిస్తున్నారు. మనస్పూర్తిగా ‘రామయ్యా.. రావొద్దయ్యా’ అంటున్నారు.  

మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి డిల్లీకి

  కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏలుతున్నముఖ్యమంత్రే కావచ్చు. గానీ ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ. గనుక కాంగ్రెస్ ఆచార వ్యవహారాల ప్రకారం, రోజూ సచివాలయానికి వెళ్లినా వెళ్లకపోయినా వారానికొకమారయినా  డిల్లీ వెళ్ళడం మాత్రం అత్యవసరం. ఓసారి సోనియా మాడం పిలిస్తే రెక్కలు కట్టుకొని డిల్లీలో వాలవలసి ఉంటుంది. మరోసారి అందరూ కలిసి వార్ రూమ్ లో తలుపులేసుకొని వాదులాడుకోవడానికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకోసారి తనని అభిమానించే దిగ్విజయ్ సింగ్ పిలిస్తే ఆయనను కాదనలేక వెళ్ళవలసి ఉంటుంది. ఏ లెక్కన చూసుకొన్నాకిరణ్ నెలకి ఓ ఐదారుసార్లు డిల్లీకి అలా వెళ్లి ఇలా వచ్చేస్తుంటారు.   ఇంతకు ముందు కూడా ఆయన చాలా సార్లు వెళ్లోచ్చిన్నపటికీ, అప్పటికి ఆయనకి ఇంత ఫాలోయింగ్ లేకపోవడంతో మీడియా కూడా ఏదో మొక్కుబడిగా రిపోర్ట్ చేసేది. కానీ ఆయన సమైక్య చాంపియన్ గా బ్యాడ్జీ తగిలించుకొన్నపటి నుండి మీడియాలో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన తన ఇంట్లోంచి కాలు బయటపెట్టినా సెన్సేషనల్ న్యూసే, పెట్టకపోయినా అంతకంటే పెద్ద సెన్సేషనల్ న్యూసే. మరి అటువంటప్పుడు ఆయనని కేంద్రమంత్రుల బృందం రేపు డిల్లీ రమ్మని పిలిస్తే మరింకెంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   ఈరోజు మిగిలిన రెండు సమైక్య పార్టీలు సీపీఎం, వైకాపాలతో కూడా అఖిలపక్షం తంతు ముగించేసిన కేంద్రమంత్రుల బృందం, రేపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓసారి డిల్లీ వచ్చిపొమ్మని మెసేజ్ పెట్టింది. ఈయన చూస్తే విభజన వద్దంటాడు. వాళ్ళేమో విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసేసి చేతులు కడుక్కొనే ముందు, తమకు ఇంత సౌలభ్యం కల్పించిన ఆయనకు ఓమారు థాంక్స్ చెప్పడం ధర్మమని భావించారో లేక ఆయనను సంప్రదించకుండా కుర్చీలోంచి లేచిపోతే రాజ్యంగా విరుద్దమని జనాలేమయినా ఫీలయిపోతారనో తెలియదు కానీ మొత్తం మీద ఆయనను ఓసారి మళ్ళీ డిల్లీకి రమ్మని పిలిచారు. రేపు రాత్రి మీటింగుట!

సీబీఐ చిలక పలుకులు

  బీసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఐపీయల్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుల్లో వెలగబెట్టిన నిర్వాకానికి ఆయన ఉద్యోగం ఊడినంత పనయింది. అయితే ఆయన కాంగ్రెస్ తో చాలా చక్కగా కనెక్ట్ అయ్యి ఉన్నాడు గనుక మళ్ళీ తన కుర్చీలో తను మళ్ళీ కూల్ గా సెటిల్ అయిపోగలిగాడు.   జనాలకి, మీడియాకే కాదు పోలీసులకి కూడా గజినీలా షార్ట్ మెమొరీ సమస్య ఉంది గనుక, మేయప్పన్ తో సహా అందరినీ ఎప్పుడో మరిచిపోయారు. మరి ఆ పాటిదానికి ఇంతోటి హంగామా, కష్టం ఎందుకనే ఆలోచన ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారికి రావడంతో, లేడికి లేచిందే పరుగు అన్నట్లు సీబీఐ చిలుక అంటే ఆ సంస్థ డైరెక్టర్ రంజిత్ సిన్హా, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెట్ ఆటగాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి అసలు ఈ తప్పులనే చట్టబద్దం చేసేస్తే ఎలాగుంటుంది? అని కెలికొదిలి పెట్టింది.   క్రికెట్ పై బెట్టింగ్ కి చట్టబద్దత కల్పిస్తే దేశానికి కూడా మేలు జరుగుతుందని రాహుల్ ద్రావిడ్ డిక్లేర్ చేసారు.   “నిజమే స్మీ! ఇలా చేస్తే మాకు కొంచెం పని తగ్గుతుందని” అనుకొందో మరేమో గానీ సీబీఐ చిలుక కూడా బెట్టింగ్ ని చట్టబద్దం చేయడంలో ఎటువంటి తప్పు లేదని ఒప్పేసుకొంది. తన చిలక పలుకులు ప్రజలకు మరింత బాగా విడమరిచి చెపితే బాగుంటుందనే సదాభిప్రాయంతో “మన దేశంలో అనేక రాష్ట్రాలలో నేటికీ లాటరీలకు చట్టబద్దత ఉంది. హాలీ డే రిసార్ట్ లో కాసీనోల పేరిట జూదమాడుకోవడానికి అభ్యంతరం లేదు. నల్లదనం ఉంటే ప్రకటించుకొనే సౌలభ్యం కూడా ఉంది. మరటువంటప్పుడు మరే ఇతర పరిశ్రమలకి తీసిపోని విధంగా రూ.66,000 కోట్ల టర్న్ ఓవర్ తో సాగుతున్న ఈ క్రికెట్ బెట్టింగ్ మీదనే ఎందుకు ఇన్ని ఆంక్షలు, అభ్యంతరాలు? అవి ఉన్నపటికీ బెట్టింగ్ కాయడాన్ని మనం ఆపలేకపోతున్నాము కదా? మరటువంటప్పుడు దానికి చట్టబద్దత కల్పిస్తే పోలా? అని సదరు చానల్ వారిని గట్టిగా నిలదీశారు.   ఆ చిలుక ప్రశ్నలకి సదరు చానెల్ వారి వద్ద సరయిన సమాధానం ఉన్న కార్డు ఒక్కటి కూడా లేదు.

తెలంగాణలో క్షణం కూడా ఉండలేం

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శింస్తుంటే సీమాంద్ర కాంగ్రెస్‌ నాయకులకు ఏమి పాలుపోవడం లేదు. అందుకే రోజుకో రకంగా స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ తమ నిరుత్సాహాన్ని ప్రకటిస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జేసి దివాకర్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రవిభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో సీమాంద్ర వాసులు ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని అన్నారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ ఉండటం కన్నా కొత్త రాజధానిలో గుడారాలు వేసుకొని పని చేసుకోవడం మంచిదన్నారు.   రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నాయకులు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో జెసి, గాదె వెంకట రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అంశం చర్చకు వచ్చింది. దీనిపై జెసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిలో గుడారాలు వేసుకుని పని చేస్తామంటే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. గుడారాల్లో పని చేస్తూనే రాజధాని నిర్మాణాన్ని కొనసాగించవచ్చని, ఇందుకు మహా అయితే ఐదేళ్లకు మించి సమయం అవసరం ఉండదన్నారు

రాష్ట్రపతికి బాబు లేఖ

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర అనుసరిస్తున్నతీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఇరు ప్రాంతాల అభిప్రాయలకు కేంద్ర విలువ ఇచ్చేలా చూడాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు.   జీవొయం భేటికి రావాలని కేంద్రహొం శాఖకు రాసిన లేఖకు బదులుగా ఆయన ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసిన సిఫార్సులను పట్టించుకోనందుకు నిరసనగా జీవోయం భేటిని బహిష్కరించారు.   రాష్ట్రపతికి రాసిన లేఖలో చంద్రబాబు ముఖ్యంగా మూడు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ నియమాలు, గతంలో పాటించిన సంప్రదాయాలను గౌరవించాలి. ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన జేఏసీలను పిలిచి సమస్యాత్మక అంశాలపై విపులంగా చర్చించాలి. ఇతర ప్రభావిత వర్గాల మనోగతాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అని ఆయన రాష్ట్రపతిని కోరారు.

సిబిఐని తప్పు పట్టిన చిదంబరం

  తాము పెంచి పోషించిన సిబిఐ ఇప్పుడు తమకే వ్యతిరేకంగా మారటంతో కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే విధాననిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రదాని సిబిఐకి క్లాస్‌ తీసుకున్న మరుసటి రోజే ఆర్థికమంత్రి చిదంబరం కూడా సిబిఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబిఐతో సహా కాగ్‌ కూడా తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   ప్రభుత్వాలు కార్యనిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను కూడా నేరాలుగా, అధికారదుర్వినియోగంగా చూపించడానికి సిబిఐ లాంటి విచారణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడారు.

శంకరన్న శపథం!

      మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మంత్రిపదవి ఊడిపోయాక ఏం చేయాలో అర్థం కాక అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి, తనపార్టీ వాళ్ళని, పరాయిపార్టీ వాళ్ళని తిట్టిపోస్తూ టైమ్‌పాస్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే మాత్రం శంకరన్నకి ఎంతో అభిమానం. ఆమెని అమ్మా అని నోరారా పిలుస్తూ, కీర్తిస్తూ వుంటారు. ఎవరేమి అనుకున్నా సోనియాగాంధీని కీర్తించడంలో మాత్రం ఆయన ఎంతమాత్రం రాజీపడరు.   శంకరన్న నోరారా సోనియాగాంధీని పొగుడుతుంటే వినడానికి రెండు చెవులూ చాలవనిపిస్తూ వుంటుంది. శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదుగానీ, ఆయన సోనియమ్మని పొగిడే వీడియోకి ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేసి సోనియాగాంధీకి చూపిస్తే ఆమె పొంగిపోయి శంకరన్నని దేశప్రధానిగా కూడా ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోందంటే, శంకరన్న సోనియమ్మని మళ్ళీ మరోసారి పొగిడారు. తెలంగాణ ఇచ్చేసిన సోనియాగాంధీ సాక్షాత్తూ దేవతట! తెలంగాణ అంతటా ఆమెకి దేవాలయాలు కట్టితీరాలట. శంకరన్న అక్కడితో ఆగలేదు. తన సోనియా భక్తిని చాటుకోవడానికి ఒక  మంచి ప్రపోజల్‌తో ముందుకొచ్చారు. సికింద్రాబాద్‌లో సోనియాగాంధీ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తారట. ఆరు నూరైనా డిసెంబర్ తొమ్మిదో తేదీన సోనియాగాంధీ విగ్రహావిష్కరణ జరిపి తీరుతారట. బాగుంది శంకరన్నా.. చాలా బాగుంది! నిక్షేపంలా వున్న సోనియాగాంధీకి విగ్రహాన్ని పెట్టాలన్న శంకరన్న ఆలోచనని ఆయన సహచరులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు చాలా గ్రేట్. సీమాంధ్రులు సోనియాగాంధీకి సమాధి కడితే, తెలంగాణ వాళ్ళు ఆమెకి గుడులు కట్టి, శిలావిగ్రహాలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. చూడ్డానికి ఈ రెండూ పరస్పర విరుద్ధంగా అనిపించినా, రెండిటి అర్థమూ ఒకేటే కదా అని కాస్తంత బుర్రపెట్టి ఆలోచించేవాళ్ళు నవ్వుకుంటున్నారు.

తెలంగాణలో కిరణ్ రచ్చబండ రద్దు..!!

      మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి అలా ప్రకటించారో లేదో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రచ్చబండ నిర్వహణకి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. ముఖ్యంమంత్రితో రచ్చబండకి హాజరు కావలసిన తెలంగాణ మంత్రులు ‘‘మేం సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభలో పాల్గొంటున్నాం కాబట్టి మేం రా౦రాం’’ అనేశారు. ముఖ్యమంత్రి రచ్చబండలో పాల్గొంటే నానా న్యూసెన్సూ చేస్తామని కాంగ్రెస్ నాయకులే వార్నింగులు ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. వీళ్ళ రాజకీయాల గొడవేంటోగానీ, రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగితే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్నయినా తీరేవి.

విభజనకు ఎంఐఎం వ్యతిరేకం

      రాష్ట్రాన్ని విభజిస్తే 'రాయల తెలంగాణ' ఏర్పాటు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈరోజు జీవోఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన జరిగితే హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ఒప్పుకోమన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండొద్దని తెలిపారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని అసదుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. విభజన తప్పనిసరైతే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.     ఈ మధ్య కాలంలో ఎం.ఐ.ఎం. తన రాయల తెలంగాణ నినాదంలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. రాయల తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలతో ఏర్పడేది కాదట. పది తెలంగాణ జిల్లాలు ప్లస్ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో ఏర్పడిన రాయల తెలంగాణ ఏర్పడితేనే ఎం.ఐ.ఎం. ఒప్పుకుంటుందట. రాయలసీమలోని రెండు జిల్లాల మీద ప్రేమ ఎందుకో, మిగతా రెండు జిల్లాలు చేసిన పాపమేమిటో ఎం.ఐ.ఎం. నాయకులకు తప్ప ఎవరికీ అర్థంకాని విషయం.

టి-కాంగ్రెస్ నేతల టిట్ ఫర్ టాట్

  కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి టీ-కాంగ్రెస్ మంత్రులని, శాసనసభ్యులని కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తాము కూడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, అతని క్యాబినెట్ మంత్రులు తీరు చూస్తుంటే, వేర్వేరు పార్టీలకి చెందిన నేతలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నట్లుంది.   టీ-కాంగ్రెస్ నేతలు తాము బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పాల్గొనే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మరో ఆడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి పాల్గొంటున్నరచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రజలకు, టీ-కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి తెలంగాణాలో తిరగడాన్ని నిరసిస్తూ తెరాస కూడా రేపు మెదక్ జిల్లా బంద్ కి పిలుపు ఇచ్చింది.   ఈ పరిణామాలు చూసిన తరువాత గీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరుల సలహా మేరకు ముఖ్యమంత్రి రేపటి తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. ఇంతవరకు తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. అదికూడా ఇక నేడో రేపో కుర్చీలోంచి దిగిపోయే ముందు ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవలసి రావడం ఎవరికయినా మరింత కష్టంగానే ఉంటాయి మరి.

టీడీపీ తీరంలో వలస పక్షులు!

      టీడీపీ తీరంలో వలస పక్షులు సంచరిస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే టీడీపీలోకి దూకేయడానికి రెడీగా వున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్సీపీతోపాటు టీఆర్ఎస్ నుంచి కూడా తెలుగుదేశంలోకి రావడానికి పలువురు ప్రముఖ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పైమూడు రాజకీయ పార్టీలలో కీలక నాయకులుగా వున్నప్పటికీ సరైన గౌరవం లభించని అనేకమంది నాయకుల నాలుకలు పిడచగట్టుకుని పోయాయి.     టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే దీనికి సరైన పరిష్కారమన్న ఆలోచనలో అనేకమంది నాయకులు వున్నారు. వారంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తూ టీడీపీ నాయకులతో రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు విభజన నిర్ణయంతో సీమాంధ్రలో అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పదిలంగా వుండాలన్నా, తెలుగుజాతి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీని బలపరచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండ పిండాల్లాంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇక వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో వున్న అనేకమంది నాయకులు కూడా తెలుగుదేశం నీడకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఒక స్పష్టమైన విధానం లేకపోవడం, పార్టీ నాయకులు జగన్మోహనరెడ్డి నిరంకుశ, నియంతృత్వ ధోరణి, రాష్ట్రాన్ని విభజించడానికి జగన్ సోనియాతో మిలాఖత్ అయ్యాడన్న విషయం బహిర్గతం కావడం.. వీటన్నిటి కారణంగా ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగటం కంటే అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీలోకి మారడమే ఉత్తమమన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కలుగుతోంది. అలాగే టీఆర్ఎస్‌ కుటుంబ పాలనని తట్టుకోలేకపోతున్న అనేకమంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వలస వచ్చే నాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంలా కనిపిస్తోంది.