Telangana issue AP Budget session

అసెంబ్లీలో తెలంగాణ నినాదాలు

        విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పది వామపక్ష పార్టీలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వామపక్ష నేతలు నారాయణ, బీవీ రాఘవులు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.   ఇక మరోవైపు అసెంబ్లీ తెలంగాణ నినాదాలతో హోరెత్తుతోంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారిని కోరుతున్నారు. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానం ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నిరసనకు నాగం మద్దతుగా నిలిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ అసేంబ్లీని 10 గంటల వరకు వాయిదా వేశారు.  

Power Surcharge Hike

మరో కరెంట్ ఛార్జీ బాదుడు

  రూ.753.87 కోట్ల సర్ ఛార్జీ రూపేణా వినియోగదారుడి నుండి వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. 2012 జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వాడుకున్న కరెంటుపై యూనిట్ కు 62.13పైసల చొప్పున వినియోగదారుడినుండి వసూలు చేయడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ.ఆర్.సీ)నుంచి విద్యుత్ సంస్థలు బుధవారం ఆదేశాలు తీసుకుంది. కొత్త సర్ ఛార్జీ, పాత సర్ ఛార్జీ, సాధారణ ఛార్జీలు కలిపి ఏప్రిల్ నెలనుండి వినియోగదారుడు కరెంటు బిల్లు  అందుకోనున్నాడు. డిస్కంలు సర్ ఛార్జీ కింద యూనిట్ కు 82 పైసలు రూ.982కోట్లకు ప్రతిపాదించగా ఈ.ఆర్.సి. రూ.753.87 తగ్గించినట్లు తెలిసింది.

No Confidence Motion YSRCP

అవిశ్వాసానికి మేమూ రెడీ ...

  అవిశ్వాసం పెడతామని టి.ఆర్.ఎస్. ప్రకటించిన ఇరవైనాలుగు గంటలు గడవకముందే వైఎస్సార్సీపి కూడా మేమూ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అని ప్రకటించింది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 30మంది సభ్యుల ఆమోదం అవసరం. కెసిఆర్ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు. టి.ఆర్. ఎస్. సభ్యులు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ... "చారిత్రిక తప్పిదం చేస్తున్నావ్ ... గంగలో కలిసిపోతావ్ ... కావాలంటే మీరే అవిశ్వాసం పెట్టండి మేం మద్దతిస్తాం'' అని అన్నారు. గురువారం టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపి పార్టీలు వేరువేరుగా స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేయనున్నారు. అవిశ్వాస తీర్మానం గెలిస్తామని ధీమాగా ఉన్న ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించిన సభ్యులపై రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చీఫ్ విప్, విప్, మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ... "ఒకరిది బెయిలు మరొకరిది బ్లాక్ మెయిలు, వారి వ్యూహాలకు మేము దూరం'' అని అన్నారు.

Cardinals Elected New Pope

నూతన పోప్ గా కార్డినల్ జోర్గే ఎన్నిక

  నూతన పోప్ గా ఎవరు ఎన్నిక అవుతారు అన్న ఉత్కంఠకు తెర దిగింది. రోమన్ కాథలిక్ చర్చి నూతన పోప్ గా అర్జెంటినా కు చెందిన కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియా (76) ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా నుంచి తొలిసారిగా పోప్ గా ఎన్నికయ్యారు. మొత్తం 115 మంది కార్డినల్స్ సమావేశమై నాలుగు రోడ్ల ఓటింగ్ అనంతరం కార్డినల్  జోర్గే మారియో బెర్లోగ్లియా ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. కార్డినల్ జోర్గే మారియో తన పేరును ఫ్రాన్సిస్ - 1గా ప్రకటించుకున్నారు. నూతన పోప్ గా ఎన్నికైన తరువాత కార్డినల్ జోర్గే సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ... "నా సోదర కార్డినల్స్ ప్రపంచ పోప్ ఎన్నికను పూర్తిచేశారు. నా కోసం విశ్వాసంతో ప్రార్థనలు చేయండి'' అని అన్నారు. ప్రజలకు తన దీవెనలు అందజేశారు. కొత్తగా ఎన్నికైన పోప్ కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియో కు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమరూన్ శుభాకాంక్షలు అందజేశారు.

hanumantharao

జగన్ తో దోస్తీ మాకేల అంటున్న హనుమంతన్న

  ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి 2014సం. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకొని ప్రభుత్వం ఏర్పరుచుకొనే దీనస్థితిలో లేదని, విజయమ్మ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ‘మద్దతు సంకేతాలు’ పంపుతున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేసారు.   అయినా, అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఇర్రుకొని జైలుపాలయిన అటువంటి కళంకిత వ్యక్తులతో తమ పార్టీ ఎన్నికల పొత్తులు కానీ, మద్దతు గానీ కోరుకోవడం లేదని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకొంటున్నపుడు అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా తెలుగు దేశం పార్టీనే భావిస్తున్నామే తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాదని ఆయన అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు అసలు ఈ రెండు పార్టీల పొత్తుల ప్రసక్తివల్ల రెండూ పార్టీలకి చెడ్డపేరు రావడమే కాకుండా, ఇరువురూ భారీగా నష్టపోతారని అభిప్రాయ పడ్డారు.

congress

కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులా, విలీనమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అడుగక ముందే ప్రకటించడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గిర కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆమె ప్రధానంగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరగా విముక్తి పొందాలని కోరుకొంటున్నది. యుద్ధంలో సారధిలేని రధంలాగ ముందుకు సాగుతున్నతమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దలంటే ముందుగా జైల్లో ఉన్న తమ రధసారధిని బయటకు తీసుకురావాలి. అయితే, అందుకు తగిన మూల్యం చెల్లించాలని ఆమెకు తెలిసే ఉంటుంది.   రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్డుతొలగడం లేదా ఆ పార్టీ కనుసన్నలలో పనిచేసేందుకు సిద్ధపడటమే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న ఆ మూల్యం కావచ్చును. అయితే, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి పరిస్థితులు ఇంత ఆశాకరంగా కనిపిస్తున్న ఈ తరుణంలో అతని విడుదలకోసం అతని రాజకీయ జీవితాన్ని, పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించట్లేదు. అందుకే విజయమ్మ రాష్ట్రంలో తమకు అధికారం దక్కితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు భావించవచ్చును.   అయితే, దక్షిణాదిన కేవలం ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీ, ఈ ఒక్క రాష్ట్రాన్ని కూడా తాంబూలంలో పెట్టి జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే తెలుసు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అత్యవసరమే గనుక, విజయమ్మ మాటగా ఇరువురూ సంకీర్ణానికి సిద్దపడక తప్పదు.   అయితే, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఈ తరుణంలో అటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని బహిరంగంగా ప్రకటించడం రెండూ కూడా రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని విజయమ్మకు కూడా తెలుసును గనుకనే, ఆమె ఎన్నికల అనంతరం మద్దతు గురించి మాట్లాడారు తప్ప, ఎన్నికల ముందు పొత్తుల గురించి మాట్లాడలేదు.   ఒకవేళ ఆమె గనుక ఎన్నికల ముందు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడి ఉంటే, జగన్ మోహన్ రెడ్డిపై ఇంతవరకు సానుభూతి చూపిస్తున్నవారు, ఆయనని అభిమానిస్తున్నవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే కష్టాలు పడుతున్నాడని, తన తండ్రిలా చాల దైర్యవంతుడు గనుకనే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకి వచ్చి పార్టీ పెట్టాడని ఆయనని అభిమానిస్తున్న వారు, ఇప్పుడు ఆయన మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కలిసి పోతాడని తెలుసుకొన్నపుడు ఆయనకీ, ఆయన పార్టీకి దూరంమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విజయమ్మ అటువంటి ప్రయత్నాలు ఇటువంటి సమయంలో చేయకపోవచ్చును.   ప్రసుత పరిస్థితుల్లో రెండు పార్టీలు తమ ‘శత్రుత్వం కంటిన్యూ’ చేస్తూనే ఎన్నికల సమయానికి చేతులు కలిపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే ప్రస్తుతం చేయగల పని. అప్పటి పరిస్థితును బట్టి శత్రుత్వమా లేక మిత్రుత్వమా తేల్చుకోవడమే మేలు.

mlc nominations

ఆరో కృష్ణుడు ఎందుకు అదృశ్యమయిపోయాడు?

  ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పగానే విపక్షాలు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయలనే ఆలోచనలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకు షర్మిల అంత శ్రమపడి ఎండలో ఊరూరు ఎందుకు తిరుగుతున్నట్లు? ఎందుకు ఈ నాటకం ఆడుతునట్లు?అనే తెదేపా, తెరాసల ప్రశ్నకు అటు నుండి సమాధానం లేదు.   కానీ, విజయమ్మ పంపిన ‘మద్ధతు సంకేతాలను’ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా చక్కగానే అందుకొని తగిన విధంగానే స్పందించిందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డిని ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నందున శాసన సభ్యుల కోటాలో మండలికి తమ పార్టీ తరపున ఆరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసినప్పుడు, విజయమ్మ సంకేతాలను ‘సకాలంలో’ అందుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేఖించడంతో ఆఖరి నిమిషంలో ఆరో కృష్ణుడు లిస్టు లోంచి ఆకస్మాతుగ్గా అదృశ్యమయిపోయాడు.   ఒకవేళ కిరణ్ నిలపాలనుకొన్న ఆ ఆరో అభ్యర్ధి కానీ రంగంలో ఉండి ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కగానొక్క అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కష్టమయేది. కానీ, విజయమ్మ పలుకులు కాంగ్రెస్ అధిష్టానం చెవిన సకాలంలోనే పడటం ఆ పార్టీకి మేలు చేసిందని చెప్పవచ్చును.   కానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఆరో అభ్యర్ధిని నిలబెడితే, ఒకవేళ పార్టీలో జగన్ అనుకూల వర్గం వారు క్రాస్ ఓటింగుకు పాల్పడితే, అప్పుడు అసలుకే మోసం వచ్చి తమ ఐదో అభ్యర్ధి ఓటమి పాలవుతాడనే ఆలోచనతోనే తాము వెనక్కి తగ్గామని చెప్పుకొంటునారు. కారణాలు ఏమయినపటికీ, ఈ ‘ఆరో కృష్ణుడు’ తెర మీదకి రాకమునుపే మాయమయిపోయాడు.

2014 Andhra Pradesh Elections

2014 ఎన్నికల హైలైట్ ... నాయకుల స్థానమార్పిడి, వారసుల రంగప్రవేశం

రాబోవు శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇతర ప్రాంత నాయకులు ఈసారి నగరంలో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పలువురు నాయకులు ఇప్పటినుండే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ ల నియోజకవర్గాల్లో సమీకరణలు ప్రారంభించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, మెదక్ జిల్లా రామాయంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మైనంపాటి హన్మంతరావు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు మక్తల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కొడంగల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎం.పి. ఆంజన కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ, మంత్రి ముఖేష్ గౌడ్ తమ వారసులను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ గౌడ్ తాను పార్లమెంట్ ఎన్నికల్లో నిలచిన పక్షంలో గోషామహల్ నియోజకవర్గం నుండి తన కుమారుడుని పోటీకి నిలపాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ తన కుమారుడని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి నిలపాలని ప్రయత్నిస్తున్నారు.

Governor Speech In Assembly

గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం, సిపిఎం, సిపీఐ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు గవర్నర్ ప్రసంగ పత్రాలను చింపేశారు. తెలుగుదేశం సభ్యులు గాలి ముడుక్రిష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ దొంగల ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా అంటున్నారని విమర్శిస్తూ ... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను గాంధీభవన్ గా మార్చేస్తున్నారని, గవర్నర్ ఇదివరకు ఇచ్చిన ప్రసంగంలోని హామీలను ఎంతమేరకు అమలు చేశారో చెప్పకుండా దాటవేశారని ధ్వజమెత్తారు. సిపిఎం  శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కరెంట్ కోతలు లేవని, ఊకదంపుడు ప్రసంగంగా ఉందని విమర్శించారు. సిపీఐ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా ఉందని, తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపటం లేదని, హైదరాబాద్ లో సైనిక పాలన సాగుతుందని, ప్రజాసమస్యల ప్రస్తావన, వాటి పరిష్కార వివరాలు లేవని విమర్శించారు.

T. Cong Leaders Ultimatum High Command

హైకమాండ్ పై జానారెడ్డి గరం గరం

కేంద్ర హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే నెలరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఎటూ తేల్చకపోవడంతో పంచాయితీ రాజ్ మంత్రి తెలంగాణావాది కుందూరు జనార్థన్ రెడ్డి హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా తెలంగాణా సమస్య పరిష్కారం కావాలని, నెలరోజుల్లోగా, స్థానిక ఎన్నికల తరువాత తెలంగాణా సమస్యపై అధిష్ఠానం తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. జానారెడ్డి, తెలంగాణా మాత్రులు, తెలంగాణా నాయకులు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందేనని  హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు.

World Awaits New Pope

కొత్త పోప్ ఎన్నికపై అందరి దృష్టి

వాటికన్ సిటీ సిస్టీన్ చాపెల్ లో కార్దినల్స్ కొత్త పోప్ ను ఎన్నుకునేందుకు సమావేశమయ్యారు. బెనడిక్ట్ - 16 రాజీనామా చేయడంతో కొత్తపోప్ ఎన్నిక అనివార్యమైంది. స్వేస్ గార్డ్స్ పర్యవేక్షణలో 115 మంది కార్దినల్స్ చాపెల్ లోకి ప్రవేశించిన తరువాత చాపెల్ తలుపులు మూసివేశారు. కొత్త పాప్ ను ఎన్నుకునే వరకూ వారికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా సెల్ ఫోన్ జామర్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటలీకి చెందిన ఏంజెలో స్కోలా, బ్రెజిల్ కు చెందిన ఓడిలో షేరర్, కెనడాకు చెందిన మార్క్ ఔలేట్ లలో ఒకరు కొత్త పోప్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రియా, హంగేరీ, మెక్సికో, ఫిలిపిన్స్, అమెరికా, దక్షిణాఫ్రికా కార్దినల్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పోప్ గా కేథలిక్ ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం మరోసారి పాశ్చాత్య సంప్రదాయవాదికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Subsonic Cruise Missile Nirbhay Failed

'నిర్భయ్' ఫెయిల్

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.వో.) భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ 'నిర్భయ్' ను మంగళవారం ఒడీశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రంలో మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 11.50నిముషాలకు ప్రయోగించారు. నిర్భయ్ 25 నిముషాలు ప్రయాణించి మధ్యలోనే దారితప్పడంతో శాస్త్రవేత్తలు నిర్భయ్ ను మధ్యలోనే నిలిపివేశారు. లక్ష్యసాధనలో విఫలమైన నిర్భయ్ శకలాలు తీరప్రాంతంలోని సరబంత్, గదహరివ్ పూర్ గ్రామాలలోని మామిడి తోటల్లో పడడంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు. తీరప్రాంత భద్రతకోసం ముడుజాగ్రట్ట చర్యగా నిర్భయ్ క్షిపణిని మధ్యలోనే కూల్చివేయవలసి వచ్చిందని, మార్గమధ్యంలోనే నిర్వీర్యం చేసిన క్షిపణిలు నేలపై కూలడం అసాదారణమని, దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని డి.ఆర్.డి.వో. అధికార ప్రతినిధి రవి గుప్తా ప్రకటించారు.

Minor Girl Raped and Killed

అత్యాచారానికి మరో పసిపాప బలి

కడపజిల్లా చెన్నూరు మండలంలోని శివాలపల్లె ఆర్ ఆర్ పాఠాశాలలో 1వ తరగతి చదువుతున్న గుత్తా మానస అనే 7 సంవత్సరాల పాపను అదే పాఠాశాలలో చదువుతున్న బాలుడు పాపకు మాయమాటలు చెప్పి మంగళవారం సాయంత్రం పెన్నానది ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడకి చేరుకున్న మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారం చేసి బాలికను చంపి పెన్నానదిలో పడేశారు. స్కూలు సమయం అయిపోయినా పాప ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి పదిన్నరకు నది పక్కనే ఉన్న ముళ్ళపొదలో బాలిక శవం కనిపించింది. పోలీసులు నంద్యాల వెంకట శివను ప్రశ్నించగా తనకు ఏమీ తెలీదని ఆటోడ్రైవర్ నంద్యాల శ్రావణ్ పాపను తీసుకుని రమ్మని చెప్పగా తాను పాపను తీసుకుని వెళ్లానని తెలిపాడు. పోలీసులు నంద్యాల శ్రావణ్, శివశంకర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Neet and EAMCET Exams

విద్యార్థులకు శుభవార్త !

గతంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ భారత వైద్యమండలి పరిథిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యూజీ, పిజీ కోర్సుల ప్రవేశానికి నీట్ తప్పనిసరి అని వెల్లడించారు. సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నీట్, ఎంసెట్ రెండూ హాజరు కావచ్చని గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు గుండు సుధారాణి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు అజాద్ సమాధానమిస్తూ "ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు, ప్రైవేటు కాలీజీలు నీట్ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులో కేసులు దాఖలు చేశాయి. హైకోర్టులో దాఖలైన పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల రాజ్యాంగంలో ప్రత్యేక షరతులున్నప్పటికీ ఎంసిఐ చట్టం 1956 నిబంధనలు, నీట్ నిబంధలతో ఎలాంటి వైరుధ్యం ఉండదు. వీటిని రాజ్యాంగం ఏడో షెడ్యూల్ లోని 66వ ప్రవేశ జాబితా కింద రూపొందించాం. టీసీ కేస్ నెంబర్ 101/2012తో పాటు, దానితో ముడిపడిన ఇతర కేసులను పరిశీలించిన తరువాత మెడికల్, డెంటల్ కౌన్సిల్స్ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు యథాతథంగా నిర్వహించుకోవచ్చని, ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2013 నీట్, ఎంసెట్ రెండింటినీ రాయవచ్చని'' చెప్పారు.

లోహం ... కాగితం ... ఇప్పుడు ప్లాస్టిక్

యుగాల క్రితం లోహపు కరెన్సీ చలామణిలో ఉండేది. తరువాత కాగితపు కరెన్సీ చలామణిలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కరెన్సీ మార్కెట్లోకి విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పది రూపాయల ప్లాస్టిక్ రూపాయల నోటును ఐదు రాష్ట్రాలలో విడుదల చేయనుంది. దేశంలో విభిన్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్న కోచీ, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాలలో మొదట వీటిని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వందకోట్ల పదిరూపాయల నోట్లను విడుదల చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లను నిరోధించడానికి, నోట్ల జీవితకాలాన్ని పెంచడమే వీటి ధ్యేయమని తెలిపారు.

అవిశ్వాసానికి మేము దూరం ...

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస రాజకీయ ఎత్తుగడలకు సాయపడకూడదని నిర్ణయించారు. జగన్ బెయిల్ కోసం బేరసారాలు నెరిపెందుకు వైఎస్సార్సీపీ, ప్యాకేజీలు మాట్లాదేకునేందుకు తెరాస ఇటువంటి డ్రామాలు ఆడుతోందని అన్నారు.  తోక పార్టీలను పట్టుకుని ఎందుకు వెళ్ళడం, రేపో  మాపో కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీలతో మనం ఎందుకు కలిసి వెళ్ళాలి? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాడదాం. ప్రభుత్వం దిగిరాకపోతే అవిశ్వాస తీర్మానంపై సరైన సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుందాం అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. తెరాస, వైఎస్సార్సీపి రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి ఎత్తుగడలను, బ్లాక్ మెయిల్, డ్రామాలు ఆడుతోందని దానికి తాము ఎందుకు సహకరించాలని పార్టీ ముఖ్యనేతలంతా భావిస్తున్నట్లు తెలిసింది.

నీ ఊరికొస్తా...నీ వీధికొస్తా...నీ ఇంటి కొస్తా... కిరణ్ కుమార్

  ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో మొదలయిన రెవెన్యు సదసులో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తానూ మెహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు 7సార్లు వచ్చానని, కానీ, ఇదే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న కేసీఆర్ మీ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడని ప్రజలను ప్రశ్నించారు. తానూ ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లాకు వస్తుంటే, కేసీఆర్ మాత్రం ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రమే జిల్లాకు వచ్చిపోతుంటాడని హేళన చేసారు. తానూ మహా మొండివాడినని, తానూ దేనికీ వెనుకాడే మనిషిని కానని అన్నారు. తన ప్రభుత్వానికి 5ఏళ్ళు పాలించమని ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు తానెవారికో భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు.   తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం పై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా చొరవతీసుకొని తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయన ప్రాతినిద్యం వహించే జిల్లా మెహబూబ్ నగర్ కే వెళ్లి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడం ద్వారా తానూ నిజంగానే తాటాకు చప్పులకి బెదిరేవాడిని కానని ఆయన స్పష్టం చేసినట్లయింది.

వైఎస్ కు రూ. 500 కోట్లు ఇచ్చిన గాలి..!

        దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల ఫండ్‌గానూ గాలి జనార్ధన్‌రెడ్డి వైఎస్‌కు రూ. 500 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయని పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని గాలి జనార్ధన్‌రెడ్డి సీబీఐ ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసిందని అన్నారు. ఆ డబ్బు వైఎస్ ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని కేశవ్ అరోపించారు. సీబీఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టుకు వస్తుందని పయ్యావుల పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని కేశవ్ డిమాండ్ చేశారు. కాగా ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.