కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులా, విలీనమా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అడుగక ముందే ప్రకటించడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గిర కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆమె ప్రధానంగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరగా విముక్తి పొందాలని కోరుకొంటున్నది. యుద్ధంలో సారధిలేని రధంలాగ ముందుకు సాగుతున్నతమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దలంటే ముందుగా జైల్లో ఉన్న తమ రధసారధిని బయటకు తీసుకురావాలి. అయితే, అందుకు తగిన మూల్యం చెల్లించాలని ఆమెకు తెలిసే ఉంటుంది.
రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్డుతొలగడం లేదా ఆ పార్టీ కనుసన్నలలో పనిచేసేందుకు సిద్ధపడటమే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న ఆ మూల్యం కావచ్చును. అయితే, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి పరిస్థితులు ఇంత ఆశాకరంగా కనిపిస్తున్న ఈ తరుణంలో అతని విడుదలకోసం అతని రాజకీయ జీవితాన్ని, పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించట్లేదు. అందుకే విజయమ్మ రాష్ట్రంలో తమకు అధికారం దక్కితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు భావించవచ్చును.
అయితే, దక్షిణాదిన కేవలం ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీ, ఈ ఒక్క రాష్ట్రాన్ని కూడా తాంబూలంలో పెట్టి జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే తెలుసు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అత్యవసరమే గనుక, విజయమ్మ మాటగా ఇరువురూ సంకీర్ణానికి సిద్దపడక తప్పదు.
అయితే, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఈ తరుణంలో అటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని బహిరంగంగా ప్రకటించడం రెండూ కూడా రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని విజయమ్మకు కూడా తెలుసును గనుకనే, ఆమె ఎన్నికల అనంతరం మద్దతు గురించి మాట్లాడారు తప్ప, ఎన్నికల ముందు పొత్తుల గురించి మాట్లాడలేదు.
ఒకవేళ ఆమె గనుక ఎన్నికల ముందు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడి ఉంటే, జగన్ మోహన్ రెడ్డిపై ఇంతవరకు సానుభూతి చూపిస్తున్నవారు, ఆయనని అభిమానిస్తున్నవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే కష్టాలు పడుతున్నాడని, తన తండ్రిలా చాల దైర్యవంతుడు గనుకనే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకి వచ్చి పార్టీ పెట్టాడని ఆయనని అభిమానిస్తున్న వారు, ఇప్పుడు ఆయన మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కలిసి పోతాడని తెలుసుకొన్నపుడు ఆయనకీ, ఆయన పార్టీకి దూరంమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విజయమ్మ అటువంటి ప్రయత్నాలు ఇటువంటి సమయంలో చేయకపోవచ్చును.
ప్రసుత పరిస్థితుల్లో రెండు పార్టీలు తమ ‘శత్రుత్వం కంటిన్యూ’ చేస్తూనే ఎన్నికల సమయానికి చేతులు కలిపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే ప్రస్తుతం చేయగల పని. అప్పటి పరిస్థితును బట్టి శత్రుత్వమా లేక మిత్రుత్వమా తేల్చుకోవడమే మేలు.