నేడు మెహబూబ్ నగర్ జిల్లా బంద్

  కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు కొట్టుకొని మెహబూబ్ నగర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జరిగిన జెడ్పీ సమావేశం తెరాస ఎమ్మల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డిపై చెయ్యి చేసుకొన్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు డిపోలలో నుండి బస్సులను బయటకి రాకుండా అడ్డుపడటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.   ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళినా ఆయన కానీ ఆయన తరపున మంత్రులెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. వారు స్పందించకపోవడం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చెయ్యి చేసుకొన్న బాలరాజును సమర్దిస్తున్నట్లే ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే బాలరాజు తమ ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగానిస్తున్నామని టీ-కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డి అన్నారు. టీ-కాంగ్రెస్ నేతలు గవర్నర్ ని కలిసి తెరాస ఎమ్మెల్యేపై పిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నేతను చెంపదెబ్బ కొట్టిన టీఆర్ఎస్ నేత

  జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టిఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాదులాట జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే హక్కు తెలుగుదేశం నేతలకు లేదంటూ..తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూశరం లేవని వ్యాఖ్యానించారు. ఇదే చర్చలో భాగంగా నెలకొన్న వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే బాలరాజు తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని.. ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. జడ్పీ ఛైర్మన్ అదుపుచేయాలని ఎంతగా ప్రయత్నించినా ఉద్రిక్తత తగ్గలేదు.

పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ కొట్లాట

  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్‌లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి అనుమానిత వ్యక్తుల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. వారి ఇళ్ళు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ దాడి చేసిన వారిలో ప్రభాస్ అభిమానులు కూడా ఉండటంతో వారు కూడా తిరిగి దాడులు చేపట్టారు. దీంతో ఇద్దరు హీరోల ఆభిమానులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కాస్త చివరికి రెండు కులాల మధ్య గొడవగా మారిపోయింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తూ ఎవరైనా అల్లర్లకు  పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, వారి చదువు నాశనమవుతుందని హెచ్చరించారు. అయితే ఇంత గొడవ జరుగుతున్నాఅటు పవన్ కళ్యాణ్ గానీ, ఇటు ప్రభాస్ గానీ ఇంతవరకూ స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది.

వామ్మో రాంగోపాల్ వర్మ దేవుడికి మొక్కాడా..!

రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది పెద్ద హాట్ టాపిక్ కే అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ విమర్శల వర్మగా పేరు పొందాడు. ఆయన మనుషులనే కాదు  దేవుడిని కూడా తన విమర్శలకు బలి చేస్తుంటాడు. గత ఏడాది వినాయక చవితి సమీపిస్తుండగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న కూడా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోకి కూడా దేవుడిని లాగేశాడు వర్మ. మరి అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు దేవుడికి దండం పెడుతూ బయటకు వచ్చిన ఫోటో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.   ఎందుకంటే రాంగోపాల్ వర్మ నాస్తికుడని అందరికి తెలిసిందే.. అతడు దేవుడికి మొక్కింది లేదు.. కనీసం తన సినిమా పూజా కార్యక్రమాలకి కూడా అంత ఆసక్తి చూపించరు. మరి అలాంటి వర్మ దేవుడికి దండం పెట్టడం విశేషమే కదా.. మరి ఇంతకీ ఆ ఫోటో ఎవరి తీశారో తెలుసా మంచు మనోజ్.. ఎక్కడ దొరికాడో ఎలా దొరికాడో తెలియదు కానీ.. వర్మ వినాయకుడికి దండం పెడుతూ మనోజ్ కెమెరాకు చిక్కేశాడు. మనోజ్ మాత్రం ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు వెంటనే ఫోటో తీసి ‘‘చిట్టచివరికి వర్మ దేవుడికి తలవంచాడు’’ అని రాసి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక అంతే ట్విట్టర్లో ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది.  ఈ ఫోటోపై పూరి జగన్నాథ్ కూడా ‘‘ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు.. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను దేవుడు తిడుతుండొచ్చు’’ అంటూ తనదైన శైలిలో ఓ కామెంట్ విసిరారు. మొత్తానికి వర్మ దేవుడికి మొక్కడమేమో కాని దేవుడు దిగి వచ్చినంత హడావుడి చేస్తున్నారు జనాలు.

తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు సీరియస్ వార్నింగ్

  రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఏదో విషయంలో గిల్లికజ్జాలు వస్తూనే ఉన్నాయి. ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు తీరేవి కూడా కావు.. దీనిలో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల సమస్యపై ఎప్పటినుండో ఇరు రాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసింది. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితిలో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అటు కేంద్రాన్ని.. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం పై హైకోర్టు కూడా చాలా సార్లు విచారణ కూడా జరిపింది. అయితే ఈసారి మాత్రం హైకోర్టు సీరియస్ గా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈకేసు విచారణ చేసిన హైకోర్టు వాదనలు వింటున్న సమయంలో ఇరు రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంగా విసిగిపోయిన హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఒకటి చేసింది. ఈ అంశంలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు ఒకచోట కూర్చొని సమస్యను సామారస్యంగా పరిష్కరించుకుంటారా? లేదంటే.. మమ్మల్నే ఆదేశాలు ఇవ్వామంటారా? అని అడిగేసింది. దీనికి మీకు వారం గడువు ఇస్తున్నాం.. ఈ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారా లేదా మమ్మల్నే సీన్లోకి ఎంటరై సమస్యను పరిష్కరించమంటారా అని మండిపడింది. మరి హైకోర్టు ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి.

పవన్ కళ్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌..

సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఏపీ ప్రత్యేక హోదాపై అటు ఏపీ అధికార పార్టీని.. ప్రతిపక్ష పార్టీని విమర్శించారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలంటే ఇరు పార్టీలు భయపడుతున్నాయని.. పార్టీ నేతలకు పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో కరువు జిల్లాలను వెంటనే గుర్తించాలని.. భూసేకరణ పేరుతో పేదలనుండి భూములను లాక్కోవడం సరికాదని ఆయన అన్నారు అంతేకాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిల్లో పవన్ కళ్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అలా నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. జగన్

  రోజూలాగే ఈరోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇరుపక్షాలు సభలో చర్చల కంటే ఒకరిమీద ఒకరు విమర్శలు.. వాదనలు చేసుకోవడమే ఎక్కువైంది. ఈ రోజు వైసీపీ నేతలు ఓటుకు నోటు కేసుపై స్పీకర్ కు తీర్మానం ఇవ్వడంతో ఇంకాస్త వేడి వాతావరణం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే జగన్ స్పీకర్ కు ఓటు నోటు కేసుపై తీర్మానం ఇచ్చారు.. దానిని స్పీకర్ కోడెల తిరస్కరించారు.. ఇంకేముంది దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ విషయంపై టీడీపీ నేత కూడా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి కేసీఆర్ చెబితేనే జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారని.. కేసీఆర్ కు జగన్ ఫోన్ చేశారని.. మావద్ద ఆధారాలు ఉన్నాయని మండిపడ్డారు.   దీనికి జగన్.. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఫోన్ చేసినట్లు నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఓటుకు నోటు కేసుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తుండగా మైక్ కట్ చేసిన స్పీకర్.. ఫ్రశ్నోత్తరాలకు వెళదామని చెప్పటంతో మళ్లీ సభలో గందరగోళం చోటు చేసుకుంది.   ఈనేపథ్యంలో జగన్ చేసిన ఆరోపణలకు ఏపీ అధికార పార్టీ సభ్యులు సమాధానం చెపుతామని కోరడంతో స్పీకర్ వారికి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఎన్నో అవినీతి కేసులున్న జగన్ చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తనపై ఉన్న కేసులనుండి తప్పించుకునేందుకే కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారంటూ జగన్ పై ధ్వజమెత్తారు. దీంతో నరేంద్ర చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మళ్లీ నిరసలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

పేరు చెబితేనే జగన్ కు పిచ్చెక్కుతోంది

టీడీపీ మంత్రి ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఉమా మాట్లాడుతూ పట్టిసీమ, పోలవరం విషయంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని.. ప్రజలకు నీటి కొరత తీర్చడంపై జగన్ ఇలా మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. అంతేకాదు 2010 లో పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని భావించినా దాని నిర్మాణానికి వచ్చిన కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు ఆవిషయం గుర్తులేదా? 2013లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలుసా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే 11 కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్ కు  కొత్తచట్టం పేరు చెబితేనే పిచ్చెక్కుతోందని ఎద్దేవ చేశారు.

మంచు లక్ష్మీని టీ వాదులు అంగీకరిస్తారా?

  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మిని నియమించడం. ఎందుంటే అసలు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం ఒక రకంగా విడిపోవడానికి కారణం ఈ పదవులే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి తెలంగాణ ఈ విషయంలో అసంత్పప్తిగానే ఉండేది. అందుకే అది కాస్త చిలికి చిలికి రాష్ట్ర విభజన వరకూ వచ్చింది.   అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర తెలంగాణ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మీని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికార బాధ్యతల్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 10న బాధ్యతులు తీసుకోనున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రా మూలాలున్న మంచు లక్ష్మీని తెలంగాణ వాదులు అంగీకరిస్తారా? లేదా? అని ఆసక్తి నెలకొంది.   ఒకవైపు కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం గత కొంత కాలంగా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. మరి ఈసమయంలో తెలంగాణ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మీని కేంద్రం నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కేసీఆర్ కుమార్తె కవితకు.. మంచు లక్ష్మీ సన్నిహితురాలు కావడంతో ఈవిషయంపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే వాదన కూడా వినిపిస్తుంది. మరి తెలంగాణ వాదులు లక్ష్మీని అంగీకరిస్తారో లేదో చూడాలి.

ఏపీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదట

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల వల్ల ఏపీ పాలన వ్యవస్థ దాదాపు విజయవాడ నుండే సాగుతుంది. సీఎం చంద్రబాబు ఇక్కడ మూడు రోజులుంటే అక్కడ మూడు రోజులు ఉంటున్నారు. చాలా శాఖలు.. చాలా మంది నేతలు కూడా అక్కడికి తరలివెళ్లారు.. కానీ మొత్తం అక్కడికి తరలివెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఎమ్మెల్యేలు.. వారికి కేటాయించిన క్వార్టర్లను వినియోగించుకోవటానికి సముఖత చూపించట్లేదట. హైదరాబాద్ లో ఏపీ ఎమ్మెల్యేల కోసం దాదాపు 200 క్వార్టర్లు కేటాయిస్తే అందులో కేవలం 50 నుంచి 60 క్వార్టర్లు మాత్రమే ఎమ్మెల్యేలు తీసుకోవటం విశేషం.   మరోవైపు దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఏపీ పాలనా వ్యవస్థలో భాగంగా ఇప్పటికే చాలామంది అక్కడికి తరలివెళ్లడం వల్ల  హైదరాబాద్ లో కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల ఎమ్మెల్యేలు క్వార్టర్లు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. అదీకాక విభజన వల్ల ఏపీ ఎమ్మెల్యేలు కేటాయించిన క్వార్టర్లు పాతవి కావడం.. తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయించిన క్వార్టర్లు కొత్తవి కావడం కూడా ఒక కారణమంటున్నారు.   దీంతో ఏపీ ఎమ్మెల్యేలు హెచ్ ఆర్ అలవెన్స్ కింద ప్రతి నెలా వచ్చే రూ.25వేలుతో ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా.. విజయవాడ ప్రయాణానికి అనువుగా ఉండేందుకు  మణికొండ.. కూకట్ పల్లి.. బంజారాహిల్స్ లో ఫ్లాట్లు తీసుకొని ఉండటానికి సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది.

పట్టిసీమకు మేం వ్యతిరేకం

పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు వైకాపా అధ్యక్షుడు జగన్ ను కూడా పట్టిసీమ ప్రాజెక్టుకు మీరు వ్యతిరేకమా? అనుకూలమా అని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ దీనికి సమాధానం చెప్పలేకపోతే రాత్రంతా ఆలోచించి సమాధానం చెప్పండి అని కూడా ఆఫర్ ఇచ్చారు. దీనికి వైఎస్ జగన్ సమాధానమిస్తూ తాము పట్టిసీమ ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకమని.. ఇదే విషయాన్నిగతంలో కూడా స్పష్టం చేశామని అన్నారు. పట్టిసీమ కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలువగా.. 21.9 శాతం ఎక్కువ వేశారని సెలక్టివ్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్‌చేశారని ఆరోపించారు.

కేసీఆర్ చెప్తేనే జగన్ చేశారు..

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే జగన్ ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దీనిని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో రోజూలాగే స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తూ ఓటుకు నోటు కేసుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.     దీంతో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ ఓటుకు నోటు కేసుపై తీర్మానం ఇవ్వడం వెనుక ఉన్న సూత్రధారి కేసీఆరే అని.. కేసీఆర్ చెప్తేనే జగన్ తీర్మానం ఇచ్చారని మండిపడ్డారు. నిన్నకేసీఆర్ జగన్ కు ఫోన్ చేసి ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్టు తెలిసిందని.. అందుకే వైసీపీ ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చిందని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మావద్ద ఉన్నాయని తెలిపారు. దీన్ని బట్టే అర్ధమవుతోందని.. కేసీఆర్ జగన్ లు ఓకేసులో కుట్ర పన్నారని అన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు.. కోర్టు అనుమతిస్తే సభకు రాలేని జగన్ కు కేసుల గురించి ప్రస్తావించే అర్హత లేదని విమర్శించారు.

మంత్రి మైక్ కట్

ఏపీ శాసనసభలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మైకును స్పీకర్ కోడెల శివప్రాసదరావు కట్ చేశారు. ఈ రోజు సభలో కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టుపైన మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ కల్పించుకొని చర్చను కరవుకు మాత్రమే పరిమితం చేయాలని, మరే ఇతర అంశాన్నీ ప్రస్తావించొద్దన్నారు. ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని అడిగారు. సభాపతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు వెంటనే.. వైయస్ చనిపోయిన తర్వాత వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైయస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలా అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తుండగా... కోడెల మైక్ కట్ చేసి వ్యక్తిగత విమర్శలు వద్దని సూచించారు.

మహేశ్ బాబు చింతలకుంట చింతలు తీర్చెనా

మహేశ్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో తను కూడా ఒక ఊరిని దత్తత తీసుకున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా శ్రీమంతుడు సినిమా చూసి మహేశ్ బాబుని అభినందించి.. ఒక ఊరిని దత్తత తీసుకోవాలని కోరగా.. దానికి మహేశ్ బాబు కూడా అంగీకరించినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు పాలమూరు జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చింతలకుంట గామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం వల్ల గ్రామంలో సమస్యలు తీరిపోయినట్టే అని.. చింతకుంటు గ్రామం చింతలు తీరినట్టే అని ఆనందంతో ఉన్నట్టు తెలుస్తోంది.   అయితే ఇప్పటి వరకూ అసలు ఈ గ్రామం ఉందని కూడా సరిగా తెలియని నేపథ్యంలో మహేశ్ బాబు ఈ గ్రామం కష్టాలు ఎంత వరకూ తీర్చుతాడో అని అప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. తెలంగాణలోని గద్వాలకు 45 కిలోమీటర్ల దూరం ఈ గ్రామానికి అడుగడుగునా సమస్యలే. మొత్తం 700 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కూడా లేవు. మరి మహేశ్ బాబు ఈ గ్రామం చింతలు ఎంత వరకూ తీర్చుతాడో చూడాలి.

రెండు కాపురాలు చేస్తున్నట్టుంది.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తనతో పాటు దాదాపు వెయ్యిమంది అనుచరులు టీడీపీలోకి చేరారు. స్వయంగా చంద్రబాబే కండువా కప్పి ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో రాజకీయం గురించి కాదు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని.. రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నాం దానికి మీఅందరి సహకారం కూడా కావాలని పార్టీలో చేరిన నేతలకు సూచించారు.   ఇంకా రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అతి దారుణంగా విభజించిందని.. రాష్ట్ర విభజన చూస్తుంటే బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదు.. ఇలాంటి పరిస్థితిలో మనం రాజధాని అయిన అమరావతిని ఎంత త్వరగా నిర్మించుకుంటే అంత మంచిదని సూచించారు. రాజధాని లేకపోవడం వల్ల ఇక్కడ మూడు రోజులు ఉంటే.. హైదరాబాద్ లో మూడు రోజులు ఉండాల్సి వస్తుందని.. మనది రెండు కాపురాల అవస్థలా ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఒక కాపురం.. విజయవాడలో ఒక కాపురం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కొంత మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు.. ఇంకా రావాల్సి ఉంది.. ఉద్యోగుల తరలింపులో కొన్ని ఇబ్బందులు ఉన్నా తప్పనిసరిగా రావాలి.. లేకపోతే ప్రజల్లో విశ్వాసం పోతుందని.. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.